గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, అక్టోబర్ 2009, శుక్రవారం

అభివందనం. శ్రీ షిరిడీశదేవశతకముపై డా.ఎల్.ఎస్.వై.వి.శర్మగారి సమీక్ష.

అభివందనం

డా. ఎల్.ఎస్.యాజ్ఞవల్క్య శర్మ, M.A.M.Phil,Ph.D.
ప్రశాంతి నిలయం,
పాయకరావు పేట.
ఆధునికాంధ్ర వాఙ్మయం అనేక ప్రక్రియలతో శాఖోపశాఖలుగా విస్త్రుతమైనప్పటికీ శతక ప్రక్రియ మాత్రం అప్పుడూ యిప్పుడూ నవనవోన్మేషమై తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. తాను నమ్మిన దైవాన్ని గాని, వ్యక్తిని గాని, లేదా తన ఆత్మను గాని స్తుతిస్తూ స్వాభిప్రాయాన్ని నిష్కర్షగా ఆవిష్కరించే స్వేచ్ఛ శతక రచయితకుంటుంది.

ఇటీవలి కాలంలో శ్రీ చింతా రామ కృష్ణా రావు కవి వర్యుల కలం నుండి జాలువారిన" శ్రీ షిరిడీశ దేవ శతకం " ఒక ఉత్తమ రచనగా శ్రీ బులుసు వేంకటేశ్వర్లు వంటి కవి పండితులచే ప్రశంసలందుకుని ఆంధ్ర లోకాన్ని ఆకట్టుకుంటోంది. భక్తి రస ప్రథానమైన యిటువంటి ఆర్షసాహితీ మరందాన్ని ఆస్వాదించే భాగ్యం ఆంధ్ర లోకానికి కలిగించినందుకు శ్రీ రామకృష్ణాగ్రజులకు కృతజ్ఞతాభివందనలు సవినయంగా తెలుపుకుంటున్నాను.

నేటి కాలంలో భారతీయుల్ని ఆకట్టుకున్న దైవం షిరిడీశుడంటే అత్యుక్తి కాదేమో. సర్వ దేవతాతీత స్వరూపునిగా ఆ స్వామి అశేష భారత ప్రజలచే నీరాజనాలందుకుంటున్న విషయం లోక విదితమే. అటువంటి సాయి తత్వాన్ని ఈ కవి అష్టోత్తరశత చంపకోత్పలాలతో అర్చించి, సాయి కరుణకు పాత్రుడైనట్లు మనకు తెలుస్తుంది.

షిరిడీశ దేవునే మనం ఎందుకు కొలుస్తాం? అంటే
చ:- అనితర సాధ్యమైన మహిమాన్విత శక్తులు చూపుచుండి, మ
మ్మనయము బ్రోతువీవు. పరమాత్ముడవంచు భజింతు మేము. ని
న్ననయముఁ గొల్చు చుండి,సుగుణాకర చిత్తులమై మెలంగఁ జే
య నిను మదిం దలంతుము. మహాద్భుత! శ్రీ షిరిడీశ దేవరా !

అని తన ఆర్తిని మహాద్భుత శక్తి కలిగిన స్వామికి నివేదించారు కవి.

అలాగే ఈ క్రింది పద్యంలో భగవంతుడు సర్వాంతర్యామి అని చక్కగా వివరిస్తూ ఇలా అంటారు.
ఉ:- కొందరు భక్త కోటి నిను కోవెల లోపలఁ గాంచు చుండ నిం
కొందరు సన్నుతాత్ములకు గుండెలలో కలవంచుఁ గాంతు రిం
కొందరు దీనులందుఁ గడు కూర్మిని నిన్ గని పొంగుచుండు. ని
న్నందరి లోనఁ గాంచుటయె న్యాయము. శ్రీ షిరిడీశ దేవరా !

స్త్రీవాద కవిత్వంలో స్త్రీ జనోద్ధరణకు పాటుపడ్డ కవులలో వీరు కూడా అగ్రగణ్యులు. ఈ శతకంలో అనేక పద్యాలు కాలానుగుణంగా స్త్రీల పట్ల జరిగే అన్యాయాలు అకృత్యాలు స్పష్టపరుస్తున్నాయి. సమస్యా పరిష్కారం కోసం కవి తన ఆవేదనను సాయికి నివేదించడం ఈ పద్యాల్లో మనం చూస్తాం. ఇందుకో ఉదాహరణ పద్యం చూడండి.
చ:- మగువలపైన మూర్ఖత నమానుష హింసల నేచు మూర్ఖులన్
భగ భగ మండు యగ్నిశిఖపాలొనరింపు ముపేక్ష యేల? యీ
మగువలఁ గావకున్న వర మాతృజనంబిక మృగ్యమౌను. నీ
తెగువను జూపిబ్రోవుమయ తీరుగ ! శ్రీ షిరిడీశ దేవరా!

అనాదిగా స్త్రీకి ఓ ప్రత్యేక ప్రతిపత్తి గల్గిన యీ దేశంలో మహిళలకు జరుగుచున్న అన్యాయాలను ప్రతిబింబింపఁ జేసిన పద్యాలు చదివితే సహృదయ పాఠకుల మనసుల్ని కలిచివేస్తాయనడంలో సందేహం లేదు.

