జైశ్రీరామ్.
మామిడి చెట్టు పరివారం. (గంపెడు పిల్లలు)
రచయిత ... శ్రీ కడయింటి కృష్ణమూర్తి..గోవా...(నెల్లూరు)
పురుషోత్తమ రావు పాతకాలం మనిషి కాదు, నవీన ఛాందసుడు. కుటుంబ వ్యవస్థల మీద అపారమైన నమ్మకం కలవాడు. పాత తరాలకు క్రొత్త మెఱుగులు దిద్దాలన్న పంతం ఆయనది. పశు పక్ష్యాదులకు కూడా సంబంధాలు నెఱపుతూ దాని కూతురిది, దీని మనుమరాలది, దాని తల్లి యిది అని తన కొట్టం లోని పశువుల గురించి కూడా వరసలు గలిపి చెబుతుంటాడు. పశువులకు మాత్రం బంధుత్వాలు ఉండవా?? చెట్లకు ఉండవా??అనేది వారి వాదన. వారికి ఓ కూతురు ఇద్దరు కుమారులు. పెరట్లో ఒక మామిడి చెట్టు. ఆ ముగ్గురూ ఈ మామిడి చెట్టూ వారికి ఆరు ప్రాణాలు. ఆ చెట్టు వారి ఇల్లాలికి అరణపు సంపద.
దానికో చిన్న పూర్వ కథ.
పురుషోత్తమ రావు గారి ఇల్లాలు కాపురానికి వచ్చిన రోజున ఆమె తండ్రి తమ పొలంలోని మామిడి చెట్టు పండ్లు ఓ బుట్టడు తెచ్చియిస్తూ "నాయనా ఇవి మన ఇంటి చెట్టు పండ్లు" అంటూ "అమ్మా ఇవి కోసి అందరికీ పెట్టు" అంటూ కూతురి చేతిలో ఓ రెండు పండ్లు పెట్టి మిగతా బుట్ట లోపల పెట్టించాడు.. "ఆమె ఇంకో నాలుగు పండ్లు కోసి భర్తకూ నాన్నగారికీ అత్తయ్య మామయ్యలకు కూడా పళ్లేలలో పెట్టి అందించింది. అందరూ వాటి రుచిని మెచ్చుకుంటూ ఆరగించారు. వారి ఆనందం చూసి అమ్మాయి తండ్రి సంతోషించారు. కొత్త గాబట్టి అమ్మాయి "అత్తయ్యా ఈ టెంకలూ తొక్కలూ ఎక్కడ వెయ్యమంటారు" అనడిగింది.
"అక్కడ ఉంచమ్మా నేను తీస్తాను. నువ్వెళ్లి నాన్నగారి దగ్గర కూర్చో" అంటూ ప్రేమగా చెప్పి ఆ టెంకలు తీసి ఇంటి పెరట్లో పడవేసింది. వాటికి ఈగలు ముసురుతూ ఉంటే అక్కడ ఉన్న పాలేరెవరో చూసి దాని మీద రెండు పారల మట్టి పోశాడు. "ఇక ఇక్కడ మనకేం పని, ఈ పాలేరు మన నోట మట్టి గొట్టాడు " అనుకుంటూ ఈగలు వెళ్లి పోయాయి. ఆ తర్వాత వారం రోజులకు వర్షం పడింది. ఆ ముసురు వారం పది రోజుల వరకూ సాగింది. ఆ తర్వాత కాస్త తెరిపి ఇచ్చేసరికి ఎవరో తట్టి లేపినట్లుగా ఆ మామిడి టెంకలు తలెత్తి చూసి మొలకెత్తాయి. ఎరుపూ హరితమూ కాని వర్ణంలో ఆకులు వ్రేళ్లాడేసుకుని ముద్దుగా కనిపించాయి. ముందుగా వాటిని చూసింది పురుషోత్తమ రావే. వాటిని పశువులు తొక్కకుండా ఒక ముళ్ల కంప అడ్డం పెట్టాడు. నాలుగు రోజులకు ఆకులు చిలుకాకు పచ్చగా వుండి తర్వాత నిదానంగా ముదురాకు పచ్చలోకి మారాయి. వారం పది రోజులకు మరో నాలుగాకులు వేశాయి, అలా నిదానంగా ఓ అడుగు ఎత్తు ఎదిగాయి. ఎంతో ఆరోగ్యంగా బలంగా ముద్దుగా ఉన్నాయా మొక్కలు.
