గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఆగస్టు 2026, శుక్రవారం

వరలక్ష్మీశుక్రవారం శుభ సందర్భంగా ఆంధ్రామృత పాఠకులకు శుభాకాంక్షలు

0 comments

 జైశ్రీరామ్

శ్రీ పరాభవ నామ సంవత్సర శారావణ శుద్ధ నవమి, వరలక్ష్మీశుక్రవారం శుభ సందర్భంగా ఆంధ్రామృత పాఠకులకు శుభాకాంక్షలు.

లక్ష్మీదేవి యనుగ్రహంబు సతమున్ లభ్యంబగున్ మీకు, స

చ్ఛూక్ష్మజ్ఞానము లభ్యమౌత, జననిన్ శోధించి మీ యాత్మలన్

లక్ష్మీ వాసముగా నొనర్చుకొండు తమరే లక్ష్మీ ప్రసాదంబుగా,

లక్ష్మీమాత దయాప్రభావమున మీ లక్ష్యంబు లీడేరుతన్.

జైహింద్.

18, ఆగస్టు 2026, మంగళవారం

శ్రీభైరపనేని పోతురాజు గొప్ప అవధానకళాతపనుఁడైన కళాశ్రీ.

0 comments

జైశ్రీరామ్.
అమ్మవారిపై భక్తి ఉన్నవారు, అమ్మవారిని త్రికరణశుద్ధిగా నమ్మినవారు,  త్రికరణశుద్ధిగా అంతటా అమ్మవారిని దర్శింపగలిగినవారు, నిర్వ్యాజంగా పరోపకారం చేసేవారు ఎంతవేగంగా అనుకున్నవి సఫలీకృతం చేసుకోగలరో మనం శ్రీ భైరపనేని పోతురాజు చౌదరీని చూచి తెలుసుకోవచ్చును.
వీరు ప్రభుత్వౌన్నతపాఠశాలలో ప్రథమాంధ్రోపాధ్యాయునిగా తమ సేవలందించుచు, విద్యార్థులకు తానే రోల్ మోడల్ గా ఉండి వారికి ప్రేరణ కలిగించాలనే సదుద్దేశ్యంతో తాను భాషాపటిమను పెంచుకొనుచు, అవధాన విద్యను అభ్యాసం చేసి అతి తక్కువ వ్యవధిలో చక్కని అవధానిగా ఎదిగి  హైదవధర్మదర్శనమయిన దర్శనం పత్రికా నిర్వాహకులైన దర్శనం శర్మగారియొక్క, వారి సహోదరులైన శ్రీ మరుమామల దత్తాత్రేయశర్మగారి యొక్క దృష్టిలో పడి వారి సమక్షంలోనే ప్రత్యక్షావధానం చేయగలిగారు అంటే మనం అర్థం చేసుకోవచ్చును వారి పట్టుదల ఎంతగొప్పదోనని. 
శ్రీ భైరపనేని పోతురాజు గారికి ఇష్టమైన గుర్తు.
అహంకారమునకు స్వార్థమునకు దూరుఁడయిన శ్రీ భైరపనేని పోతురాజుచౌదరీ...
తమ ఎదుగుదలను మాత్రమే చూచుకొనేవారు లోకంలో అనేకులుండవచ్చును. కాని తన కారణంగా సాహితీప్రియులందరూ అవధానవిద్యాకర్షకులై సాధన చేసి అవధానులుగా తీర్చి దిద్దబడాలనే మహత్తరమైన తలంపు ఉండేది జగన్మాత అనుగ్రహపాత్రులలో మాత్రమే ఉంటుంది. అట్టి అపురూపమైన వ్యక్తులలో మన పోతురాజు అవధాని ఒకరు.
శ్రీ నారాయణీ అవధాన వేదిక అనే అంతర్జాల వేదికను కల్పించుకొని, ఔత్సాహికులను ఆ సమూహ సభ్యులుగా చేర్చి వారం వారం ఒక అవధానం ఔత్సాహికులతో చేయించు వీరి వైనం సాహితీ ప్రియులకు, అవధానప్రియులకు ఆనందం కలిగించక మానదు.
శ్రీ నారాయణీ అవధాన వేదిక ద్వారా తే16 - 8 - 2026న రెండు బృహత్తరమైన కార్యక్రమాలను వ్యయప్రయాసలకోర్చి నిర్వహించుటయే వీరిమహోన్నతమైన ఉద్దేశ్యాన్ని తెలియఁజేస్తుంది.
ఇది ఆరంభశూరత్వమే అనుకొంటే పొరపాటే. సభాముఖంగా వీరి ప్రతీనెలా నిర్వహింపదలుచుకొన్న కార్యక్రమ ప్రణాళికను వివరించారు.
అట్టి  యీ జగన్మాత భక్తులు ఎవరికైనా ఆదర్శం కాకుండా ఎలా ఉంటారు?
అట్టి వీరి ఆశయాలు నిర్విఘ్నంగా నిరంతరం సాగేలా ఆజగన్మాత చేయఁగలదు. తోటివారిగా మనమంతా వారికివెన్నుదన్నుగా నిలఁబడి, మీతో మేమున్నాము అనే భరోసా యివ్వఁగలిగితే ఈ అవధాని అద్భుతాలు చేస్తారనడంలో సందేహం లేదు.
అవధాని భైరపనేని పోతురాజు గారికి జగన్మాత స్మరణపూర్వకంగా శుభాకాంక్షలందఁజేయుచున్నాను.
  
