గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, డిసెంబర్ 2008, మంగళవారం

ప్రాప్య ప్రమాణ పదవీం...మేలిమి బంగారం మన సంస్కృతి 22

అధికార మదాంధులు:-
ఈ ప్రపంచంలో అనేక విధములైన మనుజులను చూస్తుంటాము. మంచివారిని మంచి వారిగా ఆదరించే వారు కొందరైతే చెడ్డవారిని మంచివారనే వారూ కొందరున్నారు. అంతే కాక దానితో పాటు మంచి వారిని అగౌరవంగా చూడడం కూడా మనం చూస్తుంటాము. ఆట్టి చోట చెడ్డవారు గర్విష్టులవడం, మంచి వారు కించ పడడం జరుగుతుంది. ఈ విషయంలో ఒక శ్లోకముంది చూడండి.
శ్లో:- ప్రాప్య ప్రమాణ పదవీం
కోనామాస్తేతులే 2 వలేపస్తే
వయసి గరిష్ఠ మథస్తాత్
లఘుతర ముచ్చైస్తరాం కురుషే.

క:-పదవిని పొందిన త్రాసా!
మది గర్వము నిండి నీవు మాన్యుల క్రిందన్,
ముదమున దుష్టుల పైనను,
పదిలముగా నుంచి చూపు పాపివి నీవే.

భావము:-అధికారము ప్రాప్తించి గర్వంతో కన్ను గానక, కొందరు దురాత్ములు మహాత్ముల నవహేళనము చేస్తూ, అయోగ్యులకు అధిక గౌరవము, అధిక ప్రాశస్త్యము ఇస్తూంటారు. కవి అట్టి వారిని త్రాసుతో సరిపోల్చాడు.
తూకమున కుపయోగించు త్రాసు బరువైన వస్తువును క్రిందికిని, తేలికగా నుండు వాటిని పైకినీ చూపిస్తుంది. అధికార గర్వం పొందిన దురాత్ములూ అట్టి వారేనట.
ఎంత అద్భుతమైన ఉపమానము. అధికార గర్వము పనికి రాదనీ, మంచి వారి మనసుని కష్ట పెట్ట రాడనీ మనకర్థమైందికదా! మనమీ విషయాన్ని నిత్యం గుర్తుంచుకొని మంచిగానే ప్రవర్తిద్దామా!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.