గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, సెప్టెంబర్ 2026, గురువారం

రేనాటి సూరీడు...చతుర్థాశ్వాసము.

రేనాటి సూరీడు...చతుర్థాశ్వాసము.
లఘుకందము.  
రుణను మముఁ గను నరహరి!
నిరుపమ గుణగణుఁడ! మదిని నిలువుము సతమున్,
చరణములను కొలిచెదనయ
పరిపరి ననుఁ గనుచును శుభ ఫలదుఁడవగుమా.         1.
నరసింహరెడ్డిని పట్టుటకు ఆంగ్లేయుల ప్రయత్నాలు.
.  నరసింహరెడ్డి ప్రభువై,
నరులకెపుడు మేలుచేయు నాయకుఁడతఁడే,
పరపరిపాలనఁ బాపఁగ
నిరతము కృషిచేయునట్టి నేర్పరి యతఁడే.     2.
గీ.  ఆంగ్లపాలకుల్ బహుమతులందఁజేయు
ప్రకటనంబును జేసినన్ బ్రజల మదుల
దేవుఁడైనట్టి నరసింహుఁ దెలిసి  కూడ
రాడొకండను నాతని  జాడఁ దెలుప.              3.
గీ.  రుద్రవరము తాసీల్దారు  ద్రోహియైన 
శ్రీనివాసులరెడ్డి నృసింహరెడ్డి
నెటులనైననుఁ బట్టింప నెత్తువేసి,
రోశిరెడ్డిచే రప్పించె మోసగించి.          4.
ఎల్లమ్మ జాతరలో రెడ్డిని చంపు ప్రయత్నము.
సీ.  ఎల్లమ్మ జాతర కెటులైన రమ్మని దువ్వూరు రప్పింప, ద్రోహబుద్ధి
నెఱుఁగ జాలక, రెడ్డి హితుఁడె పిలిచెనంచు వచ్చినాఁ డచటికి పండుగనుచు,
మోసంబు గ్రహియించి గోసాయి వెంకన్న హెచ్చరికను చేసె, వచ్చియుండి
రిచ్చట శత్రువుల్ మచ్చికతో నిన్ను మట్టుఁ బెట్టగను ప్రమాదమంచు
గీ.  పలికె, వెంటనే రెడ్డి తా మెలకువొప్ప
మసలి తప్పించుకొనినాడు మరు నిమిషము
నందె, "దైవంబు తోడున్న మందమతియు
నాపదలనుండి రక్షణనందఁగలఁడు".                     5.
అన్న మల్లన్న రెడ్డికి చేసిన ద్రోహము.
శా.  దైవంబెంతగ తోడుగా నిలిచినన్ దాయాదులే శత్రులై
క్రేవన్ నిల్చి, సతంబు ద్రోహమతులై కీడున్ ధరన్ గొల్పుచో,
నే వంకన్ గ్రహియింప సాధ్యమగు? నింకెవ్వండు దిక్కౌను? దు
ర్భావుండైన నృసింహునన్న యగు దౌర్భాగ్యుండు మల్లన్నయే.       6.
పం.చా.  మహాత్ముఁడైన యానృసింహు మాన్యునెన్ని వారికిన్
సహాయమింతఁ జేయకుండ సన్నుతాత్ముఁడైన యా
మహమ్మదైన యిబ్రహీంను, మాన్యుఁడైన కందనోల్
మహాత్ముఁడౌ నవాబు గార్ని మల్లరెడ్డి కట్టెనే.                  7.
.  ఇంటిలోని శత్రు నీశుఁడున్ గన లేడు
పాలవంటి కులము ప్రగతి నణచు
"నింటిలోనివాఁడె యిల శత్రువైనచో
గుట్టు రట్టు కా కదెట్టులుండు?"                  8.
.  మల్లన తెలిపెను సర్వము,
గుల్లయి కులమంత ధృతిని కోల్పడ, నొస్సం
బల్లిదుని బంధుల యునికిఁ,
దెల్లదొరల మాట విని, మదించినవాఁడై.          9.
