గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, ఫిబ్రవరి 2012, మంగళవారం

హైదరాబాదు మియాపూరులో విగ్రహప్రతిష్ట - ఆహ్వానము.

1 comments

జైశ్రీరామ్.
వివరముల కొఱకు సంప్రతించండి:
98853-03006
97010- 18165
98496-62748
జైహింద్.

చినపాచిలిలో అష్టావధాన ప్రశ్నలు.

17 comments

జైశ్రీరామ్.
సదసద్వివేక సంపన్నులారా!
తే.౩౦ - ౧౧ - ౨౦౧౧ దీ న  విశాఖపట్టణం జిల్ల రావికమతం మండలం చినపాచిలి గ్రామంలో శ్రీ వైష్ణవీదేవి ప్రతిష్టాపన సందర్భంగా అష్టావధానం జరిగింది.
అవధాని శ్రీమాన్ భద్రం వేణు గోపాలాచార్యులు గారు.
ఈ అవధానంలో పృచ్ఛకుల ప్రశ్నలను ముందు చూద్దాము.
తరువాత అవధానం జరిగిన విధానం మీ ముందుంచగలను.
౧. సమస్యా పూరణముః-
భార్యకు మీసముల్ మొలిచె. బాపురె భర్తకు గర్భమయ్యెనే.
౨. దత్త పదిః-
తాజా. - బాజా. - వాజా. - రాజా.
కందపద్యంలో వైష్ణవీదేవి స్తుతి.
౩. వర్ణనముః-
విదేశీ వ్యామోహంలో కొట్టిమిట్టాడుతున్న మనవారికి మన దేశ ఔన్నత్యాన్ని తెలుపుతూ సందేశమివ్వండి.
౪. ఉద్దిష్టాక్షరిః-
వైష్ణవీ పీఠ వ్యవస్థాపకులు సత్యనారాయణమూర్తి గారిని ఆశీర్వదించండి.
౩వ అక్షరం -  నా.
౮వ అక్షరం - ర్తి.
౧౨వ అక్షరం - ల్లి.
౧౫ వ అక్షరం - న్వ.
౨౧ వ అక్షరం - ఖ.
౧౪ వ అక్షరం - తి.
౨౭ వ అక్షరం - లి.
౩౧ వ అక్షరం - ద్మ.
౫. ఆశువుః-
౧. హిందూ దేశమునకు మూల బిందువేది?
౨. వైయ్యస్మరణముపై మీ అభిప్రాయం?
౬. పురాణముః-
౧. హరియను రెండక్షరములు పద్యం ఎందులోనిది? భావమేమిటి.
౨.హరిశ్చంద్రుఁడు ధీరోదాత్తుఁడు.నాటకములో ఎందుకు దుఃఖిస్తాఁడు?
౭. ఘంటా గణనముః-
౮. అప్రస్తుత ప్రసంగముః-
౧. శ్రీ రాముఁడు ఏక పత్నీ వ్రతుఁడు కదా! మరి ఈ వైష్ణవీదేవి రాకతో రాముఁడు ఏక పత్నీవ్రతుడుగా ఉంటాడా?
౨. గొఱ్ఱె పిల్ల గన్నది గొఱ్ఱె గొఱ్ఱె.
బఱ్ఱె పిల్ల గన్నది బఱ్ఱె బఱ్ఱె. అంటే ఏమిటి?
మిత్రులారా! చూచారు కదా? ప్రశ్నలు.
మీరు వీటికి సమాధానాలు వ్రాసి పంపగలిగితే పాఠకులకు అపురూపమైన సాహిత్యానుభూతి కలిగించినవారవతారు.
మీ సమాధానాలకై ఎదురు చూడనా? నమస్తే.
శ్రీమాన్ భద్రం వేణుగోపాలాచార్యులవారి అవధాన విశేషాలను నరువాత మీ ముందుంచ గలను.
జైహింద్.

27, ఫిబ్రవరి 2012, సోమవారం

మాయింటికి వచ్చిన పండిత నేమాని దంపతులు. వారి అభిమానులు.

2 comments

జైశ్రీరామ్.
మాయింటికి విచ్చేసిన పండిత నేమాని. వారి సతీమణి రూపంలో ఉన్న పార్వతీపరమేశ్వరులు.
ఈ పుణ్య దంపతులను దర్శించుటకు వచ్చిన అభిమానులు, మన ప్రియ మిత్రులు.
౨౦౧౨ ఫిబ్రవరి ౧౨వ తేదీన మా యింటికి వచ్చిన పండిత నేమాని రామ జోగి సన్యాసిరావు గారిని వారి అర్థాంగి శ్రీమతి త్రిపుర సూదరి గారిని కలవాలని అభిమానంతో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ గోదావరి శ్రీరామ కృష్ణ గారు, సతీ సమేతంగా వచ్చిన మన ప్రియ మిత్రులు  చక్రవర్తిగారు, సమీప ప్రాంతాలనుండి వచ్చిన మహిళామణులు, లహరి బ్లాగ్ నిర్వాహకురాలు చిరంజీవి యస్.శ్రీవైష్ణవి. పైచిత్రంలో మనకు కనిపిస్తారు.
ఇంకా ఎందరో వారి దర్శనార్థం వచ్చి వారితో కాస్త సమయం ముచ్చటించి వెళ్ళారు. శ్రీ కంది శంకరయ్యగారు దూరవాణి ద్వారా వారిని పలుకరించి వరంగల్లు నుండి తాను బయల్దేరుతున్నానని, రేపు ఎక్కడున్నా కలుస్తానని తెలియ జేసారు. అనేకమంది దూరవాణిద్వారా వారితో ముచ్చటించారు. 
పండిత నేమాని వారు రచించిన అధ్యాత్మ రామాయణం లోని కొన్ని ఘట్టాలలోని నిగూఢ భావాన్ని అద్భుతంగా ఉపన్యసించి తెలియ జేసారు. ఆ ఉపన్యాసానికి సంబంధించిన ఆడియో చక్రవర్తిగారు పంపగానే బ్లాగుద్వారా వినిపించే ప్రయత్నం చ్జేయగలను.
వారి రాక ఎందరికో ఆనందం కలిగించింది.
చక్రవర్తి మున్నగువారు ఈ పుణ్య దంపతులను నూతన వస్త్రములతో సన్మానించారు.
జయప్రకాష్ నారాయణ్ నగర్ దేవస్థానం కార్య దర్శి శ్రీ గంగా రామారావుగారు శ్రీ నేమాని దంపతులను వారి బంధువుల యింటికి తమ కారులో దీపెట్టారు. అందుకు వారికి నా ధన్యవాదములు.
మాయింటికి అభిమానంతో విచ్చేసిన పండిత నేమానివారికీ, వారి సతీమణి గారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియ జేసుకొంటున్నాను.
వారి రాకను తెలుసుకొని, వచ్చినవారందరికీ, దూరవాణి ద్వారా తమ అభిమానాన్ని తెలియజేసినవారందరికీ, బ్లాగు ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తపరచినవారందరికీ, పేరు పేరునా నేను కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను.
జైహింద్.

24, ఫిబ్రవరి 2012, శుక్రవారం

శ్రీ నేమాని, ఆ సుకవి., మా యింటికి దయచేసారు. ఆ దంపతులకు ధన్యవాదాలు.

3 comments

జైశ్రీరామ్.
పాఠక మిత్రులారా!
నిన్నను వారు చెప్పిన విధంగా మాయింటికి వచ్చారు.
వారి రాకకు సంబంధించిన చిత్తరువులు వారి ఉపన్యాసము ఉన్నాయి. ప్రస్తుతము నేను బంధువులింటికి వివాహ సందర్భంగా వెళ్ళుతున్నందున ఆ వివరములను ఎల్లుండి ప్రచురించ గలనని మనవి చేయుచున్నాను. ఆలస్యానికి క్షంతవ్యుఁడను.
శుభమస్తు.
జైహింద్.

23, ఫిబ్రవరి 2012, గురువారం

హైదరాబాదు వచ్చిన పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు గారు.

6 comments

జైశ్రీరామ్.
సాహితీ ప్రియ మిత్రులారా!
ఈ రోజు ఎంతో సుదినం. మన సాహితీ మిత్రులు శ్రీమాన్ పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు గారు సతీ సమేతంగా మియాపూర్‌లో మాయింటికి సాయంత్రం 6.00 గంటలకి వస్తున్నారు. ఆది దంపతులవలె వారు మాయింటికి రావడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది.
మన బ్లాగ్ మిత్రులకూ వారంటే అపారమైన గురు భావన. అందు చేతనే  వారిని చూడ దలచుకొన్న వారికి ఇది ఒక చక్కని అవకాశం కదా అని భావించి,  ఈ విషయాన్ని ఈ విధంగా తెలియ జేస్తున్నాను.
మీరు  శ్రీ నేమాని వారిని కలుసుకోవడం కోసం  మాయింటికి రావలసినదిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను.
నా సెల్ నెంబర్.9247238537. 
నమస్తే.
జైహింద్.

