గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, జులై 2026, బుధవారం

గురు పూర్ణిమ సందర్భంగా ఆంధ్రామృత పాఠకులకు శుభాకాంక్షలు.

0 comments

 జైశ్రీరామ్.

అస్మత్ శ్రీ రాఘవాచార్య గురుభ్యోనమః.

నేడు ఆషాఢశుద్ధ పౌర్ణమి. అనగా గురు పూర్ణిమ. ఈ సందర్భంగా ఆంధ్రామృత పాఠకులకు శుభాకాంక్షలు.

శ్రీమన్మంగళ మూర్తులైన గురువుల్ చిత్తంబులుప్పొంగదా

ప్రేమన్ జూపుచు శిష్యకోటి సుఖమున్ విఖ్యాతినే కోరుచున్

ధీమాధుర్యము చూపుచుంసుగతి బోధింపన్ లసజ్ఞానమున్

క్షేమంబున్ గనుచుంటిమిప్పుడిటులన్, కీర్తింపుడయా గురున్.

గురుదేవో భవ.

జైహింద్.

"డాక్టర్‌ సి.నారాయణ రెడ్డిగారి సాహితీ వైభవం" ధ్వని రూపంలో. ... శ్రీ జీ. రామయ్యరెడ్డిరెడ్డి.తెలుగు అసిస్టెంట్,జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల,చోడవరం.

0 comments

 

జైశ్రీరామ్.
"డాక్టర్‌ సి.నారాయణ రెడ్డిగారి సాహితీ వైభవం" ఆలిండియా రేడియో ప్రసంగం.శ్రీ జి.రామయ్య రెడ్డి.తెలుగు అసిస్టెంట్,జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల,చోడవరం. 29-జూలై ,సినారె జన్మదిన సందర్భం.బ్రాడ్ కాస్ట్:29-07-2026.ఉ"07-20.
జైహింద్.

15, జులై 2026, బుధవారం

శ్రీయుతులు చింతా రామకృష్ణ వరేణ్య విరచిత లక్ష్మీ అష్టోత్తర సహస్ర నామావళిపై శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి, గారి అభిప్రాయము పంచచామరములలో.

0 comments

జైశ్రీరామ్. 

శ్రీయుతులు చింతా రామకృష్ణ వరేణ్య విరచిత లక్ష్మీ అష్టోత్తర సహస్ర నామావళిపైవారి పద్యవిశ్లేషణపై, సాదరాభిప్రాయము, పంచ చామరవృత్తాలలో.

రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,   జుత్తాడ,  

                    

                                                                           

పంచ చామరము, అష్టిఛందము నందలిది,ప్రాస నియమము కలదు, పాదమునకు16.అక్షరము లుండును

ప్రతి పాదమున,,జ,ర,జ,ర,,జ,గ,గణములుండును,యతి,9.వ,యక్షర మునకు చెల్లును

,వృ,సం:-21846

1.పంచచామరము,

         అనంత కీర్తి కామిదమ్!యశేష ముక్తి శక్తిదమ్!

         కనంగ రాని కౌముదిమ్!కఠోర  కష్ట హారిణమ్!

        అనంగ జారి సోదరిన్!యమేయ కీర్తి భామినిన్!

       మనంబు నిండు నీయుతన్!మదీయ రామ కృష్ణుకున్!

2.పంచ చామరము,

             సహస్ర నామ శ్రీ స్తుతిన్!సరాగ రంజితం బిడన్!

            ప్ర హర్ష!మెర్చు ఛందముల్!ప్రసాదంబుచేకురెన్!

            ఇహంపు ముక్తి శ్రేష్టతన్!యెలుంగు నెత్తెవాగ్ఝరుల్!

           సు హారమాయె!శ్రీ గళమ్!సుమేథ సొంపు టాశ్రియై!

3.పంచ చామరము,

           వరామ రామ కృష్ణమా!వసంత గాన కోకిలల్!

           స్థిరంపు కీర్తి గానముల్!జిగిం వెలుంగు పెంచుచున్!

          పరోప కార శక్తినిన్! ప్రభా విభావ!భాసురిన్!

          నిరంత మేథ!భా తిడన్!నిగూఢ భాష్య బోధ్యమౌ.

4.పంచ చ్మరము,

        భవాంబు దీదు నావయే!వరామ శ్రీ నుతంబ గున్!

        శివాను కూల!భక్తినిన్!శివంబు నౌ!విశేషతన్!

        కవిత్వ శోభ!పంచుమా! గరీయ తిడున్!జనాళికిన్!

        దివాధి నాధు డెల్లెడన్!స్థిరంపు శక్తి నీయుతన్!

5.పంచ చామరము,

          తెనుంగు శక్తినిన్!సదా!దిగంత వ్యాప్తి దం బవన్!

          జనాలు కూడగావలెన్ !స్వతంత్ర భారతావనిన్!

