గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, ఆగస్టు 2026, ఆదివారం

మామిడి చెట్టు పరివారం. (గంపెడు పిల్లలు) రచన ... శ్రీ కడయింటి కృష్ణమూర్తి..గోవా...(నెల్లూరు)

0 comments

జైశ్రీరామ్. 

మామిడి చెట్టు పరివారం. (గంపెడు పిల్లలు)



రచయిత ... శ్రీ కడయింటి కృష్ణమూర్తి..గోవా...(నెల్లూరు)

పురుషోత్తమ రావు పాతకాలం మనిషి కాదు, నవీన ఛాందసుడు. కుటుంబ వ్యవస్థల మీద అపారమైన నమ్మకం కలవాడు. పాత తరాలకు క్రొత్త మెఱుగులు దిద్దాలన్న పంతం ఆయనది. పశు పక్ష్యాదులకు కూడా సంబంధాలు నెఱపుతూ దాని కూతురిది, దీని మనుమరాలది, దాని తల్లి యిది అని తన కొట్టం లోని పశువుల గురించి కూడా వరసలు గలిపి చెబుతుంటాడు. పశువులకు మాత్రం బంధుత్వాలు ఉండవా?? చెట్లకు ఉండవా??అనేది వారి వాదన. వారికి ఓ కూతురు ఇద్దరు కుమారులు. పెరట్లో ఒక మామిడి చెట్టు.  ఆ ముగ్గురూ ఈ మామిడి చెట్టూ వారికి ఆరు ప్రాణాలు. ఆ చెట్టు వారి ఇల్లాలికి అరణపు సంపద. 

దానికో చిన్న పూర్వ కథ. 

పురుషోత్తమ రావు గారి ఇల్లాలు కాపురానికి వచ్చిన రోజున ఆమె తండ్రి తమ పొలంలోని మామిడి చెట్టు పండ్లు ఓ బుట్టడు తెచ్చియిస్తూ "నాయనా ఇవి మన ఇంటి చెట్టు పండ్లు" అంటూ "అమ్మా ఇవి కోసి అందరికీ పెట్టు" అంటూ కూతురి చేతిలో ఓ రెండు పండ్లు పెట్టి మిగతా బుట్ట లోపల పెట్టించాడు.. "ఆమె ఇంకో నాలుగు పండ్లు కోసి భర్తకూ నాన్నగారికీ అత్తయ్య మామయ్యలకు కూడా పళ్లేలలో పెట్టి అందించింది. అందరూ వాటి రుచిని మెచ్చుకుంటూ ఆరగించారు. వారి ఆనందం చూసి అమ్మాయి తండ్రి సంతోషించారు. కొత్త గాబట్టి అమ్మాయి "అత్తయ్యా ఈ టెంకలూ తొక్కలూ ఎక్కడ వెయ్యమంటారు" అనడిగింది.

"అక్కడ ఉంచమ్మా నేను తీస్తాను. నువ్వెళ్లి నాన్నగారి దగ్గర కూర్చో" అంటూ ప్రేమగా చెప్పి ఆ టెంకలు తీసి ఇంటి పెరట్లో పడవేసింది. వాటికి ఈగలు ముసురుతూ ఉంటే అక్కడ ఉన్న పాలేరెవరో చూసి దాని మీద రెండు పారల మట్టి పోశాడు. "ఇక ఇక్కడ మనకేం పని, ఈ పాలేరు మన నోట మట్టి గొట్టాడు " అనుకుంటూ ఈగలు వెళ్లి పోయాయి. ఆ తర్వాత వారం రోజులకు వర్షం పడింది. ఆ ముసురు వారం పది రోజుల వరకూ సాగింది. ఆ తర్వాత కాస్త తెరిపి ఇచ్చేసరికి ఎవరో తట్టి లేపినట్లుగా ఆ మామిడి టెంకలు తలెత్తి చూసి మొలకెత్తాయి. ఎరుపూ హరితమూ కాని వర్ణంలో ఆకులు వ్రేళ్లాడేసుకుని ముద్దుగా కనిపించాయి. ముందుగా వాటిని చూసింది పురుషోత్తమ రావే. వాటిని పశువులు తొక్కకుండా ఒక ముళ్ల కంప అడ్డం పెట్టాడు. నాలుగు రోజులకు ఆకులు చిలుకాకు పచ్చగా వుండి తర్వాత నిదానంగా ముదురాకు పచ్చలోకి మారాయి. వారం పది రోజులకు మరో నాలుగాకులు వేశాయి, అలా నిదానంగా ఓ అడుగు ఎత్తు ఎదిగాయి. ఎంతో ఆరోగ్యంగా బలంగా ముద్దుగా ఉన్నాయా మొక్కలు. 

అప్పుడు పాలేరు వాటిని చూసి అయ్యగారూ ఇవి ఆరూ ఒక్కచోట ఉంటే సారం చాలక బలహీన పడతాయి. ప్రస్తుతానికి కుండీలలో వేర్వేరుగా వేద్దాం. అని ఆరు మట్టి కుండీలు అడుగున్నర ఎత్తూ ఓ అడుగు వ్యాసమూ ఉన్నవి చూసి తెచ్చి మంచి బలమైన ఎరువూ మంచి మట్టీ పోసి అందులో నాటారు. ఓ పది నెలలు గడిచేసరికి అవి బలంగాఎదిగి దారిన పోయే వారిని కూడా ఆకర్షించ సాగాయి. 

అప్పుడు పురుషోత్తమ రావు గారి తండ్రి వాటిని రామాలయం వద్ద ఒకటి, ఇంటి వెనుక పెరట్లో ఒకటీ, గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద ఒకటి, పాఠశాల వద్ద ఒకటి, తమ పొలంలో దొరువు గట్టున రెండూ ఇలా నాటించాడు. అవి దినదిన ప్రవర్థమానమవుతూ జనులకు కనుల విందు చేస్తున్నాయి.

అలా వారి సంకల్ప బలంతో పురుషోత్తమ రావు పెరట్లోని చెట్టుకూడా దినదిన ప్రవర్థమానమవుతోంది. ఈలోగా కాల చక్రం కూడా ఓ యిరవై ఆకులు ముందుకు జరిగింది. ఇప్పుడు పురుషోత్తమ రావు కుమార్తెకు పద్దెనిమిదేళ్లు. ఆయనకు కూతురంటే ఎంత ప్రేమో ఆ మామిడి మొక్క అన్నా అంతే ప్రేమ. మామిడి మొక్క కాస్త ఆలస్యంగానైనా పూతకొచ్చింది. పురుషోత్తమరావు పెద్ద పండుగే చేశాడు. అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేయించాడు. అన్నదానం విరివిగా చేశాడు. పని గట్టుకుని వెళ్లి మిగతా చెట్లను కూడా చూసి వచ్చాడు. అవి కూడా ఇంచుమించు ఇదే పరిణామ క్రమంలో ఉన్నాయి. సంతోషించాడు.

మామిడి చెట్టు పూత పిందెలతో నిండుగా కనుల విందుగా ఉంది. భార్య ప్రోద్బలంతో గౌతమికి సంబంధాలు వెదకడం మొదలెట్టారు పురుషోత్తమ రావు గారు.

గౌతమి లాంటి అమ్మాయికి సంబంధాలు పనిగట్టుకు వెదకాలా? ఆయన అలా సంకల్పించిన విషయం తెల్సిన వెంటనే ఓ సంప్రదాయ కుటుంబం  "అమ్మాయిని చూసుకోవడానికి ఎప్పుడు రమ్మంటారు" అన్న వాకబుతో ముందుకొచ్చింది. పురుషోత్తమరావుగారికి సంతోషం కలిగించింది. సంకల్పించి ఏదీ ఇంకా రెణ్ణెల్లయినా కాందే. 

మామిడి కాయలు పక్వానికొచ్చాయి. 

ఇటు అమ్మాయికి మంచి సంబంధం రావడం అటు మామిడి తొలి కాపు కాయడం పురుషోత్తమ రావు గారికి రెండు కళ్లకీ రెండు పండుగల లాగా ఉంది. తమ పురోహితుడి సలహా మేరకు పెళ్లిచూపుల రోజు నిర్ణయించడం తో అది కూడా దగ్గర కొచ్చింది. శుభస్య శీఘ్రం అన్నారు పురోహితులు.

