గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జులై 2026, ఆదివారం

గాన కోకిల జానకి ఇంక మనకు లేరు..

0 comments

ఓం శాంతిః.

ప్రముఖ నేపథ్య గాయిని జానకి గారు

తే. 11 - 7 - 2026న

దివంగతులైనారన్న విషయం తెలియఁజేయుటకు విచారిస్తున్నాను.

సీ.  పసిపాపగొంతులో పారాడు స్వరముతో ముద్దుగా పాడెడి పూజ్యురాలు,

బాలబాలికలట్లు పరవశమ్మున పాడు ప్రఖ్యాత గాయిని పాటల గని,

యువతులు పాడెడి యుదయకోకిలగానమాధురుల్ వెలయించు మధుర గాత్ర,

వృద్ధులట్లుగ పాడి పేరును గన్నట్టి జానకి దివికేగె మౌనముగను,

గీ. గాన కోకిల జాతికే గర్వమరయ,

నట్టి  యీ తల్లి యాత్మకునమరుగాగ

శాంతి, పరమాత్మ పాదాల చెంత చేరి

ముక్తి సామ్రాజ్యమేలుత పుణ్యగతిని.

వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.

ఓం శాంతిః శాంతిః శాంతిః.


68. శ్లోII బాణ సృణి పాశ కార్ముకపాణీ ... ఈ శ్లోకమునకు డా.తాడేపల్లి పతంజలి మహోదయుల భాష్యము.

0 comments

జైశ్రీరామ్. 

68. శ్లోII  బాణ సృణి పాశ కార్ముకపాణీ మముం కమపి కామ పీఠగతమ్‌ 

ఏణధరకోణచూడం శోణీమ పరిపాకభేద మాకలయే. ౬౮ 

తే.గీ.II  బాణ, సృణి, పాశ, కార్ముకపాణిని, నుత 

కామకోటి పీఠ గతను, శ్రీమదంబ

ననుపమారుణ పరిపాక ఘనయశమును,

చంద్రరేఖా శిరోమణిన్ సన్నుతింతు. 

తాII బాణములు అంకుశము పాశము విల్లును హస్త ములందాల్చి చంద్రవంక శిరము నంబూని కామకోటి పీఠమందున్న యొకానొక ఆరుణ్యపరిపాకమును భావించెదను. 

అమ్మ దయతో🙏🏽

చింతా రామకృష్ణారావు.

ఈ శ్లోకమునకు డా.తాడేపల్లి పతంజలి మహోదయుల భాష్యము.

​అమ్మవారి ఆయుధాలు వాటి వెనుక ఉన్న రహస్యం

​అమ్మవారు (కామాక్షీ దేవి) తన నాలుగు చేతులలో ఐదు బాణాలు, పాశము (త్రాడు), అంకుశము, మరియు ఒక విల్లును ధరించి ఉంటుంది. ఇందులో ఆమె పట్టుకున్న విల్లు చెరకు విల్లు, బాణాలు పూల బాణాలు.

​అమ్మవారు వీటిని ధరించడం వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక సంకేతం దాగి ఉంది. ఆ రహస్యాలు ఏమిటంటే:

​పాశము (తాశము/త్రాడు): ఇది 'రాగము' (అనురాగం/ఆకర్షణ) లేదా ఇచ్ఛాశక్తికి సంకేతం.

​అంకుశము: ఇది 'క్రోధము' (కోపం) లేదా జ్ఞానశక్తికి సంకేతం.

​జీవుడికి, అమ్మవారికి ఉన్న తేడా:

​మనకు ఎవరి మీద, ఎందుకు ప్రేమ (రాగము) కలుగుతుందో మనకే తెలియదు. మన సొంత ఇష్టంతో రాగము పుట్టదు. అదంతా అమ్మవారి సంకల్పం ప్రకారమే జరుగుతుంది.