          అనాధ జేసి తెన్గునిన్  !యరాచకంబు!జేసిరే!

          ఘనంబు నాటవలెన్గణింప మాతృ భాషిలన్!

                                        ఇట్లు

                        తమ విశ్వస నీయుడు,

            వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

                            జుత్తాడ,

ఆర్యా

      నమోవాకములు,

                తమరి లక్ష్మీ అష్టోత్తర సహస్ర నామ భావామృతమునుగ్రోలి నా సాదరాభి ప్రాయము నిచ్చు చున్నాను,నమస్తే.మూర్తి,జుత్తాడ,                                                                             

జైహింద్.

కనకధారా స్తోత్రము ... పద్యానువాదము ... భావములు. ... పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

0 comments

జైశ్రీరామ్. 

కనకధారా స్తోత్రము ... పద్యానువాదము ... భావములు. ... పద్యానువాదము 

చింతా రామకృష్ణారావు.


శ్లో.  వందే వందారు మందారమిందిరానందకందలమ్ ।

అమందానందసందోహ బంధురం సింధురాననమ్ ॥

ఆ.  భక్త కల్పవల్లి, వరలక్ష్మికానంద 

కరుఁడు, నంతు లేని హరుస మునను

మెఱయు గజముఖుండు, మేల్గూర్చు గణపతి

కంజలింతు భక్తి నతుల గతిని.

భావము:  ఆశ్రయించిన భక్తులు కోరిన వరాలను ఇచ్చే కల్పవృక్షము వంటివాడు, లక్ష్మీదేవికి అత్యంత ఆనందాన్ని కలిగించేవాడు, అపరిమితమైన ఆనంద సమూహంతో ప్రకాశిస్తున్నవాడు, గజముఖుడు అయిన శ్రీ విఘ్నేశ్వరునికి నేను నమస్కరిస్తున్నాను.

శ్లో.  అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ

భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ ।

అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా

మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ॥ 1 ॥

గీ.  హరికి పులక భూషలు గొల్పు నిరుపమ రమ,

వర తమాలముకుళభూష బంభరమన

నొప్పి, సంపదల్ గొనునది,గొప్ప సిరులు

కంటిచూపుతో నొసఁగు శ్రీ కాంత నాకు

మంగళంబులు కూర్చుత మహిత గతిని.

భావము: శ్రీహరి యొక్క శరీరానికి పులకలు అనే ఆభరణాలను అలంకరిస్తున్నది, తమాల వృక్షం యొక్క మొగ్గలను ఆశ్రయిస్తున్న తుమ్మెదల గుంపు వలె ఉన్నది, సమస్త సంపదలను స్వీకరించినది, మరియు కడకంటి చూపుల చేతనే సకల శుభాలను ప్రసాదించేది అయినటువంటి లక్ష్మీదేవి యొక్క కటాక్ష వీక్షణాలు నాకు మంగళమును చేకూర్చుగాక.

శ్లో.  ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః

ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని ।

మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా

సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః ॥ 2 ॥

గీ.  పతి ముఖంబును జూచుచున్ బరవసించు

నట్టి రమ ముఖపద్మము నధివసించు

సిగ్గునొప్పు నేత్రషడంఘ్రు లగ్గలముగ

నాకు నన్నిసంపదలిచ్చుఁ గాక భువిని.

భావము: శ్రీహరి యొక్క ముఖారవిందం వైపు లక్ష్మీదేవి తన చూపులను పదే పదే సంతోషంతో, సిగ్గుతో అటుఇటు తిప్పుతోంది. ఆ సమయంలో ఆమె కదలాడుతున్న కళ్ళు... పెద్దదైన కలువ పూవుపై వాలుతున్న తుమ్మెదల వరుసలాగా మనోహరంగా ఉన్నాయి. అలా పాలసముద్రం నుండి ఉద్భవించిన ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కటాక్ష వీక్షణాలు నాకు అష్టైశ్వర్యాలను ప్రసాదించుగాక!

శ్లో.  ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం-

ఆనందకందమనిమేషమనంగతంత్రమ్ ।

ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం

భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః ॥ 3 ॥

చ.  ప్రియమెసలార శ్రీహరి వరిష్ట నిమీలిత నేత్రుఁడయ్యె, స

జ్జయములు గొల్ప నొప్పెడి భుజంగశయాంగన దివ్య మైన యా

ప్రియుని ముఖంబు గాంచెడి పవిత్ర కనీనిక పక్ష్మ నేత్రముల్

జయములు సంపదల్ మరియు చక్కని బుద్ధిని నాకొసంగుతన్.

