గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, జులై 2026, శుక్రవారం

66. శ్లోII దగ్ధషడధ్వారణ్యం దరదలిత ... ఈ శ్లోకమునకు సమీక్ష బ్రహ్మశ్రీ తాడేపల్లి పతంజలి.

0 comments

 జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.🙏🏽

మూకపంచశతి..ఆర్యా శతకము.

66. శ్లోII  దగ్ధషడధ్వారణ్యం దరదలిత కుసుంభ సంభృతారుణ్యమ్‌ 

కలయే తవ తారుణ్యం కంపాతట సీమ్ని కిమపి కారుణ్యమ్‌| ౬౬ 

తే.గీ.II  ప్రథిత దగ్ధ షడధ్వరారణ్య,  దరద

ళిత కుసుంభ సంభృత రక్తిమ, తుల లేని

కంప నదికడ వెలసిన కరుణ యనగ

నొప్పు నీ జవ్వనముఁ గొల్తు నొప్పిదముగ.

తాII షడధ్వరారణ్యమును కాల్చిన, కొంచెము వికసించినట్టి కుసుంబ పుష్పముల ఎఱుపును ధరించిన, కంపా తట ప్రదేశమున వెలసినదయా స్వరూపమయిన నీ యౌవన్మును ధ్యానింతును.

నా వివరణము.

ఓం శ్రీమాత్రే నమః.

ఆర్యా! నమస్తే. అల్పజ్ఞుఁడను.

నేను అర్థము చేసుకొనగలిగినంతలో మీకు తెలుపగలను.

ప్రఖ్యాతముగా కాల్చిన షడధ్వము అను అరణ్యము కలిగిన జనని.

షడధ్వములు (షట్ + అధ్వములు) అంటే భగవంతుడిని లేదా బ్రహ్మత్వాన్ని చేరుకోవడానికి, అలాగే ఈ సృష్టి విస్తరించడానికి కారణమైన ఆరు మార్గాలు అని అర్థం. తంత్ర మరియు శాక్తేయ శాస్త్రాల ప్రకారం, ఈ మొత్తం విశ్వం శబ్దము (మాట), అర్థము (రూపము) అనే రెండు విషయాలతోనే నిండి ఉంది.శబ్ద ప్రపంచానికి సంబంధించిన మూడు మార్గాలు (శక్తి మయములు):

శబ్ద సంబంధమైనవి (వాచక అధ్వములు):

1. పదాధ్వము: పదాలు లేదా నామరూపాలకు సంబంధించిన మార్గం.

2. మంత్రాధ్వము: మంత్రాలకు సంబంధించినది.

3. వర్ణాధ్వము: అక్షరాలు లేదా వర్ణాలకు సంబంధించినది.అర్థ / ప్రపంచ సంబంధమైనవి (అవాచక అధ్వములు):

4. భువనాధ్వము: విశ్వంలో ఉండే వివిధ లోకాలు లేదా భువనాలకు సంబంధించినది.

5. తత్వాధ్వము: భూమి, జలము, అగ్ని మొదలైన 36 తత్వాలకు సంబంధించినది.

6. కళాధ్వము: సృష్టికి మరియు జీవులకు శక్తినిచ్చే కళలకు సంబంధించినది.

ఆగమ శాస్త్రాల ప్రకారం, ఈ ఆరు మార్గాల గురించిన పరిజ్ఞానం మరియు వాటి శుద్ధి ద్వారానే జీవుడు పరిపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, శివత్వమును లేదా మోక్షాన్ని పొందగలఁడు.

అమ్మ దయతో🙏🏽

చింతా రామకృష్ణారావు.

షడధ్వమును కాల్చడం ఏమిటి? అమ్మవారిని కొలవటం కాకుండా అమ్మవారి యవ్వనాన్ని కొలవటం ఏమిటి? ఇందులో ఉండే ఆంతర్యం ఏమిటి?                                             

తాడేపల్లి పతంజలి వివరణ 

షడధ్వములు (షట్ + అధ్వములు) అంటే భగవంతుడిని లేదా బ్రహ్మత్వాన్ని చేరుకోవడానికి, అలాగే ఈ సృష్టి విస్తరించడానికి కారణమైన ఆరు మార్గాలు అని అర్థం. తంత్ర మరియు శాక్తేయ శాస్త్రాల ప్రకారం, ఈ మొత్తం విశ్వం శబ్దము (మాట), అర్థము (రూపము) అనే రెండు విషయాలతోనే నిండి ఉంది.