ప్రమితాక్షర వృత్తము.(స జ స స.  యతి-9)
నరసింహరెడ్డికి ననంత ముదం
బరయంగఁ బుత్రుపయి, భార్యపయిన్,
హరణంబుఁ జేయుఁడయ! నాతిఁ గొనన్
వరపుత్రుఁ జేకొనఁగ వత్తురయా!                 10.
రెడ్డి భార్యను, పుత్రుని ఆంగ్లేయులు బంధించుట.
.  మల్లన పలుకులు విని, తమ 
యుల్లంబులు పొంగగను మహోత్తమమార్గం
బెల్లి యొనర్చుదు మీపని
తెల్లంబయె ననుచు బయలుదేరిరి వారల్.        11.
.  నరసింహుని యర్థాంగిని,
వరమగు తత్ పుత్రకునిని బంధించిరి యా
దురితులు లాల్ బంగ్లాలో,
నరసింహుని జాడ కొఱ, కనర్థ మొదవదే?                12.
.  తప్పును చేసినా రకట, దండన తప్పదు వారి కెత్తరిన్,
ముప్పు ఘటిల్లు వారలకుఁ, బూజ్యులు స్త్రీలును, చిన్నపిల్లలున్,
గొప్పగ తెచ్చినామని యకుంఠిత రీతిని చెప్పుచుండి రే
తిప్పలు కల్గనుండెనొ, మతిన్ గనఁ జూచిన భీతిఁ గల్గెడున్.       13.
ఒడ్డె ఓబయ్య రెడ్డి భార్యాపుత్రుల అపహరణవార్తను రెడ్డికి తెలుపుట.
.  రయమున వచ్చి యోబయ, దొరా! దొరసుబ్బయ నమ్మగార్ని,  ని
ర్దయను బ్రిటిష్షువారు కనరాని ప్రదేశమునందు దాచినా
రయ! కనుగొంటినా స్థలి, ధరన్ కడపన్ గల లాలుబంగ్ల, తి
ప్పయ వచియించెనద్ది యసిఁ బట్టుచు కుత్తుకపైనఁ బెట్టఁగాన్.   14.
తన భార్యను కుమారుని రెడ్డి రక్షించుకొనుట.
గీ.  భార్యసుబ్బమ్మ, సుతుఁడు సుబ్బయ్య యిటుల
బంది యగుటను గ్రహియించి బాధపడుచు,
నరసరెడ్డి చేయ దగిన దరసి, త్వరగ
చేరె లాల్ బంగ్ల  ఖడ్గమున్ జేతఁ బట్టి.                     15.
మంజుభాషిణి వృత్తము. (స జ స జ గ.  యతి 9.)
నరసింహుఁ డుగ్రుఁడయి నా మహోగ్రమౌ
కరవాల ఘాతమున ఖండనంబుగాఁ
నరుకంగ నుంటి మిము నాకునడ్డుగా
నరుదెంచువాని ననె నాంగ్ల జాతితోన్.             16.
.  ఒక్కఁడు రాడు ముందునకు నొక్కఁడు కూడను మారుపల్కఁ డే
యొక్కఁడు కూడ ధైర్యముగ నుంటిని నేనిట, రా యనండు, పెం
పెక్క నృసింహరెడ్డిపయి నీప్సితమున్ బ్రకటించువార లా
టక్కరి యాంగ్లమూర్ఖుల కొడంబడి యుండుట చేసి పల్కరే.     17.
.  తన భార్యను, తన పుత్రుని
తనతోఁ గొనిపోయె నృహరి, ధైర్యాత్ముండై,
మనమున ధైర్యము కలిగిన
మనకెయ్య దసాధ్యమగు? సమస్తము శుభమౌన్.           18.
రెడ్డి సహచరులతో అజ్ఞాతముననుండుట.
.  నరసింహుండును మిత్రులున్ జనిరి యజ్ఞాతంబుగా నుండగాన్,
వరకార్యంబులు సాధ్యమౌనె విలసద్భావంబుతో నిత్యమున్
వరలన్ నేర్వక యున్నచో, కనుకనే వారట్టులజ్ఞాతమం
దరయంజాలని మార్గమున్ గొనుట మేధాశక్తితో నిత్తరిన్.         19.