అప్పుడు పాలేరు వాటిని చూసి అయ్యగారూ ఇవి ఆరూ ఒక్కచోట ఉంటే సారం చాలక బలహీన పడతాయి. ప్రస్తుతానికి కుండీలలో వేర్వేరుగా వేద్దాం. అని ఆరు మట్టి కుండీలు అడుగున్నర ఎత్తూ ఓ అడుగు వ్యాసమూ ఉన్నవి చూసి తెచ్చి మంచి బలమైన ఎరువూ మంచి మట్టీ పోసి అందులో నాటారు. ఓ పది నెలలు గడిచేసరికి అవి బలంగాఎదిగి దారిన పోయే వారిని కూడా ఆకర్షించ సాగాయి.
అప్పుడు పురుషోత్తమ రావు గారి తండ్రి వాటిని రామాలయం వద్ద ఒకటి, ఇంటి వెనుక పెరట్లో ఒకటీ, గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద ఒకటి, పాఠశాల వద్ద ఒకటి, తమ పొలంలో దొరువు గట్టున రెండూ ఇలా నాటించాడు. అవి దినదిన ప్రవర్థమానమవుతూ జనులకు కనుల విందు చేస్తున్నాయి.
అలా వారి సంకల్ప బలంతో పురుషోత్తమ రావు పెరట్లోని చెట్టుకూడా దినదిన ప్రవర్థమానమవుతోంది. ఈలోగా కాల చక్రం కూడా ఓ యిరవై ఆకులు ముందుకు జరిగింది. ఇప్పుడు పురుషోత్తమ రావు కుమార్తెకు పద్దెనిమిదేళ్లు. ఆయనకు కూతురంటే ఎంత ప్రేమో ఆ మామిడి మొక్క అన్నా అంతే ప్రేమ. మామిడి మొక్క కాస్త ఆలస్యంగానైనా పూతకొచ్చింది. పురుషోత్తమరావు పెద్ద పండుగే చేశాడు. అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేయించాడు. అన్నదానం విరివిగా చేశాడు. పని గట్టుకుని వెళ్లి మిగతా చెట్లను కూడా చూసి వచ్చాడు. అవి కూడా ఇంచుమించు ఇదే పరిణామ క్రమంలో ఉన్నాయి. సంతోషించాడు.
మామిడి చెట్టు పూత పిందెలతో నిండుగా కనుల విందుగా ఉంది. భార్య ప్రోద్బలంతో గౌతమికి సంబంధాలు వెదకడం మొదలెట్టారు పురుషోత్తమ రావు గారు.
గౌతమి లాంటి అమ్మాయికి సంబంధాలు పనిగట్టుకు వెదకాలా? ఆయన అలా సంకల్పించిన విషయం తెల్సిన వెంటనే ఓ సంప్రదాయ కుటుంబం "అమ్మాయిని చూసుకోవడానికి ఎప్పుడు రమ్మంటారు" అన్న వాకబుతో ముందుకొచ్చింది. పురుషోత్తమరావుగారికి సంతోషం కలిగించింది. సంకల్పించి ఏదీ ఇంకా రెణ్ణెల్లయినా కాందే.
మామిడి కాయలు పక్వానికొచ్చాయి.
ఇటు అమ్మాయికి మంచి సంబంధం రావడం అటు మామిడి తొలి కాపు కాయడం పురుషోత్తమ రావు గారికి రెండు కళ్లకీ రెండు పండుగల లాగా ఉంది. తమ పురోహితుడి సలహా మేరకు పెళ్లిచూపుల రోజు నిర్ణయించడం తో అది కూడా దగ్గర కొచ్చింది. శుభస్య శీఘ్రం అన్నారు పురోహితులు.