భావము: శ్రీ మహావిష్ణువు ఆనందంతో తన కన్నులను కొద్దిగా మూసుకొని ఉన్నాడు. ఆ సమయంలో ఆయన ఆనందానికి నిధిగా, రెప్పవాల్చకుండా, మన్మథుని వశంలో ఉన్నాడు.అటువంటి సమయంలో, శ్రీ మహాలక్ష్మి మాత యొక్క కటాక్ష వీక్షణాలు కొద్దిగా వంకరగా, నల్లని కనుపాపలతో, కనురెప్పల అంచులతో కూడిన ఆమె కళ్ళ యొక్క చూపులు నా సంపదలకు, శ్రేయస్సుకు మరియు సకల ఐశ్వర్యాలకు కారణమగుగాక!

శ్లో.  బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా

హారావళీవ హరినీలమయీ విభాతి ।

కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా

కల్యాణమావహతు మే కమలాలయాయాః ॥ 4 ॥

ఉ.  సిరి చూపుల్ ప్రసరింప నీలమణులే చిందన్రుచుల్ దివ్యమౌ

హరి వక్షంబున కౌస్తుభంపు కెలకుల్ వ్యాప్తంబయెన్ కాంతులే,

హరికిన్ గోర్కెలు తీర్చు లక్ష్మి కనులన్ వ్యాపించునాదీప్తులే,

పరమార్థంబగు మంగళంబులిడుతన్ బ్రాఖ్యాతిగా నాకిలన్.

భావము:శ్రీహరి వక్షఃస్థలమునందు, కౌస్తుభమణికి ఇరువైపులా ప్రకాశిస్తున్న లక్ష్మీదేవి యొక్క కటాక్ష వీక్షణాలు... శ్రీమహావిష్ణువు మెడలో ఉన్న ఇంద్రనీలమణుల హారము వలె మెరిసిపోతున్నాయి. తామరపుష్పంలో నివసించే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్ష మాలలు, సమస్త కోరికలను తీరుస్తూ నాకు సకల శుభాలను ప్రసాదించుగాక!

శ్లో.  కాలాంబుదాళిలలితోరసి కైటభారేః

ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ ।

మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః

భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ॥ 5 ॥

చ.  అసిత మనోజ్ఞ దేహుఁడగునా హరి వక్షముపైన నొప్పె రా

జసమున భార్గవాత్మజ, ప్రశస్తిగ వారిదప్రంక్తిలోపలన్

మిసిమి పసిండి తీగయ కనంగ? ననన్, జగదేకమాతగా

నసదృశరీతినొప్పెడు, ననంతశుభంబులు నాకుఁ గొల్పుతన్.

భావము: నల్లని మేఘాల సమూహం వలె మనోహరమైన, విశాలమైన వక్షస్థలం కలిగినవాడు, కైటభాసురుడనే రాక్షసుడిని సంహరించినవాడు అయిన విష్ణుమూర్తి వక్షస్థలంపై ప్రకాశిస్తున్న లక్ష్మీదేవి... నల్లని మేఘాలలో మెరిసే మెరుపుతీగ వలె కనిపిస్తోంది. సమస్త జగత్తులకు తల్లి అయినది, పూజనీయమైన దివ్య స్వరూపం కలిగినది, భృగు మహర్షి కుమార్తె అయిన ఆ లక్ష్మీదేవి  నాకు సర్వశుభాలను ప్రసాదించుగాక.

శ్లో.  ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్

మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన ।

మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం

మందాలసం చ మకరాలయకన్యకాయాః ॥ 6 ॥

గీ.  ఏ రమా కటాక్షఫలంబహీనగతిని

విష్ణు వక్షంబునన్ మరున్ బ్రీతి నిలిపె

నా రమానుగ్రహంబు నే కోరుచుంటి,

నాకు లభియించుఁ గాక యనారతంబు.

ఉ.  ఏ వనితా కటాక్షమున నీశుని మారుఁడు తా జయించియున్,

జావును గాంచి నప్పటికిఁ, జక్కని శ్రీ మధుమాధినీ హృదిన్

ధీవరుఁడై గ్రహించి గణుతిన్ గనె మంగళ మూర్తిగా, సదా

యావనితాలలామయగు నబ్ధిజపుత్రి కటాక్షమొందెదన్. 

భావము: మన్మథుడు ఏ లక్ష్మీదేవి యొక్క కటాక్ష వీక్షణం వల్లనే మురారిని (మధుమాథిని) మోహింపజేసి, సర్వమంగళప్రదమైన స్థానాన్ని (లక్ష్మీదేవి వక్షఃస్థలాన్ని) పొందగలిగాడో, అటువంటి సముద్రపు కుమార్తె (లక్ష్మీదేవి) యొక్క మందమైన, దయతో కూడిన కటాక్ష వీక్షణాలు నాపై కూడా కాస్త ప్రసరించుగాక!