.  ముండ్లపాడు చేరి ముందునకును సాగి
కొండ కోనలందు గుప్తముగను
దాగుకొనుచు, వారు వేగులమూలాన
జరుగుచున్నదెఱుఁగుచరుల జాడ.                       20.
రెడ్డి జాడకై ఆంగ్లేయులు చేయుచున్న ప్రయత్నము.
పరాజిత వృత్తము.(న న ర స వ.  యతి 9.)
సరిగ నరసరెడ్డి జాడనెఱుంగమిన్,
దెరువుఁ గనఁగఁ జొచ్చి దీక్షను బూనుచున్,
బరిసరముల లోని వారిని తెల్పుఁడం
చరయ నడుగుచుండి రాంగ్లులు బేలగాన్.    21. 
నోజ్ఞ వృత్తము.(న జ జ భ ర.  యతి 10.)
తెలిసియుఁ జెప్పరు భక్తిఁ దేలుచు నొక్కరున్,
దెలుఁగు ప్రజల్ ధరపైన దీపిత ధర్మమే,
ఫలితముశూన్యమె కాగ, భావనఁ జేసిరా
కలుషితులాంగ్లులు ఘోర కార్యముఁ బూనిరే.            22.
.  నరసింహారెడ్డి యెపుడుఁ
బరహితమే కోరుచుండు, ప్రజల సుఖమునే
నిరతంబాశించు కతన
చెరఁబట్టినఁ జాలు ప్రజను, చేరఁగ వచ్చున్.            23.
గీ. అనుచు నాంగ్లేయ దౌర్భాగ్యులమితముగను
ప్రజలఁబట్టి వేధించుచున్, బ్రాణములను
తీయుటన్ జేయుచుండిరి, తెలియఁ జేయు    
టకని నరసింహరెడ్డికిన్  బ్రకటితమవ.            24.
ప్రియకాంత వృత్తము.(న య న య స గ.  యతి 11.)
ప్రజలను బాధించుటయె,  స్వభావం బనున ట్లా
కుజనులు దుర్వారఫణితి ఘోరంబులు చేయన్,
నిజమగు భక్తిన్ గలుగుచు నీతిన్ సతతంబున్
ప్రజలిల రెడ్డిన్ దెలుపక బాధల్ పడిరయ్యో.         25.
శా.  అజ్ఞాతంబున నున్న రెడ్డి యుని కెట్లైనన్ గ్రహింపంగ నా
యజ్ఞానుల్ రచియించు నా పథకముల్ వ్యర్థంబులై, వారికిన్
సుజ్ఞేయంబుగ నాయె నాంధ్రుల జగ చ్ఛోభాయమానంపు స
ద్విజ్ఞానంబు, సుధీమహత్వము జగద్విఖ్యాతమం చత్తరిన్.  26.
రెడ్డిని అజ్ఞాతం నుండి బైటకు లాగు ప్రయత్నములో కెప్టెన్ నార్టన్ నొస్సం కోటను కూల్చివేయుట.
.  కూలిచివేసె నొస్సమున కోటను నార్టను క్రూర చిత్తుఁడై,
పేలిచి యగ్నిగోళములు, భీతిల నా పురవాసులెల్లరున్,
బేలినశబ్దమా యడవి వేలుపుగాఁ గలనర్సరెడ్డికిన్
లీలగ మానసంబునకు లేశము తోచెను బాధనింపుచున్.      27.
గీ.  వేగులరుదెంచి చెప్పిరి పేల్చి రగ్ని
గోళములతోడ నొస్సాము కోటననుచు
నార్టననువాఁడు సేనకు నాయకుఁడయి
యనుచు నరసింహరెడ్డికి నడవిలోన.                    28.
గీ.  కోటనే కూల్చివేసినన్ గోరినట్లు
రెడ్డి జాడ కానక వారు  పడ్డకష్ట
మంతయున్ మట్టిపాలాయెనంచు మిగుల
బాధనేపొందిరవ్వా రభాగ్యులగుచు.                     29.
వంశపత్రపతిత వృత్తము.(భ  ర న భ న వ.  యతి 11.)
ఐనను గాని వానిఁ గనగా ననితరమగు నే
దైనను నున్నదా యనుచుఁ బాయక వెతకు తరిన్
కానగనయ్యె వారి మది పొంగగఁ వెరవు మదిన్,
దీనదయాళువైన హరి యేది తలచునొ కదా?           30.