17, ఫిబ్రవరి 2012, శుక్రవారం

రామ కృష్ణ విలోమ కావ్యంలో గల పాద భ్రమక శ్లోకము.

3 comments

జైశ్రీరామ్
ఆంధ్రామృతం ఎంత గ్రోలినా ఇంకా గ్రోలాలనే ఉత్కంఠతో ఉన్న సాహితీ బంధువులారా! ఆంధ్రామృత మహా సాగరంలో వెతికిన కొద్దీ అద్భుతమైన ఆణి ముత్యాలు దొరుకుతూనే ఉంటాయి. 
ఇప్పుడు  క్రీ.శ.14. వాడైన దైవజ్ఞ సూర్య తన రామ కృష్ణ విలోమ కావ్యంలో వ్రాయఁబడిన ఒక అద్భుతమైన పాద భ్రమక శ్లోకం చూద్దాము.

తాం భూసుతా ముక్తిముదార హాసం.
వందే యతో లవ్య భవం దయా శ్రీ.
భావము:-
చిఱు నవ్వులు చిందించే లవుని ప్రేమించే దయ గల లక్ష్మి ఐన ఆ సీతా మాతకు నమస్కరించు చున్నాను.
అదే శ్లోకం చివరి నుండి మొదటి వరకు చదివితే అది గీతా ప్రాశస్త్యాన్ని తెలియ జేసే శ్లోకమైంది. ఇది ఎంత అద్భుత సాహితీ ప్రక్రియో చూడండి.
 శ్రీ యాదవం భవ్య లతోయదేవం 
సంహార దా ముక్తి ముతా సుభూతాం.
భావము:-
మంగళప్రదమైన ఆకర్షణ గలవాడైన  శ్రీ కృష్ణుని గీతా బోధ చెడుని సంహరిస్తూ ప్రాణప్రదమైనది.
చూచారా! దైవజ్ఞ సూర్య కవి తన రామ కృష్ణ విలోమ కావ్యంలో తన మేథాశక్తి నెంతగా ఉపయోగించి, అనంత భావనా సాహితీ విను వీధుల్లో మనలను విహరింప జేసాడో! ఆలోచించే మనసు, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలే కాని, ఎన్ని లేవండి మనం తెలుసుకోవడానికి!ఇతర భాషలలో ఊహకు కూడా అందని సాహితీ సంపద అచ్చంగా  
మన సొంతం.  
అన్నట్టు ఈ శ్లోకాన్ని ముందునుండి వెనుకకు, వెనుక నుండి ముందుకి చదవడమే కాదండోయ్! కంఠస్థము చేసెయ్యాలన్న మాట మరువకండీ? 
మనమిత్రులు శంకరయ్య గారు శంకరాభరణం బ్లాగులో వేంకటాధ్వరి రచించిన శ్రీ రాఘవ యాదవీయమ్ విలోమ కావ్యాన్ని ప్రచురిస్తున్నారు.చూడకపోతే అక్కడ చూడవచ్చును.
నమస్తే. 
జైహింద్.

15, ఫిబ్రవరి 2012, బుధవారం

జయప్రకాష్ నారాయణ్ నగర్ లో జరిగిన అష్టావధానం

9 comments

జైశ్రీరామ్.
సహృదయ శిరోమణులారా! 
తేదీ.  12 - 02 - 2012,ని జరిగిన  అష్టావధానం జయప్రకాష్ నారాయణ్ నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణములో అవధాని శ్రీ కట్టమూరి చంద్రశేఖరమ్ గారిచే అత్యద్భుతంగా నిర్వహింప బడింది.
సభాధ్యక్షులుగా శ్రీ గుత్తి (జోళద రాశి)చంద్ర శేఖర రెడ్డి,
అవధాన సంచాలకులుగా శ్రీ చింతా రామ కృష్ణా రావు,
౧) సమస్యా పూరణము పృచ్ఛకులుగా శ్రీ  కే. రామ కృష్ణ,
౨) దత్తపది శ్రీ సాధు శ్యామ్ ప్రసాద్,
౩) వర్ణన శ్రీ శిష్ట్లా గోపాల కృష్ణ,
౪) నిషేధాక్షరి శ్రీ ధూళిపాళ అర్క సోమయాజులు,
౫) అప్రస్తుత ప్రసంగిగా శ్రీ రెడ్డి పుట్టయ్య,
౬) గణితము శ్రీ చింతా రామేశం,
౭) ఘంటా గణనము చిరంజీవి శ్రీవైష్ణవి,
౮) తేదీకి వారగణన. శ్రీ గంగా రామారావు.
ఉండి నిర్వహించారు.

కార్యక్రమము ఆద్యంతము ఉత్కంఠ భరితంగా జరిగింది.
ముందుగా జ్యోతి ప్రజ్వలన అవధానిగారిచేత చేయించారు.
శ్రీ గట్టు కృష్ణ మూర్తి గారు చేసిన ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది.
చంద్రశేఖర రెడ్డిగారు అధ్యక్షోపన్యాసం చేసారు.
సంచాలకులు పృచ్ఛకులను వారు చేపట్టుతున్న అంశాలను వివరించిన పిదప అవధాని ప్రార్థన చేసుకొని, పృచ్ఛకులను ప్రశ్నలు వేయమన్నారు.

౧) సమస్యాపూరణం కోసం శ్రీ కే రామకృష్ణ 
"రామా!  నాదరి రాకు  రాకుమనియెన్ రక్షార్తియై రంభయే! " అని అడుగగా
"భామారత్నము తెచ్చి రాఘవునెదన్భావింపకుండంగ యీ 
సీమన్ గుండమొనర్చినావు.తగునా? సీతా ప్రియుండైన యా
రాముండెంతయు నిన్ను బాణములఁ బోరాటమ్మునన్ దృంచు. పో
రామా!  నాదరి రాకు రాకుమనియెన్ రక్షార్తియై రంభయే!"
అని
అవధానిగారు నాలుగు ఆపృత్తులలోను నాలుగు పాదాలు పూరించారు.

౨) శ్రీ సాధు శ్యాంప్రసాద్ నష్టము - కష్టము - ఇష్టము - భ్రష్టము. అనే పదాలతో రామాయణాంశాన్ని వ్రాయమని  దత్తపది యిచ్చారు.
అవధాని ఈ దత్త పదిని చక్కని మత్త కోకిల వృత్తంలో అద్భుతంగా పూరించారు.
నష్టమైనది రావణా! ఇది నాశ మెంత తలంచితో?
కష్ట కాలము తెచ్చితయ్యయొ! కారు మేఘము క్రమ్ముగా!
ఇష్టమైనది చేతువా యిటులింతమూర్ఖత చూపుచున్.
భ్రష్టమైనది నీ కులంబును భావ్యమా! యిది? రావణా!
అని పూరించారు.

౩) ఈ సాయం సమయాన్ని ఈ దేవాలయ ప్రాంగణాన్ని ఈ జయప్రకాష్ నారాయణ్ నగర్ ను వర్ణించమని  శిష్ట్లా గోపాల కృష్ణ గారు  అడుగగా
చక్కని సీసంలో పూరించారు.
ఇట మియాపూరున నింపుగా నవధాన సభలోన పృచ్ఛకుల్ సరసులైరి.
పురజనుల్ సభ్యులు ముక్తిమార్గముకోరి  ఆలయ ప్రాంగణమందు చేర,
జయ ప్రకాశ నగరు సంతోష జలధిలో  ఓలలాడుచునుండె నోలగమున.
వేంకటేశ్వరుని దీవెనలతో నందన వత్సరాగమనంబు భాగ్యమగుత.
నింబ వృక్షము నీడలో నిలిచి యుండి 
జరుగు చున్నట్టి యవద్గాన సభకు వచ్చి,
యున్న యెల్లరకును వచ్చు. మిన్నయైన 
హనుమ దీవెనలు యద్భుత మంద జేయు.

౪) మల్లె మొగ్గను వర్ణించమని  నిషేధాక్షరిని అర్కసోమయాజిగారు తెలుపుతుండగా
అవధాని గారి పద్యం ఇలా రూపు దిద్దుకొంది.
మల్లెల సొంపులవెంతయు
చల్లనివైనను తగంగచక్కగ నుంటన్
ఉల్లము చల్లగ జేయును.
సల్లలితములైన భావ జలధుల దేల్చున్.

౫) అప్రస్తుత ప్రసంగంలో ఆద్యంతమూ పుట్టయ్య గారు అడుగుతున్న ప్రశ్నలకు చాలా ఓర్పుగా చమత్కారంగా నేర్పుగా అవధాని సమాధానాలు చెప్పడం సభాసదులకు చాలా వినోదం కలిగించింది.

౬) తేదీకి వార కథనములో రామారావుగారు ప్రశస్తమైన తేదీలను తెలిపి ఏవారమని యడుగ అడిగినదే తడవుగా ఆ తేదీకి సంబధించిన వారము అవధాని తెలిపి సభాసదులను ముగ్ధుల్ని చేసారి.

