గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, మార్చి 2009, మంగళవారం

ఇందెన్ని పద్యాలు గర్భితమై యున్నాయో తెలియఁ జేయండి చూద్దాం.వివరణ.

7 comments

ఇది ఏ పద్యమో - ఇందెన్ని పద్యాలు గర్భితమై యున్నాయో తెలియఁ జేయండి చూద్దాం.

సువినయంబొప్పఁ జూచువారలకు సద్ విజ్ఞానిగా దోచుచున్ రహించు
సుగుణ సంపన్నుగ శోభిలున్ పరమత క్రోధంబు లేదేలకో? యనంగ.
సుమనసుంబెద్దయెసుమ్మ! యంచు బొగడన్ మర్యాదయే రూపమౌననంగ
సుజనులే మెచ్చగ చోద్యమొప్ప మెలగున్. చైదంబులం దౌష్ట్యముల్ దలిర్ప.
సురుచిర సుహాసనంబుల ధరణి పయిన
తానె గొప్ప ధన్యాత్ముడుగానిరతము.
మెలుపున దురితము లరసి మెలగు కరటి
నరయ నగునే? పృథివి నది భరము కాదె?

అని మీముందుంచిన పద్యానికి కొందరు చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.

ప్రస్తుతం ఈ ప్రశ్నకు నేనే సమాధానం చెప్పుతున్నాను.
పైది సీస పద్యము.
ఈ సీస పద్యంలో
1) మత్తేభము.
2) కందము.
3) గీతము. అనేవి గర్భితమై ఉన్నాయి.
వాటిని క్రింద విశదపరస్తున్నాను. గమనించండి.
1) :-
వినయంబొప్ప జూచువారలకు సద్ విజ్ఞానిగా దోచుచున్
గుణ సంపన్నుగ శోభిలున్ పరమత క్రోధంబు లేదేలకో?
మనసుం బెద్దయె సుమ్మ! యంచు బొగడన్ మర్యాదయే రూపమౌన్
జనులేమెచ్చగ చోద్యమొప్ప మెలగున్. చైదంబులం దౌష్ట్యముల్
2) :-
సురుచిర సుహాసనంబుల
ధరణి పయినతానె గొప్ప ధన్యాత్ముడుగా
నిరతము.మెలుపున దురితము
లరసి మెలగు కరటినరయ నగునే పృథివిన్?
) గీ:-
సురుచిర సుహాసనంబుల ధరణి పయిన
తానె గొప్ప ధన్యాత్ముడుగానిరతము.
మెలుపున దురితము లరసి మెలగు కరటి
నరయ నగునే? పృథివినది భరము కాదె

ఈ విధంగా చెప్పవచ్చు. ఇక విషయానికి వస్తే,
పైకి మంచిగా కనిపిస్తూ ఎవ్వరికీ అనుమానమైనా రావడానికి వీలు కలిగించని విధంగా వంచన చేసే నయ వంచకుల విషయంలో జాగ్రత్త సుమండీ.


జైహింద్.

28, మార్చి 2009, శనివారం

కవి సమ్రాట్ విశ్వనాథ భావుకత 11

2 comments

శ్రీ విరోధి ఉగాది వేడుకలు సాహితీ మిత్రులైన మీరందరూ ఆనందోత్సాహాలతో జరుపుకొని ఉంటారనుకొంటున్నాను. అందరికీ అభినందనలు.

దీనికంటే మూందుటపాలో నూతన సంవత్సర ఫలాల్ని పద్యాల్లో ివరించాను. మీరంతా చూచే వుంటారనుకొంటాను. సంతోసోషం.
సుమారు మూడు మాసాలుగా నిరవకాశం వలన విశ్వనాథ భావుకత మీకందించ లేకపోయినందుకు క్షంతవ్యుడను.

ఇదివరలో 10 భాగములు చెప్పుకొన్నాం. ఇప్పుడు 11 వ భాగం శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి ఉపన్యాస సారాన్నితెలుసుకొందాం.

రామాయణ కల్ప వృక్షంలో కిష్కంధ కాండలో శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తున్న సందర్భం. పంపా సరోవర పరిసర భూముల్లో శ్రీరాముడు తిరుగాడుతూ అచ్చటి ప్రకృతిని అణువణువు అన్వేషిస్తున్నాడు.

