గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, జులై 2015, సోమవారం

దశ దానములు చేయుట వలన కలిగెడి ఫలములు. మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
ఏయే దానం చేయుటవల్ల ఎటువంటి ఫలం వస్తుందో తెలుసుకుందాం.
గోదాన ఫలము.
గోవు అంగములందు పదునాలుగులోకాలు ఉన్నాయి. బాగా పాలు ఇచ్చేది, మంచి
వయసులోనున్నది, దూడతోకూడుకున్నది అయిన ఆవును
బంగారు కొమ్ములు, వెండి డెక్కలు,కంచు మూపురము, రాగి తోక, నూతన
వస్త్రములతో అలంకరించి, ఆ ఆవుతోపాటు పాలు పితుక్కునే పాత్రను ఇస్తూ, ఫల, దక్షిణ, తాంబూలములతో యథావిధిగా దానం చెయ్యాలి. గోవుకు కనీసం ఆరు నెలల గ్రాసాన్ని కూడా ఇవ్వాలి.
ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై, దాతకు స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాడు.
భూదాన ఫలము.
కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా శూన్యంలోకి దొర్లిపోతూంటే.. శ్రీహరి
వరాహావతారం ధరించి, ఆ భూమిని తన దంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు.
సుక్షేత్రము, సమస్త సస్యసమృద్ధము అయిన భూమిని దానం చేయుటచేత అనంత
పుణ్యఫలం లభిస్తుంది. ఈ దానంతో శంకరుడు సంప్రీతుడై., దాతకు శివలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
తిలదాన ఫలము.
తిలలు అంటే నువ్వులు.శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం
చెయ్యడంవలన సమస్త పాపములు నశిస్తాయి.ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై., దాతకు విష్ణులోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
హిరణ్య (సువర్ణ)దాన ఫలము.
హిరణ్యము అంటే బంగారం.బ్రహ్మదేవుని గర్భం నుండి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వలన, దాత సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు. ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై., దాతకు అగ్నిలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
ఆజ్య(నెయ్యి)దాన ఫలము.
ఆజ్యము అంటే ఆవునెయ్యి. ఈనెయ్యి కామధేనువు పాలనుండి ఉద్భవించింది. ఈ నెయ్యినే యఙ్ఞ, యాగాదులందు సకల దేవతలకుఆహారంగా హవిస్సు రూపంలో
సమర్పిస్తారు. అట్టి ఆజ్యాన్ని దానం చేయడం వలన సకల యఙ్ఞఫలం లభిస్తుంది.ఈ దానంతో మహేంద్రుడు సంప్రీతుడై., దాతకు ఇంద్రలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
వస్త్రదాన ఫలము.
శీతోష్ణములనుండి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రము కేవలం అలంకారినికే కాకుండా, మాననాన్ని కూడా కాపాడుతుంది. అట్టి వస్త్రాలను దానం చేయడం వలన,
సర్వ దేవతలు సంతోషించి,సకల శుభాలు కలుగాలని దాతను దీవిస్తారు.
ధాన్య దాన ఫలము.
జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యము. జీవిఉత్పత్తికి ఈ ధాన్యమే కారణము. అట్టి
ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయుట వలన, సకల దిక్పాలకులు సంతృప్తిచెంది, దాతకు ఇహలోకమందు సకలసౌఖ్యము అనుగ్రహించి, పరమందు దిక్పాలకలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు.
గుడ(బెల్లం)దాన ఫలము.
రుచులలో మధురమైనది బెల్లం. ఈ బెల్లం చెరుకురసం నుండి పుట్టింది. ఈ బెల్లం అంటే వినాయకునకు, శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టం. ఈ దానంతో లక్ష్మీ, గణపతులు
సంప్రీతులై., దాతకు అఖండ విజయాలను, అనంత సంపదలను అనుగ్రహిస్తారు.
రజత(వెండి)దాన ఫలము.
అగ్నిదేవుని కన్నీటి నుండి ఉత్పన్నమైనది ఈ వెండి.ఈ దానంతో శివ,కేశవులు., పితృదేవతలు సంప్రీతులై.,దాతకు సర్వసంపదలను,వంశాభివృద్ధిని అనుగ్రహిస్తారు.
లవణ(ఉప్పు)దాన ఫలము. 
రుచులలో ఉత్తమమైనది ఉప్పు. ఈదానంతో మృత్యుదేవత సంప్రీతుడై.,దాతకు ఆయుర్దాయమును, బలాన్ని,ఆనందాన్ని అనుగ్రహిస్తాడు.
ఇవి దశ దానాలు. ఈ దానాలను గ్రహణ సమయాల్లో, పర్వదినాల్లో, సంక్రమణాల్లో
చేస్తే దాని ఫలం పదింతలు అవుతుంది. ఈ దానాలను భక్తి శ్రద్ధలతో చేయాలిగాని, దాన గ్రహీతకు ఏదో ఉపకారం చేస్తున్నామనే భావనతో చేయరాదు. అలా చేస్తే ఫలితం శూన్యం అనే నిజాన్ని గుర్తించి మరీ దానం చేయవలయును.‎ 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఏఏ దానముల వలన ఎటువంటి ఫలితములు లభిస్తాయో చక్కగా వివరించి నందుకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.