౭) సంఖ్యా గణనములో రామేశం గారు ౧౦౨ సంఖ్యనీయగా నిలువుగా,లేదా అడ్డుగా లేదా చతురముగా, లేదా క్రాసుగా మొత్తం ౧౬ గళ్ళలో ఏ గడిలో ఏసంఖ్య అని అక్రమ పద్ధతిలో అడిగిన వెంటనే తెలిపి అందరికీ ఆశ్చర్యం కలిగించారు.

౮) ఘంటా నాద గణనము లహరి బ్లాగు నిర్వాహకురాలైన చిన్నారియైన శ్రీవైష్ణవి చేపట్టి ఆద్యంతము కొట్టిన గంటలను మొత్తమెన్నో చివరలో అవధాని తెలపడంతో ఆశ్చర్యపోవడం ప్రేక్షకులవంతైంది.

అవధానం పూర్తి ఐన పిదప ఎవరెవరి ప్రశ్నలకు ఏమేమి సమాధానం ఇచ్చారో మళ్ళీ పూర్తిగా చదివి విని పించి తన ధారణాపటిమను అవధాని చాటుకున్నారు.

పిదప అవధానిగారిని, పృచ్ఛకులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
అవధాని తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.
అధ్యక్షులవారి మలి పలుకు, నిర్వాహకుల కృతజ్ఞతాభివందనములు మంగళ హారతితో కార్యక్రమం సంపూర్ణమైంది.

జయప్రకాష్ నారాయణ్ నగర్ కాలనీ అధ్యక్షులు శ్రీ టీ. అని రాజు గారు, మరియు దేవాలయ కమిటీ సభ్యులు  శ్రీ గంగా రామారావు గారు, కోశాధిపతి శ్రీటీ.యస్.సంజీవరావు గారు, కార్యదర్శి శ్రీ యం. మాణిక్య రెడ్డి గారు, శ్రీ యస్. గోపాల కృష్ణ రాజు గారు, మరియు ఏ. సుధాకర రావు గారు, మున్నగువారి ఆధ్వర్యవంలో ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగినది.  

సహృదయులైన మీ దృష్టికి కార్యక్రమం మొత్తం తెచ్చేప్రయత్నం చేసాను. ఎంత వరకూ కృతకృత్యుఁడనయ్యానో తెలియదు.
ఈ కార్యక్రమమునకు సంబంధించిన ముఖ్య చిత్తరువులను మీకు చూపించే సదుద్దేశ్యంతో మీ ముందుంచుతున్నాను.

అందరికీ స్వాగతం పలుకుతున్న శ్రీ గోపాల కృష్ణ రాజుగారు.
సభాధ్యక్షులుగా చంద్రశేఖర రెడ్డి గారికి పుష్పగుచ్ఛం సమర్పణ.
అవధానిగారికి పుష్పగుచ్ఛం అందిస్తున్నశ్రీ చంద్రశేఖర రెడ్డి గారు.
సంచాలకులుగా చింతా రామకృష్ణా రావును స్వాగతిస్తూ పుష్పగుచ్ఛం సమర్పిస్తున్న 
శ్రీ అని  రాజుగారు.
సమస్యాపూరణకు శ్రీ కే.రామకృష్ణకు స్వాగతిస్తూ డా. టీ.శివ సంజీవరావు పుష్పగుచ్ఛ సమర్పణ.
దత్తపదికి శ్రీ యస్. స్యామ్ ప్రసాద్ కు రామచంద్ర రావుగారి స్వాగతం.
వర్ణనకు శ్రీ శిష్ట్లా గోపాలకృష్ణగారికి స్వాగతం.
నిషిద్ధాక్శరికి శ్రీ సోమార్కగారికి పుష్పగుచ్ఛసమర్పణతో స్వాగతం.
గంటానాదముకు లహరి బ్లాగర్ చి. యస్.శ్రీవైష్ణవికి పుష్పగుచ్ఛంతో స్వాగతం.
తేదీకి వార ప్రకటనకు శ్రీ జి.రామారావుగారికి స్వాగతం.
సంఖ్యాగణనానికి శ్రీ సిహెచ్.రామేశం గారికి స్వాగతం.
అప్రస్తుతప్రసంగానికి శ్రీఆర్.పుట్టయ్యగారికి స్వాగతం.
జ్యోతి ప్రజ్వలన
ప్రార్థన.
అవధానం ప్రారంభం.
సమస్యా పూరణకు విషయమిస్తున్న వూకదంపుడు బ్లాగర్ కే.రామకృష్ణగారు.
సమస్య్యా పూరణ చేస్తున్న అవధానిగారు.
దత్తపది ఇస్తున్న శ్రీ యస్.శ్యాంప్రసాద్ గారు.
దత్తపదికి సమాధానం ఇస్తున్న అవధానిగారు.
వర్ణన ఇస్తున్నశ్రీయస్.గోపాలకృష్ణగారు.
వర్ణన చేస్తున్న అవధానిగారు.
నిషేధాక్షరి ఇస్తున్న శ్రీ సోమార్కగారు.,పూరిస్తున్న అవధానిగారు.
శ్రీఆర్.పుట్టయ్య గారు చేస్తున్న అప్రస్తుత ప్రసంగం, అవధానిగారి సమాధానం. 
శ్రీ రామారావు గారడిగే తేదీకి వారము,శ్రీ రామేశంగారడిగే సంఖ్యాప్రకటన చేస్తూ, శ్రీవైష్ణవి చేస్తున్న గంటా నాదం మనసులోనే లెక్కిస్తున్న అవధానిగారు.
రసజ్ఞులైన ప్రేక్షకులు.
రసజ్ఞులైన మాతృమూర్తులు.
అవధానిగారికి ఘన సన్మానము.
సంచాలకులకు సన్మానము.
సమస్యాపూరణ పృచ్ఛకులు శ్రీ రామకృష్ణగారికి సన్మానము.
దత్తపది.శ్రీ యస్. స్యాంప్రసాద్ గారికి  సన్మానము.
వర్ణన.శ్రీ యస్.గోపాలకృష్ణగారికి సన్మానము.
నిషేధాక్షరి. శ్రీ సోమార్కగారికి సన్మానము.
ఘంటానాదము. చి. శ్రీవైష్ణవికి సన్మానము.
తేదీకి వారము. శ్రీ జీ. రామారావుగారికి సన్మానము.
సంఖ్యాగణనము. శ్రీ రామేశంగారికి సన్మానము.
అప్రస్తుత ప్రసంగము. శ్రీ పుట్టయ్యకు సన్మానము.
శారదాంబకు కర్పూర హారతి.
మంగళహారతి పాడుతున్న సుమంగళి.
జైహింద్.

13, ఫిబ్రవరి 2012, సోమవారం

అష్టావధాన నిర్వహణకు మానసిక స్థైర్యాన్ని అందించి ఆశీర్వదించిన మీ అందరికీ ధన్యవాదములు.

12 comments

జైశ్రీరామ్.
సాహితీ ప్రియ మిత్రులారా!
సహృదయులైన మీ అందరి శుభాభినందనలతో శుభాకాంక్షలతో నిన్నటి అష్టావధానంలో డా. కట్టమూరి చంద్రశేఖరమ్ తన ప్రతిభా ప్రదర్శన నిర్విఘ్నంగా జరిగింది . ఆద్యంతము అవధానము ప్రశంసనీయంగా సాగింది.
వీటి వివరములు చిత్రములు త్వరలో మీ ముందుంచ కలను.
అంత వరకు మన రచనా పాటవాన్ని పరీక్షించుకోవడానికి వీలుగా అవధానంలో అడిగిన అంశాలను మీ ముందుంచుతున్నాను.
౧) సమస్యాపూరణముః-
రామా! నా దరి రాకు రాకుమనియెన్ రక్షార్తియై రంభయే.
౨) దత్త పదిః-
నష్టము - ఇష్టము - కష్టము - భ్రష్టము. రామునక్నయిస్తూ స్వేచ్ఛా ఛందస్సులో వ్రాయవలయును.
౩) వర్ణనముః-
ఈ వేంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈ చల్లని సాయంకాలాన్ని వర్ణించండి.
౪. నిషేధాక్షరి.
మల్లె మొగ్గను వర్ణించండి.
(ఇది మనము వ్రాయదలిస్తే మరొక పండితుని నిషేధాక్షరి పృచ్ఛకునిగా తాత్కాలికంగా ఉంచి, నిషేధాక్షరాలు చెప్పమంటూ మనం పూరణ చేయాలి.)
మిగిలిన నాలుగు అంశాలు
౫) అప్రస్తుత ప్రసంగము.
౬) తేదీకి వార ప్రకటనము.
౭) గణిత గణనము.
౮. ఘంటా గణనము.
కావున పై నాలుగింటికీ మనం వ్రాయ వచ్చును.
ప్రయత్నించ గలరు.
ధన్యవాదములు.
జైహింద్.

