గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, డిసెంబర్ 2008, శనివారం

యస్య చిత్తం ద్రవీభూతం....మేలిమి బంగారం మన సంస్కృతి 26

దయా స్వభావము యొక్క గొప్పతనము.
భక్తి భావంతో ముక్తి మార్గాన్ని వెదకుకొంటూ అనేక పూజాదికాలు చేసేవాళ్ళం మనలో చాలామందే వుంటాము. ముక్తి కోరే స్వభావం ఉన్నట్టయితే దాని కొఱకు మనం వెంపర్లాడే పని లేదు. దయా స్వభావం ఉంటే చాలు. ఈ విషయంలో ఒక చక్కని శ్లోకముంది. చూడండి.
శ్లో:-యస్య చిత్తం ద్రవీభూతం
కృపయా సర్వ జంతుషు
తస్య జ్ఞానేన మోక్షేణ
కిం జటా భస్మ లేపనైః

ఆ:-ప్రాణి కోటిని తన ప్రాణ మట్టుల జూచి,
జాలి నొందు వాని జన్మ జన్మ.
భక్తి తోడ తపము, భస్మానులేపంబు
లేల? ముక్తి గొలుప, జాలి చాలు.

భావము:-దయార్ద్ర హృదయ మున్నచో ముక్తి కొఱకై జప తపాదులు, విభూతి లేపనములు, జడలు కట్టేంతటి కఠోర తపములతో పని లేదు. ఆ అన్నింటినీ మించినది దయ. ఎవరు దయార్ద్ర హృదయులై బ్రతికున్నంత కాలమూ ప్రాణి కోటిపై దయకలిగి ప్రవర్తిస్తారో వారికి ముక్తి సుకరముగ లభించును.
మనలో అంతర్గతంగా ఉండే దయా స్వభావాన్ని వెలికి తీద్దామా మఱి?
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.