గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జులై 2012, సోమవారం

గృహస్థాశ్రమ ధర్మములు. శ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రి

జైశ్రీరామ్..
గృహస్థాశ్రమ ధర్మములు. 
రచన:- శ్రీ పిడపర్తి సుబ్బయ్య శాస్త్రి.
గృహస్థుడు భగవద్భక్తుడై యుండవలెను.
భగవద్ఙ్ఞానమే అతని జీవిత పరమావధి.
సదా కర్మ నిరతుడై తన విద్యుక్త ధర్మములను నిర్వహించుచు కర్మఫలముల నీశ్వరార్పణ మొనర్ప వలయును.
జీవనోపాధి నార్జించుట గృహస్థునికి మహా విద్యుక్త ధర్మము. కాని తత్కార్యమును కల్లలాడుటచేతనూ, పరులను మోసగించుటచేతనూ, పరద్రవ్యాదుల నపహరించుటచేతనూ మాత్రము చేయతగదు. మరియు ఈశ్వరసేవయూ  దీనజనసేవయూ తన జీవిత ధర్మములని యాతడు గుర్తింపవలయును.
తల్లిదండ్రులు సాక్షాద్భగవత్స్వరూపులని గ్రహించి గృహస్థుడు సదా సర్వవిధములను వారల సంతుష్టుల నొనర్పవలయును. ఎవ్వని తల్లిదండ్రులు సంతుష్టులో వానిచే భగవంతుడు సంతుష్టుడగును.
తల్లిదండ్రులతో పరుషవాక్యములాడని నందనుడు నిజముగా నందనుడు. తల్లిదండ్రుల యెదుట నెన్నడును పరిహాసము చేయరాదు. ఔధ్ధత్యమునుగాని, కోపమునుగాని, క్రోధమునుగాని చూపరాదు. తల్లిదండ్రుల యెదుట అవనతుడై నిలువవలయును. కూర్చుండ నాఙ్ఞాపితుడగువరకు కూర్చుండరాదు.
తల్లికిని, తండ్రికిని, బిడ్డలకును, భార్యకును, పేదలకునూ పెట్టనిదే గృహస్థుడు భుజింపరాదు. అటుల భుజించుట పాపకార్యము. ఈ శరీరమునకు తల్లిదండ్రులే కారణభూతులు కావున వారలకు హితమొనర్చుటకై మానవుడెన్ని కష్టములనైన అనుభవించుట కర్తవ్యము.
తన భార్య యెడలను ఆతని విధ్యుక్తధర్మ మిట్టిదే. భార్య నాతడు దూషింపరాదు. కేవలము తల్లిగా భావించి యామెను పోషింపవలెను. తానెంతటి మహా కష్టము లనుభవించినను భార్యపై కోపింపరాదు.
పరస్త్రీని గురించి చింతించువాడు__కేవలము మానసికంగా పరస్త్రీని స్పృశించిననూ__ఘోర నరకము పొందును.
స్త్రీల యెదుట అసభ్య సంభాషణ చేయరాదు. తన శక్తిసామర్ధ్యములను గూర్చి ప్రగల్భము లాడరాదు.
ధనముచే, వస్త్రములచే, ప్రేమచే, నమ్మికచే, మధుర వాక్కులచే గృహస్థుడు తన భార్యను సంతుష్ట నొనర్పవలయును. ఆమె మానసము క్షోభించు కార్య మెన్నడును చేయరాదు. పతివ్రతయగు భార్య యొక్క ప్రేమను బొందగల్గినవాడు సమస్త ధర్మములందును కృతకృత్యుడగుచున్నాడు. సమస్త సద్గుణముల నార్జించుచున్నాడు.
బిడ్డలయెడ గృహస్థు డవలంబింపవలసిన ధర్మము లేవన…
నాలుగేండ్లప్రాయము వచ్చువరకూ పుత్రుని ప్రేమానురాగాలతో పెంచుచూ, పదునారేండ్లవరకూ విద్యాబుధ్ధులను గరపవలెను. ఇరువదియేండ్లప్రాయమున నాతని నేదియో యొక యుద్యోగమున లేక కృషి యందు నియోగింపవలయును. తండ్రి యతని నప్పుడు ప్రేమతో తన సమానునిగా జూడవలయును. సరిగా నిదే విధముగా కుమార్తెను బెంచి విశేషశ్రధ్ధతో నామెకు విద్యాబుధ్ధులను గరపవలయును. వివాహసమయమున తండ్రి యామెకు నగలను ధనము నొసగవలెను.
ఇక నాతనికి తన అన్నదమ్ములయెడ అక్కసెల్లెండ్రయెడ పేదలైయున్నయెడ వారి బిడ్డలయెడ, మిగిలిన తన బంధువర్గమునెడ, స్నేహితులయెడ, సేవకులయెడ విధ్యుక్తధర్మములు కలవు. పిమ్మట తన గ్రామవాసుల యెడలను, బీదలయెడను, యెవరైన కానిండు- తన సాయము నర్ధించువారలయెడనూ గృహస్థునకు ధర్మము లేర్పడినవి.