పంపా అరణ్యం ఒక్కొక్క అందాన్ని ప్రదర్శిస్తున్నది. పూల తీగలూ, ఫల వృక్షాలూ, చిన్నచిన్న పొదలూ, మహావృక్షాలూ, వేటికవే విలక్షణ సౌందర్యంతో ుతున్నాయి. అలాగే నేలలు కూడా కొన్ని చోట్ల ఇసుక భూములూ వున్నాయి. అక్కడంతా జీడి మామిడి పొదలు, పచ్చని స్వర్గం దిగి వచ్చిందా అన్నట్లుందా ప్రదేశంఅంతా.
విశ్వనాథ కూర్పును అవధరించండి.
శా:-
పంపా కానన భిన్న దేశముల సౌభాగ్యంబు చిత్రంబు నై
లింపశ్రీకముగా కనంబడెడి, వల్లీ గల్మ వృక్షాదులం
దింపౌనీడిగ చెట్ల ఱాగరప తా నిచ్చోటునిచ్చోటు చొ
క్కంపుంగుమ్ముల జీడి మామిడి పొదల్గా సైకత శ్రేణులన్.

గరప నేలల్లో ఈడిగ చెట్ల గుంపులు, పోగా పోగా ఇసుక నేలల్లో జీడిమామిడి పొదలు నెలకొని వున్నాయి. భిన్న భిన్న మైన లతలు, పొదలు, వృక్షాలు, స్వర్గ సౌందర్యంతో వున్నాయి.
ఇక్కడ విభిన్నమైన భూ భాగాల్ని వర్ణించడం ఎందుకంటే శ్రీరాముని ప్రస్తానం సాగుతున్నట్లు మనకు తెలియఁజేయడమే. సీత కనబడని క్షణం నుండి రాముని మనస్సుకే కాదు తనువుకూ కుదురు లేదు. నిర్విరామంగా ఆయన తిరుగుతూనే వున్నాడు సోదర సహితుడై. ఆ అన్వేషణలో ఆయన చూచిన ప్రదేశాలే ఇక్కడ వర్ణితమగుతున్నవి.

పై పద్యం మమూలుగా చూస్తే ఏ విశేషము లేనట్లు కేవలము పంపాపరిసర భూముల్ని యథా తథంగా వర్ణించినట్లు కనిపిస్తుంది. కాని మహాకవుల కావ్య రచనలో శిల్పం అనేది ఒక నైపుణి. కథను పాఠకుల మనస్సుకు హత్తుకొనేటట్లు చేయడంలో వర్ణనలదే ప్రథాన పాత్ర. ఈ వర్ణనలు మళ్ళీ బహు విధాలు. చలన వస్తువుల్ని వర్ణించే విధానం వేరు, నిశ్చల దృశ్యాల్ని వర్ణించే విధానం వేరు. ఇందుకు కవి లోకజ్ఞుడై ఉండాలి. అటవీ వర్ణనలో కవి కేవలం వృక్ష జాతుల పేర్లు గుదిగుచ్చిఆ జాబితా యివ్వడంతో సరిపోదు. పాఠకుడు ఆ వర్ణనలో రమించడు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో దుష్యంతుడు రథాధిష్టుడై అడవికి వేటకు వెళ్ళిన సందర్భంలో రథం వేగంగా పోయేటప్పుడు ప్రకృతి ఆయనకు ఏవిధంగా కనిపిస్తోందో వర్ణించాడు. " యదా లోకే సూక్ష్మం వ్రజతి సహసా తద్విపులతాం " అంటూ అతి చిన్నదిగా కనిపించే వస్తువు మఱు క్షణంలో అతి పెద్దదిగా కనిపిస్తోంది అని అర్థం. అంటే ఏమిటి? రథం అంత వేగంగా పోతున్నదన్నమాట. మహా కవుల శిల్పమార్గంయిది. ప్రత్యేకం వర్ణనల్లో ఇది మరీ సూక్ష్మ భావుకత కలవారికే సాధ్యం.
రస మార్గ ప్రస్తరణలో నిపుణుడైన విశ్వనాథ ఇక్కడ అడవిని వర్ణిస్తూ అక్కడ ఉన్న రకరకాల నేలలను ( భూములను ) చెప్పడం ద్వారా రాముని సీతాన్వేషణ సాగుతున్న సంగతిని శిల్ప మార్గంలో చెప్పడం జరిగింది.
పైకి సామాన్యంగా కనిపించే పద్యాల్లో కూడా తరచి చూస్తే విశ్వనాథ భావుకత మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది.

చూచారుకదా కవి వతంసుడు శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారు వెలువరించిన విశ్వనాథ భావుకత. మరొక పర్యాయం మరో పద్యంలోని భావుకతను తెలుకొందాం.
మీ అభిప్రాయాల్ని తెలియఁజేస్తారుకదూ?
వారితో మీరు నేరుగా మాటాడాలనుకొంటే వారిసెల్ నెంబరు: 09949175899. అందరికీ శుభము కలుగును గాక.
జైహింద్.

