గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, మే 2010, సోమవారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 45.

0 comments

పారావారము ధారుణిం బుడిసిటం బట్టంగ సామర్థ్య సం
భరంబుండిన నుండవచ్చు నొనరింపం బోవ నేకైక దే
శారంభంబు ఫలంబునున్ క్రమముగా స్వాధీనమౌ గాని ద్రా
క్స్ఫారవ్యక్తము గావు సర్వ జగతీ సంసృష్టి సంహారముల్.
(శీ.వి.నా.రా.క.వృ.కి.కాం.నూ.స.1- 45)
సముద్రాన్నీ భూమినీ పిడికిలితో పట్టే సామర్థ్యం మనకు ఉంటే ఉండ వచ్చు. కాని ఒక కార్యము చేయడానికి మొదలుపెడితే ఆ పనిని విభాగించుకొని ఒక్కొక్కటిగా చేయలి. అప్పుడే దాని ఫలం మనకు లభిస్తుంది. ఈ సృష్టి మాత్రం ఒక్క సారిగా పుట్టిందా? ఒక్కసారే హటాత్తుహా మాయమయ్యేదా?
ఉద్విగ్న హృదయుఁడైయున్న శ్రీరాముని యందు కొంత స్తిమిత భావం ఉదయించినట్లు మనకు పై పద్యం ద్వారా తెలుస్తుంది.ఎంతగా సీతా విరహ దుఃఖితుఁడు అయినా  ఆయన తన ఆత్మ ధర్మమును వీడ లేదని గ్రహించ వచ్చును.
శ్రీరాముని సహజ స్వభావము ఎట్టిది? ఆయన వేద వేదాంగ తత్వజ్ఞుఁడు. మరియు నియతాత్ముఁడు. అదీనాత్ముఁడు. శత్రువునందు కూడా దయ చూపు స్వభావము కలవాఁడు.
అంతే కాదు.
విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియ దర్శినః.
కాలాగ్ని సదృశ్ః క్రోధే క్షమయా పృథివీ సమః.
శ్రీరాముఁడు పరాక్రమములో విష్ణువుతో, ప్రియ దర్శనములో చంద్రునితో, కోపమున ప్రళయాగ్నితో, ఓర్పున భూమితో పోల్చ దగిన వాఁడు.
నియతాత్మా మహా వీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ అని వాల్మీకము పేర్కొన్నది. నిశ్చయ స్వభావుఁడు. నిర్వికార స్వరూపుఁడు. స్వయం ప్రకాశ ప్రభావుఁడు. ప్రపంచమునే తన వశములో ఉంచుకొనిన సర్వేశ్వరుఁడు అని కీర్తింపఁ బడిన వాఁడు. (నియతాత్ములకే వశమగువాఁడు అని భావము.)
వాల్మీకము నందు వలెనే శ్రీరాముఁడు కల్ప వృక్షమునందు కూడా మానవుఁడు - దేవుఁడు అను రెండు భావములతోనూ కావ్య చమత్కార మార్గమున విశ్వనాథ అ పాత్రను తీర్చి దిద్దినాఁడు.
కల్ప వృక్షము లోని శ్రీరాముఁడు కొన్ని చోట్ల అచ్చము మన వలెనే ఒక సామాన్య మానవ మాత్రునిగా కనబడును. సుఖ దుఃఖములు లాభ నష్టములు యోగ వియోగములు కోప తాపములు శృంగార వీర కరుణ అద్భుత సన్నివేశములందు ఆయన ఒక సామాన్యుని వలె స్పందించును. అసామాన్యుని వలె కనిపించును. ఇట్లు తీర్చి దిద్దుట రస సాధన యందు ఒక భాగముగా విశ్వనాథ తలచెను. శ్రీరాముఁడు కేవలము నిర్వికార నిరంజన అవ్యయ సచ్చిదానంద పరమాత్మ స్వరూపముగా వర్ణించినచో రామాయణము కావ్యము కాకుండా పురాణము అయి ఉండెడిది.
కావున మహాకవి వాల్మీకి మార్గమును కొంత విస్త్రుతి పరచుచు శ్రీరాముని పాత్ర యందు పాఠకులకు ఆత్మీయత కలుగునట్లు చేసియున్నాఁడు. 
పంపా సరస్సు నందలి సమగ్ర సౌందర్యాన్ని  ఒక్క సారిగ చూచి మాటలతో చెప్పడానికి సాధ్యం కావడం లేదని మనస్సు ఒక్కొక్క వస్తువునే పరామర్శించుచున్నదని తలపోసిన శ్రీరాముఁడు ఇప్పుడు కార్య సాధన కూడా ఒక్కొక్క సోపానముగా జరుగ వలసి యున్నదని హఠాత్తుగా ఏదీ సంభవము కాదని ఆలోచన చేయుచున్నాఁడు.
సీతా విరహమునకాతరుఁడై దుఃఖితుఁడైన శ్రీరాముని యందు ఆ ఉద్విగ్న భావము శాంతించు చున్నప్పుడు స్వామిలో వివేక స్వరూపము ప్రకాశించుచుండుట మనము గమనింప వచ్చును. మాయావరణము తొలగినచో జ్ఞాన దర్శనమే కదా! మరియు శ్రీరాముని యందు ఈ చిత్త వృత్తియు తాత్కాలికమే. ఏమైనను పంపా సరోవర దర్శనమునందలి తన సౌందర్యానుభవ పరిధిరామునకొక గుణపాఠమై ఆయన యందు ఆవేశమునకు బదులుగా ఆలోచనను ప్రేరేపించినట్లు  విశ్వనాథ వ్రాయుట బహు సూక్ష్మమైన శిల్ప విశేషముగా మనం గ్రహించ వచ్చును.
జై శ్రీరాం.
చూచాం కదండీ కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు వారి ఉపన్యాసమునుండి నలుబది ఐదవ పద్యంలో గల భావుకతను. తరువాత పద్యం అతి త్వరలో తెలుసుకొందాం. 
జైహింద్

30, మే 2010, ఆదివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 94.

1 comments

శ్లోll
ముహూర్తమపి తం ప్రాజ్ఞః పండితం పర్యుపాస్యహి.
క్షిప్రం ధర్మ విజానాతి జిహ్వా సూప రసానివ.
తే.గీll
పండితులఁ జేరి క్షణమున ప్రాజ్ఞుఁడరయు
ధర్మ సూక్ష్మమ్మునిక్కము ధరణి పైన.
పులుసు రుచినొక్క క్షణములో తెలియు జిహ్వ. 
రసనమును పోలి ప్రాజ్ఞులు వసుధ నలరు.
భావము:-
ప్రాజ్ఞుఁడైనవాఁడు ఒక్కక్షణమే యైనను పండితుల సహవాసము చేసి;ధర్మమును తెలుసుకో గలుగు తున్నాఁడు. పులుసు రుచిని నాలుక ఎంతలో తెలుసుకొంటుంది.?
జైహింద్.

26, మే 2010, బుధవారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 44.

