గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, నవంబర్ 2008, మంగళవారం

పిత్రోర్నిత్యం ప్రియం కుర్యాత్. మేలిమి బంగారం మన సంస్కృతి 7.

మన ప్రవర్తనను చూచి మన తల్లి దంద్రులు, గురువు సంతోషించాలి:-

మన పుట్టుకకు మూలము మన తల్లి, తండ్రి. మన జ్ఞానమునకు మూలము మన గురువు. వారి నానంద పరచుట మన కనీస ధర్మము. ఈ క్రింది శ్లోకమును నా అనువాద పద్యమును పరిశీలింపుడు.

శ్లోకము:-
పిత్రోర్నిత్యం ప్రియం కుర్యాత్.
ఆచార్యస్య చ సర్వదా.
తేషు హి త్రిషు తృప్తేషు
తపస్సర్వం సమాప్యతే.

కందము:-
ప్రియమందగ తలి దండ్రులు
ప్రియమందగ గురువు మనదు ప్రియ వర్తనచే.
జయ శీలుడ! మన కదియె వి
జయము. తపః ఫలము. మనకు జయముల నొసగున్.

తల్లి దండ్రులకు ఎల్లప్పుడు ప్రియముగ నడచుకొన వలెను. అటులనే గురువులకునూ ప్రియ మొనర్చు చుండవలెను. ఈ ముగ్గురును తృప్తులైనచో మన తపము లన్నియు ఫలించినట్లే.

మన జన్మకు మూల కారకులయిన తల్లి దండ్రులకు, మన జ్ఞాన కారకులయిన గురువులకూ సంతోషము కలుగు విధముగా మన ప్రవర్తనను తీర్చి దిద్దుకొనడం ద్వారా వారికి తృప్తి కలిగించడమే కాక మనమూ హాయిగా, సంతోషంతో తేలిపోతున్న మనస్సుతో, సుఖ జీవనం సాగించడంలో పొరపాటేముంది? కాన తప్పక అలాగ చేద్దామా?

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.