​శబ్ద ప్రపంచానికి సంబంధించిన మూడు మార్గాలు (శక్తి మయములు):

​మన నోటి నుండి వచ్చే ప్రతి మాట, అక్షరం దైవ స్వరూపమే. శబ్ద రూపంలో ఉండే ఆ మూడు మార్గాలు ఇవే:

​వర్ణాధ్వము (అక్షరాలు):

మనం పలికే 'అ' నుండి 'క్ష' వరకు ఉన్న అక్షరాలే వర్ణాలు. సృష్టిలోని ప్రతి మంత్రానికి, ప్రతి మాటకు మూలం అక్షరాలే. భగవంతుడిని అక్షర రూపంలో ధ్యానించడం ఇందులో మొదటి మార్గం.

​పదాధ్వము (పదాలు):

కొన్ని అక్షరాలు కలిస్తే ఒక పదం అవుతుంది. భగవంతుడిని స్తుతించే పేర్లు (ఉదాహరణకు: శివ, నారాయణ, కామాక్షి వంటి నామాలు) అన్నీ పదాలే. నామస్మరణ ద్వారా భగవంతుడిని చేరుకునే మార్గం ఇది.

​మంత్రాధ్వము (మంత్రాలు):

కొన్ని పదాల కలయికతో శక్తివంతమైన మంత్రాలు ఏర్పడతాయి (ఉదాహరణకు: ఓం నమః శివాయ, గాయత్రీ మంత్రం వంటివి). ఈ మంత్రాలను జపించడం ద్వారా మనస్సును పవిత్రం చేసుకుని భగవంతుడిని పొందే మార్గం ఇది.

​అర్థ/రూప ప్రపంచానికి సంబంధించిన మూడు మార్గాలు (శివ మయములు):

​మనం కంటితో చూసే రూపాలు, భౌతిక ప్రపంచానికి సంబంధించిన మూడు మార్గాలు ఇవే:

​కలాధ్వము (శక్తులు లేదా విభాగాలు):

ఈ సృష్టి నడవడానికి ఐదు ముఖ్యమైన శక్తులు (కలలు) కారణం అవుతాయి. నివృత్తి, ప్రతిష్ఠ, విద్యా, శాంతి, శాంత్యతీతా కలలు అని వీటిని అంటారు. సృష్టి పుట్టుక నుండి మోక్షం వరకు జరిగే ప్రక్రియను నడిపించే దైవిక శక్తుల మార్గం ఇది.

​తత్త్వాధ్వము (సృష్టి మూలకాలు):

ఈ సృష్టి ఏర్పడటానికి కారణమైన మూలకాలను తత్వాలు అంటారు. మన శరీరం, ఈ ప్రకృతి పంచభూతాలతో (నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం) మరియు మనస్సు, బుద్ధి, అహంకారం వంటి 36 తత్వాలతో నిర్మితమైంది. ఈ తత్వాలన్నింటిలోనూ భగవంతుడిని దర్శించడం ఈ మార్గం యొక్క ఉద్దేశం.

​భువనాధ్వము (లోకాలు):

మనం ఉంటున్న ఈ భూలోకంతో పాటు పైలోకాలు (స్వర్గ లోకం వంటివి), క్రింది లోకాలు ఇలా విశ్వంలో ఉన్న సమస్త లోకాలను భువనాలు అంటారు. ఈ లోకాలన్నీ భగవంతుని స్వరూపాలే అని భావించి ఉపాసించడం ఈ ఆఖరి మార్గం.

ఈ ఆరు మార్గాలు (అక్షరాలు, పదాలు, మంత్రాలు, శక్తులు, తత్వాలు, లోకాలు) అనేవి భక్తుడు దైవాన్ని చేరుకోవడానికి ఉపయోగపడే మెట్లు లాంటివి. 

​షడధ్వములను (ఆరు మార్గాలను) కాల్చడం అంటే ఏమిటి?