ముందు రోజు మధ్యాహ్నం పురుషోత్తమ రావు మామిడి చెట్టు క్రింద నులక మంచం వేసుకుని కూతురితో కలిసి కూర్చుని అటు మామిడి చెట్టునీ ఇటు గౌతమినీ కనుల నిండుగా చూసుకుంటూ ముచ్చట్లాడుతున్నాడు. అది చూస్తూ వారి ముచ్చట్లు వింటూ మామిడి చెట్టు కూడా పులకించింది. ఆ పులకరింతతోబాటు కదలిక వచ్చి ఒక అరమాగిన పండును వారి మధ్యన మెల్లగా పడేసింది. తండ్రీ కూతుళ్లిద్దరూ తలెత్తి చూశారు. "మీ ప్రయత్నాలు ‘ఫల’వంతం అవుతాయి ఇది నా ఆశీర్వాదం" అన్నట్లుగా చిరునవ్వు చిందించింది సీతమ్మ లాగా. ఆ సీతమ్మ కీమె తోబుట్టువే కదా. అది అర్థం అయినట్లుగా పురుషోత్తమ రావు రెండు కళ్లనుండి రెండు ఆనంద బాష్పాలు. గౌతమిని ప్రేమగా దగ్గరకు తీసుకుని ఆమె తలతో తన తల తాటించి కళ్లు తుడుచుకున్నాడు.
ఆ పండును భార్య కిచ్చి భద్రంగా బియ్యపు డబ్బాలో దాచమని చెప్పాడు.
ప్రక్క రోజుసాయంత్రం నాలుగవుతుండగా అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వచ్చారు. పురుషోత్తమ రావుగారు ఉదయమే మామిడి చెట్టు నీడ పడినంత మేర శుభ్రం చేయించి నీళ్లు చల్లించారు. నాలుగైదు కుర్చీలు వేయించి క్రింద కూర్చునే వాళ్లకు చాపలు వాటిపైన తెల్లని దుప్పట్లు పరిపించారు. అందరూ మామిడి చెట్టు కనుసన్నలలో ఆసీనులయ్యారు. పురోహితుల వారు ఇరు కుటుంబాల పరిచయ వాక్యాలు పలికారు. పురుషోత్తమ రావు గారు వరుని గురించి తెలుసుకున్నారు.
తెలుసుకొని తన కుమార్తె గురించి,
ఉ. ఇల్లడ బెట్టె నీపె నిట, యీమెవి యాటలు పాటలింతలా!
పెల్లుగ బెంచినార మిక పెద్దగు వేలుపు మాట నిల్పుచు
న్నిల్లడ దీర్పగా దలచి యీ సహకారము తోడు నీడలో
చల్లగ నాటపాటలను చక్కగ నేర్చిన గౌతమిం దగన్.
మ.కో. కన్నవారము మేమె యైనను కాన్క బెట్టక దప్పునా
కన్ను ఱెప్పల నార్పకుండగ గాచి నారము ప్రేముడిన్
మన్ననన్ మరి యిచ్చుటల్ గని మాయురే యన ధాతయున్
గ్రన్ననన్ మరి మీరలిప్పుడు కాన్క నందిన భాగ్యమే.
అని కావ్యపరిభాషలో పరిచయం చేసి వారి సంబంధాన్ని పటిష్ఠం చేసుకున్నాడు.
తర్వాత నిన్నటి మామిడి పండును వారికి పళ్లెంలో పెట్టి అందించి ఆ పండునూ, పండు దొరికిన వైనాన్నీ,ఆ పండును కన్నతల్లి చెట్టునూ పరిచయం చేసి కళ్లు తుడుచుకుని ఆ పండును అక్కడే అందరూ ఆరగించాలని వేడుకున్నాడు. గౌతమికి కాబోయే మామగారు విస్తుబోయారు. ఒక మామిడి పండుకు ఇంత చరిత్రా. దాని పరిచయాని కింత ఉద్వేగమా? అనుకుంటూ తానూ పురుషోత్తమ రావుగారి సహృదయాన్ని గ్రహించి ఆ పండును అందరూ తలో ముక్కా ఆరగించిన తర్వాత ఆ టెంకను కడిగించి " ఈ టెంకను పరంపరానుగతంగా మా యింటివద్ద నాటి పెంచుతాను. "గౌతమినీ, ఈ టెంకనుండి రాబోయే ఆ మొక్కనూ సమానంగా అభిమానంతో వాత్సల్యంతో చూసుకుంటానని మాట యిస్తున్నాను". అనగానే పురుషోత్తమ రావు కళ్ల నుండి నీళ్లు జలజల రాలాయి. వారికి గౌతమికీ మామిడి చెట్టుకీ ప్రేమ పరంగా అభేదం. ఒక్కసారి తలెత్తి మామిడి చెట్టు వంక జూశాడు. అది తృప్తిగా తలాడించింది. సంబంధాన్ని ఆమోదించింది. పురుషోత్తమ రావు గారి మనస్సు తేలిక పడింది. నా బిడ్డ బాగోగులు చూసుకోవడానికి ఈ చెట్టు తన బిడ్డని ముందే పంపుతోంది. అని కళ్లు తుడుచుకున్నాడు.
