గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, సెప్టెంబర్ 2011, గురువారం

శరన్నవరాత్రులు సందర్భంగా శుభాకాంక్షలు.

5 comments

 ఆది శక్తి స్వరూపిణి దుర్గమ్మ
సహృదయ పాఠకులారా!
శరన్నవరాత్రులు సందర్భంగా ఆదివ్య శక్తి స్వరూపిణి యైన దుర్గమ్మ కరుణా కటాక్షములు సహృదయ పాఠకులైన, భక్తులైన మీకు లభించు గాక.
సీll శైలపుత్రీ!మమ్ము చేకొని రక్షించు. 
బ్రహ్మచారిణి!దివ్య భావమిమ్ము.
చంద్రఘంటా! మాకు సద్భావనములిమ్ము.
కూష్మాండమాతా!సుగుణములిమ్ము.
స్కందమాతా!మాకు కామితార్థములిమ్ము. 
కాత్యాయనీ! శ్రీవికాసమిమ్మి.
కాళరాత్రీ! మాకు కవన పాటవమిమ్మి.
శ్రీమహాగౌరీ!వసించుమ మది.
గీll మమ్ము శ్రీసిద్ధిధాత్రీ! ప్రమాదములకు
దూరముగ నుంచి కావుమా! దుర్గమాంబ!
శక్తిఁ గొల్పుమ! దుష్ట దుశ్శక్తి బాపి,
కాచి రక్షించుమమ్మరో! కమల వదన!
జైశ్రీరాం.
జైహింద్.


27, సెప్టెంబర్ 2011, మంగళవారం

ఈ దత్త పదులతో ఐచ్ఛికమైన ఛందస్సులో జగన్మాతను ఆహ్వానించండి.

8 comments

ఆర్యులారా! గడిచిన ఇన్ని రోజులూ ఒక ఎత్తైతే,  రేపటి నుండి మనం గడపబోయే తొమ్మిది రోజులూ ఒక యెత్తు.
శరన్నవరాత్రులు సందర్భంగా
1  శైలపుత్రి  
2 బ్రహ్మచారిణి
3 చంద్రఘంట
4 కూష్మాండ
5 స్కందమాత
6 కాత్యాయని
7 కాళరాత్రి
8 మహాగౌరి
9 సిద్ధిధాత్రి 
అనే పదములతో సంబోధిస్తూ మనము మేలుగా వ్రాయ గలిగిన ఐచ్ఛికమైన ఛందస్సులో జగన్మాతకు ఆహ్వానం పలకుదామా?
జైశ్రీరాం.
జైహింద్.  

26, సెప్టెంబర్ 2011, సోమవారం

దుర్గానవరాత్రులలో ఆ అమ్మ కటాక్షం పొందుదాం.

1 comments

ప్రియ సాహితీబంధువులారా!
సృష్టికి మూలాధార శక్తి ఐన ఆ జగన్మాత కటాక్షం మనకు పరిపూర్ణంగాలభింప జేసుకో గలిగడానికి వీలైన 
సుప్రశస్త శరన్నవరాత్రులు  ప్రారంభమౌతున్నాయి.
"యాదేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై    నమస్తస్యై  నమో నమః"
అని మనం ప్రతీ జీవిలోనూ ఆ జగన్మాత శక్తిని చూస్తూ  ఎంతగానో ఆరాధిస్తూ ఉంటాము. ఆ జగన్మాతయే మనలను  కటాక్షించే అమృత   ఘడియలు వచ్చెస్తున్నాయి.
మనం మనసారా ఆ జగన్మాతను ఆరాధించి, ఆ తల్లిపై మనకున్న భక్తి భావంతో ఆమె మాహాత్మ్యాన్ని వర్ణిస్తూ, ఆమెను ఆరాధిస్తూ  మనం అభ్యసించిన పద్య కవతా పాటవము చరితార్థమయే విధంగా పద్యములు వ్రాద్దాం.
నవదుర్గలు 
1 శైలపుత్రి 
2 బ్రహ్మచారిణి
3 చంద్రఘంట
4 కూష్మాండ
5 స్కందమాత
6 కాత్యాయని
7 కాళరాత్రి
8 మహాగౌరి
9 సిద్ధిధాత్రి 
మీరు మీ సామర్ధ్యానుసారం నవ దుర్గలపై పద్యామృతాన్ని సిద్ధం చేసి పంపండి .
శారదాంబకు ఆంధ్రామృతం ద్వారా వినిపిద్దాం.
జై శ్రీరాం.
జైహింద్.

అలనాడు ఆకాశవాణిలో పూరణార్ధం ఇచ్చిన సమస్య.

