గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, జనవరి 2011, గురువారం

కుచేలుని పేదరికానికి కారణం?

కుచేలుని పేదరికానికి కారణం వివరిస్తున్న కృష్ణుఁడు
శ్లోll
ఏకయేవ న భుంజీత - యదిచ్ఛేత్ సిద్ధిమాత్మనః.
ద్విత్రిభిర్బహుభిస్సార్ధం భోజనంతు దివా నిశమ్.
కll
భుజియింపగ రాదొంటిగ.
నిజమిది రాత్రింబవళులు. నిరుపమగతి సత్
స్వజనులనిద్దరి, ముగ్గురి
భుజియింపగ తోడు గలిగి భుజియింప వలెన్.
భావము:-
పగలు కాని, రాత్రి కాని, ఒంటరిగా భుజింప కూడదు. ఇద్దరు, ముగ్గురు కలసి భుజిస్తున్న పంక్తిలో కూర్చొని భుజించాలి.ఇది శ్రేయస్కరమైన పద్ధతి. అని పెద్దలు చెప్పుదురు.
కుచేలుఁడు తన బాల్యమున కృష్ణుఁడు మున్నగు వారికి పెట్టకుండా చాటుగా ఒంటరిగా భుజించిన కారణముననే పెద్దైన తరువాత పేదరికం అనుభవించ వలసి వచ్చిందని పండితులు చెప్పెడి మాటలు సత్య దూరములు కావని ఈ శ్లోకము వలన మనకు తెలియుచున్నది.
జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

6 comments:

Goutham చెప్పారు...

కాలక్రమేణా కొన్ని మార్పులు తప్పవేమో! ఈ రోజుల్లో ఇంటిపట్టున లేని బ్రహ్మచారులకు, బ్రహ్మచారిణులకు ఒంటరిగా తినటం తప్పదు. And most of them are not poor and infact go out to do well for themselves!!

durgeswara చెప్పారు...

చాలా చక్కని విషయం మరోసారి గుర్తుచేశారు.ధన్యవాదములు

astrojoyd చెప్పారు...

చాలా చక్కని విషయం

కథా మంజరి చెప్పారు...

కుచేలుని పేదరికానికి కారణం గురించిన కథ చక్కగా వివరించారు. గౌతమ్ అన్నట్టుగా ఈ రోజులలో ఒక్కరే కూచుని తినాల్సిన దుర్గతి తప్పడం లేదు.

Seethaaraamam చెప్పారు...

కుచేలుడి దారిద్ర్యానికి కారణం నేను విన్నది ఇలా..

శ్రీ కృష్ణుడు, కుచేలుడు (సుధాముడు అని అసలు పేరు), సాందీప ముని శిష్యులు గా ఉన్నప్పుడు, ఒక నాడు కర్రలు తేవడానికి అడివికి వెళ్లి, వానలో చిక్కుకున్నారు. చెట్టు కింద నిలబడి తల దాచుకున్నారు ఇద్దరూ. అంతలో సుదాముడు ఆకలికి ఆగలేక సుదాముడు పక్కకు తిరిగి గుప్పెడు అటుకులు తిన్నాడు. శ్రీ కృష్ణునికి పెట్ట లేదు, పైగా ఏమిటి తింటున్నవని కృష్ణుడు అడిగితే ఏమీ లేదని అబద్ధమాడాడు. దేవునికి అర్పించకుండా తను తిన్న పాపానికి దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించాడు. అవే గుప్పెడు అటుకులు శ్రీ కృష్ణునికి ఇచ్చాక కానీ ఆ దారిద్ర్యము తీరలేదు. అంచేత, ఒక్కరూ తినవలసిన వారు కూడా, అతిధి ఉంటె వారికి పెట్టాలి. అన్నిటికంటే ముందు దేవునికి అర్పించాలి. ఇది ఆ కథ లో పరమార్ధము.

ఇక ఇలా పాటించని వారు చాలా మంది చాలా మంచి స్థాయి లో ఉన్నారు, కనక మనమూ అదే చెయ్యచ్చు అన్న వాదన నా మనసుకు కు సరి అయినది కాదనిపిస్తోంది. వ్యాఖ్యానించడానికి పెద్దలు అర్హులు.

భవదీయుడు
సీతారామం

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

చక్కని విషయం చెప్పారు. కాని ఈ రోజుల్లొ " సాటి మనిషి ఒకరు ఇంట్లొ ఉన్నారు అన్న ఇంగితం లేకుడా ఎవరికి వారు తింటూ ఉంటారు.అదేదో ఎదుటి వ్యక్తిని కించ పరచాలన్నట్టు.ఒక్క తిండే కాదు ఎన్నో పన్లు [ కావాలని తెలిసి మరీ ] చేస్తు ఉంటారు.అందు వలన వారి కుసంస్కారమె బయట పడుతుందని తెలుసు కోరు.ఇక ముందైనా ఇలాంటి వారు మారతారని ఆశిద్దాం !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.