12, ఫిబ్రవరి 2012, ఆదివారం

మీ అందరికీ మరొక్కమారు హృదయపూర్వక ఆహ్వానం

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
అవధాన ప్రియులారా! ఆంధ్రామృతపాన మత్త చిత్తులారా!దివ్య జ్యోతిస్వరూపులారా!
ఈ రోజే డా. చంద్రశేఖరం అవధానిగారి అష్టావధాన కార్యక్రమం.
మధ్యాహ్నం మూడు గంటలకు.
హైదరాబాది, మియాపూర్, జయప్రకాష్ నారాయణ్ నగర్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో
నిర్వహింప బడుతోంది.
ఈ సదవకాశం అరుదుగా లభిస్తుంది.
ఎన్ని పనులున్నా వాటిని వీలఒనంత వరకు వాయిదా వేసుకొని, ఈ అవధాన కార్యక్రమం ప్రత్యక్షంగా చూచే ప్రయత్నం చేయడం మాత్రం మానకండి. అవకాశం భగవంతుడు కల్పించినప్పుడే యోగ్యులు వాటిని అందిపుచ్చుకుంటారు అని పెద్దలు చెప్తారు.ఈ అవకాశం మనమూ ఎందుకు సద్వినియోగం చేసుకో కూడదు?
తప్పక వస్తారు కదూ?
మీ అందరికీ మరొక్కమారు హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ మీ రకకై ఎదురు చూస్తున్నాని.
జైహింద్.

11, ఫిబ్రవరి 2012, శనివారం

అవధాన సామ్రాజ్యం ఆంధ్రుల సొంతం.