శ్లో.  విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం

ఆనందహేతురధికం మురవిద్విషోఽపి ।

ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం

ఇందీవరోదరసహోదరమిందిరాయాః ॥ 7 ॥

ఉ.  దానము చేయఁ గల్గును పదంపడి యింద్రును పీఠమైన, నా

 దానవ వైరి విష్ణుని ముదంబునఁ దేలఁగఁ జేయఁగల్గు, నిం

పైన వినీలకైరవ మహత్తర తేజమునొప్పు శ్రీ రమా

మానవతీకటాక్షములు మాకు లభించుత నిత్యమిద్ధరన్.

భావము: సకల సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణాకటాక్షాలు లోకాలను పాలించే ఇంద్ర పదవిని సైతం దానం చేయగలవు మరియు సాక్షాత్తు శ్రీహరికే పరమానందాన్ని కలిగించగలవు. అటువంటి నీలికలువ రేకుల వంటి మనోహరమైన లక్ష్మీదేవి చూపులు.. దయచేసి నాపై కొద్ది క్షణాల పాటు ప్రసరించు గాక!

శ్లో.  ఇష్టా విశిష్టమతయోఽపి యయా దయార్ద్ర

దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే ।

దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాం

పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః ॥ 8 ॥

గీ.  కోరికలు పొంద నేరని వారు కూడ

స్వర్గపదమును గాంతురు వారిజాక్షి

లక్ష్మి కడగంటి చూపులన్,  లభ్యమగుత

నాకునున్ బుష్టిఁ గొల్పగ శ్రీకరముగ.

భావము: లక్ష్మీదేవి కటాక్షం ఎటువంటిదంటే, కోరిన కోరికలను తీర్చుకునే విశిష్టమైన బుద్ధి లేని సామాన్యులు కూడా, అమ్మవారి దయతో నిండిన ఆ ఒక్క చూపు వలన సులభంగా స్వర్గపదాన్ని  పొందుతారు. వికసించిన తామర పువ్వు లోపలి భాగం వలె కాంతివంతమైన ఆ లక్ష్మీదేవి చూపులు, నాకు ఇష్టమైన సంపదలను, పురోగతిని (పుష్టిని) అనుగ్రహించుగాక

శ్లో.  దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా-

మస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే ।

దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం

నారాయణప్రణయినీనయనాంబువాహః ॥ 9 ॥

గీ.  అంతు లేని దయావృష్టి నందఁ జేయు

జనని! సంసార తాపపీడనను వగచు

పక్షినమ్మ! నా దుఃఖంబు పారద్రోలి

పాపములువాప ననుఁ గాంచు భక్తిఁ గొలుతు.

భావము: "ఓ లక్ష్మీదేవీ! అపారమైన దయగల కటాక్షాలు కలిగిన దానవు. సంసార తాపముతో బాధ పడుతున్న, దీనుడైన ఈ పక్షి శిశువు పై నీ కరుణారసమనే ధన వర్షాన్ని కురిపించు. ఆ వర్షం వీని పాపాలను, కష్టాలను శాశ్వతంగా దూరం చేయుగాక." 

శ్లో.  గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి

శాకంభరీతి శశిశేఖరవల్లభేతి ।

సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై

తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై ॥ 10 ॥

గీ.  ఏ జనని విష్ణు పత్నిగా, నీశు సతిగ,

బ్రహ్మరాణిగా సృష్టిని వరలఁ గొల్పి,

కాచి రక్షించి,  మడఁచు, శాకంబరి, కన

నా జనని లక్ష్మియే, యామె కంజలింతు.

భావము: ఆ లక్ష్మీదేవి సరస్వతి, విష్ణుమూర్తి సతి. భూమిని పోషించే శాకంభరి. శివుని ప్రియమైన భార్య పార్వతిగా ఉంది. సృష్టి, స్థితి, లయలు అనే క్రీడలలో నెలకొని ఉన్నది, సమస్త భువనాలకు గురువైన ఆ పరమేశ్వరుని అర్ధాంగి అయిన లక్ష్మీదేవికి నమస్కరిస్తున్నాను. 

శ్లో.  శ్రుత్యై నమోఽస్తు శుభకర్మఫలప్రసూత్యై

రత్యై నమోఽస్తు రమణీయగుణార్ణవాయై ।

శక్త్యై నమోఽస్తు శతపత్రనికేతనాయై

పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమవల్లభాయై ॥ 11 ॥

ఉ.  వందనమాచరించెదను భవ్యశుభప్రదవేద లక్ష్మికిన్,

వందనముల్ రతీసతికి భద్రగుణార్ణవయైన లక్ష్మికిన్,

వందనముల్ సభక్తిగను పద్మనివాసినిశ్రీ రమాంబకున్,

వందనముల్హరిప్రియకు, భాస్కర తేజకు పుష్టిదాత్రికిన్.

