గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, ఫిబ్రవరి 2016, శనివారం

“విశాఖ శతావధానము” Sri Rambhatla Parvatheeswara Sarma.

జైశ్రీరామ్.
శతావధాని. రాంభట్ల పార్వతీశ్వర శర్మ.

“విశాఖ శతావధానము” లోని
మొదటి సమస్య.
కడిమిళ్ళ శ్రీవిరించి గారు, నరసాపురం.
రాతికి మ్రొక్కువారికి నిరంతర సౌఖ్యము లభ్యమయ్యెడిన్
పూరణ:
పోతనతొల్లివ్రాసెనయ పొల్పుగ భావతమ్మునందు, క్షో
ణీతలరాజసింహమవనిన్ పరిపాలనఁ జేసియుండె, వి
ఖ్యాతినిఁగన్న రామునకు, కార్యముఁదీరగ నెంచి రావణా
రాతికి మ్రొక్కువారికి నిరంతర సౌఖ్యము లభ్యమయ్యెడిన్!
2వ సమస్య.
బి.వి. బంగార్రాజు గారు, విశాఖపట్నం.
ఉగ్రవాదమె విశ్వమందున యుక్తమైనది చూడగన్
పూరణ :
అగ్రగామిగ నున్న దేశపుటంచులన్ గలదెప్పుడున్
భూగ్రహమ్మున కక్షఁ దెల్పుచు పొందికల్ విడనాడుచున్
ఆగ్రహించుచు శాంతిఁ గూల్చగ నల్లలాడ ప్రజాళియే
ఉగ్రవాదమె విశ్వమందున యుక్తమైనది చూడగన్
3వ సమస్య
కోడూరు శ్రీలక్ష్మి గారు, విశాఖపట్నం.
ప్రవరుడునవ్వరూథినిని పట్టి సుఖించె హిమాలయంబునన్
పూరణ :
జవముననేగెనాద్విజుడు చక్కగశీతనగమ్ముఁగానగా
నవిరళ హోమతత్పరున కంద వరూథిని కోర్కెఁదెల్పె సం
స్తవమునఁబొందెనగ్నికృప, సాగెనుగీమున, కంత శాంబరీ
ప్రవరుడునవ్వరూథినిని పట్టి సుఖించె హిమాలయంబునన్
4వ సమస్య
కన్నేపల్లి వరలక్ష్మి గారు, విశాఖపట్నం.
మానవత్వము వీడి సోదర మంచిగా నివసింపుమా
పూరణ. :
గ్లానికల్గక యుండ మిత్రులఁ గావఁ జెల్లును ప్రేమతో
పూని తోడయి కావ్యరాశిని పుణ్యముల్గొన లెస్సయౌ
హానిచేయగ, నంతముంగొన నక్కటా! మతమందురే
మానవత్వము వీడి; సోదర మంచిగా నివసింపుమా.
5వ సమస్య
కారె అనూరాధ గారు, విశాఖపట్నం.
బాంబులు భారతావనికి బంగరు పంటలు కూర్చు మిత్రమా
పూరణ :.
సాంబుని సత్కృపంగొనగ సర్వము మంగళమౌట తథ్యమౌ
వెంబడి వచ్చు సంపద, వివేకము వృద్ధిఁగనున్ స్థిరమ్ముగా
సంబరమై కృషీవళులు సంతసమందగ, మేఘ సత్కదం
బాంబులు భారతావనికి బంగరు పంటలు కూర్చు మిత్రమా
6వ సమస్య
కొప్పిశెట్టి సూర్యనారాయణ గారు, విశాఖపట్నం.
కన్నముఁ బెట్టువాని ననఘాయని పిల్చిన సార్థకంబగున్
పూరణ :.
కన్నదిగాని విన్నదియుఁ గాని యొకానొక క్షామమక్కటా
దున్నగ భూమియున్నపరితోషముఁ గల్గునె చూడఁ జూడ రై
తన్నకు, జాతినంతటిని నాదరమొప్పగఁ గాచు వాడ! నీ
కన్నముఁ బెట్టువాని ననఘాయని పిల్చిన సార్థకంబగున్ 
7వ సమస్య
డా. ఎల్. ఎస్. యాజ్ఞవల్క్య శర్మ గారు, విశాఖపట్నం..
కవిత కనరాదు తిక్కనకవితలోన
నిత్యసాధనన్ విద్యార్థి ప్రత్యయముల
శేషషష్ఠికి ’యొక్క’ విశేషమమరు
“కవితక నరాదు తిక్కనకవిత”లోన”
సవ్యమౌను “నిర్ధారణషష్టి”నెపుడు.
(కవిత కు అనరాదు నిర్ధారణ షష్ఠి లో కవితలోన అనాలి అని భావము)
8వ సమస్య 
బెహరా వెంకటలక్ష్మి గారు, విశాఖపట్నం.
పాపము లేనిచో జగతి పాడయిపోవును నిశ్చయమ్ముగన్
లోపము సద్గుణమ్మనగ లోకమునందునఁజెల్లు రెండు నా
దీపపు నీడవెల్గులన దివ్యముగా మన సృష్టికర్థమై
ప్రాపుగఁ గాచు పుణ్యము; ప్రపంచముఁ గూల్చు నఘమ్ము; పుణ్యమున్
పాపములేనిచో జగతి పాడయిపోవును నిశ్చయమ్ముగన్.
9వ సమస్య.
బత్తుకొండ నాగలక్ష్మి గారు, విశాఖపట్నం.
చరణంబులు లేనివాడు చకచకనడిచెన్
తరియించి జీవవార్థిని
నరుడొక్కడు పట్టెనంత నాకపు త్రోవన్
ధరనింతయు దుష్కర్మా
చరణంబులు లేనివాడు చకచకనడిచెన్.
10వ సమస్య
గుత్తి పుష్పలత గారు, విశాఖపట్నం.
అత్తకు మీసముల్ మొలిచె నల్లుడు వచ్చిన వేళ యెట్టిదో
తత్తరపాటునన్ వనిత తల్లికి చెప్పగనేగెనింటికిన్
వత్తురె బంధురాశియని వంటలు జేయగ నెంచెనామె, యా
యత్తముఁజేయ భోజనము హంగులతో మసియంట మోమునం
దత్తకు, మీసముల్ మొలిచె నల్లుడు వచ్చిన వేళ యెట్టిదో .
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చిరంజీవి రాంభట్ల పార్వతీశ శర్మగారి అవధానము నందలి సమస్యా పూరణలు హృద్యముగా నున్నవి
అందించిన చిరంజీవి చింతా సోదరులకు అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.