గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, మార్చి 2014, శనివారం

లక్ష పద్యార్చనం - 'గ్రంథ ముఖి '( ఫేస్ బుక్ ) మాధ్యమం లో డా . రాళ్ళబండి కవితాప్రసాద్

జైశ్రీరాం. 
ఆర్యులారా! అవధాన విద్యా ప్రపంచం లో
'గ్రంథ ముఖి '( ఫేస్ బుక్ ) మాధ్యమం లో
డా . రాళ్ళబండి కవితాప్రసాద్ 
అపూర్వ, వినూత్న ,చారిత్రాత్మక ,తెలుగు కవిత్వ ,ప్రయోగం !
" లక్ష పద్యార్చనం"
తెలుగు తల్లికి వేసే లక్ష పూల హారంలో చేరేలా మనం కూడా భక్తి కుసుమాలను సమర్పించే ఒక సదవకాశం మనకు శ్రీ రాళ్ళబండ కవితా ప్రసాద్ గారు కల్పించారు. ఈ సత్ ప్రయత్నం జయప్రదం కావాలని మనసారా కోరుకొంటూ శ్రీ కవితాప్రసాద్ గారిని మనసారా అభినందిస్తూ, ఆ శారదాంబ వారిని ఆవహించి తన జగజ్జేగీయమానమైన మహోన్నత సాహితీస్వరూపాన్ని లోకానికి చూపించాలని కోరుకొంటున్నాను. ఈ క్రింది విషయాన్ని చదివి మీరూ స్పందించేందుకు ఇది ఒక సదవకాశమని మీకీ విషయం తెలియజేస్తున్నాను.
ఇక ఈ విషయాన్ని వారి మాటలలోనే చూడండి.


ప్రియమైన స్నేహితులారా !
నమస్కారం !! 
మన మంతా కలసి ఒక దివ్యమైన పద్య కవిత్వ యజ్ఞం చేద్దాం.
దాని పేరు " లక్ష పద్యార్చనం"
మీరు పృచ్ఛకులుగా, ప్రశ్నల పుష్పాల సౌజన్యం ప్రకటిస్తే 
ఈ " లక్ష పద్యార్చన " ప్రారంభమౌతుంది ,

"లక్ష పద్యార్చన" స్వరూపం 
----------------------------
సాధారణంగా అష్టావధానం లో 8 మంది పృచ్చకులు ,ఒక కొన్ని వందల మంది ప్రేక్షకులు , ఓ రెండు లేక మూడు గంటల సమయం 10-15 కొత్త పద్యాలు రచించబడతాయి .
అదే శతావధానం లో 100 మంది పృచ్చకులు ,వెయ్యికి పైగా ప్రేక్షకులు ,2-3 రోజుల సమయం ,
100 కు పైగా కొత్త పద్యాల సృష్టి .
సహస్ర , పంచ సహస్రావధానాల లో సుమారు 1000 మంది పృచ్చకులు. నాలుగు వారాల సమయం , 1000-5000 పద్యాల సృష్టి. 
వీటికి ₹10,000/ నుండి ₹25,00,0000/ వరకు ఖర్చు ! ఇంకా ఎన్నో శ్రమలు !

ప్రస్తుతం మనం ఫేస్ బుక్ ద్వారా చేసే ఈ "లక్ష పద్యార్చన" లో 
వేలాది పృచ్చకులు ప్రపంచం నలు మూలల నుండి ఖర్చు శ్రమ లేకుండా పాల్గొనవచ్చు !
లక్ష కొత్త పద్యాలు సృష్టించ బడతాయి!
విషయ వైవిధ్యం ఉంటుంది !

ప్రశ్నల విభాగాలు :
1)సమస్యలు 2)దత్తపదులు 3)వర్ణనలు 4) అనువాదాలు 5)అప్రస్తుత ప్రశంసలు 

ఒక్కొక్కరు ఏ అంశం పైన అయినా ,ఎన్ని ప్రశ్న లైనా అడగ వచ్చు ,

సమస్య : ఛందో బద్ద్ధమైన పద్యపాదమై ఉండాలి .అసంబద్ధమైన అర్ధం ఉండాలి .
దత్తపది :శబ్ద లయ గాని, భావలయ గాని, అర్ధ లయ గాని గల , నాలుగు పదాలు ఇవ్వాలి .
కోరిన ఛందస్సు లో కోరిన అంశంపై పద్ద్యం చెప్పమని అడగాలి 
వర్ణన :ఏదైనా ఉదాత్తమైన అంశం పై కోరినఛందస్సులో వర్ణనాత్మకమైన పద్యం అడగ వచ్చు. 
అనువాదం :ఇంగ్లీషు లేదా సంస్కృతం లోఏదైనా పద్యాన్ని లేక శ్లోకాన్ని ఇచ్చి పద్య రూపం 
అనువదించమని అడగ వచ్చు 
అప్రస్తుత ప్రశంస :చమత్కారమైన ప్రశ్నలు అడిగితే చురుకైన సమాధానాలు పద్య రూపం లో ఇవ్వబడతాయి .

ఇవన్ని మీ లక్ష ప్రశ్నలు !
నావి లక్ష పూరణలు !!!!

ఇది మనం కలసి వాగ్దేవికి చేసే లక్ష పద్యార్చన !!!!

ప్రశ్నలు మానవ జాతికి ఉపయోగ పడేలా ఉండాలి .
సమకాలీన సమాజాన్నిప్రతిబింబించేవిగా ఉండాలి. 
ఉత్తమ సంస్కృతినిర్మాణానికి దారి వేసేవి గా ఉండాలి. 
విజ్ఞానం కలిగించేవి గా ఉండాలి. 

