గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, జులై 2026, సోమవారం

69. శ్లోII కిం వా ఫలతి మమాన్యై ... ఈ శ్లోకమునకు శ్రీ తాడేపల్లి పతంజలి మహోదయుల వివరణ.

0 comments

 జై శ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.🙏🏽

మూకపంచశతి..ఆర్యా శతకము.


69. శ్లోII  కిం వా ఫలతి మమాన్యై ర్బింబాధర చుంబి మందహాసముఖీ  

సంబాధకరీ తమసా మంబా జాగర్తి మనసి కామాక్షీ || 69 


తే.గీ.II  అధర బింబమున్ ముద్దిడు మధుర హసన

ముననునొప్పు మోమున, తమంబును హరించు

లోక జనని కామాక్షి నా లోననుండ

నితర దేవతలొసగునదేమి యుండు?


తాII దొండపండువంటి పెదవిని ముద్దుపెట్టుకొను మురిపెంపు జిఱునవ్యు 

నెమ్మోమునం దులకింప, తమంబు హరించు జగజ్జనని కామాక్షి నా మనసునందే వర్తించుచుండ నా కితర దేవతల వలన నొరుగ బోవు ఫల మేమి?  


అమ్మ దయతో🙏🏽

చింతా రామకృష్ణారావు.

ఈ శ్లోకమునకు శ్రీ తాడేపల్లి పతంజలి మహోదయుల వివరణ.

జీవితంలోని చీకట్లను (అజ్ఞానాన్ని) తాత్కాలికంగా కాకుండా, మరెప్పటికీ తిరిగి రాకుండా పూర్తిగా నాశనం చేసేది కామాక్షి అమ్మవారే. దొండపండులా ఎర్రగా ఉండే పెదవిపై, ఎల్లప్పుడూ మురిపించే చిరునవ్వుతో ప్రకాశించే ఆ తల్లి ముఖం నా మనస్సులో నిరంతరం మేల్కొని (ప్రకాశిస్తూ) ఉంది. మోక్షాన్ని ఇచ్చే ఆ కామాక్షి దేవి నా మనసులో ఉండగా, సంసార బంధాలలో మునిగి తేలే ఇతర దేవతలు నాకు ఎలాంటి ఫలాన్ని ఇవ్వగలరు? (అంటే, అమ్మవారి అనుగ్రహం ముందు ఇతర దేవతలు ఇచ్చే చిన్న చిన్న కోరికల ఫలాలు నాకు అక్కర్లేదు.

​1.

​ఎర్రని పెదవి - తెల్లని నవ్వు: అమ్మవారి పెదవి దొండపండులా ఎర్రగా ఉంది. దానిపై తెల్లని చిరునవ్వు మెరుస్తోంది. ఇక్కడ కవి ఒక అద్భుతమైన భావనను చూపిస్తున్నారు. ఎరుపు రంగు అమ్మవారికి ప్రతీక అయితే, తెలుపు రంగు శివునికి ప్రతీక.

​ అమ్మవారి పెదవిని ఆ చిరునవ్వు ముద్దాడుతున్నట్లు ఉంది. కానీ అంతర్లీనంగా చూస్తే, సాక్షాత్తు ఆ పరమశివుడే అమ్మవారిని ముద్దాడుతున్నాడా అన్నట్లుగా ఆ దృశ్యం కవి ఊహకు తట్టింది. శ్లోకంలోని ‘చుంబి’ (ముద్దు పెట్టుకోవడం) అనే పదం ఈ శివశక్తుల అద్భుత కలయికను మనకు తెలియజేస్తోంది.

​2.  సాధారణంగా సాయంత్రం వచ్చే సంధ్య చీకటిని తాత్కాలికంగానే పోగొడుతుంది. మళ్లీ మరుసటి రోజు చీకటి వస్తుంది. కానీ, కామాక్షి అమ్మవారు అలా కాదు. మన మనస్సులోని అజ్ఞానమనే ‘తమోగుణాన్ని’ (చీకటిని) శాశ్వతంగా తరిమికొడుతుంది. అందుకే ఇక్కడ సంధ్యతో పోలుస్తూనే, సంధ్య కంటే అమ్మవారే గొప్పదని చెప్పడం వల్ల ఇది ‘వ్యతిరేకాలంకారం’ అవుతుంది.

