గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, సెప్టెంబర్ 2026, బుధవారం

ఉత్తరాంధ్రకు గోదావరి జలకళ.

0 comments

 జైశ్రీరామ్.

ఉత్తరాధ్ర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు, ప్రజల దాహార్తిని తీర్చేటందుకు, పరిశ్రమలావసరాలను తీర్చేటందుకు పోలారం ఎడమకాల్వనుండి జలాలను రప్పించిన విడుదల చేసిన అపర భగీరథుఁడు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారాచంద్రబాబునాయుఁడు గారు. వీరి ఋణం ఆంధ్రప్రదేశ్ తీర్చుకోలేనిది అనుటలో ఏమాత్రం సందేహం లేదు.

నాకు బాగా గుర్తు. మా చిన్నప్పుడు ఒక సభలో మాకు పోలవరం ప్రోజెక్ట్ కావాలి అని ప్రజలడిగితే నాటి ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్।డిగారు చూడు నాయనా ఆ ప్రక్కనేముంది? అని అడిగారు ఒకవైపు చూపిస్తూ, ఆ వ్యక్తి ఒక పెద్ద ఎత్తైన కొం।డ ఉందం।డి అన్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగారన్నారు చూచావుగా ఆ కొండ ఎంత ఎత్తుంద్।ఓ? ఆంతఎత్తు ధనం మనకు కావాలి ఆ ప్రోజెక్టు కోసం. మన రాష్ట్రం పేదది ఎలా సాధ్యమౌతుందో చెప్పు? అన్నారు. మొక్కవోని పట్టుదలౌంటే ఇది సాధ్యమే అని మన ముఖ్యమంత్రివర్యులు రుజువు చేశారు.

ఇంతటి అద్భుత అసాధారణకార్యక్రమ నిర్వహణాదక్షులగు ముఖ్యమంత్రివర్యులకు శిరసువంచి పాదాభివందనం చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎలా ఉండఁగలదు?

ముఖ్యమంత్రివర్యులు నిండుగా నూట యిరవై సంవత్సరాలు ఆయుర్దాయం కలిగి రాష్ట్రప్రజలకు ఆశాదీపంగా జీవితాలలో కాంతిరేఖలు నింపుతూ ఉండాలని మనసారా కోరుకొందాము.

విజయోఽస్తు ముఖ్యమంత్రివర్యా! దిగ్వివిజయోఽస్తునిత్యమ్.
జైహింద్.



రేనాటి సూరీడు...తృతీయాశ్వాసము.

0 comments

తృతీయాశ్వాసము.

