గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, ఆగస్టు 2018, మంగళవారం

మణిద్వీప వర్ణన

జైశ్రీరామ్.
మణిద్వీప వర్ణన

నూతన గృహప్రవేశ శుభ సందర్భాలలో తరతరాలుగా మణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఉండటం ఓ ఆచారంగా వస్తోంది. శ్రీచక్ర బిందు రూపిణి శ్రీ రాజరాజేశ్వరి శ్రీదేవి శ్రీ మహావిద్య శ్రీ మహాత్రిపురసుందరి శ్రీ లలితా  జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణి ద్వీపం. పదునాలుగు లోకాల అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై వున్నారు. యావత్‌ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది. నాలుగువైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా వున్న ఈ ద్వీపాన్ని వర్ణించాలంటే మన శక్తి చాలదు. మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టితయై వుంటారు. దేవీ భాగవతంలో మణి ద్వీపం గురించిన వర్ణన వుంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారు మయమైన కొండలు ఈ ద్వీపంలో వున్నాయి. అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు.

మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు వుంటారు.వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతుంటారు. అనంతరం కంచుతో చేసిన రెండో ప్రాకారం వుంటుంది. పచ్చటి అరణ్యములతో, వివిధ రకాల జంతువులు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తుంటుంది. ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు వుంటారు. జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు. వైకుంఠం, కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం. యావత్‌ విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద అక్కడ వుంటుంది. అన్నింటినీ మించి అమ్మ సన్నిధిలో వుండటమే మహావరం. అందుకనే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తుంటారు. ఈ పారాయణంతో ఇంట్లోని వాస్తుదోషాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలూ లభిస్తాయి.

మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయుంది|| 1

సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు
అచంచలంబగు మనోసుఖాలు మణి ద్వీపానికి మహానిధులు|| 2

లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు 
లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహనిధులు|| 3

పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు
గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు|| 4

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం|| 5

పద్మరాగములు సువర్ణమణులు పదిఆమడల పొడవున గలవు
మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు|| 6

అరువది నాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారుశక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు|| 7

అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు|| 8

కోటి సూర్యులు ప్రచండకాంతులు కోటిచంద్రుల చల్లని వెలుగులు
కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు|| 9

 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
  దేవదేవుల నివాసము అదియే కైవల్యం|| 

కంచుగోడల ప్రాకారాలు రాగిగోదల చతురస్రాలు
ఏడామడల రత్నరాసులు మణి ద్వీపానికి మహానిధులు|| 10

పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు|| 11

ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు
పుష్పరాగమణి ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు|| 12

సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు
శ్రీగాయత్రీ జ్నానశక్తులు మణి ద్వీపానికి మహానిధులు|| 13

 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
  దేవదేవుల నివాసము అదియే కైవల్యం|| 

మిలమిలలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు|| 14

కుబేర ఇంద్ర వరుణదేవుల శుభాలనొసగే అగ్నివాయువులు
భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు|| 15

భక్తిజ్నాన వైరాగ్యసిద్దులు పంచభూతములు పంచశక్తులు
సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు|| 16

కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు
ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిదులు|| 17

 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
 దేవదేవుల నివాసము అదియే కైవల్యం|| 

మంత్రిణి దండిని శక్తిసేవలు కాళికరాళి సేనాపతులు
ముప్పది రెందు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 18

సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు
గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు|| 19

సప్తసముద్రము లనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు|| 20

మానవ మాధవ దేవగనములు కామధేనువు కల్పతరువులు
సృష్టిస్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు|| 21

 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
 దేవదేవుల నివాసము అదియే కైవల్యం|| 

కోటి ప్రకృతుల సౌందర్యాలు సకలవెదములు ఉపనిషత్తులు
పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 22

దివ్య ఫలముల దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు
దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 23

శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్నానముక్తి ఏకాంత భవనములు
మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు|| 24

పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేకశక్తులు 
సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు|| 25

చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు
వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు|| 26

ధుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు|| 27

పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వతస్థానం || 28

చింతమణుల మందిరమందు పంచబ్రహ్మల మంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో|| 29