గీ.  ఇంటి గుట్టును తెలిపిన తుంటరి యగు
నన్న మల్లన్న,  వనదుర్గమందు నుండ
వచ్చు నరసింహరెడ్డంచు చిచ్చుపెట్ట
నాంగ్లు లతనిఁ జంపఁగఁ జేయ యత్నమపుడు.         31.
కుసుమిత లతావేల్లిత వృత్తము.(మ త న య య య .  యతి 12.)
నా చేతిన్ ఖండించె నతఁడె, తనన్ నా మనోవాంఛ తీరన్
ధీ చాతుర్యంబే తెలియునటు బంధించి నే బట్టి తెత్తున్,
నీచుం డాతం డింక నెటుల వనిన్ నేర్చు? దాటన్,  నృసింహున్
వేచన్ నార్టన్ బల్కె, దొర మదితో వించు నౌనంచనంగాన్.  32.
.  ఆరువేల సైన్య మతనికి నొసగుచు
పంపె నధిపుఁడపుడు తెంపరియగు
నరసరెడ్డి మూర్ఖుఁ బరిమార్చిరమ్మన,
నార్టను వెడలెను వనమున కపుడు.              33.
భూతిలక వృత్తము.(భ భ ర స జ జ గ.  యతి 12.)
కొండకు పైననె యుండె నా యనుకొన్న దుర్గము, రెడ్డి తా
నుండెడి దచ్చటె, మెండుసైన్యమె యుండ తోడుగఁ బ్రేమతోన్,
గొండకు క్రిందను  సైన్యమే యనుకొన్న తీరున నిల్చి రు
ద్దండ బలాన్వితుఁడైన నార్టనుదంచితంబుగ నుంచగా.            34.
.  మారమ్మ కొండ దరికిన్ 
జేరెను నార్టన్ను సేన, చేయుదు మిఁక రే
పారసి యుద్ధమటంచును
వీరుని వలె నార్టననియె విశదము కాగన్.          35.
రెడ్డి తమను నార్టన్ ముట్టడించనున్న వార్త తెలిసికొని తీసికొనిన ప్రతీకారచర్య.
చరప్లుత వృత్తము.(న భ భ మ స స వ. యతి 12.)
నరసరెడ్డి కనుంగొనె ముందే నార్టను వచ్చెనటంచు, మే
దురగతిన్ తనవారిని నిల్పెన్, ధూర్తులఁ జంప సముద్ధతిన్
గరుణ వీడుచు ముందుగనే యా నార్టను సైనికులన్, బ్రభా
కరుఁడు తూర్పునఁ గన్బడు లోఁగాఁ, క్రౌర్యము తోడఁ బ్రశాంతిగాన్.     36.
.  ఖలులను చంపగ రాత్రియె
నలుదెసలన్ - రాసరెడ్డి - నరసింహుండున్.
బలుఁడగు కాసెం సాహెబ్,
బలయుతుఁ డోబయ్య యుక్తి పన్నిరి యపుడే.        37.
గీ.  కొండ దరికి రానుండిన దండు పయిని
గుళ్ళవర్షము కురిపించి ఘోరముగను,
నార్టననువాని సైన్యము నాశనమ్ము
చేసె నరసింహుఁడుద్ధతిన్  జేవఁ జూపి.                  38.
.  ప్రాణభయముతోడ పరుగిడి పోయెను
నార్టనపుడు సేన నాశనమవ,
మసలుచుండె సేన మారమ్మ గుట్టపై
నంచు తెలిసి, చంప నెంచె రెడ్డి.               39.
.  అర్థరాత్రివేళ నారెడ్డి సైన్యమ్ము
మారమ గుడిగుట్ట చేరి, యచట
కాగడాలనార్పి కనఁబడకుండ నా
శత్రుసైనికులను చంపినారు.                 40.
గీ.  వేల రిపుసైన్యమున్ జంపి వేల్పు కత్తి
రక్తసిక్తమై యుండ, నాసక్తితోడ
మారమాంబ చెరువునకుఁ జేరి కడిగి
పెట్టెనొరలోన నరసింహ వీరుఁడెలమి.          41.