శా.  శ్రీలక్ష్మీనరసింహ దైవమ! జయశ్రీభాగ్యసంధాయకా!
నీ లీలల్ గణియింప మాకుఁ దరమా, నీవే మమున్ ధాత్రిపై
క్రాలన్ బుట్టఁగఁ జేయుచున్, గరుణతోఁ గాపాడుచున్, నిత్యమున్
జాలిన్ జూపుచు నిల్పుచుందువయ! నేఁ జాలన్ స్తుతింపంగ నిన్!   1.
నరసింహారెడ్డి తనతోటివారిని ప్రోత్సహించుచుఁ బలుకుట.
.  తనతో వెన్కనె యుండ వచ్చిన ఘనుల్, "ధర్మవ్యవస్థాపనా
చణుఁడీ శ్రీనరసింహరెడ్డి యనఁగా, సాధింప స్వాతంత్ర్యమున్
మనకీతండిల దైవమంచనగ" నా మాన్యుండు రాధాన్యముల్
తనతో నుండెడివారికిచ్చుచు నిటుల్ తా పల్కె విఖ్యాతిగాన్.      2.
.  పరమోదారగుణాఢ్యులార! ఘనమౌ ప్రాధాన్యతన్ గల్గు నో
పరమార్థంపు సుసాధనార్థ మిచటన్ బ్రఖ్యాతిగా నెన్నగన్,
బరతంత్రంబుల నెన్ని వాటికిఁ బ్రతిన్ భావించి చర్చించుచున్
చరియింపన్ దగుదాని నెన్నుటయె సుజ్ఞానంపు మార్గంబగున్.     3.
.  దురితుల్ భారతదేశ సంపదలనే దోచంగ నాంగ్లేయులే
పరమోపాయముతోడ వచ్చి స్థిరులై పాలింపఁగా నెంచి, సు
స్థిరమౌ భారత జాతిలోని ఘన మైత్రీబంధముల్ త్రుంచి, యం
దరి నీ ధాత్రిని వేరుచేసి,  తమదౌ దారిన్  మనన్ నిల్పిరే!      4
చ`తురంగ స్వస్తిక్ బంధ భావ గోపన చిత్ర లఘు కందము.
తురంగ గతిలో గోపిత భావము.   మనమిల - నొకటిగ - మెలఁగిన - శుభమగు
భావగోపన చిత్ర చ`తురంగ స్వస్తిక్ బంధ 
ఘు కందము.
నిపుణత నొకటిగ  మెలగిన
నిపుడిట  ప్రథమ శుభమగు మహి వినఁగ,  శుచితోన్
దపమిలను  నొకటె నుతిగ ఘ
న  పటిమఁ గన మెలగి, జగమున  వెలుఁగఁగ వలెన్.      5.
.  తనతోవచ్చెడివారలందరు నొకే దారిన్ బ్రవర్తింపగా
ఘనుఁడై రెడ్డి యొనర్పగల్గి, యచటన్ గణ్యాత్ముఁడై యోధుఁడై
మనగల్గెన్, మనునట్లు చేయఁగలిగెన్ మాన్యంబుగా నందరిన్,
మనమార్గంబది ధర్మ మార్గ మయినన్  బ్రఖ్యాతిగా వెల్గమే?     6.
శా.  యోధాగ్రేసరుడైన యోబయయు, శ్రేయోదాయకుండైన స
న్మేధా మూర్తి మహత్వ శక్తియుతుఁడౌ మేల్ పైడి వేంకన్నయున్,
స్వాధీనంబుననుండుటన్ దొరయు నిస్వార్థంబుగా నిత్యమున్
బోధన్ గల్గుచు మెల్గుచుండె ధరకున్ బూర్ణంపు స్వేచ్ఛన్ గనన్.  7.
.  భవితన్ గాంచెడి శక్తిఁ గల్గు ఘనుఁడౌ, భక్తాగ్రగణ్యుండునౌ,
స్తవనీయ ప్రతిభా సమన్వితుఁడునౌ, ధర్మాత్ముఁడౌ వేంకనన్
భువిపైఁ గల్గిన దైవమట్లు కనుచున్ బూజ్యంబుగా చూచు నీ
నవనీతాత్ముఁడు రెడ్డి, యీ ధరణిపైనన్ వెల్గె ధన్యాత్ముఁడై.   8.
మ.కో.  పాలెగాండ్రుగనున్నవారలు పన్నులన్ గొను పద్ధతిన్
మూలమంటను మార్చివేసెను పూర్తిగా తన పాలనన్
బాలెగాండ్రవ్యవస్థ రద్దయి వారికిన్  భృతినిచ్చుటే
చాలటంచును చేసె మన్రొ విషాదమున్ గలిగించుచున్.      9.
.  కొందరు పాలెగాండ్రు తమకున్ వలదీభరణంబటంచు తా
మందరునేకమైరి, తమదైన వ్యవస్థయె కోరుకొంచు, నీ
యందరునాంగ్లపాలకులనడ్డిరి మన్రొ విధానమేలటం
చిందుఁ గనంగనష్టమని యెగ్గులు పల్కి యెదిర్చిరుద్ధతిన్.     10.
గీ.  అట్టివారిని బంధించి పెట్టినారు
పుడమి పయిని కారాగారములను ప్రభువు,
లచ్చటే వారు మరణించిరయ్యొ, చేత
కాక విలపించుచున్,  దిక్కు లేకపోయె.              11.
.  చేయఁగ లేక యేదియును, చేవయుడింగిన పాలెగాండ్రు ప్రా
ధేయ పడం దొడంగిరి విధేయత చూపుచు పెంచఁగా భృతిన్,
సాయము చేసినట్టులుగ సర్వము దోఁచి యొసంగుచుండిరే,
యీయవమాన భారము సహించుట కష్టమటంచు నెంచిరే.   12.
.  భృతి మజ్జారికుటుంబమంతకునువారిచ్చున్ బదేడుల్ విధీ!
గతి యాకొంచెమె, పంచుకొందురదియే, గత్యంతరంబేది? యీ
స్థితిలోనన్ జయరామరెడ్డి సుతుగా చెల్వొందువాఁడౌటచే
నుతిగావారికి దక్కునట్టి భృతి తానున్ బొందునీరెడ్డియున్.  13.
గీ.  తాత తదనంతరంబున తల్లికిచ్చి
రామె పిదపనా భృతి నీయరాయె దత్తు
డయిన నరసింహరెడ్డికి నతఁడు సుతుఁడు
కాడటంచును ప్రభువులు, కర్మ మిదియె.             14.
గీ.  తండ్రి కందెడి భృతిలోనఁ దాను పదునొ
కండు రూప్యముల్  గొనుచును గడుపుచుండె.
నరసరెడ్డి యాకొంచెమున్ సరిగనొసఁగ
కుండ నాపెనా యధికారి కుత్సితుఁడయి.           15.
గీ.  రాఘవాచారి యాతఁడు, రాజువోలె
తనదు కార్యాలయమునందు తలబిరుసుగ
వచ్చువారిని యదలించి వదరుచుండు,
కాలగతిలోన తానును రాలకున్నె?                  16.
.  నరసింహుఁ డంప, కాసిము
నరసింహుని భృతి నడుగగ, నవ్వుచు నాచా
రరెరే రెడ్డియె భృత్యుఁడు,
ధర భృత్యున కితఁడు భృత్యుధర్మము నెరపెన్.      17.
గీ.  అనుచు నదిలించి, యాతని నడుగుకొనగ
రమ్మటంచును పంపుము, రానియెడల
నీయఁబోనని తెల్పుము, నేతవోలె
సేవకునిపంపుటే తప్పు, చెప్పుమిటుల.           18.
గీ.  రాఘవాచారి మాటలన్ రగిలి మనసు
నరసరెడ్డికి వినిపించి, దొరవు నీవు,
నిన్నె దూషించి భువిపైన నెన్నినాళ్ళు
బ్రతుకఁ గలఁ డతండనుచు తా బాధపడెను.            19.
శా.  క్రోధజ్వాలలె కన్నులా యనునటుల్ కోపంబె రూపంబుగా
బాధాతప్త మనోవికారమున తా వ్రాసిచ్చె నో లేఖ, నీ
వే దీనిన్ గొనిపోయి చారికిడుమా, వేయేల మాటల్ సఖా!
ఆదిత్యుం డపరాద్రిపై పొడుచుగా కాలేఖ సత్యంబగున్.      20.
గీ.  చేతఁ గొని లేఖ రెడ్డికిఁ జేసి నతుల
నశ్వమునునెక్కి యరిగె తా నతులితముగ,
గర్వభంగంబు చారికి కచ్చితమిల
ననుచు భావించుకొనుచును మనమునందు.            21.
1846. జూలై 9 ని రెడ్డి ఇచ్చిన లేఖము కాసిం రాఘవాచారికందించుట.
సీ.  ధరణి పద్ధెమ్దివందలనల్బదారున, జూలయి మాసాన, భీల రాత్రి
పదకొండు గంటల కదురునట్టుల నేల, యశ్వంబుపై చేరె నతఁడొకండు,
నరసింహు సఖుఁడు తా నరయుచు రాఘవాచారి కడకు వచ్చి చేరి యొక్క
లేఖనందించఁగా, లేని ధైర్యము చూపి యెవ రంపి రీలేఖ యిచటికంచు
గీ.  నడుగు లోపలనే చనె నచటినుండి,
లేఖ తెచ్చినవాఁడు, నా లేఖ తీసి
రాఘవాచారి చదువుచు ప్రాణములను
విడిచినట్టులె చింతించె భీతిలుచును.                22.
.  తానొక కాంతతోఁ గలిసి ధర్మవిరుద్ధముగా రమించుచున్
హీనచరిత్రుఁడై మసలు నింటనె యుండిన యట్టి చారియే
దీనముగాఁ గనంబడగ, దేవర! లేఖనెవండు పంపెనం
చేను గ్రహింపఁ దెల్పుఁడని యింతియె చారిని గోర, తా ననెన్.  23.
.  నను చంపంగ నృసింహరెడ్డి కసితో నా వాసమున్ జేరి, తా
క్షణమందున్ వధియించి నన్ను, ధనమున్ గైకొంచు పోనుంటి నే
నని వ్రాసెన్, భయమొందుచుంటి ననగా నా కాంత దిగ్భ్రాంతితో
ఘనుడట్లన్నను కావ నెవ్వరి కగున్? గాపాడుతన్ దైవమే.       24.
.  అనుచున్ బోవఁగ తా గృహ మ్మునకు, దేహభ్రాంతి నాచారి పో
యెను కార్యాలయ ప్రాంగణమ్మునకు, నే నిప్పట్టు నీ వార్తలన్
వినయంబొప్పగ పై నధీశుల కిదే విన్పింతు లేఖాకృతిన్
నను రక్షింపుడటంచు కోరుదును, లోనన్ దాగి యిందుండెదన్. 25.
.  అనుచు లేఖవ్రాసి  యధికారికంపగా,
నతడు పంపె వందలాది సైని
కులను మరియు ప్రతిభఁ గలుగు వార్సింగును   
రక్షణమును గొలుప రహిని యఁటకు.               26.
1846 జూలై10వ తేదీని మధ్యాహ్నము 12 కి కోవెలకుంట్ల ట్రెజరీపై రెడ్డి దాడి చేయుట.
సీ.  పదవతేదీ నాడు పదునెమ్ది వందల నల్బదార్ జూలయి నరస దొరయు
నైదువందల సైన్య మవని కంపించఁగా కోవెల కుంట్లకుఁ గోరివెడలు
సమయమందున జనుల్  సన్నుతించుచు రెడ్డి కాశీర్వచనములనందఁజేసి
విజయము కాంక్షించి విర్రవీగెడి పాలకులను వధించగా వలచినారు.
గీ.  జయము నరసింహరెడ్డి దిగ్జయము మీకు,
సైనికాళికి జయమగు సన్నుతముగ 
ననుచు భావించి దీవింప నందరటుల
సాగుచును వారు ముందున కేగినారు.              27.
గీ.  రాఘవాచారి, వార్సింగు, ప్రస్తుత మట
నెడ్వరుడు తోడ కూర్చుండి రెపుడు రెడ్డి
వచ్చునోయంచు భీతితో నచ్చటికని,
తప్పు చేసినన్ శిక్షయు తప్పదుకద.             28.
గీ.  భయముతో రాఘవాచారి వారుసింగు
నడిగె నరసింహరెడ్డిని వడిగ మీరు
చంపఁగలరా? యటంచును సందియముగ,
కోపముగఁ జూచె వార్సింగు క్రుంగ నతఁడు.            29.
.  కోశాధికారి! యాచా
ర్యా! శంకించెదవదేల ననుపమ రీతిన్
నీ శత్రుని మడియించెద
నా శక్తిని జూపి, చూడు నను ననె వార్సింగ్.           30.
.  అతఁడటు చెప్పుచుండగనె యావల గుఱ్ఱపుడెక్కలధ్వనుల్,
మతి చెడి వారుసింగఁట ప్రమాదమునెంచుచు వచ్చె బైటికిన్,
క్షితిఁగల ధూళి రేగునటు చేరి నృసింహుని సైనికోత్తముల్
ప్రతిన యొనర్చినట్టులుగ పట్టి వధించుచునుండిరాంగ్లులన్.    31.
.  ఏడి నృసింహరెడ్డి? యతఁడెక్కడ నుండె? నటంచు చూచుచున్,
వాఁడె మహాశ్వ మెక్కి యిటు వచ్చుచునుండె నటంచు, వారుసింగ్
పాడియ చంపు టీతనిని పంతముతోనని పట్టి కాల్చ నా
వాడు తుపాకిగుం డతని ప్రక్కగ పోయెను, తప్పె ముప్పటుల్.  32.
.  మరియొకమారు పేల్చుట కమాంతము గుండును క్రుక్కుచుండగాన్
మెరుపన వచ్చి వేగమె యమేయ బలాన్విత రెడ్డి వారుసింగ్
శిరమును బట్టి త్రుంచె తన చేతిని గల్గిన కత్తితో వడిన్.
పరమ విరోధియై చెలగు పాపిని చంపక యెట్టులుండనౌన్?   33.
వధింపఁబడఁ దగినవాఁడు ఆతతాయి
గీ. అగ్ని విషములు పెట్టెడి యధముఁడయిన,
నాయుధంబున జంపెడి యశుభుఁడయిన,
క్షేత్ర దారల హరియించు కౄరుఁదయిన
నాతతాయియె, ధర్మంబునరసి చూడ.                  34.
.  గురువయిన, బాలుడయినను,
నిరుపమ వేదవిదుఁడయిన, నెలతియె యైనన్,
ధర నాతతాయి యైనను
కరుణింపక చంపుటొకటె ఘన ధర్మంబౌన్.              35.
.  తన ధనము నీయకుండగ,
తన మానము చెరచె నాతతాయి యితండం
చని తలఁచి, యితనిఁ జంపుట
ఘన మార్గమె యనుచు నెంచె ఘనుఁడగు సైరా.         36.
.  గౌరవ హాని యన్నదిలఁ గాంచఁగ మృత్యువు కన్న మిన్న, నా
గౌరవభంగమున్ గొలిపె కారులు ప్రేలుచు సేవకాళితోన్,
వీరత నొప్పియుండియు నుపేక్ష వహింపక, యాతతాయి నే
దారుణమైన ఖడ్గమున తప్పక చంపెద  వీరరాఘవున్.     37.
.  అని మనమున చింతించుచు
ఘనమగు ధర్మంబు నెరప కదలిన ఘనుఁడా
క్షణమున భీకర ఖడ్గము
తన హస్తమునందు రెడ్డి ధరియించి, చనెన్.            38.
.  రిపుసైన్యంబది చూచి పర్విడగ, వారిన్ వీడి, యాచారిపై
కుపితుండై వధియింప వచ్చి, గదిలో కూర్చున్న వానిన్ గనెన్,