ముహూర్తాలు పెట్టుకోవడం, తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం సుముహూర్తం దగ్గర పడడం అన్నీ మామిడి చెట్టు స్వయంగా పర్యవేక్షించింది. గమనించింది, కల్యాణాన్ని కన్నులారా వీక్షించింది. దీవించింది, వధూ వరులను కళ్లారా చూసుకుంది. కొత్త దంపతులకు కబుర్లు చెప్పుకోవడానికి దట్టమైన నీడ నిచ్చింది.
చల్లని పిల్లగాలులతో వారిలో కొత్త కొత్త కోరికలను రేకెత్తించింది. గౌతమి ముంగురులను అటూ యిటూ పరుగెత్తింప జేస్తూ వరుని కళ్లలో ఆనందాన్ని నింపింది. తానూ ఆనందించింది.
గౌతమిని అత్తవారింటికి సాగనంపిన పురుషోత్తమరావు పెరట్లోకి వచ్చి మామిడి చెట్టు వంక తలెత్తి చూశాడు "బెంగ పెట్టుకోకు" అని ఓదారుస్తున్నట్లుగా రెండుసార్లు కళ్లార్పే నెపంతో కన్నీళ్లు చెంపల మీదికి వదిలేశాడు. భార్యా భర్తలిద్దరూ ఆ సాయంత్రం ఆ చెట్టు వద్దే కూర్చున్నారు. ఒకర్నొకరు చూసుకుంటున్నారు.
నేల వంక చూస్తున్నారు. చెట్టువంక చూస్తున్నారు. "అల్లుణ్ణీ అమ్మాయినీ ఇంకో రెండు రోజులు ఉండమని చెప్పాల్సింది" గొణుక్కున్నారు ఇద్దరూ ఒకేసారి.
"ఠప్" మని వారి మధ్య ఒక మామిడి పండు పడింది. ఉలిక్కి పడ్డారిద్దరూ. తలెత్తి చూశారు చాలా ఎత్తుకొమ్మమీది నుండి పడిందేమో పండు చితికి పోయింది.
"వారినిప్పుడు కాపురానికి పంపడమే మంచిది. ఎక్కువ రోజులుంటే మమకారాలు ఎక్కువై మనస్పర్థలు రావచ్చు" "ఇలాగా"
అని ఆ చెట్టు పండును చూపి చెప్పినట్లయ్యింది వారికి. రెండు సార్లు కళ్లార్పుకుని అప్పటికి ఇంట్లో ఉన్న బంధువులు హెచ్చరించడంతో లేచి కళ్లు తేట పడగా లోనికి వచ్చి నిత్య నైమిత్తికాలు అన్యమనస్కంగానే పూర్తిచేశారు. "పండు పక్వం పరాధీనం" అన్న భావన కదలాడింది వారి కళ్లలో. ఆ భావన వారికీ వారు పెంచుకున్న ఆ చెట్టుకీ కూడా వర్తించింది. అవును గదా.
కాల చక్రం మరో పదాకులు నడిచింది. పురుషోత్తమ రావు గారి కుమారులు ఇరువురూ చదువుకుని స్థిరపడ్డారు. గౌతమి కుమార్తె కిప్పుడు ఐదున్నరేళ్లు. గౌతమి తో బాటు అరణంగా అత్తవారింటికి వచ్చిన మామిడి మొక్క కిప్పుడు పదేళ్లు. ఇప్పుడిప్పుడే కాపుకొస్తూ ఉంది.