6 comments

కనులందున్ ఖగముల్ లతాంతములు వృక్షంబుల్ సరోవారియ
ల్లిన వల్లీ చయమున్ మృగంబులు సుమాళిన్ యౌగ పద్యంబుగా 
గ ననిర్వాచ్య మనోజ్ఞితా మధురిమల్ కల్పించు బోవాకొనన్ 
మనసొక్కొక్క మనోజ్ఞ వస్తువె పరామర్శింపగా గల్గెడిన్.
(వి.రా.క.వృ.కి.కా.నూ.స.1 - 44.)
సృష్టి అంతా సౌందర్యఖని. అది అనంతము. అనిర్వాచ్యము. కన్నులతో పక్షుల్నీ, తీగల ఆకుల్నీ, వృక్షాల్నీ, సరస్సు లోని నీరు, అల్లుకొన్న తీగల్నీ, మృగాల్నీ, పూవుల్నీ, ఇలా యౌగపద్యంగా అంటే ఒకదానితో ఒకటి కలసి ప్రకృతి అనిర్వాచ్యమైన సౌందర్య మాధుర్యాన్ని పంచుతున్నది. కాని నీ మనస్సు ఒక్కొక్క మనోజ్ఞ వస్తువును మాత్రమే పరామర్శింప జాలి యున్నది.
శోకార్తస్సాపి మే పంపా శోభతే చిత్ర కాననా - శోకార్తుఁడనైనప్పటికీ ఈ పంపా సరస్సు పరిసరాలు నాకు అందముగానే కనిపిస్తున్నవని మొదట పలికిన శ్రీరాముడు తత్తత్ప్రదేశములందలి సౌందర్య భరిత దృశ్యాలను ఆశ్వాదిస్తూనే సీతా వియోగియై పరితాపం పొందుతున్నాడు. ఈ విధంగా సృష్టి యొక్క సమగ్ర సౌందర్యము అంతా వివిక్తముగా కాకుండా సంసక్తము, అన్యోన్యాశ్రితము అని తన మాటలతో వ్యాఖ్యానించు చున్నాడు.     
శ్రీరాముఁడు సహస్రాక్షః సహస్ర పాత్. అని స్తుతింపఁ బడిన నారాయణుని అవతారమే అగు గాక. ప్రస్తుతము మానవుఁడై మానవ దృగింద్రియము యొక్క శక్తి పరిధిని తెలుపుచున్నాఁడు. కళ్ళతో ఒక దృశ్యమును చూచు సమయమునందు మరొక వస్తువును చూడ లేము. 
మృగముల స్వాభావిక చేష్టల్నీ వాని సౌందర్యమును చూచునపుడు లతలను పువ్వులను కాంచ లేము. అనగా మనస్సు ఒక్కొక్క మనోజ్ఞ వస్తువు నందలి సౌందర్యమునే చూచి ఆనందించ గలుగు చున్నది. కాని సౌందర్యము యొక్క సమగ్రతను ఆస్వాదించ లేకపోవు చున్నదని శ్రీరాముఁడు భావించెను. శ్రీరామునిలో ఈ సౌందర్య లాలసయే ఆయనను సీతా వియోగ దుఃఖము నుండి కొంత మరలించి జీవింపఁ జేసినది.
సృష్టి అంతయు పరస్పరాధారము. పరస్పరాధేయము అను విషయమును ఇంద్రియములయొక్క పరిధిని ఈ పద్యము వ్యంగ్యముగా తెలుపు చున్నది.
బహుశః మహా కవి విశ్వనాథ అవస్థయు ఇట్లే ఉన్నది కాబోలు. పంపా సరోవర సౌందర్యములను భిన్నభిన్న కోణముల నుండి దర్శించుచూ తత్తత్ మనోహరత్వమును వర్ణించుచూ, కవి తన రచన యందు అసంతృప్తుడు కావడం మనం గ్రహించ వచ్చు.
నిజమునకు విశ్వనాథ చేసిన కవితా రూప తపస్సు చేసిన వారు అరుదు.
సరస్వతీ కంఠాభరణములో భోజుడు వాక్కు యొక్క ఉచ్చారణ దశల్ని ఆలంబనగా చేసుకొనిసరస్వతిని ఇలా ప్రార్థించాడు.
ధ్వనిః వర్ణాః పదం వాక్యం ఇత్యాస్పద చతుష్టయం.
యస్యాః సూక్ష్మాది భేదేన వాగ్దేవీం తాం ఉపాస్మహే.
మూలాధారమునందు పరా వాక్కు అని పిలువబడేది నిర్వికారమైనది. అది నాభియందు పశ్యంతి అను పేరుతో వికారాన్ని పొందుతుంది. హృదయమునందు స్పందన రూపమైన వాక్కు పేరు మధ్యమ. కంఠమునందు ఉచ్చారణ స్థితిని పొందిన వాక్కు వైఖరి అంటారు. ఈ విధంగా పరా పశ్యంతి మధ్యమ వైఖరి నామాలతో నాలుగు స్థానములతో (ఆస్పద చతుష్టయా) సూక్ష్మ భేదాల్ని పొందుతున్న వాగ్దేవిని ఉపాసించు చున్నాము. అని భావం. మొదటి మూడు దశల్లో శారద నిర్వికార. నాల్గవ స్థానమున ఆమె సాకార.
ఇది ఇట్లుండగా విశ్వనాథ వాగ్దేవిని ఎట్లు సందర్శించ దలచినాడో ఎట్టి తపస్సు చేసినాడో చూడండి.
ఆరసి నిన్నునీరజ దళాంతర మోహన నిస్వనంబుగా 
కోరి యెఱింగితిన్. తెలిసికొన్న కొలందిగ నక్కటా నిరా
కార తపస్వి నిన్ను వినగావలె అట్టి నినున్  శరీర సం
స్కార బలంబునన్ వినుటెగాకను చూడగ గూడ నెంచెదన్.
(విశ్వనాథ)
అమ్మా! నిరాకార తపస్వీ! నువ్వు సహస్ర దళ కమల కోమల నిస్వనానివి (ధ్వనివి) అని నిన్ను తెలుసుకొన్నాను. ధ్వని రూపిణివైన నిన్ను వినాలి. అంతే కాదు ఈ శరీరముతోనే నిన్ను చూడాలని కూడా తలంచు చున్నాను.
పై పద్యం వల్ల సాహిత్య రూప యైన వాగ్దేవిని దర్శించుటకు ఆయన ఎంత తపించినాడో! ఆయన భావనా బల మెట్టిదియో మనకు కొంత వరకు తెలుస్తుంది. (కొంత వరకు మాత్రమే) విశ్వనాథ సాహిత్యాన్ని మనం జన్మాంతర సంస్కారం వల్ల తత్పుణ్యం వల్ల చదువుతున్నాము అని అనుకోవాలి.
ఆముక్త మాల్యదలో విష్ణు చిత్తుడు అతిథులకు షడ్రసోపేత భోజనము పెట్టుచు వారితో వినయాన్వితుడై
 "నాస్తి శాక బహుతా నాస్త్యుష్ణతా నాస్త్యపూపాః నాస్త్యోదన సౌష్టవంచ. కృపయా భోక్తవ్యం. "
( కూర ఎక్కువగా లేదు కాబోలు. వేడిగా లేదేమో, అరిసెలు చాల లేదేమో అన్నం ససిగా లేదేమో .దయతో భుజించండి. ) అంటాడుట.
ఆ మాటలు నిజం కాదు. అది విష్ణు చిత్తుని అతిథి సేవా సంస్కారం. 
విశ్వనాథ కూడా రసోచిత కవితా వ్యావృత్తిని అట్టివాడే.   
జైశ్రీరాం.
చూచాం కదండీ నలుబది నాల్గవ భాగాన్ని. తదుపరిప్ద్యం  అతి త్వరలో మీ ముందుంచ గలవాడను.
జైహింద్.