 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
 దేవదేవుల నివాసము అదియే కైవల్యం|| 

మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో|| 30

పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో
అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది||2|| 31 

నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన తొమ్మిదిసార్లు
చదివిన చాలు అంతా శుభమే అష్టసంపదల తులతూగేరు||2|| 32

శివకవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివినచోట
తిష్ట వేసుకొని కూర్చొనునంటా కోటి శుభాలను సమకూర్చకొనుటకై||2|| 33

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం||

పరదేవత అయిన ఆ శ్రీమాత ప్రపంచాన్నంతటనీ పరిరక్షిస్తుంది. ఆమె నిత్యం
నివసించే గృహమే చింతామణి గృహం. అది మణిద్వీపంలో ఉంటుంది.
సర్వలోకోత్తమోత్తమైన ఆ మణిద్వీపాన్ని స్మరిస్తే చాలు సర్వపాపాలూ
నశిస్తాయని దేవీభాగవతం పన్నెండో స్కంధం వివరిస్తోంది. దుష్టశిక్షణ,
శిష్టరక్షణ చేస్తూ జగత్తునంతటినీ పాలించే ఈ భువనేశ్వరీ మాత నివసించే
చింతామణి గృహం వేయిస్తంభాల మండపాలతో విరాజిల్లుతుంటుంది. ఇలాంటి మండపాలు నాలుగుంటాయి. శృంగార మండపం, ముక్తిమండపం, జ్ఞానమండపం, ఏకాంత మండపం అని వాటికి పేర్లు. కోటి సూర్యప్రభలతో అవి నిత్యం ప్రకాశిస్తుంటాయి. వాటిచుట్టూ కాశ్మీరం, మల్లికా, కుందవనాలు అలరారుతుంటాయి. ఆ వనాలలో కస్తూరి మృగాలు సంచరిస్తూ పరిమళాలను ప్రసరింపజేస్తుంటాయి. అక్కడే సుధారసపూర్ణంగా ఉండే ఒక పెద్దసరోవరం ఉంటుంది. ఆ సరోవరం అంచులు, సోపానాలన్నీ అనేకానేక మణులు, రత్నాలతో పొదిగి ఉండి మనోహరంగా ఉంటాయి. ఆ సరోవరం మధ్యలో ఓ మహాపద్మవనం, హంసల్లాంటి పక్షులు ఎంతో ముచ్చటగొలుపుతూ ఉంటాయి. 

చింతామణి గృహంలో పదిమెట్లతో ఉన్న ఓ వేదిక ఉంటుంది. ఆ వేదికకు
ఉన్న పదిమెట్లూ పది శక్తిస్వరూపాలు. దానికి ఉండే నాలుగు కోళ్లపై ఉండే
ఫలకమే సదాశివుడు. ఆ ఫలకం మీద మాత భువనేశ్వరుడి వామాంకంలో కూర్చొని  ఉంటుంది. ఆ మాతకు రత్నాలు పొదిగిన వడ్డాణం, వైఢూర్యాలు తాపడం చేసిన అంగదాలు అలరారుతుంటాయి. శ్రీచక్రరూపంలో ఉన్న తాటంకాలతో శ్రీమాత ముఖపద్మం కళకళలాడుతుంటుంది. చంద్రరేఖను మించిన అందంతో ఉండే నొసలు, దొండపండ్లలా ఉండే పెదవులు, కస్తూరి కుంకమ, తిలకం దిద్ది ఉన్న నుదురు, దివ్యమైన చూడామణి, ఉదయభాస్కర బింబంలాంటి ముక్కుపుడక ఇలా ఎన్నెన్నో దివ్యాభరణాలు, మైపూతతో శ్రీమాత అలరారుతుంటుంది. ఆ మాతకు పక్కభాగంలో శంఖ, పద్మ నిధులు
ఉంటాయి. వాటి నుంచి నవరత్న, కాంచన, సప్తధాతు వాహినులు అనే నదులు పరవళ్లు తొక్కుతూ అమృత సంద్రంలోకి చేరుతుంటాయి. 