చల్లని ఆ చెట్టు నీడలో అమ్మగారింటి ఆదరణను అత్తగారింట్లో పొందుతోంది గౌతమి. తండ్రి పరిష్వంగమే ఆ చెట్టు సాంగత్యం. ఆ చల్లని నీడయే తండ్రి ఆశీర్వచనం. తండ్రి గుర్తొచ్చాడు గౌతమికి.
మామిడి తొలి పూత పిందె చూసి పెద్ద పండుగే చేశాడు తండ్రి ఆనాడు. ఆ చెట్టు సంతానం ఇప్పుడు ఇక్కడ పూతకొచ్చింది. అదే ఆలోచిస్తూ
చెట్టు వంక చూస్తూ కూతురితో కబుర్లలో ఉన్న గౌతమిని చూశారు మామగారు. మాటిమాటికీ మామిడి వంక చూస్తున్న ఆమె ఆలోచనలను పసిగట్టారు. "అమ్మా గౌతమీ" అంటూ దగ్గరకు వచ్చాడు. "మామయ్యా" అంటూ గౌతమి లేచి నిలబడింది. మామయ్య గౌతమి తల నిమిరి
"నాన్న గుర్తొస్తున్నాడు కదా తల్లీ" అనగానే గౌతమి కళ్ల నుండి రెండు కన్నీటి బొట్లు రాలాయి. నిన్నటి రోజున గౌతమి పేరుతో వచ్చిన ఉత్తరాన్ని
ఆమె చేతిలో పెడుతూ "నిన్న మధ్యాహ్నం పొలానికి వెళ్తూ ఉంటే పోష్టుమాష్టరు ఇచ్చాడు. రాత్రి యివ్వడం మరిచి పోయానమ్మా" అనగానే "అయ్యయ్యో ఫరవాలేదు మామయ్యా" అంటూ విప్పి చదివి "తమ్ముళ్లిద్దరూ ఊరికి వెళ్తున్నారట మామయ్యా. దారిలో ఇక్కడ దిగి మేన కోడలిని చూసి వెళతారట" అంది గౌతమి.
"సంతోషం తల్లీ" "రెండు రోజులు ఉండమని చెబుదాం" అంటూ కొడుక్కి ఈ కబురందించడానికి లేచారు మామయ్యగారు. ఆ కబురు వారికందడం రెండు మూడు రోజులు ఉండే విధంగా పనులు సర్దుబాటు చేసుకుని వారు రావడం మేనగోడలితో కబుర్లు ఆటలు పాటలు ముద్దులూ మురిపాలూ పెద్దవారి ఆనందాలూ యధావిధిగా ఒక్కక్షణంలో జరిగి పోయాయి. ఆ రెండు రోజులూ మేనమామల మధ్యనే నిద్రపోయింది మేనగోడలు.
అటు నుంచి అన్నా యిటునుంచి తమ్ముడూ మేనగోడలిని చూచుకోవడంతోనే వారి నిద్రలు తెల్లారి పోయాయి. రాత్రంతా మేన గోడలి మీద ఈగను కూడా వాల నివ్వలేదు మేనమామలు. ఒకరి కుడి చెయ్యి మరొకరి యెడమచెయ్యి భరోసాగా నిశ్చింతగా నిద్రబోయింది మేనగోడలు.
నిద్రలో లేచి తమ్ముళ్ల నిబ్బంది పెడుతున్నదేమోనని ఒకటికి రెండుసార్లు వచ్చి చూసింది గౌతమి. వారి మధ్య ప్రసన్న వదనంతో ‘మా మామ లుండగా నాకు భయమేంటోయ్’ అన్నట్లుగా చిరునవ్వు చెదరనీకుండా నిండు చందమామను ధిక్కరిస్తూ నిద్రపోతోంది చిట్టి తల్లి. వారిని తృప్తిగా చూసి తానూ నడుం చాల్చింది. మేన మామ అనే మాట ఎంత భరోసా మేనగోడలికి.