25, మే 2010, మంగళవారం

लॊकाभिरामम् श्रीरामम् भूयॊ भूयॊ नमाम्यहम्

4 comments

 Sri-Sita-Rama-Lakshmana-Han.gif image by siri_me
लॊकाभिरामम् श्रीरामम् भूयॊ भूयॊ नमाम्यहम्.
శ్లో:- 
రామం విశ్వమయం వందే -  బ్రహ్మ విష్ణు శివాత్మకమ్
శాంతం సనాతనం సత్యం -  చిదానంద పరాత్పరమ్.
ఆ:- 
శాంత సత్య సనాతన సచ్చిదాత్మ;
సంతతానందమయుఁడును; సకల మగు ప
రాత్పరుఁడు జగన్మయుఁడును; బ్రహ్మ విష్ణు
శంకరుండగు శ్రీరాము సన్నుతింతు.
భావము:-
శాంత స్వరూపునికి; సనాతనునికి; సత్యమైనవానికి; చిదానంద మూర్తియైన పరాత్పరునకు; బ్రహ్మ-విష్ణు మహేశ్వరులను త్రిమూర్తి స్వరూపునికి; విశ్వమంతటా వ్యాపించిన వానికి; రామునకు-నమస్కరింతును.
జైహింద్.

24, మే 2010, సోమవారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 43.

0 comments

సీ:-
ఒడ్డున నెత్తైన యుర్వీరుహమ్ముల వరుసల నీడలు వారు నెడలు
ఇంద్రనీలమ్ముల నెలవారు బురుజులై ఎఱ్ఱ కలువలు పూయు నెడల యందు
మాణిక్య తోరణ మండప వ్రజమునై పల్లటీల్ గొను చిన్ని పక్షి వితతి
గాలి కూగెడు పతాకా శ్రేణియయి పైడి తమ్మి పూదోట సౌధములు కాగ.
గీ:-
వరుణ దేవుని దుర్గ సౌభాగ్యమెల్ల  ప్రకటముగ జూపుచుండె పంపా సరస్సు.
తెల్ల తామర పూవుల దిమ్మలందు మధుకరీ గానములు ప్రేమ మధువు లూన.
(వి.స.నా.ర.క.వృ.కి.కా.నూ.స. 1 - 43.)
పంపా సరస్సు తీరముల వెంబడి ఎత్తైన వృక్షములు . అవి వరుసగా ఉండడం వల్ల ఆ సరస్సులో వాటి నీడలు ప్రతిఫలిస్తున్నవి. అవి ఇంద్ర నీలాలతో నిర్మించిన కోట బురుజుల వలె కన్పిస్తిన్నవి. ఎఱ్ఱ కలువ పూలు మాణిక్య తోరణములు వ్రేలాడు చున్న మండపాల వరుసల్లా ఉండగా చెట్లపైన ఈవలకు ఆవలకు ఎగురుచున్న చిన్ని పిట్టలు గాలి కూగుచున్న జెండాల సమూహంలాగ ఉంది. తెల్లని పద్మాల కాంతులు సౌధాల వలె ప్రకాశిస్తున్నవి.   వరుణ దేవుని దుర్గమును తలపింపఁ జేస్తున్నది. పంపా సరస్సు తెల్ల తామర పూల (కర్ణిక) దిమ్మలతో ఆడ తుమ్మెదల ఘుంకారములతో మధు పాన సంరంభములు సాగు చున్నవి.
ఇది ఒక అపూర్వ వర్ణనము. గొప్ప ప్రతిభావంతునకు కాని ఈ విధమైన కావ్య రచన సాధ్యము కాదు.
శ్రీ రాముని ప్రస్తుత స్థితి ఏమిటి? సీతా విరహ దందహ్యమాన హృదయుఁడు. ఇట్టి స్థితిలో శ్రీరాముఁడు పంపా సరోవర సౌందర్యమును చూచి ఆనందించుట ఏమి? ఇది అనౌచిత్యము కాదా అనిపించును.
జాగ్రత్తగా ఆలోచించినచో దీనికి సమన్వయము మనకు స్ఫురించును. లోకములో ఒకనికి గొప్ప కష్టము వచ్చినదనుకొందము. వాఁడు దుఃఖించి దుఃఖించి అదేకష్టమును తలచుకొని హృదయము బ్రద్దలై మరణించ వచ్చును. వానిని ఓదార్చువారు ఆ దుఃఖమును మరపింప జేయుటచే ఓదార్పు నిచ్చుటచే దుఃఖము యొక్క తీవ్రత తగ్గి కొద్ది నిమిషములు స్వాస్థ్యమును పొందు చున్నాఁడు. ఆ కొద్ది నిమిషములలోనే వాని ఇంద్రియములు పునః తేజోవంతములగుచున్నవి. అనగా దృష్టి మరల్చుట చేత దుఃఖము విశ్మృతిని బడు చున్నది. ఉపాధికి భంగము కలుగుట లేదు.
రవము సామాజిక నిష్ఠమనినారు కావున ప్రస్తుతము కావ్యము నాయకునియందు తాదాత్మ్యమును పొందిన కావ్య పాఠకునకు, ఈ విషాదము నుండి మనస్సు మరల్చుట అవసరమే. కావ్యమునందు రస్యమాన మగుచున్న సహృదయమున ఈ విచ్ఛిత్తి మరు క్షణమున కావ్య పాఠకునకు మరింత ఉత్సాహము నిచ్చును.
సరే .  అది అటుండనిండు.
పంపా సరస్సు శ్రీరామునికి అనవధిభూతమైన అనగా హద్దు లేని ఆనందమును కలిగించు చున్నది. సీతా వియోగమునే మరపించినది.
అరణ్య కాండమున విరాధుఁడు  శ్రీరామునితో సంభాషించుచూ ఈ పంపా సరస్సు సౌందర్యమును వర్ణించును. వారిని అక్కడకు పోయి తత్సమీపముననే ఉన్న సుగ్రీవుని స్నేహమును పొందుఁడని చెప్పెను. ఆ సందర్భమున విరాధుఁడిట్లనినాఁడు.
సాయాహ్నే విచరన్ రామ విటపీన్ మాల్య ధారణః.
శీతోదకంచ పంపాయా దృష్ట్వా శోకం విహాయసి.(వా.రా ౩ - ౨౦)
(రామా అందమైన సాయం సమయాలలో పంపా తీర వృక్షాలు పూల దండలు ధరించి నట్లు ఉంటాయి. ఆ వృక్షాలను, చల్లని నీరు గల పంపా తటాకాన్నీ చూసినచో నీవు నీ దుఃఖాన్ని మరిచిపోతావు.)
లోకోత్తర ప్రతిభావంతుఁడైన విశ్వనాథ వాల్మీకము చెప్పిన పంపా శీతోదక వైభవాన్నే కాకుండా పంపా సరస్సులో ప్రతిఫలించు చెట్లు నీడలు కోట బురుజులు గాను, ఎఱ్ఱ కలువల సమూహాన్ని మాణిక్య మండపాలుగాను, పక్షుల రాకపోకల ప్రతిఫలనములను పతాకా శ్రేణిగాను, శ్వేత పద్మ నికాయము సౌధము గాను, ఉత్ప్రేక్షించి రామునికి  దుఃఖం మరపింప గల అద్భుత సౌందర్యమును సృషించినాడు. కేవలము శీతోదకంచ పంపాయా అన్నది చాలదని కవి ఉద్దేశ్యము.
కావ్యం ఎలా ఉండాలో మన అలంకారికులు చెప్పారు.
అలంకృతం అసంక్షిప్తం రస భావ నిరంతరం. అంటూ కావ్యం అలంకారంతో అలంకరింపబడి ఉండాలి, మరీ చిన్నదిగా ఉండ రాదు. వర్ణనలతో విపులీకరించాలి; రసములు భావములతో ఒప్పుచుండవలెనని చెప్పి;
కావ్యం కల్పాంతర స్థాయి జాతయే సదలంకృతి. మంచి అలంకారములతో కూడిన కావ్యం కల్పాంతం వరకు స్థిరముగా ఉండునని వివరించారు.
విశ్వనాథ ఆ మార్గముననే నిలిచిన మహా కవి.
ఇక సీస పద్య రచనలోని సొగసు పరిశీలించండి. ప్రతి పదము లోని ఐదవ గణము నుండి ఎనిమిదవ గణము వరకు నాలుగు గణములు తరువాత పాదముతో అన్వయించుచుండును. గునుగు సీసము రచించుటలో నన్నయ తరువాత సిద్ధ హస్తుడు విశ్వనాథ.
ఇంకా కొన్ని విశేషములు పాఠకులకోసం వదలిపెట్టఁబడుచున్నవి.
జై శ్రీరాం.
చూచాం కదండీ ఈనాటి యీ 43 వ పద్యాన్ని అందలి భావుకతను. తరువాత భాగం తెలుసుకోవడం కోసం మరొక పర్యాయం కలుసుకొందాం. అంతవరకు సెలవా?
జైహింద్.      