ముందు రోజు మధ్యాహ్నం పురుషోత్తమ రావు మామిడి చెట్టు క్రింద నులక మంచం వేసుకుని కూతురితో కలిసి కూర్చుని అటు మామిడి చెట్టునీ ఇటు గౌతమినీ కనుల నిండుగా చూసుకుంటూ ముచ్చట్లాడుతున్నాడు. అది చూస్తూ వారి ముచ్చట్లు వింటూ మామిడి చెట్టు కూడా పులకించింది.   ఆ పులకరింతతోబాటు కదలిక వచ్చి ఒక అరమాగిన పండును  వారి మధ్యన మెల్లగా పడేసింది. తండ్రీ కూతుళ్లిద్దరూ తలెత్తి చూశారు. "మీ ప్రయత్నాలు ‘ఫల’వంతం అవుతాయి ఇది నా ఆశీర్వాదం" అన్నట్లుగా చిరునవ్వు చిందించింది సీతమ్మ లాగా. ఆ సీతమ్మ కీమె తోబుట్టువే కదా. అది అర్థం అయినట్లుగా పురుషోత్తమ రావు రెండు కళ్లనుండి రెండు ఆనంద బాష్పాలు. గౌతమిని ప్రేమగా దగ్గరకు తీసుకుని ఆమె తలతో తన తల తాటించి కళ్లు తుడుచుకున్నాడు.

ఆ పండును భార్య కిచ్చి భద్రంగా బియ్యపు డబ్బాలో దాచమని చెప్పాడు.

ప్రక్క రోజుసాయంత్రం నాలుగవుతుండగా అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వచ్చారు. పురుషోత్తమ రావుగారు ఉదయమే మామిడి చెట్టు నీడ పడినంత మేర శుభ్రం చేయించి నీళ్లు చల్లించారు. నాలుగైదు కుర్చీలు వేయించి క్రింద కూర్చునే వాళ్లకు చాపలు వాటిపైన తెల్లని దుప్పట్లు పరిపించారు. అందరూ మామిడి చెట్టు కనుసన్నలలో ఆసీనులయ్యారు. పురోహితుల వారు ఇరు కుటుంబాల పరిచయ వాక్యాలు పలికారు. పురుషోత్తమ రావు గారు వరుని గురించి తెలుసుకున్నారు.

తెలుసుకొని తన కుమార్తె గురించి,

ఉ. ఇల్లడ బెట్టె నీపె నిట, యీమెవి యాటలు పాటలింతలా!

    పెల్లుగ బెంచినార మిక పెద్దగు వేలుపు మాట నిల్పుచు

    న్నిల్లడ దీర్పగా దలచి యీ సహకారము తోడు నీడలో

    చల్లగ నాటపాటలను చక్కగ నేర్చిన గౌతమిం దగన్.


మ.కో. కన్నవారము మేమె యైనను కాన్క బెట్టక దప్పునా

         కన్ను ఱెప్పల నార్పకుండగ గాచి నారము ప్రేముడిన్

         మన్ననన్ మరి యిచ్చుటల్ గని మాయురే యన ధాతయున్

         గ్రన్ననన్ మరి మీరలిప్పుడు కాన్క నందిన భాగ్యమే.

అని కావ్యపరిభాషలో పరిచయం చేసి వారి సంబంధాన్ని పటిష్ఠం చేసుకున్నాడు. 

తర్వాత నిన్నటి మామిడి పండును వారికి పళ్లెంలో పెట్టి అందించి ఆ పండునూ, పండు దొరికిన వైనాన్నీ,ఆ పండును కన్నతల్లి చెట్టునూ పరిచయం చేసి కళ్లు తుడుచుకుని ఆ పండును అక్కడే అందరూ ఆరగించాలని వేడుకున్నాడు. గౌతమికి కాబోయే మామగారు విస్తుబోయారు. ఒక మామిడి పండుకు ఇంత చరిత్రా. దాని పరిచయాని కింత ఉద్వేగమా? అనుకుంటూ తానూ  పురుషోత్తమ రావుగారి సహృదయాన్ని గ్రహించి ఆ పండును అందరూ తలో ముక్కా ఆరగించిన తర్వాత ఆ టెంకను కడిగించి " ఈ టెంకను పరంపరానుగతంగా మా యింటివద్ద నాటి పెంచుతాను. "గౌతమినీ, ఈ టెంకనుండి రాబోయే ఆ మొక్కనూ సమానంగా అభిమానంతో వాత్సల్యంతో చూసుకుంటానని మాట యిస్తున్నాను". అనగానే పురుషోత్తమ రావు కళ్ల నుండి నీళ్లు జలజల రాలాయి. వారికి గౌతమికీ మామిడి చెట్టుకీ ప్రేమ పరంగా అభేదం. ఒక్కసారి తలెత్తి మామిడి చెట్టు వంక జూశాడు. అది తృప్తిగా తలాడించింది. సంబంధాన్ని ఆమోదించింది. పురుషోత్తమ రావు గారి మనస్సు తేలిక పడింది. నా బిడ్డ బాగోగులు చూసుకోవడానికి ఈ చెట్టు తన బిడ్డని ముందే పంపుతోంది. అని కళ్లు తుడుచుకున్నాడు.

ముహూర్తాలు పెట్టుకోవడం, తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం సుముహూర్తం దగ్గర పడడం అన్నీ మామిడి చెట్టు స్వయంగా పర్యవేక్షించింది. గమనించింది, కల్యాణాన్ని కన్నులారా వీక్షించింది. దీవించింది, వధూ వరులను కళ్లారా చూసుకుంది. కొత్త దంపతులకు కబుర్లు చెప్పుకోవడానికి దట్టమైన నీడ నిచ్చింది.

చల్లని పిల్లగాలులతో వారిలో కొత్త కొత్త కోరికలను రేకెత్తించింది. గౌతమి ముంగురులను అటూ యిటూ పరుగెత్తింప జేస్తూ వరుని కళ్లలో ఆనందాన్ని నింపింది. తానూ ఆనందించింది.

గౌతమిని అత్తవారింటికి సాగనంపిన పురుషోత్తమరావు పెరట్లోకి వచ్చి మామిడి చెట్టు వంక తలెత్తి చూశాడు "బెంగ పెట్టుకోకు" అని ఓదారుస్తున్నట్లుగా రెండుసార్లు కళ్లార్పే నెపంతో కన్నీళ్లు చెంపల మీదికి వదిలేశాడు. భార్యా భర్తలిద్దరూ ఆ సాయంత్రం ఆ చెట్టు వద్దే కూర్చున్నారు. ఒకర్నొకరు చూసుకుంటున్నారు.

నేల వంక చూస్తున్నారు. చెట్టువంక చూస్తున్నారు. "అల్లుణ్ణీ అమ్మాయినీ ఇంకో రెండు రోజులు ఉండమని చెప్పాల్సింది" గొణుక్కున్నారు ఇద్దరూ ఒకేసారి.

"ఠప్" మని వారి మధ్య ఒక మామిడి పండు పడింది. ఉలిక్కి పడ్డారిద్దరూ.  తలెత్తి చూశారు చాలా ఎత్తుకొమ్మమీది నుండి పడిందేమో పండు చితికి పోయింది.

"వారినిప్పుడు కాపురానికి పంపడమే మంచిది. ఎక్కువ రోజులుంటే మమకారాలు ఎక్కువై మనస్పర్థలు రావచ్చు" "ఇలాగా"

అని ఆ చెట్టు పండును చూపి చెప్పినట్లయ్యింది వారికి. రెండు సార్లు కళ్లార్పుకుని అప్పటికి ఇంట్లో ఉన్న బంధువులు హెచ్చరించడంతో లేచి కళ్లు తేట పడగా లోనికి వచ్చి నిత్య నైమిత్తికాలు అన్యమనస్కంగానే పూర్తిచేశారు. "పండు పక్వం పరాధీనం" అన్న భావన కదలాడింది వారి కళ్లలో. ఆ భావన వారికీ వారు పెంచుకున్న ఆ చెట్టుకీ కూడా వర్తించింది. అవును గదా. 

కాల చక్రం మరో పదాకులు నడిచింది. పురుషోత్తమ రావు గారి కుమారులు ఇరువురూ చదువుకుని స్థిరపడ్డారు. గౌతమి కుమార్తె కిప్పుడు ఐదున్నరేళ్లు. గౌతమి తో బాటు అరణంగా అత్తవారింటికి వచ్చిన మామిడి మొక్క కిప్పుడు పదేళ్లు. ఇప్పుడిప్పుడే కాపుకొస్తూ ఉంది. 

చల్లని ఆ చెట్టు నీడలో అమ్మగారింటి ఆదరణను అత్తగారింట్లో పొందుతోంది గౌతమి. తండ్రి పరిష్వంగమే ఆ చెట్టు సాంగత్యం. ఆ చల్లని నీడయే తండ్రి ఆశీర్వచనం. తండ్రి గుర్తొచ్చాడు గౌతమికి.