​ఇక్కడ 'కాల్చడం' అంటే నాశనం చేయడం అని కాదు, 'లయం చేయడం' లేదా 'అజ్ఞానాన్ని తొలగించడం' అని అర్థం.

​లౌకిక బంధాల నుండి విముక్తి: మనం పైన చెప్పుకున్న ఆరు మార్గాలు (అక్షరాలు, పదాలు, మంత్రాలు, శక్తులు, తత్వాలు, లోకాలు) అనేవి ఈ భౌతిక ప్రపంచాన్ని, మన శరీరాన్ని, మనస్సును బంధించి ఉంచే బంధాలు. మనం పూజలు, జపాలు చేసేటప్పుడు ఈ నామ-రూపాల సహాయం తీసుకుంటాం. కానీ మోక్షం కావాలి అంటే ఈ నామ-రూపాలను దాటి వెళ్ళాలి.

​ ఎప్పుడైతే సాధకుడికి అమ్మవారి అనుగ్రహం వల్ల 'ఆత్మజ్ఞానం' కలుగుతుందో, అప్పుడు ఈ సృష్టి అంతా మాయ అనీ, చివరకు మిగిలేది ఒకే ఒక్క పరబ్రహ్మం (అమ్మవారు) అనీ తెలుస్తుంది. నిప్పులో పడిన ఏ వస్తువైనా ఎలా బూడిదైపోతుందో, అలాగే జ్ఞానమనే అగ్ని ముందు ఈ ఆరు మార్గాల భేదాలు (నేను, నాది, ఈ లోకం, ఈ రూపం అనే భ్రమలు) అన్నీ కాలిపోతాయి.

​ అమ్మవారు 'దగ్ధ-షడధ్వ-అరణ్యమ్' (ఆరు మార్గాలనే అడవిని కాల్చినది). అంటే, భక్తుడి మనస్సులోని అజ్ఞానాన్ని, భ్రమలను తన జ్ఞానాగ్నితో పూర్తిగా కాల్చివేసి, అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని అర్థం.

​అమ్మవారిని కాకుండా, ఆమె 'యవ్వనాన్ని' ధ్యానించడం వెనుక ఆంతర్యం ఏమిటి?

​శ్లోకంలో "దయయో అనదగిన నీ యౌవనమును ధ్యానించెదను" అని మూకకవి అన్నారు. ఒక తల్లిని లేదా దేవతను కొలిచేటప్పుడు 'యవ్వనాన్ని' ధ్యానించడం వెనుక మూడు అద్భుతమైన కారణాలు ఉన్నాయి:

​ అమ్మవారి యవ్వనమే 'కరుణ' (దయ)

​లోకంలో స్త్రీలకు దయాగుణం ఎక్కువ. అందులోనూ యవ్వనంలో ఉన్న స్త్రీ హృదయం మరింత కోమలంగా, ప్రేమతో నిండి ఉంటుంది. ఇక్కడ పరమశివుని యొక్క 'కరుణ' అనే గుణమే అమ్మవారిగా అవతరించింది. ఆ కరుణ ఎంత గొప్పదో చెప్పడానికి కవి... "అమ్మా! నీ యవ్వనం మరేదో కాదు, సాక్షాత్తు 'దయ' అనే గుణమే నీ శరీరంలో యవ్వనంగా మారిందా అన్నట్లుంది" అన్నారు. అంటే ఇక్కడ యవ్వనాన్ని ధ్యానించడం అంటే, అమ్మవారి అమితమైన కారుణ్య గుణాన్ని ధ్యానించడమే.

​ ఎప్పటికీ తరిగిపోని సృష్టి శక్తి .

​'యవ్వనం' అనేది ఉత్సాహానికి, నిరంతర శక్తికి, సృజనాత్మకతకు ప్రతీక. బాల్యం దాటిపోతుంది, ముసలితనం వల్ల శక్తి క్షీణిస్తుంది. కానీ ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారికి ముసలితనం ఉండదు. ఆమె ఎల్లప్పుడూ నిరంతర శక్తితో ప్రకాశించే 'త్రిపురసుందరి' (నిత్య యవ్వనవతి). సృష్టిని నిరంతరం నడిపించే ఆ అఖండమైన దైవ శక్తిని కొలవడమే అమ్మవారి యవ్వనాన్ని ధ్యానించడం.