సంతతిలక వృత్తము.(త భ జ జ గగ. యతి 8.)
గోసాయి వేంక ననె కూర్మిని రెడ్డితోడన్
భాసించినాము రిపువర్గముపై జయంబై
వాసంబు మార్చవలె, పాలకు లెన్ననట్లున్,
నా సూచనన్ గని మనంబిడి చేయుమయ్యా!        42.
శా.  శత్రుల్ ముష్కరులెన్నగా, విపులమౌ సైన్యంబుతో వార లీ
ధాత్రిన్ శోధన చేసి పట్టుదురహో! దండింపఁగా నందరిన్,
మిత్రద్రోహము చేయ వచ్చునుగదా మిత్రుల్ ధరన్? గాన నీ
క్షేత్రంబున్ విడు టుత్తమం బనియె నా శ్రీమంతుఁడాలించగా.   43.
.  బోధను చేయవేంకన, సముజ్వల తేజుఁడు రెడ్డి  శ్రీజగ 
న్నాథుని గుట్టపైన తమ స్థావరమున్ రచియింపనెంచి, యీ
బాధల నెన్ని బాపఁగల భాస్కరతేజమునొప్పు శ్రీజగ
న్నాథుఁడటంచు చేరెను మనంబున సన్నుత రీతినెమ్మితోన్ .   44.
శా.  దైవానుగ్రహమున్ననాడు మదిలో ధైర్యంబుతోఁ బాటుగా,
శ్రీవత్సాంకునిపైన భక్తి కలుగున్, జేఁబట్టు కార్యంబులం
దేవిఘ్నంబును లేక సాగు, భళిరా! యీశా! జగన్నాథుఁడా!
మా విశ్వాసమె నీ వటంచుఁ దలచెన్ మాన్యుండు సైరా మదిన్.  45.
.  దినములు సాగుచుండెనిటు, దీక్షను వీడక సైర "భారతం
బనియెడి నాదు దేశమున నన్యులపాలనఁ బారద్రోల" నే
తృణముగ నెంతు ప్రాణమును,  దేశము కన్నను దేహమేమియున్
ఘనమని యెంచఁబో ననుచు గట్టిగ పట్టెను పట్టునాత్మలోన్.    46.
గీ.  నాకు గురువయి వేంకన్న నన్ను నడుప,
కాపుగా నాకు కాసిముఖాను నిలువ,
నొడ్డె యోబన్న తోడుగా నుండ, నేను
జయము సాధించి తీరుదున్, సత్యమిదియె.            47.
శ్వలలిత వృత్తము.(న జ భ జ భ జ భ వ.  యతి 13)
అనుకొనుచున్ నృసింహుఁడు మనంబునందునను ధైర్యమూనుచుఁ దగన్
ఘనమగు యత్న సాధన శుభంబుగా జరుగు తీరునే వెదకుచున్,
వినుతులు చేసె దేవునకు సంభవించునటు చేయగా జయములన్,
ఘనుఁడగు దైవమే నడుపు చక్కగాఁ జరుప నెంచినట్టి విధమున్.   48.
.  భక్తవరులఁగాచు భవ్య జగన్నాథు
గుట్ట చేరువుననె గొల్లవిండ్ల
పల్లి నుండు కాంత వంటలు చేయుచు
పెట్టుచుండెడిదట వీరులకును.                49.
.  మన నరసింహరెడ్డికిని, మందికి  కూడ సమీప గ్రామమం
దున నివసించు చుండిన వధూటి యొకర్తుక వంటకంబులన్
వినుతిగ వండి పెట్టెడిది,  వీరుల కాకలి తీర్చుటన్న యా
ఘనత సమస్తదానములకన్నను గొప్పదియే తలంపగన్.       50.
.  తమ సైన్యంబును కత్తితో నరుకుచున్ దప్పించుకొన్నట్టి, దా
ర్ఢ్యముతో నొప్పు నృసింహరెడ్డి కొఱ కా రాజ్యాధినాథుల్ క్షితిన్
క్షమనే కోల్పడి, గుట్టలన్ గరువులన్ గాలించుచున్, గాంచ నే
రమి నెంతేనియు ఖేదమంది, నెరవేర్చన్ దృష్టి సారించిరే.       51.
