గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఫిబ్రవరి 2011, మంగళవారం

విమల కావ్య దాస! వేంకటేశ! (ఆరింటిలో ఐదవది.)

పాఠకావతంసులారా! కవిసమ్రాట్టు  శ్రీ విశ్వనాథ సత్యనారాణ  యొక్క శ్రీమద్రామాయణ కల్పవృక్షమును ఆపోసన పట్టి కల్పవృక్షం నీడన తలదాచుకొనుచున్న కవివతంసులైన శ్రీమాన్ బులుసు వేకటేశ్వర్లు కవితా సంకలనమైన మువ్వ లో గల కవితలను కవితామృత ఖండికలనఁ దగి యున్నవి. 
నిరంకుశాః కవయః అన్నది ఎంతటి సత్యమో వీరి రచనయైన విమల కావ్యదాస! వేంకటేశ! మకుటముతో గల పద్య త్రింశత్తు గమనించినట్లైతే మన కవగతము కాక మానదు.
పాఠకులు ఆనంద పరవశు లగుదు రనే ఉద్దేశ్యంతో ఆరు భాగాలుగా మీ కందిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇక చదివి మీరే చూడండి. చూచి మీ ఆనందాన్ని కవివతంసులకు మీ అపురూపమైన వ్యాఖ్య ద్వారా తెలియఁ జేయండి.
ఇక చదవండి.

ఒక సదాశయమ్ము ప్రకటమై యుండ్య్ట
కేండ్లుపూండ్లు పట్టు నెచట నైన.
అదియె దుష్ప్రవృత్తి వ్యాపించి నిమిషాన
విమల కావ్య దాస వేంకటేశ. ౨౧.
జ్ఞాన మూర్తులైన సంస్కర్తలెల్ల పో
రాడి తెచ్చినట్టి యమృత ఫలము
లనుభవింప లేని యర్భకుల్ పుట్టిరి.
విమల కావ్య దాస వేంకటేశ. ౨౨.
మతము కంటె గొప్ప మనవత్వ మిలను
గతము లంటె నేటి గాధ ఘనము.
మతము గతము లోని మంచియే సంస్కృతి.
విమల కావ్య దాస వేంకటేశ. ౨౩.
సుతులు చదువు కొఱకు చుట్టాలు ఋణముకై
తరుణి క్రొత్త నగలు దాల్చు కొఱకు
పైరు లెరువు కొఱకు బంధింత్రు రైతును.
విమల కావ్య దాస వేంకటేశ. ౨౪.
ప్రజల సొమ్ము తినెడి పందికొక్కుల ముందు
తలను వంచి రైతు నిలవ బడియె.
బంటు ముందు రాజు భయపడె నౌరౌర.
విమల కావ్య దాస వేంకటేశ. ౨౫.

(త్వరలో ఆరవ భాగం మీ ముందుంటుంది. నమస్తే)
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
ఎందరొ మహాను భావులు తమ ప్రాణాలొడ్డి మనకు సంపాదించి పెట్టిన సౌకర్యాలను దుర్విని యోగం చేసుకుని వెఱ్రి తలలు వేస్తున్న ప్రజల వికృత రూపాన్ని చక్కగా వివరించారు. ఇరు వైపులా పదునైన కలం నుంచి కుమ్మరించిన ఇంతటి మహత్తర మైన రచనల్ని ప్రశం సించ గల శక్తి నా చిన్న కలానికి ఎక్కడుంది ? చదివి ఆనందించ గల అదృష్టం లభించింది. కృతజ్ఞతలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.