11 comments

ఆర్యులారా! ఈ క్రింది సమస్యను ఒకసారి ఆకాశవాణి విశాఖపట్టణం వారు పూరణార్థం 1965 లో ఇచ్చారండి. అప్పుడు నేను 9వ తరగతి చదువుతున్నాను.అప్పుడు నేను పూరించి పంపిన పూరణే మొట్టమొదట చదివారు. ఆ నాడు ఆ ఆకాశవాణిలో వచ్చిన నా పూరణ విన్న నాకు పద్య రచనా సక్తి  పెరిగిందండి. మా గురువు గారి హృదయంలో ఆవేళ్టి నుండే నాకు సుస్థిరమైన స్థానం ఏర్పడిందండి. అది నా జీవన గమనాన్నే మార్చేసిందండి.
ఆ సమస్యను  మీ ముందుంచుతున్నాను.
"కొడుకునకున్ కూతునిచ్చె కోమలి ముదిమిన్."
నాపూరణను వ్యాఖ్యలో చూడనగును.
మీపూరణలతో పాఠకులకానందప్రదులగుదురని ఆశిస్తున్నాను.
శుభమస్తు.
జైశ్రీరాం.
జైహింద్.

24, సెప్టెంబర్ 2011, శనివారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(దత్త పది5)

13 comments

ఆర్యులారా!
శ్రీ కట్టమూరి పూరించిన దత్తపదిని మీ  ముందుంచుతున్నాను.
"కరణము - వరణము - తరణము - చరణము".
స్వేచ్ఛా ఛందము లో రాముని గుణ గణములు వర్ణన.
ఈ దత్తపదికి నా పూరనము వ్యాఖ్యలో చూడవచ్చును.
మీ పూరణలతో పాఠకులనలరింపగలరు.
శుభమస్తు.
జైశ్రీరాం.
జైహింద్.

23, సెప్టెంబర్ 2011, శుక్రవారం

పండిత నేమాని వారు సూచించిన సమస్య మీ పూరణకై చూస్తోంది.

12 comments

ఆర్యులారా!
మన మార్గదర్శకులు పండిత నేమాని వారు ఒక చక్కని సమస్యను పూరణకై సూచించారు. అది మీ ముందుంచుతున్నాను.
"సొమ్ములు లేనిచో సుగుణ శోభలు చుల్కన కావె యేరికిన్"
ఎంతసునాయాసంగా యదార్థానికి దర్పణంగా ఉందో చూచారా ఈ సమస్య! వారికి ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను.
ఈ సమస్యకు నా పూరణను వ్యాఖ్యలో చూడనగును.
మీ పూరణలు పాఠకులకానందదాయకమై కవితాసక్తిని ప్రోత్సహిస్తాయని భావిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.

22, సెప్టెంబర్ 2011, గురువారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(దత్త పది4)

12 comments

ఆర్యులారా!
కట్టమూరి వారు పూరించిన దత్త పది మీ ముందుంచుతున్నాను.
"బాబూమోహన్ - బ్రహ్మానందం - కోట - ఆలీ"
విషయము:- పచ్చదనము పరిశుభ్రత.
కవిగారి పూరణము, నా పూరణము వ్యాఖ్యలలో చూడనగును.
మీ పూరణములతో పాఠకులకానందప్రదులగుదురని ఆశిస్తున్నాను.
శుభమస్తు.
జైశ్రీరాం.
జైహింద్.

21, సెప్టెంబర్ 2011, బుధవారం

1973లో రైలులో నేనెదుర్కొనిన సమస్య(పూరణార్థం)

8 comments

సాహితీ బంధువులారా!
నేను 1973 లో రైలులో ప్రయాణం చేస్తూ ఉంటే ప్రయాణీకులలో ఒకరు సాహితీ ప్రియులై ఉంటారు.  సాహితీ ప్రసంగం చేస్తూ ఒక సమస్యను పూరించడం కోసం ఇచ్చారు.  ఆ సమస్యకు నేనానాడే అక్కడే పూరణ చేసి వారికి వినిపించాను.
అది నేనిప్పుడు మీ  ముందుంచుతున్నాను.
"భామకు మీసముల్ మొలిచె. బాపురె! పూరుషుఁడూనె గర్భమున్"
నాపూరణమును వ్యాఖ్యలలో చూడనగును.
మీరు ఈ సమస్యను సునాయాసంగా పూరించ గలరని మీ పూరణ ద్వారా పాఠకులనలరింప చేస్తారనీ ఆశిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.

20, సెప్టెంబర్ 2011, మంగళవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(దత్త పది3)

12 comments

అంతర్జాల కవి పండితులారా!
నేడు కట్టమూరివారి కిచ్చిన దత్తపదినొక దానిని చూద్దాము.
"కట్ట - మూరి - చంద్ర - శేఖరా!"
రామాయణం ఇతి వృత్తంలో ఐచ్ఛిక వృత్తంలో పూరించవచ్చును.
కట్ట మూరి చంద్రశేఖర కవి యొక్క, నాయొక్క పూరణలను వ్యాఖ్యలో చూడ నగును.
మీరు మీ పూరణలతో పాఠకుల మనస్సులు ఆకట్టుకోండి.
జై శ్రీరాం.
జైహింద్.

19, సెప్టెంబర్ 2011, సోమవారం

మెఱుగుమిల్లి వారు ఇచ్చిన సమస్యా పూరణము

9 comments

ఆర్యులారా! శ్రీ మెఱుగుమిల్లి వేంకటేశ్వరులు సుప్రసిద్ధ ఉన్నత పాఠశాల ప్రథానోపాధ్యాయులు.
మంచి కవి.
వారు ఇచ్చిన సమస్యను మీ ముందుంచుతున్నాను. 
"నీతిని మట్టుబెట్టవలె  నేతలు పెద్దలు దేశభక్తులున్".
ఈ సమస్యను పూరించమంటే ఇది సమస్య కానే కాదు అన్నంత సునాయాసంగా మీరు పూరించ గలరని నా నమ్మకం.
మరింక ఆలస్యమెందుకు? పంపించేప్రయత్నంలో ఉండండి.
ఇక నా పూరణ వ్యాఖ్యానంలో చూడ నగును. 
జైశ్రీరాం.
జైహింద్.