శా.  ఆహారంబు లభించుచుండినకదా యానందమొప్పారఁగా
మోహాదుల్ మది సంభవించు మనకున్, పూర్ణంబుగా భోజనం
బాహా! లేని దురంత దుస్థితులలో నా క్షుత్తుతో నుండలే
కోహో దైవము చూపలేదు దయయం చుద్వేగమున్ బొందమే?   52.
.  అనుచుఁ దలంచి ధూర్తులు, మహాత్ముఁడుగా మదినెంచి రెడ్డికిన్
ఘనముగ భోజనంబు నిడు కాంతను గూర్చి యెఱుంగఁగా వలెన్,
గనుఁగొనఁ గల్గ నామె నల కన్గొనవచ్చును రెడ్డి జాడనే,
యని తలపోసి, యా దిశగ నాంగ్లులు సాగిరి యత్నసిద్ధికై.   53.
.  కనుగొని రా నృసింహునకు గౌరవమొప్పగ భోజనంబునే
దినదినమున్ బ్రమోదముగఁ దృప్తిగఁ బెట్టెడి జానకమ్మనే,
వినయ, నయంబులన్ మరియు విస్తృతరీతి భయంబుఁ గొల్పుచున్,
మనము చలింపఁ బల్కి రభిమాన ధనన్ నిలదీసి పాలకుల్.    54.
.  ఎచ్చటనుండు రెడ్డి? యతఁ డెచ్చట విశ్రమమందుచుండు? తా
నెచ్చటసంచరించుచు మహిన్ దన కార్యములెల్లఁ జూచు? నీ
విచ్చట తెల్పఁగా వలయు నిన్నియు తప్పక, చెప్పకున్నచో
చచ్చెదవీవు, చెప్పుమన, చప్పున తప్పక చెప్పె నిట్టులన్.         55. 
.  దొరలగు మీకె  వారి గతి తోచదు, నాకెటు తోచునద్ది? నే
నరిఁగెద పెక్కు చోటులకునన్నము పెట్టగ వారు చెప్పఁగా,
చెరచెర గుఱ్ఱమెక్కి చను జిత్తము వచ్చిన చోటనుండగా,
నిరుపమ రీతి వారు, కరుణించి ననున్ దయఁ చూడుడంచనెన్. 56.
.  ఒకచోటన్ వసియించఁడయ్య ధరపైనొక్కొక్క చోటుండు తాన్
ప్రకటింపన్ దగనయ్య నే నతఁడిలన్ వర్తించు చోట్లెన్నుచున్,
సకలంబున్ గ్రహియించఁ గల్గుదురుగా, చక్కంగ మీరల్, దొరా!
యికనన్ వీడుడు పోయి వత్తుననె తా నీశున్  మదిన్ దల్చుచున్.   57.
గీ.  తెల్లదొరలేమి పాల్పోక తెల్లమొగము
వేసి నరసింహరెడ్డికై వేచియుండి
రంతలో రెడ్డి జాడయే వింతగాను
తెలిసె నొక్కింత తెలిసియు తెలియనటుల.        58.
శా.  ఆకొండన్ వసియించునంచొకఁడు, తా నచ్చోటలేడం చొకం
డా కాటిన్ వసియించునంచొకఁడు, తా నాకోనలో నుండునం
చా కల్యాణగుణాత్మకున్ గనినవా రాయా ప్రదేశంబులన్
లోకుల్ చెప్పఁగ పాలకుల్ వెదకుచున్ లోలోనఁ జింతించిరే.     59.
భాస్కరవిలసితము. (భ న జ య భ న న స గ.  యతి 13.)
సైరను కనుఁగొనఁ గొండలయందున్,  సల్పిరి వెదకుట, కలుగులయందున్,
పారెడు జలముల యందును ధాత్రిన్ బల్లములను గల తలముల యందున్,
తీరుగఁ గనఁబడు కోనలయందున్, దెల్లదొరలు నరహరిఁ గని పట్టన్,
ధీరుఁడు నరహరి కానఁగరాడే, దేవియొసగిన వర ఫలితమేమో?   60.