25, మార్చి 2009, బుధవారం

శ్రీ విరోధి నమ సంవత్సర నవ నాయకాది ఫలములు:-

4 comments

tepuktanganశ్రీకర పాఠక వరులకు
ప్రాకటముగ నీ యుగాది భవ్య ఫలంబుల్
లోకాద్భుతముగనిచ్చును.
మీకిక నే తెలియఁ జేతు మేలును కీళ్ళున్.


శ్రీ విరోధి నమ సంవత్సర నవ నాయకాది ఫలములు:-
1) రాజు శుక్రుడు. దాని ఫలము:-
తే.గీ:-
శుక్ర రాజ్యాధిపత్యము శుభము మనకు.
వర్షములు పడి నిండుగా పండు భూమి.
పాడి సమృద్ధి కలుగును. పతులు మెచ్చ
సతులు కామోపచారముల్ సలుపు భివిని.

2) మంత్రి చంద్రుడు. దానిఫలము:-
తే.గీ:-
మంత్రి చంద్రుడభ్యుదయంబు మనుజులకును
రాజులకునిచ్చు. వర్షముల్ లక్ష్యమొప్ప
కురియ పంటలు పసువులు ధరను వెలుగు.
యజ్ఞములు బ్రాహ్మణు లుచేయు నద్భుతముగ.

3) సేనాధిపతి చంద్రుడు. దాని ఫలము:-
తే.గీ:-
చంద్ర సేనాధిపత్యము చక్కనొప్పు.
వెలలు,వర్షములును హెచ్చు నిలను జనులు
రోగ రహితులై సుఖులగు యోగమమరు.
పాడి పంటలతో భువి పరవశించు.

4) సస్యాధిపతి శుక్రుడు. దాను ఫలము:-
తే.గీ:-
పంట కధిపతి శుక్రుడు పరమ శుభుడు.
ధాన్య జాతులు ఫలియించు మాన్యముగను.
తెల్ల భూములు ఫలియించు తృప్తిగాను.
అందరారోగ్య సంపద లందగలరు.

5) ధాన్యాధిపతి బుధుడు. దాని ఫలము:-
తే.గీ:-
బుధుడు ధాన్యాధిపతికాన ముప్పు కలుగు.
మధ్యమమునొప్పు వర్షముం బండ దధిక
పంట. గాలిచే మేఘముల్ పరుగుతీయు .
జనులుదాహార్తి నొందును. గోల పెరుగు.

6) అర్ఘాధిపతి చంద్రుడు. దాని ఫలము:-
తే.గీ:-
చంద్రు డర్ఘాధిపతికాన చక్కనైన
వర్షములఁ జేసి బాగుగా పంట పండు.
దేశమభివృద్ధి పొందుచు తేజరిలును.
ధరలు మాత్రము హెచ్చును. తప్పదయ్య!

7) మేఘాధిపతి చంద్రుడు. దాని ఫలము:-
తే.గీ:-
మేఘముల కధిపతి శశి. మేలు చేయు.
పంటలంతట బాగుగా పండు. నిలను.
పాడి పంటలచే భువి పరవశించు.
ప్రజల యోగము బాగుండు సుజనులార!

8) రసాధిపతి శని. దాని ఫలితము:-
తే.గీ:-
రసముల కధిపతి శని ధరలు తరుగును.
నేయి, నూనె బెల్లము తేనె నేలపైన
వెలలు లేనివగుచు నుండు వింతగాను.
ప్రజల కందుచు, నందక పరుగు పెట్టు.

9) నీరసాధిపతి గురుడు. దాని ఫలము:-
తే.గీ:-
నీరసాధిపు గురుడౌట నియతి నిజము.
వక్కలును రత్నములు పైడి, ప్రత్తి, ధాన్య
ములును, తేనెయు తోళ్ళును, పూలు, మంచి
గంధమిటువంటి వాటికి కలుగు వృద్ధి.
బ్రాహ్మణులు సుఖ జీవులై వరలు భువిని.


ఆఢక ప్రమాణము, ఆఢక స్థితి:-
అష్ఠ యోజన విస్తీర్ణం శత యోజన మున్నతం.
9 భాగములు సముద్రములోను,
9 భాగములు పర్వతముల పైన,
2 భాగములు భూమి పైన వర్షించును.
16 వీసములకు 12 విసముల పంట పండును.

కుంచము 09 - 9 - 2009 వ తేదీ వరకు వృద్ధ వేశ్య చేతి యందుండును - ఆ పిదప - బ్రాహ్మణ బాలుడు చేతి యందుండును. కావున సస్యానుకూల వర్షములు పడును. పంటలు బాగుగా పండును. బ్రాహ్మణ చేతియందలి కుంచము దుర్భిక్షము, సస్య నాశనము కలిగించును.