11, మే 2010, మంగళవారం

మేలిమి బంగారంమన సంస్కృతి 93.

4 comments

http://haltonhelps.org/Tree%20hunt/Best%20orchard-fruit%20trees%20by%20Jackie%20Osmond%20Patrick.jpg
శ్లోll
ఛాయామన్యస్య కుర్వంతి తిష్ఠంతి స్వయ మాతపే.
ఫలాన్యzపి పరార్థాయ వృక్షాస్సత్పురుషాయివ.
గీll
ఎండలోవృక్షమెండుచు నితరులకది
నీడనిచ్చును. ఫలములు నేల వ్రాల్చు.
మంచివారిని పోలుచు మహిని వెలసి
తీయనైనట్టి పండ్లను తినగ నొసగు. 
భావము:-
వృక్షములు తాము ఎండలో ఎండుచూ ఇతరులకు నీడ నొసగుచున్నవి. అంతే గాక సత్పుషుల వలె తమ ఫలములను కూడా ఇతరులకే ఒసగుచున్నవి. ఈ శరీరము కలిగి యున్నందులకు నిస్వార్థముగా పరోపకారము చేయుటయేకదా సత్పురుష లక్షణము.
జైహింద్.

10, మే 2010, సోమవారం

దేవీ స్తుతి 13 / 13. (కాళిదాసు కృత అశ్వధాటికి ఆంధ్రానువాదము)

2 comments

http://amitkulkarni.info/pics/durga-puja-festival/images/durga-puja.jpg
శ్లో:-
ఇన్ధాన కీరమణి బన్ధా; భవే హృదయ బన్ధావతీవ రసికా;
సన్ధావతీ భువన సన్ధారణే ప్యమృత సన్ధా వుదార నిలయా!
గన్ధానుభావముహురన్ధాలి పీత కచ బన్ధా సమర్పయతు మే.
శంధాన భానుమపి రున్ధాన మాశు పద సంధానమప్యనుగతా! ౧౩.
సీ:-
ముచ్చటైన చిలుక ముంజేత కల తల్లి;
ప్రేమించు శివునిపై ప్రేమ కలది;
అమృతాబ్ధి వసియింప నమరి యున్నను గాని
శివుని భక్తులు గొల్వఁ జేయు జనని.
సుమ గంధ సాంద్రతన్ భ్రమరముల్ మత్తిల్లి
పడుటచే  కొప్పున పచ్చ గలది.
తన దివ్య తేజంబు దినకరు నెదిరించి
అతిశయింపగ నొప్పు నఖిల జనని.
గీ:-
అట్టి లోకైక జనయిత్రి దిట్ట తాను
ఆశు కవితల్ ప్రసాదింప నరసి నన్ను
శుభము సామర్థ్యమును గొల్పి యభయ మిచ్చి;
కాచి రక్షించు గావుత కరుణఁ జూపి.
భావము:-
ముచ్చటైన చిలుక ముంజేతిమీద ఉన్నదీ; ప్రేమ పాత్రుఁడైన శివుని పట్ల మిక్కిలి ప్రేమానురాగములు కలదీ; అమృత సముద్రంలో ఉత్తమ నివాసం ఉన్నప్పటికీ లోకం యొక్క చిత్తాన్ని ఈశ్వరాయత్తం చేయటంలో సన్నిహిత సంబంధం కలదీ; సుగంధ పరిమళాల ప్రభావం వల్ల మాటిమాటికీ కళ్ళు మూతలు పడిన తుమ్మెదల వల్ల పచ్చ బడిన గొప్ప కొప్పు కలదీ; తేజః ప్రభావం చేత సూర్యుని కూడా అడ్డగించేదీ; ఆశుకవితను ప్రసాదించటంలో తగిన పార్వతి శుభాన్ని; సామర్ధ్యాన్నీ నాకు అనుగ్రహించును గాక.
గీll
కాళిదాసు రచించిన ఘనతరమగు
అశ్వధాటిని తెనుగున కనువదించి
నాడ. చింతాన్వయుండ. నీ వాడ నమ్మ.
రామ కృష్ణుండ నో దేవి! ప్రేమ గనుమ. 14.
భావము:-
ఓ కాళికాదేవీ! కవి కుల గురువగు కాళిదాసు రచించిన అశ్వధాటి యను పేరఁ బరగిన దేవీ స్తుతిని చింతా రామ కృష్ణా రావు అనే పేరు గల నీ భక్తుడ నైన నేను తెలుగున పద్యములుగా అనువదించితిని. అట్టి నన్ను ప్రేమతో చూడుమమ్మా!
జైహింద్.

దేవీ స్తుతి 12 / 13. (కాళిదాసు కృత అశ్వధాటికి ఆంధ్రానువాదము)

2 comments

http://www.ilovehou.com/twonicknames/gifsite/1/wrynne/durga.gif
శ్లో:-
కూలాతిగామి భయ తూలావళి జ్వలన కీలా;  నిజ స్తుతి విధా;
కోలాహల క్షపిత కాలామరీ కుశల కీలాల పోషణ నభా!
స్థూలా కుచే; జలద నీలా కచే; కలిత లీలా కదంబ విపినే;
శూలాయుధ ప్రణతి శీలా; విభాతు హృది శైలాధి రాజ తనయా! ౧౨.
సీ:-
వృద్ధియౌ భయ తూల హద్దులు మీరిన 
గద్దించి కాల్చెడి వృద్ధ మాత.
స్తోత్ర పద్ధతికల స్తుత. కలఁగు సతుల
క్షేమంబు నిడఁ గూర్చు శివుని రాణి.
స్తన భరంబున నొప్పు; ఘన నీల కురులొప్పు;
జన వాక్యములనొప్పు జనని హైమ.
కడిమి తోపులలోన గంభీరముగ తాను
కలయ తిరుగు భక్త కల్ప వల్లి.
గీ:-
చాల భక్తిగ తన పతి శూలి కెలమి
వందనంబులు చేసెడి సుందరాత్మ.
అట్టి హేమాద్రి కన్యక పట్టు పట్టి
నన్ను వర్థిల్లఁ జేయుత మిన్న గాను.
భావము:-
హద్దు మీరిన మిక్కిలి భయమనే దూది రాశులకు అగ్ని శిఖ వంటిది. తన యొక్క స్తోత్ర పద్ధతి కలదీ; కష్టాల కలఁకతో కాలం గడిపిన దేవతా స్త్రీలకు క్షేమమనే నీటిని వృద్ధిపరచే శ్రావణ మేఘం లాంతిదీ; స్తన విషయంలో భారం కలదీ; కురుల విషయంలో మేఘాల వలె నల్లనైనదీ; కడిమి చెట్ల తోపులో విహారం కలదీ; శూలాన్ని ఆయుధంగా ధరించే శివునికి నమస్కరించే మంచి నడవడి గలదీ ఐన హిమవంతుని కూతుర్తె ఐన హైమవతి నా హృదయంలో వెలుగొందు గాక.
జైహింద్.