"విపరీతం బొనరించితిన్ క్షమను నీవే నన్ను రక్షింపుమం"
చపుడాచారి వచించుచున్ బడియె తా నా పాదపద్మాళిపైన్.     39.
.  వాఁడి శరీరమొక్కటియె పాదములన్ గనవచ్చె, శీర్షమో
వీడుచు ఖడ్గఘాతమున వేరుపడన్ గనె నెడ్వరుండు తా
నీడనె యున్న కీడనుచు నేగఁగ ముందున కుద్యమింప, నె
వ్వాఁడవు పోవుచుంటివని పట్టె నృసింహుఁడు హుంకరించుచున్. 40.
.  వానికి ముండనంబు ననివార్యముగా నొనరింపఁజేసి, య
వ్వానిని వస్త్రహీనునిగ పర్విడఁ జేయుచు వీథులందునన్,
జ్ఞానవిహీన! నీ ప్రభువు గారికి చెప్పుమిదంతయున్ వడిన్,
నే నయనాల కొండపయినే వసియింతును, చంప రమ్మనెన్.   41.
.  బొందిలి వంశపు హరిసిం
గందుండెను రక్షకుఁడయి యచ్చటి నిధికిన్,
కొందలమందెను రెడ్డియె
యం దక్కడకు నరుదెంచు నతనిని గనుచున్.             42.
గీ.  ఎవ్వఁడవు నీవనుచడిగె నృహరి, యతఁడు
రక్షకుఁడ నిట, యనుచు, మీర లెవ రనెను,
ధనము గొనిపొమ్ము వలయుచో ధరణిఁ బ్రతుక
మనె నతనితోడ, కాకున్న మనవనియెను.            43.
శా.  నే ధర్మంబును తప్ప, నాంధ్రుఁడనయా! నిత్యంబు కాపాడుదున్,
మేధామూర్తిగఁ దోచుచుంటివయ, స్వామిద్రోహమున్ జేయనా?
వాదౌమార్గము వీడఁబోను, ప్రభులన్ వంచింపఁగా లేను, నా
కాధారమ్ముగ జీతమిత్తురయ నా కద్దానితోఁ దృప్తియే.       44.
.  అనియాతండు వచింప, రెడ్డియనె నేలా నీవు నా మాటలన్
విన విట్లైనను చత్తు వీ వనగ నీవే గొప్ప యోధుండవా?
యనినే చేసి వధించు నన్ననెను, దేహభ్రాంతిదూరాత్ముఁడై,
కొని ఖడ్గమ్ములనిద్దరున్ వడివడిన్ ఘోరంబుగాఁ బోరిరే.   45.
గీ.  కొంత తడవిట్లు సాగ నా చెంతనున్న
యొడ్డె యోబన్న సింగును నడ్డిపైన
శూలమును గ్రుచ్చ నెంచె నావేళలోన
నోబయను తిట్టె రెడ్డి యనుచితమనుచు.             46.
.  తడబడ రిద్దరున్, రణము ధర్మముగా కొనసాగుచుండె, న
య్యెడ నరసింహరెడ్డి గ్రహియించి పరిస్థితి, యిప్పుడిచ్చటన్
దడయుట పాడి కాదనుచు, తా హరిసింగు శిరమ్ము త్రుంచగాఁ
బడెనది నేలపై, నకట పంతమదెంతటి ప్రాణహానియో?       47.
గీ.  భారతాంబకు జయమంచు పలికి తుదను
ప్రాణములు వీడె సింగు, తద్ వాక్కులు విని
రెడ్డి దుఃఖించె, హరిసింగు దొడ్డగుణము
నెన్నసాధ్యము కానంత మిన్న యనుచు.                 48.
.  చావు నకును సింగు సంసిద్ధుఁడాయెను,
వృత్తిధర్మ మరసి విడువ లేక,
సీమగడ్డపైన చిగురించు మొక్కయు
చేవఁ  గలిగియుండు చిత్ర మిదియె.                 49.
గీ.  రెడ్డి మనుజు లీలోపల దుడ్డు దాచు
చోటు వెదకుచు చేరిరి సుకరముగనె,
ధనము నాగారమందుండి కొనిరి వారు,
సాహసము గల్గ నేది యసాధ్యమగును?            50
.  అష్టశతము మీద నైదు రూప్యంబులు,
పదియణాల నాల్గుపైసలుగొని
మూటకట్టి యచట ముందుగా సిద్ధమై
నరసరెడ్డితోడఁ దరలినారు.                           51.
.  ఖండిత శీర్షముల్ గొనిరి గర్వముతో, నటఁ గల్గు నన్నిటిన్
మండగ నిప్పుపెట్టి రవి మండుచు నన్నియు భస్మమయ్యె, మా
కండ శివుండెయంచు పరమాధ్బుతమౌ నయనాలపాద్రిపై
నుండు మహేశుమ్రొక్కి, యటనుంచిరి యాగుహలోన శీర్షముల్.52.
గీ.  తానఁటేగి దువ్వూర్ఖజానాను కొల్ల 
గొట్టె నరసింహ రెడ్డి, జై కొట్టఁ జనులు,
మనసునకుబాధ కలిగిన మానవుండు
మరచిపోవునె? ప్రతిచర్య? నరయకున్నె?                 53.
.  ఇరువురి శిరములు నరికిన
భరియించుచు నూరుకొన నపప్రథ యనుచున్
నిరుపమ బలమున వచ్చెద
రరివర్గ మడంచ మమ్ము నని యనుకొనుచున్.             54.
.  నొస్సముకోట ముట్టడి ననూహ్యముగా జరిపించవచ్చు, నే
నిస్సి! దురంత దుష్కృతుల నెట్లు సహింతును ముట్టడిన్? ధరన్
దుస్సహమిద్ది, రక్షణము దూరమునుండియు చేయువాఁడినై
యస్స లుపేక్ష చేయ కనుయాయుల సూచనలందు దిప్పుడే.    55.
గీ.  అనుచు నరసింహరెడ్డి తా నాకుమళ్ళ
వినుత గోసాయి వేంకన్న ఘనునొకనిని,
యొడ్డెవంశజుండగు వీరరెడ్డినొకని
కలిసి మాటాడె రక్షణఁ గొలుపు పనులు.                 56.
మ.కో.  కోటచుట్టును కందకంబు లకుంఠితంబుగ త్రవ్వుచున్
నీటితో పరమాద్భుతంబుగ నింపునట్లుగ చేసెనే,
కోటపై మరిగించు తైలపు కుండలుండఁగఁ జేసెనే,
పోటుగా ళ్ళట నుండునట్టుల పూర్తిగా నొనరించెనే.          57.
గీ.  కందకంబులలోపల కంటకములు
గుట్టలుగ బోయఁ జేసెను పట్టుపట్టి,
చుట్టు ప్రక్కల పొలములం జొరఁగ రాని
యట్లు బురదగా చేయించె ననుపమగతి.                 58.
మ.కో.  భీకరంపు పిరంగు లెన్నియొ పెట్టి యుంచిరి బుర్జులన్,
బ్రాకటంబుగ చంపగా రిపువర్గమున్ ధృతినొప్పుచున్,
లోకమాతను నమ్మి శాత్రవలోకమున్ మడియించఁగా
నేకమై రిల పాలెగాండ్రు రహింపఁ జేయగ స్వేచ్ఛనే.        59.
గీ.  చుక్క మంచినీరైనను చూచువారి
కెక్కడను కాన రాకుండ చక్కగాను
బావులన్నియు పూడ్పించి, క్రేవలందు
గుంతలను పైన కప్పించె, కూల రిపులు.               60.
సీ.  స్థానికులకు తోడు చక్కగా నౌకురాజయిన నారాయణ నయనిధాన
పరివారమును గూర్ప,  పరమాద్భుతాయుధ సామగ్రితోడను శత్రుచయము
నుక్కడింపఁగ సిద్ధమక్కజంబుగనయి, యెదురుచూచుచునుండె నిటకు వచ్చు
వైరుల కొఱకు సుస్మేర ముఖుఁడు రెడ్డి, వారింపనతని నెవ్వారికగును?
.  స్థానబలమె కాదు, సాధించు ధైర్యంబు
నాత్మశక్తిఁ గలిగి,  యద్భుతమగు
దైవబలముకల్గి, దార్ఢ్యంబునున్ గల్గి,
రిపుల కొఱకు నరస రెడ్డి చూచె.                      61.
గీ.  కడపజిల్లాకె యధికారి కాక్రెనునకు
రాఘవాచారి హత్యవార్తయును, ధనము
దోపిడీవార్త చేరఁగా, గోపముబికి
హంతకులఁబట్టు యత్నంబు నతఁడు చేసె.               62.
గీ.  రక్షకభటులు నరసింహు నాక్షణమునె
కలిసి, విషయంబు తెలిపిరి, తెలిసికొనఁగ
హంతకుని గూర్చి చెప్పుఁడంచడిగినారు,
తానె హంతకుఁడయ్యును మౌనమూనె.                  63.
గీ.  వారి నాడింపఁ దలచి తా పలికె నిట్టు
లౌకు రాజింత పనిఁ జేసె నంచు తలతు,
నిజము నెఱుగంగ యత్నించి నేర్పుతోడ
దోషులనుపట్టఁ జూడుడం చాసఁ గొలిపె.                64.
.  అతని మాటలు విని యౌకురాజునతని
సోదరునిని బట్టి ఖేదమొదవ
చెరను బెట్టియుంచి, సరియగునాధార
ముల కొఱకని యత్నములను జరిపి.                   65.
తోటకము.(స స స స . యతి 9.)
పరిశోధన చేసిరి  వారలటుల్,
పరికింపఁగ దోషు లవశ్యముగా
పరులంచు గ్రహించిరి,  బంధితులన్
గరుణన్ విడిపించిరి, గణ్యముగాన్.                    66.
గీ.  ఔకురాజునున్, దమ్ముఁడున్  శ్రీకరుండు 
హరియె రక్షించునని నమ్మి, యతని రక్షఁ
బొంది విడిపింపఁబడి, శాంతి పొంది మదిని,
వారి వాసంబులకునేగినారు వారు.                     67.
గీ.  దోషి నరసింహరెడ్డిగాఁ దోచి యతనిఁ
బట్ట యత్నంబుఁ జేసిరి గట్టిగాను,
పట్టుబడు రెడ్డి యన్నచో నుట్టిమాట,
యతఁడు సామాన్యుఁడా? కాడు క్షితిజ నృహరి.             68.
1846 జూలై 23 న నొస్సం కోటపై బ్రిటిష సైన్యం దాడి.
.   పంపెను గూఢచారులను, పంపెను సేనల నట్టివేళ భూ
కంపము వచ్చినట్టులుగ  కాల్బలమాపని చేయ నేగె,  సా
ధింపఁగ బూనిరాజ్ఞల నధీశ్వరుఁ డిచ్చిన తీరు నెన్నుచున్,
బంపుటఁ జేయఁ గల్గినను బట్టుట యన్ననదంత సాధ్యమా?     69.
.  కోటను ముట్టడించుట కకుంఠితరీతిని నొస్సమేగగా
దీటగు సైన్యమున్ గొనుచు తీరుగ వాట్సను సిద్ధమై చనెన్,
వేటకు పోవువారలకు వెఱ్ఱిగ దాహము వేయునట్టుల
చ్చోట దగన్ జలంబులకుఁ జూచిరి వారలు, కానరా వహో!    70.
.  ధైర్యము చెప్పఁజూచి యట దారిని వాట్సను సైనికాళికిన్
గార్యము చేయఁ బూనితిమి, ఖడ్గములారిపు వర్గ రక్తమున్
శౌర్యమెలర్ప త్రాగునటు చక్కగ చేసినఁ, దీరు దాహమే,
శౌర్యము మీదు సొత్తు, గుణసన్నుత సైనికులార! యంచనెన్.   71.
.  దాహము తీరునా యభినుతంబగు వాట్సను మాటలన్ వినన్?
సాహస వీరులే యగుత, సాధ్యమెటుల్ దగ తీరకుండినన్
దేహము నిల్పుకోఁ దగిన తీరు కనంబడదే రహింపఁగన్,
మోహ విదూరులౌచు చనిపోవుటతప్ప,  విధిప్రభావమే.       72.
.  నీరములుండు తావులు గణించుచు మట్టిని కప్పివేసె నా
ధీర నృసింహరెడ్డి, తనదేకద జ్ఞాన సమృద్ధి యన్న, నా
వీరుని చేత నోటమియుఁ బ్రీతియె నాకని యెంచె వాట్సనే,
కోరుచు మృత్యువున్ గొనెడి కోర్కెయు పండునొ? పండకుండునో?  73.
.  చేరుచునుండ వాట్సను, సచేతనుఁడై నరసింహరెడ్డియున్
జేరెడివారిపైనఁ బడఁ జేసె ఫిరంగుల గుండ్ల వర్షమున్,
ధీరులు కొందరా యనిని తీవ్రముగా యెదిరించి నిల్చియున్
పోరు భయంకరంబగుటఁ బోయిరి మృత్యువు నాశ్రయించుచున్,    74.
శా.  ఉద్వేగంబున ముందుగా నడచి యుద్ధోన్మాదులౌ  కొంద రా
పద్వారమ్మగు గుంతలందుఁ బడి రేపాపంబులన్ జేసిరో?
యధ్వానంబగు నాంగ్లపాలనమునన్  హాయన్నదే లేక, యు
ద్ధధ్వాంతమ్మునఁ గొట్టుకొంచు బ్రతుకుల్ ధ్వంసంబుగాన్ జచ్చిరే. 75.
.  బిలబిల నాంగ్లసైనికులు వీరులవోలె పురోగమించగా
సలసల కాగు తైలమును చక్కఁగఁ జూచుచుఁ బోయ వారిపై,
జలజలరాలిపోయిరట చర్మము కాలినవారలందరున్,
వెలవెలఁబోయిరంద రట వింతగు నీపరిణామమెన్నుచున్.      76.
నరసింహారెడ్డి వాట్సనును వెంబడించి దండింపఁ బూనుట.
.  తొలిదగు యుద్ధమందు వినుతుల్ గొను శ్రీనరసింహరెడ్డినే
గెలుచు టసాధ్యమంచు పరికించుచు, పర్విడినారు శత్రువుల్,
సులభము కాదు గెల్పనుచుఁ జూచుచు వాట్సను పర్వుతీయుచున్
బలుమరు చూచె వెన్కకును, వచ్చుచునుండెనొ రెడ్డి? యంచు తాన్. 77.
.  సైనికపాళి కొందరటు సాగిరి వాట్సనుతోడ, గిద్దలూర్
సేనలు చేరు లోపలనె చేరె నృసింహుఁడు సైనికాళితోన్,
దీనత నాంగ్ల సైన్యము వధింపఁబడెన్ రిపుపాళి చేతిలోన్,
బ్రాణములొడ్డ తప్పదుగ భండనమందున నెట్టివారికిన్.      78.
.  నరసింహుని సైనికులును
మరణించిరి యుద్ధమున ప్రమాద వశమునన్,
గరుణకు తావే యుండదు
నిరుపమముగ నొప్పు ధర్మ నిష్ఠుల యనిలోన్.           79.
.  పరుగిడుచున్న వాట్సనును పట్టెను రెడ్డి, దురాత్మకుండ! యెం  
దరిగెద వీవు? నన్ దునుమ నాశగవచ్చిన నిన్ను వీడ, నా
కరమున నున్న ఖడ్గమున కంఠముఁ ద్రుంచెద నీకటంచు సు
స్థిరమగు నిర్ణయంబున వధింపగ నాతని, నెత్తె ఖడ్గమున్.     80.
