గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, ఫిబ్రవరి 2010, గురువారం

"వేణు గోప" అనే మకుటంతో ఉన్న ఈ చంపకంలో ఎన్ని పద్య సుమాలున్నాయంటారు?

http://images.exoticindiaart.com/panels/krishna_as_venugopal_wf94.jpg
कृष्णं वंदे जगद्गुरुम 
ప్రియ సాహితీ బంధువులారా! మీ సాహితీ పిపాసను అభినందిస్తున్నాను.
కొంత కాలంగా సాహితీ పరంగా మన మధ్య అంతరం పెరగడానికి కారణం నాయెడ క్షంతవ్యమైన కుటుంబ కారణాల వలన ఆవహించిన  నా నిర్లిప్తతయే.  సరే ఇప్పుడైనా మీ ముందుకు రాగలిగినట్లు ఆపరమాత్మ చేసినందుకు ధన్యుఁడను.
ఆ పరమాత్మ వేణు గోపుని  ఈ క్రింది విధంగా  ఆ సరస్వతీ మాత కటాక్షీంచి, ప్రార్థింపఁజేసింది.
 నను కనుమా! ప్రభూ! కృపను, నా కను పాపల తృష్ణ తీర గా;
నిను కనుచున్; సదా మనము నీ గుణ చింతన మానకుండ కూ
ర్మిని వినుచున్; మహా మహిత! మేదిని గావుమ! మాన్య! నన్ను తీ
రున మనగన్. హరీ! విపుల రుగ్మ నివారక! వేణు గోపకా!
ఈ చంపక మాలలో ఎన్నెన్ని ఏయే పద్యాలు నిబిడీకృతమై యున్నాయో మీరిప్పటికే గ్రహించి ఉంటారు.
మీరు గుర్తించినవి వేరు పరచి, మీ వ్యాఖ్యద్వారా నాకు తెలియఁ జేసి, గుణ దోషాలతో పాటు, మంచి అభ్యుదయ స్పోరకమైన సూచనలను కూడా ఇవ్వ వలసినదిగా మనసారా కోరుకొంటున్నాను.
పద్యాలు వ్రాయండి. పద్యాన్ని పునరుద్ధరించండి, అని చెప్పే చాలా మంది సన్మిత్రుల మాటలే నాకు ఉత్తేజకాలు.
దయతో మీరూ అనుసరించ గలరని నా విశ్వాసం.
జైహింద్.
Print this post

3 comments:

కంది శంకరయ్య చెప్పారు...

రామకృష్ణ గారూ,
నాకు తెలిసినంతవరకు ఇందులో రెండు పద్యాలు (కందం, తేటగీతి) ఉన్నాయి. అవి ఇవి .......
కం. కనుమా ప్రభూ కృపను నా
కనుపాపల తృష్ణ తీరగా నిను కనుచున్
వినుచున్ మహామహిత మే
దిని గావుమ మాన్య నన్ను తీరున మనగన్.
తే.గీ. కృపను నా కనుపాపల తృష్ణ తీర
మనము నీ గుణచింతన మానకుండ
మహిత మేదిని గావుమ మాన్య నన్ను
విపుల రుగ్మ నివారక వేణుగోప.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ప్రియ సాహితీ బంధూ!శ్రీ శంకరయ్య గారూ! మీ సాహితీ ప్రియత్వానికి అభినందనలు తెలియఁ జేస్తూ, నా సంతోషాన్ని వ్యక్తమం చేస్తున్నాను.

ఐతే మీరన్న విధంగా కందము, తేటగీతి తో పాటు మరొక కందమే కాదు వాటిని నాలుగు కందాలుగా మనం చూప వచ్చు. అలాగే నాలుగు తేటగీతులను కూడా ప్రారంభం ఒకటవ పాదంతో ఒకటి, రెండవ పాదంతో ఒకటి, మూడవ పాదంతో ఒకటి నాల్గవ పాదంతో ఒకటి తేట గీతులు మనం చూప వచ్చు.