భావము:  శుభకరమైన పనులకు ఫలితాన్ని ప్రసాదించే వేదరూపిణి అయిన శ్రుతికి నమస్కారం.రమణీయమైన గుణాలకు సముద్రం లాంటిదైన రతీదేవి (లక్ష్మీ) స్వరూపిణికి నమస్కారం.పద్మము (శతపత్రం) నివాసంగా కలిగిన శక్తి స్వరూపిణికి నమస్కారం.సకల సంపదలను, పోషణను ఇచ్చే దేవదేవుడైన పురుషోత్తమునికి (విష్ణుమూర్తికి) ప్రియురాలైన లక్ష్మీదేవికి నమస్కారం.

శుభకరమైన పనులకు ఫలితాన్ని అనుగ్రహించే వేదస్వరూపిణి అయిన లక్ష్మీదేవికి నమస్కారము. రమణీయమైన గుణాలకు సముద్రమైన లక్ష్మీదేవికి నమస్కారము. సర్వశక్తి స్వరూపిణి మరియు పద్మము నందు నివసించే లక్ష్మీదేవికి నమస్కారము. సకల సంపదలను, పుష్టిని ప్రసాదించేది, మరియు పురుషోత్తముని ప్రియమైన భార్య అయిన లక్ష్మీదేవికి నమస్కారము.

శ్లో.  నమోఽస్తు నాళీకనిభాననాయై

నమోఽస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై ।

నమోఽస్తు సోమామృతసోదరాయై

నమోఽస్తు నారాయణవల్లభాయై ॥ 12 ॥

గీ.  పద్మ తుల్య ముఖ రమకు వందనములు,

పాలకడలిపట్టి రమకు వందనములు,

వర సోమసుధల సహోదరికి నతులు,

భాగ్యద హరివల్లభకును వందనములు.

భావము: పద్మము వంటి సుందరమైన ముఖము గల లక్ష్మీదేవికి నమస్కారము. పాలసముద్రము నుండి ఉద్భవించిన తల్లికి నమస్కారము. చంద్రునికి మరియు అమృతమునకు సోదరి అయిన దేవికి నమస్కారము. శ్రీమన్నారాయణుని  ప్రియమైన భార్యకు నమస్కారము.

శ్లో.  నమోఽస్తు హేమాంబుజపీఠికాయై

నమోఽస్తు భూమండలనాయికాయై ।

నమోఽస్తు దేవాదిదయాపరాయై

నమోఽస్తు శారంగాయుధవల్లభాయై ॥ 13 ॥

గీ.  స్వర్ణపద్మపీఠికకును వందనములు,

వసుధనేలెడి తల్లికి వందనములు,

దయను దేవతలనుగాచు తల్లికి నతి,

శార్ఙ్గపాణిరాణికి నతుల్ శతమొనర్తు.

భావము: బంగారు పద్మపీఠంపై ఆసీనురాలైన లక్ష్మీదేవికి నమస్కారము. భూమండలానికి అధిపతి అయిన తల్లికి నమస్కారము. దేవతలకు సైతం దయను, కరుణను ప్రసాదించే దేవికి నమస్కారము. శార్ఙ్గమనే ధనస్సును ధరించిన శ్రీహరి కి ప్రియురాలైన మహాలక్ష్మికి నమస్కారము.

శ్లో.  నమోఽస్తు దేవ్యై భృగునందనాయై

నమోఽస్తు విష్ణోరురసిస్థితాయై ।

నమోఽస్తు లక్ష్మ్యై కమలాలయాయై

నమోఽస్తు దామోదరవల్లభాయై ॥ 14 ॥

గీ.  వందనంబులు శ్రీ భృగు నందనకును!

విష్ణు వక్షస్థయైన దే వికి ప్రణతులు

పద్మవాసిని లక్ష్మికి వందనములు,

భవ్య దామోదరసతికి వందనములు.

భావము: భృగు మహర్షి కుమార్తె  అయిన లక్ష్మీదేవికి నమస్కారములు. శ్రీమహావిష్ణువు యొక్క వక్షఃస్థలము పై నివసించే లక్ష్మీదేవికి నమస్కారములు. పద్మమునందు నివసించే లక్ష్మీదేవికి నమస్కారములు. దామోదరుడైన  శ్రీహరికి ప్రియమైన భార్య అయిన లక్ష్మీదేవికి నమస్కారములు.

శ్లో.  నమోఽస్తు కాంత్యై కమలేక్షణాయై

నమోఽస్తు భూత్యై భువనప్రసూత్యై ।

నమోఽస్తు దేవాదిభిరర్చితాయై

నమోఽస్తు నందాత్మజవల్లభాయై ॥ 15 ॥

ఉ.  వందనమమ్మ కాంతియుత! వందనముల్ శతపత్రనేత్ర! నా

వందనమమ్మ భూతి యుత! వందనముల్భువనప్రసూతికా!

వందనమమ్మ దేవగణవందిత! సుందర పాదపంకజా!

వందనమమ్మ! నంద సుత వల్లభ! వందనమమ్మ శ్రీరమా!