.  చేతికిఁ జిక్కినట్టి నరసింహుని సైనికులందు కొందరిన్ 
నీతిగ రెడ్డి జాడ గణనీయముగా వచియింపుడంచు, వి
ఖ్యాతిగ మీకు సొమ్ములను గైకొన నిచ్చెదమంచుఁ బల్కుచున్
నేతలు కుంఫిణీలు గన నేర్చిరి రెడ్డి వసించు చోటులన్.     61.
గీ.  మూడు మాసము లీ రెడ్డి జాడ కొఱకు
వెదకి వేసారి వేసారి తుదకు వారు
పేరుసోమల కొండలన్ వెదకి వెదకి
శ్రీ జగన్నాథు గుట్టనే చేరినారు.              62.
1846 అక్టోబరు 6 న ఓబయ్య, వేంకన్నలు కాల్చఁబడుట.
.  అఁటనే రెడ్డి వసించి యుండునని, ధ్యేయంబొప్ప కాక్రేనుఁ డ
చ్చటకున్ సైన్యము మోహరించె, నపుడా సందర్భమున్ గాంచుచున్
జటిలంబైన సమస్యగాఁ దలచి గోసాయి ప్రభారాశియౌ
నిటలాక్షాంగనకంజలించి యికపై నీవే దొరన్ గావుమా.   63.
గీ.  అనుచు నోబననున్ గూడి యచటివారు
చూచుచుండఁగ ముసుగులన్ జొచ్చి పరుగు
పెట్టుచుండి రింకొకవైపు, వీఁడె రెడ్డి
పారి పోవుచునుండెను పట్టుకొనుఁడు.                64.
గీ.  అనుచు కాక్రేను పల్కగా నటుగ సేన
వారినే బట్టి మరలఁగా, వీరుఁడయిన 
రెడ్డి స్వామి వెన్కనె యుండి, గడ్డుసమయ
మిపుడు, దైవంబె నాకు తోడెన్నఁగననె.           65.
.  పరుగునఁ బోవుచుండెఁ బగవాఁడగు రెడ్డియు, మిత్రుఁడాదెసన్,
సరగున కాల్చుఁడిద్దరిని, చంపుడు వారినటంచు నాయకుం
డరచుటతోడ సేనలు భయావహమౌనటు కాల్చిరిద్దరిన్.
నరహరి మిత్రులిద్దరు పణంబుగప్రాణము పెట్టి పోయిరే.  66.
గీ.  కాల్పు శబ్దంబువిని రెడ్డి కంటనీరు
పెట్టె నోబయ్య, వేంకన్న, తుట్టతుదకు
నన్ను కావంగ ప్రాణమ్ములున్ననాళ్ళు
నెన్నియో బాధలొంది నే డీగినారు.               67.
లదము.(భ ర న భ గ.  యతి 10.)
పోయినవారు వేరుకట, పోవఁగ లే
దాయె నృసింహుఁ డిచ్చటనె దాగెనహో,
నా యనుమానమే నిజము, నా మదిలో
ధ్యేయము నేడుతీరవలె, ధీప్రతిభన్.             68.
గీ.  అనుచు కాక్రేను సైన్యమ్ము నఁటకుఁ జేర్చి,
గుట్ట కన్నివైపులనుంచి గుళ్ళవర్ష
మతనిపై కురిపించగా మతిని దలచి,
సిద్ధముగ నిల్పె నందరిన్,  క్షేత్రపతిగ.         69.
వికంఠభూషణము.(స జ స స స జ గ. యతి 9.)
నరసింహరెడ్డి "తగునా జన నష్టము? పాపమేకదా?"
పరివారమంతయును పాపము నన్ మది నమ్మి వచ్చెనే,
పరమేశ్వరుండ! కనవా? తగు మార్గము చూప రావయా!
సరి నేటికిద్ది, మనసా విరమింతును యుద్ధమింతతోన్. 70.
.  అనుచు దలంచి ఖడ్గము మదంబ యొసంగుటఁ జేసి యామెయే
ఘనమగు దీని శక్తిఁ గొనగా నిట నుంచెద నంచు దేవతన్
మనమున నెంచి యుంచె పరమంబగు ఖడ్గము దేవళమ్మునన్,
ప్రణవ మహాస్వరూపముగ పావనఖడ్గము నెంచు రెడ్డియే.   71.