8, మే 2010, శనివారం

మాతృ పూజా దినోత్సవము. శ్రీ దుగ్గిరాల వారి అమ్మ ప్రేమ.

7 comments

http://www.samputi.com/app_images/badi/letters/27_0.jpg
అమ్మ 
శ్రీ దుగ్గిరాల రామారావు గారు దశాధిక గ్రంథ కర్త. 
సుప్రసిద్ధ కవి కవివరేణ్యులు.
ఈ మహా కవి రచించిన అమృత కలశం అనే కవితా సంపుటిని వారి మాతృ మూర్తి ఐన శ్రీమతి సత్యవతిగారికి అంకితమిస్తూ వ్రాసిన పద్యములు  వారి హృదయాంతరాళాలనుండి పొంగి పొరలుకొని వచ్చిన మాతృభక్తిసుధ.
తనను  గనిన ఆ తల్లిపై తనకు గల కృతజ్ఞతా భావాన్ని  ఈ విధంగా కవి పద్యాలలో   వ్యక్తం చేసి ఋణం తీర్చుకున్నారు..
ఇప్పుడా పద్యాలను చూద్దాం.
చ:-
వనితల యందు చెప్పఁ దగు వట్టి యమాయకురాలు. పాండితీ 
ధనుఁడగు ప్రాణ నాథుని పదమ్ములు నమ్మిన సాధ్వి, వజ్రపున్
ధునుకల బిడ్డలన్ గనిన తొయ్యలి, సత్యవతీ సతీమత
ల్లిని ననుఁ గన్న తల్లి నలరించెదఁ పద్య సుమాల పూజచే.
సీ:-
మాయమ్మ చూపు టాప్యాయంపుఁ దోఁపులో
జిఱునవ్వు కోయిలల్ తిరుగుచుండు.
మాయమ్మ కంఠమ్ము మధు రసమ్ములు చిమ్ము 
కమ్మని మాటలు గ్రుమ్మరించు,
మాయమ్మ పొత్తిళ్ళు రాయంచ పరుపుటు
య్యాలతో గవిసి కయ్యాలు చేయు,
మాయమ్మ హృదయము రేయెండలో నెండి 
యమృతమ్ములో స్నాన మాడుచుండు.
తే.గీ:-
మా జనని ప్రేమయను సన్న జాజి మొక్క 
ముద్దు లొలికించదగు నేడు పూలు పూసె.
నా మహాసాధ్వి యొడి లోన నాటలాడి
పులకరించెను నా పూర్వ పుణ్య చయము.
సీ:-
నవమాసములు మోసి ననుఁ గన్నపుడు జాలి 
పుట్టకెంతగఁ గష్ట పెట్టినానొ;
పోరు పెట్టుచు నిద్ర పోకుండ నిశి యెల్ల 
విసిగించి యెంతేడిపించినానొ;
తగని యల్లరి చేసి జగడమ్ములను దెచ్చి
పెట్టి తన్నెంత నొప్పించినానొ;
చెలులతో నాటకై చిఱు తిండి వస్తువుల్
తెమ్మంచు నెంత వేధించినానొ;
తే.గీ.:-
అన్నిటికి నోర్చి తన కృపాపాంగ దృష్టిఁ
జిలికి నన్నింతవానిగాఁ జేసెనమ్మ.
తనకు ఋణపడి యుంటఁ తధ్యమ్ము కాని 
దానిఁ జెల్లించుకొనఁగ నా తరము కాదు.
సీ:-
నా కవిత్వ ప్రసూన వనమ్ము లోని మ
ల్లెల పూల గుత్తి నీ మొలక నవ్వు.
నా కావ్య నాళీక నవ పరీమళ మహో
జ్వలత నీ వాత్సల్య సౌరభమ్ము.
నా హృద్య పద్య సందోహ మోహన శబ్ద
జాలమ్ము నీ కటాక్షముల చలువ.
నా రసోచిత గ్రంథ సారామృత సువర్ణ
కలశమ్ము నీ వచో విలసనమ్ము;
తే.గీ:-
నా మనోగత మృదు మనోజ్ఞ ప్రసన్న 
భావ మధురిమ నీ చనుబాల తీపి.
నా సుకవి జీవితమ్మెల్ల నన్ను గన్న
తల్లి! నీ చేతి గోరు ముద్దల బలమ్ము.
ఉ:-
ఎల్లరు చుట్టముల్ చెలులు నెన్నఁ బ్రయోజకులైరి తల్లి! నీ
పిల్లలు వారి పిల్లలును; పిల్లలు జల్లలతోఁ గులమ్ము వ
ర్థిల్లెను దోస తోట వలె; దీనికి నంతకు మూలమైన నీ
చల్లని చూపు వజ్ర కవచమ్మయి మమ్ము నిశమ్ముఁ గాచుతన్.
చూచారు కదండీ! అమ్మ పై తనకు గల భావనయే కవి హృదయపు లోతుల్లోనుండి పొంగి పొరలి వచ్చిన కవితాఝరిని.
ఆ:-
అమ్మ నొక్క వంక నమృతమ్ము నొక వంక
నమరఁ జేసి యెద్ది యధిక మనిన
అమ్మ గొప్పదంచు నను గాదె సర్వ జీ
వమ్ము లిలను. అమృతమమ్మయనును.
అటువంటి అమ్మను గౌరవిస్తూ ఆమె ఆశీశ్శులందుకొంటూ అందరూ ఆనంద మయ జీవన మందుకోవాలని ఆశిస్తూ అమ్మకు శత సహస్రాధిక వందనము లాచరిస్తున్నాను.
జైహింద్.

దేవీ స్తుతి 11 / 13. (కాళిదాసు కృత అశ్వధాటికి ఆంధ్రానువాదము)

1 comments

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiURbya-caI9g-Enyyb6oL8ulSfCdKgRupnFGbXSWVD5fNKZcE16l3vI5ezIZwI6rTNVZqiPawXupJLU_igYRhK2n0KUI1FqvXxz9OURo7Wz-0UE7f1L7oNNwNRrr3G7nzYMil1nYOPrpU/s320/kanchi_kamakshi.jpg
శ్లో:-
యత్రాశయో లగతి తత్రాగజా వసతు కుత్రాపి నిస్తుల శుకా
సుత్రామ కాల ముఖ సత్రాసక ప్రకర సుత్రాణ కారి చరణా 
ఛత్రానిలాతిరయ పత్త్రాభిరామ గుణ మిత్రా మరీ సమ వధూః
కుత్రాసహీన మణి చిత్రాకృతి స్ఫురిత పుత్రాది దాన నిపుణా! ౧౧.
సీ:-
భయపడే యింద్రాది భక్తులను కాచేటి 
పాదారవింద; ప్రమోద జనని.
ఛత్రానిలము చేత సమధికవేగంబు 
గలిగిన రథమును కలుగు తల్లి;
దేవతాంగనతుల్య దివ్య లక్షణ యుక్త
వనితలే చెలియలై వరలు తల్లి;
నిర్భయ నిరుపమ నిపుణులౌ పుత్రుల;
నితరమౌ సంపదలిచ్చు తల్లి;
గీ:-
రాచిలుక దాల్చు పార్వతి బ్రోచు ననుచు
భక్తి భావాన సేవించు భక్త జనుల
మానసంబుల నిరతంబు మసలు గాక.
మాదు హృదయాల జగదంబ మసలు గాక.
భావము:-
ఇంద్రుఁడు; యముఁడు మొదలైన భయపడి యున్నవారి సమూహాన్ని సమర్ధవంతంగా రక్షించే పాదాలు కలదీ; గొడుగు యొక్క గాలిచేత పెరిగిన వేగం గల వాహనం గలదీ; మనోజ్ఞమైన లక్షణాలు గల చెలులైన దేవతా స్త్రీలతో సమానమైన వనితలు గలదీ; నింద్యమైనభయం లేని రత్నాల బొమ్మల వంటి ఆకారం గల ప్రకాశించే  ( చెడ్డదైన భయాన్ని ధ్వంసం చేసే ఉత్తములైన చిత్రమైన స్వరూపంతో ముద్దులొలికే)పుత్ర సంతానాన్ని ఇంకా ఇతర సంపదలను; ప్రసాదించుటలో సామర్ధ్యం కలదీ; అయిన సాటి లేని చిలుకలతో కూడిన అందమైన పార్వతీ దేవి ఎచ్చటైతే ఆమె హృదయం లగ్నమై యుండునో అక్కడ మరెక్కడైనా ఉండును గాక.
జైహింద్.

