గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, జులై 2024, బుధవారం

మోక్షకారణ సామగ్ర్యాం ... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  “మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ 

స్వస్వరూపానుసంధానం భక్తి రిత్యభిదీయతే” (శంకర భగవత్పాదులు)

తే.గీ.  మోక్షకారణమగునది పూర్ణభక్తి,

గొప్పదదియంచు శంకరుల్ చెప్పినారు,

స్వస్వరూపానుసంధానమే స్వయముగ

ముక్తినిడు భక్తిగాఁ జెప్పె పూజ్యులార!

భావము.  మోక్ష కారణలైన సామాగ్రులలో “భక్తి” గొప్పది. “స్వస్వరూప అనుసంధానమేఽనగా తనరూపముననే ఆ భగవంతుని నిలుపుకొనుటయే భక్తి అనబడును.

భాగవతంలో నవవిధభక్తులు ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉన్నది. 

శ్లో.  శ్రవణం కీర్తనం విష్ణోః  -  స్మరణం పాద సేవనం

అర్చనం వందనం దాస్యం  -  సఖ్యమాత్మ నివేదనమ్.

పోతన భాగవతములో దీనినే ఈ విధముగ చెప్పెను.

మ.  తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనా

ర్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనం

బను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి స

జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!

ఆ నవవిధభక్తులు.

1. శ్రవణ భక్తి : సత్పుతురుషుల వాక్యాలు, సంద్గ్రంథాలు విన్న  జ్ఞానానికి మార్గం చూపుతుంది. పరీక్షిత్తు శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు.

2. కీర్తనా భక్తి : భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. వాల్మీకి, నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, ఆళ్వారులు, నయనార్లు, రామదాసు మొదలైన వారు కీర్తన భక్తితో పరమపదం పొందారు.

3. స్మరణ భక్తి : భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించుట స్మరణ భక్తి. మునులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో ధన్యులైనారు.

4. పాదసేవన భక్తి : భగవంతుని పాదాలు సేవించడం. భరతుడు, గుహుడు మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా ముక్తులైనారు.

5. అర్చన భక్తి : ప్రతిరోజు తులసి పుష్పాదులు, ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చారూపంలో దేవుని పూజించడం అర్చనా భక్తి. 

6. వందన భక్తి : వందనం అనగా నమస్కారం. తన యందు మనస్సు నుంచి భక్తులై పూజింపుమని, నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్భోవించాడు.

7. దాస్య భక్తి : ప్రతి మానవుడు తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడు సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి. కులశేఖర అళ్వారు, హనుమంతుడు, లక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తి నాశ్రయించి ముక్తిని పొందారు.

8. సఖ్య భక్తి : భగవంతునితో సఖ్యమేర్పరచుకున్న వారు ధన్యులు. అర్జునుడు, సుగ్రీవుడు మొదలైన వారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతిపాత్రులైనారు.

9. ఆత్మ నివేదన భక్తి : ఆత్మనివేదన మనగా భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరడం. ఈ మార్గాన ద్రౌపతి, గజేంద్రాదులు ముక్తులైనారు.

జైహింద్.

Rephrase with Ginger (Ctrl+Alt+E)
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.