శ్రీమన్మంగళశాంభవీ తనయుఁడా! శ్రీపోతురాజాఖ్య! మీ
క్షేమంబున్ గను శాంభవీ జననియే శ్రీమార్గమున్ జూపుచున్,
ధీమంతా శతవర్షముల్ వెలుగుడీ తేజంబుతో నిట్టులే,
మీ మంచిన్ గ్రహియించు సజ్జనులు, సంప్రీతిన్ గనన్ జేయుచున్.

శుభమస్తు.
జైహింద్.




 

17, ఆగస్టు 2026, సోమవారం

తైత్తిరీయోపనిషత్తులోని శిక్షావల్లి శాంతి మంత్రము.

0 comments

 జైశ్రీరామ్.

తైత్తిరీయోపనిషత్తులోని శిక్షావల్లి ప్రారంభ శాంతి మంత్రం మరియు దాని భావము ఇక్కడ ఇవ్వబడినది.

ఓం శం నో మిత్రః శం వరుణః ।
శం నో భవత్వర్యమా ।
శం న ఇంద్రో బృహస్పతిః ।
శం నో విష్ణురురుక్రమః ।
నమో బ్రహ్మణే । నమస్తే వాయో ।
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి ।
త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ।
ఋతం వదిష్యామి । సత్యం వదిష్యామి ।
తన్మామవతు । తద్వక్తారమవతు ।
అవతు మామ్ । అవతు వక్తారమ్ ॥
ఓం శాంతిః శాంతిః శాంతిః.

మిత్రః: మిత్రుడు (పగటిని、 ప్రాణమును నియంత్రించే దేవత)

నః: మాకు

శం: సుఖమును (శాంతిని) కలవాడు అగుగాక

వరుణః: వరుణుడు (రాత్రిని、 జలమును నియంత్రించే దేవత) (మాకు సుఖమును ఇచ్చుగాక)

అర్యమా: అర్యముడు (సూర్యుని యొక్క మరొక రూపం) మాకు సుఖమును కలిగించుగాక

ఇంద్రః: ఇంద్రుడు

బృహస్పతిః: బృహస్పతి (దేవతల గురువు) (మాకు సుఖమును ఇచ్చుగాక)

ఉరుక్రమః: గొప్ప అడుగులు గలవాడు (త్రివిక్రమ రూపం ధరించిన)

విష్ణుః: విష్ణువు మాకు సుఖమును కలిగించుగాక

బ్రహ్మణే: పరబ్రహ్మమునకు

నమః: నమస్కారము

వాయో: ఓ వాయుదేవుడా!

తే: నీకు

నమః: నమస్కారము

త్వమేవ: నీవే

ప్రత్యక్షం: ప్రత్యక్షముగా ఉన్న

బ్రహ్మ అసి: బ్రహ్మము (పరమాత్మవు) అయి ఉన్నావు

త్వామేవ: నిన్నే

ప్రత్యక్షం బ్రహ్మ: ప్రత్యక్ష బ్రహ్మముగా

వదిష్యామి: కీర్తిస్తాను / పలుకుతాను

ఋతం వదిష్యామి: యథార్థమైన ధర్మమును (వేదోక్త మార్గమును) పలుకుతాను

సత్యం వదిష్యామి: లౌకికమైన సత్యమును (నిజమును) పలుకుతాను

తత్: ఆ పరబ్రహ్మము

మామ్: నన్ను (శిష్యుడైన నన్ను)

అవతు: రక్షించుగాక

తత్ వక్తారం: ఆ పాఠమును బోధించు గురువును

అవతు: రక్షించుగాక

మామ్ అవతు: నన్ను (మళ్లీ) రక్షించుగాక

వక్తారం అవతు: గురువును రక్షించుగాక.

ఈ శిక్షావల్లిలో తదుపరి
విద్య పూర్తి చేసుకుని సమాజంలోకి ప్రవేశించే విద్యార్థులకు గురువులు చేసే బోధనలలోని ముఖ్యమైనవి.
సత్యం: సత్యమును (నిజమును)
వద: పలుకుము / చెప్పుము
ధర్మం: ధర్మమును (న్యాయమైన మార్గమును)
చర: ఆచరించుము / నడచుకొనుము.
స్వాధ్యాయాన్మా ప్రమదః: వేదాధ్యయనమునందు (చదువులో) అశ్రద్ధ చేయకుము.
సత్యాన్న ప్రమదితవ్యం: సత్యము నుండి ఎన్నడూ తొలగకూడదు (ప్రమాదము 
పొందకూడదు).
ధర్మాన్న ప్రమదితవ్యం: ధర్మము నుండి ఎన్నడూ తప్పకూడదు.
మాతృదేవో భవ: తల్లిని దైవముగా భావించుము.
పితృదేవో భవ: తండ్రిని దైవముగా భావించుము.
ఆచార్యదేవో భవ: గురువును దైవముగా భావించుము.
అతిథిదేవో భవ: అతిథిని దైవముగా భావించుము.

జైహింద్.