11 comments

జైశ్రీరామ్.
అవధానం :- అవధానము అనే సాహిత్య ప్రక్రియ తెలుగు వారి సొత్తు.  ప్రంచంలో ఏ భాష లోను లేని ఈ అవధానంలో ముఖ్యమైన వ్యక్తి అవధాని. అంటే ఎంతో ఏకాగ్రత వున్న పండితుడు. విశేషమైన భాషా పాండిత్యం, సమయస్పఅస్ఫూర్తి , కల్పనా చాతుర్యము , చమత్కారం సరి అయిన పాళ్ళలో ఉండాలి. అవధాని కలం కాగితం పట్టకూడదు. కేవలం తన ధారణ లేక జ్ఞాపక శక్తితో, మధ్య మధ్య ఏకాగ్రతను భంగపరస్తూ అప్రస్తుత ప్రసంగి వేసే వింత ప్రశ్నలకు సముచితంగా సమాధానం చెబుతూ, కవితా వ్యాసంగం కావించాలి. అలా చెప్పిన కవిత్వాన్ని , ధారణ చేసి అఖరి అంశంగా అన్ని ప్రశ్నల సమాధానాల్ని అప్పచెప్పవలెను.
ఎనిమిది అంశాలపై జరిగే అవధానం అష్టావధానము.  అవధానములందు ఆశుకవితా ధార రసగంగా ప్రవాహమై పొంగుతుంది. అవధాని వూహలో జార్జిబుష్, లాడెన్ చెట్టపట్టాలు వేసుకుని రామాయణ ఇతివృత్తంలోనో ఇంకేదో ఇతిహాసంలోనో ఇట్టే ఒదిగిపోతారు.
ఆంగ్ల పదాలు అచ్చ తెలుగు పయఁట వేసుకుని కొత్త అర్థాలూ అందాలూ సంతరించుకుంటాయి.
నిషిద్ధాక్షరి పేరుతో పృచ్ఛకుల ఎత్తులూ, దానికి  నానార్థాల సాయంతో అవధాని పై ఎత్తులూ.
అది అత్యద్భుత సాహితీ సమరం . కమ్మటి కంద పద్యాలూ,  సింగారాల సీస పద్యాలూ, చవులూరించే చంపకమాలలూ, ఉత్తేజమును కలిగించే ఉత్పలమాలలూ, అసందర్భ  ప్రసంగంలో నవ్వుల జల్లులూ,
ఇవీ ఆ యుద్ధ ఫలితాలు.
అవధాన ప్రక్రియకు ఆయువు పట్టు "ధారణ"
'సారా గొనె శివుఁడు లోక సంరక్షణకై'. లోక సంరక్షణ కోసం శివుడు సారా త్రాగాఁడట!
అవధాని చాతుర్యానికి పరీక్ష పెట్టే ఈ సమస్యని క్షీరసాగర మథనానికి లంకె పెట్టి హాలాహలాన్ని శివుడు మనసారా తాగాడంటూ కడిమిళ్ల వరప్రసాద్  పూరణ ఇలా సాగింది.
పారావారమునందున
నారని పెనుజిచ్చువోలె హాలాహలమే
పారగ, నద్దానిని మన
సారా గొనె శివుడు లోక సంరక్షణకై.
అలాగే మరోసారి ఆయననే
జనవరి, మార్చి, మే, జూలై ఈ నాలుగు ఇంగ్లిషు పదాలతో రాముఁడి గురించి చెప్పమనగా
జనవరిష్ఠు'డు శ్రీరామచంద్రమూర్తి
'మే'లు గూర్చుట వ్రతముగా మెలగినాడు
మహిని రాక్షసులం బరి'మార్చి'నాడు
సూర్యవంశపు 'జూలయిశోభలీనె. అని చెప్పారు.
ఇలా ఒకటి కాదు రెండు కాదు! ఎన్ని వేల పద్యాలైనా చెప్పగల చాతుర్యం, ధార, అవధానులకు ఉంటుంది.
తెలుగు వారికి మాత్రమే సొంతమైన అపురూప వినోద, విజ్ఞానాల సమ్మేళనం అవధానం.  అవధానం అంటే  ఏకాగ్రత అనే చెప్పాలి.  అవధానం అంటే అప్రమత్తత అని అమరకోశము, 'మనో యోగం'   అని శబ్దార్ధ కల్పతరువు వివరించాయి. అసలీ అవధానాలకు మూలం వేదాధ్యయనంలో ఉంది!
వేదాలను  గురు ముఖతా విని, ఎప్పటి పాఠం అప్పుడు వల్లెవేయడం ద్వారా నేర్చుకొంటారు. పన్నెండేళ్లపాటు చదివిన వేదసారాన్నీ మెదడులో నిక్షిప్తం చేసుకోవాల్సిందే. ఈ క్రమంలో అంతటి గొప్ప వాఙ్మయంలో ఒక్క అక్షరం కూడా జారిపోకుండా ఉండటానికి రకరకాల పద్ధతులను ప్రవేశపెట్టారు. ఐదు వేళ్లనూ నియమబద్ధంగా కదుపుతూ అనేక స్వరాలను సూచించడం అందులో ఒకటి. రానురానూ ఒకరు వేళ్లు కదుపుతుంటే మరొకరు స్వరం చెప్పడం, ఒకరి స్వరానికి అనుగుణంగా వేరొకరు వేళ్లు కదపడం చేసేవారు. అదే స్వరావధానం. అలాగే వేదంలోని కాండ సంఖ్య, పాఠసంఖ్య చెప్పి అందులో ఒక అక్షరం ఉన్న స్థానాన్ని చెప్తే ఆ అక్షరం ఏంటో చెప్పాలి. అలా కాకుండా అక్షరం చెప్తే దాని స్థానాన్ని గుర్తించడం మరో పద్ధతి. అది అక్షరావధానం. దీనికి అద్భుతమైన జ్ఞాపకశక్తి అవసరం.
రోజూ వల్లె వేయడం వల్ల ధారణ సహజంగానే అలవడే వేదపండితులకు రాజాస్థానాల్లో కవులకు మించి అమిత గౌరవం లభించేది. ఇది చూచి  కవులు  అవధాన విద్యనలవరచుకొన్నారని భావింప బడుతోంది.
సాహితీ అవధానం వేదావధానం అంత సులభం కాదు. ఎందుకంటే వేదాలు స్థిరమైనవి. వాటిని ఒకసారి ధారణ చేయగలిగితే చాలు.
కానీ కవిత్వావధానంలో అలాకాదు. అవధానికి ధారణతో పాటు సృజన, సమయస్ఫూర్తీ సమపాళ్లలో లేకపోతే సభ రక్తి కట్టదు. పృచ్ఛకుడు సమస్య ఇస్తుండగానే అవధాని మెదడు ఊహాతీత వేగంతో పనిచేయాలి. దత్తపదో, నిషిద్ధాక్షరో, ఆశువో  అడిగిందే తడవు దాన్ని ఏ ఛందస్సులో చెప్పాలి, ఏ అక్షరాలు రాకుండా చెప్పాలి అన్నీ అంచనా వేసుకొని పద్యం చెప్పడానికి సిద్ధమవాలి. ఇదంతా కళ్లు మూసి తెరిచేలోపు జరగాలి.
సాహిత్యావధానం స్ఫూర్తితో ఆ తర్వాత నాట్యావధానం, గేయావధానం... ఇలా దాదాపు 50 రకాల ప్రక్రియలు రూపుదిద్దుకున్నాయి. అలాంటివి ఎన్నున్నా అవధానం అనగానే అందరికీ గుర్తొచ్చే ప్రక్రియ అష్టావధానమే. అతి కష్టమైనదీ తక్కువ సమయంలో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేదీ కాబట్టే దానికి అంతప్రాముఖ్యం, ప్రాచుర్యం కలిగింది.
అష్టావధానం అంటే?
ఎనిమిది మందితో నిర్వహించే సాహితీ ప్రక్రియ.  ఏకకాలంలో ఎనిమిది మందికి సమాధానాలిస్తూ కార్యక్రమం చివర్లో వాటిలోని సాహిత్య అంశాలను ధారణ చేయడం చూసేవారికి ఇష్టావధానం, చేసేవారికి కష్టావధానం. అదే అష్టావధానం. సమస్యా పూరణం, దత్తపది, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి, అప్రస్తుత ప్రసంగం, ఇలా అవధాని ఎనిమిది అంశాలను ఎంచుకొంటాడు. వాటిలో ఒక్కో అంశాన్నీ ఒక్కో పృచ్ఛకుడు నిర్వహిస్తాడు.
ఒక్కొక్కటీ ఇలా అవధాన ప్రక్రియకు దాదాపు 50 దాకా అనుకూల అంశాలున్నాయి. సాధారణంగా అందరి అవధానాల్లోనూ ఉండే అంశాలు పరిశీలిద్దాం.
సమస్యా పూరణం:
పృచ్ఛకుడు ఏదో ఒక అంశంపై ఒక పాదాన్ని ఇస్తాడు. దాని ఆధారంగా చేసుకొని మిగిలిన మూడు పాదాల్నీ అవధాని పూరించాలి. సాధారణంగా సమస్య ఇచ్చేవారు చిత్రాతిచిత్రంగా అసలది సాధ్యమేనా? అనిపించేలా ఇస్తారు.
ఉదాహరణకు
'రావణుని పత్ని సీతమ్మ రాము చెల్లి'
ఈ సమస్యను రాళ్లబండి కవితాప్రసాద్ గారిని ఒక అవధానంలో అడిగారు.
సీతమ్మ రావణుడికి భార్య, రాముడికి చెల్లెలూ అవుతుందా? అదెలా సాధ్యం? ఆ సమస్యను అవధాని చమత్కారంతో ఇలా మార్చేశారు.
సీత రాకడ నెదిరించెనే తరుణియ?
రామ కథలోని శక్తి యే లేమ చెపుమ?
భరతు డమ్మాయి యైనచో వరుస వరుస -
రావణుని పత్ని, సీతమ్మ, రాము చెల్లి
సీతను తీసుకురావడం తగదని చెప్పినదెవరు? రామకథలోని కథానాయిక ఎవరు? భరతుడు అమ్మాయిగా పుడితే రాముడికి ఏమవుతుంది? అని మొదటి మూడు పాదాల్లో ప్రశ్నించి వాటికి సమాధానాలు వరుసగా రావణునిపత్ని, సీతమ్మ, రాము చెల్లి అని నాలుగో పాదంలో తెలివిగా సమస్యను ప్రశ్నోత్తర రూపంలో క్రమాలంకారంలో పూరించారు.ఎంత చక్కని పూరణ!
నిషేధాక్షరి:
తాను కోరిన పద్యాన్ని అవధాని చెప్పడం ప్రారంభించగానే పృచ్ఛకుడు అడ్డుతగిలి కొన్ని అక్షరాల్ని నిషేధిస్తాడు. నిషేధాక్షరి నిర్వహణలో అవధానికి నిఘంటు పరిజ్ఞానంతోపాటు అప్పటికప్పుడు పదాన్ని మార్చేసే శక్తి ఉండాలి.
ఉదాహరణకు భద్రాచల రాముని వర్ణించమని మేడసాని వోహను అవధానిని ఒక పృచ్ఛకుడు అడిగాడు.
తొలి రెండు అక్షరాలూ అవధాని స్వేచ్ఛకే వదిలేయగా ఈయన 'భద్రా' అన్నారు.
తర్వాత 'చలం' అంటారనుకొని పృచ్ఛకుడు 'చ' అక్షరాన్ని నిషేధించాడు.
వెంటనే అవధాని 'ద్రి' అన్నారు. భద్రాద్రి అయింది.
తర్వాతి పదం (భద్రాద్రి)'వాసా' అయి ఉంటుందని ఊహించి
'వా' నిషేధం అన్నాడు. 'స్థి' అన్నారు అవధాని.
'స్థి'ర వాసా అనే అవకాశం ఉందనుకుని 'ర' నిషేధించాడు పృచ్ఛకుడు.
ఈయనేమో 'త' అన్నాడు.
వెంటనే పృచ్ఛకుఁడు 'వా' రాకూడదన్నాడు.
అవధాని 'రా' అన్నాడు.
ఇంకేముందీ! రామా అంటాడు కాబోలని 'మా' అక్షరాన్ని తొక్కిపట్టాడాయన.
'జా' అంటూ మొదటి పాదాన్ని పూర్తిచేశారు మేడసాని.
మొత్తం కలిపితే 'భద్రాద్రి స్థిత రాజా' అయింది.
అవతలి వ్యక్తి ఊహించని కోణంలో ఆలోచించడమే అవధాని ప్రతిభ.
ఇలా ఎత్తులూ పై ఎత్తులుగా సాగుతుందా చెలగాటం.
నిషిద్ధాక్షరి:
పృచ్ఛకుడు ముందుగానే ఏయే అక్షరాలు నిషిద్ధమో ముందే నిర్దేశిస్తాడు. ఉదాహరణకు మేడసాని మోహన్ గారిని ఒకసారి క, చ, ట, త, ప అనే అక్షరాలు రాకుండా సీతాకల్యాణం గురించి చెప్పమన్నారు. వెంటనే ఆయన
సరసనిధిరామభద్రుడు
ధరణిజ ఎదలోన మధుర ధారణుడయ్యన్
సురలెల్ల హర్షమందిరి
విరాజమాన సువిలాస విభవ మ్మెసగిన్.    అని చెప్పారు.
వివర్గాక్షరి:
పద్యంలోని ఏయే పాదాల్లో ఏ అక్షరాలు నిషిద్ధమో పృచ్ఛకుడు ముందే చెప్తాడు. అవధాని వాటిని మరోసారి అడగకుండా పద్యం చెప్పాలి. ఉదాహరణకు... 1944లో పిసుపాటి చిదంబరశాస్త్రి అవధానం చేస్తుండగా ఒక పృచ్ఛకుడు మొదటి పాదంలో య, ర, ల, వ, శ, ష, స, హ, రెండో పాదంలో ప, ఫ, బ, భ, మ, మూడో పాదంలో త, థ, ద, ధ, న, నాలుగో పాదంలో క, ఖ, గ, ఘ, ఙ... ఇన్ని అక్షరాలు రాకుండా మత్తేభ ఛందస్సులో సరస్వతీ దేవిని వర్ణించమన్నాడు. పిసుపాటి వారు దాన్ని అవలీలగా పూరించారిలా...
గణుతింతున్ మనమంది నుక్తిజననిన్ కాంతా మణిన్ జండధా
రణ హృత్సారస చంచరీక నవతారస్వైరసంచార, చ
ర్వణ బీయూష కరాభ్యుపేయ రుచపారం పర్య సంశోభ, గా
రణ భూతన్ వివిధ శ్రుతి స్మృతి విహార ద్యోతమాన స్థితిన్.
అవధాన చరిత్రలోనే ఇన్ని నిషేధాలతో ఇంత అందమైన పద్యం రాలేదంటే అది సత్యదూరము కాదు.
దత్తపది:
ఇచ్చిన పదాలతో పృచ్ఛకులు కోరిన భావాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణకు పంచరు, టించరు, వెంచరు, లాంచరు పదాలతో భారతీయ సంస్కృతి గురించి వర్ణించమన్నారో అవధానిని. దాన్ని ఆయన పరిష్కరించిన తీరు ఇది...
పంచరు ద్వేషభావనలు భారత వీరులు, కల్మి లేమి పా
టించరు, అందరున్ కలిసి ఢీకొని శత్రు సమూహ శక్తి లా
వెంచరు, పోరులోన అరిభీకరమూర్తులు భారతంబ చే
లాంచ రుచి ప్రతీకలు భళా! మన సంస్కృతి సంస్తుతంబగున్
వర్ణన:
పృచ్ఛకుడు తన ఇష్టం వచ్చిన అంశాన్ని ఇచ్చి దాన్ని తాను కోరిన ఛందంలో వర్ణించమంటాడు. ఉదాహరణకు...
ఒక సభలో విజయవాడ అద్దెకొంపల అగచాట్లను వర్ణించమంటే అవధాని ఆ కష్టాలను కళ్లకు కట్టిన తీరిది...
దొరికియు చావదాయె యొక త్రోవను, గొంప లభించెనేని సం
