గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, డిసెంబర్ 2015, ఆదివారం

మార్గశీర్ష మాస విశిష్టత . . . . బ్రహ్మశ్రీ జాజి శర్మ.

జైశ్రీరామ్.
మార్గశీర్ష మాస విశిష్టత
 బ్రహ్మశ్రీ జాజి శర్మ.
‘మార్గశీర్ష’ మాసము ఒక విలక్షణమైన మాసము. ‘మార్గశీర్షము’ అంటేనే మార్గములందు శ్రేష్ఠమైనది. ఉపయోగకరమైనదని అర్థం. ఇది ఏ మార్గము అంటే భగవంతుని పొందు భక్తిమార్గము. శీర్షప్రాయమైన ఈ మార్గము మిగిలిన మార్గములన్నింటికన్నా ప్రధానమైనది, ప్రాముఖ్యతతోపాటు పవిత్రత కూడా ఏర్పడటంచే ఇది శ్రేష్టమైనది. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం మార్గశిరం.
‘‘బృహత్సామ తథాసామ్నాం- గాయత్రీ ఛందసా మహం- మాసానాం మార్గశీర్షోహ- ఋతూనాంకుసుమాకరం’ అనే శ్లోకంలో మార్గశీర్గాన్నీ నేనే, ఆరు ఋతువులలోనూ పుష్పసౌరభం నేనే, సామవేదానికి చెందిన గానాలలో బృహత్సామాన్ని నేనే, ఛందస్సులలో గాయత్రీ ఛందాన్ని, శోభ అధికంగా ఉండే వసంత కాలాన్ని నేను అని భగవద్గీతలోని విభూతి యోగంలో సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్ముడే పేర్కొన్నాడు. శ్రీకృష్ణుడు మార్గశిరం అంటే నేనేనని చెప్పుకున్న మాసమిది.
శ్రీ సూర్య భగవానుడు పనె్నండు నెలల్లో నెలకి ఒక మాసము చొప్పున మారుతూ ఉండేదాన్ని ‘సంక్రమణము’ అంటారు. మనకు సంవత్సరానికి పనె్నండు సంక్రమణములు వస్తాయి. సూర్యుడు తులారాశి నుండి వృశ్చిక రాశిలోనికి ప్రవేశించడం వృశ్చిక సంక్రమణము అంటారు. ఈ మార్గశిర మాసము శ్రీ మహావిష్ణువుకు, శ్రీ మహాలక్ష్మీదేవికి, సూర్యభగవానుడికి కూడా ప్రీతికరమైన మాసము.
ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం, పుణ్యప్రదం. ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయవలెను. శ్రీ విష్ణుతోపాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని, ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో ‘ఓం దామోదరాయనమః’ ఓ నమో నారాయణయనమః’ అనే మంత్రాన్ని పఠించాలని శాస్త్ర వచనం.
ప్రతిరోజు బ్రాహ్మీముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని మృత్తికతో, తులసి ఆకులను తీసికొని ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి.
మార్గశిర మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మీని పూజిస్తూ ‘‘మార్గశిర లక్ష్మీవార వ్రతం’’ చేయడం, ద్వాదశి అభిషేకంవల్ల ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఆధ్యాత్మికపరంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మార్గమాసంలో భగవంతునియందు లయించవలెనన్న తపనగల వారు అందరూ ఈ మార్గశిర మాసములో వైష్ణవప్రధానమైన లక్ష్మీ వ్రతాన్ని ఆచరించుటకు అర్హులే.
ఈ మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ‘మదుసూధనుడు’ అనే నామముతో శ్రీ మహావిష్ణువును పూజించవలెను. ఈరోజునుండి ధనుర్మాసం ప్రారంభమైనట్లే. ఈ రోజునుండి ప్రతిరోజు విష్ణ్వాలయాలలోప్రత్యేక అర్చనాదులు జరుగుతాయి ‘మార్గళివ్రతం’ అనే పేరుతో గోదాదేవి ఈ ధనుర్మాసమంతా విష్ణు వ్రతాన్ని చేపట్టి రోజుకొక్క పాశురంతో స్వామిని కీర్తించింది. మార్గశీర్షంలో మృగశిరతో కూడిన పూర్ణిమ శ్రేష్ఠం. ఈ మాసంలో లవణం దానం చేయటం, ఈ మార్గశిర మాస విధులను పాటించడంవల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి.స్వస్తి.
జాజి శర్మ గారికి అభినందన పూర్వక ధన్యవాదములు.
జైహింద్.. 
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మార్గశిర మాస విశిష్టతను గురించి చక్కని విషయాలను అందించిన శ్రీ జాజి శర్మ గారికి ధన్య వాదములు..మాకందించిన సోదరులు శ్రీ చింతా వారికి కృతజ్ఞతలు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.