వాయువు:-
సంవహ అను పేరుగల వాయువు. కావున అల్ప వృష్టి వుండును.

మెరుపు:-
చంచల అనే మెరుపు. కావున సు వృష్టి.

ఉరుము:-
నిర్ఘోష అను పేరుగల గర్జితము. కావున అల్ప వృష్టి.

సముద్రము:-
క్షీర అను పేరుగల సముద్రము. కావున వాయు పీడన ఉన్నప్పటికీ సుభిక్షంగా వుంటుంది.

భూ వాహన శేష ఫలము:-
కర్కోటకుడనే సర్పము భూమిని వహించుచున్నది. దాని వలన వర్షములు తక్కువగా పడును. రాజుకు మరణము సంభవించును.

పశు నాయక ఫలము:-
పశు నాయకుడు - దొడ్డి పెట్టువాడు - విడిపించు వాడు
శ్రీ కృష్ణుడు. అయినందున
పశు వృద్ధిః సుభిక్షంచ బహు సస్యార్ఘ సంపదః
గోష్టే సార్వాధికారీచ శ్రీ కృష్ణః పశ్యాధిపే.

తే.గీ:-
పశువులను పాలనముసేయు వాసుదేవు
డందు వలన వృద్ధి యగును మందలుగను.
దేశము సుభిక్షమై యుండు. దేశమందు
పంటలధికము పండును భవ్యముగను.

బహు క్షీర ప్రదా గావః సర్వ వ్యాధి వివర్జితా.
గోష్టార్బహః సదా నిత్యం శ్రీకృష్ణేన సంరక్షకం.

తే.గీ:-
దొడ్డి పెట్టెడి వాడు మఱి దొడ్డినుండి
విడిచి పెట్టెడి వాడునూ వేణుగోపు
డగుటచే పాలనిచ్చెడు నవని యావు
లరసి చూడ. నిరోగత పెరుగు భువిని.

ఆర్ద్రా ప్రవేశము:-
తే. 21 - 6 - 2009 దీని జ్యేష్ట బహుళ చతుర్దశీ ఆదివారం తె.గం. 3-36. ని.లకు మృగశిర నక్షత్రం, శకుని కరణం, గండ యోగం, వ్షభ లగ్నం, లో అర్ద్రా నక్షత్రం లోకి రవి ప్రవేశించుచున్నందున ధరలు అధికంగా వుంటాయి. గాలుల వలన మేఘాలు తేలిపోవునప్పటికీ సస్యానుకూల వర్షాలు పడును. నీటికి కొరత ఉండదు. గండ యోగం కవున ప్రజలలూ భయాందోళనలు పెరుగుతాయి. వృషభ లగ్నం కావున పసు గణాభివృద్ధి జరుగును.

కర్తరి నిర్ణయము:-
తే. 04 - 5 - 2009 దీ. మద్యాహ్నం గం. 1 - 10ని .ల నుండి దిన కత్తిర్లు.
తే. 11 - 5 - 2009 .దీ నుండి అగ్ని కత్తిర్లు.
తే. 28 - 5 - 2009 ది. సాయంత్రం గం. 06 - 04 ని. వరకు.

మకర సంక్రాంతి:-
తే. 14 - 01 - 2010 దీ.ని సాయంత్రం గం.5 - 33.ని.లకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించును.

తిథి:- అమావాస్య. సస్య నాశనం.
పక్షం:- కృష్ణ పక్షం. క్షేమం కలుగును.
గురువారం:- క్షేమం, సుభిక్షం, ఆరోగ్యం.
పేరు:- మంద. విప్రుల కనుకూలం.
సాయంకాలం:- శుభయోగము.
మేష లగ్నం:- ఆనంద దాయకం.
వేపాకునీటి స్నానం:- మహారోగం కలుగును.
వర్ణ వస్త్ర ధారణ:- మహారోగకారి.
పాటలీ పుష్ప ధారణ:- శుభప్రదం.
స్వర్ణభరణ ధారణ;- స్వర్ణమ్ ఖరీదు తగ్గును.
ఖర్జూర ఫల భక్షణం;- ధరలధికం.

గురు మూఢం;-
తే.16 - 12 - 2009 దీ.నుండి తే.06 - 02 - 2010 దీ. వరకు.

శుక్ర మూఢం:-
తే.17 - 02 - 2010 దీ. నుండి తే.17 - 03 - 2010 దీ వరకు.

గ్రహణములు:-
పాక్షిక సూర్య గ్రహణము:-
తే.22 - 7 - 2009 దీ.ని ఉదయం గం.05 - 28 ని. లనుండి గం. 10 - 42 ని. వరకు.

సంపూర్ణ సూర్య గ్రహణము:-
తే.15 - 01 - 2010 దీ. ఉదయం గం.09 - 35 ని.ల నుండి మధ్యాహ్నం గం. 03 - 38 - ని. ల వరకు.