.  బలమగు ఖడ్గఘాతమది, వంగగ వాట్సను ముప్పు తప్పె, దు
ర్బలుఁడయి పర్వు తీసె తనవాహనమైన తురంగమెక్కి, యా
ఖలుని వధింపఁ బోవు తరి గాఢతరంబగునట్టి శబ్ద మా
వల వినిపించ రెడ్డి యటుప్రక్కకు చూచె నదేమిటంచు తాన్.   81.
గీ.  చేరె వాట్స నా సైన్యమున్ సెట్టివీడు, 
ముండ్లపాడుకున్ జేరెను పూజ్యుఁడయిన 
రెడ్డి తనసైన్యమున్ గొని, గడ్డుకాల
మందు దాగియుండుటె తగుననుచుఁ దలచి.              82.
గీ.  నాట్టు, రసెలులన్ కెప్టెన్లు నవ్యరీతి
సైన్యమును గొని మరునాడు గణ్యముగను
ముండ్లపాడున కేగిరి, పోరు సలిపి,
రెడ్డినే బట్టుకొనుటకై ప్రీతితోడ.                        83.
రెడ్డి కంబం తహసీల్దార్ జంగంరెడ్డి శ్రీనివాసరావును నరుకుట.
ద్రకము. (భ ర న ర స స న గ.  యతి 11. )       
ఘోరపు యుద్ధమే జరిగె,  సంకులంబగు యుద్ధమునం దిరు తెగల్   
తీరని నష్టమున్ గనుట నార్తినేఫలితంబుగ నందిరి, మహో
ద్ధారకుఁడైన యా నృహరి యుత్తరించెను ఖడ్గముతోడ తహసీ
ల్దారు శిరంబునే,  యతఁడు నేత,  కంబము నేలెడి  శ్రీననుచు తాన్ . 84.  
.  కరమునఁ గల రక్త ఖడ్గంబుఁ గొనిపోయి
యల జగత్పతి గుడి వెలుపలున్న
కత్తులన్ని కడుగు నెత్తురుకుంటలో
కడిగినాడు రెడ్డి వడిగనపుడు.                            85.
.  ఆలయంబు వెనుక నలరారు చున్నట్టి
పాలకుంట జలము గ్రోలి రెడ్డి
దన్నునిల్పు శ్రీ జగన్నాథు దర్శించి
ప్రార్థనంబు చేసె భక్తితోడ.                            86.
.  మే మొనరించినట్టి యుపమింపఁగ రాని రణంబునందునే
యేమరుపాటు లేక వధియించితి మిప్పు డవారితంబుగాఁ
దాము ప్రతిక్రియన్ జరుపఁ దప్పక వచ్చెద రాంగ్ల పాలకుల్,
హే మహిమాన్వితా! కనికరించి యుపాయము నెన్నఁ జేయుమా!  87.
.  అనుచు వేడుచుండ నచటికి గోసాయి
వచ్చి పిలిచినట్లు,  పరవశించి
విజయ గర్వమునను విర్రవీఁగఁగ రాదు
పొంచియుండె ముప్పు కాంచుమనెను.                  88.
.  వినె గోసాయి యొసంగు సూచనలు, భావిన్ జూపు దేవుండ వో
మునిమాన్యా! తమరన్నటుల్ జరిగెడున్, బోధించుఁడీ మార్గమున్,
వినుదున్, మీ దగు మార్గమున్ నడతు నేన్, విజ్ఞాన సంపన్నిధీ!
యనుచున్ రెడ్డి వచించె తద్గురునితో నానందమొప్పారఁగాన్.   89.
.  వచ్చె నపుడె యటకు వడ్డె యోబన్నయు
చెప్పె నాంగ్ల సైన్య మప్పుడె మన
కొఱకు వెదకుచుండ్రి, ఘోరంబుగా మనన్
బట్టి చంపనెంచి పట్టుపట్టి.                           90.
.  విని యోబన్న వచించినట్టి పలుకుల్, వేగంబె యోచించి  యా
వనదుర్గంబున కేగుటొప్పుననుచున్ వాక్రుచ్చె వేంకన్న, త
ద్వనదుర్గంబును కట్టె నల్లమల ప్రాంతంబందు మీ తాతయే,
మన మాచోటికి వెళ్ళుటుత్తమము సమ్మాన్యా! నృసింహా! త్వరన్.  91.
శా.  ఆ మాటల్ నరసింహరెడ్డి విని చింతాక్రాంతుఁడై దీనతన్
బ్రేమన్ జీవన మార్గమందు ప్రజలన్ విఖ్యాతిగాఁ బ్రోచుచున్
ధీమంతుల్ భరతావనిన్ వెలుగఁగా దేదీప్యమానంబుగా 
క్షేమంబొప్పఁగ నుండ కుండ మనకీ శిక్షేల ప్రాప్తించెనో?     92.
.  ఇష్టముతోఁ గట్టించితి
కష్టంబును లెక్కఁ గొనక, ఘనమగు కోటన్
స్పష్టంబుగ నొస్సామున,
నష్టంబగుచుండె నేడు నా మది క్రుంగన్.                93.
గీ.  అనుచు నందున్న తనవారి నంపివేసె
క్రొత్తకోటలో నుండుటే యుత్తమమని,
తాను తనసైన్యమును కూడి తరలిపోయి
చేరె వనదుర్గమును నరసింహరెడ్డి.                      94.
శా.  ఆ మాన్యుండు జయింప నాంగ్లులను తా నా ప్రాంతమందుండె, సు
క్షేమంబున్ దన మిత్రపాళి కనగాఁ జిత్తంబునందెంచుచున్,
ధీమంతుల్ తమ స్వార్థమున్ మరచి ధాత్రిన్ మిత్రులున్ బేదవా
రేమాత్రంబును బాధలం గనక శోభింపంగ వాంఛింతురే.       95.
.  కానన మేలునట్టి యధికారిగ పీటరు దుర్మదాంధుఁ డా
కానలలోన వంటకని కట్టెల కేగెడి పేదవారలన్
హీనపు దృష్టితోఁ గనుచు, హేయపుమాటలతోడ తిట్టుచున్,
జ్ఞానవిహీన వాగ్ఝరిని, కష్టము కొల్పుచు వేచు పాపియై.    96.
గీ.  పల్లె రుద్రవర మడవి ప్రక్కనుండె
ప్రజలు వంటకై కట్టెలన్ బడయు చోటు,
పీటరధికారిగా వచ్చి వీరినఁటకు
రావలదటంచు శాసించె,  రాక్షసుండు.               97.
.  పీటరు పెట్టెడి యాంక్షలు
దాటగ శక్యంబు కాగ, తల్లడపడుచున్
నోటికి తిండియె కరువయి,
పాటులు పడుచుండి రకట, ప్రజలాపల్లెన్.             98.
గీ.  అచటివారిని గాంచిన యానృసింహుఁ
డడిగె మీరిట్టులుండి రాహార లోప
ముండెనా? యన, తిండికి నుండె దినుసు,
వంటకట్టెలే లేవని పలికిరపుడు.                    99.
.  జంగమ మల్లయ చెప్పెను 
సంగతి మొత్తము నృసింహ సహృదయమణికిన్,
బెంగను తీర్చగ వచ్చిన
బంగారపు కడ్డిమీరు పావన చరితా!               100.
గీ.  పీటరధికారి యడవికి, వీఁడు మమ్ము
వంటకట్టెలన్ గొనిపోవ వలదటంచు
నాంక్షలను బెట్టి వేధించునయ్య, యేమి
చేయఁగలమయ్య వానిని ? చెప్పుడయ్య!         101.
.  పొరపడి యెవ్వరైన నటుపోయిన వారినిఁ బట్టి కొట్టు, దు
స్తరమగు హింసఁ బెట్టుచును, చంపుచు పృథ్విని పాతిపెట్టు, నా
దరికిని మేతమేపుటకుఁ దా పసరంబుల తోడనేగినన్
గరువముతోడ గైకొనును కాపును చంపి, దొరా! దురుద్ధతిన్.     102.
.  స్త్రీ లటు వంటకట్టెలకుఁ జేరిన యంతనె చూచి వారలన్
బాలికలంచు, వారు పరభామలటంచును నెంచఁబోడు, దు
శ్శీలుఁడు, వారలన్ జెరచు,  చేతికి వచ్చినయట్లు కొట్టుచున్,
గాలికొలంది తన్నుఁ, గొరగాములు చేయుచు బాధపెట్టునే.     103.
గీ.  పంటలున్నవి, గింజలు పండెమాకు,
వంటకట్టెలు లేక మేముంటిమయ్య
తిండి తిప్పలు లేక యీ పండుముసలి
వారు, బాలురున్ బోదు రే దారి లేక.                   104.
నరసింహారెడ్డి అటవీ అధికారి పీటర్ ను సంహరించుట.
శా.  ఆ మాటల్ విని, నర్సరెడ్డి మదిలో నాక్రోశమున్ బొంది, మీ
క్షేమంబున్ గనువాఁడ, రండనుచు, దుశ్శీలున్ వధింపంగ, తా
నేమాత్రంబును జాగుచేయ కరిగెన్, హీనుండు పీటర్ వనిన్
కాముండై పరకాంతతో గడుపుచున్ గానంబడెన్ రెడ్డికిన్.        105.
గీ.  ఎదుట నిలిచిన రెడ్డి నిదేమి?  యెవరు
నీవు? నాకడ కేతెంచినా వదేల?
ననగ నరసింహుఁ డనియె, గర్వాంధ! నిన్ను
చంపవచ్చిన యముఁడను,  చత్తువిపుడె.              106.
.  రెడ్డిని మాయ చేసి, బెదిరించు తెరంగునఁ జేరి, పారగా
నడ్డుచు పీటరాఖ్యుని, మదాంధుఁడ! యెందులకేగఁ గల్గు దీ
రెడ్డి కృపాణధాటి కని పృథ్విని వీడక ముందె? యంచు పైఁ
బడ్డ నృసింహమ ట్లతనిపైఁ బడి ఖండనఁ జేసె  శీర్షమున్.     107.
.  జనులా దృశ్యము చూచి పొంగి, పరమేశా! మాకు  నీవే యిటుల్
ఘనుఁడౌ శ్రీ నరసింహ నామముననే కాపాడఁగా వచ్చితే? 
వినయంబొప్పఁగ నీకు మ్రొక్కెదమయా! విశ్వాసమొప్పారఁగా,
ఘనతన్ వెల్గెడి నీవె మా ప్రభువువై కాపాడు మమ్మందరిన్.    108.
.  అనుచు ప్రశంసచేసి, పరిహారము చేసితివయ్య కష్టముల్,
ఘనుఁడగు నారసింహ! నినుఁ గాదని పోవగలేము, నీకు మే
మనయము వెంటనుండెద మహంబును వీడుచు సైన్యమై ధరన్,
వినతి గ్రహింపుమంచతని వేడిరి యా ప్రజ భక్తినొప్పుచున్.     109.   
.  కంబము, చుట్టుప్రక్కఁ గల గ్రామములం గల వారలెల్లరున్
సంబరముల్ మహోద్ధతిని జక్కగఁ జేసిరి, పీటరంతమే
యంబరమంటు సంబరము హాయి నొసంగ నృసింహరెడ్డియే
సాంబుఁడటంచు మెచ్చి, విలసన్నుత రీతి సుఖాబ్ధిఁ దేలిరే.     110.
.  ఘనదావానలమట్లు వ్యాప్తమగుచున్ గంపింపఁగాఁ జేసె నీ
వనిలోఁ బీటరు హత్యవార్త ప్రభులన్, పట్టంగ నా రెడ్డి నీ
వని కెవ్వారును రారు సాహసముతో, వాని ప్రభావంబు దు
ర్జన కారాడవిలోన చిచ్చనుచు నాశన్ గల్గి ప్రాణంబులన్.     111.
.  దురహంకారముతోడనున్న దురితుల్ దుర్మార్గులౌ పాలకుల్
స్థిరమై భారత దేశమేలవలెనన్ దీపించు నాకాంక్షకున్
జరమాంకంబును జూపినట్టి ఘటనల్ జాజ్వల్యమానంబుగా
వరలం జొచ్చె నృసింహరెడ్డి యసిలోన్,  వారింపనెవ్వారికౌన్? 112.
.  భయము జనించె, పాలకుల భద్రతకే యిల దిక్కులేక, సం
శయముగ నుండె యున్కికిని, సాగవు మాదు కుయుక్తులింకపై,
జయమిక కల్ల మాకు, గుణసాంద్రుఁడు శ్రీ నరసింహరెడ్డియే
భయముగ మారె మాకనుచు పాలకవర్గము క్రుంగఁ జొచ్చెనే.  113.
గీ.  రహిని కాక్రేను, నార్టను, రసెలు, డాని
యలును, జోసప్ఫులొకచోట,  కలుసుకొనిరి,
మంతనంబులు జరిపి రవ్వంతయైన
ననుసరించెడి మార్గంబునమలు చేయ.                 114.
.  పాలకులందరేకమయి పట్టవలెన్ నరసింహునంచు,   వే
యేల నృసింహరెడ్డి నిల నెవ్వడు పట్టి యొసంగ నేర్చునో
మేలుగ నైదువేలతని మేలును గోరి యొసంగ నుంటిమం
చాలము వీడి యో ప్రకటనందరికిన్ దెలియంగఁ జేయనౌన్.    115.
.  అంతయె కాదు రెడ్డినిల నంతము చేసిన వారికింతకో
యింత ధనంబుఁ జేర్చి గణియించుచు నిచ్చెదమంచుఁ దెల్పినన్
సుంత ధనంబుపైఁ గలుగుచుండిన కోర్కెను వీడలేక తా
పంతము పట్టి రెడ్డినిల పట్టియొసంగక యుందురే ప్రజల్?     116.
.  అనఁగనె కాక్రేన్ ప్రకటన
వినుడని ప్రజ కెఱుకపరచ,  విని ప్రజలొకటై
ధనమున కాశింపక, తా
వినయముతోఁ దెలియదనిరి, వినిన ప్రజలఁటన్.           117.
.  ప్రజలు నృసింహరెడ్డిపయి భక్తిని కల్గినవారటంచు, నా
ప్రజలకు రెడ్డి నేతయని, వద్దనుకొన్నను వానితోడనే
ప్రజలు మెలంగఁ జూతురని బాగుగ నమ్మిన యాంగ్లపాలకుల్
ప్రజలకు భీతిఁ గొల్పుటకవారిత యత్నము చేయుచుండిరే.  118. 
ఆశ్వాసాంతము.
త్సాహ.  జయము జయము శ్రీనృసింహ జయమునీకు నెప్పుడున్,
భయముఁ బాపి భక్తతతిని పాలనంబు చేయుమా,
ప్రియముతోడ నిన్నుఁ గొల్తు, విశ్వశాంతిఁ గొల్పుమా,
నయనిధాన!  నీవు సతము నామదిన్ వసింపుమా .         119.
కాణ్వశాఖీయ కౌశికస గోత్ర చింతా వంశజ సన్యాసిరామారావు ధర్మపత్నివేంకటరత్నమాంబ పుణ్య దంపతుల జ్యేష్ట  పుత్రుఁడును,పూజ్య సద్గురుదేవ పరమాత్మ స్వరూప కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యుల ప్రియ శిష్యుఁడును రామకృష్ణారావు నామధేయుఁడనగు నాచే విరచింపంబడిన రేనాటి సూరీడు అను చారిత్రక ప్రబంధమున తృతీయాశ్వాసము సమాప్తము.