18, సెప్టెంబర్ 2011, ఆదివారం

అవధాన ప్రక్రియలో నిషిద్ధాక్షరి 2

10 comments



సరస్వతీ నమస్తుభ్యం.
సాహితీ బంధువులారా!
ఇది వినండి.
1944లో పిసుపాటి చిదంబరశాస్త్రి గారు అవధానం చేస్తుండగా ఒక పృచ్ఛకుడు
మొదటి పాదంలో య, ర, ల, వ, శ, ష, స, హ, 
రెండో పాదంలో ప, ఫ, బ, భ, మ, 
మూడో పాదంలో త, థ, ద, ధ, న, 
నాలుగో పాదంలో క, ఖ, గ, ఘ, జ్ఞ... 
అక్షరాలు రాకుండా 
మత్తేభ ఛందస్సులో సరస్వతీ దేవిని వర్ణించమన్నాడు.

పిసుపాటి వారు దాన్ని అవలీలగా పూరించారిలా... .
'గణుతింతున్‌ మనమంది నుక్తిజననిన్‌ కాంతా మణిన్‌ జండధా
రణ హృత్సారస చంచరీక నవతారస్వైరసంచార, చ
ర్వణ బీయూష కరాభ్యుపేయ రుచపారం పర్య సంశోభ, గా
రణ భూతన్‌ వివిధ శ్రుతి స్మృతి విహారద్యోత మానస్థితిన్‌'

చూచారు కదా వారి పూరణము?
మీరూ రచనలో వారితో పోటీ పడే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నారని మీ పూర్వ పూరణలు ఋజువు చేస్తున్నాయి.మరెందుకాలస్యం. పూరించి మీ పూరణలద్వారా పాఠకాళికి సాహిత్యాభిలాష ద్విగుణీకృతం చెయ్యండి.
నా పూరణమును వ్యాఖ్యలో చూడ గలరు.
శుభమస్తు.
జైశ్రీరాం.
జైహింద్.

17, సెప్టెంబర్ 2011, శనివారం

అవధాన ప్రక్రియలో నిషిద్ధాక్షరి1.

8 comments

అవధాని మేడసాని మోహన్
ఆర్యులారా! అవధానంలో నిషిద్ధాక్షరి అన్నది అవధానిగారి రచనా పాటవాన్నికి పరీక్షగా నిలిచే ఒక  ప్రక్రియ.
నిషిద్ధాక్షరిలో పృచ్ఛకుడు ముందుగానే ఏయే అక్షరాలు నిషిద్ధమో నిర్దేశిస్తాడు.
ఉదాహరణకు, అవధాని మేడసాని మోహన్ గారిని ఒకసారి
"క, చ, ట, త, ప అనే అక్షరాలు లేకుండా సీతాకల్యాణం గురించి చెప్పండి" అన్నారు. ఆయన ఈ విధంగా చెప్పారు.
సరసనిధిరామభద్రుడు
ధరణిజ ఎదలోన మధుర ధారణుడయ్యెన్
సురలెల్ల హర్షమందిరి
విరాజమాన సువిలాస విభవమ్మెసగెన్.
ఎంత సునాయాసంగా చెప్పగలిగారో కదా! వారికి ఆ కల్యాణవేంకటేశ్వరుని అనుగ్రహము నిత్యమూ లభించాలని కోరుకొంటున్నాను.
ఈ పృచ్ఛకుని ప్రశ్నానుగుణంగా నా పూరణము వ్యాఖ్యలో చూడనగును.
మీరూ ప్రయత్నించి ఈ పృచ్ఛకుని నిషిద్ధాక్షరి ప్రశ్నకు చక్కని పూరణను చేసి మీ రచనా పాటవాన్ని పెంచుకోవడంతో పాటు పాఠకులకు తెలుగు భాష మీద ఉన్న గౌరవాన్ని ద్విగుణీకృతం చేసినవారవాలని ఆకాంక్షిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.

15, సెప్టెంబర్ 2011, గురువారం

పండిత నేమానివారిచ్చిన సమస్యాపూరణం చేద్దామా?