​ మనుషులమైన మన రాగం మన చేతుల్లో ఉండదు. కానీ అమ్మవారి చేతిలో రాగం ఉందంటే, ఆమె దానికి లొంగిపోలేదు; రాగమే ఆమెకు లొంగి ఉంటుంది (స్వాధీనమై ఉంటుంది).

​ మనకు ఒక్కోసారి ఎదుటివారు తప్పు చేయకపోయినా కోపం వస్తుంది, మరికొన్ని సార్లు ఎంత పెద్ద తప్పు చేసినా కోపం రాదు. మనకు కోపం రావడం, రాకపోవడం కూడా అమ్మవారి ఇచ్ఛ ప్రకారమే జరుగుతుంది. కోపం అమ్మవారి చేతిలో ఉందంటే, అది ఆమె అదుపులో ఉందని అర్థం. ఆమె అనుకుంటేనే కోపం వస్తుంది, వద్దనుకుంటే రాదు.

​ఇలా రాగద్వేషాలు (ప్రేమ, కోపాలు) అమ్మవారి అదుపులో ఉంటాయి. ఆమె ఏ జీవుడినైతే అధోగతి పాలు చేయాలనుకుంటుందో, వాని మనస్సులో ఈ రాగక్రోధాలు పుట్టేలా చేస్తుంది.

​మనస్సు మరియు పంచతన్మాత్రల సంకేతాలు

​చెరకు విల్లు (చిత్తము): మన రాగద్వేషాలన్నింటికీ నిలయం మన చిత్తమే (మనస్సు). ఆ చిత్తమే అమ్మవారి చేతిలో చెరకు విల్లుగా మారింది. మన మనస్సు మన మాట వినకుండా ఎప్పుడూ చంచలంగా (అటుఇటు) తిరుగుతూ ఉంటుంది. దానిని ప్రశాంతంగా ఉంచాలని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ, అసలు ఆ మనస్సే అమ్మవారి చేతిలో ఉంది. కాబట్టి అమ్మవారు దయతలిస్తేనే మన మనస్సు మన అదుపులోకి వచ్చి నిశ్చలంగా ఉంటుంది, లేదంటే చంచలంగానే తిరుగుతుంటుంది. మన మనస్సు మనకు లొంగదు కానీ, అమ్మవారికి పూర్తిగా లొంగి ఉంటుంది.

​ అమ్మవారి చేతిలోని ఐదు పూల బాణాలు ఐదు జ్ఞానేంద్రియాల విషయాలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములకు (వినడం, తాకడం, చూడడం, రుచి, వాసన) సంకేతాలు. మన మనస్సు ఈ ఐదింటి వల్లే ఆకర్షణకు (రాగానికి) లేదా ద్వేషానికి లోనవుతుంది.

​ఇంద్రియాలు బయట ఉన్న వస్తువుల వైపు ఆకర్షించబడటం 'రాగం' వల్ల జరుగుతుంది. వాటి నుండి దూరంగా జరగడం 'క్రోధం' వల్ల జరుగుతుంది. భోగ భాగ్యాలు శాశ్వతం కావని తెలుసుకున్న జ్ఞానులలో ఈ వైరాగ్యం (దూరంగా ఉండటం) శాశ్వతంగా ఉంటుంది. కానీ సాధారణ కోపం వల్ల కలిగే వైరాగ్యం తాత్కాలికంగానే ఉంటుంది. అందుకే అమ్మవారి చేతిలోని అంకుశాన్ని కొందరు 'క్రోధం' అని, మరికొందరు 'జ్ఞానం' అని అంటారు.

​అమ్మవారి ఎరుపు రంగు విశిష్టత (అరుణిమము)

​చెట్ల ఆకులు, కాయలు సూర్యరశ్మి తగలడం వల్ల రంగులు మారుతుంటాయి. దానికి ఆ సూర్యకిరణాల పాకమే (మార్పు) కారణం. అలాగే, పరమశివుని మనస్సులోని ప్రేమే (రాగమే) అమ్మవారి ఒంటి రంగు (ఎరుపు/అరుణిమము). అమ్మవారి దివ్య సౌందర్యం వల్ల ఆ శివుని ప్రేమ ఒక ప్రత్యేకమైన పాకంగా (రూపంగా) మారింది.