ఉదయాన్నే నిద్ర లేచేసరికి తమ్ముళ్లిద్దరూ ఒకరు మేనగోడలికి పళ్లు తోముతున్నారు రెండో వారు చెంబుతో నీళ్లూ టవలూ పట్టుకుని రాణీగారి సేవకు సిద్ధంగా ఉన్నారు. అదయ్యింతర్వాత ముఖం తుడిచారు. ఆ తర్వాత మామల బుజాలమీద గుఱ్ఱం ఎక్కి వచ్చింది. మామయ్యలు పాలు తాగిస్తే తాగింది. సాయంత్రం మామయ్యలు వెళ్లి పోతారని తెలిసిందా గడుగ్గాయికి. అంతే, వెళ్లి పోవద్దు మామయ్యా ఇంకా కొన్ని రోజులుండండి మామయ్యా, అని అమ్మతో చూడమ్మా మామయ్యలు వెళ్లి పోతామంటున్నారు. అని ఫిర్యాదు చేసి తాతయ్య దగ్గరకెళ్లి "తాతయ్యా మీరు చెప్పండి వెళ్లవద్దని, నాకు మామయ్యలతో ఆడుకోవాలని ఉంది" అని తాతయ్యవద్ద గారాలు పోయింది. ఏడుపు మొఖం పెట్టింది. కోపంగా చూసింది. అవ్వ దగ్గరకెళ్లి కూర్చుంది.
అప్పుడు తాతయ్య ‘ఇలా రాతల్లీ’ అని చేతులు చాచాడు. పరుగున వెళ్లి కళ్లింత పెద్దవి చేసి"మామయ్యలను ఉండమని చెబుతావా??" అని చంకెక్కింది.
దేవుడు భక్తికి వశుడవుతాడు. ఎంతటి ఱాతి గుండె అయినా చిన్న పిల్లల ప్రేమకు వశం కాక తప్పదు. "మామయ్యల తోబాటు ఊరికి వెళ్తావా తల్లీ" అనగానే తాతయ్య బుగ్గల మీద అమాంతం ముద్దుల వర్షం కురిపించేసింది మనుమరాలు. అందరి కళ్లూ తెరిపిన బడ్డాయి.
"అమ్మా గౌతమీ మీరూ తమ్ముళ్లతో కలిసి వెళ్లి అమ్మా నాన్నల దగ్గర నా ల్రోజులుండి రండి అని కొడుకుతో నీవూ వెళ్లు" అంటూ "ఈరోజు నవమి రేపు ఉదయం బాగుంది ప్రయాణానికి "
అని బయటికి నడిచాడు. అలా వెళ్లి పాలేరుని పిల్చుకుని వచ్చి కొన్ని కొబ్బరి కాయలు దింపించాడు. దోర మామిడి కాయలు ఏరి కొయ్యమని పురమాయించాడు. వాడాపనిలో నిమగ్నమయ్యాడు. అత్తగారేవేవో జాడీలలో సర్దింది.
అన్నీ భద్రంగా కట్టి బండెక్కించారు మామగారు. కోడలికి జాగ్రత్తలు చెప్పి వెనుదిరిగారు. బయలుదేరేటప్పుడు మనుమరాలు తాతయ్య మెడకు చుట్టుకుని ‘మా మం...చి తాతయ్య’ అని కితాబిచ్చింది. అంత పెద్ద బిరుదిస్తే ఏ తాతయ్య పొంగిపోడు.
కొడుకులూ కూతురూ అల్లుడూ మనుమరాలూ ఒక్క సారిగా వచ్చేసరికి పురుషోత్తమ రావు దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇక్కడికొచ్చినా మేనగోడలికి మేన మామల తోడిదే లోకం. మామిడి పండ్లూ కొబ్బరికాయలూ ఇంకా ఏవేవో అన్నీ ఇంట్లోకి చేరాయి.
గౌతమి రాగానే ముందు పరామర్శించిది మామిడి చెట్టునే. ఒక్కసారి తడిమి చూసుకుంది చేతికందిన ఆకులని నిమిరింది. తనివిదీరా చివరి కొమ్మవరకూ చూసింది. దాని నీడన కూర్చుంది. ‘గౌతమీ కాఫీ’ అని తల్లి పిలవడంతో లేచి లోనికెళ్లింది.
"అమ్మా నేనలా అమ్మవారి గుడిదాకా వెళ్లోస్తాను. అంది గౌతమి. ‘నేనో’ అంది కుమార్తె. ‘నీవు లేకుండానా? లేచి స్నానం చేసి మామయ్య తెచ్చిన గౌను వేసుకో’ అంటూ కూతుర్ని స్నానానికి లేవదీసింది. మామయ్య లిద్దరూ దొడ్లో మామిడి కాయలను పక్వానికొచ్చినవి ఏరి కోయిస్తున్నారు.