15 comments

మొదటి వ్యక్తే పండిత నేమాని 
ఆర్యులారా!
ఉద్దండ పండిత నేమాని రామ జీగి సన్యాసిరావు గారు మనలో కవితా పాటవం పెంచడానికి ఎంతో కృషి చేయదలిచారు.వారి అవ్యాజానురాగం మనకు ద్విగుణీకృతోత్సాహం కలిగిస్తోంది.  
వారికి నా ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను. 
పూరణార్థం వారు మనకు సూచించిన సమస్యను తిలకించండి. 
"భక్తి రసామృతమ్ము మన బ్లాగున పొంగు నిరంతరంబుగా"  
వారు ఈ సమస్యకు చేసిన పూరణమును వ్యాఖ్యలో చూడ వచ్చును
నాయొక్క పూరణమును కూడా వ్యాఖ్యలో ఉంచ గలను.
మీరు  మీ పూరణల ద్వారా పాఠకులకు ఆనందం కలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

14, సెప్టెంబర్ 2011, బుధవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(దత్త పది2)

15 comments

ఆర్యులారా! శ్రీ కట్తమూరి చంద్రశేఖరావధాని గారి యొక్క అమ్మమ్మ, తాతయ్య కూడా మహా పండితులే. పై చిత్తరువు వారిదే.చూచారు కదా? ఇక విషయానికొద్దాము. 
అవధాని చంద్రశేఖరం గారికి పూరణకై ఇచ్చిన  దత్తపదినొకదానిని చూచి పూరణ చేద్దాం.
"కంటే-వింటే-తింటే-ఉంటే"
రామాయణార్థంలో ఐచ్ఛిక ఛందస్సులో పూరణము చేయవలసి యున్నది.
ఈ దత్తపదికి నా పూరణను, అవధాని గారి పూరణను  వ్యాఖ్యలో చూడనగును.
మీ పూరణలతో పాఠకులకానందమందించ నున్న మీకు నా అభినందనలు.
జైశ్రీరాం.
జైహింద్.

13, సెప్టెంబర్ 2011, మంగళవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(దత్త పది1)

13 comments

ఆర్యులారా!
అవధానిగారు చేసిన అవధానములలో నేటి నుండీ దత్తపది - పూరణలను పరికించి  పూరించడానికి  మనమూ ప్రయత్నం చేద్దామా?
సరే ఈ రోజు దత్త పది.
క్రాంతి - శ్రాంతి - భ్రాంతి - శాంతి.
విషయం:- గాంధీ తాతను గూర్చి వర్ణనము.
మీరు మీ పూరణలతో పాఠకులనలరించగలరు.
నాయొక్క, అవధానిగారి యొక్క పూరణణలు వ్యాఖ్యలలో చూడనగును.  
జైశ్రీరాం.
జైహింద్.


12, సెప్టెంబర్ 2011, సోమవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ20)

15 comments

ఆర్యులారా! ఈ నాడు పూరణార్థం మన ముందుకు వచ్చిన సమస్య.
"కైలాసము వీడి యీడ కాపురముంటే? "
ఈ సమస్యకు అవధాని గారి పూరణమును, నా పూరణమును వ్యాఖ్యలలో చూడనగును.
మీ పూరణములతో పాఠకులనలరింప జేయ గలరని ఆశిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.

11, సెప్టెంబర్ 2011, ఆదివారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ19)

9 comments

ఆర్యులారా! ఈ నాడు అవధానిగారు పూరించిన మరొక సమస్యను చూద్దాము.
"కుక్షి ప్రోద్భవ నిష్ఠుర క్షుధిత దుష్క్రోధాంధకారంబునన్"
ఈ సమస్యకు అవధాని గారి యొక్క, నాయొక్క పూరణములను వ్యాఖ్యలలో చూడ నగును.
మీరు మీ భావనా పటిమతో ఈ సమస్యను పూరించి వ్యాఖ్యలద్వారా ప్రకటించి, తద్వారా పాఠకాళికి ఆనంద కారకులు అగుదురని ఆశిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్. 

10, సెప్టెంబర్ 2011, శనివారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ18)

23 comments

సుందరభావ సుశోభితు
లందరికీ వందనంబులార్యులు మీరల్
ముందున్న యా సమస్యను 
తొందరగా నింపి, పంపి, తోడు నిలుచుడీ!
"కానరారాతనికి సములైనవారు"
ఇదీ అవధాని చంద్రశేఖరం గారెదుర్కొనిన సమస్య.
మీరు  ఈ సమస్యను అద్భుతంగా పూరించి పాథకులకానంద కారకులై నాకూ సంతోషం కలిగిస్తారని నా నమ్మకం.
నాయొక్క, అవధాని గారి యొక్క పూరణలను వ్యాఖ్యలలో చూడనగును.
జైశ్రీరాం.
జైహింద్.

9, సెప్టెంబర్ 2011, శుక్రవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ17)

22 comments

ఆర్యులారా! అవధానిగారు ఎదుర్కొని పూరించిన సమస్యను పూరణార్థం మీ ముందుంచుతున్నాను.
"జనకుని పెండ్లి యాడుమని జానకి కోరెను ప్రేమ మూర్తియై."
ఈ సనస్యకు సంబంధించిన నాయొక్క, అవధాని గారి యొక్క పూరణములను వ్యాఖ్యలలో చూడనగును.
మీరు మీ పూరణలతో పాఠకులను అలరింప జేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
ధన్యవాదములు.
జైశ్రీరాం.
జైహింద్. 