7, మే 2010, శుక్రవారం

దేవీ స్తుతి 10 / 13. (కాళిదాసు కృత అశ్వధాటికి ఆంధ్రానువాదము)

1 comments

http://maavaishno.files.wordpress.com/2009/01/hindu-goddess-devi-durga-maa-photo-00076.jpg
శ్లో:-
వందారు లోక వర సందయినీ విమల కుందావదాత రదనా!
బృందార బృంద మణి బృందారవింద మకరందాభిషిక్త చరణా!
మందానిలా కలిత మందారదామభి రమందాభిరామ మకుటా!
మందాకినీ జవన భిందాన వాచ మరవిం దాసనా దిశతు మే!  ౧౦.
సీ:-
వందనంబులు చేయు వర భక్త జనులకు
వరములనిచ్చెడి పార్వతమ్మ;
తెల్లనయిన బొండు మల్లెల పోలెడి 
దంతముల్ గలిగిన దక్ష కన్య.
దేవతల్ తలపూల దివ్య మరందమున్
అభిషిక్తమైనట్టి యద్భుత పద.
పిల్లగాలుల చేత చల్లగా కూర్చిన
మందారపు కిరీట మహిత జనని.
గీ:-
పద్మ మాసనమై యున్న భవుని రాణి;
వేగ మాకాశ గంగకు వేయి రెట్లు 
అధికమైనట్టి వాగ్ధాటి నమరఁ జేసి
నన్ను రక్షించి గాచుత సన్నుతముగ. 
భావము:-
నమస్కరించే భక్త జనానికి వరములిచ్చేదీ; నిర్మలమైన బొండు మల్లెల వంటి తెల్లటి పలు వరుస కలదీ; దేవతా సమూహపు కిరీట రత్న సమూహంతో ఉన్న పద్మాలలోని పూ తేనెలతో అభిషేకించబడిన పాదాలు కలదీ; పిల్ల గాలుల చేత చక్కగా కూర్చిన మందార పూల మాలికలతో మిక్కిలి మనోహరమైన కిరీటం గలదీ; పద్మమునాసనముగా గలదీ ఐన జగన్మాత ఆకాశ గంగ యొక్క వేగాన్ని అధిగమించే వాకును నాకు ఇచ్చును గాక. 
జైహింద్.

6, మే 2010, గురువారం

సన్మార్గులకు కన్నతల్లినైన నేను దుర్మార్గుల పట్ల భద్రకాళిని.

8 comments

http://www1.sulekha.com/mstore/ashishdimri/albums/default/Hindu-Goddess-Devi-Durga-Maa-Photo-0046.jpg
ఉ:-
శ్రీ గుణ గణ్యమైన కులశీలములొప్పెడి మానవాళిలో
రాగ విదూరులున్; కలుష రాక్షస దుర్గుణ దుష్ఠ శీలురున్
భోగ విలోలురున్; పురుష భోగ విష జ్వలనాభి శీలురున్.
ఏగతి పుట్టుచుండిరొకొ! ఈశ్వరునాన సహింప నేనికన్. 1.
అశ్వ ధాటి:-
దుర్మార్గు లీ జగతి ధర్మాత్ములన్ మిగుల మర్మంబుతో నిడుమలన్
కర్మంబులం గొలిపి నిర్మూలనం బవగ భర్మాపహార మతులై
కూర్మిన్మదిన్ విడిచి పేర్మిన్ వసించు. గని ధర్మంబు నే నిలిపగా
నిర్మూలనం బవగ మర్మాత్ములన్ దునిమి పేర్మిన్ భువిన్ నిలుపుదున్. 2.
ఉ:-
రక్త పిపాసులీజగతి రాజిలు చుండిరి చూచు చుంటి. నే
శక్తిని. కాళికాకృతిని. శాంభవి నేను. సహింప రాని మీ
యుక్తి కుయుక్తులన్ గనితి. యూరక చూచుచు నుండ బోను. నా
భక్తుల కావ మిమ్ములను భస్మము చేసెద  నిశ్చితంబుగన్. 3.
చ:-
జననికి మారు రూపముగ; చక్కని యక్కగ; చెల్లెలం బలెన్
వినయము దోప పల్కు తరి వింతగ నా కుల కాంతలన్ మహిన్ 
కనులను కామరూపిణిగ కాంచెడి  వారి నుపేక్ష సేయ నీ
గునపము తోడ చీల్చెదను. గ్రుడ్లను నే పెకలించి వేసెదన్. 4.
ఉ:-
ఎంతటి పాప కర్మముల నేమియు చింత యొకింత లేక క
వ్వింతల తోడ చేయుదురె విజ్ఞులు చింతిల? యెంత వింత? నే
సాంతము గాంచు చుంటి. సరసత్వము వీడు పశు ప్రవృత్తులన్
గొంతులు నొక్కి చంపెదను  ఘోర దురాకృత దుష్ప్రవృత్తనై. 5.
చ:-
చిఱు చిఱు బాలురన్; మరియు చిన్నరి పాపల దొంగిలించి; యా
చిఱుతల బాంధవాళి కడు చింతిల లక్షల నాశ చేయుచున్
కఱకు మనమ్ముతో శిశుల కాపదఁ గొల్పెడి దుర్విదగ్థులన్
మఱి మఱి పట్టి చంపెదను. మానవ జాతిని కాచెదన్ గృపన్. 6.
ఉ:-
దుర్మతు లెల్ల యీ జగతి దుస్థితి మూలము. వారి నందరిన్
మర్మములందు కారముల మంటలు గొల్పుదు. కాల్చివేతు. యే
మర్మ మెఱుంగనట్టి గుణ మాన్యుల కెగ్గులు సేయువారలన్
ధర్మ విరుద్ధ వర్తులను తప్పక చంపుదు. చూచు చుండుడీ! 7. 

మ:-



కసభుక్కుల్ ప్రభవించినారు జగతిన్ కాంక్షించు చుండెన్ సదా
మసిచేయంగను మానవాళినిలపై మన్నింప రానట్టియా
కసభుక్జాతినిమట్టు పెట్టెదను నే.  కాఠిన్యమున్ జూపుచున్న్
అసి ఘాతంబుల ఖండఖండములుగా యా దుష్టులన్ ద్రుంచెదన్. 8.
చ:-
సుగుణ విరాజమానులను; సుందర భాసుర భావ తేజులన్;
ప్రగణిత దేశ భక్తులను; బండన రంగ విరాజపూజ్యులన్
మగువల మాన రక్షకుల; మంచిగ నుండెడి యెల్ల వారలన్


ప్రగణిత రీతి గాచెదను. భక్త జనావళి నెన్ని బ్రోచెదన్. 9.