​అందుకే అమ్మవారి ఎరుపు రంగును ఒక అద్భుతమైన మార్పుగా (శోణిమపాకభేదము) వర్ణించారు.  ఆ పరమశివుని ప్రేమ యొక్క పరిణామ రూపమే (అరుణిమపాక భేదమే) సాక్షాత్తు అమ్మవారు అని ఈ శ్లోకము చక్కగా తెలియజేసింది🕉️🙏🕉️

డా. తాడేపల్లి పతంజలి మహోదయులకు ధన్యవాదములు.

జైహింద్.

11, జులై 2026, శనివారం

67. శ్లోII అధికాంచి వర్తమానా మతులాం ... ఈ శ్లోకమునకు డా. తాడేపల్లి పతంజలి గారి భాష్యము.

0 comments

జైశ్రీరామ్. 

ఓం శ్రీమాత్రే నమః.🙏🏽

మూకపంచశతి..ఆర్యా శతకము.


67. శ్లోII  అధికాంచి వర్తమానా మతులాం కరవాణి పారణా మక్ష్ణోః  

ఆనంద పాకభేదా మరుణిమ పరిణామ గర్వ పల్లవితామ్‌. 


తే.గీ.II  హ్లాద పాకభేదముతోడ నతులితయును, 

కంచి సంచారి, యరుణిమ క్రమ పరిణతి

గర్వ పల్లవితయునగు కామనేత్రి

యొక్క దర్శనమును బొంది యొప్పుదునిల.


తాII ఆనందపరిపాక విశేషమును, ఎఱుపురంగుయొక్క క్రమపరిణామ గర్వముచే జిగురించుదానిని,  కాంచి యందు వర్తించు దానిని, దర్శించుకొనుదును.


అమ్మ దయతో🙏🏽

చింతా రామకృష్ణారావు.

ఈ శ్లోకమునకు డా. తాడేపల్లి పతంజలి గారి భాష్యము.

అమ్మవారికి గర్వము ఉన్నదని చెప్పవచ్చా? మూక కవి అలా ఎందుకు చెప్పారు?      తాడేపల్లిపతంజలివివరణ.                                 ​ఈ శ్లోకంలో కవి అమ్మవారి అందాన్ని, ఆమె ఇచ్చే ఆనందాన్ని రెండు అందమైన పోలికలతో వివరించారు:

​1. ఆనంద పాక విశేషం (పరమానంద రసం)

​శివుడు నిరంతర ఆనంద స్వరూపుడు. ఆ శివుడి ఆనందమే ఒక స్త్రీ రూపం దాల్చితే, ఆ రూపమే కామాక్షి అమ్మవారు.

​మనం వంట చేసేటప్పుడు పదార్థాలు బాగా పాకం పడితే రుచి అద్భుతంగా పెరుగుతుంది. అలాగే, శివునిలోని ఆనందం అనే భావం బాగా పక్వానికి వచ్చి (పాకమై), మరింత రుచికరంగా మారిన రూపమే అమ్మవారు.

​ఆ పరమశివుడికే అమితమైన ఆనందాన్ని ఇచ్చే ఆ తల్లి రూపం, మన కళ్లకు దొరికే ఒక పెద్ద విందు భోజనం లాంటిది.2.సాధారణంగా చెట్లకు వచ్చే కొత్త చిగురుటాకులు (పల్లవములు) చాలా లేతగా, ఎర్రగా ఉంటాయి.

​ అమ్మవారు నిలువెత్తు ఎరుపు రంగు కాంతితో మెరిసిపోతున్నారు. "ఈ ప్రపంచంలో నాకంటే ఎర్రగా, అందంగా ఎవరూ లేరు" అనే ఒక చిన్న గర్వం (అభిమానం) అమ్మవారికి ఉంది.