మామిడి తొలి పూత పిందె చూసి పెద్ద పండుగే చేశాడు తండ్రి ఆనాడు. ఆ చెట్టు సంతానం ఇప్పుడు ఇక్కడ పూతకొచ్చింది. అదే ఆలోచిస్తూ 

చెట్టు వంక చూస్తూ కూతురితో కబుర్లలో ఉన్న గౌతమిని చూశారు మామగారు. మాటిమాటికీ మామిడి వంక చూస్తున్న ఆమె ఆలోచనలను పసిగట్టారు. "అమ్మా గౌతమీ" అంటూ దగ్గరకు వచ్చాడు. "మామయ్యా" అంటూ గౌతమి లేచి నిలబడింది. మామయ్య గౌతమి తల నిమిరి

"నాన్న గుర్తొస్తున్నాడు కదా తల్లీ" అనగానే గౌతమి కళ్ల నుండి రెండు కన్నీటి బొట్లు రాలాయి. నిన్నటి రోజున గౌతమి పేరుతో వచ్చిన ఉత్తరాన్ని

ఆమె చేతిలో పెడుతూ "నిన్న మధ్యాహ్నం పొలానికి వెళ్తూ ఉంటే పోష్టుమాష్టరు ఇచ్చాడు. రాత్రి యివ్వడం మరిచి పోయానమ్మా" అనగానే "అయ్యయ్యో ఫరవాలేదు మామయ్యా" అంటూ  విప్పి చదివి "తమ్ముళ్లిద్దరూ ఊరికి వెళ్తున్నారట మామయ్యా. దారిలో ఇక్కడ దిగి మేన కోడలిని చూసి వెళతారట" అంది గౌతమి.

"సంతోషం తల్లీ" "రెండు రోజులు ఉండమని చెబుదాం" అంటూ కొడుక్కి ఈ కబురందించడానికి లేచారు మామయ్యగారు. ఆ కబురు వారికందడం రెండు మూడు రోజులు ఉండే విధంగా పనులు సర్దుబాటు చేసుకుని వారు రావడం మేనగోడలితో కబుర్లు ఆటలు పాటలు ముద్దులూ మురిపాలూ పెద్దవారి ఆనందాలూ యధావిధిగా ఒక్కక్షణంలో జరిగి పోయాయి. ఆ రెండు రోజులూ మేనమామల మధ్యనే నిద్రపోయింది మేనగోడలు.

అటు నుంచి అన్నా యిటునుంచి తమ్ముడూ మేనగోడలిని చూచుకోవడంతోనే వారి నిద్రలు తెల్లారి పోయాయి. రాత్రంతా మేన గోడలి మీద ఈగను కూడా వాల నివ్వలేదు మేనమామలు.  ఒకరి కుడి చెయ్యి మరొకరి యెడమచెయ్యి భరోసాగా నిశ్చింతగా నిద్రబోయింది మేనగోడలు.

నిద్రలో లేచి తమ్ముళ్ల నిబ్బంది పెడుతున్నదేమోనని ఒకటికి రెండుసార్లు వచ్చి చూసింది గౌతమి.  వారి మధ్య ప్రసన్న వదనంతో ‘మా మామ లుండగా నాకు భయమేంటోయ్’ అన్నట్లుగా చిరునవ్వు చెదరనీకుండా నిండు చందమామను ధిక్కరిస్తూ నిద్రపోతోంది చిట్టి తల్లి. వారిని తృప్తిగా చూసి తానూ నడుం చాల్చింది. మేన మామ అనే మాట ఎంత భరోసా మేనగోడలికి.

ఉదయాన్నే నిద్ర లేచేసరికి తమ్ముళ్లిద్దరూ ఒకరు మేనగోడలికి పళ్లు తోముతున్నారు రెండో వారు చెంబుతో నీళ్లూ టవలూ పట్టుకుని రాణీగారి సేవకు సిద్ధంగా ఉన్నారు. అదయ్యింతర్వాత ముఖం తుడిచారు. ఆ తర్వాత మామల బుజాలమీద గుఱ్ఱం ఎక్కి వచ్చింది. మామయ్యలు పాలు తాగిస్తే తాగింది. సాయంత్రం మామయ్యలు వెళ్లి పోతారని తెలిసిందా గడుగ్గాయికి. అంతే, వెళ్లి పోవద్దు మామయ్యా ఇంకా కొన్ని రోజులుండండి మామయ్యా, అని అమ్మతో చూడమ్మా మామయ్యలు వెళ్లి పోతామంటున్నారు. అని ఫిర్యాదు చేసి తాతయ్య దగ్గరకెళ్లి "తాతయ్యా మీరు చెప్పండి వెళ్లవద్దని, నాకు మామయ్యలతో ఆడుకోవాలని ఉంది" అని తాతయ్యవద్ద గారాలు పోయింది. ఏడుపు మొఖం పెట్టింది. కోపంగా చూసింది. అవ్వ దగ్గరకెళ్లి కూర్చుంది.

అప్పుడు తాతయ్య ‘ఇలా రాతల్లీ’ అని చేతులు చాచాడు. పరుగున వెళ్లి కళ్లింత పెద్దవి చేసి"మామయ్యలను ఉండమని చెబుతావా??" అని చంకెక్కింది.

దేవుడు భక్తికి వశుడవుతాడు. ఎంతటి ఱాతి గుండె అయినా చిన్న పిల్లల ప్రేమకు వశం కాక తప్పదు. "మామయ్యల తోబాటు ఊరికి వెళ్తావా తల్లీ" అనగానే తాతయ్య బుగ్గల మీద అమాంతం ముద్దుల వర్షం కురిపించేసింది మనుమరాలు. అందరి కళ్లూ తెరిపిన బడ్డాయి.

"అమ్మా గౌతమీ మీరూ తమ్ముళ్లతో కలిసి వెళ్లి అమ్మా నాన్నల దగ్గర నా ల్రోజులుండి రండి అని కొడుకుతో నీవూ వెళ్లు" అంటూ "ఈరోజు నవమి రేపు ఉదయం బాగుంది ప్రయాణానికి "

అని బయటికి నడిచాడు. అలా వెళ్లి పాలేరుని పిల్చుకుని వచ్చి కొన్ని కొబ్బరి కాయలు దింపించాడు. దోర మామిడి కాయలు ఏరి కొయ్యమని పురమాయించాడు. వాడాపనిలో నిమగ్నమయ్యాడు. అత్తగారేవేవో జాడీలలో సర్దింది. 

అన్నీ భద్రంగా కట్టి బండెక్కించారు మామగారు. కోడలికి జాగ్రత్తలు చెప్పి వెనుదిరిగారు. బయలుదేరేటప్పుడు మనుమరాలు తాతయ్య మెడకు చుట్టుకుని ‘మా మం...చి తాతయ్య’ అని కితాబిచ్చింది. అంత పెద్ద బిరుదిస్తే ఏ తాతయ్య పొంగిపోడు.

కొడుకులూ కూతురూ అల్లుడూ మనుమరాలూ ఒక్క సారిగా వచ్చేసరికి పురుషోత్తమ రావు దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇక్కడికొచ్చినా మేనగోడలికి మేన మామల తోడిదే లోకం. మామిడి పండ్లూ కొబ్బరికాయలూ ఇంకా ఏవేవో అన్నీ ఇంట్లోకి చేరాయి.

గౌతమి రాగానే ముందు పరామర్శించిది మామిడి చెట్టునే. ఒక్కసారి తడిమి చూసుకుంది చేతికందిన ఆకులని నిమిరింది. తనివిదీరా చివరి కొమ్మవరకూ చూసింది. దాని నీడన కూర్చుంది. ‘గౌతమీ కాఫీ’ అని తల్లి పిలవడంతో లేచి లోనికెళ్లింది.

"అమ్మా నేనలా అమ్మవారి గుడిదాకా వెళ్లోస్తాను. అంది గౌతమి. ‘నేనో’ అంది కుమార్తె. ‘నీవు లేకుండానా? లేచి స్నానం చేసి మామయ్య తెచ్చిన గౌను వేసుకో’ అంటూ కూతుర్ని స్నానానికి లేవదీసింది. మామయ్య లిద్దరూ దొడ్లో మామిడి కాయలను పక్వానికొచ్చినవి ఏరి కోయిస్తున్నారు.  

పురుషోత్తమరావు అది చూసి చెట్టు కొమ్మలు లాగి లాగి కాయలు కోస్తూ ఉంటే ఆ చెట్టుకెక్కెడ నొప్పి కలుగుతుందేమోనని, వారితో

ఉ. భద్రము కాయ గోయునెడ భద్రము కొమ్మెలు రెమ్మలుందగన్

    ఛిద్రము గాక యుండగను చిక్కము లోనికె గోయుడెంతయున్

    నిద్రల గాచి పెంచితిని నిక్కము దీనిని కన్న బిడ్డగన్

    భద్రము గాగ నిచ్చినది భవ్యుల మన్మల మన్మరాండ్రనున్. 