​ గుణ-గుణి అభేదం 

​ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం భగవంతుడికి, భగవంతుని గుణాలకి తేడా లేదు (ఉదాహరణకు: అగ్నికి, దాని వేడికి తేడా లేనట్లు). అమ్మవారు కేవలం అందమైనది మాత్రమే కాదు, ఆమె అందం (ఆరుణ్యం). ఆమె యవ్వనం (తారుణ్యము). ఆమె దయ (కారుణ్యము). కాబట్టి ఆమె యవ్వనాన్ని ధ్యానించడం అంటే సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపాన్నే ధ్యానించడం.

సాధకుడు అమ్మవారి రూపాన్ని చూస్తూ, ఆమెలోని అనంతమైన దయాగుణాన్ని (యవ్వనాన్ని) నమ్ముకుని శరణు వేడితే... ఆమె తన జ్ఞానాగ్నితో సాధకుడి చుట్టూ ఉన్న అజ్ఞానపు అడవిని (షడధ్వములను) కాల్చివేసి, తనలో లీనం చేసుకుంటుంది. ఇదే ఈ శ్లోకం యొక్క పరమార్థం.🕉️🙏🕉️

బ్రహ్మశ్రీ పతంజలి మహోదయులకు ధన్యవాదములు.

జైహింద్.

9, జులై 2026, గురువారం

65. శ్లోII కుసుమశర గర్వసంప త్కోశగృహం ఈ శ్లోకమునకు డా.తాడేపల్లి పతంజలిగారి వివరణము.

0 comments

జైశ్రీరామ్. 

ఓం శ్రీమాత్రే నమః.🙏🏽

మూకపంచశతి..ఆర్యా శతకము.

65. శ్లోII  కుసుమశర గర్వసంప త్కోశగృహం భాతి కాంచి దేశగతమ్‌ 

స్థాపిత మస్మి న్కథమపి గోపిత మంత ర్మయా మనోరత్నమ్.

తే.గీ.II  మన్మథుని గర్వసంపద మందిరమ్ము

కంచియందొకటున్నది ఘనతరముగ,

నా మనంబను రత్నమున్ బ్రేమనెటులొ

దాచిపెట్టితి నచ్చట తత్త్వమరసి.

తాII మన్మథగర్వసంపదకు భాండాగార మొకటి కాంచి మధ్య దేశమందు ప్రకాశించుచున్నది. నా మనస్సు అనెడి రత్నమును దానియందు దాపరిక మొనర్చితిని.

అమ్మ దయతో🙏🏽

చింతా రామకృష్ణారావు.

ఈ శ్లోకానువాదము పఠించిన బ్రహ్మశ్రీ తాడేపల్లి పతంజలి మహోదయులు ఈ విధముగా వ్యాఖ్యానించియున్నారు.

శివుడు తన మనసును ఎంతో నిగ్రహించుకోగలడు. కానీ అమ్మవారిని చూడగానే ఆయన యోగసాధనలన్నీ పక్కన పెట్టి, ఆమె ప్రేమలో పడిపోతారు. ఆమెను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేరు. శివుడంతటి ఇంద్రియ నిగ్రహం గలవాడు లేడంటారు.మరి మూకకవి "మన్మథ గర్వ సంపద" అనే పదం ద్వారా వ్యంగ్యంగా శివుని ఇంద్రియ నిగ్రహాన్ని ఎందుకు తక్కువ చేశారు? తాడేపల్లి పతంజలి జవాబు    శివుడి ఇంద్రియ నిగ్రహాన్ని తక్కువ చేయడం కవి ఉద్దేశం కాదు; శివుడి నిగ్రహాన్ని సైతం కరిగించగల అమ్మవారి దివ్య సౌందర్యం, సర్వవ్యాప్త శక్తి ఎంత గొప్పవో కొనియాడడమే మూకకవి గారి ముఖ్య ఉద్దేశం.శ్లోకం చివరి భాగంలో కవి "తస్మిన్ మయా అంతః స్థాపితం మనోరత్నమ్" (అందులో నా మనసనే రత్నాన్ని దాచాను) అన్నారు. దీనికి కారణం:

​ శివుడి అంతటి మహా యోగిని సైతం కట్టడి చేయగల శక్తి ఒక్క అమ్మవారికే ఉంది. అంతటి శక్తివంతురాలైన అమ్మవారి పాదాల చెంత లేదా ఆమె హృదయంలో తన మనసును దాచితే, ఇక ఏ లౌకిక మాయలు, కామక్రోధాలు ఆ మనసును దొంగిలించలేవు.