​ఒకవేళ ఆ గర్వానికి కూడా ఒక రూపం ఉండి, అది కూడా ఎర్రగా మారిపోతే ఎలా ఉంటుంది?  ఎర్రగా ఉన్న చిగురుటాకు మీద, ఈ గర్వం అనే మరో ఎరుపు రంగు వచ్చి చేరినట్లు ఉంది. అంటే... ఎరుపుకు ఇంకొక ఎరుపు తోడైతే అది ఎంత గాఢంగా, ఎంత అందంగా మారుతుందో, అమ్మవారి రూపం అంతటి ఎరుపుదనంతో ప్రకాశిస్తోందని భావం. కవిత్వంలో ఒక వస్తువు యొక్క గొప్పదనాన్ని చెప్పడానికి "గర్వం" అనే పదాన్ని ఒక అలంకారంగా వాడతారు.

​ఉదాహరణకు: "ఆ పువ్వు అందం ముందు మిగిలిన పువ్వుల గర్వం అణిగిపోయింది" అంటాం. అంటే అక్కడ పువ్వుకు పొగరు ఉందని కాదు, దాని అందం అంత గొప్పదని అర్థం.

​ఇక్కడ కూడా, "అమ్మవారి ఎరుపుదనం ముందు సృష్టిలోని మరే ఎరుపు రంగు సరితూగదు" అని చెప్పడమే ఆ 'గర్వం' యొక్క ఉద్దేశం.మూకకవి వాడిన 'గర్వము' అనేది అహంకారం కాదు; అది "సౌందర్య పరాకాష్ఠ" (అందానికి ఆఖరి హద్దు). అమ్మవారి రూపం అంతటి దివ్యమైన, తిరుగులేని కాంతితో ప్రకాశిస్తోందని చెప్పడానికి కవి భక్తితో, ప్రేమతో వాడిన పదం అది. కాబట్టి కవిత్వ పరిభాషలో దీనిని తప్పుగా భావించనవసరం లేదు🕉️🙏🕉️

శ్రీ పతంజలి మహోదయులకు ధన్యవాదములు.

జైహింద్.

10, జులై 2026, శుక్రవారం

66. శ్లోII దగ్ధషడధ్వారణ్యం దరదలిత ... ఈ శ్లోకమునకు సమీక్ష బ్రహ్మశ్రీ తాడేపల్లి పతంజలి.

0 comments

 జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.🙏🏽

మూకపంచశతి..ఆర్యా శతకము.

66. శ్లోII  దగ్ధషడధ్వారణ్యం దరదలిత కుసుంభ సంభృతారుణ్యమ్‌ 

కలయే తవ తారుణ్యం కంపాతట సీమ్ని కిమపి కారుణ్యమ్‌| ౬౬ 

తే.గీ.II  ప్రథిత దగ్ధ షడధ్వరారణ్య,  దరద

ళిత కుసుంభ సంభృత రక్తిమ, తుల లేని

కంప నదికడ వెలసిన కరుణ యనగ

నొప్పు నీ జవ్వనముఁ గొల్తు నొప్పిదముగ.

తాII షడధ్వరారణ్యమును కాల్చిన, కొంచెము వికసించినట్టి కుసుంబ పుష్పముల ఎఱుపును ధరించిన, కంపా తట ప్రదేశమున వెలసినదయా స్వరూపమయిన నీ యౌవన్మును ధ్యానింతును.

నా వివరణము.

ఓం శ్రీమాత్రే నమః.

ఆర్యా! నమస్తే. అల్పజ్ఞుఁడను.

నేను అర్థము చేసుకొనగలిగినంతలో మీకు తెలుపగలను.

ప్రఖ్యాతముగా కాల్చిన షడధ్వము అను అరణ్యము కలిగిన జనని.