అని హెచ్చరించారు.

పిల్లలు గుడికి బయలుదేరుతూ ఉండగా పురుషోత్తమరావుగారు రెండు బుట్టలలో గౌతమి తెచ్చిన మామిడి పండ్లూ ఇక్కడి చెట్టు పండ్లూ విడిగా నింపి "అమ్మా గౌతమీ ఇవి గుడిలో అమ్మవారికి నివేదనగా సమర్పించు. ఈ బుట్టలోని పండ్లు ఆ బుట్టలోని పండ్లకు మేన మామలు అని పూజారికి చెప్పు" అంటూ అందించాడు. 

పురుషోత్తమరావు గారి హృదయం తెలిసిన పూజారి ఆశ్వర్య పడలేదు. వారిలా కాక మరోలా ఆలోచిస్తారా? అనుకున్నాడంతే.

"అమ్మా గౌతమీ ఈ పండ్లను ఊరంతటికీ ప్రసాదంగా పంచి పెడతాను." అమ్మవారు కూడా సంతోషిస్తారు. ఆశీర్వదిస్తారు. అని చేయెత్తి తానూ ఆశీర్వదించాడు.

ఆలయం ఆవరణలోని చెట్టుపండ్లు ఓ పది కోయించి గౌతమి వెంట పంపించాడు. 

మధ్యాహ్నం మేనమామలు మేనగోడలిని వెంటబెట్టుకుని తాము చదువుకున్న పాఠశాల కెళ్లారు. వచ్చినప్పుడల్లా బడికి వెళ్లి మాష్టార్లను కలిసుకోవడం వారి ఆశీస్సులు పొందడం వారికొక ఆనవాయితీ. మాష్టార్లందరినీ మేనగోడలు కబుర్లతో ముంచెత్తింది. ఆ పాఠశాలకు కూడా 

మామిడి బంధుత్వం ఉంది గదా. ఆ చెట్టుకూడా కాపుకొచ్చింది. ఆ చెట్టు పండ్లు కోయించి మేనగోడలికి చిన్న బుట్టలో పెట్టి "ఇవి నీవే" అంటూ అందించారు.

అలాగే పొలంలోని చెట్టు పండ్లు కూడా పురుషోత్తమరావు గారింటికి చేరాయి. మనుమరాలు వాటిని చూసి అబ్బో ఎన్ని మామిడి పండ్లో అని ముక్కున వేలేసుకుంది. "తాతయ్యా నేను లెక్క బెట్టనా?" అనే మాటకే పొంగిపోయారు తాతగారు. తాత సాయంతో మనుమరాలు లెక్కబెట్టింది. ఆమె లెక్క ఏమో గానీ మొత్తం అరవై పండ్లు తేలాయి. ఇవన్నీ ఆ చెట్టు గంపెడు పరివారమే. గర్వంగా తలెత్తి చూసింది మామిడి చెట్టు.

ఆ నాలుగు రోజులలో ఎవరొచ్చినా మామిడి పండ్లే పలహారం. అరవై మామిడి టెంకలనూ జాగ్రత్త చేయించారు పురుషోత్తమరావుగారు. పాలేరు చేత

ఆ టెంకలన్నీ తన పెరట్లోనే పాతేయించాడు. అవి మొలకెత్తి ఓ ఆడుగు వరకూ పెరిగిన తర్వాత అరవై కుండీలని తెప్పించి వాటిలోకి మార్చాడు. మంచి ఎరువు వేస్తూ జాగ్రత్తగా కాపాడాడు. ఇదంతా ఆ మామిడి చెట్టు గమనిస్తూ ఉంది. తన పిల్లలను అక్కున జేర్చుకుని కాపాడుతున్న పురుషోత్తమ రావు ఆ చెట్టు కళ్ళకు సర్వ జగత్పోషణ కర్తయైన పురుషోత్తముడి లాగే కనిపిస్తున్నాడు. మనసు నిండి పోయింది. 

వినాయక చతుర్థి దగ్గర పడుతోంది. కుండీలలోని మామిడి మొక్కలు ననవలాడుతూ కనువిందు చేస్తున్నాయి. వియ్యంకుల వారినీ అల్లుడినీ కుమార్తెనూ మనుమరాలినీ పండుగ ఇక్కడ జరుపుకుందామని ఆహ్వానించారు. వారూ వచ్చారు. హడావిడి అంతా తాతలూ మనుమరాలిదే.

మేనగోడలి సేవలన్నీ మేనమామలవే. గౌతమికీ ఆమె తల్లికీ  ఈ పనులనుండి విశ్రాంతి.

ఆ మామిడి మొక్కల కుండీలను వలయంగా ఏర్పరచి  మధ్యలో  చిన్న మంటపం ఏర్పాటు చేసి గణపతిని అక్కడకు ఆహ్వానించారు. ఆవాహయామి పూజయామి. పంటల గణపతి పేరు సార్థకం అయింది. ఈ ఏర్పాట్లను చూసి ఊరు ఊరంతా వచ్చి పాలు పంచుకుంది. ఉత్సవం తొమ్మిది రోజులు సాగింది. వచ్చిన అతిథులకు భోజన సత్కారాలతోబాటు  ఓ మామిడి మొక్క ప్రసాదంగా సమర్పించారు. ఓ పదిహేను మొక్కలు గౌతమి మామగారు అక్కడ తమ ఊరిలో వితరణ చేస్తానని చెప్పారు.

ఆ ఏర్పాట్లు జరిగాయి. ఆ ఉత్సవాలలోనే మేనమామ లిరువురకూ తమ పిల్లల నిస్తామంటూ ఓ రెండు కుటుంబాల వారు ముందుకు వచ్చి సంబంధం ఖాయం చేసుకున్నారు. చెప్పేదేముంది ఓ రెండు మామిడి కుండీలు వారిళ్లకూ చేరాయి. మామిడి సంతతి ఊరు ఊరంతా విస్తరించింది.

ఈ తతంగం అంతటినీ పర్యవేక్షిస్తున్న మామిడి చెట్టుదే ఉత్సాహం అంతా. సంతోషానందాలతో పొంగి పోయింది.  తన బిడ్డలూ మనుమలూ మనుమరాండ్రూ ఎంతలా విస్తరించారు. 

తర్వాతి పదేళ్లలో ఈ దేశం మొత్తం తన సంతతి సంతతితో నిండి పోతుంది అన్న భావం ఆ చెట్టుని మరింత పులకింప జేసింది.

పురుషోత్తమ రావు తలమీద నాలుగాకులు రాల్చి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ "ఇవీ మన కుటుంబాలు గంపల కొద్దీ పిల్లలు" అని కన్నీళ్లతో కళ్లు నిండి పోగా మనసారా ఆశీర్వదించింది.

అన్నట్లు ఆ రోజు అమ్మవారి గుడిలోని అర్చకులు చేసిన పని చెప్పడం మరిచాను.

వారికి కూడా గౌతమి అభిమాన పుత్రికే. అందుకే 

ఉ. పావన గంగ, భోగ శచి, భాగ్యపు గౌరి, గభీర భూమి సం

    భావన కుంతి, రూప గుణ భారతి, సంపద లక్ష్మి దేవి, సం

    సేవిత సంజ్ఞ,నిశ్చల విశేష యరుంధతి యైన లక్ష్మి దాఁ

    గేవల కన్యయే తలఁపఁ గీర్తన సేయఁ దగున్ ధరాస్థలిన్.(వీరభద్ర విజయం)

అని గౌతమిని ఆశీర్వదించారు.

శుభం.....

కడయింటి కృష్ణమూర్తి..గోవా...(నెల్లూరు)

జైహింద్.

7, ఆగస్టు 2026, శుక్రవారం

శ్రీ కంచి పరమాచార్య స్వామివారి మూకసారములో23 వ శ్లోకమయిన మందస్మిత శతకములోని 23వ శ్లోక భాష్యము. ... శ్రీ తాడేపల్లి పతంజలి.

0 comments

శ్రీ కంచి పరమాచార్య స్వామివారి మూకసారములో23 వ శ్లోకమయిన మందస్మిత శతకములోని 31వ శ్లోక భాష్యము.   ...   

శ్రీ తాడేపల్లి పతంజలి.  07 -08 -2026.

శ్లోII   చేతః శీతలయంతు నః పశుపతేరానందజీవాతవో

నమ్రాణాం నయనాధ్వసీమసు శరచ్చంద్రాతపోపక్రమాః |

సంసారాఖ్యసరోరుహాకరఖలీకారే తుషారోత్కరాః

కామాక్షి స్మరకీర్తిబీజనికరాస్త్వన్మందహాసాంకురాః ||

ప్రతిపదార్థం

కామాక్షి = ఓ కామాక్షీ దేవీ!

