గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, అక్టోబర్ 2019, మంగళవారం

కార్తిక మాసం.....

జైశ్రీరామ్
శ్లో.న కార్తికసమో మాసో
న కృతేన సమం యుగమ్| 
న వేదసదృశం శాస్త్రం
న తీర్థం గంగయా సమమ్.

కార్తిక మాసంతో సమానమైన మాసము, కృతయుగముతో సరియైన యుగము, వేద సదృశమైన శాస్త్రము, గంగా సమానమైన తీర్థము లేవు. కార్తికమాసములో చేసిన జప, హోమ, దానములు, శివాభిషేకములు, విష్ణుపూజలు విశేషఫలప్రదములు.

అటువంటి కార్తిక మాసము పాడ్యమి (29-10-2019) మొదలు, అమావాస్య (26-11-2019) వరకు ముప్పైరోజులు "
కార్తికమాసం అత్యంత విశేషవంతమైనది. శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తికమాసం. సంవత్సరంలో వచ్చే అన్ని మాసాలకన్నా విశిష్టమైన ఈ కార్తికమాసం అధికఫలదాయకమైంది.

కృత్తికల్లో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కనుక ఇది శివకేశవులిద్దరికీ ప్రీతికరం. ఈ కార్తిక మాస విశిష్ఠతను గూర్చి, వేద వ్యాసమహర్షి తన శిష్యుడైన సూతునికి, సూతముని శౌనకాది ఋషులకు తెల్పాడు.

పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి, అవసరమైన ద్రవ్యానికై వశిష్ఠమహర్షి, జనకమహారాజును అర్థించగా, జనకమహారాజు అందుకు అంగీకరించి, సంవత్సరంలోని సర్వమాసాల కంటే కార్తికమాసం అత్యంత మహిమాన్వితమైనదని చెబుతుంటారు కదా! అయితే ఆ సర్వపాపహరమైన ధర్మసూక్ష్మాన్ని తెలియజేయమంటాడు. అప్పుడు వశిష్ఠుడు విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని కార్తికమాసంలో సూర్యుడు తులా సంక్రమణలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాల యందు చేరుతుంది. ఇట్టి జలాశయాలలో విష్ణువు వ్యాపించి ఉంటాడు కనుక కార్తికస్నానం చేసినవారి పుణ్యం చెప్పనలవికాదు. వాపీకూప, నదీస్నాన, జపాదులను ఆచరించేవారు అక్షయమైన అశ్వమమేథయాగ ఫలాన్ని పొందుతారని వివరిస్తాడు.

స్త్రీలుగాని, పురుషులుగాని కార్తికమాసంలో తప్పనిసరిగా ప్రాతఃస్నానం ఆచరించాలనీ, కార్తికమాసపు సాయంకాలం శివాలయాలలోగానీ, వైష్ణ్వాలయాలలోగానీ యథాశక్తి దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం లభించడమే గాక, శివాలయ గోపురద్వార, శిఖరాలయందుగానీ, శివలింగసన్నిధిలోగానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించి పోతాయని, కార్తికంలో శివాలయంలో ఆవునేతితోగాని, నువ్వులనూనెతో గాని, ఆఖరికి ఆముదంతోగానీ దీప సమర్పణ చేస్తారో, వారు అత్యంత పుణ్యవంతులౌవుతారని, నెల పొడుగునా చేసినవాళ్లు జ్ఞానులై, తద్వారా మోక్షాన్ని పొందుతారని చెప్పబడింది. విష్ణు సన్నిధిలో ఎవరైతే భగవద్గీత పది, పదకొండు అధ్యాయాలను పారాయణ చేస్తారో, వారి పాపాలన్నీ తొలగిపోయి వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారని, తులసీదళాలతో, తెలుపు లేక నలుపు గన్నేరుపూలతోగాని శ్రీమహావిష్ణు పూజను చేస్తారో, వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలననుభవిస్తారని, కార్తికమాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే, పద్దెనిమిది పురాణాలలో ఏదైనా సరే ప్రవచించితే సర్వకర్మబంధ విముక్తులవుతారని వశిష్ఠ వచనం. వేదశాస్త్ర పురాణాలన్నీ మనకు అనేక ధర్మసూక్ష్మాలను అందిస్తున్నాయి.