1, సెప్టెంబర్ 2026, మంగళవారం

రేనాటి సూరీడు...ద్వితీయాశ్వాసము.

0 comments

రేనాటి సూరీడు...ద్వితీయాశ్వాసము.

.  శ్రీమల్లక్ష్మీ సహితుఁడ!
శ్రీమన్నరసింహదేవ! చిత్తమునందున్
బ్రేమన్ గొలిచెద నిన్నున్,
ధీమంతులనిలను గాచి తేజమునిమ్మా!                1.          
నరసింహారెడ్డి యౌవనము.
.  మూతిని నూగు మీసములు పూర్తిగ మారుచు కోరమీస వి
ఖ్యాతిని పొంది యవ్వనము గణ్యముగా పొడసూపఁజొచ్చె నా
నీతికి మారుపేరయిన నిర్మలుఁడౌ నరసింహరెడ్డికిన్,
భ్రాతిని గొల్పు కాంతి తనరారగ కన్యల కాశఁ గొల్పుచున్.       2.
.  పౌరుషమే స్వరూపముగ ప్రస్ఫుటమైన స్వదేశభక్తుఁడై,
స్వారికి నశ్వమెక్కి విలసన్నుత వేగముతోడ నశ్వమున్
ధీరతఁ జూపుచున్ పరుగు తీయగఁ జేయు కుశాగ్రబుద్ధి యీ
వీరుఁడు నారసింహుఁ డరివీరభయంకరుఁడై వెలింగెనే.           3.
.  ఖడ్గము చేతఁ గల్గెడు నగణ్య మహాద్భుత  యోధుఁడైన స
మ్రాడ్గణనీయుఁ డీతఁడు, ధరన్ రిపుసంహతిపై చెలంగెనా
యీడ్గిలి పారు శత్రువు లహీనపరాక్రముఁడౌ నృసింహుఁడే
యేడ్గడయౌచు పేదలు గణించెడి తీరున నేలు రాజ్యమున్.         4.
.  ఈతని పౌరుషప్రభకనేకులు సజ్జను లేకమై ధరన్
ఖ్యాతిగ మిత్రభావన నహర్నిశలున్ దరి చేరియుండి ప్ర
ఖ్యాతిగ పాలనంబున నగాధము లేర్పడినప్పుడందరున్
నేతను వీడకుండ ధరణిన్ విహరింతురు వెన్నుదన్నుగాన్.    5.
నరసింహరెడ్డికి సైరానరసింహరెడ్డి పేరు వచ్చిన విధము.
శా.  సైరా సైర నృసింహరెడ్డి! యనుచున్, సై యన్న సై యంచు తా
చేరన్ శ్రీనరసింహరెడ్డి కడకున్ జిత్తంబులుప్పొంగగా
పారావారమువోలె పౌరు లతఁడున్ వాత్సల్యమొప్పార, సు
స్మేరాంభోజ ముఖుండునై వెలుగు నా స్నిగ్ధస్వభావంబుతోన్.         6.
.  ఈ రీతి నొప్పుచుండఁగ
సైరిక, సైనిక సులభుఁడు,  సైరానరసిం
హారెడ్డి పేరఁ బ్రబలెను,
వీరుఁడు నరసింహరెడ్డి విశ్వమునందున్.           7.
వసంత ఋతువు..ఉద్యానవన శోభ.
.  కరువున కాటకంబున ప్రకాశము రాయలసీమ కోల్పడన్,
బరమ పవిత్ర భావమున భక్తిగ నందరు దేవదేవునిన్
నిరుపమ రీతిఁ గొల్వ, కరుణించెను మేఘుఁడు చల్లబర్చె, భూ
పరిమళముల్ రహింప నొకవానను తా కురిసెన్ ఘనంబుగాన్.   8.
.  సృష్టియె వింత చూడగ, ప్రసిద్ధ మహాద్భుత శోభలొల్కు న
క్లిష్ట వసంతశోభ "తొలగించఁగ వచ్చె నవారితంపు సం
క్లిష్టపరిస్థితుల్ ప్రకృతికిన్, శుభసంహతినందఁజేసి, సం
తుష్టిని జీవకోటికిడ, దుర్జనసంహతి నాహరింపఁగన్". 
(అక్లిష్ట = తక్కువకాని, సులభమైన)                   9.
.  విరిసినపూలతో కనుల విందుగనొప్పు వనాళిఁ జూడఁగాఁ
బరుగున పిల్లవాయువులు వచ్చుచు వీచుచునుండె చల్లగా,
తరువులు పొంగిపోవుచు ముదంబున పల్లవపాణులూపుచున్
ధరణికి ధన్యవాదములు తప్పక చెప్పుడటంచుఁ దెల్పెడిన్.     10.
.  విరిసిన గున్నమామిడులు పృథ్విని శోభిలుచుండఁ జూచి,  సుం
దర వనశోభకున్ మురిసి, దర్పిలి కూయఁగ కోయిలల్,  మనో
హరమగు పంచమస్వర మహత్త్వమునెన్నుచు సత్కవీశ్వరుల్
పరవశులై కవిత్వసుధ భక్తిని రక్తిని గూర్పఁ బంచిరే.         11.
నాయికల జలక్రీడ.
.  సరసుల నిర్మలోదకము సారసనేత్రుల క్రీడనెంచుచున్
గురుతర మోద సంభ్రమము కూర్మిని పంకజపాళినుంచి, సం
బరముగ చూచుచుండగనె, వారిజ నేత్రలు వచ్చి మున్గి, సుం
దరముగ క్రీడలన్ సలిపి  తాము గృహంబులకేగి రుద్ధతిన్.      12.
.  మహితోద్యానవనంబులన్ యువత ప్రేమన్ జేయు సంచారముల్,
మహికిన్ శోభను గూర్చు నీ సరసులన్ లక్ష్యంబుగా కేళికల్
మహిళామూర్తులొనర్చుచుండఁగను గ్రామంబుల్ శుభోద్భాసమై
యహమున్ వీడి సమష్టిభావనలతో నానందమున్ వెల్గెనే.      13.
నరసింహారెడ్డి పెండ్లి.
.  యుక్తవయస్సు వచ్చుటననూహ్యముగా తన పెద్దలందరున్
రక్తిని పెండ్లి చేయుటకు శ్రద్ధవహించి యొనర్చినారు, చి
చ్ఛక్తిని నొప్పు సిద్ధమను సన్నుతరీతి వివాహమాడె తాన్,
దిక్తటి మారుమ్రోగె నినదించెడి వాద్యపుఘోష నత్తరిన్.          14.
.  రాజ్యమునందునంతట విరాజిలు పచ్చని తోరణమ్ములే,
భోజ్యపదార్థముల్ మనసు పూర్తిగ తృప్తి నొసంగె పెండ్లిలో
నాజ్యమనోజ్ఞపూర్ణములనంతసువాసననొప్పె నత్తరిన్
రాజ్యమునందు సంతసము రాజిలఁ, బొంగిరి పేదసాదలున్.    15.
సూర్యాస్తమయము - చంద్రోదయము.
ద్మనాభ వృత్తము.( త త త త త త త గగ.  యతి 13.)
ఉయ్యాలవాడన్ మహోత్సాహమున్ గాంచి యుత్సాహమే వీగి  యా పశ్చమాద్రిన్
జయ్యన్ బ్రవేశించె సూర్యుండు, శత్రుల్ మనన్ సత్వమున్ వీడు చందంబుతోడన్,
వయ్యారమున్ వెల్గు పూర్ణేందు డవ్వేళ భవ్యంబుగా వచ్చె నైంద్రిన్, భళారే,
యుయ్యాలవారింట నుయ్యాల లూగంగ నుత్సాహియై చేసి శోభింపఁ జేయన్.      16.
.  వలిపపు చీరఁ గట్టి శిఖ భాసిలఁ బూవులు పెట్టుకొన్న, ని
స్తుల సుగుణాల సిద్ధమను చూచి రమించి సుఖించె నా నృసిం
హుఁ డనుపమంబుగా, మదు లహో పులకింపగ నిద్దరొక్కటై
వలపులపంట పండునని భావనలందున తేలియాడిరే.    (ల - డ .. అభేదప్రాస )     17.
.  రాజు లనేక భార్యలను రాజిలు ధర్మము నాశ్రయించి, వి
భ్రాజిత మూర్తియౌ నృహరి భార్యగ పేరమనే ద్వితీయగా
రాజిత సాధ్వి యోబులమ రాజిలునట్లు తృతీయ భార్యగా
మోజునఁ బెండ్లి చేసికొనె పూర్ణ మనంబులఁ బొంగ నందరున్.    18.
నరసింహారెడ్డి దంపతులకు పుత్రోదయము.
.  నరసింహరెడ్డికిని మరి 
వర సిద్ధమకును గలిగె శుభప్రదు డిల స
ద్వర సుబ్బయ ప్రతిభుం డా
తరమున సత్కీర్తిఁ గొలుప ధర్మము నిలుపన్.                19.
గీ.  నారసింహ పేరమల కపారమయిన
సంతసము గొల్పు బాలిక జననమయ్యె,
నోబులమ్మకునతనికి నొప్పిదముగ
సుతులిరువురు పుట్టిరి ధాత్రి నతులితముగ.         20.  
రాయలసీమలో కొండలు కోనలు.
.  రాయలసీమలోన తనరారెడి కొండలు గుట్టలెన్నియో,
లోయ లరణ్యముల్, మదులలో పులకింతలు కొల్పు శ్రావ్యమౌ
కోయిల గానముల్, ప్రజలకున్ వరమైన యమోఘ వృక్షముల్,
కోయని యన్నచోఁ బ్రతిగ కోయని పల్కుమహాద్రులుండెనే.     21.
గీ.  తొలుత కర్నూలు జిల్లాను తూర్పు వైపు
వినుత శ్రీశైలము మొదలు ఘన తిరుమల
వరకు నుత్తర దక్షిణ ప్రాంతములను
వరలు నల్లమలాటవుల్, ప్రస్ఫుటముగ.           22.
గీ. నుతిగ ద్రోణాచలము నుండి నొస్సము వర
కుఁ గల తూర్పు పడమరలకుఁ గల కుధర
మెర్రమలలుగా కలవిల, నెన్నిచూడ,
వినుత కర్నూలు పట్టణ ఘనత యిద్ది.           23.
.  నల్లమల యడవు లిట రా
జిల్లెడు కొండలను గలిగి చెలఁగుచు, ప్రకృతిన్
జల్లని గాలుల నొప్పుచు
నుల్లము రంజిల్లఁ జేయు నోహో యనగన్.                 24.
నల్లమల కొండల్లోని పేరుసోమల వద్ద గల జగన్నాథాలయం.
గీ.  అల్ల నట నల్లమల కొండలందు పేరు
సోమల దరి జగన్నాథ ధామముండె,
చేరు భక్తుల కొంగు బంగారమతఁడు,
నరసరెడ్డి కీ ప్రాంతంబె నిరుపమ గతి.                 25.
మజ్జారి నరసింహారెడ్డిస్వప్నవృత్తాంతము. జగన్నాథదేవాలయము.
.  ఆలయమందునున్న పరమాత్ముఁడు స్వప్నమునందు రెడ్డినే
బేలగ కోరె నాలయము ప్రీతిగ నిచ్చటఁ గట్టమంచు, నా
వేళఁ దలంచె దైవ మిట వెల్గిన భక్తులకండయంచు పు
ణ్యాలఫలంబు రెడ్డి, మహితాలయమచ్చట కట్టె నిమ్ముగన్.    26.      
కార్తికపౌర్ణమికి జగన్నాథ గుట్టపై అఖండ దీపారాధన.
గీ.  వినుతమజ్జారివంశజ ఘనుడు రెడ్డి
విమల కార్తిక పౌర్ణమి వేళలందు
వాదు తప్పక ప్రతి యేట మేదురముగ
దేవదేవునికిన్ బెట్టు దీపమొకటి.                       27.
శా.  తద్దీపంబది గ్రామ గ్రామములకున్ దర్శింపగాఁ గన్బడున్,
శ్రద్ధన్ గాంచి నమస్కరింతురు జనుల్ సంతోషమొప్పారఁగా
నిద్ధాత్రిన్ శుభసంహతిన్ గొలుప నా యీశుండె యాకొండపై
నిద్దీపంబుగ వెల్గుచున్ గనఁబడున్ హృద్యంబుగా నొప్పుచున్.       28.
.  వింతగ దేవతాకృతిని వెన్నెల వోలె వెలుంగు దీపమున్
జెంతను గల్గు గ్రామముల నిర్మలభక్తులు గాంచువారు, లే
దింతటి తేజమెన్నగ గణింపును గాంచిన వెన్నెలమ్మకున్,
గొంతయినన్ లభించె నిటు క్షోణిని పుణ్యఫలంబు భాగ్యమై.        29.
.  కార్తిక పౌర్ణమిప్రభలు కావవి శ్రీ జగదీశు కోవెలన్
స్మార్తులు మంత్రముల్ చదువ చక్కఁగ శ్రీనరసింహరెడ్డి, సత్
స్ఫూర్తిని పెట్టినట్టిదగు శోభిలుచున్న యఖండదీపమౌ,
నార్తినొసంగుటిద్ది పరమాత్మకునంచు జనంబు పల్కెడున్.        30.
.  పూరీ కేగెడి ప్రజ లీ  -  దారిని వెడలుచును తాము తప్పక భక్తిన్
గోరి జగన్నాథుని గని  -  తీరికగా వెడలుచుంద్రు దేవుని కడకున్. 31.  