పశుపతేః = పరమశివునికి

ఆనంద జీవాతవః = ఆనందాన్ని తిరిగి ప్రాణవంతం చేసే దివ్యౌషధాలు,

నమ్రాణామ్ = నమస్కరించే భక్తుల యొక్క

నయనాధ్వసీమసు = కంటి చూపుల పరిధిలో (కంటి మార్గాల్లో)

శరచ్చంద్రాతపోపక్రమాః = శరత్కాలపు వెన్నెల వలె ఆహ్లాదాన్ని కలిగించేవి,

సంసారాఖ్య సరోరుహాకర ఖలీకారే = సంసారము అనే తామర చెరువును పాడుచేయడంలో (నాశనం చేయడంలో)

తుషారోత్కరాః = మంచు బిందువుల సమూహం వంటివి,

స్మర కీర్తి బీజనికరాః = మన్మథుని కీర్తి అనే పైరుకు (విజయానికి) తెల్లని విత్తనాల సమూహం వంటివి అయిన

త్వత్ మందహాసాంకురాః = నీ చిఱునవ్వు మొలకలు

నః = మా యొక్క

చేతః = మనస్సును

శీతలయంతు = చల్లబరచుగాక (శాంతింపజేయుగాక).

తాత్పర్యం

ఓ కామాక్షీ దేవీ! పరమశివునికి ఆనందాన్నిచ్చే సంజీవని వంటివి, నమస్కరించిన భక్తుల నేత్రాలకు శరత్కాలపు వెన్నెలలాగా అత్యంత ఆహ్లాదాన్ని పంచేవి, ‘సంసారం’ అనే తామరల చెరువును తుడిచిపెట్టే తుషార బిందువులు (మంచు సమూహం) వంటివి, మన్మథుని యశస్సును పెంచే విత్తనాల వంటివి అయిన నీ చిరునవ్వు మొలకలు (కాంతిరేఖలు) మా మనస్సులకు పరమ శాంతిని, చల్లదనాన్ని ప్రసాదించుగాక!

విశేష వివరణలు

1. రూపకాలంకారము:

అమ్మవారి మందహాసాన్ని కేవలం ఒక నవ్వుగా కాకుండా, శివునికి ఆనందాన్నిచ్చే 'దివ్యౌషధం'గా, భక్తుల కళ్లకు 'శరత్కాలపు వెన్నెల'గా, సంసార తామరలను తుడిచిపెట్టే 'మంచు'గా, మన్మథుని కీర్తిని పెంచే 'విత్తనాలు'గా అభేదంగా నిరూపించి వర్ణించడం వల్ల ఇందులో రూపకాలంకారము సుస్పష్టంగా ఉంది.

2. కవి సమయము (కీర్తి వర్ణన):

సంస్కృత కావ్య సంప్రదాయంలో (కవి సమయంలో) 'కీర్తి' లేదా యశస్సును ఎప్పుడూ తెల్లని రంగుతో పోలుస్తారు. ఇక్కడ అమ్మవారి నవ్వు కూడా తెల్లనిది కావడం చేత, ఆ తెల్లని చిరునవ్వులను మన్మథుని కీర్తికి కారణమైన "తెల్లని విత్తనాలు" (బీజములు) గా కవి వర్ణించారు.

3. సమాసోక్తి మరియు పరిణామాలంకారాలు (కృషక వ్యవహార స్ఫురణ):

ఈ శ్లోకంలో ఒక రైతు వ్యవహారం (వ్యవసాయ ప్రక్రియ) రూపకంగా స్ఫురిస్తుంది:

ఖలీకారే = పొలాన్ని దుక్కి దున్ని సిద్ధం చేయడం (కళ్ళం చేయడం).

తుషారోత్కరాః = నీరు చల్లడం.

బీజనికరాః = విత్తనాలు విత్తడం.

అంకురాః = మొలకలు రావడం.

ఈ విధంగా ఒక వ్యవసాయ క్రమం అమ్మవారి మందహాస వర్ణనలో అంతర్లీనంగా స్ఫురించడం వల్ల సమాసోక్త్యలంకారము ఏర్పడింది. అలాగే, ఈ అంకురాలు భక్తుల మనస్సును చల్లబరచడానికి అమ్మవారి 'మందహాసాలు'గా పరిణమించవలసి రావడం వల్ల పరిణామాలంకారము కూడా ఇందులో ఇమిడి ఉంది.

స్వస్తి.

పతంజలి తాడేపల్లి.

ఇంతటి చక్కని భాష్యమునందించిన మహోదయులు శ్రీ తాడేపల్లి పతంజలిగారికి ధన్యవాదములు.

ఈ శ్లోకమునకు నా అనువాద పద్యము.

తే.గీ.II  అభవు నానందమున్ బెంచు నౌషధంబు,

భక్తులకు శరచ్చంద్రిక, భవ సరోరు

హములఁ గలగించు మంచు, కీర్తిమొలక రతి 

పతికి, నీ నవ్వు, జనని! నన్ సతము కాచు.

జైహింద్.

6, ఆగస్టు 2026, గురువారం

"సున్నా '0' ని ఆర్యభట్ట 5వ శతాబ్దంలో కనిపెడితే... వేల సంవత్సరాల నాటివంటున్న రామాయణ భారతాల్లో రావణుడికి పది తలలు కౌరవులు వందమంది అని అబద్దాల కథలు ఎందుకు చెప్పారు?" ... -శ్రీ గౌతమ్ కశ్యప్.

0 comments


జై శ్రీరామ్.

1.  "సున్నా '0' ని ఆర్యభట్ట 5వ శతాబ్దంలో కనిపెడితే... వేల సంవత్సరాల నాటివంటున్న రామాయణ భారతాల్లో రావణుడికి పది తలలు కౌరవులు వందమంది అని అబద్దాల కథలు ఎందుకు చెప్పారు?" 

శ్రీ గౌతమ్ కశ్యప్.

ఈ ప్రశ్న పైకి చూడటానికి చాలా తార్కికంగా, హేతుబద్ధంగా అనిపిస్తుంది. సామాన్యుడికి కూడా, "అవును కదా! సున్నా లేకుండా 10, 100 ఎలా అవుతాయి?" అనే సందేహం రావడం సహజం. అందుకే ఆ వీడియోకు అన్ని లైకులు, షేర్లు వచ్చాయి.

కానీ, ఒక్క నిమిషం ఆలోచిద్దాం. 🤔 సమాజంలో ప్రశ్నలు పుట్టడం ఆరోగ్యకరమే, కానీ ఆ ప్రశ్న సత్యశోధన కోసం పుట్టాలి తప్ప, కేవలం అవహేళన చేయడానికి లేదా వివాదాలు సృష్టించడానికి పుట్టకూడదు. ఈ ప్రశ్న పైకి చాలా మేధోపరమైనదిగా అనిపించినా, దీని లోతుల్లోకి వెళితే చరిత్ర, భాష, మరియు గణిత శాస్త్రాల పట్ల కనీస అవగాహన లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. సగం జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే. అక్షరాలకు (పదాలకు), అంకెలకు (చిహ్నాలకు) మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని గ్రహించలేని స్థితి నుండి ఇలాంటి తర్క రహితమైన ప్రశ్నలు పుట్టుకొస్తాయి. ఆ అజ్ఞానాన్ని ఆధారాలతో బద్దలు కొడదాం. 👇

2: భావం, భాష మరియు లిపి - లెక్కపెట్టడం వేరు, చిహ్నాలతో రాయడం వేరు

ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే, మనం మానవ నాగరికత పరిణామ క్రమాన్ని కొద్దిగా అర్థం చేసుకోవాలి. మనిషి అంకెలు, కాగితాలు, పెన్నులు కనుక్కోవడానికి ఎన్నో వేల సంవత్సరాల ముందే ప్రకృతితో మమేకమై జీవించాడు.

మానవుడికి మొదట కలిగింది 'భావం' (Thought/Concept). తన ఎదురుగా ఉన్న చెట్లను, జంతువులను, తోటి మనుషులను చూసి వాటి పరిమాణాన్ని తన మెదడులో ముద్రించుకున్నాడు. ఆ భావాలను ఇతరులతో పంచుకోవడానికి కొన్ని శబ్దాలను సృష్టించాడు. ఆ శబ్దాలే కాలక్రమంలో 'భాష' (Language) గా మారాయి. చాలా కాలం తర్వాత, ఆ భాషకు ఒక శాశ్వత రూపాన్ని ఇవ్వడానికి 'లిపి' (Script/Symbols) ను కనుక్కున్నాడు.

ఇక్కడ మనం గ్రహించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం: లెక్కపెట్టడం (Counting) వేరు, లెక్కించిన దానిని అంకెల చిహ్నాలతో రాయడం (Notation) వేరు.