​3. 

​ ‘సంధ్యే సృష్టిరాహ హి’ అనే బ్రహ్మ సూత్రం ప్రకారం, నిద్రకు, మెలకువకు మధ్య ఉండే ‘స్వప్న అవస్థను’ (కలల స్థితిని) సంధ్య అంటారు. మనసు లోపల మేల్కోవడం అనేది ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక స్థితి.

​మోక్షాన్ని ప్రసాదించే కామాక్షి దేవి నా మనస్సులో నిరంతరంగా మేల్కొని ఉంది. అందువల్ల ప్రాపంచిక సుఖాలు, చిన్న చిన్న కోరికల పట్ల నాకు పూర్తి విరక్తి (వైరాగ్యం) కలిగింది. అలాంటి నాపై ఇతర దేవతలు ఇచ్చే తాత్కాలిక ఫలాలు ఎలాంటి ప్రభావం చూపలేవు. నాకు కావాల్సింది అమ్మ ఇచ్చే మోక్షమే. కామాక్షీ దేవ్యై నమః.🕉️🙏🕉️

చక్కని వివరణనందించిన పతంజలిగారికి ధన్యవాదములు.

జైహింద్.

సంస్కృత … తెలుఁగు … పదాల స్వరూపం. వివరణ … రంగరాజు పద్మజగారు.

0 comments

 జైశ్రీరామ్.

సంస్కృత … తెలుఁగు … పదాల స్వరూపం. వివరణ … రంగరాజు పద్మజగారు.

      పాఠశాలలో తెలుగు బోధించే ఉపాధ్యాయులకైనా , విద్య నేర్చుకొనే చిన్నారులకైనా పెద్ద సమస్య ఏమిటంటే? ఏది సంస్కృత పదం?, ఏది తెలుగు పదం? అని గుర్తించడం, కత్తి మీద సామే . అయితే కొంచెం కష్టపడి ప్రయత్నం చేస్తే సంస్కృతం, తెలుగు పదాలును సులభంగా కొనుక్కోవచ్చు. కష్ట పడితే సాధించలేనిది లేదు కదా! తెలుగు, సంస్కృత పదాలను సులభంగా ఎలా తెలుసుకోవచ్చో చేసే చిరు ప్రయత్నం ఇది.

    బాలవ్యాకరణంలో చిన్నయసూరి సంస్కృత సమం , సంస్కృత భవం, ప్రాకృత సమం, ప్రాకృత భవం, దేశ్యాలు గురించి సంజ్ఞాపరిచ్ఛేదంలో చక్కగా వివరించారు. సంస్కృత పదాలను తత్సమాలని, తెలుగు పదాలను ఆచ్ఛికాలని చెప్పారు.ఆచ్ఛిక పరిచ్ఛేదంలో

“సంస్కృత సమేతరంబైన యీ భాష యచ్చనా బడు” అని సూత్రీకరించారు.

అనగా పైన చెప్పిన సంస్కృత సమ పదాలుగాక , సంస్కృత భవం ,ప్రాకృత సమం ,ప్రాకృత భవం ,దేశ్యాలతో కూడిన పదాలను ఆచ్చికపదాలు లేదా తెలుగు పదాలని చెప్పవచ్చని ఫలితార్థంము.

మొదట సంస్కృత పదములను… గురించి తెలుసుకుందాము.

1.సంయుక్తాక్షరములతో కూడిన పదములన్నీ సంస్కృతపదాలు.

ఉదా:-చక్రః , వర్షమ్ , మూర్ఖః ,అర్చన , కర్పూరమ్ ……

ఇవి తెలుగులో చేరునపుడు వీటికి తెలుగు ప్రత్యయాలైన డు, ము ,వు లు చేరి చక్రము,  వర్షము , మూర్ఖుడు , అర్చన , కర్పూరము అని మారుతాయి.

2. సంశ్లిష్టాక్షరములతో కూడిన పదములు సంస్కృత పదాలు….