జగజ్జనని భువనేశ్వరుడి పక్కన ఉన్నది కాబట్టే ఆయనకంతటి మహాభాగ్యం, శక్తియుక్తులు లభించాయని అంటారు. మాత నివసించే చింతామణి గృహం వెయ్యి యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ గృహానికి ఉత్తరంగా అనేకానేక శాలలు ఒకదానిని మించి మరొకటి ఉంటాయి. ఇవన్నీ ఆ అమ్మ శక్తిప్రభావంతో అంతరిక్షంలో ఏ ఆధారమూ లేకుండా వేలాడుతుంటాయి. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవ, నాగ, మనుష్య జాతులకు చెందిన దేవీ ఉపాసకులంతా చేరేది ఈ చింతామణి గృహానికే. కరుణారస దృక్కులతో ఆమె తన బిడ్డల వంక చూస్తూ ఉంటుంది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమన్వితంగా ఆ మాత కన్పిస్తుంటుంది. ఆమె చుట్టూ లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ, స్మృతి, లక్ష్మీ అనే దేవాంగనలు ఉంటారు. 

జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిని, అఘోర, మంగళ, దోగ్ద్రి అనే తొమ్మిది పీఠాశక్తులు జగన్మాతను నిరంతరం సేవిస్తూ ఉండటం కన్పిస్తుంది. కేవలం దేవి ఉపాసకులకేకాక నిరంతరార్చన తత్పరులకు ఇక్కడే స్థానం దొరుకుతుంది. ఈ ప్రదేశంలో మరో గొప్ప తనమేమిటంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ద్రాక్ష, నేరేడు, మామిడి, చెరకురసాల జీవనదులు ప్రవహిస్తుంటాయి. కోర్కెలను తీర్చే మహత్తర వృక్షాలు ఇక్కడ ఎన్నెన్నో. ఈ ప్రాంతంలో ఉండేవారికి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలుండవు. అంతా నిత్యయౌవనంతో ఆనందంతో ప్రకాశిస్తుంటారు. వారంతా మాతను నిరంతరం భజిస్తూ ఉంటారు. దేవతలంతా ఇక్కడికి వచ్చి అమ్మవారికి నిత్యం సేవలు చేస్తూ ఉంటారు. అమ్మ నివసించే మణిద్వీపమూ అందులోని చింతామణి గృహమూ ఒక్కోసారి ఒక్కో విధంగా పవిత్రకాంతులనువెదజల్లుతూ ఉంటాయి. 

ఐశ్వర్యానికీ, యోగానికీ అన్నిటికి అది పరమావధి. జగత్తునంతటినీ తానై యుగయుగాలుగా పాలిస్తున్న ఆ జగన్మాత చిద్విలాసం దేవీభాగవతంలో ఇలా కన్పిస్తుంది. తన భక్తులకు బాధ కలిగిందని తెలిసినప్పుడల్లా తానే స్వయంగా ముందుకువచ్చి దుష్ట శిక్షణ చేస్తుండే ఆ పరాంబిక ఎక్కడుంటుంది అని ఎవరికైనా కలిగే సందేహమే. ఆ సందేహానికి సమాధానమిస్తూ మణిద్వీపంలో ఉండే చింతామణి గృహంలో ఉండే ఆ శ్రీమాత గురించి ఈ కథా సందర్భం ఇలా వివరించి చెప్పింది. మణిద్వీప వర్ణన, చింతామణి గృహవర్ణనలు వింటేనే సకల పాపాలూ నశిస్తాయని భక్తకోటి నమ్మకం.

ఫలశ్రుతి: పదునాలుగు లోకాలకూ పరంజ్యోతియగు మణిద్వీప నివాసినీ, పరమేశ్వరిని, తొమ్మిది విధాలుగా కీర్తించుకొనుటకు 9 దోహాలతో ఈ స్తోత్రం వ్రాయబడింది. అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని 9 పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతి మనిషి తరించవచ్చు. దీనిని శుక్రవారము నాడు మీ పుజానతరం తొమ్మిది సార్లు చదివిన దన, కనక, వస్తు, వాహనాది సంపదలు కలిగి భక్తి, జ్నాన వైరాగ్య సిద్దులతో ఆయురారోగ్య,అయిశ్వర్యాలతో తులతూగి చివరకు మణిద్వీపము చేరగలరు. ఇది శాస్త్రవాక్యం.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.