కాగితం మీద 1, 2, 3 అని అంకెలు (Digits) రాయడం వేరు, ఒక వస్తువుల సమూహాన్ని చూసి అవి ఎన్ని ఉన్నాయో పదాల ద్వారా (Words) వ్యక్తపరచడం వేరు. ఒక ఆదిమానవుడు తన ఎదురుగా ఐదు పండ్లు ఉంటే, తన చేతి వేళ్లు చూపించో లేదా తన భాషలోని ఒక పదం ద్వారానో వాటి పరిమాణాన్ని కచ్చితంగా చెప్పగలిగాడు. ఐదు అనే అంకె (5) చిహ్నం కనుక్కుోవడానికి ముందే మనిషికి ఐదు అనే 'భావన' తెలుసు, లెక్కపెట్టడం తెలుసు. రామాయణ భారతాల కాలంలో నేటి ఆధునిక అంకెల లిపి (1, 2, 3...) లేనంత మాత్రాన వారికి లెక్కపెట్టడం తెలియదు అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది.

3: వేద కాలం నాటి భాషా వైభవం - సంస్కృతంలో సంఖ్యలను ఎలా లెక్కించేవారు?

ఇప్పుడు మనం రామాయణ, మహాభారతాలు రాయబడిన సంస్కృత భాషా చరిత్రను పరిశీలిద్దాం. సంస్కృత భాష ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన, శాస్త్రీయమైన, మరియు పరిపూర్ణమైన భాషలలో ఒకటి. ఆధునిక ప్రపంచం అంకెలను చిహ్నాల రూపంలో రాయడం నేర్చుకోక ముందే, ప్రాచీన భారతీయులు అనంతమైన సంఖ్యలను వ్యక్తపరచడానికి అద్భుతమైన పదజాలాన్ని (Nomenclature) సృష్టించారు.

రామాయణ, మహాభారతాలు కాగితం మీద ఆధునిక అంకెలతో రాయబడలేదు. అవి శ్రుతి (వినడం), స్మృతి (గుర్తుపెట్టుకోవడం) అనే విధానం ద్వారా గురుశిష్య పరంపరగా మౌఖికంగా తరతరాలు ప్రయాణించాయి. ఆ తర్వాత కాలంలో తాళపత్రాల మీద లిఖించబడ్డాయి. అవి శ్లోకాల రూపంలో ఉన్నాయి. શ్లోకాలలో అంకెలు ఉండవు, పదాలు ఉంటాయి.

📖 వాల్మీకి మహర్షి రామాయణంలో రావణుడి గురించి వర్ణించేటప్పుడు ఎక్కడా '10' అనే అంకెను వాడలేదు. ఆయన "దశగ్రీవుడు" (దశ - పది, గ్రీవ - మెడలు కలవాడు) లేదా "దశకంఠుడు" అనే పదాలను ప్రయోగించారు.

📖 అలాగే వేదవ్యాసుడు మహాభారతంలో కౌరవులను వర్ణించేటప్పుడు "కౌరవులు 100 మంది" అని రాయలేదు, "శత కౌరవులు" (శత - వంద) అని పదంతో వర్ణించారు.

పది, వంద అనేవి సంఖ్యావాచకాలు (Number Words). ప్రాచీన భారతీయులకు సంఖ్యలను పదాల రూపంలో లెక్కించడం వెన్నతో పెట్టిన విద్య. దీనికి ఆధారాలు మన వేదాలలోనే పుష్కలంగా ఉన్నాయి.

📜 ఆధారం 1: యజుర్వేదం (తైత్తిరీయ సంహిత): క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల నాటిదిగా భావిస్తున్న యజుర్వేదంలోని తైత్తిరీయ సంహితలో సంఖ్యలను పదాల రూపంలో ఎంత అద్భుతంగా లెక్కించారో చూడండి. వారు పది యొక్క గుణకారాలను (Powers of 10) ఉపయోగించి అనంతమైన సంఖ్యలకు పేర్లు పెట్టారు.

"ఏక చ దశ చ దశ చ శతం చ శతం చ సహస్రం చ సహస్రం చాయుతం చాయుతం చ నియుతం చ నియుతం చ ప్రయుతం చ..."

దీని అర్థం:

ఏక = 1

దశ = 10

శత = 100

सहస్ర = 1,000 (వెయ్యి)

అయుత = 10,000 (పది వేలు)

నియుత = 100,000 (లక్ష)

ప్రయుత = 1,000,000 (పది లక్షలు) ... ఇలా పరార్ధ (10^17) వరకు పేర్లు ఉన్నాయి.

ఆధునిక '0' చిహ్నం కనుగొనబడక ముందే, వేల సంవత్సరాల క్రితమే భారతీయులు 'దశ' (పది), 'శత' (వంద) అనే పదాల ద్వారా ఆ పరిమాణాన్ని లెక్కించారు మరియు గ్రంథాలలో పొందుపరిచారు. కాబట్టి, రావణుడికి పది తలలు, కౌరవులు వందమంది అని చెప్పడానికి '0' అనే చిహ్నం అవసరం లేదు, 'దశ', 'శత' అనే పదాలు చాలు.

4: రోమన్ సామ్రాజ్యపు అద్భుతం - సున్నా చిహ్నం లేకుండానే ప్రపంచాన్ని ఏలారు

ఈ తర్కాన్ని మరింత బలంగా బద్దలు కొట్టడానికి, భారతదేశం వెలుపల ఉన్న చరిత్రను ఒకసారి పరిశీలిద్దాం. ప్రపంచ చరిత్రలో రోమన్ సామ్రాజ్యం అత్యంత శక్తివంతమైనది మరియు అభివృద్ధి చెందినది. వారు అద్భుతమైన కట్టడాలు, రోడ్లు, ఆక్విడక్ట్‌లు నిర్మించారు. భారీ సైన్యాన్ని నిర్వహించారు. వారి వ్యాపార లావాదేవీలు ఖండాంతరాలకు వ్యాపించాయి. మరి ఇదంతా వారు ఎలా చేశారు? వారు కూడా లెక్కపెట్టారు.

కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే: రోమన్ సంఖ్యామానం (Roman Numerals) లో 'సున్నా' (0) అనే చిహ్నమే లేదు! 🚫

వారు సంఖ్యలను సూచించడానికి అక్షరాలను (Letters) చిహ్నాలుగా వాడారు:

I=1, V=5, X=10, L=50, C=100, D=500, M=1,000.

వారు పదిని సూచించడానికి 'X' అనే అక్షరాన్ని వాడారు తప్ప, '1' పక్కన '0' పెట్టలేదు. వందను సూచించడానికి 'C' ని వాడారు. సున్నా అనే చిహ్నం లేకుండానే రోమన్లు పదిని, వందను, వేలను (M) అవలీలగా లెక్కపెట్టగలిగారు, మహా మహా కట్టడాలకు ఇంజనీరింగ్ లెక్కలు వేయగలిగారు, వారి సామ్రాజ్యాన్ని ఏలారు.

ఆ వీడియోలో ప్రశ్నించిన మహిళ తర్కం ప్రకారం అయితే, రోమన్లకు సున్నా తెలియదు కాబట్టి, వారు పది మంది సైనికులను లెక్కపెట్టలేకూడదు, వంద నాణేలను లెక్కపెట్టలేకూడదు. కానీ చరిత్ర మనకు ఏం చెబుతోంది? వారు లెక్కపెట్టారు, చిహ్నాల రూపంలో రాశారు, కానీ సున్నా అనే చిహ్నాన్ని వాడలేదు.

ఇది స్పష్టంగా నిరూపిస్తోంది: ఒక పరిమాణాన్ని (Quantity) గుర్తించడానికి నిర్దిష్టమైన అంకె చిహ్నం (Digit Symbol - like '0') అవసరం లేదు, ఒక ప్రత్యామ్నాయ గుర్తు లేదా పదం (Word) ఉంటే చాలు. రామాయణ భారతాల కాలంలో 'దశ', 'శత' అనే పదాలు ఆ పనిని చేశాయి.

5: శూన్యం అనగా ఏమిటి? ఆర్యభట్ట నిజంగా ఏం చేశాడు?

ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఆర్యభట్ట (క్రీ.శ. 5వ శతాబ్దం) 'సున్నా' ను కనిపెట్టాడు అనే వాదనలోని సత్యమెంత? ఇక్కడ సామాజిక మాధ్యమాలలో చెలామణి అవుతున్న ఒక పెద్ద చారిత్రక అపోహను తొలగించాలి.

