గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, జులై 2025, శనివారం

హిందూ వివాహప్రక్రియలో ముఖ్య ఘట్టాలు....... సమర్పణ...... శ్రీ మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

జైశ్రీరామ్.

 🙏హిందూ వివాహప్రక్రియలో  ముఖ్య ఘట్టాలు 🙏

                     మొదటి భాగం 

వ్యాసం పెద్దది అయింది. చదవడానికి సులభంగా కొన్ని భాగాలుగా విభవించాను 🙏

ముందు హిందువుగా పుట్టడం ఒక అదృష్టమయితే బ్రాహ్మణునిగా జన్మించడం, వేదాధ్యయనం చేసి పురోహితుడు కావడం జన్మాన్తర సుకృతం అనే చెప్పాలి. వివాహ వ్యవస్థలోని సంప్రదాయాలు వ్రాస్తున్నాను. కొంతమంది బ్రాహ్మణులకు కొన్ని మినహాయింపు ఉండవచ్చు. అలాగే వధూవరుల వస్త్రధారణలోనూ, భాషికములువిషయాలలోనూ. అలాగే గోదావరి జిల్లాల్లో తెలుపు తలంబ్రాలు, మిగిలిన ప్రాంతాల వారు పసుపు తలంబ్రాలు ఉపయోగిస్తారు. ఇవి ప్రాంతీయ ఆచారాలు  అనుకోండి. ఋగ్వేద సంప్రదాయంలో అయితే ముందు తలంబ్రాలు తరువాత తాళిగట్టుట జరుగును.

సోమ: ప్రధమో వివిధే గంధర్వో వివిధ ఉత్తర:

తృతీయో అగ్నిష్టేపతి స్తురీయ స్తే మనుష్య జా:

ఈ మంత్రములో పతి శబ్దం వాడబడినది. ఇక్కడ పతి అంటే ప్రజాపతి అని అర్ధం. ప్రజా అంటే సంతానం. పతి అంటే సంరక్షకుడు ప్రజాపతి అంటే సంతాన సంరక్షకుడు అని అర్ధం చెప్పుకోవాలి.

ఇక్కడ కొందరు విపరీతార్ధము చెప్పి ప్రక్కదోవ పట్టిస్తున్నారు. అది మహాపచారం.

ప్రతి వధువు ఐదు సంవత్సరాలవరకు చంద్రుని సంరక్షణలో ఉండి ముఖకాంతిని పొందుతుంది. ఆపై చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరించి పది సంవత్సరాలవరకు శరీరక సౌందర్యం ఇచ్చి సంరక్షణ చేస్తాడు. ఆ తరువాత గంధర్వుని సాక్షిగా అగ్ని దేవుడు స్వీకరించి మానసిక శరీరక వికాసం నిచ్చి ఆమెను భర్తకు అప్పగిస్తాడు. వరుడు అగ్ని సాక్షిగా స్వీకరిస్తాడు. అందుకే అగ్ని సాక్షిగా వివాహం అంటాము.

ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆవేదన కలుగుతోంది. నా ఆందోళన తెల్పి తరువాత విషయంలోకి వెడతాను.

ఈ రోజుల్లో ఎవరు పురోహితుల మంత్రాలు వినడం లేదు. వారిని గౌరవించడం లేదు. చాలా నీచానికి దిగజారి ఫొటోస్ కు అడ్డువస్తున్నారు అంటూ పురోహితులను విసుక్కుంటున్నారు. ఇది ఎంత దారుణమో ఈ విషయలో బ్రాహ్మణులు అతీతులు కారు. ఈ జాడ్యం అందరిలోనూ ఉంది.ఆలోచించండి.ముందు బ్రాహ్మణుల్లో మార్పు వచ్చి సంస్కరింపబడాలి. తరువాత మిగిలిన వారికి చెప్పవచ్చు.. ఈ మధ్య కొత్తగా ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రారంభించారు. హిందూ సంస్కృతిని ఎటువైపు తీసుకొని వెడుతున్నారు.

వివాహ ఘట్టాలను చదివి తెలుకుంటే దంపతుల మధ్య ప్రమాదకరమైన అభిప్రాయభేదాలు ఉండవు.