ప్రభాకలిత.(న జ జ భ ర స వ. యతి 13.)
పవరము కాక్రెను నన్నుఁ జంప నవారితంబగు సేనతో
నవనియె దద్దరిలంగ వచ్చె ఘనంబుగా కుపితాత్ముఁడై,
చవిఁ గనఁ జేసెద వీరికంచు ససంభ్రమంబుగ  గుండ్లనే
భువి కురిపించెను శత్రుసంహతి పూర్తిగా నిల వ్రాలగాన్.    72.
.  ఆధునికాయుధంబులను హస్తములన్ ధరియించి  శాత్రవుల్
శోధనఁ జేసి శత్రులను చూచుచు కాల్చుచునుండఁ గాంచుచున్
బాధను పొందె రెడ్డి తనవారు రణంబున కూలుచుండగాన్,
మాధవ! లొంగిపోదును, సమస్థము నీకృప యంచుఁ బల్కి తాన్.  73.
లొంగిపోవఁ జూచిన రెడ్డిని సమీపించుటకును భయపడుచున్న శత్రువులు.
న్వి.(భ త న స భ భ న య.  యతి 13.)
తానఁట లొంగన్ నిలువఁగ, తనలో ధైర్యము చూచి బెదరి  రిపులెల్లన్
బ్రాణములెట్లైన నిలుపుకొనుటే భాగ్యము, వీని దరి నిలుచుటేలన్?
మౌనముగా దూరమయిన తమకున్ మానము ప్రాణము మిగులునటంచున్,
శ్రీ నరసింహున్ దఱియఁగ నఁటకున్ జేరరు శత్రులు  భయము దలిర్పన్.       74.
.  ఆత్మశక్తితోడ నతఁడు లొంగునె కాని,
పట్టజాల రొరులు  వసుధపైన,
నుర్వి కీర్తిఁ గాంచె నుయ్యాలవాడ శ్రీ
నృహరిరెడ్డి యనుచు, నిరుపమునిగ.           75.
పజాతి వృత్తము.(1&3 పాదములలో ఇంద్రవజ్ర - త త జ గగ. యతి 8. 
మరియు 2&4 పాదములలో ఉపేంద్రవజ్ర. జ త జ గగ. యతి 8.)
స్వాతంత్ర్య సంపాదన వాంఛతోడన్
సతంబు దీక్షన్ గొని సత్ప్రవృత్తిన్
భీతిల్లనాంగ్లేయుల నే యొనర్చెన్
ధృతిన్ నృసింహుండను రెడ్డి ధాత్రిన్.           76.
సుగంధి.(హ హ హ హ హ హ హ గ. యతి 9.)
పట్టఁబోడువ్యర్థమైనవాటినెన్నడున్ ధరన్
బట్టెనా జయంబె పొందువాఁడె రెడ్డి, చూడగా
నట్టి గొప్పవాఁడు నేడహంబు వీడి లొంగుటే
యెట్టివారికైన నీ మహిన్ విచిత్రమేయగున్.       77.
ఆశ్వాసాంతము.
యూరసారి.(ర జ ర గ. యతి 7.)
ఓ నృసింహ దేవ! యుండుమాత్మన్,
నీ నవోజ్వలంపు నిత్యదీప్తిన్
నేను జూడనుంటి నిర్వికారా!
జ్ఞానదీప్తి నిమ్ము కంబుకంఠా!                  78.
కాణ్వశాఖీయ కౌశికస గోత్ర చింతా వంశజ సన్యాసిరామారావు ధర్మపత్నివేంకటరత్నమాంబ పుణ్య దంపతుల జ్యేష్ట  పుత్రుఁడును, పూజ్య సద్గురుదేవ పరమాత్మ స్వరూప కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యుల ప్రియ శిష్యుఁడును రామకృష్ణారావు నామధేయుఁడనగు నాచే విరచింపంబడిన రేనాటి సూరీడు అను చారిత్రక ప్రబంధమున చతుర్థాశ్వాసము సమాప్తము.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.