ఉదా:-స్త్రీ ,రాష్ట్రం ,అర్ఘ్యం ,జోత్స్న ,క్త్వార్థం……

3 మహాప్రాణాక్షరాలతో కూడిన పదాలు సంస్కృత పదాలు…….

ఖరం ,ఘటం ,ఛత్రం ,ఝషం ,కంఠం ,ఢంకా ,కథ ,ధనం ,ఫలం భజన…..

4.విసర్గతో కూడినవి సంస్కృత పదాలు….

ఉదా:-దుఃఖం ,అంతఃపురం ,అంతఃకరణ ,తపఃఫలం, మనఃకాయం….

5.ఋ ౠలతో కూడిన పదాలు సంస్కృత పదాలు….

ఉదా:-ఋషి  ,ఋణం , ఋతువు ,….

6.శ ,ష ,హలతో కూడినపదాలు సంస్కృత పదాలు….

ఉదా:- శతము ,శంకర ,శశము, శంతనుడు ,ఆశ ,ఆకాశం ,

వేషము, దోషము ,ప్రదోషము ,

హంస ,హలము ,హాలాహలం ,హారం హీనం ,హోమం……

7.డు ,ము,వులు చేరడానికి తగిన పదాలు సంస్కృత పదాలు….( ఇవి తెలుగులోకి చేర్చేటప్పుడు డు ,ము ,వు లు చేరి వస్తాయి.)

రామ, భీమ , భయంకర, కంస

వన, దేశ , ప్రాంత ,ఆవేశ ,

చిత్ర, క్రతు , ధేను, తరు గురు,….

రాముడు, భీముడు , భయంకరుడు, కంసుడు

వనము, దేశము , ప్రాంతము ,ఆవేశము ,

చిత్రము,  క్రతువు , ధేనువు, తరువు గురువు,….

8.ఉపసర్గతో కూడిన పదాలు సంస్కృత పదాలు….

ఉదా:-ప్రతిదినం , ప్రఖ్యాతి , సకుటుంబం , ప్రత్యక్షం , పరోక్షం , దుర్లభం , సంతృప్తి, అపరిశుభ్రం , ,…

9.సంస్కృత సంఖ్యావాచకాలతో కూడినవి సంస్కృత పదాలు….

ఏక ,ద్వి ,త్రి చతు ,పంచ ,షష్టి సప్త, అష్ట, నవ , దశ , శత , సహస్ర….

10. సవర్ణదీర్ఘ ,గుణ ,యణాదేశ వృద్ది , అనునాసిక , విసర్గ , జస్త్వ , శ్చుత్త్వ…. సంధులతో కూడినవి సంస్కృత పదాలు….

అష్టావధానం, కవీశ్వర, గురూపదేశం, పితౄణం వేంకటేశ్వర ,మహర్షి ,ప్రత్యేక, అణ్వస్త్రం, ఏకైక ,పరమౌషదం మనోహరం ,చతుషష్టి……

11 ఋతువుల పేర్లు , తిథులపేర్లు , నక్షత్రాల పేర్లు ,తెలుగు సంవత్సరాలు…. సంస్కృత పదాలు

ఉదా:-వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు….

అమావాస్య ,పాఢ్యమి …..

అశ్వని ,భరణి,…..

ప్రభవ, విభవ….

12. వట్రుసుడితో కూడినవి సంస్కృత పదాలు….

ఉదా:-గృహము ,కౄరుడు , కృపాణము , ధృతరాష్ట్రుడు , దృష్టి , ధృవీకరణ, పృథివి , పృచ్ఛకులు , భృగువు , సవితృ ,ధాతృ ,నేతృ ,భర్తృ కర్తృ …..

13.యకారముతో కూడిన పదాలు తెలుగులో లేవు. అంటే యకారంతో కూడిన పదాలన్నీ సంస్కృత పదాలే.

యమున , యముడు , యజ్ఞము , యంత్రము , యాత్ర.

ఇక తెలుగు పదాల గురించి తెలుసుకుందాము.

1.ద్విత్వాక్షరములతో కూడిన పదాలు తెలుగు పదాలు

ఉదా:-అమ్మ, అక్క ,అవ్వ, అత్త , కుక్క, మొగ్గ , వెన్న , కర్ర , నిచ్చెన , గజ్జెలు , పిట్ట….