8, సెప్టెంబర్ 2011, గురువారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ16)

18 comments


సలలిత సత్కవిత్వ విలసన్నిత పూజ్య కవీశ్వీంద్రులార! ధీ
కలితుఁడు కట్టమూరి గుణ గణ్యుడెదుర్కొని పూరణంబునుం
పలువురు మెచ్చ జేసిన సమస్యను మీకెఱిగింతు నిచ్చటన్. 
తెలివి ప్రకాశమౌనటుల దివ్య ప్రపూరణఁ జేసి పంపుడీ!
"రతి పతి సోదరుండు రతి రాజుగ వెల్గెను. చిత్రమున్నదే?"
దీనికి నా పూరణమును,
జ్ఞానాంభోనిధి యగు మన కవి పూరణమున్,
మానితముగ నుంచెద, వ్యా
ఖ్యానంబున. ప్రీతి తోడ కనుఁడది మీరల్. 
ధన్యవాదములు.
జైశ్రీరాం.
జైహింద్.

6, సెప్టెంబర్ 2011, మంగళవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ15)

15 comments

తేజో మూర్తులారా!
శ్రీమాన్ కట్టమూరి చంద్రశేఖరావధాని గార్కి ఒక అవధానంలో ఇచ్చిన సమస్యను మీ ముందుంచుతున్నాను.
"మానిని మానముం జెరచి మాన్యతఁ బొందె మహాత్ముడై, భళా!"
ఈ సమస్యకు నా పూరణను,
అవధానిగారి పూరణను వ్యాఖ్యలలో చూడ గలరు.
మీరు మీ అసాధారణ ప్రతిభా పాండిత్యాలు లోక విదితమయే లాగున ఈ సమస్యకు పూరణము చేసి వ్యాఖ్య ద్వారా పాఠకులకానందావహులగుదురని ఆశిస్తున్నాను.
శుభమస్తు.
జై శ్రీరాం.
జైహింద్. 

5, సెప్టెంబర్ 2011, సోమవారం

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సద్గుణ మూర్తులైన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు.

4 comments

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా త్రిమూర్తి స్వరూపులైన గురు దేవులకు 
నా హృదయ పూర్వక ప్రణామములు, 
శుభాకాంక్షలు.
భారత మాత భావి తమ భవ్య సుబోధనలందు నుండె. బో
ద్ ధారకు లైన మీ వలన తప్పక సద్గుణ పూజనీయులై
కారణ జన్ములా యనగ గౌరవ మొప్పగ సంచరించు పల్
ధీరులు భారతాంబ వినుతింప వెలుంగును శిష్య  కోటియై. 
భారతాంబ మెచ్చేవిధంగా సద్గుణ రాశులై యున్న మిమ్ములను ఆదర్శంగా తీసుకొని, మీ శిష్య పరంపర సద్గుణ తేజో మూర్తులై ప్రపంచ దేశలకే భారతావని ఆదర్శప్రాయంగా ఉండే విధంగా సమాజాన్ని తీర్చి దిద్ద గలరని ఆశిస్తూ, ఎంతో ఆశగా ఉపేక్షిస్తున్నాను.     నాలాంటి వారెందరో నాలాగా ఉపేక్షిస్తున్నారు.
మాకోరిక మీవలన తప్పక తీరుతుందని ఆశిస్తూ, మీరు భవ్య భారత సమాజ నిర్మాణానికి చేసే కృషికి అన్ని విధాలా పరమాత్మ అండగా ఉండాలని ఆశిస్తూ,    మరొక్క మారు పాదభివందనం చేస్తున్నాను. 
జైశ్రీరాం.
జైహింద్.   

4, సెప్టెంబర్ 2011, ఆదివారం

గురువంటే ఇలాగుండాలి (పెద్దల అభిప్రాయాలు)