ఈ ధర్మసూత్రాల వలన మనకు కొన్ని సమయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగానూ, స్వల్ప పుణ్యాలు గొప్పవిగానూ పరిణమిస్తుంటాయి.
పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తికవ్రతం వలన హరించుకుపోతాయి.

కార్తికంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపవసించి, రాత్రి నక్షత్రదర్శనానంతరం భోజనం చేస్తూ - ఆ రోజంతా భగద్ధ్యానంలో గడిపేవాళ్లు తప్పక శివ సాయుజ్యాన్ని పొందుతారని సూత ఉవాచ. ఈ మాసంలో ఏకభుక్తం, నక్తభోజనం చేస్తారు. అయితే నక్తం ఉండలేనివారు ఒక కార్తికపౌర్ణమినాడైనా నక్తములున్నా పుణ్యమే. కార్తికమాసమంతా తెల్లవారుఝాముననే స్నానం చేయాలి. అప్పుడే అది కార్తికస్నానం.

కార్తిక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలను ఇస్తాయి. ఈ కార్తికమాస వ్రతాన్ని తులాసంక్రమణదాదిగా గాని, శుద్ధపాడ్యమి నుండి ప్రారంభించాలి. ఈ మాసంలో వస్త్రదానం, హిరణ్యదానం, సువర్ణదానం, కన్యాదానం, భూదానం చేస్తే విశేష ఫలితాలు పొందడమే కాకుండా, తేజస్సు , యశస్సు, కార్యసిద్ధి, జ్ఞానలబ్ధి సౌభాగ్యాలు కలుగుతాయి.

ఈ మాసంలో ఉదయం, సాయంత్రంవేళల్లో ఆవు నేతితో గాని, నువ్వులనూనెతో గానీ దీపారాధన చేసి, అభిషేక ప్రియుడైన ఈశ్వరునికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అర్చనలు చేయడం వలన మహా పుణ్యం లభిస్తుంది.

ఈ కార్తికమాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులయితే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారు. యజ్ఞయాగాదులకన్నా కార్తికవ్రతం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది. తీర్థయాత్రల వల్ల కలుగునటువంటి ఫలం కూడా కలుగుతుంది, ఈ కార్తికమాసంలో శ్రీ మహావిష్ణుని ఎక్కడైతే పూజిస్తారో, అక్కడ భూత, పిశాచ, గ్రహ గణాలు దూరంగా ఉంటాయి. శివుడికి ప్రీతికరమైన జిల్లేడుపూలతో పూజించితే దీర్ఘాయులై, మోక్షాన్ని పొందుతారు. శుద్ధ ద్వాదశినాడు శివునికి మారేడు దళాలతో, జిల్లేడుపూలతో, విష్ణువుకు తులసీ దళాలతో, జాజిపూలతో పూజించుట అత్యంత శ్రేష్ఠదాయకం.

జలంధరుని భార్యయైన బృందా చితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తలసి వృక్షాలు అవిర్భవించాయి. సరస్వతి - ఉసిరి రూపము, లక్ష్మీ - మాలతి రూపము, గౌరి - తులసి రూపంగా వెలసినారు.

కార్తికమాసం ద్వాదశి రోజున 'తులసి' వృక్షసన్నిధిలో దీపప్రజ్వలనం చేసి,
"నమస్తులసి సర్వజ్ఞే పురుషోత్తమ వల్లభే 
పాహిమాం సర్వపాపేభ్య
స్సద్వ సంపత్ప్రదాయినీ" 
అంటూ ధ్యానం చేస్తూ భక్తి శ్రద్ధలతో తులసిదేవిని పూజించాలి.
ధాత్రీదేవి నమస్తుభ్యం 
సర్వపాప క్షయంకరీ 
విద్యాంచ, పుత్ర పౌత్రాం, 
ఆయురారోగ్యంచ, సంపదాం 
మమదేహి మహాప్రాజ్ఞే 
యశోదేహి బలం చ మే
ప్రజ్ఞాం మేధాం చ సౌభాగ్యం
విష్ణు భక్తిం చ శాశ్వతీం, 
నీరోగం కురుమాం నిత్యం
నిష్పాపం కురుసర్వదా’ 
అనే స్త్రోత్రం చేస్తూ ఉసిరి (ధాత్రీ) చెట్టు క్రింద శ్రీమహావిష్ణువును పూజించి, ఉసిరి దీపారాధన చేసి, ఉసిరికాయలు నివేదన చేసి, పదకొండు ప్రదక్షిణలు చేస్తే, అఖండమైన అష్టైశ్వర్యప్రాప్తి, అనంత పుణ్యఫలం లభిస్తుంది.