తగినంత స్థితి నందుండియు గృహస్థుడు తన బందుగులకును పేదలకును బెట్టనియెడల నట్టివాడు మానవమాత్రుడు గాడనియూ, వట్టి పశువనియూ గ్రహింపుడు.
వస్త్రాహారములందు, శరీరపోషణమునందు, తలదువ్వుకొనుటయందు వ్యామోహము కూడదు. గృహస్థుడు పవిత్ర హృదయుడై పరిశుధ్ధ శరీరుడైయుండుటయేగాక కర్మపరాయణుడై యుండవలయును. మితాహారీ, మితభాషణుడూ, తగిన నిద్రకలవాడూ అయియుండవలెను.
శత్రువులయెడ గృహస్థుడు వీరుడై వర్తింప వలెను.శత్రువుల కతడు ప్రతీకారము చేయుట అతడి విధిగా గుర్తింపవలెను.
గురువులయెడను, బందుగులయెడను అతడు శాంతమూర్తియై మెలగవలెను.
దుర్మార్గులను గౌరవింపరాదు. మరియు గౌరవార్హులగు సజ్జనుల నవఙ్ఞ చేసిననూ తప్పు చేసినవాడగును.
స్నేహ మొనర్చుటలో మైమరిచి సంచరింపరాదు. తాను స్నేహము చేయదలచినవారి చర్యలను, పరులతో వారి వ్యవహార ధర్మములను కనిపెట్టి, వారిని గూర్చి పర్యాలోచించి మరీ వారితో స్నేహము చేయవలయును.
తన పేరుప్రఖ్యాతులను గురించి నలువురి యెదుటను సంభాషింపరాదు. తన శక్తిసామర్ధ్యముల గురించియు, సంపదను గూర్చియూ లేక తనకు రహస్యముగా దెలుపబడిన విషయముల గురించియూ ప్రసంగింపరాదు. ఈ మూడు విషయములని గురించియు గృహస్థుడు మాట్లాడరాదు.
తాను దరిద్రుడనని కాని భాగ్యవంతుడనని కాని చెప్పరాదు. తన సిరిసంపదలగూర్చి ప్రగల్భములు పలుకరాదు. ఇది యాతని పరమ ధర్మము. ఇటు లొనర్పనియెడల  ప్రజలాతని నధర్మవర్తనుడందురు.
అతడేదైన పొరపాటు చేసినప్పుడు కాని, దౌర్బల్యమున కధీనుడైనప్పుడు కాని నలువురి యెదుట తన గుట్టును వెల్లడించుకోరాదు. నేదేని యుద్యమము నారంభించినప్పుడు తన కందు జయము లభింపదని నిశ్చయముగా నెరిగినుండియూ దానిని వెల్లడింపరాదు.
విద్యాధనముల  నార్జించుటకై శక్తివంచన లేక ప్రయత్నించుట విద్యుక్తధర్మము. తన విధిని నెరవేర్పనిచో అతడు గృహస్థు డనిపించుకోజాలడు.
లోకులు తరచు తాను నెరవేర్ప సాధన సంపదలు లేని కార్యములలో దిగుచు స్వలాభమునకై పరులను వంచించుచుందురు. సర్వవిషయముల సాఫల్యమునకును కాలమనునది యొకటి యున్నది కదా! ఒక సమయమున అపజయముగా పరిణమించునదే వేరొక సమయమున దిగ్విజయమై పరిణమింపవచ్చును.
జనహితము నొనగూర్చినవియు, జనులకు ప్రీతికరములగు మాటలనుపయోగించుచు గృహస్థుడు మృదులమగురీతిని సత్య సంభాషణ మొనర్పవలెను. పరుల వ్యాపారముల గురించి అతడు పలుకరాదు.
చెరువులను త్రవ్వించుచూ, బాటల కిరువైపులా చెట్లు నాటించుచూ మానవులకునూ, జంతువులకునూ విశ్రాంతిమందిరములను నిర్మించుచూ, బాటలను వేయించుచు వంతెనలను గట్టించుచు గృహస్థుడు యోగింద్ర లభ్యమగు నుత్తమోత్తమగతిని బొందుచున్నాడు.
స్వదేశము కొరకుగాని, స్వధర్మము కొరకుగాని యుధ్ధరంగమున ప్రాణములనుబాయు గృహస్థుడు ధ్యానముచే యోగి పొందు పరమపదమునే పొందుచున్నాడు.
మహానిర్వాణతంత్రము
అష్టమోల్లాసము.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

గృహస్తా శ్రమ ధర్మ ములను చక్కగా వివరింఛి నందుకు ధన్య వాదములు . కొంద రైనా చదివి కొన్నైనా ఆచరించ గలగాలని ఆశిద్దాం .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.