2 .అరసున్నతో కూడిన పదాలు తెలుగు పదాలు

ఉదా:-తెలుఁగు ,మూఁడు ,చీఁకటి ,పాఁత , కోఁతి మూఁత. కోఁట పేఁట మూఁట……

3.సర్వనామాలన్నీ తెలుగుపదాలు

ఉదా:-నేను, మేము, నీవు మీరు, అతడు , వాడు , వారు , వాడు , వీడు, ఎవడు, ఎంత , అంత , ఇంత,  కొంత, కొన్ని, ఎన్ని , అన్ని , అక్కడ, ఇక్కడ , ఎక్కడ….

4.క్రియలతో కూడినపదాలు తెలుగు పదాలు

ఉదా:-వండు ,తిను,చదువు ,పాడు ,వచ్చు ,పోవు ,అమ్ము , కొను….

(లిఖించు ,భావించు ,భేధించు ,ఖండించు ఇలాంటివి సంస్కృత క్రియలు. సంస్కృత క్రియలు తెలుగులో అలాగే చేరవు. క్రియలు చివరి ఇంచు చేరుతాయి)

5.స.. తో కూడిన పదాలు ఎక్కువగా తెలుగు పదాలు

ఉదా:-సంత, సంచి , సంతకం ,ఆస ,ఆకసం ,పూస, గసగసాలు……

(సంతోషం , సంభవం… ఇలాంటివి సంస్కృత పదాలు)

6.కొన్ని డు, ము, వులతో కూడినవి తెలుగు పదాలు

ఉదా:-వాడు ,వీడు ,పాపడు ,మగడు, కైరుడు, కత్తలుడు , జన్నడు , తమ్ముడు, మనుమడు, ఆటగాడు , జూదగాడు, పాటగాడు , వేటగాడు, బల్లిదుడు, ఱేడు, చెలికాడు , హెగ్గడికాడు , అటమటీడు , కన్నడీడు , కల్లరుడు , పాము , ఇనుము , అల్లము, సున్నము, బియ్యము , అందము, చందము,చెరువు, పరువు, కరువు, దరువు, నిలువు , కొలువు,….

7. సంయుక్తాక్షరంతో గానీ మహాప్రాణాక్షరంతో గానీ కూడినప్పటికి పదం చివర డు ,ము ,వు … చేరితే అవి తెలుగు పదాలుగా మారుతాయి. (కానీ మూలం సంస్కృత పదం) వీటినే తత్సమాలు అంటారు. వీటికి మరొక పేరు ప్రకృతులు.

ఉదా:- ఈశ్వరుడు, భీముడు , పర్వతము, భయము , క్రతువు , తరువు..

భీముడు+ అతడు

పర్వతము + అది

భయము+ఎందుకు

8.ఎ ,ఒ, చ, జ(దంత్యాలతో కూడినవి) లతో కూడినపదాలు తెలుగు పదాలు 

ఉదా:-ఎలుక ,ఎంత ,ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ,ఎరుక, ఎరువు ,ఎరుపు , ఒక , ఒంటె, ఒంటరి, ఒనరు, ఒప్పు, ఒత్తు, ఒద్దిక , చాప, చురక ,చూలు, చందమామ, జడ, జల్లెడ, జముడు ,జాతర ,జున్ను

9.సంఖ్యలన్నీ తెలుగు పదాలు

ఉదా:-ఒకటి ,రెండు,మూడు ,నాలుగు ,ఐదు ,ఆరు…నూరు ,వంద ,ఇన్నూరు ,వేయి,

10. కృదంత ప్రత్యయాలు చేరిన పదములు అచ్చతెలుగు పదాలు

కోయు+త….కోత

కోయు అనేది క్రియ .. క్రియా మీద త అనే కృదంత ప్రత్యయం చేరి కోత అని నామవాచకంగా మారింది.

పండు+ట..పంట

మూయు+త…మూత

పూయు+త…పూత

మండు+ట…మంట

అరుచు+పు…అరుపు

మునుగు+క…మనక

చేరు+ఇక…..చేరిక

కోరు+ఇక…..కోరిక

అలుగు+క….అలక

పోవు+క….పోక

ఊరు+ట….ఊట

11.తద్దిత రూపాలతో ఏర్పడు పదాలు తెలుగు పదాలు.