విడాకులు అనే మాట ఉండదు. నా మాట నిజం నమ్మండి.ఇక విషయంలోకి వెడదాము. 

 ముఖ్య ఘట్టలాను పరిశీలిద్దాం.

వివాహము మహా పవిత్రమైన విషయం.

మంగళ స్నానములు:- కొందరు ముత్తైదువులు సిరిసంపదలతో సంతానసౌభాగ్యాలతో సంతోషంగా వుండమని ఆశ్వీరదిస్తూ, వధూవరులకు మంగళం కోరుకుంటూ వారిని పవిత్రీకరిస్తూ మంగళ స్నానములు ఆచరిస్తారు. 

మంగళాష్టకాలు:- 
నూతనవధూవరులకు మంగళం కలగాలని లక్ష్మీనారాయణులను, పార్వతీపరమేశ్వరులను, సీతారాములను, రుక్మిణీకృష్ణులు మొదలగువారిని ప్రార్ధిస్తూ, దంపతులు కాబోతున్న వీరికి ఆయురారోగ్య భోగభాగ్యాలను సత్సంతాన్ని ప్రసాదించి అనుగ్రహించమని ఎనిమిది మంగళ శ్లోకములను చదువుతారు.

బాషికం:- 
మానవుని శరీరంనందు ఇడ పింగళ సుషుమ్న అనే ప్రధాన నాడులుంటాయి. ఇవన్నీ కలిసేస్థానం భ్రూమద్యం. భౌతికమైన ఉపద్రవాలనుండి రక్షణకోసం, ఇతరత్రా దృష్టిదోషం పడకుండా వధూవరులకు ఈ స్థానంలో భాషికధారణ చేస్తారు. 
(బ్రాహ్మణులలో కొందరికి ఈ సంప్రదాయం లేదు) 

కాళ్ళు కడగడం:- 
కళ్యాణవేదికపై వధువు, వధువుతల్లితండ్రులు తూర్పుముఖముగా, వరుడు పశ్చిమముఖముగా కూర్చోగా వీరి నడుమ అడ్డుగా తెల్లటి తెరను (ఆ తెరపై స్వస్తిక్ గుర్తువుంటే మరీమంచిది) వధువుతరుపువారు ముగ్గురు ఓప్రక్కన, వరుడుతరుపువారు ఇద్దరు మరోప్రక్కన పట్టుకుంటారు.కన్యాదాత, అతనిభార్య వరుడును శ్రీనారాయణస్వరూపముగా భావించి, అల్లుని కాలుకడిగి పూజించి కన్యాదానం చేస్తారు. కన్యాదాత పెండ్లికుమారుని కాళ్ళు కడిగినప్పుడు అంతా భగవన్మయంగా భావిస్తూ శ్రీనారాయణుని పాదాలను కడుగుతున్న భావనతో ముందుగా కుడిపాదంను, తర్వాత ఎడమపాదంను ఆపై రెండు పాదములను కడగాలి.

కన్యాదానం:- 
అన్నిదానంలోనూ గొప్పదానం కన్యాదానం. కన్యాదానం చేయబోయేముందు కన్యాదాత ఇలా అంటారు -

'కన్యాం కనకసంపన్నాం కనకాభరణైర్యుతామ్  దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీషయా "

భావం:- బ్రహ్మలోకప్రాప్తికోసం నేను సువర్ణసంపదగల స్వర్ణాభరణభూషితమైన ఈ కన్యను నారాయణస్వరూపుడవైన నీకు దానం చేయబోతున్నాను.
విశ్వంభర స్సర్వభూతా స్సాక్షిణ్యః సర్వదేవతాః  
కన్యా మిమాం ప్రదాస్యామి పితృణాం తారణాయ వై 
భావం:- భగవంతుడు, పంచభూతాలు, సకలదేవతలు సాక్షులుగా నా పితృదేవతలు తరించడానికి ఈ కన్యను దానం చేయబోతున్నాను
.
కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే  
ప్రయత్కోహం ప్రయచ్చామి ధర్మకామార్ధసిద్ధయే
భావం : సర్వాలంకారశోభిత, సాధ్వి, సుశీలయిన ఈ అమ్మాయిని ధర్మార్ధకామాలనే పురుషార్ధాలు సిద్ధించడానికి నియమపూర్వకంగా ఈ బుద్ధిమంతునికి దానం చేస్తున్నాను.