21 comments

ఆర్యులారా!
ఉపాధ్యాయ దినోత్సవం వస్తున్న సందర్భంగా అనేకమంది అనుభవజ్ఞులయిన కవి పండితులు గురు శిష్యుల విషయంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను పద్య, గద్య రూపంలో ప్రకటించారు. గురువులు తమ మూర్తిమత్వానికి మెఱుగులు దిద్దుకోడానికి అవశ్యాచరణీయ యోగ్యమైన భావనలను వీరంతా వెలువరించారనడంలో సందేహం లేదు.
వాటిని చూద్దాం. 
పండిత నేమాని అన్నారు...
గురు శబ్దంబునకే యుదాహరణమై కూర్మిన్ ప్రకాశించుచున్,
సరసోత్సేకమయాంతరంగుడగుచున్ ఛాత్రాళికిన్ దైవమై
కర మొప్పారుచు, సాధు బోధనములన్ గావించుచున్, జ్ఞాన భా
స్కర బృందంబులుగా నొనర్చు గురు సంస్కారంబు నెన్నందగున్! 
వీరు గురువు అనే పదానికి చాలా అద్భుతమైన నిర్వచనాన్ని తప పద్యం ద్వారా వివరించడం సహృదయులైన గురువుల అదృష్టంగా భావిస్తున్నాను.
వీరే నన్ను ఉద్దేశించి మరొక పద్యం కూడా వ్రాసి నన్ను ఆశిర్వదించారు. అదీ ఇక్కడ చూద్దాము.   
అయ్యా!
గురులన్ మించిన విద్వదుత్తముడవై కొండంత లక్ష్యంబుతో
పరితోషంబున శిష్యకోటిని కళాపారీణులన్ జేసి భా
సుర యోగంబుల నొంది ఛాత్రులలరన్ శుద్ధాంతరంగమ్ములో
పరితృప్తింగని యొప్పు నీ సుగుణ శోభాదీప్తి వర్ధిల్లుతన్!
పండిత నేమాని రామ జోగి సన్యాసిరావు అవధాని వర్యుల అవ్యాజానురాగానికి పొంగిపోతూ వారికి  ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. 
మందాకిని గారు తమ అభిప్రాయాన్ని చక్కగా మన"కందం"గా వివరించారు. చూడండి.
గురువుల నుపదేశింపగ
గురువుల కేఁదగును.వారిఁ గొలువగఁ, దనపై
కరుణాదృక్కులఁ గొనుమని
దరిజేర వలయును. శిష్య ధర్మంబిదియే.
గురు ధర్మాన్ని నిర్వచింప తనకు అర్హత లేదని, శిష్యధర్మాన్ని చక్కగా వివరించారు మందాకిని గారు. ఓహో! ఎంతటి విధేయత!
చదువులు నేర్పుచు,శిష్యులు
ముదముగ నున్నత గతులును,మోక్షపు దారుల్
వెదకెడి పరిణతి నిత్తురు.
సదయులు గురువుల నుతింప శక్యమె మనకున్?
అని వ్రాసి తమ హృదయాన్ని ఆవిష్కరించారు.
తానే గురువైతే ఏం చేస్తారో అన్న విషయాన్ని వివరించడం ద్వారా గురువుకు నిర్వచనం చెపారు మందాకిని గారు.అదీ చూదండి.
ఆర్తిగ నేను నేర్పెదను, హాయిగ భీతులనెల్లవీడుచున్
నేర్తురు, పిల్లలందరిట నిత్యము నిష్ఠగ మక్కువెక్కువై
కీర్తులు కోరనెప్పుడును కీరపుఁ బల్కుల చిన్నవాండ్రకు
న్పూర్తిగ, నాశతీరగనుఁ, బొందుదు నేనిక నాత్మతృప్తినే.
కారుణమూర్తియై జనుల గౌరవభావనకాలవాలమై
ధీరగుణంబులన్ సరళ దృష్టినిఁ గల్గి సదానుకూలుఁడై
మారని శ్రద్ధతో గురువు మానక బోధలఁ పాఠనమ్ములన్ 
చేరిన శిష్యులందుఁదగు శీలగుణమ్ములఁ బెంచగాదగున్.
నిజంగా ఎంతటి ఔన్నత్యం తొణికిసలాడుతోందో చూచారా మందాకిని గారి అభిప్రాయంలో?
ఇంత చక్కటి వివరణ నిచ్చిన మందాకిని గారికి ధన్యవాదాలు తెలియ జేసుకొంటున్నాను.
రాఘవ అన్నారు...
సిద్ధం సత్సంప్రదాయే స్థిరధియమనఘం శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం
సత్త్వస్థం సత్యవాచం సమయనియతయా సాధువృత్త్యా సమేతమ్,
దమ్భాసూయాదిముఖ్యం జితవిషయగణం దీర్ఘబన్ధుం దయాళుం
స్ఖాలిత్యే శాసితారం స్వపరహితపరం దేశికం భూష్ణురీప్సేత్.
-- శ్రీశ్రీశ్రీ వేదాంతదేశికాచార్యులవారు.మన రాఘవ దేశికులకు ఉండవలసిన లక్షణాలను  శ్రీశ్రీశ్రీవేదాంత దేశికాచార్యులవారు చెప్పిన నిర్వచనాన్ని మనకందించారు.
ఎంత చక్కని నిర్వచనమిది!
దేశికులు(గురువులు) సత్సంప్రదాయసిద్ధి కలవారై ఉండాలి. సుస్థిర జ్ఞానులై యుండాలి. పాపరహితులై ఉండాలి. శ్రోత్రియులై ఉండాలి. సత్వము కలవాడై ఉండాలి. సత్యవాకై ఉండాలి. సమయ పాలకుఁడై ఉండాలి. సాధు ప్రవృత్తి కలవాఁడై ఉండాలి. దంభము, అసూయ మున్నగు వాటిని జయించినవాడై ఉండాలి. దీర్ఘ బంధువై ఉండాలి. దయాళువై ఉండాలి. స్వ పర హితుఁడై ఉండాలి.
ఒక ఉపాధ్యాయుఁడు గురువు అవాలి అంటే ఇన్ని సల్లక్షణాలూ ఉండి తీరవలసిందే. అట్టి గురువును శిష్యులు నిరతమూ ఆరాధించ వలసిందే. ఎంతటి చక్కని నిర్వచనము! 
ఇంతటి చక్కని శ్లోకాన్ని అందించిన చిరంజీవి ఆపరమాత్మ కృపామృతాన్ని గ్రోలుతూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