పురుషోత్తమరావు అది చూసి చెట్టు కొమ్మలు లాగి లాగి కాయలు కోస్తూ ఉంటే ఆ చెట్టుకెక్కెడ నొప్పి కలుగుతుందేమోనని, వారితో
ఉ. భద్రము కాయ గోయునెడ భద్రము కొమ్మెలు రెమ్మలుందగన్
ఛిద్రము గాక యుండగను చిక్కము లోనికె గోయుడెంతయున్
నిద్రల గాచి పెంచితిని నిక్కము దీనిని కన్న బిడ్డగన్
భద్రము గాగ నిచ్చినది భవ్యుల మన్మల మన్మరాండ్రనున్.
అని హెచ్చరించారు.
పిల్లలు గుడికి బయలుదేరుతూ ఉండగా పురుషోత్తమరావుగారు రెండు బుట్టలలో గౌతమి తెచ్చిన మామిడి పండ్లూ ఇక్కడి చెట్టు పండ్లూ విడిగా నింపి "అమ్మా గౌతమీ ఇవి గుడిలో అమ్మవారికి నివేదనగా సమర్పించు. ఈ బుట్టలోని పండ్లు ఆ బుట్టలోని పండ్లకు మేన మామలు అని పూజారికి చెప్పు" అంటూ అందించాడు.
పురుషోత్తమరావు గారి హృదయం తెలిసిన పూజారి ఆశ్వర్య పడలేదు. వారిలా కాక మరోలా ఆలోచిస్తారా? అనుకున్నాడంతే.
"అమ్మా గౌతమీ ఈ పండ్లను ఊరంతటికీ ప్రసాదంగా పంచి పెడతాను." అమ్మవారు కూడా సంతోషిస్తారు. ఆశీర్వదిస్తారు. అని చేయెత్తి తానూ ఆశీర్వదించాడు.
ఆలయం ఆవరణలోని చెట్టుపండ్లు ఓ పది కోయించి గౌతమి వెంట పంపించాడు.
మధ్యాహ్నం మేనమామలు మేనగోడలిని వెంటబెట్టుకుని తాము చదువుకున్న పాఠశాల కెళ్లారు. వచ్చినప్పుడల్లా బడికి వెళ్లి మాష్టార్లను కలిసుకోవడం వారి ఆశీస్సులు పొందడం వారికొక ఆనవాయితీ. మాష్టార్లందరినీ మేనగోడలు కబుర్లతో ముంచెత్తింది. ఆ పాఠశాలకు కూడా
మామిడి బంధుత్వం ఉంది గదా. ఆ చెట్టుకూడా కాపుకొచ్చింది. ఆ చెట్టు పండ్లు కోయించి మేనగోడలికి చిన్న బుట్టలో పెట్టి "ఇవి నీవే" అంటూ అందించారు.
అలాగే పొలంలోని చెట్టు పండ్లు కూడా పురుషోత్తమరావు గారింటికి చేరాయి. మనుమరాలు వాటిని చూసి అబ్బో ఎన్ని మామిడి పండ్లో అని ముక్కున వేలేసుకుంది. "తాతయ్యా నేను లెక్క బెట్టనా?" అనే మాటకే పొంగిపోయారు తాతగారు. తాత సాయంతో మనుమరాలు లెక్కబెట్టింది. ఆమె లెక్క ఏమో గానీ మొత్తం అరవై పండ్లు తేలాయి. ఇవన్నీ ఆ చెట్టు గంపెడు పరివారమే. గర్వంగా తలెత్తి చూసింది మామిడి చెట్టు.
ఆ నాలుగు రోజులలో ఎవరొచ్చినా మామిడి పండ్లే పలహారం. అరవై మామిడి టెంకలనూ జాగ్రత్త చేయించారు పురుషోత్తమరావుగారు. పాలేరు చేత
ఆ టెంకలన్నీ తన పెరట్లోనే పాతేయించాడు. అవి మొలకెత్తి ఓ ఆడుగు వరకూ పెరిగిన తర్వాత అరవై కుండీలని తెప్పించి వాటిలోకి మార్చాడు. మంచి ఎరువు వేస్తూ జాగ్రత్తగా కాపాడాడు. ఇదంతా ఆ మామిడి చెట్టు గమనిస్తూ ఉంది. తన పిల్లలను అక్కున జేర్చుకుని కాపాడుతున్న పురుషోత్తమ రావు ఆ చెట్టు కళ్ళకు సర్వ జగత్పోషణ కర్తయైన పురుషోత్తముడి లాగే కనిపిస్తున్నాడు. మనసు నిండి పోయింది.
