గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, డిసెంబర్ 2009, సోమవారం

తిరిపతి వేంకట కవులు 1.

కవి, పండిత, పాఠకావతంసులారా!
తిరుపతి వేంకటాఖ్య కవి  
ధీమణు లిర్వురు నొక్క జంటయై
గరువము తోడ నాంధ్ర మున  
కమ్మని సత్ కవితాంభుధిన్ సృజిం
చె. రుచిర పద్య పాటవము  
చే కొనఁ జాలిన పండితాళికిన్
నిరువురు చేవఁ జూపుచు య  
ధేచ్ఛగ పద్యము లల్లి చెప్పిరే!
అట్టి అద్భుత శతావధానులయిన ఆ మహా కవి
పుంగవులను చిత్రములందైననూ నేడు కనఁ గలుగు చున్న మన మెంతటి భాగ్యవంతులమో కదా!
ఆమహనీయులు సరస్వతీ మాతకు ముద్దు బిడ్డలు. లేఖకుడు వ్రాయలేనంత వేగముగా ఆశుధారగా ఆ సుధనే ధారగా ఆ తల్లి ఆముద్దు బిడ్డల నోట ముద్దు ముద్దుగా పలికించడమే కాదు, అహంభావ కవులకు అక్షరాలతో వాతలు కూడా పెట్టించేది. అంతటి ప్రతిభాశాలురా జంట కవులు.
ఆ జంట కవుల పూర్తి నామధేయములు దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి.
దివాకర్లవారిది పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం తాలూకా, ఎండ గండి గ్రామం.
తల్లిదండ్రులు:-శేషమ - వేంకటావధాని.
ప్రజోత్పత్తి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ దశమీ బుధవారం జననం.(1872).
చెళ్ళపిళ్ళ వారిది తూర్పు గోదావరి జిల్లా,ధవళీశ్వరం సమీపమున గల కడియము గ్రామం.
తల్లిదండ్రులు:- చంద్రమ్మ - కామయ్య.
ప్రమోదూత నామ సంవత్సర శ్రావణ శుద్ధ ద్వాదశీ సోమ వారం.(1870)
ఈ జంట కవులు  నర్మోక్తులతో, హాస్య సంభాషణతో, చతుర వచో విలాసంతో, సభాసదులను ఆనంద పరవశుల్ని చేసే వారు. వాగ్గాంభీర్యంతో ప్రత్యర్థుల్ని అవాక్కయేలా చేసేవారు. సరస సంభాషణలో కూడా వీరుతక్కువవారేంకాదు.
ఒకపర్యాయం వీరు మండపేటలో కళాభిజ్ఞత, లోకజ్ఞత, రసజ్ఞత గల " మణి " అనఁబడే వేశ్యను చూచి, ఆమె చేసిన నాట్యాన్ని చూచారు. చాలా సంతోషింఛారు. అభినందించారు.
అంతటితో ఊరుకోక ఆమెతో కొంటెగా " మణి మామూలుగా ఉండే కంటే " కడియం " లో ఉంటే సార్థకత లభిస్తుంది. శోభస్కరంగా ఉంటుంది. అన్నారు. (వారిది కడియం గ్రామమేకదా! అక్కడుంటే--- ఊఁ ----అన్ని విధాలా చాలా బాగా ఉంటుందని వారి నర్మ గర్భ సంభాషణా సారాంశం.)
వెంటనే ఆమె ఆకవులతో చమత్కారం ఉట్టిపడేలాగా సమాధానం చెప్పి వారిని మరింత మెప్పించింది.
ఏమందో చూడండి.
మహాకవులు మీకు తెలియని దేముంది? స్వచ్ఛమైన మణి (ఆమె నిర్మల అన్న మాట.)కడియంలో ఉంటే యేమిటి? పేటలో(మండపేట, ఆమె నివాస గ్రామం) ఉంటే యేమిటి?
వెంకట శాస్త్రిగారి చతురతకు దీటైన చతురతనామె కనఁబరచింది కదూ?
మీకు తెలిసిన మరి కొన్ని ఈ కవులకు సంబంధించిన విషయాల్ని వ్యాఖ్య ద్వారా పంపండి.
జైహింద్. Print this post

2 comments:

కథా మంజరి చెప్పారు...

తిరుపతి వేంకట కవుల చిత్ర పటాన్ని , వారి గురించిన క్లుప్త వ్యాఖ్యలను ప్రచురించినందుకు మీకు ధన్య వాదాలు.
వారి నానా రాజ సందర్శనం ఎరుగని సాహితీ ప్రియులుండరు.
వారి ‘‘ శత ఘంట కవనమ్ము సల్పు సంగతి ...’’
‘‘ అటు గద్వాలిటు చెన్న పట్టణము మధ్యన్ గల్గు ధేశమ్మునన్...’’
‘‘ దోస మటంచెఱింగియును దుందుడుకొప్పగఁబెంచినారమీ మీసము ...’’
‘‘ అల నన్నయ్యకు లేదు,తిక్కనకు లేదా భోగము ...’’
ఇత్యాదిగా గల వారి ప్రసిద్ధ పద్యాలని ఈ బ్లాగు చూసేక మరో సారి స్మరణకు తెచ్చుకుని చాలా ఆనందించాను.

తిరుపతి కవులు విద్యల నగరం విజయ నగరం వచ్చి నప్పుడు ఆనంద గజపతి మహా రాజులుంగారి గురించి చెప్పిన ఈ క్రింది పద్యాన్ని మీతో పంచుకుంటాను ...

ఎందఱఁజూపెనేని వరియింపదు మా కవితా కుమారి, క
న్నందుకు దేశముల్ దిరగుటబ్బెను, సౌఖ్యము లేక పోయె, నా
నంద న్రుసాల ! నీదు సుగుణమ్ములు చెప్పిన నాలకించి, వెం
టం దలయూచె | గావునఁదటాలునఁదీనిఁబరిగ్రహింపుమా !

సకల విద్యా పోషకులు, వితరణ శీలి ఆనంద గజపతులు ఈ పద్యాన్ని విని, తిరుపతి కవులను సముచిత రీతిని సత్కరించారని వేరే చెప్పాలా ?

Vempati Satya Suryanarayana చెప్పారు...

సంగర శక్తి లేదు వ్యవసాయము సేయుట సున్న సంతలో
అంగడి వైచియమ్ముటది యంతకు మున్నె హుళక్కి ముష్ఠికిన్
బొంగు బుజానవైచుకొని పోయెద మెక్కడి కైన ముష్ఠిచెం
బుంగొని పెట్టుమొక్కటి యమోఘమదేకద దంతి రాణృపా

తిరుపతి వేంకట కవుల కవిత్వం లో ఎంత చమత్కారం ఎత్తి పొడుపు !! నానా రాజ సందర్శనం ఎక్కడ దొరుకుతుందో

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.