గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, ఫిబ్రవరి 2009, శుక్రవారం

మనం కూడా సమస్యా పూరణ చేసిచూద్దామా? 1.

adacall.
పూర్వం అనేవారు. అడిగేవారికి చెప్పేవారు లోకువ అని. కాని యిప్పుడు నాకర్థమైంది చెప్పే వారికి అడిగేవారే లోకువ అని.
నిజమండి. అలాగే వుండాలి. ఒక సమస్య పూరణకిస్తే ఎంతవేగవంతంగా ఎంత అద్భుతంగా ఎంత సృజనాత్మకంగా ప్రతిస్పందించారండి మీరంతా? నాకు చాలా తృప్తిగా వుంది. ఇంతటి ఉత్సుకత గల మీరంతా వున్నారంటే నాకు చాలా ఆనందంగా వుంది.
మీ ఉత్సాహంచూచాక మరింక ఉపేక్ష చేయకుండా మీతో సమానంగా నేనూ పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలని. మీ మెదడుకు పని కల్పించాలనీ ఆలోచించి ఇప్పుడే మరో సమస్య మీ ముందుంచుతున్నాను.
మీ పూరణలను కామెంట్స్ నుండి గ్రహించి పోష్ట్ లో అతికిస్తాను. తద్వారా మీ కమనీయ రచనా వైవిధ్యాన్ని, భావుకతా సంపత్తిని పాఠకలోకమంతా గ్రహిస్తూ మంచినభివృద్ధి చేస్తుంది. మరింక సమస్య చూడాలనుందా? ఐతే మీ పూరణ కొఱకు నేనిచ్చిన సమస్య.

-------->పరమ శివునితో లక్ష్మియు పవ్వళించె<--------

చూచారుకదా? సమస్యని. మరెందుకాలస్యం? పూరించండి వేగంగా. పంపించండభిమానంగా.
మరొక్క విషయం---- ఏంటంటారా----- ఏ పాదంలో పెట్టైనా పూరించే అవకాశం కూడా మీకుందండోయ్.మరి నేనిక మీ సమాధానాల పరంపర కోసం ఎదురు చూస్తాను?
జైహింద్. Print this post

10 comments:

జిగురు సత్యనారాయణ చెప్పారు...

తేట గీతి:
కొండ పైన కాత్యాయిని కోరియుండె
పరమ శివునితో, లక్ష్మియు పవ్వళించె
విష్ణుతో నడి సంద్రాన విభ్రమముగ
ఇల్లు వాకిలి లేనట్టి యింతులయ్యె!!

అజ్ఞాత చెప్పారు...

Chala bagundi

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

హరియు లోకపాలన సేసి దనిసి జాలి
మీరి యోగనిద్రను చనె మరచె నన్ను
పరగె కాపురమ్మిటనివాపోయి పల్కె
పరమ శివునితో, లక్ష్మియు పవ్వళించె.

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

సవరణ. మన్నించండి:
హరియు లోకపాలన సేసి అలసి జాలి
మీరి యోగనిద్రను చనె మరచె నన్ను
పరగె కాపురమ్మిటని వాపోయి పల్కె
పరమ శివునితో, లక్ష్మియు పవ్వళించె.

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

జిగురు సత్యనారాయణ కవితకు జేజే!

రాఘవ చెప్పారు...

ప యనఁగ పయనించును గాఁన పవనుఁడు, మఱి
రమ యనంగ యనంగమాత మణిరమణి,
శూలి శివుడు, పదములొకచోటఁ జేరఁ
పరమశివునితోఁ లక్ష్మియు పవ్వళించె!

Sanath Sripathi చెప్పారు...

నాథు డిచ్చిన గోరింట నూరి నూరి
తనయ చేత బెట్టె తరుణి తనివి తీర
నూత్న రీతిగ శశితోడ నాటి నుండి
పరమ శివునితో లక్ష్మియు పవ్వళించె.

Sanath Sripathi చెప్పారు...

ఒక ఇంట రెండేళ్ళ పసి పాప ఉన్నదట. ఆ పాప తల్లిదండ్రులు ఆషాఢ మాసం లో గోరింటాకు తెస్తే ఎప్పుడూ చుక్కలూ సూర్య చంద్రులెనా.. కొంచం మార్చు అని గోల చేసిందిట. సృజనాత్మకత ఉట్టిపడే ఆ తల్లి చెతుల మీద 'మెహెందీ ' డిజైన్ల లో శివుడూ, రాముడూ, కృష్నుడూ, మొదలైన బొమ్మలు వేసిందిట. అప్పటి నుండీ లక్ష్మి అనే ఆ పాప తో పాటూ, ఆ పాప చేతుల పై ఉన్న శివుడూ మొ| వారు కూడా పడుకుంటున్నారుట.

నాథు డిచ్చిన గోరింట నూరి, తరుణి
తనయ 'లక్ష్మి ' చేతికి బెట్టె, తనివి తీర
నూత్న రీతి విరించి తొ, నాటి నుండి
పరమ శివునితో, లక్ష్మియు పవ్వళించె.

ఆత్రేయ కొండూరు చెప్పారు...

పరవశమునాట లాడెడి
పరమాత్మల చంకనెత్తి పడకకు జనగా
పరతన బేధము లెరగక
పరమ శివునితో లక్ష్మియు పవళిం చెన్‌

పరమ సాధ్వి అనసూయ త్రిమూర్తులను పిల్లలుగా చేసినప్పుడు
వారిని తిరిగి తీసుకుని వెళ్ళడానికి వచ్చిన వారి పత్నులు పడిన హడావిడి
లో చేతికందిన పిల్లగాడిని వెంట తీసుకెళ్ళారు అని చెప్ప దలిచాను.
నాల్గవ పాదం.. కందానికి సరిపోక కాస్త
మార్చాను . తప్పులు దిద్దగలరు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ప్రియ అత్రేయా!
పరమ శివుని తోడ లక్ష్మి పవళించెనయా!
అని
చిన్న మార్పు సరిపోతుంది.
పద్య రచన ధారా శుద్ధి కలిగి వుంది.
అభినందనలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.