గోలి హనుమచ్ఛాస్త్రి అన్నారు...
గురువు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుని కన్న
మించి నట్టి వాడు; మంచి నెపుడు
నేర్పి యాచరించి నిష్ఠతో లోకాన
నిలువ వలయు, వెలుగు నీయ వలయు.
గురువనఁబడే వ్యక్తి త్రి మూర్తులకన్న నధికుఁడని, ఎప్పుడూ మంచినే తా నాచరిస్తూ, మంచినే నేర్పుతూ, నిష్ఠా గరిష్ఠుడై లోకంలో స్థిరుఁడవాలనీ, లోకానికి వెలుగు నీయాలనీ మన ప్రియ మిత్రులు శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రిగారు చిన్న ఆటవెలది పద్యంలో అనంతమైన భావాన్ని పొందుపరచి, వివరించారు.  
అల్పాక్షరములలో అనల్పార్థ రచన చేయగలిగేవాఁడే కవి అని మన ఆలంకారికుల వివరణ.
ఆ లెక్కన మన హనుమచ్ఛాస్త్రిగారు మన ముందున్న చక్కని కవి అనడంలో సందేహం లేదు. వారికి పరమాత్మతోడు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను.
మిస్సన్న అన్నారు...
విద్యార్థులను స్వంత బిడ్డలుగా నెంచి - బంగరు భవితకు బాట వేయు. 
మాతృ భాషను నేర్వ మమతను రగిలించి - అన్యభాషాసక్తి నాదరించు.
నీతిని, సఛ్ఛీల నిరతిని బోధించి - యుత్తమ పౌరులౌ యునికి తెలుపు. 
ఋజు మార్గ వర్తియై రేబవల్, బోధించు - మార్గాన చనియెడు మనికిఁ గలుగు.
అన్య ప్రవృత్తుల ననుసరింపక తన - వృత్తికి బద్ధుడై వెలయు చుండు. 
విద్య పరమార్థమును దెల్పి విశదముగను
భావి భారత పౌరుల పాలి దైవ 
సదృశుడై యొప్పు గురువెగా సద్గురువగు? 
కాని నాడా గురువు కొఱగాని బరువు. 
మన మిస్సన్న గారు కూడా గురువుకు ఉండవలసిన గురుతర బాధ్యతలను చక్కగా వివరించారు. అలా లేని నాడు అతఁడు గురువు కాదని, భూమికి బరువనీ నిష్కర్షగా చెప్పారు. కొంచెం నిష్టూరంగా ఉన్నా వీరి మాటలు యదార్థం.
మిస్సన్నగారికి ఆ పరమాత్మ అనుకూలుఁడై ఉండాలని ఆశిస్తున్నాను. 
శ్రీపతిశాస్త్రి అన్నారు...
శ్రీగురుభ్యోనమ:
మహానుభావులు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి సుమాంజలుల నర్పిస్తూ,ఆ మహనీయుని జయంతి సందర్భముగా నేటి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులందరకు శుభాకంక్షలు తెలియజేస్తున్నాను.
గురువై దేశపు పరువై
గురుతర బాధ్యతలనెపుడు గుర్తించుచు తాన్
పరవశమున పాఠములను
మురిపింపగజెప్పునట్టి మూర్తికి జేజే
బడినే గుడిగా దలచుచు
బడి పిల్లలె బిడ్డలనుచు వాత్సల్యముతో
బుడతల నడతలు దిద్దగ
నడుగిడు యొజ్జలకు భక్తి నంజలులిడుదున్.
శ్రీపతి శాస్త్రి గారు "గురువును గురువు కాదు అతఁడు దేశము యొక్క పరువు" అని చెప్పడంలోనే ఉంది గురువుకుండే బాధ్యత ఎంతటి మహత్తరమైనదోనన్న విషయం.అట్టి ఉపాధ్యాయులకు జేజేలుకొట్టారు మన కవి. అంతే కాదు. బడి పిల్లలకు మనస్పూర్తిగా విద్యాబోధన చేసే గురువులకు జేజేలు కొట్టుతున్నారు మన కవి. 
చాలా చక్కని గౌరవాన్ని ఇచ్చారు గురువులకు మన శాస్త్రి గారు.
వారికి నా అభినందనలను తెలియ చేసున్నాను.
గన్నవరపు నరసింహ మూర్తి చెప్పారు.
గురువుల యెడ భక్తి భావము మాకుంటుంది అని చెబితే మా ఊరిలో గురువులు ( టీచర్లు ) చాలా ఆశ్చర్యపోతారు.ఇక్కడ అంతా ఉద్యోగ ధర్మము,వ్యాపారమే గాని విశేష భావాలకు తావు లేదు. చక్కని గురువులు నాకు లభించారు. నేను అదృష్టవంతుడినే !
స్థిరమగు జ్ఞానసంపదలు శిష్యుల కిత్తురు పూని శ్రద్ధతో
గురుతర బాధ్యతల్ గొనుచు కోమలహృద్యులు దివ్యసద్గురుల్   
వరమది సద్గురుల్ గలుగ, వారిని గొల్చెడి శిష్యపాళియున్. 
పరమ పవిత్ర బంధ మిది, ప్రాకట మయ్యెగ పూజ్యభూమిలో !       
డా.గన్నవరపు నరసింహ మూర్తి గారు దివ్యమైన సద్గురువులు ఏమి చేస్తారో చెప్పడం ద్వారా ఏమి చెయ్యాలో చెప్పారు తమ పద్యం ద్వారా. భారతావనిపై గురు శిష్య పవిత్ర బంధాన్ని అద్భుతంగా వివరించారు.
వారి మనోహర భావనా సంపత్తిని అభినందిస్తున్నాను. 
ఇంకా ఇంకా అనేకమంది  తమ హృదయంలో గురువుకు గల అసాధారణమైన స్థానాన్ని గూర్చి, గుధర్మం వ్షయంలో తమ అభిప్రాయాలను ఎంతో చక్కగా వివరించి వ్రాసారు. అందరికీ నా కైమోడ్పులు.
గురుస్థానంలో ఉండి ప్రశంసింపఁ బడుతున్న ప్రతీ ఒక్క గురువుకూ నా హృదయ పూర్వక అభినందనలు, కైమోడ్పులు.
 జిగురు సత్యనారాయణ అన్నారు.
పంచ చామరం:
సునామి వంటి జీవితాన సూచి వోలె మారురా
జనాల శంకలన్ని తీర్చు జ్ఞాన దాత తానురా
మనాన ద్వేషమేమి లేని మంచి మానసంబు రా
ధనాల మించు విద్యలిచ్చు దాతయే గురుండురా
!
చిరంజీవి జిగురు సత్యనారాయణ మానవుని జీవనస్థితిని వివరించి, గురువు నిర్వహిస్తున్న పాత్రను చక్కగా వివరించారు. వారికి నా అభినందనలు. 
రేపే కదా గురు పూజా దినోత్సవము. శిష్య ప్రశిష్యాళిచే సద్గురువులందరూ పశంసింపఁబడి పూజింపఁ బడుదురు గాక. 
జైశ్రీరాం.
జైహింద్. 