షడధ్వములు (షట్ + అధ్వములు) అంటే భగవంతుడిని లేదా బ్రహ్మత్వాన్ని చేరుకోవడానికి, అలాగే ఈ సృష్టి విస్తరించడానికి కారణమైన ఆరు మార్గాలు అని అర్థం. తంత్ర మరియు శాక్తేయ శాస్త్రాల ప్రకారం, ఈ మొత్తం విశ్వం శబ్దము (మాట), అర్థము (రూపము) అనే రెండు విషయాలతోనే నిండి ఉంది.శబ్ద ప్రపంచానికి సంబంధించిన మూడు మార్గాలు (శక్తి మయములు):

శబ్ద సంబంధమైనవి (వాచక అధ్వములు):

1. పదాధ్వము: పదాలు లేదా నామరూపాలకు సంబంధించిన మార్గం.

2. మంత్రాధ్వము: మంత్రాలకు సంబంధించినది.

3. వర్ణాధ్వము: అక్షరాలు లేదా వర్ణాలకు సంబంధించినది.అర్థ / ప్రపంచ సంబంధమైనవి (అవాచక అధ్వములు):

4. భువనాధ్వము: విశ్వంలో ఉండే వివిధ లోకాలు లేదా భువనాలకు సంబంధించినది.

5. తత్వాధ్వము: భూమి, జలము, అగ్ని మొదలైన 36 తత్వాలకు సంబంధించినది.

6. కళాధ్వము: సృష్టికి మరియు జీవులకు శక్తినిచ్చే కళలకు సంబంధించినది.

ఆగమ శాస్త్రాల ప్రకారం, ఈ ఆరు మార్గాల గురించిన పరిజ్ఞానం మరియు వాటి శుద్ధి ద్వారానే జీవుడు పరిపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, శివత్వమును లేదా మోక్షాన్ని పొందగలఁడు.

అమ్మ దయతో🙏🏽

చింతా రామకృష్ణారావు.

షడధ్వమును కాల్చడం ఏమిటి? అమ్మవారిని కొలవటం కాకుండా అమ్మవారి యవ్వనాన్ని కొలవటం ఏమిటి? ఇందులో ఉండే ఆంతర్యం ఏమిటి?                                             

తాడేపల్లి పతంజలి వివరణ 

షడధ్వములు (షట్ + అధ్వములు) అంటే భగవంతుడిని లేదా బ్రహ్మత్వాన్ని చేరుకోవడానికి, అలాగే ఈ సృష్టి విస్తరించడానికి కారణమైన ఆరు మార్గాలు అని అర్థం. తంత్ర మరియు శాక్తేయ శాస్త్రాల ప్రకారం, ఈ మొత్తం విశ్వం శబ్దము (మాట), అర్థము (రూపము) అనే రెండు విషయాలతోనే నిండి ఉంది.

​శబ్ద ప్రపంచానికి సంబంధించిన మూడు మార్గాలు (శక్తి మయములు):

​మన నోటి నుండి వచ్చే ప్రతి మాట, అక్షరం దైవ స్వరూపమే. శబ్ద రూపంలో ఉండే ఆ మూడు మార్గాలు ఇవే:

​వర్ణాధ్వము (అక్షరాలు):

మనం పలికే 'అ' నుండి 'క్ష' వరకు ఉన్న అక్షరాలే వర్ణాలు. సృష్టిలోని ప్రతి మంత్రానికి, ప్రతి మాటకు మూలం అక్షరాలే. భగవంతుడిని అక్షర రూపంలో ధ్యానించడం ఇందులో మొదటి మార్గం.

​పదాధ్వము (పదాలు):

కొన్ని అక్షరాలు కలిస్తే ఒక పదం అవుతుంది. భగవంతుడిని స్తుతించే పేర్లు (ఉదాహరణకు: శివ, నారాయణ, కామాక్షి వంటి నామాలు) అన్నీ పదాలే. నామస్మరణ ద్వారా భగవంతుడిని చేరుకునే మార్గం ఇది.

​మంత్రాధ్వము (మంత్రాలు):

కొన్ని పదాల కలయికతో శక్తివంతమైన మంత్రాలు ఏర్పడతాయి (ఉదాహరణకు: ఓం నమః శివాయ, గాయత్రీ మంత్రం వంటివి). ఈ మంత్రాలను జపించడం ద్వారా మనస్సును పవిత్రం చేసుకుని భగవంతుడిని పొందే మార్గం ఇది.