పాక్షిక చంద్ర గ్రహణం:-
తే.31 - 12 - 2009 - దీ
ఇది మన భారత దేశంలో కనబడు.

ఆదాయ - వ్యయములు
మేషం:-
2 - 8
వృషభం:-
11 - 14
మిధునం:-
14 - 11
కర్కాటకం :-
8 - 11
సింహం :-
11 - 5
కన్య :-
14 - 11
తుల :-
11 - 14
వృశ్చికం :-
2 - 8
ధనుస్సు :-
5 - 14
మకరం:-
8 - 8
కుంభం :-
8 - 8
మీనం. :-
5 - 14

రాజ పూజ్య - ఆవమానములు
మేషం:- 1 - 7
వృషభం :-
4 - 7
మిధునం :-
7 - 7
కర్కాటకం :-
3 - 3
సింహం :-
6 - 3
కన్య :-
2 - 6
తుల :-
5 - 6
వృశ్చికం :-
1 - 2
ధనుస్సు :-
4 - 2
మకరం :-
7 - 2
కుంభం :-
3 - 5
మీనం. :-
6 - 5

మొత్తముపై సంవత్సర ఫలం:-
శ్రీ విరోధి నామ సంవత్సరం సుజనుల కవిరోధి. దుష్టులకు విరోధి. పాడి పంటలు బాగున్నప్పటికీ ధర వరలు మాత్రము హెచ్చుగానుండును. ఈశ్వరాభిషేకముము ఈ సంవత్సరం మేలు కూర్చును. దాని వలన గ్రహములు కూడ శాంతించును.

స్వస్తి.
సర్వాణి సన్మంగళాని భవంతు.
చింతా రామ కృష్ణా రావు.
జైహింద్.rostepuktangan

శ్రీమద్ విరోధికి స్వాగతం . రచన:-చింతా రామ కృష్ణా రావు.

2 comments

శ్రీమద్ విరోధికి స్వాగతం .
రచన:-చింతా రామ కృష్ణా రావు.
TELUGU LECTURER {Rtd}
చోడవరం. విశాఖపట్టణం జిల్లా.

:-
స్వాగతమమ్మ! సత్కవుల సంగతినీ వవిరోధివమ్మ! నీ
యాగమనమ్ము మాదు పరమాద్భుత భావికి సూచనమ్మ! సద్
యోగమునిమ్మ! దుష్టులకయోగము గొల్పు విరోధివమ్మ! యే
రోగముఁ లేక మాకిల పురోగతి నిమ్మ! విరోధి వర్షమా!

:-
సద్రచనాభిలాషులగు సజ్జన వర్యుల శత్రు సంహతిన్
రుద్రుని పోలి చీల్చగ విరోధిగ పేరును దాల్చి వచ్చి, మా
భద్రతఁ జూచు నీకు నిట పల్కెద మిమ్ముల స్వాగతమ్ము. సత్
క్షౌద్రము లొల్కుచున్ జనులఁ గౌరవమొప్పఁగఁ గావు మిమ్మహిన్.

మత్త::-
గున్న మామిడి కొమ్మపై నొక కోయిలమ్మ కుహూ కుహూ
యన్న ధ్వానము పెక్కుటిల్లగ దిక్కులన్నియు మారు మ్రో
న్నవాబ్దికి సూచకమ్ముగ కమ్మగా పల్ మారు తా
మిన్ను ముట్టగ కూయ సాగెను మేల్తరమ్ముగ, వింటివే?

:-
ఘుమ్మని షట్పదాళి కడు చోద్యముగా వికసించు పూలపై
కమ్మని తేనె జుఱ్ఱుచును గర్వముతో విహరింపఁ గంటి. లో
కమ్మున మిత్ర వర్గమును కన్నను, మేల్తర కాలమొచ్చినన్,
సొమ్ములు మించి కల్గినను, చోద్యముగా విహరించుచుందురా?

:-
రార వసంత! నిన్ను కనులార కనుంగొని. నీదు భాగ్య మే
మారసి, నీ కృపామృతము హాయిగ గ్రోలగనిమ్ము. మాకు నీ
చేరిక వాంఛనీయము. సు చేతనతన్ మదిఁ గొల్పు దీవు. నీ
వారలు నీదు రాక కని ప్రార్థన చేయుచు నుండె సిద్దమై.
జైహింద్.

24, మార్చి 2009, మంగళవారం

ఉగాది స్వాగత గీతం రచన:- శ్రీ యి. యన్. వి. రవి.