ఉసిరిచెట్టు క్రింద శ్రీమహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యమునికి కూడ శక్తి చాలదట. ఉసిరి చెట్లు ఉన్నతోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి. ఉసిరి ఔషధీ గుణము కలది కనుక, వనభోజనాల వలన ఆరోగ్యం చేకూరుతుంది. ఉసిరిపూజ వలన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్లలో స్థిరనివాసం ఏర్పరుచుకుంటుందని, కార్తికమాసంలో స్నానాలు, దీపారాధన, జాగరణ, తులసి, ఉసిరి పూజల వలన, ధన, ఫల, భూదానాల వలన పుణ్యఫలం లభిస్తుందని, కార్తిక మాహాత్మ్యాన్ని విన్నా - పారాయణ చేసినా, సకల పాపాలు నశించిపోతాయని శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తికమహాత్మ్యం ద్వారా తెలుస్తుంది. ఈ కార్తికమాసంలో భక్తిశ్రద్ధలతో హరిహరులను ఆరాధిస్తే సమస్త శుభాలు కలుగుతాయి.
కార్తికమాసంలో ఆధ్యాత్మిక సాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ నెల మొత్తం తెల్లవారుజామున నదీతీరంలోగానీ, చెరువులు, కొలనులు, బావుల వద్ద గానీ స్నానం చేయాలి. స్నానానంతరం ఓంప్రభాకరాయనమః, ఓందివాకరాయనమః, ఓంప్రభాకరాయనమః, ఓంఅచ్యుతాయనమః, ఓంనమో గోవిందాయనమః అనే నామాలను స్తుతిస్తూ సూర్యభగవానునికి ఆర్ఘ్యం పోయాలి. ఈ నెల మొత్తం ఇంటి ముందున్న ప్రధాన ద్వారానికి రెండువైపులా దీపాలను వెలిగించాలి.

కార్తికపౌర్ణమి: 
కార్తికపౌర్ణమి పవిత్రమైనది. ఆ రోజు చేసే స్నానం, దానం, హోమాల వలన అనంతమైన పుణ్యం వస్తుందంటారు. ఆ రోజు గంగాస్నానం చేసి సాయం సమయంలో దీపారాధన చేయాలి. ఆ రోజు చేసే దీపారాధన వలన పది యజ్ఞాలు చేసిన ప్రతిఫలం పొందవచ్చు. కార్తికమాసంలో సత్యనారాయణ వ్రతం ఆచరించి సత్యనారాయణవ్రత కథను వినాలి. సాయంకాలం ఆలయాల్లో లేదా రావి చెట్టు, తులసిచెట్టు ఈమూడింటిలో ఎక్కడో ఒక చోట దీపారాధన వెలిగించాలి. కాశీలో ఈ రీతిని దేవదీపావళీ రూపంలో జరుపుతుంటారు. కార్తిక పౌర్ణమి చేసి జాగరణ చేస్తే కోరుకున్నవన్నీ నెరనేరతాయని చెబుతారు.