నామవాచకాల మీద గానీ, విశేషణాల మీద గానీ చేరి నామవాచకంగా మారే పదాలను తద్దినాలు అంటారు.

పెద్దతనము… పెద్ద అనేది విశేషణం. దాని మీద తనము అనే తద్దిత ప్రత్యయం చేరి పెద్దతనంగా మారింది.

 పెద్దఱికము, చుట్టఱికము , కన్నెఱికము, పూజారి, అరమరిక ,చదువరి ,తెంపరీ , తెరువరి ,సుంకరి ,జూదరి,

జాలరి ,టక్కరి ,వగలాడు ,దొమ్మరి ,ముక్కిడి,ఆటగత్తె , మోసగత్తె ,చాకిత ,కఱవత , చిఱుతుక , నాతుక, నెలతుక

12.శకటరేఫములతో ఏర్పడేవి తెలుగుపదాలు.

కఱ్ఱ ,బఱ్ఱె ,తొఱ్ఱ ,గొఱ్ఱె ,ఱంపము ,జుఱ్ఱు ,కఱ్ఱు ,మఱ్ఱి ,,……..

13.కొలమానం తెలుపే పదాలు అచ్చతెలుగుపదాలు….

జాన ,మూర ,బిత్తెడు ,దోసెడు ,మానిక, కుంచం , పడి , సేరు , అణా , దమ్మిడి , రూక ,రూపాయి

గుర్తించుకోవలసినవి….

1.సంయుక్తాక్షర పదములన్నీ సంస్కృతపదాలే కానీ

కర్జము ,సంద్రం ,….మొదలైన పదములు ఆచ్చికపదాలు.

2 వస్తే ,ఇస్తే ,తెస్తే,అరిస్తే మొదలైన చేదర్థకాలతో కూడినవి  ఇవి సంయుక్తాక్షరాలతో కూడినా మూల రూపం వచ్చు ఇచ్చు తెచ్చు అరుచు అనేవి అచ్చతెలుగు పదాలు.

(మూల రూపం వచ్చు+తే… వస్తే)

3.అన్నము వంటి ద్విత్వాక్షర పదాలు సంస్కృత పదాలుగా ఉన్నాయి.

ఇలా తెలుగు, సంస్కృత పదాలను సులభంగా గుర్తించవచ్చు. కానీ అభ్యాసం వలన మరి కొన్నింటిని తెలుసుకోవచ్చును..

పద్మజగారికి ధన్యవాదములు.

జైహింద్.

12, జులై 2026, ఆదివారం

గాన కోకిల జానకి ఇంక మనకు లేరు..

0 comments

ఓం శాంతిః.

ప్రముఖ నేపథ్య గాయిని జానకి గారు

తే. 11 - 7 - 2026న

దివంగతులైనారన్న విషయం తెలియఁజేయుటకు విచారిస్తున్నాను.

సీ.  పసిపాపగొంతులో పారాడు స్వరముతో ముద్దుగా పాడెడి పూజ్యురాలు,

బాలబాలికలట్లు పరవశమ్మున పాడు ప్రఖ్యాత గాయిని పాటల గని,

యువతులు పాడెడి యుదయకోకిలగానమాధురుల్ వెలయించు మధుర గాత్ర,

వృద్ధులట్లుగ పాడి పేరును గన్నట్టి జానకి దివికేగె మౌనముగను,

గీ. గాన కోకిల జాతికే గర్వమరయ,

నట్టి  యీ తల్లి యాత్మకునమరుగాగ

శాంతి, పరమాత్మ పాదాల చెంత చేరి

ముక్తి సామ్రాజ్యమేలుత పుణ్యగతిని.

వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.

ఓం శాంతిః శాంతిః శాంతిః.


68. శ్లోII బాణ సృణి పాశ కార్ముకపాణీ ... ఈ శ్లోకమునకు డా.తాడేపల్లి పతంజలి మహోదయుల భాష్యము.

0 comments

జైశ్రీరామ్. 