భావము: తామర పువ్వుల వంటి కన్నులు కలిగిన లక్ష్మీదేవికి, కాంతి స్వరూపిణికి నమస్కారము. సమస్త భువనములను సృష్టించిన తల్లికి మరియు ఐశ్వర్య స్వరూపిణికి నమస్కారము. దేవతల చేత సైతం పూజింపబడుతున్న దేవికి నమస్కారము. నందుని కుమారుడైన శ్రీకృష్ణునికి ప్రియురాలైన లక్ష్మీదేవికి నమస్కారము.

శ్లో.  సంపత్కరాణి సకలేంద్రియనందనాని

సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి ।

త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని

మామేవ మాతరనిశం కలయంతు మాన్యే ॥ 16 ॥

గీ.  సంపదలు కొల్పు నింద్రియ సౌఖ్యమిచ్చు

సకల సామ్రాజ్య విభవంబు చక్కనిచ్చు,

పాపహరములు జనని! నీ పాదయుగళి,

యట్టి నీ పాదయుగళికి నంజలింతు.

భావము: కమలాల వంటి నేత్రాలు కలిగిన అమ్మా! నీకు చేసే నమస్కారాలు సంపదలను కలిగిస్తాయి. సమస్త ఇంద్రియాలకు ఆనందాన్ని చేకూరుస్తాయి. సమస్త సామ్రాజ్యాలను ఇచ్చే వైభవాన్ని కలిగి ఉంటాయి. సమస్త పాపాలను హరించడంలో సమర్థమైనవి. అటువంటి ఓ పూజ్యనీయమైన తల్లీ! నీ పాదాలకు చేసే నమస్కారాలు ఎల్లప్పుడూ నన్నే ఆవరించియుండుగాక

శ్లో.  యత్కటాక్షసముపాసనావిధిః

సేవకస్య సకలార్థసంపదః ।

సంతనోతి వచనాంగమానసైః

త్వాం మురారిహృదయేశ్వరీం భజే ॥ 17 ॥

గీ.  ఎవరు త్రికరణశుద్ధిగా నిందిర! తమ

సేవ చేయుదురో వారి చిత్తమెఱిఁగి,

తీర్తు వమ్మరో కోరికల్ దీపితముగ

నట్టి నీ పాదయుగళికి నంజలింతు.  

భావము: ఎవరు శ్రీహరి (మురారి) హృదయేశ్వరి అయిన లక్ష్మీదేవిని త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తారో, ఆ భక్తులకు లక్ష్మీదేవి యొక్క కటాక్ష వీక్షణం సమస్త సంపదలను, సకల కోరికలను అనుగ్రహిస్తుంది. అటువంటి లక్ష్మీదేవిని నేను సేవిస్తూ నమస్కరిస్తున్నాను.

శ్లో.  సరసిజనిలయే సరోజహస్తే 

ధవళతమాంశుకగంధమాల్యశోభే ।

భగవతి హరివల్లభే మనోజ్ఞే

త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ ॥ 18 ॥

గీ.  పద్మమున్ జేతఁ గల్గిన పద్మ నిలయ!

ధవళ వస్త్ర మాలలు సుగంధముల వెలుగు

భగవతి! వినుత హరివల్లభా! మనోజ్ఞ!

భూతి త్రిభువనములకిడు పూజ్యురాల

నాకిల ప్రసన్నవగుమమ్మ! శ్రీకరముగ.

భావము: పద్మములో నివసించుదానా! చేతిలో పద్మమును ధరించినదానా! మిక్కిలి తెల్లనైన వస్త్రములు, గంధము, పూలదండలతో శోభిల్లుదానా! సకల ఐశ్వర్యములు, మహిమలు కలిగిన దేవీ! శ్రీహరి  కి అత్యంత ప్రియమైనదానా! మనస్సును ఆకర్షించే మనోహరమైన రూపము కలదానా! ముల్లోకములకు సంపదలను, శ్రేయస్సును ప్రసాదించుదానా! నా యందు ప్రసన్నురాలవగుము .

శ్లో.  దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట

స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీమ్ ।

ప్రాతర్నమామి జగతాం జననీమశేష

లోకాధినాథ-గృహిణీం-అమృతాబ్ధిపుత్రీమ్ ॥ 19 ॥

గీ.  దిక్కరులుస్వర్ణపాత్రలన్ దెచ్చినట్టి

భవ్య స్వర్గంగనభిషిక్త దివ్యదేహ

లోకజననియు, లోకేశు శ్రీకర సతి

కడలిపుత్రికిఁ దొలిప్రొద్దు నిడుదు ప్రణతి.

భావము: దిగ్గజములు బంగారు కలశములతో తీసుకువచ్చిన ఆకాశగంగ యొక్క పవిత్రమైన, నిర్మలమైన జలములతో అభిషేకింపబడిన దివ్యమైన శరీరము కలది, సమస్త జగత్తులకు తల్లి, లోకపాలకుడైన శ్రీమహావిష్ణువు యొక్క ధర్మపత్ని, క్షీరసముద్రుని పుత్రిక అయిన ఆ తల్లికి ప్రతిరోజూ ఉదయమే నమస్కరిస్తున్నాను.