నాతిచరామి:- 
వధువుతండ్రి కన్యాదానం చేస్తూ, వరునిని ఇలా మాటివ్వమని అడుగుతాడు - "నాయనా! అల్లారుముద్దుగా పెంచిన నా కుమార్తెను నీ చేతిలో పెడుతున్నాను. నీవు ఈమెను (స్నేహేన పాలయ) స్నేహంతో చూసుకోవాలి. జీవితంలో మీరిద్దరూ కలిసిమెలిసి ఎన్నో మంచిపనులు చేయాలి. సిరిసంపదలను అనుభవించాలి. సత్సంతాన్ని కనాలి. ధర్మార్ధకామాలనే పురుషార్ధాలను సంపాదించడంలో నీకు అర్ధాంగి అయిన నా కూతురును అతిక్రమించి వెళ్ళకు. అలా అతిక్రమించి వెళ్లనని నాకు మాట ఇవ్వు అని అడగగా (ఈమెను అతిక్రమించనని మాట ఇస్తున్నాను) "నాతిచరామి" అని మూడుసార్లు అల్లుడు అంటాడు. 

సమీక్షణం:- 
వధూవరుల చేతిలో జీలకర్రబెల్లమును మెత్తగా నూరి ఉండచేసి సిద్ధంగా వుంచుతారు. మంగళవాద్యాలు మ్రోగుతుండగా వేదమంత్రాలు పురోహితులు పఠిస్తుండగా దైవజ్ఞులు నిర్ణయించిన శుభముహుర్తాన వరుడు ఇష్టదైవమును ధ్యానిస్తూ వధువు నడినెత్తిన బ్రహ్మరంద్రంపైన, వధువుకూడా అదే సమయమున తన ఇష్టదైవంను ధ్యానిస్తూ వరుని నడినెత్తిన బ్రహ్మరంద్రంపై పెట్టగ నెమ్మదిగా తెరతొలగిస్తున్న ఆ సుమూహర్త సమయమున వధూవరులు ఒకరి కనుబొమ్మల మద్యభాగాన్ని ఒకరు చూసుకోవడమే సమీక్షణం. జీలకర్రబెల్లమును ఒకరితలపై ఒకరుపెట్టుకోవడంద్వారా ఒకరుమస్తాకాన్ని ఒకరు స్పృశిస్తారు. తద్వారా హస్తమస్తక సంయోగామన్న యోగక్రియ సిద్ధిస్తుంది. జీలకర్రబెల్లం ఈ రెండింటి సంయోగంవలన ఒక ధనసంజ్ఞక విద్యుత్తుశక్తి జనిస్తుంది. హస్తమస్తకసంయోగం వలన ఒకరిలోని విద్యుత్తు ఒకరిలోనికి ప్రసరించి ఇరువురి మనస్సులను ఏకంచేస్తుంది. అందుకే ఆ శుభసమయమున ఒకరి కనుబొమ్మల మద్యభాగాన్ని ఒకరు చూసుకోవడంవలన వధూవరులకిద్దరకు ఒకరిపై ఒకరికి స్థిరమైన దృష్టి కేంద్రీకరణ జరిగి ఏకత్వభావన జీవితాంతం దృఢపడివుంటుందన్నది వేదప్రమాణం. శుభక్షణాల్లో కలిసిన అనురాగామయమైన ఆ దృష్టి వారిమధ్య మానసిక అనుబంధాన్ని క్షణక్షణమునకు పెంచి చక్కటి అన్యోన్య దాంపత్యానికి నాంది కాబట్టి ఆ సమయంలో ఒకరినొకరు చూసుకోవడంలో ఏమరిపాటు పనికిరాదు. ఈ ముఖ్యవిషయంను, దీనియొక్క అద్భుతఫలితంను పెద్దలు వధూవరులకు ముందుగానే తెలిపి వారిని సంసిద్ధులు చేయవలెను 
 రెండవ భాగం 
మంగళసూత్రం:- 
సకల మంగళాలకు ఆలవాలమైన సూత్రం మంగళసూత్రం. పరిణయ బంధానికి చిహ్నం ఈ సూత్రం. ఉభయకుటుంబాల వంశాచారానికి తగినట్లు తయారుచేసిన బంగారు మాంగళ్యాలను పసుపుత్రాటితో గ్రుచ్చి మంగళదేవత గౌరీదేవి, లక్ష్మీదేవిలను ఆవాహనం చేస్తూ పూజించిన తర్వాత పురోహితుడు, పెద్దలు, ముత్తైదువలు శుభాన్ని కాంక్షిస్తూ మంచిహృదయంతో దానిని తాకుతారు. అటుపై వరుడు వధువు మెడలో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలనడుమ పెద్దల ఆశీర్వాదముల సాక్షిగా ఈ మంత్రాన్ని చెప్తూ -
"మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా 
కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతమ్ "
భావం:- నా సుఖజీవనానికి హేతువులైన ఈ సూత్రంతో మాంగల్యాన్ని నీ మెడలో కడుతున్నాను. నీవూ నూరేళ్ళు వర్ధిల్లు. అని మూడు ముళ్ళు వేస్తాడు.

