గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, డిసెంబర్ 2008, ఆదివారం

కురంగ, మాతంగ, పతంగ, భృంగ. మేలిమి బంగారం మన సంస్కృతి 27

పంచేంద్రియాలు - వాటి శక్తి సామర్ధ్యాలు.
పంచేంద్రియాల ప్రభావం చాలా అతీతమైనది. దీని విషయంలో ఒక చక్కని శ్లోకమున్నది. దానిని మనం పరిశీలిద్దాం.
శ్లో:-కురంగ, మాతంగ, పతంగ, భృంగ
మీనాః హతాః పంచభిరేవ పంచ.
ఏకః ప్రమాదీ స కథం నహన్యతే
యస్సేవతే పంచభి రేవ పంచ.

తే:-జింక లేనుగుల్ శలభముల్ చేపలు మఱి
తుమ్మెదలు నొక్కొకటి యింద్రియమ్ముబలిమి
నాశనము బొంద, మానవుల్ నాల్గు నొక్క
ఇంద్రియమ్ముల బలిమి వారెట్లు కాచు.

భావము:-జింకలు, ఏనుగులు, శలభములు ( మిడతలు ), చేపలు, తుమ్మెదలు, అవి ఒక్కొక్క ఇంద్రియ ప్రేరణ మాత్రముననే నాశనము పొందు చున్నవి. ఇక ఆ ఐదు యింద్రియాలూ ఒక్కుమ్మడిగా కలిగి యున్న మానవుడు వాటిని నిగ్రహించి మనగలుగుట ఎంతటి కష్ట సాధ్యమో కదా! ఐననూ మానవుడు జితేంద్రియుడై, పరమాత్మనే ప్రత్యక్షం చేసుకోగలిగే సామర్థ్యాన్ని ఆత్మ స్థైర్యంతో సాధిస్తున్నాడు. అందుకే అన్నారు మానవుడే మహనీయుడని. మనమూ ఇంద్రియ నిగ్రహాన్ని సాధించడానికి ఆహార వ్యవహారాల్లో కట్టుబాట్లను కలిగి వుందామా ?
జైహింద్.
Print this post

1 comments:

రాఘవ చెప్పారు...

వివేకచూడామణిలోనిది కదండీ ఇది?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.