గోపురబంధ భావగోపన చిత్ర కందము.
గోపిత భావము ... మధ్య వరుసలో నిలువుగా ... శ్రీధరుఁడ! కనుమా.
గోపురబంధ భావగోపన చిత్ర కందము.
శ్రీతో ధరపై నిరుపమ!  -  ఖ్యాతిన్ నడయాడుమయ! సుగతి, కవితలలో,
నాతపము కనుమయ కృపను  -  భ్రాతిన్  వేడుచు క్షమాపరా! నినుఁ గొల్తున్.   32.
గీ.  సుకవివరులిట్లు ప్రార్థించి చూతురచట
గోపురమువైపు నందులో కూర్మినున్న
శ్రీజగన్నాథ దేవునిన్ జిత్రగతిని
శ్రీధరుఁడకనుమా! యని చెలఁగి పలుకు.     33.
అనేకులనేకవిధములుగ దైవప్రార్థన చేయుట.
1కందద్వయ - 2నీలోత్పలమాలా - 3మణిగణనికర గర్భ  
రసిజవృత్తము.  (మ త య న న న న స.  యతి 1 - 10 - 18)
శ్రీ మద్దైవా రాధన ప్రేమన్, శ్రిత సుగుణమణులు ప్రియ జయ కరులై
శ్రీమంతుల్ గావింతురు సీమన్, జితమనసిజులయి క్షితి వెలుగుదురే,
నేమంబున్ రక్షించుత నేమిన్, నితలము చొరక యనృతమున కెడగా
భూమీశుల్ పాలించెడు భూమిన్, బుతబుతలు విడి చవులు గొలుప ధరన్. (బుతబుత=వెలవెల పాటు) 34.
జగన్నాథుని గుట్ట సమీపముననున్న పాలకుంట నెత్తుటికుంట.
.  గుడికిన్ వెన్కనె పాలకుంట,  యచటన్ గోక్షీర భాండంబులన్
గడుగన్, దాహము తీరఁ ద్రాగుటకనంగా నీరమొప్పారుచున్,
బొడమన్ జేయును శక్తి ప్రాణితతికిన్, బొల్పున్ బ్రసాదించుచున్,
జడమున్ బాపుచుఁ బ్రేరణంబుఁ గొలుపున్, సంస్కారమున్ గొల్పుచున్.  35.
.  నెత్తుటికుంట యున్న దటనే గుడిముందట, నెత్తురొల్కు పె
న్గత్తుల నచ్చటన్ గడిగి క్రాలుటచేనది యెర్రబారె, ను
న్మత్తులు తప్ప యీ జలముఁ ద్రాగరటన్యులు,  రక్తసిక్తమై
నెత్తురువోలె నుండుట గణించుచు నెత్తుటిగుంట యందురే.   36.
రాయలసీమలో రాజకీయ పరిస్థితులు.
సీ.  పదునేడువంద లేబదిలోన దక్షిణభారతంబున తెల్లవారు కాలు
మోప, నిజాంనవాబును, హైదరాలీయు బలమైన నాయక వరులటంచు,
హైదరాలీన్ గెల్చి యారాజ్యమును పొంద పలుమార్లు దండెత్త పారఁద్రోలె
హైదరాలీసుతుండగు టిప్పుసుల్తాను, పీష్వానిజాములు వెనుకనిలిచి
గీ. సాయమందించ, టిప్పును చంపివేసి
తెల్లవారు రాజ్యమ్మును తీసుకొనుచు,
వారు సుల్తాన్కు, పీష్వాకు పంచి కొంత,
కొంతవారు పాలించుచు కుదిరిరచట.            37.
నిజాం పాలనావిముఖులైన ప్రజల తిరుగుబాటు.
.  సీమ నిజాము పాలగుటచే సహియింపని పాలెగాండ్రు నా
సీమను కల్గినట్టి ప్రజ చిత్తములన్ సహియింప నేరమిన్
దా మొకటై నవాబుల మదంబునడంపఁగఁ బూని, వార లా
సీమ నవాబు మిత్రులు నశింపఁగఁ జంపుచునుండి రత్తరిన్.      38.
.  భారత జాతి గౌరవము, భద్రత, ముఖ్యముగాఁ దలంచి యీ
భారత మాత సంతతి ప్రభాకరతేజముతోఁ జెలంగి, సు
స్మేరముఖాంబుజుల్ సెగలు చిందు భయావహనేత్రులౌచు సం
చార దురాత్ములైన యరి సంఘములన్ బరిమార్చఁ జొచ్చిరే.       39.
.  నిరుపమ సాహసాన్వితులు, నిర్భర భీకర పౌరుషాగ్నులై
కరములఁ బట్టినట్టి చురకత్తులతో నట సీమలోన  సం
చరిలు నసీడుజంగును,  ముజాఫరుజంగును బట్టి, కొట్టి, భీ
కరముగఁ గత్తులన్ బొడిచి కాష్ఠము పాలొనరించి రుద్ధతిన్.   40.
.  ధూర్త నవాబువారలను దున్మిరి సీమనటంచుఁ బ్రాకు నీ 
వార్తను నాలకించిన నవాబు భయంబునఁ గంపమంది,  సం
హర్తలు పాలెగాండ్రె,  పరిహారము చేయఁగలేనటంచు తా
నార్తినిఁ బొందె రోయుచు, ననంతర కార్యవిమూఢచిత్తుఁడై.  41.
1802లో నవాబుల పాలననుండు రాయలసీమ ఆంగ్లేయులకు దత్తమగుట.
.  వినిరి నిజాము పాలకుఁడు పృథ్వి నెదుర్కొనుచున్న దుస్స్థితిన్,
క్షణమున నాంగ్లపాలకు లగణ్య బలాన్విత సైన్యశక్తితోఁ
బనిగొని యుద్ధమున్ సలిపి, వారిని యోడఁగఁ జేయ, రాజ్యమున్
గొనుఁడని వారికిచ్చి, రది కోల్పడి క్రుంగుచు మానసంబులన్.     42.
.  పాలన చేయుచుండెడి నవాబులు రాయలసీమ రాజ్యమున్
కూళల కాంగ్లపాలకులకున్ రణమందున నోడి యిచ్చి రా
పాలిత దత్తమండలిని  వర్ధిలుచుండెడి పాలెగాళు లాం
దోళన నొందఁ జొచ్చిరిల దుర్భర దుస్స్థితి నూహచేయుచున్.     43.
పాలెగాళ్ళ వ్యవస్తపై తెల్లదొరల పెత్తనము.
సీ.  పాలెగాళ్ళహరువు పద్దెందివందల ముప్పదియారులో పుంజుకొనెను,
విజయనగరరాజవీరు లీ పద్ధతిన్ వెలయంగఁ జేసిరి ప్రీతితోడ,
నెనుబదిమంది యిట్లెలమిని పాలెగాండ్రుండిరానాటికి నొప్పిదముగ,
పాలన చే జిక్క పద్దెమ్దివందల తొంబది తొమ్దిలో దొరగ మన్రొ
గీ.  పాలెగాండ్ర వ్యవస్థను పాతిపెట్టి,
వీరి కికపైన భృతినిచ్చు వీలు కొలుపె,
స్వేచ్ఛఁ గోల్పోయి సామంత వీరులెల్ల,
భాధపడుచును క్రుంగిరి భవితనెన్ని.                     44.
సీ.  భరణ మా యుయ్యాలవాడకు పాలెగాఁడైన మల్లన్నకు నాంగ్లవిభులు
డెబ్బది రూప్యముల్ నిబ్బరంబుగ నీయ, నందు సగము సొమ్ము లతని తమ్ము
నకు పంచగా, నింక నొక ముప్పదైదె తా సకలమ్మునకు ఖర్చు సలుప మిగులు,
జాగీరు నుండి తా సరిగ ముప్పదివేల రూపాయలను పొందు రోజులందు
గీ.  ముప్పదైదు రూపాయలు పొందు టనిన
బాధ కలిగింప కెటులుండు వారి మదికి?
జీవనము సాగుటెట్టుల? భావి తరము
నకిల నాధారమేదని? వికలుఁడాయె.     45.
మ.కో.   పిక్కపాలెము పాలెగాఁడగు విజ్ఞుఁడౌ జయరామిరె
డ్డొక్క మన్మఁడు నారసింహుఁడె యుండె నాకిల దత్తుఁడై
మక్కువన్ బరిపాలనంబు సమంచితంబుగఁ జేయువాఁ
డిక్కడంచు ధనంబు నంతయు నిచ్చుచుండెను వానికిన్.      46.
గీ.  తాత జయరామిరెడ్డికిన్ ఖ్యాతిగాను
భృతిగ వేయిరూపాయలే ప్రతిగనిచ్చు
చుండి రాంగ్లేయ పాలకుల్ ఖండితముగ
పాలెగాండ్రవ్యవస్థను బాపివైచి.       47.
నరసింహారెడ్డి కోటలనేకము కట్టించుట.
.  జయరామిరెడ్డి తాతయ
ప్రియముగ తన కొసఁగు ధనము విలువను గనుచున్
నయముగ కోటలు పెక్కులు
రయముగ కట్టించె నృహరి రమణీయముగాన్.       48.
గీ.  కోటలను గట్టె రూపనగుడిని నొకటి, 
గుళ్ళదుర్తిలో మరియును, కూర్మితోడ
గిద్దలూ, రుప్పులూరుల, నొద్దికగను,
మహితుఁడుయ్యాలవాడలోన్ మహిమఁ దనర,       49.
.  ప్రజలకు కష్టకాలమున బాధలు బాప నృసింహరెడ్డియే
నిజమగు తోడునీడ ధరణిన్, క్షణమైన నుపేక్షచేయఁ డా
నిజము గ్రహించినట్టి ప్రజ నిత్యము వాని మనంబు నెంచుచున్
బ్రజనిత ప్రేమపూర్ణులయి వర్ధిలనెంచిరి వాని నీడలోన్.       50.
శ్వధాటి.  (ప్రాస యతి)(త భ య జ స ర న గ.  ప్రాసయతి. 2-9-16.)
ఉయ్యాలవాడ నరసయ్యన్ బ్రజల్ మిగుల నెయ్యంబుతోడఁ గనుచున్,
సయ్యన్న సయ్యనుచు కయ్యంబులందయిన నుయ్యాలతో మెలగుచున్,
కయ్యాలమారులగునయ్యాంగ్లపాలకుల నియ్యాంధ్ర సీమ విడువన్
జయ్యన్ నొనర్చుటకు సయ్యంచు నొక్కటయి కయ్యంబునాడ దిగిరే. 51.
శిస్తు వసూలు చేయుటకు వచ్చిన ఆంగ్లేయుల అరాచకాలు.
.  ఎల్లందొర, సభ్యా దొర, 
మళ్ళందొర, నాటరు దొర . మాలిస్ దొరయున్,
బల్లె ప్రజల బాధించిరి
చెల్లింపుడటంచు శిస్తు చేరి యచటికిన్ .                52.
ఆంగ్లేయులు మద్యంమత్తులో చేయుచున్న అకృత్యాలు.
.  మధువును గ్రోలినట్టులుగ, మద్యము గ్రోలుదు రాంగ్లపాలకుల్,
మదమును చూపుచున్ దురభిమానులు మద్యము త్రాగుచుండి సం
పదలనె యాహరింతురభిమానవిహీనులు మత్తులోననే
వదరుచునుందు రార్యుల నవారిత రీతిని నిందఁ జేయుచున్.   53.
కాంతి వృత్త గర్భ సీసము.
సారపూర్ణంపు పాశ్చాత్య సురన్ గొని వాగుదురే వారు పలువిధముల,
సిగ్గునే వీడి నిశ్చింతగ వర్తిలు - నేతలహో, సిస్తునే గొనంగ
జాలియే వీడి దుశ్చర్యలు చేయుట - తో జనులేమియు తోచకునికి,
చింతలంజిక్కి, నిశ్చేష్టులుగా ధర - నిల్చిరయా! తోడు నీడయగుచు
గీ.  నుండు రాజుల నైకత నుండకునికి,
ప్రజల బాధలు చూచినన్ బాధ కలుగు,
కొంతసిస్తునే గొనుడంచు కొందరీయ
నంతసిస్తు నిమ్మని ప్రభు లరతు రయ్యొ.                 54.
లితాంతము(గీతాలంబము) .. (త జ జ వ. యతి 8.)
దుర్వర్తనులాంగ్లు లధోగతినే 
గర్వంబునఁ గొల్పుచుఁ గ్రాలునిటన్,
సర్వంబును భారత సంపదయే 
పర్వంబుగ దోతు రవస్థ యిదే.                   55.
పేదరికపు దురవస్థలో ఉన్న రాయలసీమ .
సీ.  అలనాటి పేద రాయలసీమ దురవస్థఁ గాంచినన్ బ్రహ్మయుఁ గలతఁ జెందు,
వర్షముల్ లేక యే పంటయున్ బండని దక్షిణ భారత ధాత్రి యిద్ది,
కొండలున్ కోనలున్ మెండుగానుండుటన్ బంటలిచ్చెడి భూములుంట యరుదు,
వర్షముల్ పడిననే  పారుచుండెడి నదుల్, కర్షకాళికెపుడుఁ గఱవె చూడ
గీ.  నెఱ్ఱకొండల వరుసలున్, చుఱ్ఱు మనెడి
యెండలున్, నల్లరేగడి పండనట్టి
భూమియున్ గల్గు, సంపదల్ పూజ్యమచట,
బ్రతుకు భారంబుగాఁ దోచు ప్రాంతమిద్ది.               56.