శ్లో.  కమలే కమలాక్షవల్లభే త్వం

కరుణాపూరతరంగితైరపాంగైః ।

అవలోకయ మామకించనానాం

ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః ॥ 20 ॥

గీ.  కమలనేత్రుని వల్లభా! కమలవాస!

కరుణ నొలికెడి నీ కడగంటి చూపు

నేమియును లేని నాపైననే పడంగ,

చేయుమమ్మ మున్ముందుగా, చిత్తమలర.

భావము: ఓ పద్మాసనంలో ఉండే దేవి! ఓ విష్ణుమూర్తి సతీమణీ! దయతో నిండి, తరంగాల వలె కదలాడే నీ కటాక్ష వీక్షణములతో అత్యంత దీనుడను, ఏమీ లేనివాఁడనయిన నన్ను దయతో వీక్షించు. నేను నీ కరుణకు ప్రథమమైన, ఎలాంటి కపటము లేని సహజమైన పాత్రగా అనుగ్రహించు. 

శ్లో.  స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం

త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ ।

గుణాధికా గురుతర-భాగ్య-భాగినో [భాగినః]

భవంతి తే భువి బుధభావితాశయాః ॥ 21 ॥

చ.  ప్రతిదిన మెవ్వరీ కనక రమ్యసుధారపఠించి భక్తితో

నతులిత వేదరూపిణి ననంతజగజ్జననిన్ రమాసతిన్

స్తుతి యొనరింతురో, సుగుణశోభితులై, వర భాగ్యశాలురై,

బ్రతుకుచు వారు ధాత్రి బుధ భావితులై వెలుగొందుగావుతన్.

భావము: వేదస్వరూపిణియు, ముల్లోకాలకు తల్లియు, లక్ష్మీదేవియు అయిన శ్రీహరి ప్రియురాలిని, ఎవరైతే ప్రతిరోజూ ఈ స్తుతులతో పూజిస్తారో, వారు ఈ భూమిపై ఉత్తమ సద్గుణములు కలవారై, గొప్ప అదృష్టవంతులై, పండితుల చేత  ప్రశంసింపబడే మనస్సు కలవారుగా ప్రకాశిస్తారు.

శ్లో.  సువర్ణధారాస్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితమ్ ।

త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమో భవేత్ ॥

గీ.  శంకరాచార్యకృత ప్రశస్తమయిన

కనకధారాస్తుతిన్ మూడుకాలములను

ప్రతిదినంబును పఠియించు భక్తులిలను

ధనమునార్జింతురిలపైన ధనదునివలె.

భావము: శ్రీ ఆది శంకరాచార్యులు రచించిన సువర్ణధారా స్తోత్రాన్ని ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం క్రమం తప్పకుండా పఠించేవారు కుబేరునితో సమానమైన అపారమైన సంపదను, ఐశ్వర్యాన్ని పొందుతారు.

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ కనకధారాస్తోత్రం సంపూర్ణమ్ ।

భావము:"పరమహంస పరివ్రాజకాచార్యులైన శ్రీ గోవింద భగవత్పాదుల వారి శిష్యుడైన శ్రీ శంకర భగవత్పాదుల చే రచింపబడిన ఈ 'కనకధారా స్తోత్రం' ఇంతటితో సంపూర్ణమైనది."

\తెలుగు పద్యానువాదము ... చింతా రామకృష్ణారావు.

జైహింద్.

14, జులై 2026, మంగళవారం

70. శ్లోII మంచే సదాశివమయే ... నినరణ అందించినవారు. శ్రీ తాడేపల్లి పతంజలి.

0 comments

 

జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.🙏🏽

మూకపంచశతి..ఆర్యా శతకము.

70. శ్లోII  మంచే సదాశివమయే పరశివమయ లలితపౌష్ప పర్యంకే  

అధిచక్రమధ్య మాస్తే కామాక్షీనామ కిమపి మమ భాగ్యమ్! 

తే.గీ.II  అమరె పరమ శివుఁడను  పర్యంకము గల

మహిత  సదాశివమయమైన మంచముపయి

సౌమ్య సద్రూపమయిన శ్రీచక్రమందు

నాదు భాగ్యమై కామాక్షి మేదురముగ.

తాII శ్రీచక్ర మధ్యమున పరమశివుఁడు అనుపుష్ప పర్యంకముగల సదాశివమయమైన మంచమునందు కామాక్షీదేవి యనెడి నా భాగ్యము కూర్చొని యున్నది.   

అమ్మ దయతో🙏🏽

చింతా రామకృష్ణారావు.

ఈ శ్లోకమునకు శ్రీ తాడేపల్లి పతంజలి మహోదయులు ఈవిధంగా వివరణనంద్ఫించారు.

