గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, సెప్టెంబర్ 2014, సోమవారం

సమస్య: తండ్రీపుత్రులచేత సంతువడసెన్ తానెంత ధన్యాత్మయో!

జైశ్రీరామ్.
ఆర్యులారా!ఈ క్రింది సమస్యను డా.గరికిపాటివారు పూరించారు. చూడండి. అదే సమస్యను నేను పూరించాను అదికూడా చూడండి.
సమస్య:
తండ్రీపుత్రులచేత సంతువడసెన్ తానెంత ధన్యాత్మయో!
డాక్టర్ గరికిపాటి నరసింహారావుగారి పూరణ:
గుండ్రాతింబలె చూచుచుందురుగదా! గొడ్రాలినీ లోకమం
దాండ్రుంగూడ దయావిహీనమతులై; యాసాధ్వినే గొడ్డుమో
తండ్రీ పుత్రులచేత, సంతువడసెన్ తానెంత ధన్యాత్మయో!
గాండ్రింపుల్ మఱి చెల్లబోవుగద! మొగ్గల్ సిగ్గులా యింటిలో!
నా పూరణ: 
పండ్రెండేండ్ల వివాహజీవనమునన్ ప్రాప్తింపమిన్ సంతతిన్
తండ్రీ ఈశ్వర! తత్ సుపుత్ర వరదాతా!విఘ్నరాజా! కృపన్
గుండ్రాయట్టులనున్నమాకు నిడుడీ కూర్మిన్నన్న వారీయ నా
తండ్రీపుత్రులచేత సంతువడసెన్ తానెంత ధన్యాత్మయో!
చూచారు కదా! మరి మీరైతేఏ విధంగా పూరించడానికి ఉత్సహిస్తారో మీ పూరణ ద్వారా చేసి చూపండి.
నమస్తే.
జైహింద్.
Print this post

2 comments:

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

కుంతీ దేవి శ్రీకృష్ణపరమాత్మతో అంటున్నట్లుగా ఒక ఊహ............

అండ్రల్ చేసెద లోకవాక్కులను వేగన్ స్థైర్యచిత్తంబుతో
మండ్రాటంబదియేల ధైర్యముగ క్షేమప్రాప్తికై ద్రౌపదిన్
వాండ్రల్ బంచుకొనంగఁజేసితినిగా పాంచాలి నాకోడ లో
తండ్రీ! పుత్రులచేత సంతు వడసెన్ తానెంత ధన్యాత్మయో.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సంపత్ కుమార్ శాస్త్రి గారూ! అద్భుతంగా ఉందండి మీ పూరణము.మీకు నా అభినందనలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.