సీ:-



సర్వ మంగళ నేను సద్గుణ గణ్యుల 
సర్వత్ర గాచెద సమయ మెఱిగి;
దుర్వర్తులను గాంచి గర్వాపహారంబు
నిర్వహించెదనేను నిశ్చయముగ;
పర్వంబులను గూర్తు గర్వింపగను చేతు
సర్వార్థములు గూర్తు సజ్జనులకు;
సర్వత్ర  గనక నన్ గర్వించి యెదిరించు
గర్వాంధులన్ బట్టి కాల రాతు.
గీ:-
సర్వులందున నేనుంటి చక్కఁ గనిన.
దుర్విదగ్ధులు కనలేరు; తుచ్ఛమైన
గర్వమును పొంది దురితముల్ కలుగఁ జేయు.
నిర్వహింతుస్వధర్మమ్ము. నిజముఁ గనుడు. 10. 

జైహింద్.


5, మే 2010, బుధవారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత.40; 41&42

1 comments

http://www.teluguworld.org/Images/viswanatha.gif
ఆ:-
బిగిసి కొయ్య బారు వేలుపు పగతుర 
యందు సురభిమాస మనుచు లేదు.
తరులలోన గాలి దారి గగుర్పాటు 
మొలకలే వసంత ముగ్ధ సుషమ.( క.సా.వి.స.రా.క.వృ.కి.కా.నూ.స. 1 - 40)
ఉ:-
క్రిందికి వ్రేలు హారమును కేవలమున్ కుడి మూపునన్ జనన్
మందిత రశ్మి సప్త ఋషి మండలమట్లుగ స్వేద బిందు ని
స్పందము స్వేత వారిద లవంబులు గాగను దీర్ఘ చైత్ర మా
స్సుందర యామినీ గగన శోభను తత్ ప్రియ కేళి నెన్నెదన్.   
( క.సా.వి.స.రా.క.వృ.నూ.స. 1 - 41)
ఆ:-
ఎగిరి పోవు దాక నిది కొంగ యో తమ్మి
మొగుడు పూవొ తెలియ బోక యుండ
గుమ్ము గాగ నున్న గొడుగాకులకు మధ్య 
భంగపెట్టి కొంగ దొంగ తబిసి.(క.సా.వి.స.రా.క.వృ.కి.కా.నూ.స. 1-42)
కర్కశ హృదయులై అనుభూతి రాహిత్యం గల రాక్షసుల యందు వసంతమను మాటే లేదు. అడవి లోని చెట్లై యున్నను వసంత కాలమునందలి గాలికే గగుర్పాటు (పులకించి)పొంది (మొలక లనెడి పులకలతో) ఆనందించు చున్నవి.
చెట్లు అడవిలో జన్మించినవి. కాని వాటి హృదయము వసంతపు వాయు స్పర్శకే పులకించు చున్నది. నాగరికమైన జన్మ ఎత్తితి మనుకొన్న వారిలో చాల మందికి వసంతమే లేదు. కర్కశ భావములు పెంపొందించుకొన్న హృదయమే రాక్షస హృదయము కదా! 
ఇక్కడ శ్రీరాముఁడు చిగురాకుల నైగనిగ్యముతో ప్రకాశించుచున్న వనీ తరువులను చూచి పరవశించు చున్నాఁడు. అంతలోనే రావణ స్మృతి తగిలి రాక్షస జాతి అనుభూతి లేని వట్టి శిలా సదృశ జాతి అని వ్యాఖ్యానించును. దానినే కొయ్యబారిన హృదయాలు అనినాడు. కొయ్య అనగా ప్రాణహీనమైన దినుసు కదా.
వసంత కాలపు మలయ పవనము శ్రీరాముని ఎంత చలింప జేయుచున్నదో శ్రీరాముని మాటల వలన మనకు విశదమగును. శ్రీరాముడు ఈ వసంతమును ఇట్లు నిర్ధారించుటకు ఆధారమన దగిన వాల్మీకి శ్లోకాలను పరిశీలిద్దాం.  
వసంతో యది తత్రాపి  యత్రమే వసతి ప్రియా 
నూనంపరవశా సీతా సాపి శోచత్యహం యథా!
(నా ప్రియురాలైన సీత యిపుడు వసించుచున్న చోట వసంత మున్నచో ఆమె కూడా పరవశురాలై నాలాగే దుఃఖిస్తూ ఉండి యుంటుంది)
శ్యామా పద్మపలాశాక్షీ మృదు భాషాచ మే ప్రియా! 
నూనం వసంత మాసాద్య పరిత్యక్ష్యతి జీవితం.
(యౌవనవతి; పద్మ నేత్రి; మృదు భాషిణి ఐన నా సీత అసలు ఈ వసంత ప్రభావానికి ప్రాణాలే విడుస్తుంది; తప్పదు.)
పై రెండు శ్లోకముల వలన ప్రతి క్షణం గుర్తుకు వస్తున్న సీతా స్మృతి చేత శ్రీరాముఁడు పొందుతున్న విహ్వలత; మరియు ఆమెపై గల ప్రేమానురాగములు తెల్లమవుతున్నవి. దీనికి అనుబంధముగా విశ్వనాథ రాక్షస జాతి యొక్క కర్కశ హృదయాన్ని శ్రీరాముఁడు నిందించుచున్నట్లు వర్ణించి క్రొత్త అందమును సమకూర్చినాఁడు.
నలుబదిఒకటవ పద్యమున రాముఁడు తన దాంపత్య జీవిత వ్యక్తిగతానుభూతిని ప్రకృతిని గాంచి స్మరించుకొన్నాడు.  
పిదప రాముని చూపు పంపా సరోవరముపై బడినది. పెద్దపెద్ద తామరాకుల మధ్య దాగి యుండి తామర మొగ్గ వలె భంగిమ పెట్టి కొంగ నిలబడి యున్నది. అది తామర మొగ్గో; కొంగో తెలియనట్లు నిలిచినది. చేప కనబడగానే అది తన తపస్సును కట్టిపెట్టి దానిని పట్టుకొని హటాత్తుగా ఎగిరిపోయినది. శ్రీరాముఁడు దానిని దొంగ తబిసి అనినాఁడు. కొంగ యొక్క చర్య వలన శ్రీరామునకు రావణ వృత్తాంతమే జ్ఞప్తికి వచ్చినది. కొంగ వ్యాజమును రావణుని దుశ్చేష్టను నిరసించుచున్నాఁడు. రావణుఁడు కూడా కపట యోగిగానే వచ్చినాఁడు కదా! 
చాలా సూక్ష్మముగా పరిశీలించిన కాని విశ్వనాథ రచనా శిల్పమును అందలి రహస్యములను మనము గ్రహింప లేము. గత పద్యాలలో కోతులు అన్యోన్య సహాయముతో సంస్పందమానమైన ఉయ్యాల వంతెనను కట్టినట్లున్నదని శ్రీరాముఁడనెను. వెంటనే ఆయన మనస్సు ఋషి పత్నులతో సీత ఉయ్యాలలూగు వృత్తాంతమును స్మరించును. ఇట్లు నాయకుని యొక్క విచార ధారను చూపుటలో విశ్వనాథ పెట్టు అతుకులు పాఠకులకు ఆనందమును కలిగించును.
మన పరిశీలన బట్టి ఆనందము. " ఆయతము కొలంది లభ్యమగు నయ్యమృతంబు " 
జై శ్రీరాం.
బులుసు వేంకటేశ్వర్లు.
సెల్ నెం. 09949175899.
చూచారుకదండీ! ఎంత శ్రమించి మన కవి వతంస బులుసు వేంకటేశ్వర్లు శ్రీ విశ్వనాథ భావుకతను వెలువరిస్తున్నారో!
మిగిలిన భాగాలు కూడా సావధనంగా తెలుసుకొందాం అంతవరకూ ఆంధ్రామృతాన్ని గ్రోలుతూ ఆనంద రస సాగరంలో మునిగి తేలుతూ ఆ పరమాత్మ దయకు పాత్రులమౌదామా!
జైహింద్.  

