గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, జనవరి 2009, శనివారం

దేశమునకీ యరిష్టము తీరిపో----? (వు - దు ).

మధు సేవ నాటకమున దేశారిష్ట కారణములను వివరించించిన సీసపద్యమును చూచినట్లయితే మనకాశ్చర్యం కలిగిస్తుంది. కవి నిర్మొహమాటంగా ఎంత స్పష్టంగా వ్రాశాడో చూడండి.

సీసము:-
కొంపలు తెగనమ్మి కోర్టుల, రైళ్ళ, కా
ఫీ హొటేళ్ళ, వకీళ్ళ, పెంచువారు.
పండిన సరు కెల్ల పర దేశముల కంపి
కరవున కిర వేర్పరచు వారు
మూడు ప్రొద్దులు ముష్టి మున్సిపల్ పదవి లో
పలనుండి కనులు కన్ పడనివారు.
ఆస్తి భార్య పేర అప్పులు తమ పేర
పెంచి ఐ.పీ.లను పెట్టువారు.
తేటగీతి:-
బట్ట కొఱకు, జుట్టు కొఱకు, బ్రాంది కొఱకు,
సిరులు పర దేశముల పాలు చేయువారు.
పూర్తిగా నెల్లెడల వట్టిపోవు దనుక
దేశమునకీ యరిష్టము తీరిపోదు.

నిరంకుశాః కవయః అన్నరుకదా పెద్దలు. అందుకే అంత నిర్మొహమాటంగా వ్రాయగలిగాడు.
పద్య రచన కాని, గద్య రచన కాని, యదార్థానికి దర్పణం పట్టాలంటారు పెద్దలు. అతిశయోక్తులు, కవిచమత్కారాలు లాంటి వన్నీ కూడా యదార్థాన్ని ప్రతిపాదించిన పిదపనే చూపించాలి.
మనం కూడా యదార్థానికి ప్రతి బింబంలా పద్య రచన చేయగలిగితే ఆదరణీయం కాకపొతుందా!

జైహింద్.
Print this post

6 comments:

అజ్ఞాత చెప్పారు...

నిజంగా చాలా బాగున్నదండి ఈ పద్యం.
మా తాత గారు స్వహస్తాలతొ రాసుకున్న ఒ వేమన శతకం పద్యం నా బ్లాగులో పొందు బరిచాను. వీలుంటే చదవండి.

జిలేబి
http://varudhini.blogspot.com/2008/12/blog-post_30.html

durgeswara చెప్పారు...

mI mail address kaavaali pampagalaru

durgeswara చెప్పారు...

mI pEruna IrOju pooja jariginadi naa blog lO peDutunnaanu choodaMdi.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ పద్యం నిజంగా మా తాతగారు స్వహస్తాలతో రాసుకున్నది. అంటే ఓ 60 లేక 70 సంవత్సరాల క్రిందట ఉండవచ్చు. ఇది వారి కాలపు పేరడీ కూడా అయి ఉండవచ్చు. కాబట్టి దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు.
పద్యం:
పిండములను జేసి పితరులను తలపోసి
కాకులకు బెట్టు గాదిదలార
పియ్య తినెడు కాకి పితరుడెట్లాయరా
విశ్వదాభి రామ వినుర వేమ.

జిలేబి.

అయ్యా! మీ తాతగారే కాదు. ఆ వేమన పద్యం అచ్చు పుస్తకాల్లో కూడా వుంది.
ఆటవెలది:-
పిండములను జేసి పితరుల తలబోసి
కాకులకును పెట్టు గాడ్దెలార!
పెంట తినెడు కాకి పితరుడెట్లౌనురా!
విశ్వదాభిరామ వినుర వేమ.

మీ తాతగారి చేతి వ్రాత ప్రతినే స్కేన్ చేసి పెట్టివుంటే మంచి త్రిల్లింగుగా వుండేది.

ఆర్యా! దుర్గేశ్వరా!
ధన్య వాదములు.
లోక కల్యాణకర కార్యక్రమాలు చేస్తున్న మీద్వారా నా పేరున పూజ జరగడం నా అదృష్టం గా భావిస్తున్నాను.
నా ఈ మెయిల్ ఎడ్రస్ తెలియజేయమన్నారు. దిగువ వ్రాశాను చూడగలందులకు మనవి.
chinta.vijaya123@gmail.com
" దీనికి ప్రత్యుపకృతి గావింప నే నేర నంజలి గావించెద భూసురాన్వయ మణీ! సద్బంధు చింతామణీ. అనే రుక్మిణి నోట పలికించిన పోతన పద్య భాగాన్నే నేనిప్పుడు మీముందు వచిస్తున్నాను.
కృతజ్ఞుడను.
సెలవ్.

సురేష్ బాబు చెప్పారు...

రామకృష్ణా రావు గారూ!
మీకు వీలుంటే నా సందేహాలు తీర్చండి.
ఉత్పలమాల అంటే భరనవభరవ,
మరి సభరనమయవ, మసజసతతగ,నజభజజజర లు చంపకమాల,మత్తేభం,శార్దూలం లలో దేనికి ఏది? ప్రాస నియమాలు,యతి ఏమిటి? అలాగే కందము,సీసము,ఆటవెలది పద్యాలకు గురువులు,లఘువుల విభజన ,ప్రాసలు చెప్పండి. అప్పుడెప్పుడో ఇంటర్మీడియట్ లో ఇవి చదువు కొన్నాను.ఇప్పుడు సరిగా గుర్తులేవు.అన్యధా భావించకండి.
-సురేష్ బాబు

కామేశ్వరరావు చెప్పారు...

సురేష్ గారు,

వికీపీడియాలో ఛందస్సు గురించిన ఈ వ్యాసం చూడండి. అక్కడినుంచి మీరడిగిన వృత్తాలూ, మిగతా ఛందస్సుల గురించి వివరాలున్నాయి:

http://te.wikipedia.org/wiki/%E0%B0%9B%E0%B0%82%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%81

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.