​ మన మనసు ఎప్పుడూ చంచలంగా ఉంటూ కోరికల వైపు పరిగెడుతుంటుంది. దాన్ని నిగ్రహించడం ఎవరికైనా కష్టమే. అందుకే కవి తన చంచలమైన మనసును అమ్మవారికి అప్పగించేశాడు. శివుడి మనసునే కరిగించిన అమ్మవారు, తన మనసును కూడా ప్రశాంతంగా ఉంచుతుందని కవి నమ్మకం. మనలని కూడా అలా చేయమని ఉత్తమ సందేశం🕉️🙏🕉️

చక్కని వివరణనందించిన పతంజలి మహోదయులకు ధన్యవాదపూర్వక నమస్సులు.

జైహింద్.

6, జులై 2026, సోమవారం

ధ్వజస్థంభం యొక్క కథ కమామిషు ... శ్రీ ఆర్వీయస్ సుబ్రహ్మణ్యం.

0 comments

జైశ్రీరామ్. 

ధ్వజస్థంభం పుట్టుక

     మనం ఏదేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. అసలీ 'ధ్వజస్థంభం' కధాకమామీషూ ఏంటో ఓసారి చూద్దాం. ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓకధ ఉంది.

     భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.

     ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ, అతడ్నికపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు.

     శ్రీకృష్ణుడు, ధర్మరాజుతోకలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, "రాజా! మీ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో' మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూరధ్వజుని 'శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఈతడ్ని వదిలేస్తాననీ చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఈతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్నిమధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, "మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అని వివరిస్తాడు.

     మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి "మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను" అంటాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగానుగ్రహించండి. " అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు "తథాఽస్తు" అని పలికి, "మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే మూలవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది.

శ్రీ ఆర్వీయస్ సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు.

జైహింద్.

మూకపంచశతి రచించిన మూకకవి అనఁబడే మూక శంకరుల వృత్తాంతము.

0 comments

జైశ్రీరామ్.

మూకకవి (మూక శంకరుడు) కాంచీ కామకోటి పీఠానికి చెందిన 20వ పీఠాధిపతి మరియు గొప్ప భక్త కవి. పుట్టుకతోనే మూగవాడైన ఆయన, కాంచీపురము లోని శ్రీ కామాక్షీ అమ్మవారి అనుగ్రహం వల్ల మాటలు వచ్చి, ఆ తల్లి పై 500 శ్లోకాలతో అద్భుతమైన ‘మూక పంచశతి’ అనే స్తోత్ర గ్రంథాన్ని రచించారు. 

ఈ గ్రంథం ఐదు శతకాలుగా విభజించబడింది : 

1.ఆర్యా శతకం

2.పాదారవింద శతకం

3.స్తుతి శతకం

4.కటాక్ష శతకం

5.మందస్మిత శతకం 


మూక శంకరుల జీవిత చరిత్ర

మూక శంకరులు (మూకకవి) అమ్మవారి పరమ అనుగ్రహంతో గొప్ప పీఠాధిపతిగా మరియు అద్భుతమైన మహాకవిగా మారిన వృత్తాంతం ఆయన జీవిత చరిత్ర. 

జననం మరియు బాల్యం

తల్లిదండ్రులు: కాంచీపురానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త, గణితజ్ఞుడైన శ్రీ విద్యావతి  మరియు ఆయన ధర్మపత్ని.వీరు క్రీస్తు శకం 398 నుండి 437 వరకు పీఠాధిపతిగా ఉన్నారు. 