దీపారాధన: 
పౌర్ణమినాడు చేసే దీపారాధన చాలా విశిష్టమైంది, సాధారణంగా కృత్తిక నక్షత్రం కార్తిక పౌర్ణమి కలసి వస్తుంటాయి. తిథి కన్నా నక్షత్రంలో దీపారాధన చేయడంశ్రేష్ఠం. ఈ నక్షత్రంలో చేసే దీపారాధనకు కృత్తిక దీపం అనే పేరుకూడా ఉంది. పౌర్ణమినాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్లి దేవుని దర్శించిన అనంతరం, సాయంత్రం శుచిగా ఉసిరికాయతో దీపాలు వెలిగించాలి. బియ్యపిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనే కూడా వాడవచ్చు. కార్తికమాసంలో దీపదానం చేస్తే పుణ్యమని అంటారు. దీప దానం చేయాలనుకునే వారు పత్తితో స్వయంగా వత్తులు చేసుకోవాలి. బియ్యంపిండి లేదా గోధుమపిండితో ప్రమిదలు చేసిన అందులో ఆవునెయ్యితో తాము చేసిన వత్తులు వేసి వెలిగించాలి. బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఈ నెలలో వచ్చే నాలుగు సోమవారాలలో శివుని పూజించడంతో పాటు ఉపవాస వ్రతాలు చేస్తే మంచిది. ఈ నెలలో వచ్చే అమావాస్య నాడు దేవాలయాలలో రకరకాల దీపారాధనలతో అలంకరిస్తారు. ఎవరు ఎన్ని దీపాలు పెడితే అంత పుణ్యం వస్తుందని ప్రతీతి. కార్తికమాసంలో వెలిగించే దీపాలను దర్శించడం వలన మనుష్యులతో పాటు సమస్త జీవరాసులకు పునర్జన్మ ఉండదని పురాణాల్లో ఉంది. దేవాలయాలలో చేసిన దీపారాధన వలన పుణ్యలోకాలు లభిస్తాయని నమ్ముతారు. కార్తిక మాసంలో దీపదానం చేయడం వలన జన్మాంతర పాపాలు నశిస్తాయంటారు.

దీపప్రాముఖ్యత: 
భారతీయ సాంప్రదాయంలో దీపావళికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి శుభకార్యానికి ముందు జ్యోతిని వెలిగించడం మన సాంప్రదాయం, జ్ఞానానికి సాంకేతికంగా దీపాన్ని చెబుతారు.
ఆలయాల్లోనే కాకుండా గృహాలలో కూడా నిత్యం దీపారాధాన చేయడం ఎంతో కాలంగా వస్తున్న ఆచారం. తొలిసంధ్య నుండి మలిసంధ్య వరకు ఏ ఇంటిలో దీపం వెలిగితే ఆ ఇంట శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుందంటారు. సృష్టి, స్థితి, లయల్లో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపాన్ని త్రిముర్తులకు ప్రతీకగా పేర్కొంటారు. దీపంలో కనిపించే నీలకాంతి విష్ణుమూర్తికి,తెల్లనికాంతి పరమశివుడికి, ఎరుపు బ్రహ్మదేవునికి అర్థంగా చెబుతారు. అలాగే దీపకాంతి విద్యా, ఐశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీసరస్వతులకు   ప్రతీక. భగవంతునికి సమర్పించే షోడశోపచారాలలో దీప సమర్పణ ఒకటి. జ్యోతి స్వరూపంగా పిలువబడే దీపం సిద్ధిశక్తులను ప్రసాదిస్తుందని చెప్తారు.

కార్తిక మాస ప్రాధాన్యత : 
కార్తికమాసంలో చేసే దీపారాధన వలన గతజన్మ పాపాలతో సహా ఈ జన్మపాపాలు కూడా తొలగిపోతాయి. స్త్రీ ఈ దీపారాధన చేయడం వలన సౌభాగ్యాలు సిద్ధిస్తున్నాయి. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవలన్నదే ఈ దీపారాధన ఉద్దేశ్యం.

వనభోజనం: కార్తికమాసం అంటేనే వనభోజనాల మాసం అని చెప్పుకోవచ్చు. ఉసరిచెట్టుక్రింద శ్రీమహావిష్ణువు ఫోటో పెట్టి పూజించడంతో పాటు అదే చెట్టుక్రింద సహపంక్తి భజనాలు చేయాలి.

కార్తికమాస వ్రతాలు: 
అఖండమాస సౌభాగ్యవ్రతం గురించి ముందుగా తెలుసుకుందాం... వివాహితులు ఈ అఖండ సౌభాగ్యవ్రతం చేస్తారు. భర్త కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలంటూ చంద్రుని పూజించి వ్రతాన్ని పూర్తి చేస్తారు. కార్తిక చతుర్దశి నాడు చేసే ఈ వ్రతంలో స్త్రీలు శివపార్వతులను కార్తికేయుని, గౌరీదేవిని పూజించాలి. పాండవులు వనవాసం చేసే రోజులలో అర్జనుడు ఇంద్రకీలాద్రిపై తపస్సుచేయడానికి వెళ్లాడు. ఎంతకాలమైనా తిరిగి రాలేదు. అర్జునుడు రాకపోవడానికి కారణాలు తెలిపాక ద్రౌపది ఎంతో బాధపడింది. అర్జనుడు తిరిగి రావాలంటే సౌభాగ్యవ్రతం చేయాలంటూ కృష్ణుడు ద్రౌపదికి ఈ వ్రతమహాత్యం, వ్రతవిధానం వివరించాడు.