4, మే 2010, మంగళవారం

దేవీ స్తుతి 9 / 13. (కాళిదాసు కృత అశ్వధాటికి ఆంధ్రానువాదము)

1 comments

http://farm3.static.flickr.com/2522/4130738189_b70d5c28ce_m.jpg
శ్లో:-
దక్షాయణీ దనుజ శిక్ష విధౌ వికృత దీక్షా మనోహర గుణా!
భిక్షాశినో నటన వీక్షా వినోద ముఖి దక్షాధ్వర ప్రహరణా!
వీక్షాం విదేహి మయి దక్షాస్వకీయ జన పక్షా విపక్ష విమిఖీ!
యక్షీశ సేవిత నిరాపేక్ష శక్తి జయ లక్ష్మ్యా వధాన కలనా!౯.
సీ:-
రాక్షస సంహార దీక్షఁ బూనిన తల్లి;
సుమనోజ్ఞ గుణ పూర్ణ; సుజన రక్ష.
శివ తాండవముఁ జూడ చిద్విలాసమ్ముగ
నానంద ముఖియయి యలరు జనని.
దక్షాధ్వర ధ్వంస. రక్షింప యోగ్యయు;
భక్తుల కండయై ప్రబలు మాత.
శత్రు విధ్వంసిని; శరణాగత త్రాణ.
శ్రీకర ధనపతి సేవిత పద.
గీ:-
యుక్తి నప్రతిహత మహా శక్తి హైమ.
విజయ సాధన దీక్షతో వెలయు గిరిజ.
అట్టి దాక్షాయణీ మాత పట్టి విడక
నన్ను కృప తోడఁ జూచుత సన్నుతముగ. 
భావము:-
రాక్షస సంహార విషయంలో అసాధారణమైన పట్టుదల కలదీ; మనసుకింపైన గుణ సంపద కలదీ; శివుని తాండవాన్ని తిలకించడంలో ఆనందించే ముఖం కలదీ; దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేసినదీ; సమర్ధురాలు; తన భక్తులకు అండగా నిలిచేదీ; శత్రువులకు ప్రతికూలమైనదీ; కుబేరుఁడు చేత సేవింపఁ బడేదీ; ఎదుర్కొనుటకు వీలుకానంత శక్తి కలదీ; విజయలక్ష్మిని పొందుటలో ఏకాగ్రత కలదీ;(విజయానికి గుర్తులైన ప్రశస్తమైన పూర్వ చరిత్ర కలదీ;)అయిన ప్రజాపతి కుమార్తె ఐన దాక్షాయణి నాపట్ల దృష్టిని ఉంచవలసినది.
జైహింద్.  

3, మే 2010, సోమవారం

దేవీ స్తుతి 8 / 13. (కాళిదాసు కృత అశ్వధాటికి ఆంధ్రానువాదము)

4 comments

http://www.durka.com/assets/images/chandi1111.jpg
శ్లో:-
జంభారి కుంభి పృథు కుంభాపహాసి కుచ సంభావ్య హార లతికా
రంభా కరీంద్ర కర దంభాపహోరు గతి డింభానురంజిత పదా
శంభా ఉదార పరి రంభాంకురత్పులక దంభానురాగ పిశునా
శం భాసు రాభరణ గుంఫా సదా దిశతు శుంభాసుర ప్రహరణా!౮.
సీ:-
జంభారి కరి యొక్క కుంభస్థలముమించు 
పాలిండ్ల ముత్యాల పేరు తోడ;
అరటి బోదలయొక్క హస్తి హస్తముయొక్క 
గర్వమ్ము నణచెడి యూర్వులొప్ప;
నడచేటి సమయాన నవ జాత శిశువుల
పాదాలఁ బోలెడి పాదములది;
శివుని కౌగిలి చేత ధవళాక్షిపులకలు
ప్రణయ సూచకముగ ప్రబలు జనని;
గీ:-
తేజరిలు సొమ్ములను దాల్చు దివ్య తేజ.
శుంభుడను దుష్టు దునిమిన శూలి రాణి;
అండ దండగ నాకెపుడుండు గాక.
ఈప్సితార్థము; శుభములు నిచ్చు గాక.
భావము:-
జంభాసురుని సంహరించిన ఇంద్రుఁడి ఏనుగైన ఐరావతము యొక్క మిక్కిలి గొప్పదైన కుంభ స్థలమును అపహసిస్తున్న స్తనాల మీద మిక్కిలి అందగించే ముత్యాల హారము కలదీ; అరటి బోదెల యొక్క; శ్రేష్ఠమైన ఏనుగు తొండము యొక్క గర్వాన్ని పోగొట్టే తొడలు కలిగి; నడక చేత పిల్లలకు వలె ఎఱ్ఱఁ బడిన పాదాలు కలదీ; శివుని తోడి గాఢమైన ఆలింగనం వల్ల మోసులెత్తుతున్న గగుర్పాటు అధికమైన ప్రేమకు సూచన ఐనదీ; ప్రకాశిస్తున్న సొమ్ముల కూర్పు కలదీ; శుంభుఁడనే రాక్షసుని శిక్షించినదీ ఐన పార్వతీ దేవి (నాకు) శుభాన్ని ఎల్లప్పుడూ ఇచ్చు గాక.
జైహింద్.  

2, మే 2010, ఆదివారం

దేవీ స్తుతి 7 / 13. (కాళిదాసు కృత అశ్వధాటికి ఆంధ్రానువాదము)

1 comments

http://www.shalincraft-india.com/images/sculpture/image/large/durgab001.jpg
శ్లో:-
న్యంకా కరే వపుషి కంకాళ రక్త పుషి కంకాది పక్షి విషయే.
త్వం కామనా మయసి కిం కారణం హృదయ! పంకారి మే హి గిరిజాం.
శంకాశిలా నిశిత టంకాయమాన పద సంకాశమాన సుమనో
ఝంకారి భృంగ తతి మంకాను పేత శశి సంకాశ వక్త్ర కమలాం. ౭.
సీ:-
హృదయమా! నిరతంబు  మది వ్రేల్చు యపవాద
కలుషంబులకు నెల్ల నిలయమౌచు;
అస్తిపంజర రక్తమమరగా  పోషించు;
పులుగుల కాధార భూతమయెడి;
దేహమ్ము విషయమై దేవురించుచు నీవు 
కోర దగని కోర్కె కోరు టేమి?
పాపంబులకు నరి; దీపించు యనుమాన
పాషాణమున కులి; భవ్య రొదల
గీ:-
దేవతాభృంగ సేవిత దివ్య పాద.
పద్మములు గల్గినట్టిది; భవ్యమూర్తి.
చంద్ర ముఖ పద్మమున నొప్పు శంభు రాణి
నాశ్రయింపగ తగునీకునద్భుతముగ.
భావము:-
ఓ హృదయమా! అనేక నిందలకూ కళంకలకూ నిలయమైనదీ;  అస్తి పంజరాన్నీ; రక్తాన్నీ పోషించేదీ; రా పులుగుల వంటి అనేక పక్షులకు ఆధారమైనదీ; అయిన శరీరము విషయంలో నీవు కోరికను పొందుతున్నావు.  కారణమేమిటి? పాపాలకు శత్రువైనదీ; అనుమానాలనే రాళ్ళకు కరుకైన కాశ ఉలుల వంటివైన పాదాలమీద బాగా ప్రకాశిసున్న దేవతలు అనే రొద చేస్తున్న తుమ్మెదల సమూహం కలదీ;  కళంకంతో కూడుకొన్న చంద్రుని వంటి ముఖ పద్మం కలదీ; అయిన పార్వతీ దేవిని పొందవలసింది. 
జైహింద్.