0 comments

ఉత్సాహవంతులైన కవులు శ్రీ విరోధికి స్వాగతం పలుకుతూ వినిపించిన మీలో మరొక కవికోకిల కవితా గానం మీరూ చూడండి, వినండి మనసుతో.

ఉగాది స్వాగత గీతం
రచన:- శ్రీ యి. యన్. వి. రవి. {"Ravi E.N.V."}
ఆ.వె :
ఆరు రుచుల తోడ ఆమని నీకును
నయముగనిల తోరణములు గట్టి
ఊయల నిదురించు "ఉంగా"ది పాపతో
స్వాగతింతుమమ్మ సస్య లక్ష్మి!

ఆ.వె.:-
కొమ్మపైని గండు కోయిలమ్మ గునుపు
గున్న మావి చివురు వన్నె చిన్నె
చెఱకు పంట శోభ మెఱపులద్దగ నీకు
పావనముగ సుదతి పంకజాక్షి!

ఆ.వె:-
సర్వధారికన్న సస్యములొప్పగ
పాడిపంటలన్ని పెచ్చు మీఱ
కర్షక జన హృదిని హర్షములలరగ
తరలి రావె నీవు తరుణి మాత!

చూచి మనసుతో విన్నారుకదా! మరి మీరూ ప్రయత్నించి స్వాగతగీతంతో ఉగాదిని ఆహ్వానించండి.
జైహింద్.

23, మార్చి 2009, సోమవారం

పుష్య రాగ కాంతులతో దండకం.

0 comments

శ్రీ పుల్లెల శ్యామ్ గారుదండక రచనా విధానము తెలిసినవారిని వివరించమని చక్కని కోరిక కోరారు. అందుకు డా. ఆచార్య ఫణీంద్రగారు కొంత వివరణ నద్భుతంగా యిచ్చారు.
పిదప శ్రీ ముక్కు రాఘవ కిరణ్ కుమార్ దండకములేయే గ్రంథాలలో లభ్యమైనాయో తెలియఁ జేశారు. పుష్యంగారి బలీయమైన వాఛ ఎందరినో మేలుకొలిపింది. వారికి నా అభినందనలు. నేను కూడా దానికి సంబంధించిన నిర్వచనాన్ని తెలుపుతున్నాను.
సీ:-
పుష్యము పేరుతో పుల్లెల శ్యాము తా
దండక నియమము తనకు తెలుప
మనిరి. ఫణీంద్రులు వినిచె దండకము
తగణములకు పైన తగునుగురుడ
నుచు.రాఘవయు తెల్పెను తను లభించిన
లక్ష్యములసదృశ లక్ష్యమొప్ప.
తిమ్మకవియు తాను సమ్మోదమున దీని
లక్షణమునుతెల్పె నక్షయముగ.
గీ:-
దాని వివరింతునేనిట. తప్పులున్న
ఒప్పులనుదెల్పి వివరింపనొప్పు మీకు.
మీరలెఱిగిన లక్ష్యము మీరు తెలిపి
జ్ఞానబోధను చేయుడో జ్ఞానులార.

రాఘవ వివరించిన దండక ఉదాహరణలు:-
౧ మనుచరిత్రలోనూ వసుచరిత్రలోనూ రగడలైతే ఉన్నాయి కానీ దండకాలు సున్నా.
౨ పారిజాతాపహరణంలో రగడలూ ఉన్నాయి, దండకమూ ఉంది. చిత్రగర్భబంధకవిత్వాలూ ఉన్నాయి. కానీ పంచకావ్యాలలో పారిజాతాపహరణాన్ని ఎందుకు చెప్పలేదా అనుకున్నాను. వెంటనే నాకే అనిపించిందండీ... కేవల ఛందస్సే కాదు కదా కావ్యాన్ని నిలబెట్టేదీ అని.
౩ హరవిలాసంలో ఏకంగా రెండు దండకాలు ఉన్నాయి. రగడలు అస్సలు లేవు. పాండురంగమాహాత్మ్యంలో కూడా ఇంతే.
౪ నేను చూసిన వాటిలో దండకాలు ఎక్కువ శాతం రెండు న గణాలతో ప్రారంభమయ్యాయి. అన్నీ గురువుతోనే ముగిసాయి.
౫ యగణాల దండకం నేను చూడలేదు. కానీ ఉండవచ్చునేమో అని ఊహిస్తున్నాను.