.వె.  పచ్చదనము లేని వ్యవసాయ భూములు,
వసుధ కనుల నీటి వాగు రైతు,
బీడు భూములందు మోడులైనను లేక
పాడి తక్కు విచ్చు పసరము లయొ!                   57.
గీ.  వర్షములు లేక బీడైన పంట భూమి,
తినుటకాధారమే లేక మనెడి వారు,
జీవితమె భారమైనను చేవఁగలిగి
పౌరుషముతోఁడ బ్రతికెడి వారె వారు.                  58.
.  కరువులు కాటకమ్ములును, కాల్చుచునుండ జనాళి గుండెలన్,
వెరపును కల్గఁజేయుచు ప్రవేశము చేసిరనేక దాష్టికుల్
బిరబిర సీమపేటలకు, వేగమె పన్నును కట్టమంచు, ము
ష్కరుల దురాగతంబుల నసాధ్య మెదుర్కొనఁ బేదవారికిన్.   59.
.  పన్నులు కట్టలేమనెడి వారికిఁ జేతులు కాళ్ళు కట్టుచున్
దన్నుచు కాళ్ళతో, మరియు దండములన్ దెగ బాదుచుండి, వి
చ్ఛిన్నశరీరభాగములఁ జిందెడి రక్తముపైన కారమున్
గ్రన్నన జల్లుచుండ, కొరగాముల నోర్వక చచ్చిరెందరో.       60.
.  పండిన పంటలన్ గొనుచు వద్దని వారినెదుర్చునందరిన్
బండికిఁ గట్టి యీడ్చుకొని పట్టణముల్ గొనిపోయి యచ్చటన్
దండన వేసి, బాధలను దండిగపెట్టుచు నవ్వుచుండి రా
దండు దురాగతంబుల నెదన్ దలపోసిన బాధ కల్గెడున్.       61.
శా.  స్త్రీలన్ బట్టి వివేకహీనులగుచున్ జేలంబులన్ విప్పుచున్,
జాలిన్ వీడి శరీరభాగములపైనన్ జేతులన్ వేయుచున్,
వేళాకోళము చేయుచున్, గనులతో వీక్షించుచున్ దౌష్ట్యముల్
బేలల్ దుఃఖములంద తెల్లదొరలే భీతిన్ గనన్ జేసిరే.           62. 
టవెలది త్రయ గర్భ సీసము.  
పతుల కనులముందె పత్నులన్ జెరఁబట్టి సిస్తునీయకునికి చెరచుచుంద్రు,
ధరణి పయిని కొంగు పఱపంగఁ జేయుచు వాటిపైన నడచి వదరుచుంద్రు,
శిశువులకును పాలు చెంగుచాటుననీయ, పట్టివిడగఁ జేసి పరవశింతు
రెదురు తిరుగుచుండ నెంతవారినిగాని కుళ్ళగొట్టుచునుంద్రు తెల్లవారు,
.  ఆడువారితోడ నాటాడు దుష్టులౌ
తెల్లవారినణచి,  యెల్లరకును
రక్షణమును గొలుప ప్రభవించు దైవమం
చతివలెదురుచూచిరాతురతను.                        63.  
నరసింహారెడ్డి మనసు చలించిపోవుట.
.  శిస్తు వసూలు పేరున హసించుచు నాంగ్లదురాత్మకుల్ ప్రజన్
బస్తులు కొల్పుచున్ గొనుచు పంటలనన్నిటినొక్కమారుగా,
హస్తగతంపుపంటలనహంకృతితో గొనుచున్న వారికిన్
శాస్తి యొనర్పనెంచె  గుణసన్నుతుఁడౌ నరసింహరెడ్డియే.          64.
.  పంటపొలంబు రైతులది, పంటను పండఁగఁ జేయు రైతులే,
కంటికి రెప్పయట్టులనె కాంచుచునుందురు పంటభూమి తా
మొంటి సుఖంబు కానరు, మహోన్నత సద్గుణ శీలు రెన్నగా,
మంటిని నమ్ము కర్షకు లమాయకులౌటను మోసగింతురా?      65.
శా.  దుష్క్రీడన్ దురితాత్ములై చెలగు నా దుర్మార్గులాంగ్లేయులే
దుష్కృత్యంబులు చేయుచుండఁ గని విద్యుద్ఘాతమట్లాతఁడా
నిష్క్రోధాత్ముఁడె నారసింహుఁ డచటన్ భీతిల్ల నా మూర్ఖులౌ
దుష్క్రోధాత్ముల నెంచి, యొంచఁ దొడఁగెన్ దుర్వార ఖడ్గంబుతోన్. 66.
.  ఎవ్వని బాబు సొమ్మనుచు నిట్టుల శిస్తు వసూలు చేయ నీ
కెవ్వరొసంగి రాజ్ఞ? పొల మెవ్వరి దా ఫలసాయ మెన్న నీ
వెవ్వఁడ విట్లుశిస్తుఁగొన? హీనుఁడ! శిస్తు నొసంగ కున్న నీ
వివ్విధి దారుణంబయిన హింసలు  పెట్టుదువా? యటంచనెన్.  67.
.  మీరు వసూలు చేసి యది మీకడనే నిలవుంచినట్టి యా
మేరయెలేని శిస్తు నిక మీరు గ్రహింపగలేరటంచు వి
స్తార విశాలనేత్రముల దాగిన కోపదవాగ్నిఁ గాల్చుచున్
దారుణ ఖడ్గమెత్తి గణుతంబుగ శీర్షము త్రుంచె వారికిన్.    68.
ఆడువారివస్త్రమును విప్పుచున్నవాని చేతిని నృసింహరెడ్డి ఖండించుట.
.  ఇంతకు ముందె యొక్కఁ డొక యింతినిఁ జేతను బట్టి లాగ నా
యింతి దురాత్మకుండొకఁడు హేయముగా నను పట్టెఁ, జూచి, మీ
రంతయు రండు వీనికిక నంతిమ కాలము చూపఁగా ననన్,
జెంతనె యున్నరెడ్డతని చేతిని ఖండనఁ జేసె వెంటనే.    69.
.  ఒక్క దురాత్మకుండతివనొక్కతెఁబట్టుచు నామెకుంకుమన్
ఠక్కునఁ జేతితోఁ దుడువ నర్సవిభుండది చూచి, మూర్ఖుఁడా!
యెక్కడివాఁడ వీ విచట నింతటి దుష్కృతి నెట్లు చేసినా
వక్కట! యంచు వాని శిర మక్కడె ఖండనఁ జేసె నత్తరిన్. 70.
.  వారిని గల్గు నొక్కరుఁ డవారిత రీతిని బ్రేలుచుండగాఁ
జేరుచు వానిఁ బట్టి, యొక చెట్టున కట్టుచు కొట్టి కోలతోఁ,
బారఁగ రక్త మత్తరిని బట్టుగ కారము పూసి వానితోఁ
బోర, దురాత్మకుండ! చని పూర్తిగ పాలకులెన్నఁ దెల్పుమా.   71.
.  అనుచు నృసింహరెడ్డి, తనవారికి ధైర్యము కల్గఁ జేసి, బా
ధను విడనాడఁ జేసి, వినుతంబుగ శిస్తుధనంబునంతయున్
గొనుఁడని వారికిచ్చి, తన కోవెల చెంతకు సాగి ఖడ్గమున్
వినుతిగ చేతితోఁ గడిగె నెత్తురుకుంట నమేయ దీప్తితోన్.     72.
.  ఆవలి వైపు నా గుడికి నాతఁడు చేరుచు పాలకుంటకున్
బోవునటుల్ శ్రమంబు నట పూర్తిగ త్రాగెను నీరు, దైవమున్ 
భావనఁజేసి దర్శనము బాగుగఁ జేసి, యనంతరంబు తా
రావలె స్వేచ్ఛ దేశ మిలరంజిలగావలెనంచు కోరెనే.         73.
ప్రజలు ఐక్యమై పాలెగాండ్రను ఐక్యముతోనెదిరింపుమని కోరుట.
.  ఓరుపు సన్నగిల్లె, ప్రజ లొక్కటిగా సమకూడి దుష్టులన్
బారఁగఁ జేయఁ బూని, తమ పాలనఁ బూర్వము చేసియున్న స
ద్ధీరులు పాలెగాండ్రనుచు దివ్యముగానెదిరింప రండయా 
చీరుదు మయ్య దుష్టులను జీల్చగరండని పిల్చిరత్తరిన్.          74.
దనసాయక వృత్తము. (న భ న భ న భ ర.  యతి 1-7-13.)
ప్రజలలోపల ప్రబలుమంటలు భయమునే తొలగించగా,
సుజనులందరు చురుకుగా మనసులను మార్చిరి యేకమై,
స్వజన రక్షణ వరలఁ జేయగ, పరమ భక్తులు దీక్షతో
నిజముగా ధరణిని రహింపగ నిదుర మాని తపించిరే.     75.
మందాక్రాంత వృత్తము.(మ భ న త త గా.  యతి 11)
మాయావర్తుల్ బ్రిటిషుప్రభువుల్ మానవత్వంబె లేన
ట్లే యీనేలన్ బ్రతుకు జనులన్ హింసతో వేచుచుండన్,
రాయల్సీమన్  బ్రజలమదులన్ రాజుగా నానృసింహుం
డే యిద్ధాత్రిన్ బరవశముతో నేలువాఁడై రహించెన్.       76.
జగన్నాథుని గుట్ట - భక్తుల ప్రార్థన.
లయజ వృత్త గర్భ సీసము.
వినుతజగత్పతి! వినుమయ వేదన, విజయపథంబున, వెలుగునటుల
కనుమయ మమ్ముల, కరుణను నిత్యము, కమలదళాక్షుఁడ!  కరుణ నిలను,
జనులు సుఖంబుగ సకల శుభంబులు సమధికరీతిని,  సరసమతిని
గొనునటు చేయుము, కుజన హరా! మది గుణగణనా! హరి! కొలుతును నిను,
గీ.  పేదసాదలబ్రతుకులు వీగుచుండె,
నాత్మధైర్యమే రక్షగా నలరు జనుల
నాదుకొనుమయ్య! యో కరుణాలవాల!
యంచు ప్రార్థింత్రు భక్తులాప్రాంతమందు.               77.
గోసాయివెంకన్న దుర్గాదేవిని ప్రార్థించుట.
తివినయ వృత్త గర్భ సీసము.
సకల జయములిడు జనని! నిను సముచి - తము కొలుతున్, నీదు దయను కనఁగ,
మహిత భయహరణ! మదిని నిలు, భవము - మము విడువన్,  జ్ఞానమార్గమిమ్ము,
ధరను నయ రహిత పరుఁడు పతనదిశ - గ ధరఁ గొనున్, రాజ్యకాంక్షతోడ,
ననయ నయపథమునను నడుపు నను, రి - పుల మడువన్ జేసి పుడమినేల,
గీ.  ఆంగ్లపాలకులను బాపి యాదుకొనుము,
నీదు సంతానమును కావ నీవె తగుదు,
వమ్మ! దుర్గమ్మ! మముఁ గావ రమ్ము వేగ
మనెను గోసాయి వెంకన్న ప్రార్థనమున.               78.
క్రౌంచపదము. (భ మ స భ న న న య.  యతి 1 - 11 - 19)
వంచితులై భూస్వాములు శోకింపఁగవలయునొ యనవరతము ధాత్రిన్?
వంచనలే నిత్యంబును గావింపగ మసలుఘనులొ పరులగునాంగ్లుల్?
కొంచెము యోచింపన్వలె శిస్తుల్ గొనుటకిలనెవరొకొ? యెదురు నిల్తున్,
వంచకులన్ జంపింతును, సాధింపగవలచి, గెలువ భగవతిఁ గొల్తున్. 79.
గోసాయి వేంకన్న ఘనతను రెడ్డి వర్ణించుట.
.  సంకులమందుఁ గల్గునొక సాధ్వికి గర్భముపైన గాయమై
శంకగ నుండ, వేంకనయె చక్కఁగ గర్భము కాచె యుక్తితోన్,
వేంకన ధీమహత్వమె యవేద్యమటంచు నృసింహరెడ్డియే
యంకితమయ్యె వానికి మహత్తర సద్గురుదేవభావనన్.   80.
కంద గర్భ తేటగీతి.
పరమగురుఁడౌను వేంకన నిరుపముఁడగు
సద్గుణమణి, నిర్మలుఁడును సద్వరుఁడును,
వర సఖుఁడును, శాంకరిఁ గొల్చు వసుధ హితుఁడు,
నొకపరి కనెదనే నిప్పుడొప్పిదముగ.                   81.
దీక్షతో జగన్మాత అనుగ్రహమును పొందుట.
.  అనుచున్ భావనఁ జేయుచుండి నరసింహారెడ్డి దేవీ కృపన్
గొనగానెంచి గ్రహింప దీక్ష గురువౌ గోసాయి వేంకన్నచే,
మననంబున్ బొనరింతు నో గురువరా!   మంత్రోపదేశంబునే
జననిన్ గాంచఁగఁ జేయుడయ్య! యనగా శాంతుండు వేంకన్ననెన్. 82.     
కందద్వయ గర్భ క్రౌంచపద వృత్తము.(భ మ స భ న న న య.  యతి 1 - 11 - 19)
కాళిని పూజింపన్ వలె, కాళీ ఘనపదములు మదిఁ గని వర భక్తిన్