బరపడ రాదు చుట్టములు పక్కములద్దరి చేరరాదు.బా
పురెతన జీతమందు దృణవో పణవో మిగులంగనింటియో
నరునకునద్దె గట్టవలె నారకమౌపడునద్దె కొంపలన్
ఆశుకవిత్వం:
ఇది ప్రజలను విశేషంగా ఆకర్షించే ప్రక్రియ. అగ్గిపుల్ల నుంచి అంతరిక్షం వరకూ దేనిమీదైనా ఆశువుగా పద్యమో దండకమో చెప్పమంటారు పృచ్ఛకులు. అవధాని చతురత, ధార ఇక్కడ ప్రదర్శించాల్సి ఉంటుంది.
న్యస్తాక్షరి:
దీనిలో పృచ్ఛకుడు తన ఇష్టానుసారం అక్షరాలను ఇచ్చి అవి పద్యంలో ఏ లైనులో ఎన్నో అక్షరంగా రావాలో చెప్తాడు. అవధాని వాటన్నిటిని గుర్తుంచుకుని పృచ్ఛకుడు కోరిన ఇతివృత్తంలో ఇచ్చిన అక్షరాలను కోరిన చోట ఉంచుతూ పద్యం చెప్పాల్సి ఉంటుంది.
ఉదాహరణకు
ఒకటో పాదంలో 11వ అక్షరంగా 'ట్మ' రావాలని కోరితే అవధాని అలా చెప్పి తీరాల్సిందే.
నిర్దిష్టాక్షరి:
అనగా నిర్దేశించబడిన అక్షరాలు గలదని అర్థం. దీనిలో 32 గళ్లుంటాయి. పృచ్ఛకుడు బేసిస్థానాల్లోగాని, సరిస్థానాల్లోగాని ఇష్టానుసారం అక్షరాలను రాసిస్తాడు. అవధాని మిగిలిన ఖాళీలను పూరించి కోరిన దేవతా స్తుతిని పూర్తి చేస్తాడు.
పుష్పగణనం:
అవధానం జరుగుతుండగా అవధాని వీపునకు తగిలేలా అప్పుడప్పుడూ పూలు విసురుతుంటారు. ఆయన ఆ పూల సంఖ్యను లెక్కించి మొత్తం ఎన్నిపూలు విసిరారో చివర్లో చెప్పాల్సి ఉంటుంది. ఘంటా గణనం కూడా ఇలాంటిదే. అవధానం జరుగుతుండగా వెనకాల ఒకరు గంట కొడుతుంటారు. మొత్తం ఎన్ని గంటలు కొట్టారో అవధాని చెప్పాలి.
అప్రస్తుత ప్రసంగం:
అవధాని ఏకాగ్రతను చెడగొట్టేందుకు అప్రస్తుత ప్రసంగి చేయని ప్రయత్నం ఉండదు. 
తే.27 - 5 - 2006 న విశాఖ పట్టణం జిల్లా పెందుర్తి గ్రామంలో పంచవటి ఆధ్యాత్మిక సేవా సంస్థ వారు  కడిమిళ్ళ కోట  జంటకవులఏ అష్టావధానం ఏర్పాటు చేసారు.
అందు అప్రస్తుత ప్రసంగం పృచ్ఛకుఁడుగా నేను వ్యవహరించాను. అప్రస్తుత ప్రసంగానికి చ్ఛందోభాషణం జోడించి ఆ కవులను ప్రస్నించే సందర్భంలో ఒక ప్రశ్న ఇలా డిగాను.
గీః- పతికి వామ భాగమునందు సతి వసించు. 
పటములందునఁ గనిచూడ నటులె యుండు.
ప్రభువు వేంకట నాయకు పటమునందు 
ఏల కుడివైపు నుండే నలమేలు మంగ?
దానికి వారు
తమిళుల పద్ధతి యౌనది.
తమిళాంధ్రులదైవమతడు తప్పదు చూపన్
సమయాను కూల పద్ధతి.
ప్రముదంబున సతిని కుడిని వర్ధిల చేర్చెన్.
అని చెప్పారు. 
అలాగే 
శ్రీ భద్రం వేణుగోపాలాచార్యులవారి చేత విశాఖపట్టణం జిల్లా చోడవరం గ్రామంలో ప్రసన్నభారతి అనే సుప్రసిద్ధ సాహితీ సంస్థ వారు అష్టావధానం ఏర్పాటు చేసారు. సభలో ఒక సుప్రసిద్ధ వ్యక్తి కూర్చున్నారు. వారు గెడ్డం పెంచుకున్నారు అప్రస్తుత ప్రసంగం చేస్తున్న నేను  చ్ఛందోభాషణం చేస్తూ ఇలా ప్రశ్నించాను.
గెడ్డము పెంచెదరెందుకు?
అడ్డంబది కాదె వారికన్ని పనులకున్?
విడ్డూరంబుగనున్నది.
దొడ్డ మనసు తోడ చెప్పుదురగా? సుకవీ! అని అడిగే సరికి
అవధానిగారి దృష్టి ఆ గెడ్డాల స్వామిమీదకి మళ్ళింది.
ఒక్కసారి చిన్నగా నవ్వుకున్నారు. తరువత ఇలా చెప్పారు.
అడ్డంబులఁదొలగించుచు
దొడ్డమనము తోడఁ గాచుదురనుచు సుజనుల్ 
వడ్డీ కాసుల వానికి 
గెడ్డము మీసము శిఖ గొరికించి యొసంగున్. అని చెప్పారు.
చూచారా ఎంతటి అసమాన ప్రతిభా పాటవాలను  ఈ అవధాని కనఁబరిచారో!
ఒక సభలో ఒకాయన ''అవధానిగారూ భర్త భోజనం చేస్తున్నాడు, భార్య వడ్డిస్తోంది. భర్త 'పశువ' అన్నాడు. భార్య నవ్వుతూ 'కోతి' అంది. వారి మాటల్లో ఆంతర్యమేమిటి'' అని అడిగారు. దానికి అవధాని.. 'ళ్లెం నిండా శుభ్రంగా డ్డించవే' అని భర్త అంటే 'కోరినంత తినండి' అని భార్య జవాబిచ్చింది అని చెప్పారు.
మరోసారి  ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మను ఒక అప్రస్తుత ప్రసంగి.. 'అయ్యా వ్యవసాయ శాఖలో పనిచేసే భర్త, కుటుంబ నియంత్రణ శాఖలో పనిచేసే భార్య. వారి సంభాషణ ఎలా ఉంటుందో చెప్పమన్నాఁడు. దానికి మాడుగుల.. ''భర్త 'గ్రోమోర్.. గ్రోమోర్..' అంటుంటే, 'భార్య నోమోర్.. నోమోర్..' అంటుంది'' అని చెప్పి సభలో నవ్వులు పూయించారు.
ఇలా క్షణాల్లో అవతలి వారి ఛలోక్తులకూ చెణుకులకు తడుము కోకుండా సమాధానం చెప్పగలిగితేనే సభ శోభిస్తుంది. ఎందుకంటే  పద్యాలూ ఛందస్సుల గురించి అస్సలు తెలియని సామాన్యులను ఆకట్టుకునేది ఈ అప్రస్తుత ప్రసంగమే.
ఇవి కొన్ని ప్రక్రియలు మాత్రమే.
శాస్త్రార్థం, ఇచ్ఛాంక శ్లోకం... ఇలా అవధాని ప్రతిభను అన్ని విధాలా కఠిన పరీక్షకు గురిచేసే అంశాలు అష్టావధానంలోనే ఉన్నాయి. ఇందులో మళ్లీ ఇటీవల వచ్చిన వినూత్న ప్రక్రియ
గుణితాష్టావధానం. అంటే... అంశాల సంఖ్య ఎనిమిదే కానీ పృచ్చకుల సంఖ్య మాత్రం పదహారు, ఇరవైనాలుగు ఇలా రెట్టింపవుతూ ఉంటుంది. ఎంతమంది ఉద్దండ పండితులు ఎదురుగా ఉన్నా ఇసుమంతైనా తొణక్కుండా రసగంగా ప్రవాహాలు పొంగిస్తారు అవధానులు అడిగిన పద్యాలు చెప్పడంతోనే అవధానం పూర్తయిపోదు. చివర్లో 'ధారణ' లేని అవధానం రక్తి కట్టదంటారు పండితులు. అన్ని రోజులూ చెప్పిన పద్యాలను అవధాని కార్యక్రమం చివర్లో మరోసారి చెప్పాల్సి ఉంటుంది. అదే సిసలు పరీక్ష. మేడసాని మోహన్, గరికపాటి నరసింహారావు, రాళ్లబండి కవితా ప్రసాద్, కడిమిళ్ల, వద్దిపర్తి వంటి కొద్ది మంది అవధానులు మాత్రమే ధారణను చూపగలుగుతున్నారు.
సాధారణ మనిషి కన్నా అద్భుతమైన ధారణ శక్తి అవధానులకు ఉంటుంది. ఎందుకంటే..అవధానికి 18 పురాణాలూ సంస్కృత, తెలుగు కావ్యాలూ నోటికి రావాలి. అంటే కొన్ని లక్షల పద్యాలు కంఠస్థం అయి ఉండాలి. అక్కడితో అయిపోదు! వాటిని సందర్భానుసారం ఉపయోగించగలిగే సమయస్ఫూర్తి ఉండాలి. సామెతలూ జాతీయాలూ అలవోకగా తాను చెప్పాల్సిన ఇతివృత్తంలోకి జొప్పించగలిగే చాతుర్యం ఉండాలి. ఇవన్నీ అవలీలగా చేసే అవధానుల మస్తిష్కశక్తి మహాద్భుతం కాక మరేమిటి!
నిషేధాక్షరి కష్టం!
అవధానుల్ని బాగా ఇబ్బంది పెట్టేదీ వారిని ముప్పతిప్పలు పెట్టడానికి పృచ్ఛకులకు అవకాశం ఇచ్చేదీ నిషేధాక్షరి అంశమే. ఈ ప్రక్రియలో పద్యం చెప్పేటప్పుడు అవతలివారికి మనం అనుసరిస్తున్న టెక్నిక్ చివరిదాకా తెలియనివ్వకూడదు. అప్పుడే నిషేధాక్షరి రక్తికడుతుంది. ఏదేమైనా అవధాన ప్రక్రియ మొత్తం ఏకాగ్రత పైనే ఆధారపడి ఉంది. ధ్యానంతోనే ఏకాగ్రత సాధ్యం.
ధ్యానం మన సంస్కృతి మనకిచ్చిన జ్ఞానసాధనం. దానివల్ల ఎంతటి ఒత్తిడినైనా తట్టుకుని విజయం సాధించే ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత సొంతమవుతాయి. ఏకకాలంలో అనేక విషయాలమీద దృష్టిని కేంద్రీకరించగలిగిన ఏకాగ్రత కూడా మనిషికి సాధ్యమేనని అవధానం నిరూపిస్తోంది కదా. అవధానికి సాధ్యమైనది మీకు మాత్రం ఎందుకు సాధ్యం కాదు.. ప్రయత్నించండి!
శత, సహస్రావధానాలు పేరును బట్టి అష్టావధానమే ముందు పుట్టింది అనుకుంటారు గానీ.. అన్నిటికీ పెద్దన్న శతావధానమే. ధార, ధారణ ఉండే అవధానికి శతావధానం నల్లేరు మీద బండి నడకే. ఇందులో నూరుగురు పృచ్ఛకులు ఒకేసారి అవధానికి వారికి నచ్చిన అంశాలు ఇస్తారు. వారందరికీ అడగగానే తొలిపాదం చెప్పాలి. ఇలా వందమందికి తొలిపాదం చెప్పిన తర్వాత రెండో ఆవృతంలో అవధాని పృచ్ఛకుని చూడగానే గుర్తించి రెండో పాదం చెప్పాల్సి ఉంటుంది. ఇలా నాలుగు పాదాలకు నాలుగు ఆవృతాలు ఉంటాయి. ఇదే ప్రక్రియను రెండువందల మందితో చేస్తే ద్విశతావధానమనీ ఐదువందల మందితో చేస్తే పంచశతావధానమనీ అంటారు. వెయ్యిమందితో చేస్తే సహస్రావధానం అంటారు. వెయ్యి మంది పృచ్ఛకులు అడిగిన సమస్యలను పూరించడం ఒక ఎత్తయితే, ఆశువుగా చెప్పిన అన్ని పద్యాలనూ అవధానం చివర్లో అక్షరం పొల్లుపోకుండా వరుస క్రమంలో అప్పచెప్పడం ఎంతకష్టమో.. అసలది ఎలా సాధ్యమో అవధానులకే తెలియాలి.
జంటకవుల అవధానము
అవధానాల్లో జంటకవులది ప్రత్యేక శైలి. ఒక్కరే చేయాల్సిన అవధానాన్ని ఇద్దరు కవులు చేయడం మరింత సులభం అని అనుకుంటాం. కానీ దీనిలో కూడా క్లిష్టత లేకపోలేదు. పద్యంలోని మొదటిపాదం ఒకాయన చెప్తే రెండో పాదం మరొకాయన అందుకుంటాడు. మూడోపాదం మళ్లీ మొదటాయన వంతు అయితే నాలుగోపాదంతో రెండో అవధాని ముగిస్తాడు. అలా చేయాలంటే ఇద్దరి ధార, ధారణ, ధోరణి ఒకేలా ఉండాలి. ఇద్దరూ సమాన పాండిత్యం కలిగి ఉండాలి. అలాంటివారిలో ప్రముఖులు తిరుపతి వేంకట కవులు. అవధాన వైతాళికులుగా పేరొందిన దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి జంట అవధానాలకు ఆద్యులు. తెలుగు సాహితీ సుమగంధాలను సామాన్య జనవాహినికి చేరేలా చేసిన ఘనత వీరికే దక్కుతుంది. పామరులు కూడా అవధానాల్ని ఆస్వాదించేలా సాధారణ విషయాలను కూడా మిళితం చేసేవారు. చీపురుపుల్ల నుంచి చిన్నయసూరి వరకూ అన్నీ వీరి అవధానంలో చోటుచేసుకునేవి. వారితో పాటు ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది (కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, వేంకట రమణ కవి)కొప్పరపు సోదరుల  గురించి. చాలా సందర్భాల్లో తిరుపతి వేంకట కవులను సవాల్ చేసి ఎదురు నిల్చిన ప్రతిభావంతులు వీరు. అడిగిందే తడవుగా అత్యంత వేగంగా అంతే రమ్యంగా పద్యాలు చెప్పడం వీరి ప్రత్యేకత. ఇంకా వేంకట రామకృష్ణ కవులు, రాజశేఖర వేంకట కవులు, పల్నాటి సోదరులు, దేవుల పల్లి సోదర కవులు(వీరు ముగ్గురు), పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వెంకటేశ్వరరావు ఇలా చాలా మందే ఉన్నారు. ఇటీవలి కాలంలో.. జంటగా సహస్రావధానం చేసి పేరొందిన వారు కడిమిళ్ల వరప్రసాద్, కోట లక్ష్మీనరసింహం.
క్లుప్తంగా అవధానాల గురించి మనం ఇక్కడ ఇప్పుడు తెలుసుకున్నది చాలు.
ఇక రేపు హైదరాబాదులో మియాపూర్లో జయప్రకాష నారాయణ్ నగర్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో మధ్యాహ్నం మూడు గంటలకు  డా. కట్టమూరి చంద్రశేఖరం గారు చేయుచున్న అష్టావధానానికి మీరంతా తప్పక వస్తున్నారు కదూ? చాలా సంతోషం మీ అందరికీ సాదరాహ్వానం పలుకుతున్నాము.
శుభమస్తు.
జైహింద్.