నను కనుమా! ప్రభూ! కృపను, నా కను పాపల తృష్ణ తీర గా;
నిను కనుచున్; సదా మనము నీ గుణ చింతన మానకుండ కూ
ర్మిని వినుచున్; మహా మహిత! మేదిని గావుమ! మాన్య! నన్ను తీ
రున మనగన్. హరీ! విపుల రుగ్మ నివారక! వేణు గోపకా!

కనుచున్; సదా మనము నీ
గుణ చింతన మానకుండ కూర్మిని వినుచున్;
మనగన్. హరీ! విపుల రు
గ్మ నివారక! వేణు గోపకా! నను కనుమా!

వినుచున్ మహామహిత మే
దిని గావుమ మాన్య నన్ను తీరున మనగన్.
కనుమా ప్రభూ కృపను నా
కనుపాపల తృష్ణ తీరగా నిను కనుచున్

మనగన్. హరీ! విపుల రు
గ్మ నివారక! వేణు గోపకా! నను కనుమా!
కనుచున్; సదా మనము నీ
గుణ చింతన మానకుండ కూర్మిని వినుచున్;

కనుచున్; సదా మనము నీ
గుణ చింతన మానకుండ కూర్మిని వినుచున్;
మనగన్. హరీ! విపుల రు
గ్మ నివారక! వేణు గోపకా! నను కనుమా!

వినుచున్ మహామహిత మే
దిని గావుమ మాన్య నన్ను తీరున మనగన్.
కనుమా ప్రభూ కృపను నా
కనుపాపల తృష్ణ తీరగా నిను కనుచున్

మనగన్. హరీ! విపుల రు
గ్మ నివారక! వేణు గోపకా! నను కనుమా!
కనుచున్; సదా మనము నీ
గుణ చింతన మానకుండ కూర్మిని వినుచున్;

కృపను, నా కను పాపల తృష్ణ తీర;
మనము నీ గుణ చింతన మానకుండ
మహిత! మేదిని గావుమ! మాన్య! నన్ను
విపుల రుగ్మ నివారక! వేణు గోప!

మనము నీ గుణ చింతన మానకుండ
మహిత! మేదిని గావుమ! మాన్య! నన్ను
విపుల రుగ్మ నివారక! వేణు గోప!
కృపను, నా కను పాపల తృష్ణ తీర;

మహిత! మేదిని గావుమ! మాన్య! నన్ను
విపుల రుగ్మ నివారక! వేణు గోప!
కృపను, నా కను పాపల తృష్ణ తీర;
మనము నీ గుణ చింతన మానకుండ

మహిత! మేదిని గావుమ! మాన్య! నన్ను
విపుల రుగ్మ నివారక! వేణు గోప!
కృపను, నా కను పాపల తృష్ణ తీర;
మనము నీ గుణ చింతన మానకుండ

విపుల రుగ్మ నివారక! వేణు గోప!
కృపను, నా కను పాపల తృష్ణ తీర;
మనము నీ గుణ చింతన మానకుండ
మహిత! మేదిని గావుమ! మాన్య! నన్ను

చూచారు కదా నా భవన. ఐతే కందాలు రెండు ధర్మమే కాని తేట గీతులు మాత్రం తమాషాకేనండోయ్.
ఇట్లు
భవదీయుఁడు,
చింతా రామ కృష్ణా రావు.

Sandeep P చెప్పారు...

గురుతుల్యులైన! రామకృష్ణగారు! మీ పద్యప్రయోగాలను వర్ణించ నాకు శక్యమౌన!

ఉ:-
భేషుగ పద్యమల్లితిరి పెక్కులనందున దాచియుంచగన్
భాషను అభ్యసించి తమ భావములెల్లను చక్కనుండగన్
వ్రాసెడి మీకు వందనము! పద్యములో పది పద్యముల్ గనన్
చాషము మేనుపైయలరు చక్కని రంగుల వోలెనుండయా!

ఆ:-
రాష్ట్రపక్షి తలపు రప్పించు చందాన
వ్రాసినారు తమరు పద్యములను!
తెలుగునాడు మెచ్చు తేటకైతలనల్లు
మిమ్ము దేశమాత మెచ్చి మురియు!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.