     శ్రీచక్రం అనే అమ్మవారి ఇంట్లో, దాని మధ్యభాగంలో సదాశివుడే ఒక మంచంగా ఉన్నాడు. ఆ మంచం పైన పరమశివుడే ఒక అందమైన పూలపానుపు (మెత్తటి పరుపు) లాగా అమరి ఉన్నాడు. అటువంటి పరశివుడనే పూలపానుపుపై నా అదృష్ట దేవత అయిన కామాక్షీదేవి వైభవంగా కూర్చొని ఉంది.

​శ్లోకం వెనుక ఉన్న అంతరార్థాలు

​ఈ శ్లోకంలో మూకకవి అమ్మవారి వైభవాన్ని, ఆమె సర్వోత్కృష్టతను వర్ణించడానికి కొన్ని రహస్య సంప్రదాయాలను ఉపయోగించారు. 

​1. పంచప్రేత మంచం (అమ్మవారి ఆసనం)

​శాక్త సంప్రదాయం ప్రకారం అమ్మవారు కూర్చునే మంచానికి ఒక ప్రత్యేకత ఉంది.

​ఈ మంచానికి ఉన్న నాలుగు కోళ్ళు (కాళ్ళు) ఎవరు అంటే—బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు.

​ఈ నలుగురిపై ఆధారపడి ఉండే పై పలక (లేదా నవారు) సదాశివుడు.

​సృష్టి, స్థితి, లయ, తిరోధానాలను చేసే ఈ ఐదుగురు అమ్మవారి శక్తి లేకపోతే శవాలతో (ప్రేతములతో) సమానం. అందుకే దీనిని 'పంచప్రేత మంచం' అంటారు.

​ఈ మంచం పైన, వీరందరికీ అతీతుడైన పరమశివుడు పూలపానుపులా ఉంటే, ఆయనపై అమ్మవారు అధిష్ఠించి ఉంది. అంటే అమ్మవారు విశ్వంలోని అత్యున్నత శక్తులన్నిటికంటే పైన ఉన్నదని అర్థం. ఆదిశంకరుల 'సౌందర్యలహరి' లోని భావననే(శివాకారే మంచే) మూకకవి ఇక్కడ మరింత అందంగా వర్ణించారు.

​2. సదాశివమయ మంచం అని ఎందుకు అన్నారు?

​మంచానికి నాలుగు కాళ్ళు (బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు) ఉన్నప్పటికీ, మనం కూర్చోవడానికి ముఖ్యమైనది పై పలక లేదా నవారు. ఆ పై భాగమే సదాశివుడు. సదాశివుడు అంటే జీవులపై 'అనుగ్రహం' కురిపించే శక్తి. మంచంలో కాళ్ళకంటే పలకకే ప్రాధాన్యత ఎక్కువ కాబట్టి, దీనిని "సదాశివమయ మంచం" అని పిలిచారు. పూలపానుపు లాంటి పరశివునిపై అమ్మవారు కూర్చోవడం అనేది, శివ-శక్తుల అభేద స్థితిని (ఇద్దరూ ఒక్కటే అనే భావనను) తెలియజేస్తుంది.

​3. శ్రీచక్ర రహస్యం (మంచమా? పూలపల్లకీనా?)

​తంత్ర శాస్త్రం ప్రకారం శ్రీచక్రం మధ్యలో ఉండే 'బిందువు' అమ్మవారి స్థానం.

​ఇక్కడ 'పౌష్పపర్యంకం' అనే పదానికి పూలపానుపుతో పాటు 'పూలపల్లకి' అనే అర్థం కూడా వస్తుంది.

​సాధారణ మంచం అయితే భూమికి ఆని ఉంటుంది. కానీ పూలపల్లకి అయితే భూమికి తగలకుండా పైకి ఉంటుంది. దీనిని మోసే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు మాత్రమే భూమిని తాకుతుంటారు.

​శ్రీచక్ర సంప్రదాయంలో మధ్యలో ఉండే బిందువును విడిగా గీయకపోయినా, అది పైనున్న ఆకాశ తత్వంలో (బిందు స్థానంలో) వెలుగుతూ ఉంటుందని ఈ పల్లకి భావన మనకు సూచిస్తుంది.

మొత్తంగా ఈ శ్లోకం ద్వారా మూకకవి—సృష్టిని నడిపించే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది దేవతలందరూ అమ్మవారి పాదాల చెంత సేవకులుగా ఉంటే, ఆ జగన్మాత కామాక్షి సర్వోన్నతమైన పీఠంపై నా భాగ్యదేవతగా విరాజిల్లుతోందని ఎంతో అద్భుతంగా స్తుతించారు.

🕉️🙏🕉️

శ్లోకమునకు చక్కని వ్యాఖ్యానమునందించిన పతంజలి మహోదయులకు ధన్యవాదములు.

జైహింద్.