తలంబ్రాలు:- 
వధూవరులు ఒకరితలపై మరొకరు పసుపుతో తడిపిన లేక తెలుపు అక్షితలను దోసిళ్ళతో పోసుకోవడంను తలంబ్రాలు అంటారు. ఇక్కడ చెప్పే మంత్రాలలో కూడా ఓ పరమార్ధముంది. వరుడు వధువు దోసిట్లో ఎండుకొబ్బరిచిప్పతో అక్షతలను పోసి నేతితో ప్రోక్షిస్తాడు. తర్వాత పురోహితుడు వరుని దోసిట్లో అదే మాదిరిగా అక్షితలను పోసి నేతితో ప్రోక్షించి వధువుదోసిలిపై వరునిదోసిలి పెట్టి ఈ మంత్రాలను చదువుతాడు -
కపిలాగ్o స్మారయన్తు, బహుదేయం చాస్తు, పుణ్యం వర్ధతామ్, శాన్తిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, స్వస్తి శివం కర్మాస్తు, కర్మసమృద్ధిరస్తు, దంపత్యో: సగ్రహే సనక్షత్రే సహా సోమేన క్రియేతాం, శాంతి రస్తు.
భావం:- కపిలవర్ణ ఆవులను స్మరించండి, అనేక దానాలను చేయండి, పుణ్యం వృద్ధిపొందాలి, శాంతి పుష్టి తుష్టి వృద్ధి కలగాలి, విఘ్నాలు తొలగిపోవాలి, ఆయుస్సు ఆరోగ్యం కలగాలి, క్షేమం మంగళం కలగాలి, సత్కర్మలు వృద్ధి పొందాలి, గ్రహాలవలన నక్షత్రాలు వలన సోమునివలన దాంపత్యం సరిగా జరగాలి. శాంతి కలగాలి. 
ఆపై వరుడు 'ప్రజామే కామ స్సమృధ్యతామ్' (నేను కోరే సంతానం సమృద్ధిగా ఉండాలి) అని అంటూ వధువుతలపై తలంబ్రాలు పోస్తాడు. అటుపై వధువు 'పశవో మే కామ స్సమృధ్యతామ్' (వారి పోషణకై నేను కోరిన పశు సమృద్ధి ఉండాలి) అని అంటూ వరునితలపై తలంబ్రాలు పోస్తుంది. 'యజ్ఞో మే కామ స్సమృధ్యతామ్' ( నేను కోరిన త్యాగం సమృద్ధిగా ఉండాలి) అని మరల వరుడు తలంబ్రాలు వేస్తాడు. ఇలా వధూవరులు బాసలు చేసుకుంటూ ఆనందంతో ముచ్చటగా మూడుసార్లు పోసుకున్నతర్వాత ఇద్దరు కలిసి 
'శ్రియో మే కామ స్సమృధ్యతామ్' (మాకు కావాల్సిన సిరిసంపదలు సమృద్ధిగా ఉండాలి) 'యశో మే కామ స్సమృధ్యతామ్' (మేము కోరిన కీర్తిప్రతిష్టలు సమృద్ధిగా ఉండాలి) అని అంటూ ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటారు. 