పుట్టుకతోనే మాట్లాడే మరియు వినే శక్తి లేకపోవడంతో ఈయనను అందరూ ‘మూక’ (మూగవాడు) అని పిలిచేవారు. 

మాట్లాడలేకపోయినా, ఈయన ప్రతిరోజూ కాంచీపురంలోని [శ్రీ కామాక్షీ అమ్మవారి] ఆలయానికి వెళ్ళి, అమ్మవారి సన్నిధిలో సాష్టాంగ నమస్కారాలు చేస్తూ గడిపేవారు. 

అమ్మవారి అనుగ్రహం – కవితా ప్రవాహం

ఒకరోజు ఆలయంలో మూకకవి ఒక పక్కన ధ్యానంలో ఉండగా, కామాక్షీ అమ్మవారు ఒక సాధకుడిని అనుగ్రహించడానికి ఒక స్త్రీ రూపంలో ప్రత్యక్షమయ్యారు. 

అమ్మవారు తాంబూలాన్ని చర్వణం చేస్తూ (నములుతూ), ఆ తాంబూల ప్రసాదాన్ని మొదట అక్కడ ఉన్న వేరొక సాధకుడికి ఇచ్చారు.

కానీ ఆ సాధకుడు ఆమెను సామాన్య స్త్రీగా భావించి, ఎంగిలి అనే భ్రమతో ఆ ప్రసాదాన్ని తీసుకోలేదు.వెంటనే జగన్మాత ఆ తాంబూల ప్రసాదాన్ని మూగవాడైన ఈ బాలుడికి అందించగా, ఆయన దానిని పరమ పవిత్రమైన మహా ప్రసాదంగా భావించి స్వీకరించారు.ఆ మరుక్షణమే అమ్మవారి అనుగ్రహంతో ఆయన నాలుకపై బీజాక్షరాలు అక్షరాలై, మూగవోయిన నోటి నుండి అద్భుతమైన కవితా ప్రవాహం పెల్లుబికింది. ఆశువుగా అమ్మవారిని స్తుతిస్తూ 500 శ్లోకాలతో కూడిన ప్రసిద్ధ ‘మూక పంచశతి’ గ్రంథాన్ని రచించి మహాకవి అయ్యారు.పీఠారోహణ మరియు గురు పరంపరబాలుడిలోని అపారమైన దైవజ్ఞానాన్ని, పాండిత్యాన్ని గమనించిన నాటి కాంచీ కామకోటి పీఠం 19వ పీఠాధిపతి శ్రీ మార్తాండ విద్యాఘన సరస్వతి స్వామివారు, ఈయనకు సన్యాస దీక్షను ఇచ్చారు.సన్యాస ఆశ్రమంలో ఈయనకు ‘శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి’ (మూక శంకరులు) అనే నామకరణం చేసి, కాంచీ పీఠానికి 20వ జగద్గురువులుగా అభిషేకించారు.పీఠాధిపతి అయిన తర్వాత ఆయన వేద వేదాంగాలను పూర్తిగా ఆకళింపు చేసుకుని, ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు.మహిమలు మరియు వైభవంశ్రీ మూక శంకరులు ఎంతటి తపోసంపన్నులంటే, ఆయన సంకల్పం మాత్రంచేతనే గుర్రాలను కాసేవారు, ఏనుగులను చూసుకునే సామాన్యులు సైతం గొప్ప పండితులుగా, కవులుగా మారిపోయేవారు. కాశ్మీర రాజైన మాతృగుప్తుడు, ప్రవరసేనుడు వంటి మహారాజులు సైతం ఈయనను దర్శించుకుని సేవలు చేసుకునేవారు. వీరు దాదాపు 39 సంవత్సరాల పాటు పీఠాన్ని అధిష్టించి, లోకకల్యాణాన్ని గావించారు.శ్రీ మూక శంకరుల జీవితానికి సంబంధించిన ఏ ఇతర అంశాన్ని మనం మరింత లోతుగా చర్చిద్దాం?మూక పంచశతి విశిష్టత మరియు పారాయణ నియమాలుఆయన రచించినట్లుగా చెప్పబడే ఇతర గ్రంథాలు (ఉదాహరణకు: ప్రాచీన శంకర విజయము).

జైహింద్.