​అర్థ/రూప ప్రపంచానికి సంబంధించిన మూడు మార్గాలు (శివ మయములు):

​మనం కంటితో చూసే రూపాలు, భౌతిక ప్రపంచానికి సంబంధించిన మూడు మార్గాలు ఇవే:

​కలాధ్వము (శక్తులు లేదా విభాగాలు):

ఈ సృష్టి నడవడానికి ఐదు ముఖ్యమైన శక్తులు (కలలు) కారణం అవుతాయి. నివృత్తి, ప్రతిష్ఠ, విద్యా, శాంతి, శాంత్యతీతా కలలు అని వీటిని అంటారు. సృష్టి పుట్టుక నుండి మోక్షం వరకు జరిగే ప్రక్రియను నడిపించే దైవిక శక్తుల మార్గం ఇది.

​తత్త్వాధ్వము (సృష్టి మూలకాలు):

ఈ సృష్టి ఏర్పడటానికి కారణమైన మూలకాలను తత్వాలు అంటారు. మన శరీరం, ఈ ప్రకృతి పంచభూతాలతో (నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం) మరియు మనస్సు, బుద్ధి, అహంకారం వంటి 36 తత్వాలతో నిర్మితమైంది. ఈ తత్వాలన్నింటిలోనూ భగవంతుడిని దర్శించడం ఈ మార్గం యొక్క ఉద్దేశం.

​భువనాధ్వము (లోకాలు):

మనం ఉంటున్న ఈ భూలోకంతో పాటు పైలోకాలు (స్వర్గ లోకం వంటివి), క్రింది లోకాలు ఇలా విశ్వంలో ఉన్న సమస్త లోకాలను భువనాలు అంటారు. ఈ లోకాలన్నీ భగవంతుని స్వరూపాలే అని భావించి ఉపాసించడం ఈ ఆఖరి మార్గం.

ఈ ఆరు మార్గాలు (అక్షరాలు, పదాలు, మంత్రాలు, శక్తులు, తత్వాలు, లోకాలు) అనేవి భక్తుడు దైవాన్ని చేరుకోవడానికి ఉపయోగపడే మెట్లు లాంటివి. 

​షడధ్వములను (ఆరు మార్గాలను) కాల్చడం అంటే ఏమిటి?

​ఇక్కడ 'కాల్చడం' అంటే నాశనం చేయడం అని కాదు, 'లయం చేయడం' లేదా 'అజ్ఞానాన్ని తొలగించడం' అని అర్థం.

​లౌకిక బంధాల నుండి విముక్తి: మనం పైన చెప్పుకున్న ఆరు మార్గాలు (అక్షరాలు, పదాలు, మంత్రాలు, శక్తులు, తత్వాలు, లోకాలు) అనేవి ఈ భౌతిక ప్రపంచాన్ని, మన శరీరాన్ని, మనస్సును బంధించి ఉంచే బంధాలు. మనం పూజలు, జపాలు చేసేటప్పుడు ఈ నామ-రూపాల సహాయం తీసుకుంటాం. కానీ మోక్షం కావాలి అంటే ఈ నామ-రూపాలను దాటి వెళ్ళాలి.

​ ఎప్పుడైతే సాధకుడికి అమ్మవారి అనుగ్రహం వల్ల 'ఆత్మజ్ఞానం' కలుగుతుందో, అప్పుడు ఈ సృష్టి అంతా మాయ అనీ, చివరకు మిగిలేది ఒకే ఒక్క పరబ్రహ్మం (అమ్మవారు) అనీ తెలుస్తుంది. నిప్పులో పడిన ఏ వస్తువైనా ఎలా బూడిదైపోతుందో, అలాగే జ్ఞానమనే అగ్ని ముందు ఈ ఆరు మార్గాల భేదాలు (నేను, నాది, ఈ లోకం, ఈ రూపం అనే భ్రమలు) అన్నీ కాలిపోతాయి.