బ్రహ్మముడి:- 
వధువు చీరఅంచును వరుని ఉత్తరీయంఅంచును కలిపి ముడివేయడంను బ్రహ్మముడి అంటారు. పురోహితుడు ఇద్దరి కొంగులు ముడివేస్తూ ఈ మంత్రాన్ని చెప్తాడు -
'ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి: / 
ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువమ్ //
భావం:- దాంపత్యసామ్రాజ్యాన్నిఅనుభవించే మీకు, రాజైన వరుణుడు, దేవుడు బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని నిశ్చలత్వాన్ని కలగజేయాలి. 

పాణిగ్రహణం:- 
వివాహమందు ఇదీ ఓ ప్రధానఘట్టమే. వధూవరులు పరస్పరం ఒకరిచేతిని ఒకరు పట్టుకుంటారు. 'నా పెద్దల లాగానే నేను కూడా మంచి సంతానం కోసం నిన్ను పాణిగ్రహణం చేస్తున్నాను. భగుడు, అర్యముడు సవిత అనే దేవతలు నా గృహస్థాశ్రమం కోసం నిన్ను గృహిణిగా చేస్తున్నారు అని అంటూ వధువుకు తన కుడిచేతిని అందిస్తాడు. వధువు వరునిచేతిని పట్టుకోవడంలో కూడా ఓ విశేషత ఉందని పెద్దలు చెప్తుంటారు. మొదట మగపిల్లవాడు కావాలంటే వరుడి బొటనవేలు మాత్రమే వధువు పట్టుకోవాలి. చిటికినవేలు పట్టుకుంటే ప్రధమ సంతానం ఆడపిల్ల అవుతుందని అంటారు. అందుకే ఆడమగ సంతానం అభిలాషిస్తూ అన్నివేళ్ళు కలిపి పట్టుకోమని అంటుంటారు.

సప్తపది:- 
పాణిగ్రహణం చేసిన తర్వాత వరుడు వధువుతో కల్సి తూర్పుకుగాని, ఉత్తరందిశగా గాని ఏడడుగులు వేయడాన్నే సప్తపది అంటారు. దీనివలన ఇద్దరిమద్య స్నేహబంధం ఏర్పడుతుంది. ఇక్కడ వరుని వెంట వధువు వేస్తున్న ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క ప్రయోజనం వుందని వరుడు వధువుకి ఇలా వివరిస్తాడు - నీవు నా వెంట నడు. విష్ణుమూర్తి, నీవు నాతో వేసిన మొదటి అడుగు వలన అన్నాన్ని, రెండవఅడుగువలన బలాన్ని, మూడవఅడుగువలన మంచికార్యాలను, నాల్గోఅడుగువలన సౌఖ్యాన్ని, ఐదోఅడుగువలన పశుసమృద్ధిని, ఆరోఅడుగువలన రుతుసంపదలను, ఏడోఅడుగువలన ఏడుగురు హోతలను నీకు అనుగ్రహించుగాక! 
ఏడడుగులు వేసిన తర్వాత వరుడు వధువుతో మరల ఇలా అంటాడు...
                     
                  మూడవ భాగం 
సఖా సప్తపదా భవ. సఖాయౌ సప్తపదా బభూవ. సఖ్యంతే గమేయం. సఖ్యాంతే మా యోషం. సఖ్యాన్మే మా యోష్టాః సమయావ. సంకల్పావహై. సంప్రియౌ రోచిష్నూ సుమనస్యమానౌ ఇష మూర్జ మభి సంవసానౌ సం నౌ మనాంసి సంవ్రతా సముచిత్తాన్యకరమ్.
భావం:- నాతో ఏడడుగులు నడిచి నాకు మంచి స్నేహితురాలివి కావాలి. మనమిద్దరం కలిసి ఏడడుగులు నడిస్తే స్నేహితులమౌతాం. అప్పుడు నేను నీ స్నేహాన్ని ప్రేమను పొందుతాను. నీ స్నేహన్నుంచి ఎన్నటికి వియోగం పొందను. నా స్నేహంనుంచి నీవెన్నడూ వియోగం పొందకు. పరస్పరం ప్రేమతో, అనుకూల దాంపత్యంతో ప్రకాశిస్తూ, నిండు మనస్సుతో ఆహారాన్ని, బలాన్ని పొందుతూ కలిసి వుందాం. కలిసి ఆలోచించుకుందాం. మన మనస్సులు కలిసేలా నడుచుకుందాం. అలాగే అన్ని నియమాల్లోను కలిసి ఉంటూ నడుచుకుందాం.