వినాయక చతుర్థి దగ్గర పడుతోంది. కుండీలలోని మామిడి మొక్కలు ననవలాడుతూ కనువిందు చేస్తున్నాయి. వియ్యంకుల వారినీ అల్లుడినీ కుమార్తెనూ మనుమరాలినీ పండుగ ఇక్కడ జరుపుకుందామని ఆహ్వానించారు. వారూ వచ్చారు. హడావిడి అంతా తాతలూ మనుమరాలిదే.
మేనగోడలి సేవలన్నీ మేనమామలవే. గౌతమికీ ఆమె తల్లికీ ఈ పనులనుండి విశ్రాంతి.
ఆ మామిడి మొక్కల కుండీలను వలయంగా ఏర్పరచి మధ్యలో చిన్న మంటపం ఏర్పాటు చేసి గణపతిని అక్కడకు ఆహ్వానించారు. ఆవాహయామి పూజయామి. పంటల గణపతి పేరు సార్థకం అయింది. ఈ ఏర్పాట్లను చూసి ఊరు ఊరంతా వచ్చి పాలు పంచుకుంది. ఉత్సవం తొమ్మిది రోజులు సాగింది. వచ్చిన అతిథులకు భోజన సత్కారాలతోబాటు ఓ మామిడి మొక్క ప్రసాదంగా సమర్పించారు. ఓ పదిహేను మొక్కలు గౌతమి మామగారు అక్కడ తమ ఊరిలో వితరణ చేస్తానని చెప్పారు.
ఆ ఏర్పాట్లు జరిగాయి. ఆ ఉత్సవాలలోనే మేనమామ లిరువురకూ తమ పిల్లల నిస్తామంటూ ఓ రెండు కుటుంబాల వారు ముందుకు వచ్చి సంబంధం ఖాయం చేసుకున్నారు. చెప్పేదేముంది ఓ రెండు మామిడి కుండీలు వారిళ్లకూ చేరాయి. మామిడి సంతతి ఊరు ఊరంతా విస్తరించింది.
ఈ తతంగం అంతటినీ పర్యవేక్షిస్తున్న మామిడి చెట్టుదే ఉత్సాహం అంతా. సంతోషానందాలతో పొంగి పోయింది. తన బిడ్డలూ మనుమలూ మనుమరాండ్రూ ఎంతలా విస్తరించారు.
తర్వాతి పదేళ్లలో ఈ దేశం మొత్తం తన సంతతి సంతతితో నిండి పోతుంది అన్న భావం ఆ చెట్టుని మరింత పులకింప జేసింది.
పురుషోత్తమ రావు తలమీద నాలుగాకులు రాల్చి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ "ఇవీ మన కుటుంబాలు గంపల కొద్దీ పిల్లలు" అని కన్నీళ్లతో కళ్లు నిండి పోగా మనసారా ఆశీర్వదించింది.
అన్నట్లు ఆ రోజు అమ్మవారి గుడిలోని అర్చకులు చేసిన పని చెప్పడం మరిచాను.
వారికి కూడా గౌతమి అభిమాన పుత్రికే. అందుకే
ఉ. పావన గంగ, భోగ శచి, భాగ్యపు గౌరి, గభీర భూమి సం
భావన కుంతి, రూప గుణ భారతి, సంపద లక్ష్మి దేవి, సం
సేవిత సంజ్ఞ,నిశ్చల విశేష యరుంధతి యైన లక్ష్మి దాఁ
గేవల కన్యయే తలఁపఁ గీర్తన సేయఁ దగున్ ధరాస్థలిన్.(వీరభద్ర విజయం)
అని గౌతమిని ఆశీర్వదించారు.
శుభం.....
కడయింటి కృష్ణమూర్తి..గోవా...(నెల్లూరు)
జైహింద్.

వ్రాసినది