ఆర్యభట్ట క్రీ.శ. 5వ శతాబ్దంలో 'ఏమీ లేకపోవడం' (Nothingness) అనే భావనను లేదా 'సున్నా' అనే ఆకారాన్ని మొదటిసారిగా కనిపెట్టలేదు. ఆర్యభట్ట కన్నా ఎన్నో వేల సంవత్సరాల క్రితమే భారతీయులకు 'శూన్యం' (Void / Emptiness) అనే తాత్విక మరియు గణిత భావన తెలుసు. మన వేదాలు, ఉపనిషత్తులు, మరియు ప్రాచీన గణిత గ్రంథాలు శూన్యం గురించి, అనంతం గురించి ఎంతో లోతుగా చర్చించాయి.

💡 ఆధారం 2: పింగళుడి ఛందస్సూత్రం (క్రీ.పూ. 3వ శతాబ్దం): ఆర్యభట్ట కంటే సుమారు 800 సంవత్సరాల ముందే, పింగళుడు అనే మహర్షి తన 'ఛందస్సూత్రం' లో ఛందస్సును లెక్కించడానికి 'శూన్యం' అనే పదాన్ని ఒక గణిత సూచికగా ఉపయోగించాడు. ఆయన ద్విసంఖ్యామానం (Binary System) వంటి పద్ధతిని వాడాడు. "గాయ్త్రీ శేషే శూన్యమ్" (ఛందస్సూత్రం 8.29). ఇక్కడ 'శూన్యం' అనే పదాన్ని స్పష్టంగా వాడారు. అంటే[5:23 pm, 6/8/2026] కాదంబరి ప్రభు Kadambari Prabhu: అంటే ఆర్యభట్ట కంటే ముందే గణిత ప్రక్రియలలో శూన్యం అనే భావన ఉనికిలో ఉంది.

మరి ఆర్యభట్ట సాధించిన ఘనత ఏమిటి?

ప్రాచీన కాలంలో లెక్కలు పదాల రూపంలో ఉండేవి. ఇది చాలా నిదానంగా సాగే ప్రక్రియ. ఆర్యభట్ట చేసిన గొప్ప పని ఏమిటంటే: స్థాన విలువ విధానాన్ని (Decimal Place Value System) పరిపూర్ణం చేయడం మరియు సున్నాను ఒక సంఖ్యగా (Number) గణిత ప్రక్రియలలో ఉపయోగించే పద్ధతిని క్రమబద్ధీకరించడం.

ఆర్యభట్ట తన 'ఆర్యభట్టీయం' లో స్థాన విలువ పద్ధతిలో, ఒక స్థానంలో ఏమీ లేకపోతే (ఉదాహరణకు 101 లో పదుల స్థానంలో ఏమీ లేదు), ఆ ఖాళీని సూచించడానికి ప్రాచీన భారతీయులు ఒక చుక్క (Dot) ను లేదా చిన్న వృత్తాన్ని వాడటం ప్రారంభించారు. దీనినే 'శూన్య బిందువు' అన్నారు. ఆర్యభట్ట ఈ పద్ధతిని ఉపయోగించి ఖగోళ లెక్కలను అత్యంత ఖచ్చితంగా చేశాడు. ఆయన సున్నా లేనిదే సాధ్యం కాని 'స్థాన విలువ పద్ధతి' ని ప్రపంచానికి అందించాడు.

🔲 ఆధారం 3: బక్షాలీ వ్రాతప్రతి (c. క్రీ.శ. 3-4 శతాబ్దం): ఆర్యభట్ట కంటే ముందే ఉన్న ఈ గ్రంథంలో 'సున్నా' ని ఒక చిన్న చుక్క (Dot) రూపంలో స్థాన విలువలో ఖాళీని సూచించడానికి వందలాది చోట్ల ఉపయోగించారు.

🔲 ఆధారం 4: బ్రహ్మగుప్తుడు (క్రీ.శ. 7వ శతాబ్దం): ఆర్యభట్ట తర్వాత వచ్చిన ఈయన సున్నాకు సంబంధించిన గణిత నియమాలను (A-A=0, Ax0=0) మొట్టమొదటిసారిగా స్పష్టంగా నిర్వచించాడు.

🔲 ఆధారం 5: గ్వాలియర్ కోట శాసనం (క్రీ.శ. 876): మనం ఈనాడు వాడుతున్న సున్నా ఆకారం (0 - వృత్తం) మొట్టమొదటిసారిగా ఈ శాసనంలో కనిపించింది.

6: సగం జ్ఞానం - సోషల్ మీడియాలో ప్రమాదకరమైన ధోరణి

ఈ కథనం ప్రారంభంలో ఉదహరించిన మహిళ ప్రశ్న, దానిని సమర్థిస్తూ వచ్చిన వేలాది కామెంట్లు నేటి సమాజంలో నెలకొన్న ఒక ప్రమాదకరమైన ధోరణికి అద్దం పడుతున్నాయి. అదే "సగం జ్ఞానం" (Half-Knowledge).

ఆ ప్రశ్న అడిగిన మహిళకు ఒక విషయం తెలుసు: ఆర్యభట్ట సున్నాకు సంబంధించి ఏదో చేశాడు మరియు అది 5వ శతాబ్దంలో జరిగింది. కానీ ఆమెకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి:

❌ లిపికి, భాషకు ఉన్న తేడా తెలియదు.

❌ పదాల రూపంలో లెక్కించే సంస్కృత పద్ధతి తెలియదు.

❌ రోమన్ సంఖ్యామానంలో సున్నా లేదనే చరిత్ర తెలియదు.

❌ ఆర్యభట్ట కంటే ముందే శూన్య భావన, బక్షాలీ చుక్క చిహ్నం ఉన్నాయనే చారిత్రక ఆధారాలు తెలియదు.

త తను తెలిసిన ఆ ఒక్క ముక్క సమాచారంతో (ఆర్యభట్ట = 5వ శతాబ్దం), తనకు తెలియని వేల సంవత్సరాల చరిత్రను (రామాయణ భారతాది కాలం) తప్పుబట్టే ప్రయత్నం చేసింది. ఇది మేధోపరమైన అహంకారం మరియు అజ్ఞానానికి పరాకాష్ఠ.

నేడు సోషల్ మీడియాలో వీక్షణల (Views) కోసం, లైకుల కోసం పనిగట్టుకుని వివాదాలు సృష్టించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా మతపరమైన విశ్వాసాలను, ప్రాచీన ఇతిహాసాలను టార్గెట్ చేయడం ద్వారా సులభంగా పబ్లిసిటీ పొందవచ్చని కొందరు భావిస్తారు. ఈ ప్రశ్న వెనుక ఉన్నది కేవలం సత్యశోధన కాదు, హిందూ పురాణాలను లేదా కొందరిని అవహేళన చేయడానికి ఒక తప్పుడు లాజిక్ పట్టుకుని అడిగిన ప్రశ్న ఇది.

దీనిని బుర్ర తక్కువ వారు షేర్ చేయడం, ఛాలెంజ్ చేయడం, చప్పట్లు కొట్టడం మరింత ప్రమాదకరం. వారు తాము కూడా ఒక గొప్ప తార్కిక ప్రశ్నను అడుగుతున్నామని భ్రమిస్తారు. నిజానికి వారు తమ అజ్ఞానాన్ని పదిమందికీ చాటుకుంటున్నారు. శాస్త్రీయ దృక్పథం అంటే ప్రతిదానినీ తప్పుబట్టడం కాదు, ఒక విషయం గురించి పూర్తిగా, ఆధారాలతో సహా తెలుసుకోవడం. సగం సమాచారంతో ముగింపుకు రావడం అశాస్త్రీయం.

7: ముగింపు - సత్యం వైపు నడవాల్సిన బాధ్యత

"గొప్ప ప్రశ్న" అని చప్పట్లు కొట్టిన వారందరికీ, ఈ కథనం ఒక మేల్కొలుపు కావలసి ఉంది. మన ప్రాచీన ఇతిహాసాలైన రామాయణ మహాభారతాలు కేవలం కథలు కావు, అవి మన సంస్కృతి, నాగరికత మరియు విజ్ఞానానికి ప్రతీకలు. వాటిని తప్పుబట్టే ముందు, మనకు ఆ విషయంపై పూర్తి అవగాహన ఉందా అని ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి.

సత్యం యొక్క సారాంశం:

✅ రామాయణ భారతాల కాలంలో లెక్కపెట్టడం తెలుసు, సంఖ్యలను 'దశ' (పది), 'శత' (వంద) అనే పదాల రూపంలో రాశారు.

✅ సున్నా అనే భావన క్రీ.పూ. వేల సంవత్సరాల నుండి భారతీయులకు తెలుసు (యజుర్వేదం, పింగళుడు).

✅ ఆర్యభట్ట కంటే ముందే సున్నాను చుక్క (Dot) చిహ్నం రూపంలో గణితంలో వాడారు (బక్షాలీ వ్రాతప్రతి).