అరుంధతీ నక్షత్రం:- 
వివాహం జరిగిన తర్వాత వధూవరులకు ధ్రువనక్షత్రమును, తర్వాత అరుంధతీ నక్షత్రమును పురోహితుడు చూపించి నమస్కారం చేయమని చెప్తాడు. ఎందుకంటే వారు ధ్రువనక్షత్రంలాగా నిశ్చలమైన మనస్థత్వాలతో స్థిరంగా వుండాలని, వధువు అరుంధతిలా మహా పతివ్రత కావాలనే ఉద్దేశ్యం ఇందులో వుంది.

వధూవరులబాసలు:- 
మొత్తం వివాహ ఘట్టంలో వధూవరులమద్య హైందవ జీవనానికి ప్రయోజనం కలిగించే బాసలు ఎన్నో వుంటాయి. అందులో కొన్ని..
వరుడు ఇలా కోరుకుంటాడు - 
లోకోపకార స్వభావంగల అగ్నిదేవుడు ఈ వధువుకు వివాహం అయిన తర్వాత పుట్టింట మీద మమకారం తగ్గించి అత్తింటి మీద అభిమానం కలదానిగా చేయాలి. బ్రహ్మదేవుడు మా ఇద్దరికీ సకలసంపదలను ఇచ్చి దీర్ఘాయుష్యాన్ని అనుగ్రహించాలి. సుమంగళిగా, సౌభాగ్యవతిగా, దీర్ఘాయుష్యంతో ఉండే ఈ వధువును ఇంకా ఇంకా సుమంగళి, సౌభాగ్యవతి, దీర్ఘాష్మంతురాలు కావాలని పెద్దలైన మీరందరూ ఆశ్వీరదించి మీ మీ ఇండ్లకు వెళ్ళండి అని కోరుతాడు.
వధువు ఇలా కోరుకుంటుంది - 
నిన్ను నా అభిప్రాయంలను ఎరిగినవాణ్నిగాను, మంచి సంస్కారంతో పుట్టినవాడిగాను, మంచినియమాలతో నిజాయితితో పెంచుకున్న తేజస్సుగలవానిగా నేను గ్రహించాను. సంతానాభిలాషగల నీవు నాతో సంతానాన్ని కని, ధర్మంగా సిరిసంపదలను సంపాదించి సుఖంగా జీవితాన్ని గడపాలి అని కోరుకుంటుంది.
అటుపై వధూవరులిద్దరు ఇలా కోరుకుంటారు - 
సమంజంతు విశ్వే దేవా స్సమాపో హృదయాని నౌ / 
సం మాతరిశ్వా సం ధాతా సముదేష్ట్రీ దిదేష్టు నౌ //
భావం:- విశ్వదేవులు, పవిత్రజలాలు, వాయువు, బ్రహ్మ మన మనస్సులను ఎన్నటికీ స్నేహంతో కలిసిపోయేటట్లు చేయాలి. వాగాధిదేవత సరస్వతి మనమెప్పుడు ప్రేమతో అభిమానంతో అనుకూలంగా మాట్లాడుకొనేటట్లు అనుగ్రహించాలి అని కోరుకోగా ...పెద్దలు ఇలా ఆశ్వీరదిస్తారు -
అభివర్ధతాం పయసాభిరాష్ట్రేణ వర్ధతామ్ / 
రయ్యా సహస్రపోషసే మౌస్తా మనపేక్షితౌ //
భావం:- ఈ వధువు పాడిపంటలతోను, ఇండ్లతోను, భూములతోను, సంపదతోనూ, సకలసౌఖ్యలతో తులతూగుతూ మాకందరికీ అభివృద్ధిని కలిగించాలి. ఈ దంపతులు సకల సంపదలతో, సర్వ సమృద్ధి లతో దేనికీ ఇతరులపై ఆధారపడకుండా ఉండాలి.
పుత్రిణేమా కుమారిణా విశ్వమాయుర్వ్యశ్నుతమ్ / 
ఉభా హిరణ్యపేశసా వీతిహోత్రా కృతద్వసూ //
భావం:- పదహారువన్నెల బంగారంలాగా పచ్చగా ప్రకాశిస్తున్న ఈ కొత్తదంపతులు కొడుకులు, కూతుళ్ళతో ఈ సమాజంలో మంచిపనులు చేస్తూ, సిరిసంపదలనుభవిస్తూ దీర్ఘాయుష్యాన్ని పొందాలి.