8, ఫిబ్రవరి 2012, బుధవారం

అష్టావధానానికి తప్పక తప్పక తప్పక వస్తారు కదూ?

2 comments

జైశ్రీరామ్
తెలుగును మాటలాడు గుణ దీపిత సజ్జనవర్యులార! నే
తెలిపిన యట్లు సత్కవన తేజము నింపెడి సద్వధానమున్
సలుపుట కిచ్చగించిరి ప్రశస్త కవీంద్రులు కట్టమూరి. మీ
చెలువము చూపి నాపయిని శ్రేయము గొల్పగ రండు సమ్మతిన్.
జేపీ నగర్, సభాస్థలి
దీపిత శ్రీ వేంకటేశు దేవళ మందున్
శ్రీ పండితవరు లెన్నగ
రూపొందు వధానమిద్ది శ్రుతి పేయమునౌన్.
తప్పక రావలె, కనవలె.
తప్పక వినవలె కవిత్వ ధారణ విధమున్.
తప్పక యోచింపగ వలె
నిప్పద్ధతి కొలుపు మేలు నెల్లరు కృపతో.
మేధాశక్తిని పెంచెడు
నీధాత్రి వధాన విద్య హృద్యాద్భుతమై.
బాధలు మరిపించును. స
ద్బోధను కలిగించు నిజము పుణ్య ఫలమనన్.
బద్ధకము వీడి రావలె.
నిద్దురపోవుటయు మాని, నిండు మనముతో
నొద్దికతో రావలయును.
శుద్ధాత్ముల కవుల తీరు చూడగ వలయున్.
తప్పక మీ రొత్తురుగా?
ఇప్పట్టున మానిరేని ఇట్టి సభికులన్
గొప్పగు నవధానిని, పెం
పొప్పగ గన నవదు తెలియ నురు గుణ శోభన్.
గుర్తుంచుకోండి.
అష్టావధానం జరుపు తేదీ:- 12 - 02 - 2012. ఆదివారం
సమయము:- మధ్యాహ్నం  3 గంటలకు.
స్థలము:- శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కోవెల ప్రాంగణము. జయప్రకాశ్ నారాయణ్ నగర్, మియాపూర్, హైదరాబాదు.
అవధాని పేరు:- డా.కట్టమూరి చంద్రశేఖరం.
తప్పక రండి.
వివరములకు సెల్ నెంబర్. 9247238537.
జైహింద్.