​ అమ్మవారు 'దగ్ధ-షడధ్వ-అరణ్యమ్' (ఆరు మార్గాలనే అడవిని కాల్చినది). అంటే, భక్తుడి మనస్సులోని అజ్ఞానాన్ని, భ్రమలను తన జ్ఞానాగ్నితో పూర్తిగా కాల్చివేసి, అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని అర్థం.

​అమ్మవారిని కాకుండా, ఆమె 'యవ్వనాన్ని' ధ్యానించడం వెనుక ఆంతర్యం ఏమిటి?

​శ్లోకంలో "దయయో అనదగిన నీ యౌవనమును ధ్యానించెదను" అని మూకకవి అన్నారు. ఒక తల్లిని లేదా దేవతను కొలిచేటప్పుడు 'యవ్వనాన్ని' ధ్యానించడం వెనుక మూడు అద్భుతమైన కారణాలు ఉన్నాయి:

​ అమ్మవారి యవ్వనమే 'కరుణ' (దయ)

​లోకంలో స్త్రీలకు దయాగుణం ఎక్కువ. అందులోనూ యవ్వనంలో ఉన్న స్త్రీ హృదయం మరింత కోమలంగా, ప్రేమతో నిండి ఉంటుంది. ఇక్కడ పరమశివుని యొక్క 'కరుణ' అనే గుణమే అమ్మవారిగా అవతరించింది. ఆ కరుణ ఎంత గొప్పదో చెప్పడానికి కవి... "అమ్మా! నీ యవ్వనం మరేదో కాదు, సాక్షాత్తు 'దయ' అనే గుణమే నీ శరీరంలో యవ్వనంగా మారిందా అన్నట్లుంది" అన్నారు. అంటే ఇక్కడ యవ్వనాన్ని ధ్యానించడం అంటే, అమ్మవారి అమితమైన కారుణ్య గుణాన్ని ధ్యానించడమే.

​ ఎప్పటికీ తరిగిపోని సృష్టి శక్తి .

​'యవ్వనం' అనేది ఉత్సాహానికి, నిరంతర శక్తికి, సృజనాత్మకతకు ప్రతీక. బాల్యం దాటిపోతుంది, ముసలితనం వల్ల శక్తి క్షీణిస్తుంది. కానీ ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారికి ముసలితనం ఉండదు. ఆమె ఎల్లప్పుడూ నిరంతర శక్తితో ప్రకాశించే 'త్రిపురసుందరి' (నిత్య యవ్వనవతి). సృష్టిని నిరంతరం నడిపించే ఆ అఖండమైన దైవ శక్తిని కొలవడమే అమ్మవారి యవ్వనాన్ని ధ్యానించడం.

​ గుణ-గుణి అభేదం 

​ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం భగవంతుడికి, భగవంతుని గుణాలకి తేడా లేదు (ఉదాహరణకు: అగ్నికి, దాని వేడికి తేడా లేనట్లు). అమ్మవారు కేవలం అందమైనది మాత్రమే కాదు, ఆమె అందం (ఆరుణ్యం). ఆమె యవ్వనం (తారుణ్యము). ఆమె దయ (కారుణ్యము). కాబట్టి ఆమె యవ్వనాన్ని ధ్యానించడం అంటే సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపాన్నే ధ్యానించడం.

సాధకుడు అమ్మవారి రూపాన్ని చూస్తూ, ఆమెలోని అనంతమైన దయాగుణాన్ని (యవ్వనాన్ని) నమ్ముకుని శరణు వేడితే... ఆమె తన జ్ఞానాగ్నితో సాధకుడి చుట్టూ ఉన్న అజ్ఞానపు అడవిని (షడధ్వములను) కాల్చివేసి, తనలో లీనం చేసుకుంటుంది. ఇదే ఈ శ్లోకం యొక్క పరమార్థం.🕉️🙏🕉️

బ్రహ్మశ్రీ పతంజలి మహోదయులకు ధన్యవాదములు.

జైహింద్.