వధూవరులకు కొన్ని సూచనలు -
పెళ్లన్నది నూరేళ్ళ పంట అని, ఏడేడు జన్మలబందమని పెద్దలంటారు. ఇటువంటి బందాన్ని ఆనందంగా అన్యోన్యతగా ఉండాలనుకుంటే దంపతులమద్య చక్కటి అవగాహన, పరస్పర నమ్మకం, సానుకూలదృక్పదం తప్పనిసరిగా ఉండాలి. 
అనుకోనిసందర్భాలయందు ఏ పరిస్థితులకారణంగానైనా ఇద్దరిమద్య కోపతాపాలు, పట్టింపులు చోటుచేసుకున్నప్పుడు మనది జీవితకాల శాశ్వతబందమన్న సత్యాన్ని మరువక కాస్త సర్దుకుపోవడం ఇద్దరికీ తప్పనిసరి.
జీవితరధానికి ఇద్దరు రెండుచక్రాలు. కనుక దంపతులు వారివారి సమస్యలను, మాటపట్టింపులను అనురాగంతో అవగాహనతో వారే పరిష్కరించుకోవడం ఉత్తమం.
భిన్నకుటుంబంలో పుట్టి విభిన్న వాతావరణంలో పెరిగిన వధువు, వరుడు వివాహం ద్వారా దగ్గరౌతారు. తమని ఒకటిచేసిన వివాహబంద విలువను గ్రహించి వారివారి భావనలను అలవాట్లును అర్ధవంతంగా ఆరోగ్యవంతంగా ఒకటిగా చేసుకొని నడుచుకోవాలి.
భర్తకు సంబందించిన అన్ని బాధ్యతలందు భార్య పాలుపంచుకోవాలి. భర్తను అనుసరిస్తూ, అతనిని అర్ధంచేసుకుంటూ మనస్సులో మనసై, తనువులో తనువై ఆనందంగా ప్రవర్తించాలి. మృదుమధురంగా మనుగడ సాగిస్తూ మగని మన్నన పొందగలగాలి. కుటుంబగౌరవప్రతిష్టలు ఇల్లాలిపైనే ఆధారపడివుంటుంది కాబట్టి భర్త కుటుంబంను భార్యగా, కోడలుగా, వదినగా, తల్లిగా చక్కగా నేర్పుగా ఇంటిలో పెద్దల సలహాలతో నిర్వహించగలగాలి. అత్తవారింట్లో అత్తమామయ్యలను, ఆడబిడ్డలను, తోడికోడళ్ళను, బావామరుదులను, ప్రేమగా చక్కగా చూసుకుంటూ ఇంటికి దీపంలా వెలుగొందాలి.
కుటుంబఅభివృద్ధిని, అందరిహితంను కోరే భర్త ఎప్పుడూ తన భార్యను తనతో సమానంగానే భావించాలి. అందరినీ వదిలి తనచేయి పట్టుకొని ఎంతో నమ్మకంతో సహధర్మచారిణిగా తన ఇంటికి వచ్చిందన్న భావనతో భార్యను ప్రేమగా అర్ధంచేసుకుంటూ ఆమెను చక్కగా చూసుకోవాల్సిన భాద్యత భర్తదే.           స్వస్తి

తెలిసిన విషయాలే ఐనప్పటికీ ఉదయభాస్కరశర్మగారు అందరికీ అవగాహన కలిగించేటందుకు ఈ వివాహమునకు సంబంధించిన విషయాలను సమగ్రంగా వివరణ సమర్పించినందుకు ఆనందిస్తూ, ఆ జగన్మాత వారికి అండగా ఉండి హైందవ సంస్కృతీసంప్రదాయ పరిరక్షణలో వారు చేయుచున్న కృషికి తగిన ఫలాన్ని తప్పక ప్రసాదించవలెనని ఆశిస్తున్నాను. 
               
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.