6, ఫిబ్రవరి 2012, సోమవారం

అష్టావధానం అంటే ఏమిటి?దీని వలన ప్రయోజనమేమిటి?

11 comments

జైశ్రీరామ్.
అవధానం అనేది తెలుగు సాహిత్యం లో ఒక విశిష్ట ప్రక్రియ సంస్కృతము, తెలుగు కాకుండా వేరే ఏ యితర భాషలోనుఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్పుతూ అవధాని సభాసదులనలరింప జేయడం అన్నది అవధాని ప్రత్యేకత.వీటన్నిటినీ ఏక కాలంలో అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం.
అవధానాలు పలు రకములు.
వేదసంబంధ అవధానాలు: 
సాహిత్య అవధానాలు: (అష్టావధానం, శతావధానం, సహస్రావధానం... ఇలా 20దాకా ఉన్నాయి)
సాహిత్యేతర అవధానాలు: (శతకలశావధానం, శభ్దావధానం, రామాయణ, భగవద్గీత అవధానాలు. ఇవి ధారణ సంబంధమైనవి. అంటే ఒక్కసారి చదివి లేదా విని గుర్తుంచుకోవడం ద్వారా మళ్లీ చెప్పేవి)
సాంకేతిక అవధానాలు:
శాస్త్ర సంబంధ అవధానాలు: 
కళా సంబంధ అవధానాలు:
ఇలా అనేకమైన అవధానాలు ప్రాచుర్యం పొంది ఉన్నాయి.
అందు సాహిత్యావధానాలు బహుళ ప్రచారంలో ఉన్నాయి.
అసలు అవధానం అంటే ఏమిటి? అనే ప్రశ్న మనకు వస్తుంది. 
అవధానము = ఎచ్చరిక. మనో యోగము.ఆంగ్లములో ఎటెంక్షన్. కేర్.డివోషన్. రిగార్డ్. ఇంటెంట్నెస్.ఎటెంటీవ్నెస్. అనే అర్థాలున్నాయి. 
అవధాని ప్రారంభము నుండీ పృచ్ఛకులు వేసే ప్రశ్నలను మనసులో ఉంచుకొని, ఒక్కొక్కరి ప్రశ్నకు సమాధానము ఒక్కొక్క ఆవృత్తికి ఒక్కొక్కపాదము వరిసగా ఒకరి తరువాత ఒకరికి చెప్పుతూ, నాలుగు ఆవృత్తులలో పూరించాలి.
పూరణ పూర్తి అయిన తరువాత ధారణ.
అంటే తాను మొదటి నుండీ వరుసగా ఏ యే పృచ్ఛకునకు ఏయే సమాధానం చెప్పారో ఏ పద్యం చెప్పారో అదే పద్యాన్ని నాలుగు పాదాలు కలిపి చెప్పాలి. అలాగ ఆ అందరు పృచ్ఛకులకు చెప్పాలి. ఈ ప్రక్రియను అవాధానం అంటాము.
సాహిత్య అవధానాలలో అష్ట, ద్విగుణీకృతాష్ట, త్రిగుణీకృతాష్ట, శత, ద్విశత, త్రిశత, సహస్ర, ద్విసహస్రాదికమగు అవధానములు సామర్ధ్యంతో నేటి అవధానులు చేస్తున్నాను.
అందు మనకు వెశేషాదరణను పొందుతున్నది అష్టావధానము.
అష్టావధానములో స్వీకరిస్తున్న అంశాలు ఎనిమిది. 
ఆ యెనిమిదీ అవధాని, పృచ్ఛకులు కలిసి నిర్ణయించుకొని నిర్వహిస్తుంటారు.
అవి
సమస్యాపూరణం, దత్తపది, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి, అప్రస్తుత ప్రసంగం, వివర్గాక్షరి, నిర్దిష్టాక్షరి, ఘంటా గణనం, పురాణ పఠనం, సహ పఠనం, కావ్యోక్తి, ఇచ్ఛాంక శ్లోకము, ఛందో భాషణము, అడిగిన ఆంగ్ల తేదీకి వార ప్రకటన్, మొదలగు వాటిలో ఎనిమిది ప్రక్రియలు ఎన్నుకుంటారు.
"ధారణ" తో అవధానం ముగుస్తుంది.  
ఈ అవధానం వలన ప్రయోజనమేమిటి?
అనే సందేహం మనకి రావచ్చును.
అవధానాన్ని మనం చూచినట్లైతే అవధాని ఏక కాలంలో  ఎనిమిదిమంది పృచ్ఛకులడిగిన ప్రశ్నలకు ఒక్కొక్క ఆవృత్తిలో ఒక్కొక్క పాదం ఎవరిది వారికి చెప్పుతూ నాలుగు ఆవృత్తులూ పూర్తయిన తరువాత వరుసగా పృచ్ఛకులందరికి మొత్తం ఎవరి  పద్యం వారికి చెప్పడం జరుగుతుంది. ఈ ప్రక్రియ మెదడును  లొంగదీసుకొని, జ్ఞాపక శక్తిని మెదడుకు పెంచుకొంటూ  సద్యస్ఫూర్తిని పొందుతూ, పృచ్ఛకులడిగే అసందర్భమైన ప్రశ్నలకు కూడా చమత్కారతో సమాధానం చెప్పుతూ, అందరి మనసులనూ ఆకట్టుకోగలగడం అవధాని యొక్క సాధన వలననే సాధ్యమైనదని మనం గ్రహించ గలం.
అంటే మనమూ సాధన చేస్తే మనసుచేత ఎంతటి క్లిష్టమైన పనినైనా చేయించ వచ్చునని, మనసును మా స్వాధీనంలో ఉంచుకోవచ్చునని, జ్ఞాపక శక్తిని అపారంగా పెంచుకో వచ్చునని,మరపు అన్నదానినే మనం పూర్తిగా మరచిపోవచ్చునని, గ్రహించ గలం. ఇది విద్యా విషయంలో సాధన చేయ గలిగితే విద్యార్థులకు అమోఘమైన ఫలితాన్నిస్తుంది. పరీక్షా సమయాల్లో మరచిపోవడం అన్న మాటే ఉండదు. అందుకే ఆబాల గోపాలము తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా వెళ్ళి, ఆకార్యక్రమం ఆద్యంతం చూచి, స్ఫూర్తిని పొందాలి. తమ మేధాశక్తిని పెంచుకోవాలి.
ఇంతటి ప్రయోజనం కలుగ జేస్తున్న ఈ అవధాన ప్రక్రియ పూర్తిగా ఆంధ్రులమైన మన సొంతం. 
ఐతే ఇప్పుడు మనమేంచెయ్యాలి?
మనము, పిల్లలు, మిత్రులు అందరితో కలిసిఇటువంటి కార్యక్రమానికి వెళ్ళాలి.
అదెప్పుడు? ఎక్కడ? 
అంటే
హైదరాబాదు, మియాపూర్, జయప్రకాశ్ నారాయణ్ నగర్, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కోవెల ప్రాంగణంలో
మధ్యాహ్నం 3 గంటల నుండి
డా.కట్టమూరి చంద్రశేఖరావధాని గారిచే జరుప బడుతుంది.
వీరే ఆచంద్రశేఖరం
అందు చేత మనం తప్పక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నమాట.ఆ రోజు ఆదివారం కూడాను.
మరింకేమి? సకుటుంబంగా చూచే సదవకాశం మనం జారవిడుచుకోము కదా?
జైహింద్.

4, ఫిబ్రవరి 2012, శనివారం

మియాపూర్ జయప్రకాశ్ నారాయణ్ నగర్ లో అష్టావధానం.

16 comments

జైశ్రీరామ్.
సాహితీ బంధువులారా!
శ్రీ కట్టమూరి చంద్రశేఖరం అవధానిచే తే.12 - 02 - 2012 న  జయప్రకాశ్ నారాయణ్‌నగర్‌
( హైదరాబాద్. మియాపూర్ ) లో  అష్టావధానం ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి.
మీరు తప్పక రాగలరని ఆశిస్తున్నాను. వచ్చే అవకాశం ఉన్న వారు మీ వివరాలను నాకు తెలియ జేయ గలరని ఆశిస్తున్నాను. సందర్భానుసారం మనలో ఎవరినయినా పృచ్ఛకులుగా అక్కడ గ్రహించే అవకాశం కూడా ఉండ వచ్చునని భావిస్తున్నాను. పాల్గొనే ఉత్సాహవంతులు తాము నిర్వహించగల అనుభవమున్న అంశాన్ని కూడా నాకు తెలియ జేయ మనవి.ఇది కేవలం మన ప్రాతినిధ్యాన్ని అక్కడ బలపరచడానికి నేను ప్రయత్నించడానికి మాత్రమే. అవకాశం కలగడమన్నది అక్కడ నిర్వాహకుల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.
కార్యక్రమం ఖరారు కాగానే మళ్ళీ మీ అందరికీ తెలియ జేయ గలను.    
జైహింద్.