గోవత్స ద్వాదశి ఉత్సవం: 
ఈ మాసంలో వచ్చే కృష్ణ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఆ రోజు వ్రతం చేసుకునే వారు తెల్లవారుజామున లేచి నదీస్నానం చేయాలి. రోజుమొత్తంమీద ఒక్క పూట భోజనం చేయాలి.

గో త్రిరాత్రి వ్రతం: 
ఈ వ్రతాన్ని కార్తిక కృష్ణత్రయోదశనుండి అమవాస్య వరకు చేస్తారు. గోవర్ధనగిరిధారికి రెండు వైపులా రుక్ష్మిణి, సత్యభామలు, బాలచంద్రడు, యశోద తదితర ఫోటోలు పెట్టి పూజించి, తదుపరి గోమాతను పూజంచాలి. తెల్లవారుజామున లేచి స్నానంచేసి గాయిత్రి మంత్రంతో 110 పిడికిళ్లు నువ్వులను ఆహుతి ఇచ్చి వ్రతాన్ని పూర్తిచేయాలి. కార్తీక మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుదభ్రిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలను తీరుస్తాడు. అందుకే ఆ స్వామికి అశుతోషుడు అన్న పేరు వచ్చింది.
 అభిషేక ప్రియః శివః శివునికి అలంకారాలతో రాజోపచారములతో, నైవేద్యములతో పనిలేదు. మనస్సులో భక్తినుంచుకుని శివుడ్ని ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగ చేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసినవారికి గ్రహదోషాలు, ఈతి బాధలు ఉండవు. శివునిని శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజించిన స్వర్గమున లక్ష సంవత్సరములు జీవించును.

ప్రదోషకాలంలో పరమేశ్వరుడు, ఏకకాలంలో రెండురూపాలని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోషకాలంగా చెప్పబడింది. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనంచేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులగుదురు. శివాలయములో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్య కార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. అష్టోత్తర లింగార్చన, మహా లింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమమైన అర్చన. ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సర మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి.
విష్ణు సహస్రనామ పారాయణం: 
తులసి దళాలతో శ్రీమహావిష్ణుని కార్తికమాసంలో పూజిస్తే అది ముక్తిదాయకం అని శాస్త్ర వచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలవబడతాడు. కార్తిక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుదభ్రిషేకాలు చేయడం శ్రేష్ఠం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది. కార్తిక మాసంలో ఏమంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం. కార్తిక పురాణం రోజుకో అధ్యాయం పారాయణ చేయడం శుభకరం.
గౌరీదేవిని పూజిస్తే : 
ఈ మాసం మొదటినుండి సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తిక నదీ స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోను, కోనలలోను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్య తిథులలోనైనా స్నానం ఆచరించాలి. కార్తిక మాసం మొదలునుండే ఆకాశదీపం ప్రారంభమవుతుంది. ఉభయ సంధ్యలలో గృహమందు, పూజామందిరంలోను, తులసి సన్నిధిలోను, ఆలయమలలో దీపారాధన, ఇహ, పర సౌఖ్యాలను కలగచేస్తుంది. ఈ మాసం దీపారాధనకి ప్రశస్తం. దీపదానమందు ఆవునెయ్యి ఉత్తమం. మంచి నూనె మధ్యమము. ఏకాదశి అత్యంత విశేషమైనది. ఉత్థానైకాదశి కార్తిక శుద్ధ ద్వాదశి కార్తిక పౌర్ణమి లాంటి దినాలుప్రశస్తమైనవి.

చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో, ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తిక మాసమని పేరు. కార్తిక మాసమునకు సమానమైన మాసము, విష్ణుదేవునికంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్త్రములు, గంగకంటే పుణ్యప్రదములైన తీర్థములు లేవన్నది పురాణ వచనం.కార్తిక మాసం అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైంది. శివకేశవులకి ప్రీతికరమైన మాసం.
సర్వే జనాః సుఖినో భవంత
మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.