ఇక దండక నిర్వచనాన్ని లింగమగుంట తిమ్మకవి తనసులక్షణసారము అనే ఛందశ్శాస్త్రంలో ఎలా వివరించాడో గమనిద్దాం.
దండకము నిర్వచనము:-
అమరంగ సనహంబులందాదిగానొండెఁ, గాదేని నాదిన్ దకారంబుగానొండె, లోనం దకారమ్ములిమ్మై గకారావసానంబుగాఁ జెప్పినన్ దండకం బండ్రు దీనిన్ గవుల్.
ఉదా:-
అమరన్ { స గణము }
గ సన { న }
హంబు { హ }
లందాది { త }
గానొండెఁ,{ త }
గాదేని { త }
నాదిన్ ద { త }
కారంబు { త }
గానొండె { త }
లోనం ద { త }
కారమ్ము { త }
లిమ్మై గ { త ]
కారావ { త }
సానంబు { త }
గాఁ జెప్పి { త ]
నన్ దండ { త }
కం బండ్రు { త ]
దీనిన్ గ { త }
వుల్. { గ }

పైన నిర్వచించిన నిర్వచనమునందే ఉదాహరణ కూడ యిమిడియున్నదికదా! దానినే నేను వివరించాను.
ఆలస్యమెందుకు ఔత్సాహికులు దండక రచనోన్ముఖులు కండి. రచయితల పాఠకుల మనో వాంఛితము సిద్ధించును గాక.
జైహింద్.

22, మార్చి 2009, ఆదివారం

శ్రీ విరోధికి స్వాగతం పలికిన మీలో ఒక కవి కవిత.

2 comments

శ్రీసకల సద్గుణ పునాది, సకల దుర్గుణ సమాధి శ్రీ విరోధికి స్వాగతం పలుకుతూ అనేకమంది మహాకవులు తమ కవితాకోకిలగానం వినిపిస్తున్నారు.
అట్టి వారిలో ప్రముఖ కవివతంస బిరుదాంకితులు శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారు పంపిన కవితలో వారి హృదయాని చదువుదాం.


శ్రీ విరోధికి స్వాగతం. -

రచన:- శ్రీ బులుసు వేంకటేశ్వర్లు..

ఉ:-

స్వాగతమో ఉగాది! సరసాంతర వార్నిధి! తెల్గు నేల న

వ్యాగత పర్వమిట్లు నిలుపన్ చనుదెంచితివే! విరోధివై

గతి పేరు పెట్టుకొని యెవ్వరు వచ్చిరి మున్ను? యిట్టి నీ

ఆగమనమ్ములోని పరమార్థము తెల్లము కాదు మాకిటన్.

ఉ:-

స్వార్థతకున్ విరోధివయి సర్వ శుభమ్ములు కల్గ జూతువో

వ్యర్థతకున్ విరోధివయి వాస్తవముల్ గమనింప జేతువో

నిర్ధనతా విరోధివయి నిర్మల భాగ్యము లంద జేతువో

అర్థము కాక యున్నది నవాబ్దమ!నీ వరుదెంచు వైఖరిన్.

ఉ:-

ఎన్ని ఉగాదులేగినవొ యింతకు మున్ను.వసంత దీప్తిలో

క్రొన్ననలైన ఆశలకు క్రొత్త బలంబిడి జీవ యాత్రలో

మన్నన నిల్చినట్టి మధు మాసములైనవి కొన్ని మాత్రమే.

అన్న! త్వదీయ పాలన శుభాస్పద సంపద జూఱలిచ్చుతన్.

ఉ:-

ఆకులపాటు నొందిన వనావళి మ్రోడయి నిల్చునా? ప్రమో

దాకృతి క్రొంజివుళ్ళ నవతన్ భజయించదొ రేపు? చీకటుల్

ప్రాకట మోహనోదయములన్ మటుమాయము గావొ? గుండెలో

వేకువ నింపుకొన్న రస వేత్తకు నిత్యముగాది పండుగే.

మ:-

అళి గీతావళులందు కోకిల కుహూవ్యాజోక్తి మాలాముహు

ర్లలితాశాంతములందు పుష్ప మయ లీలా లక్ష్మి కందోయివె

ల్గులు పాఱాడిన చోటులన్ వలపు వాగుల్ సాగు తీరాన మొ

గ్గలు పూల్ - పూలు ఫలంబులై మధుర కాంక్షల్ తీర్చినన్ పండుగే.

గీ:-

ప్రతి యుగాదికి యెద పంచి పసిడి పళ్ళె

రమ్మునను ప్రేమ నర్ఘ్య పాద్యమ్ములొసగి

చింతలను వంతలను గోడు చెప్పుకొనుట

వార్షికమయ్యెనోయి నవాబ్ద మాకు.

గీ:-

తరువు పచ్చనోర్వని శైశిరము వోలె

పొరుగు పచ్చ నోర్వనియట్టి పరుష మతులు

కుటిల మార్గానుగతుల వ్యాకులత పెంచి

భగ్నముల జేయుచుండె సౌభాగ్య గరిమ.