✅ ఆర్యభట్ట 5వ శతాబ్దంలో 'సున్నాను కనిపెట్టలేదు', కానీ స్థాన విలువ పద్ధతిని క్రమబద్ధీకరించి, గణితాన్ని కొత్త పుంతలు తొక్కించాడు.

కాబట్టి, రావణుడికి పది తలలు, కౌరవులు వందమంది అని చెప్పడం అబద్ధం కాదు. అది ఆ కాలపు భాషా మరియు గణిత పద్ధతి. ఆర్యభట్ట పుట్టక ముందే వారు లెక్కపెట్టారు.

సోషల్ మీడియాలో వచ్చే ప్రతి తప్పుడు సమాచారాన్ని గుడ్డిగా నమ్మడం, షేర్ చేయడం ఆపేయాలి. సందేహం వస్తే, లోతుగా అధ్యయనం చేయాలి. సగం జ్ఞానంతో అవహేళన చేయడం వల్ల మన అజ్ఞానమే బయటపడుతుంది. సత్యాన్ని ప్రేమతో పంచుదాం, నిరాధారమైన వాదనలను ఆధారాలతో తిప్పికొడదాం. అప్పుడే సమాజంలో సత్యం సూర్యుడిలా ప్రకాశిస్తుంది. 🌟

- గౌతమ్ కశ్యప్

ఇది చాలా విలువైన వ్యాసం... గా"

గుర్తించి నాకు పంపించిన ఆచార్య శ్రీ బేతవోలు రామ బ్రహ్మంగారికి కృతజ్ఞతలతో.🌹

ఈ వ్యాసముశ్రీ విశ్వనాథ సాహిత్యపీఠ నిర్వాహకులు శ్రీ కాదంబరి ప్రభు గారు వాట్సప్ లో ప్రచురించగా సేకరించి ప్రచురించితిని.

శ్రీ గౌతం కాశ్యప్ గారికి ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం గారికి,  శ్రీ కాదంబరి ప్రభు లకు నా ధన్యవాద పూర్వక నమస్సులు.

జైహింద్.

మందస్మిత శతకంలోని 24వ శ్లోకము. ప్రతిపదార్థ భావ విశేషాల వివరణము. బ్రహ్మశ్రీ తాడేపల్లి పతంజలి.

0 comments

జైశ్రీరామ్.

మందస్మిత  శతకంలోని 24వ శ్లోకము.  

ప్రతిపదార్థ భావ విశేషాల వివరణము ... తాడేపల్లి పతంజలి.

మూకపంచశతిలోని అమృతతుల్యమైన 500శ్లోకాలలో, శ్రీ కంచి పరమాచార్య స్వామివారు ఎంపిక చేసిన 31 ముఖ్య శ్లోకాలలో ( మూక సారములో 22వ శ్లోకము,) ఒకదాని దానిప్రతిపదార్థం,  తాత్పర్యంమరియు విశేష వివరణలు  06 -08 -2026

‘మూకసారము’లోని 22వ శ్లోకము మూకపంచశతి - మందస్మిత  శతకంలోని 24వ శ్లోకము.

శ్లోకము

కర్పూరైరమృతాంశుభిర్జనని! తే కాన్తైశ్చ చన్ద్రాతపై-

ర్ముక్తాహారగుణైర్మృణాలవలయైర్ముగ్ధస్మితశ్రీరియమ్।

శ్రీకాఞ్చీపురనాయికే! సమతయా సంస్తూయతే సజ్జనై-

స్తత్తాదృఙ్మమ తాపశాన్తివిధయే కిం దేవి! మన్దాయతే॥

ప్రతిపదార్థము

శ్రీకాఞ్చీపురనాయికే! = ఓ శ్రీకాంచీపురమునకు అధిదేవతవైన కామాక్షీ అమ్మవారా!

జనని! = జగన్మాతా!

దేవి! = ప్రకాశించు స్వభావము గల పరాశక్తీ!

తే = నీ యొక్క,

ఇయమ్ = ఈ,

ముగ్ధస్మితశ్రీః = అందమైన, అమాయకమైన చిఱునవ్వు యొక్క కాంతి/శోభ,

కర్పూరైః = కర్పూరములతోను,

అమృతాంశుభిః = శీతల కిరణాలు గల చంద్రులతోను,

కాన్తైః = మనోహరమైన,

చన్ద్రాతపైః చ = వెన్నెలలతోను,

ముక్తాహారగుణైః = ముత్యాల దండలతోను,

మృణాలవలయైః = తామరతూండ్లతో చేసిన కడియములతోను,

సజ్జనైః = సత్పురుషులచేత (జ్ఞానులచేత),

సమతయా = సమానమైనదిగా (తుల్యమైనదిగా),

సంస్తూయతే = కొనియాడబడుచున్నది.

తత్ = అటువంటి,

తాదృక్ = సాటిలేని శీతలత్వము గల నీ చిఱునవ్వు శోభ,

మమ = నా యొక్క,

తాపశాన్తివిధయే = (సంసార) తాపములను తొలగించి శాంతిని కలిగించే విషయంలో,

కిమ్ = ఏ కారణము చేత,

మన్దాయతే = ఆలస్యము/సోమరితనము చూపుచున్నది?

తాత్పర్యము

కాంచీపురేశ్వరియైన ఓ జగన్మాతా! కామాక్షీ దేవీ! నీ మందహాసము (చిఱునవ్వు) యొక్క కాంతి కర్పూరము, పూర్ణ చంద్రుడు, చల్లని వెన్నెల, ముత్యాల హారములు, తామరతూండ్ల కడియములతో సమానమైన శీతలత్వము కలిగినదని సజ్జనులు ఎల్లప్పుడూ కీర్తిస్తుంటారు. అటువంటి మహా మహిమాన్వితమైన నీ చిఱునవ్వు శోభ, నా మానసిక, శారీరక తాపములను (దుఃఖములను) నివారించే విషయంలో ఎందుకు ఆలస్యము చేస్తోందో నాకు బోధపడటం లేదు!

విశేష వివరణ

శీతలోపచారములు & ఉపమాలంకారము:

భారతీయ సాంప్రదాయంలో శరీరాన్ని లేదా మనస్సును చల్లబరిచేందుకు కర్పూరము పూసుకోవడం, వెన్నెలలో గడపడం, ముత్యాల హారాలు ధరించడం, తామరతూండ్లను ధరించడం వంటివి శీతలోపచారాలుగా చెబుతారు. కవి కామాక్షీ అమ్మవారి చిఱునవ్వును ఈ అన్ని శీతల వస్తువులతో సమానమైనదని సజ్జనులు (జ్ఞానులు) స్తుతిస్తున్నారనడం ద్వారా ఇక్కడ సుందరమైన ఉపమాలంకారము స్ఫురిస్తోంది.

కవి వ్యాజస్తుతి / ఆర్తి:

జ్ఞానులైన సజ్జనులు చెప్పే మాట ఏనాడూ అసత్యం కాజాలదు. నీ చిఱునవ్వు అంతటి చల్లదనము, ప్రశాంతతను ఇవ్వగలిగినప్పుడు, నా తాపములను శమింపజేయడంలో ఎందుకు ప్రశాంతంగా, ఆలస్యంగా వ్యవహరిస్తోంది? అని కవి అమ్మవారిని నిష్కాపట్యంతో ప్రశ్నిస్తున్నారు.

'ముగ్ధ' శబ్ద స్వారస్యము:

ఈ శ్లోకంలో అమ్మవారి చిఱునవ్వును "ముగ్ధస్మితశ్రీః" అని వర్ణించారు. 'ముగ్ధ' అనగా అమాయకత్వము లేదా భోళాతనము. అమాయకులైనవారు ఏ పనినైనా వెంటనే చేయక కొంత ఆలస్యంగా గ్రహించి స్పందిస్తుంటారు (మందగిస్తారు). కాబట్టి, అమ్మవారి చిఱునవ్వులోని అమాయకత్వము (ముగ్ధత్వము) వలనే నా తాప నివారణలో కూడా ఈ చిన్నపాటి ఆలస్యము జరుగుతోందేమోనని కవి చాలా మధురమైన భావనతో అమ్మవారి చిఱునవ్వు యొక్క అమాయకత్వాన్ని కొనియాడారు.

ఇట్లు

బ్రహ్మశ్రీ తాడేపల్లి పతంజలి.

పతంజలి మహోదయులకు ధన్యవాదములు.

ఈ శ్లోకమునకు నా తెలుగు అనువాద పద్యము.

తే.గీ.II  కప్పురపుపొడి, యమృతమ్ము, కమ్మనైన

వెన్నెలయు, ముత్తెములపేరు, బిసమటంచు

నీదు మందస్మితంబును నేర్పుమీర

చెప్పుదురిలను కామాక్షి! గొప్పవారు.

జైహింద్.