3, సెప్టెంబర్ 2011, శనివారం

గురు దేవో భవ అని పూజింపబడటానికి గురువు ఎలాగుండాలంటారు?(నవ భారత నిర్మాణంలో గురువు పాత్ర.)

17 comments

ఆర్యులారా! సెప్టెంబరు ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం.
ఆచార్య దేవో భవ! అని అందరిచే ఆచార్యుఁడు గౌరవింప బడుతున్నాడు.
మన సమాజం ఎనలేని గౌరవాన్ని ప్రప్రథమంగా తల్లికి, పిదప తండ్రికి, ఆతరువాత గురువుకి ఇస్తోంది. ఇది చాలా సముచితం. ఎందు చేతనంటే విద్యార్థులకు జ్ఞాన జ్యోతులను తన మాటద్వారా, తమ అకళంక సత్ప్రవర్తన ద్వార్వా విద్యార్థులను తీర్చి దిద్దేదీ, జీవన మార్గాన్ని నిర్దేశించేదీ గురువే. అట్టి గురువు తల్లిదండ్రులతో పాటు గౌరవింపబడ వలసిందే.
ఈ సందర్భంగామీ అభిప్రాయాలను కూడా సమాజానికి పంచాలని అభిప్రాయపడుతున్నాను.
అట్టి అసాధారణ గౌరవం పొందడానికి ఆచార్యులు కలిగి ఉండ వలసిన అర్హతలను, అచార్యుని బాధ్యతలను వివరిస్తూ మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా పద్యాల రూపంలో గాని, వచన రూపంలో గాని వివరించండి. ఆచార్యులు అకళంక మూర్తులుగా వెలుగొందే మార్గం సూచించండి. 
ఇందు నిమిత్తము నేను మీకు ముందుగానే కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ14)

14 comments

కవి మిత్రులారా!
అవధాని గారికి సమస్యా పూరణ కొఱకిచ్చిన మరొక సమస్యను చూద్దాము.
"కరులు హిమాచల హరులను కారించె భళా!"
(కారించె = బాధ పెట్టెను) 
ఈ సమస్యకు నా పూరణమును, అవధానిగారి పూరణమును  వ్యాఖ్యలో ఉంచగలను.
మీరు మీ అమోఘమైన పూరణల ద్వారా పాఠకుల నలరింప జేయ గలనని ఆశిస్తున్నాను.
శుభమసు.
జై శ్రీరాం.
జైహింద్.

1, సెప్టెంబర్ 2011, గురువారం

వినాయక చతుర్ధి సందర్భంగా మీ అందరికీ నా శుభా కాంక్షలు. ( సమస్యా పూరణ.)

17 comments

వినాయక చతుర్ధి సందర్భంగా మీ అందరికీ నా శుభా కాంక్షలు. 
సహృదయ సాహితీ మిత్రులారా!
నిరతము సుఖ సంతోషము 
కరుణించి యొసంగు గాత గణనాధుఁడు మీ
సురుచిర దరహాసములను
స్థిర పరచుత.మీకు శుభము సేయుత కృపతో. 
ఈ శుభ సందర్భంలో మీ అందరికీ ఒక అపురూప వ్యక్తి శ్రీ పండిత నేమాని రామ జీగి సన్యాసిరావు గారు ఇచ్చిన ఒక సమస్యను మీ ముందుంచుతున్నాను.
"గణపతి సుముఖుండు కాడు కాడు చతుర్థిన్"
ఈ సమస్యను మీరు పూరించి అవధానిగారి ప్రశంసలనందడంతో పాటు పాఠకాళికి ఆనందం కలిగించ గలరని ఆశిస్తున్నాను.
శుభమస్తు.
జైశ్రీరాం.
జైహింద్.