గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, నవంబర్ 2008, గురువారం

భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు.

భాగవతమును తెలుగులో పద్య గద్య రూపమున అనువదించ బూనిన పోతన భాగవతమును పలుకుటను గూర్చి ఇలా చెప్పాడు.

ఆటవెలది:-
భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు,
శూలికైన తమ్మి చూలికైన.
విబుధ జనుల వలన విన్నంత కన్నంత
తెలియ వచ్చినంత తేట పరతు.

భాగవతాన్ని గూర్చి తెలుసుకొనుట, దానిని గూర్చి పలుకుట ఈశ్వరునకైనను, బ్రహ్మకైనను, చాలా కాష్టము. అట్టి భాగవతాన్ని నేను విన్న దానిని చూచినదానిని, నాకు తెలిసిన దానిని తేట తెల్లము చేయుదును.

అంత కష్ట తరమని చెప్పుతూ చెప్పిన భాగవతమే యింత గొప్పగా మందార మకరంద మాధుర్యాలు నింపుకొన్నదీ అంటే పోతన మదిలో భాగవతం ఇకా ఎంతటి గొప్పగా అమృతోపమానమై నిలిచినదో కదా. అట్టి మహాకవి రచించిన తెలుగు భాగవతం వలన ఎందరు భక్తులు ముక్తినొందారోకదా. సమయం చిక్కినప్పుడల్లా మనం కూడా భాగవతాన్ని హృదయస్థం చెద్దామా.
జైహింద్. Print this post

1 comments:

రాఘవ చెప్పారు...

రామకృష్ణారావుగారూ బాధపడకండీ... ముద్రారాక్షసాలు సర్వసాధారణమే. పైగా మీరే చెప్తున్నారు కదా జాలానన్వయాలూ విద్యుదంతరాయాలూ ఉన్నై అని. మీ సుహృదయాన్ని మేము అర్థం చేసుకున్నాం :)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.