68. శ్లోII  బాణ సృణి పాశ కార్ముకపాణీ మముం కమపి కామ పీఠగతమ్‌ 

ఏణధరకోణచూడం శోణీమ పరిపాకభేద మాకలయే. ౬౮ 

తే.గీ.II  బాణ, సృణి, పాశ, కార్ముకపాణిని, నుత 

కామకోటి పీఠ గతను, శ్రీమదంబ

ననుపమారుణ పరిపాక ఘనయశమును,

చంద్రరేఖా శిరోమణిన్ సన్నుతింతు. 

తాII బాణములు అంకుశము పాశము విల్లును హస్త ములందాల్చి చంద్రవంక శిరము నంబూని కామకోటి పీఠమందున్న యొకానొక ఆరుణ్యపరిపాకమును భావించెదను. 

అమ్మ దయతో🙏🏽

చింతా రామకృష్ణారావు.

ఈ శ్లోకమునకు డా.తాడేపల్లి పతంజలి మహోదయుల భాష్యము.

​అమ్మవారి ఆయుధాలు వాటి వెనుక ఉన్న రహస్యం

​అమ్మవారు (కామాక్షీ దేవి) తన నాలుగు చేతులలో ఐదు బాణాలు, పాశము (త్రాడు), అంకుశము, మరియు ఒక విల్లును ధరించి ఉంటుంది. ఇందులో ఆమె పట్టుకున్న విల్లు చెరకు విల్లు, బాణాలు పూల బాణాలు.

​అమ్మవారు వీటిని ధరించడం వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక సంకేతం దాగి ఉంది. ఆ రహస్యాలు ఏమిటంటే:

​పాశము (తాశము/త్రాడు): ఇది 'రాగము' (అనురాగం/ఆకర్షణ) లేదా ఇచ్ఛాశక్తికి సంకేతం.

​అంకుశము: ఇది 'క్రోధము' (కోపం) లేదా జ్ఞానశక్తికి సంకేతం.

​జీవుడికి, అమ్మవారికి ఉన్న తేడా:

​మనకు ఎవరి మీద, ఎందుకు ప్రేమ (రాగము) కలుగుతుందో మనకే తెలియదు. మన సొంత ఇష్టంతో రాగము పుట్టదు. అదంతా అమ్మవారి సంకల్పం ప్రకారమే జరుగుతుంది.

​ మనుషులమైన మన రాగం మన చేతుల్లో ఉండదు. కానీ అమ్మవారి చేతిలో రాగం ఉందంటే, ఆమె దానికి లొంగిపోలేదు; రాగమే ఆమెకు లొంగి ఉంటుంది (స్వాధీనమై ఉంటుంది).

​ మనకు ఒక్కోసారి ఎదుటివారు తప్పు చేయకపోయినా కోపం వస్తుంది, మరికొన్ని సార్లు ఎంత పెద్ద తప్పు చేసినా కోపం రాదు. మనకు కోపం రావడం, రాకపోవడం కూడా అమ్మవారి ఇచ్ఛ ప్రకారమే జరుగుతుంది. కోపం అమ్మవారి చేతిలో ఉందంటే, అది ఆమె అదుపులో ఉందని అర్థం. ఆమె అనుకుంటేనే కోపం వస్తుంది, వద్దనుకుంటే రాదు.

​ఇలా రాగద్వేషాలు (ప్రేమ, కోపాలు) అమ్మవారి అదుపులో ఉంటాయి. ఆమె ఏ జీవుడినైతే అధోగతి పాలు చేయాలనుకుంటుందో, వాని మనస్సులో ఈ రాగక్రోధాలు పుట్టేలా చేస్తుంది.