మీ ప్రశ్నలు మీ ప్రతిభని ,సంస్కారాన్ని ,జిజ్ఞాసని తెలియజేసేవిగా ఉండాలి. 

మీ ప్రశ్న కింద మీ పేరు .చిరునామా. ఫోను నెంబరు .ఈ మెయిలు . తప్పనిసరిగా ఉండాలి. 

ఈ లక్ష పద్యార్చన గురించి మీ స్నేహితులకుచెప్పండి. ఫేస్ బుక్ లో. షేర్ చెయ్యండి.

లక్ష ప్రశ్నలువచ్చేలా సహకరిచండి ! 
ఈ క్షణం నుంచే పూరణలు ప్రారంభిస్తున్నాను !!
ప్రశ్నలు సంధించండి !!
వాగ్దేవీ కటాక్షం తో 1000 రోజులలో పూర్తిచేయాలని సంకల్పం .

"ఆకాశ వీణ పై అక్షర రాగాలు సృష్టించు వాణి ఆశీస్సులిడగ !
వాయువీచికలన్ని భావ వీచిక లౌచు శ్వాస కవిత్వయశస్సు లిడగ!
పద్యాగ్ని శిఖలతో ప్రజ్ఞామహాయజ్ఞ వేదిక దివ్యహవిస్సు లిడగ!
రసవదమృత పద్య రాజీవ బృందమ్ము బ్రాహ్మికి కావ్య సరస్సులిడగ!
భూమాత హృదయమ్ము పూర్ణ కుం భమ్ము నై శ్రీం కార శబ్ద రోచిస్సు లిడగ!

రమ్య సంకల్ప మీ శివరాత్రి వేళ
లక్ష పద్యార్చనము సేయ లక్ష్య మొకటి 
వెట్టితిని ముఖ పుస్తక వేది పైన 
వేగ ప్రశ్నింప రారండి విజ్ఞులార !
పంచ భూతాలు సాక్షి ! గీర్వాణి సాక్షి !

...... ..... ...అవధాన విద్యా ప్రపంచం లో
'గ్రంథ ముఖి '( ఫేస్ బుక్ ) మాధ్యమం లో
డా . రాళ్ళబండి కవితాప్రసాద్ 
అపూర్వ, వినూత్న ,చారిత్రాత్మక ,తెలుగు కవిత్వ ,ప్రయోగం !
" లక్ష పద్యార్చనం "
Top of Formnotification@facebookmail.com  కు పంపండి.
జైహింద్.
Print this post

5 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు పాదాభి వందనములతో ...

చాలా మంచి విషయము గురువుగారు, మమ్ము కూడా భాగస్వాములను జేస్తున్నందుకు ధన్యవాదములు. వారి మెయిల్ అడ్రస్ ఇవ్వగలరు.

సరస్వతీ పుత్రులు శ్రీ డా . రాళ్ళబండి కవితాప్రసాద్ గారి ఈ ప్రయత్నము అపూర్వ, వినూత్న ,చారిత్రాత్మక ,తెలుగు కవిత్వ ,ప్రయోగం !

" లక్ష పద్యార్చనం " వారు అతి వేగముగా పూర్తి జేయవలెనని భగవంతుని ప్రార్థిస్తూ..

జై తెలుగు తల్లి , జై తెలుగు భాష , జైహింద్.

A.Satyanarayana Reddy చెప్పారు...

సరస్వతీ పుత్రులు రాళ్ళ బండి కవితా ప్రసాద్ గారి ప్రయోగం అనుకున్న సమయంలో పూర్తి కావాలని కోరుకుంటున్నాను.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి

A.Satyanarayana Reddy చెప్పారు...

సరస్వతీ పుత్రులు రాళ్ళ బండి కవితా ప్రసాద్ గారి ప్రయోగం అనుకున్న సమయంలో పూర్తి కావాలని కోరుకుంటున్నాను.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

కంద-గీత-గర్భ చంపకమాల.
వర సువిధేయుఁడై తనుపు పార్థివుఁడీ కవితాప్రసాదు ధీ
వరుఁడెపుడున్. లసత్ కవన వాఙ్మధు ధారల జ్ఞానసింధుగా
సరస వినోద వాగ్ రసిక సత్కవితాజవరాళ్ళబండిగా
నరయతగున్! మహానగరినందరికిన్ రతనాలబండిగా !

చంపక గర్భ కందము.
సువిధేయుఁడై తనుపు పా
ర్థివుఁడీ కవితాప్రసాదు ధీ వరుఁడెపుడున్.
స వినోద వాగ్ రసిక స
త్కవితాజవరాళ్ళబండిగా నరయతగున్!

చంపక గర్భ గీతము.
తనుపు పార్థివుఁడీ కవితాప్రసాదు
కవన వాఙ్మధు ధారల జ్ఞానసింధు
రసిక సత్కవి తాజవరాళ్ళబండి
నగరినందరికిన్ రతనాలబండి !

రాళ్ళ బండి మనకు రతనాలబండియే!
లక్ష పద్య రచన నక్షయమగు
నాంధ్రమాత కంఠహారమై చెలువొంద
చేయ బూనె గర్భ చిత్ర గతుల.

చింతా రామ కృష్ణా రావు.
ఫ్లాట్.నెం.503
శ్రీ రత్న విహార.
బస్ బాడీ వెనుక
మియాపూర్
సెల్ నెంబరు. 9247238537.
Email id chinta.vijaya123@gmail.com

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

notification@facebookmail.com కు పంపండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.