గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, అక్టోబర్ 2018, శనివారం

భావగోపన ఆద్యక్షర బంధ సీసము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! వందనములు.
శ్రీనాధమహాకవికి సమకాలికుడైన కొఱవిగోపరాజు రచించిన 
'సింహాసన ద్వాత్రింశిక' యనేగ్రంథములోని 
భావగోపన ఆద్యక్షర బంధ సీసము.

సీ: రాజ్యంబు వదలక, రసికత్వమెడలక
జయశీలముడుగక, నయముచెడక
దీనుల ఁజంపక, దేశంబు నొంపక ,
నిజముజ్జగింపక, నేర్పుఁగలిగి ,
విప్రులఁ జుట్టాల, వెన్నుసొచ్చినయట్టి
వారిని ,గొల్చినవారి, ప్రజల
హర్షంబుతో గాంచి, యన్యాయముడుపుచు,
మున్నుజెప్పినరీతి జెన్నుమీరి
గీ: చేతలొండులేక, పాత్రులవిడువక ,
యశము కలిమి తమకు వశము గాగ ,
వసుధనేలు రాజవర్గంబు లోన న
య్యాది విష్ణుమూర్తి వండ్రు నిన్ను .
విక్రమాదిత్యునివద్దకు ఒకనిరుపేద బ్రాహమణుఁడు తనకుమార్తెను వెంటబెట్టుకొని వచ్చినాడు. ఈపిల్ల నాకుమార్తె. పెళ్ళియీడువచ్చినది. అయితే పేదరికంవలన ధనంలేక దీనికి పెళ్ళిచేయలేకపోతున్నాను. నీవు సహాయపడి యీపిల్లకు పెళ్ళిచేయవయ్యా! అనిఆద్యక్షర బంధ సీసములో అడిగెను. పద్యపాదాదివర్ణములు కలిపి చదివినచో ఈ విషయము బహిర్గతమగును. ఇదియే భావగోపన ఆద్యక్షర చిత్రము
 జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.