​మనస్సు మరియు పంచతన్మాత్రల సంకేతాలు

​చెరకు విల్లు (చిత్తము): మన రాగద్వేషాలన్నింటికీ నిలయం మన చిత్తమే (మనస్సు). ఆ చిత్తమే అమ్మవారి చేతిలో చెరకు విల్లుగా మారింది. మన మనస్సు మన మాట వినకుండా ఎప్పుడూ చంచలంగా (అటుఇటు) తిరుగుతూ ఉంటుంది. దానిని ప్రశాంతంగా ఉంచాలని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ, అసలు ఆ మనస్సే అమ్మవారి చేతిలో ఉంది. కాబట్టి అమ్మవారు దయతలిస్తేనే మన మనస్సు మన అదుపులోకి వచ్చి నిశ్చలంగా ఉంటుంది, లేదంటే చంచలంగానే తిరుగుతుంటుంది. మన మనస్సు మనకు లొంగదు కానీ, అమ్మవారికి పూర్తిగా లొంగి ఉంటుంది.

​ అమ్మవారి చేతిలోని ఐదు పూల బాణాలు ఐదు జ్ఞానేంద్రియాల విషయాలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములకు (వినడం, తాకడం, చూడడం, రుచి, వాసన) సంకేతాలు. మన మనస్సు ఈ ఐదింటి వల్లే ఆకర్షణకు (రాగానికి) లేదా ద్వేషానికి లోనవుతుంది.

​ఇంద్రియాలు బయట ఉన్న వస్తువుల వైపు ఆకర్షించబడటం 'రాగం' వల్ల జరుగుతుంది. వాటి నుండి దూరంగా జరగడం 'క్రోధం' వల్ల జరుగుతుంది. భోగ భాగ్యాలు శాశ్వతం కావని తెలుసుకున్న జ్ఞానులలో ఈ వైరాగ్యం (దూరంగా ఉండటం) శాశ్వతంగా ఉంటుంది. కానీ సాధారణ కోపం వల్ల కలిగే వైరాగ్యం తాత్కాలికంగానే ఉంటుంది. అందుకే అమ్మవారి చేతిలోని అంకుశాన్ని కొందరు 'క్రోధం' అని, మరికొందరు 'జ్ఞానం' అని అంటారు.

​అమ్మవారి ఎరుపు రంగు విశిష్టత (అరుణిమము)

​చెట్ల ఆకులు, కాయలు సూర్యరశ్మి తగలడం వల్ల రంగులు మారుతుంటాయి. దానికి ఆ సూర్యకిరణాల పాకమే (మార్పు) కారణం. అలాగే, పరమశివుని మనస్సులోని ప్రేమే (రాగమే) అమ్మవారి ఒంటి రంగు (ఎరుపు/అరుణిమము). అమ్మవారి దివ్య సౌందర్యం వల్ల ఆ శివుని ప్రేమ ఒక ప్రత్యేకమైన పాకంగా (రూపంగా) మారింది.

​అందుకే అమ్మవారి ఎరుపు రంగును ఒక అద్భుతమైన మార్పుగా (శోణిమపాకభేదము) వర్ణించారు.  ఆ పరమశివుని ప్రేమ యొక్క పరిణామ రూపమే (అరుణిమపాక భేదమే) సాక్షాత్తు అమ్మవారు అని ఈ శ్లోకము చక్కగా తెలియజేసింది🕉️🙏🕉️

డా. తాడేపల్లి పతంజలి మహోదయులకు ధన్యవాదములు.

జైహింద్.

11, జులై 2026, శనివారం

67. శ్లోII అధికాంచి వర్తమానా మతులాం ... ఈ శ్లోకమునకు డా. తాడేపల్లి పతంజలి గారి భాష్యము.

0 comments

జైశ్రీరామ్. 

ఓం శ్రీమాత్రే నమః.🙏🏽

మూకపంచశతి..ఆర్యా శతకము.


67. శ్లోII  అధికాంచి వర్తమానా మతులాం కరవాణి పారణా మక్ష్ణోః  

ఆనంద పాకభేదా మరుణిమ పరిణామ గర్వ పల్లవితామ్‌. 


తే.గీ.II  హ్లాద పాకభేదముతోడ నతులితయును, 

కంచి సంచారి, యరుణిమ క్రమ పరిణతి

గర్వ పల్లవితయునగు కామనేత్రి

యొక్క దర్శనమును బొంది యొప్పుదునిల.


తాII ఆనందపరిపాక విశేషమును, ఎఱుపురంగుయొక్క క్రమపరిణామ గర్వముచే జిగురించుదానిని,  కాంచి యందు వర్తించు దానిని, దర్శించుకొనుదును.