వాలుచు, సేవింతున్ నిను, పాలింపఁగ వలయుననుచుఁ బలుకుట యొప్పున్,
కాళియె యాత్మజ్యోతిగఁ గ్రాలున్ గరుణను గనుచును కలిమిని గూర్చున్,
గాలము పోనీకిత్తరి కాళిన్ గను జతనమునను కదలు నృసింహా! 83.
.  వత్స! మహేశ్వరీ కృపను వర్ధిలవచ్చును భక్తపాళి, సం
పత్సముపేతులై జగతి మాన్యులుగా వెలుగంగవచ్చు, నే
కుత్సితభావముల్ కనక కూర్మిని లోక హితార్థులై సదా
యుత్సహనంబుతోడను మహోద్ధతిఁ గాంచఁగ వచ్చు నెమ్మితోన్. 84.
ఉపదేశించుటకు ముందు నరసింహారెడ్డిని కరుణించమని గురువు గోసాయి వెంకన్న శ్రీమాతను 
ప్రార్థించుట.
శ్రీచక్రబంధ తేటగీతి.
శ్రీచక్రబంధ తేటగీతి.
వెలుగులమ్మ! రా! శ్రీమాత! ప్రీతిఁ జేరెఁ
గనుము, గొప్పగా శ్రీవిద్యఁ గాంచు వీని
యత్నసారమౌ శ్రీనిచ్చి హాయి నేలు,
వెలుగ జేయఁగ రెడ్డిని వేలుపీవె.                         85.
గోసాయి వేంకన్న రెడ్డికి మంత్రోపదేశము చేయుట.
.  ఉపదేశింతును నీకు మంత్రమును నీ యుత్సాహముప్పొంగగాఁ,
దపమున్ జేయుచు, మంత్రసాధనముతో దర్శింపుమా దేవతన్,
గృపతో దేవత కాంచెనా జయము నీకే నిత్యమున్ లభ్యమౌన్,
విపరీతంబగు నాత్మశక్తి యొడమున్, విఖ్యాతియున్ గల్గెడున్.    86.
ఉ.  కూరిమితోడఁ బల్కి యిటు గోప్యముగా నుపదేశమిచ్చె, వి
స్తార శుభాస్పదంబయిన శాంభవి మంత్రము భక్తినొప్పుచున్,
ధీరుఁడు నారసింహుఁడు సుధీవర వేంకన నుండి మంత్రమున్
గోరి గ్రహించి, సాధనను గొప్పగఁ జేసెను భక్తియుక్తుఁడై.      87.
నరసింహారెడ్డి ఔద్ధత్యముకొఱకు వెంటనుండుమని దుర్గమ్మను వేంకన్న ప్రార్థించుట. 
షడరచక్రబంధ శార్దూలము.
3వ వృత్తమున (కవి పేరు) రామకృష్ణ కవి.
6వ వృత్తమున (కావ్యము పేరు) రేనాటి సూరీడు.
శా.  దుర్గా! రా! కను రేని భారము, భజింతున్, సూర్యునుష్ణమ్బ! మా
వర్గా! మఞ్చిగ నా  లకించుము లసద్వాగ్ రీతివై కమ్ము, నీ
భర్గా కృష్టి తటిల్లతాధ్వమున మా వాఁడుద్ధతిన్ విచ్చు, మా
మార్గంబందున బ్రోవఁగా బ్రభలతో మావెంట నీవుండుమా!     88.
గీ.  అనుచు గోసాయి వేంకన్న ఘనతరముగ
జననినే గొల్చెఁ బ్రీతితోఁ జక్కగాను,
గురువు శిష్యులకొఱకని గురుతరమగు
బాధ్యతనుమ్రోయుటిద్దియే, ప్రబలఁజేయ.                  89.
గీ.  దీక్షఁ గొనినట్టి రెడ్డి తా దేవి కొఱకు
ధ్యానమగ్నుఁడై మనసులోఁ దలచుకొనుచు
తల్లి దుర్గమ్మనేచూచి ధన్యతఁ గన
పట్టుదలతోడనుండెను భవ్యముగను.                      90.
.  సాగుచునుండె దీక్ష, మనసార జగజ్జననిన్ మనంబునన్
వేగమె దర్శనంబు నిడ వేడెను మానసమందె, దీక్షయే
యోగముకాగ నా జననియున్ గనిపించెను మానసంబునన్,
మూగగ కండ్లు మూసుకొని పూర్తిగ లోననె జూచె నాతఁడున్.     91.
.  జతనము సాగె దేవి మనసారగ దర్శన మిచ్చె రెడ్డికిన్,
స్తుతమతియైన శాంభవిని చూచి మనంబునఁ బొంగిపోవుచున్
సతతము నామనంబుననె జక్కఁగనుండుము శంభురాణి! నే
క్షితిపయి ధర్మరక్షణము చేసెడి వేళను కావఁగా ననెన్.          92.
.  వెండియుఁ బల్కెనిట్టు లిలవేలుపువైన నినున్ స్మరించి, నా
కండగ నుంటి వీవనుచు నాత్మబలంబున దేశరక్షకై
నిండుమనంబుతో నిలిచి, నే నరివర్గముపై రణంబునే
మెండగు ధైర్యమున్ గలిగి మేదినిఁ జేసెద, నీవె యుండినన్.      93.
.  భారత సంపదల్ కొనగ పాప దురాత్మకులాంగ్ల పాలకుల్
చేరిరి భారతావనికిఁ జేసెద  మిచ్చట వర్తకం బటం
చారసి రాజులందు కలహంబులు పెట్టి, యనైక్యతన్ ధరన్
వేరు పడంగఁ జేసి రిట  విజ్ఞతనే నశియింపఁ జేయుచున్.      94.
.  రాజు లనేకతన్ మసల,  ప్రాంతములొక్కొకటాక్రమించుచున్
రోజుకు రోజుకున్ బ్రబలి న్యూనముగా గనఁ జొచ్చి రీ ప్రజన్,
వాజిని ఖడ్గఘాతమున వారల నేనణగింపఁ జేయుమా,
రాజిలఁ జేయుమమ్మ ననుఁ బ్రార్థనఁ జేయుచు నీకు మ్రొక్కెదన్.    95.
జగన్మాత నరసింహారెడ్డికి ఖడ్గమునిచ్చుట.
.  అన విని, నారసింహ! యసహాయమహాద్భుత శూరశేఖరా!
ఘనతరమైన దీక్షఁ గొని కాంచఁగఁ గల్గితి వీవు నన్ను, నీ
వనయము శత్రు సంహరణ నంచితరీతిని జేయనెంచుచున్
ఘనమగు ఖడ్గమిచ్చెదను గైకొనుమంచు నొసంగె వానికిన్.        96.
ఇరువైపుల దారుగనున్న అమ్మవారి అనుగ్రహము పొందిన ఖడ్గము.
.  బారెడు ఖడ్గమద్ది, పిడిఁ బట్టుకొనన్ గరవాలమై తగన్
దారును రెండువైపుల నుదంచితరీతిని కల్గి శత్రులన్
పారఁగఁ జేయునట్టిది, యపారముగా రిపు మస్తకంబులన్
వేరుగఁ జేసి మొండెములు నేలను వ్రాలఁగఁ జేయు శక్తియే.    97.
నరసింహారెడ్డి చేతిలోని కత్తి.
డ్గ బంధ సుగంధి వృత్తము.
దారు తీరు వేరు చూడ దండనండనుండరా!
రార! నిన్ వధింతునంచుఁ బ్రజ్ఞఁ జూపఁ బిల్చు రా,
రార, వేగమంచు దూకి ప్రాణ హీనుఁ జేయురా,
రారురా,  రిపుల్ధరిత్రి, రాణ్నృసింహు కత్తిరా!              98.
.  అమ్మ కరంబులన్ గొని సమంచితరీతిని నాదు ఖడ్గమే 
కొమ్మని నాకొసంగుటది గొప్పగనున్నది నాకు, నిందు చే
కొమ్మని నాకొసంగుటను గుంభనమౌ మహనీయ శక్తి, ఖ
డ్గమ్మునఁ జేరియుండినది, కల్గఁగఁ జేయ జయంబటంచు తాన్.  99.
.  అమ్మ యొసంగ గైకొనె మహాద్భుతమౌ కరవాలమున్, నృసిం
హమ్మె నృసింహరెడ్డి యన నాత్మబలంబున నొప్పుచుండి, యా
యమ్మకు మ్రొక్కి దీవనలనంతముగా గ్రహియించి, వీడుకో
లమ్మ యొసంగగాఁ దెరచె నాతని కన్నులనప్పుడచ్చటన్.       100.
.  ఇంతయు దీక్షలోననె మహేశ్వరి సత్కృపఁ జేసెనంచు, ర
వ్వంతయు శంకలేక పరమాద్భుత శక్తిగఁ జూచి ఖడ్గమున్
జెంతకుచేరి వందనము చేసి, గురూత్తము దర్శనార్థమై
పొంతనె యున్న వేంకనకుఁ బొంగుచు వందన మాచరించుచున్.  101.
.  సాంతము తెల్పె నాతనికి సన్నుత శాంభవి సత్కృపాద్యుతిన్,
భ్రాంతులు వీడిపోయినవి, భక్తియె నిల్చెను దేశమాతపై,
నంతయు మీ కృపన్ గలిగె నార్య! యటంచు వచించె రెడ్డి, వి
భ్రాంతిని పొంది యా గురుఁడు వర్ధిలుమంచు నొసంగె దీవనల్.  102.  
నరసింహారెడ్డి దళంలో చేరినవారు.
గీ.  కుంఫిణీ ప్రభుత్వము చేయు ఘోరములను
చూచి, యోర్వఁజాలని రెడ్డి వేచి, తిరుగు
బాటు చేయఁగ వీనితోఁ బాటు ప్రజలు
బోయ, వడ్డె, చంచులు, నిల్చి పోరినారు.             103.
సీ.  గురుతుల్యుఁడైనట్టి గోసాయి వేంకన్న, - కరణమశ్వద్ధామ ఘనుడు, ధరణి
జంగము మల్లయ్య,  జయశీలి దాసరి,  - రోశిరెడ్డియు చేరి రాశ కదుర,
రాజా రమేశ్వర రావును,  వనపర్తి - జామీనుదారును ప్రేమ మీర,
మునగాల రామ్ కృష్ణ, పెనుగొండను జమీను - దారులు, మహితులౌ ధీరవరులు
గీ.  నవుకు రాజు నారాయణుండతని తమ్ముఁ
డయిన వేంకట రామ్రాజు, మయిదకూరు
పాలెగాఁడు వీరారెడ్డి, వరలుచున్న
పాలెగాండ్రు చేరిరి రెడ్డి ప్రక్కకపుడు.                 104.
సీ. మార్కాపురమునేలు మహనీయుఁ డసమాన మిత్రుఁడై రెడ్డికి మేలు చేయు,
చిత్తూర్ జమీందారు చెలఁగుచు మైత్రితో నరసింహరెడ్డితో నడచుచుండె,
శ్రీకరుండై యొప్పు  శ్రీయనంతపుర జమీందారు రెడ్డికి మిత్రుఁడయ్యె,
ఘనతతో వెల్గునా కాసిముఖాను నృసింహరెడ్డిని గూడి చెలగు చుండె,
గీ.  రమ్యమైనట్టి జటుప్రోలు రాజ లక్ష్మ
ణుఁడను రాయుఁడున్, కర్నూలు పిడుగు పాప
ఖానును, సికింద్రబాద్ సలీమ్ ఖాను, మరియు
ప్రవర బనగానపల్లి నవాబు ఖాను, (తరువాత పద్యముతో అన్వయము.)105.
గీ.  కత్తియుద్ధమునందున ఘనతఁ గన్న, 
దిట్టగాపేరు పొందిన దివ్యచరితుఁ
డొడ్డె యోబయ్యయును,  ధర రెడ్డికిలను 
కుడిభుజంబుగ నిలిచెను కూర్మితోడ.            106.
గీ.  కుమ్మరి కుల సీతన్నయు కూర్మితోడ
చేరె నరసింహరెడ్డి సంస్కారమెన్ని
యతనితోపాటు నడువంగ నతులితగతి,
సైరసై యంచు తనయొక్క శక్తిఁ జూప.          107. 
గీ.  ప్రతిభులైనట్టి వీరలు ప్రజల కొఱకు,
నారసింహుని దళమున చేరినారు.
దేశ స్వాతంత్ర్య వాంఛతో దీక్షఁ బూని
ప్రాణములనొడ్డి నిలిచిరి భక్తితోడ.              108.
ఆశ్వాసాంతము.
స్రగ్విణి. (ర ర ర ర .  యతి 1-7)
నారసింహా! కృపన్ న్యాయమార్గంబునన్
ధీరచిత్తుల్ సదా  తీరుగావర్తిలన్
బ్రేరణన్ గొల్పుచున్  వేల్పువై చేయరా,
సారసాక్షుండ! నే సంస్తుతింతున్ నినున్.        109.
కాణ్వశాఖీయ కౌశికస గోత్ర చింతా వంశజ సన్యాసిరామారావు ధర్మపత్నివేంకటరత్నమాంబ పుణ్య దంపతుల జ్యేష్ట  పుత్రుఁడును, పూజ్య సద్గురుదేవ పరమాత్మ స్వరూప కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యుల ప్రియ శిష్యుఁడును రామకృష్ణారావు నామధేయుఁడనగు నాచే విరచింపంబడిన రేనాటి సూరీడు అను చారిత్రక ప్రబంధమున ద్వితీయాశ్వాసము సమాప్తము.