గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, డిసెంబర్ 2009, మంగళవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 72.

సాహితీ ప్రియులారా!
మానవత్వము పరిమళించే మనము  మన  నిత్య కృత్యములలో  తెలిసియు, తెలియకయు పాప కార్యములు చేయుచుందుము. తెలిసి చేసిన పాపానికి పరిహారము కర్మానుభవమే. మరి తెలియక చేసిన పాపము మన దృష్టికి వచ్చినచో ఆ జరిగిన పాపానికి మనము చాలా చింతిస్తూ ఉంటాము. ఆ విషయమై ఒక చక్కని శ్లోకము మనకు పూర్వీకులందించి యుండిరి. దానినిటఁ జూడుడు.
శ్లో:-
కృత్వా పాపం హి సంతప్య, తస్మాత్  పాపాత్ ప్రముచ్యతే.
నైవ కుర్యాత్ పున రితి నివృత్యా పూయతే తు స:.
క:-
తెలియక పాపముఁ జేసినఁ
గలఁగి, మదిఁ దపింతు మేని కలుగదు పాపం
బలసత నికఁ జేయ ననుచుఁ
దలచినచో  తద్విముక్తి  తధ్యము మనకున్.
భావము:-
పాప కార్యము మనకు తెలియ కుండానే మనము మనచేఁ జేయఁబడినచో, అదితెసిన పిదప ఆ పాప భీతితో ఆవేదనకు లోనగుదుము. అట్టి తఱి తద్ విషయమై మిక్కిలి పశ్చాత్తాపముతో ఇకపై జాగరూకతతో మెలగి ఇట్టి పాపములు జరుగ కుండా చూచుకొందునని మనము దృఢచిత్తులమయి నిశ్చయించుకొన్నచో తెలియక చేసిన పాపము వలన కలిగిన దోషము  ఆ పశ్చాత్తాపముతోనే పరిహారమగును.
అలసత్వము వీడి జాగరూకతతో పాపదూరులమై మనము ప్రవర్తింతుము గాక.
జైహింద్. Print this post

1 comments:

సురేష్ బాబు చెప్పారు...

అవునండీ నిజమే. పశ్చాత్తాపమును మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు కదా మన పెద్దలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.