అమ్మ దయతో🙏🏽

చింతా రామకృష్ణారావు.

ఈ శ్లోకమునకు డా. తాడేపల్లి పతంజలి గారి భాష్యము.

అమ్మవారికి గర్వము ఉన్నదని చెప్పవచ్చా? మూక కవి అలా ఎందుకు చెప్పారు?      తాడేపల్లిపతంజలివివరణ.                                 ​ఈ శ్లోకంలో కవి అమ్మవారి అందాన్ని, ఆమె ఇచ్చే ఆనందాన్ని రెండు అందమైన పోలికలతో వివరించారు:

​1. ఆనంద పాక విశేషం (పరమానంద రసం)

​శివుడు నిరంతర ఆనంద స్వరూపుడు. ఆ శివుడి ఆనందమే ఒక స్త్రీ రూపం దాల్చితే, ఆ రూపమే కామాక్షి అమ్మవారు.

​మనం వంట చేసేటప్పుడు పదార్థాలు బాగా పాకం పడితే రుచి అద్భుతంగా పెరుగుతుంది. అలాగే, శివునిలోని ఆనందం అనే భావం బాగా పక్వానికి వచ్చి (పాకమై), మరింత రుచికరంగా మారిన రూపమే అమ్మవారు.

​ఆ పరమశివుడికే అమితమైన ఆనందాన్ని ఇచ్చే ఆ తల్లి రూపం, మన కళ్లకు దొరికే ఒక పెద్ద విందు భోజనం లాంటిది.2.సాధారణంగా చెట్లకు వచ్చే కొత్త చిగురుటాకులు (పల్లవములు) చాలా లేతగా, ఎర్రగా ఉంటాయి.

​ అమ్మవారు నిలువెత్తు ఎరుపు రంగు కాంతితో మెరిసిపోతున్నారు. "ఈ ప్రపంచంలో నాకంటే ఎర్రగా, అందంగా ఎవరూ లేరు" అనే ఒక చిన్న గర్వం (అభిమానం) అమ్మవారికి ఉంది.

​ఒకవేళ ఆ గర్వానికి కూడా ఒక రూపం ఉండి, అది కూడా ఎర్రగా మారిపోతే ఎలా ఉంటుంది?  ఎర్రగా ఉన్న చిగురుటాకు మీద, ఈ గర్వం అనే మరో ఎరుపు రంగు వచ్చి చేరినట్లు ఉంది. అంటే... ఎరుపుకు ఇంకొక ఎరుపు తోడైతే అది ఎంత గాఢంగా, ఎంత అందంగా మారుతుందో, అమ్మవారి రూపం అంతటి ఎరుపుదనంతో ప్రకాశిస్తోందని భావం. కవిత్వంలో ఒక వస్తువు యొక్క గొప్పదనాన్ని చెప్పడానికి "గర్వం" అనే పదాన్ని ఒక అలంకారంగా వాడతారు.

​ఉదాహరణకు: "ఆ పువ్వు అందం ముందు మిగిలిన పువ్వుల గర్వం అణిగిపోయింది" అంటాం. అంటే అక్కడ పువ్వుకు పొగరు ఉందని కాదు, దాని అందం అంత గొప్పదని అర్థం.

​ఇక్కడ కూడా, "అమ్మవారి ఎరుపుదనం ముందు సృష్టిలోని మరే ఎరుపు రంగు సరితూగదు" అని చెప్పడమే ఆ 'గర్వం' యొక్క ఉద్దేశం.మూకకవి వాడిన 'గర్వము' అనేది అహంకారం కాదు; అది "సౌందర్య పరాకాష్ఠ" (అందానికి ఆఖరి హద్దు). అమ్మవారి రూపం అంతటి దివ్యమైన, తిరుగులేని కాంతితో ప్రకాశిస్తోందని చెప్పడానికి కవి భక్తితో, ప్రేమతో వాడిన పదం అది. కాబట్టి కవిత్వ పరిభాషలో దీనిని తప్పుగా భావించనవసరం లేదు🕉️🙏🕉️

శ్రీ పతంజలి మహోదయులకు ధన్యవాదములు.

జైహింద్.