ఉ:-

పచ్చని చెట్టుపై పిడుగు పైబడి కాల్చినయట్లు శాంతిని

ప్పచ్చరమైన మత్సరపు భావములన్ చెలరేగి క్రూరులై

పచ్చి ప్రశాంత భూమి నెఱపన్ నర మేధము లెన్నియెన్ని సం

పచ్చయ నందనమ్ములటు మాడినవో చిగురాకు మెత్తమై.

ఉ:-

శత్రువు వచ్చి నెత్తిపయి శస్త్రము పెట్టినయప్పుడే కృధా

పాత్రముగా నెదిర్చి రిపు భంజన సేయుట కాదు - ముందుగా

శాత్రవ వ్యూహముల్ గని అశాంతికి తావిడకుండు మార్గమే

మాత్రము చూడకున్న అణుమాత్రము నిల్కడ లేదు శాంతికిన్.

చ:-

చదువుల తల్లులై కదలు చక్కగ మా తెలుగింటి బాలికల్

చదువుకొనంగ స్వేచ్ఛ కొనసాగునొ! వారల ప్రేమ పిచ్చితో

బెదురులు పెట్టి ప్రాణములు వీడగ జేయు పిశాచ కర్మముల్

మది పరికించి యడ్డుకొనుమాయిక ! దుర్ జనతా విరోధివై.

సీ:-

విద్య వ్యాపారమై వేదన కలిగించు - సామాన్యునకునందు జాడ లేదు.

పరిహాస పాత్రమై ప్రాంతీయ భేదాలు - మనవారి విఖ్యాతి మంట గలిపె.

కొన యూపిరుల కొట్టుకొనుచుండె బడులలో - దేశ భాషలయందు తెలుగు లెస్స.

స్వస్థాన వేష భాషలపైన మమకార - మెట్లున్నదనిన చప్పట్ల కొఱకు.

గీ:-

తెలుగు పాదున పూచిన వెలుగు పూల

గుర్తిడెడు వారె లేనట్టి కొత్త జాతి

అవతరించినదోయి మా యాంధ్రమునను

చిర వసంతాతిథీ! చెప్ప చిత్రమగును.

ఉ:-

కన్నులు బైర్లు క్రమ్మెడు వికారములై నవ నాగరీక సం

ఛన్నములెన్ని వచ్చిన విజాతి కుసంస్కృతి యంటబోని మా

అన్నుల మిన్నలే గత మహాంధ్ర మహర్దశ నిల్పు - సంప్రదా

యోన్నతలైన మా తెలుగు యోషలు భూషలు జాతికెప్పుడున్.

మ:-

కటువై ఆమ్ల రుచిన్ వహించి పటు తిక్త స్వాదు మాధుర్య సం

ఘటనన్ పచ్చడి కాని పచ్చడిని లోకంబెల్ల చేసాచి యం

దుటలో జీవన యాత్రలోనిసుఖమున్ దుఃఖమ్మునున్ దాల్చు ను

త్కట ధీరత్వము చెప్ప వచ్చెదవుపాధ్యాయుండవై మిత్రమా!

చ:-

పరహిత బుద్ధి నాటుకొని భావములందున భూతలమ్ములో

నరులు చరించుదాక యొకనాటికి పండుగ రాదు - సృష్టిలో

వరములు శాపమౌటకు నివారణ లేదు. సుఖేచ్ఛ యొక్కటే

సరియగు దారి కాదని ప్రజాతతికీవె వచింపగావలెన్.

చ:-

పిక శుక భృంగ శారికల పిల్పులు పూవున పూవునన్ మరం

దక మధు నిర్ఝరుల్ చిగురునన్ నవరత్న చిరత్న కాంతులున్

ప్రకటములౌ ముహూర్తమిది రమ్ము నవాబ్దమ! ఆకు పచ్చ సం

తకము లొనర్చి క్రొత్త అవతారముతో అధికార ముద్రతో.!!


చూచారు కదా! ఎంతమనోహర దివ్య భావ గంభీరమో వారి రచన.

కొసమెరుపు గమనించారా?

ఆకు పచ్చ సంతకము లొనర్చి క్రొత్త అవతారముతో అధికార ముద్రతో.!!
దీని లోని ఆంతర్యం మీకర్థమైందా?
ఈ కవి వతంసునకు జిల్లా పరిషదున్నత పాఠశాల ప్రథానోపాధ్యాయ పదవి వరించడం మూలంగా ఆకుపచ్చ సంతకం అధికారముద్ర లభించాయి.
సు కవుల రచనలలో సమకాలీన స్థితిగతులను, వారి పరిస్థితులను కూడా మనం గ్రహించ వచ్చనడానికిదొక నిదర్శనం.
మరొక పర్యాయం మరొక కవి కవితాగానాన్ని పరికిద్దాం.
జైహింద్.