సామాజిక స్ఫృహ గలిగిన కవిత్వం వీరిది అనడానికి ఈ పద్యం ఒక్కటి చాలు.
ఉ:- హైందవ భావ ప్రేరణము నాత్మల ముస్లిము లొందఁ జేసి, యీ
హైందవ జాతి ముస్లిముల యద్భుత ప్రేరణమొందఁ జేసి, జై
హిందను భారతీయులుగ హిందువు ముస్లిము లిద్దరొక్కటై,
పొందిక నుండఁ జేసితివి, పూజ్యుడ ! శ్రీ షిరిడీశ దేవరా!

ఇంకా
ఏది సతం బనిత్యమన నేది?
నమ్మిన వారి చిత్తమున
లోకమనంతమయ్య.
వృక్షములాదిదేవతలు.
గుమ్మడిపండు చందమున.
వంటి అనేక నానుడులు పోలికలు సందర్భోచితంగా వివరించి కవి తన లోకజ్ఞతను చాటుకున్నారు.

తన తల్లిదండ్రులను, గురువులను స్మరిస్తూ వ్రాసిన పద్యాలు కవికి వారిపట్ల గల అనన్య సామాన్య భక్తికి నిదర్శనాలు.
ఉ:- కాణ్వ విరాజ నామమునఁ గ్రాలెడు సత్ శుభ శాఖజుండ. చిం
తాన్వయ సంభవుండ. చరితార్థుడ నీధర. రామకృష్ణుడన్.
నిన్వినుతించి, మ్రొక్కి, మది నిన్ గని, " శ్రీ షిరిడీశ దేవ" పే
రన్విరచించితీ శతక రాజము. శ్రీ షిరిడీశ దేవరా !

అని కాణ్వ శాఖపై తనకు గల అభిమానాన్ని వ్యక్తీకరించడం అభినందనీయం.

ఉభయ భాషా ప్రవీణులు, నిరంతర రామాయణ పఠనా శీలురు, మహర్నటులు అయిన శ్రీమాన్ కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యుల పట్ల తనకు గల గురు భక్తిని ఈ పద్యంలో ఇలా చాటారు.
ఉ:-ఆర్యులు కల్వపూడి వినయాన్విత వేంకట వీర రాఘవా
చార్యుల పాద ధూళి విలసన్నుత జ్ఞాన ప్రబుద్ధిఁ గొల్పగా
వీర్యుడ! నీ కృపామృతముఁ బ్రీతిగ నీ శతకంబు లోన నే
నార్యులు మెచ్చ వ్రాసితిని హాయిగ. శ్రీషిరిడీశ దేవరా!

ఆచార్య దేవోభవ అన్న దానిని సత్యం చేశారు శ్రీ రామ కృష్ణగారు.

కీ.శే. ముత్యం రామమూర్తి కవి పండితుల కోర్కెకు ప్రతీకగా ఈ శతక రచన గావించినట్లు మనకనిపిస్తుంది. వీరిద్దరి సంబంధం అటువంటిది. ఇలాంటి ఇద్దరు ఉద్దండ కవి పండితులు లభించడం " చోదవరం " ప్రజలు చేసుకున్న పూర్వ పుణ్యఫలం.

షిరిడీశునిపై తనకు గల అపార భక్తికి ఈ ఒక్క పద్యం " కలికి తురాయి ".
ఉ:- నీ దరహాస చంద్రికలు నిత్యముఁ గ్రోల చకోరమౌదునా ?
నీ దరి కాంతులీను మహనీయ సముజ్వల జ్యీతి నౌదునా?
నీ దరిఁ జేరు భక్తుల పునీతపు పాద రజంబు నౌదునా?
నీ దరి కెట్లు జేర్చెదవొ? నిత్యుడ! శ్రీ షిరిడీశ దేవరా!

అని తన వినమ్రతను తెలుపుకున్నారు.
ఈ శతకం చదివిన పాఠక లోకానికి అన్నీ శుభాలే జరుగుతాయని నా ప్రగాఢ విశ్వాసం.
జగమెఱిగిన యీ కవి పుంగవులు ఇంతటితో ఆగకుండ, మరిన్ని తెలుగు రచనలు వెలువరించి, పాఠక లోకాన్ని ఆనందింపఁ జేస్తారని తలుద్దాం. ఆ షిరిడీశుడు శ్రీ చింతా రామ కృష్ణా రావు గారికి ఆయురారోగ్యాలు సదా యిస్తూ, ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను.-- ఇక సెలవు.

భవదీయ,
డా. ఎల్.ఎస్.యాజ్ఞవల్క్య శర్మ.
తే. 02 -03-2009.


నా నివేదన

శ్రీ గురుభ్యోనమః.
పాఠక మహాశయులారా!
మంగళప్రదమైన ఆ పరమేశ్వరుని సృష్టిలో బుద్ధి జీవులమై మానవులుగా మనము జన్మించుట మన పురాకృత సుకృత ఫలమే కాని వేరొండు కాదు. అందునా భగవద్భక్తితత్పరత ఆ పరమాత్మ కృప కలిగినంత మాత్రముననే లభించును కాని సామాన్యముగా లభించునది కాదు. అట్టి భక్తి తత్పరులను కాపాడుట కొఱకే తానున్నట్టుగా ఆపరమాత్మ తన భక్తులను వెన్నంటి ఉంటాడు. అతఁడు తనను కొలిచే వారికి కొంగు బంగారం. ఆ పరమాత్మ తన భక్తులను కటాక్షించుట కొఱకు అనేక అవతారములెత్తుతుంటాడు. అనేక రూపములు పొందుతుంటాడు. తన భక్తులైన మానవులు కోరుకొనే కోరికలు తీరుస్తూ, నిరంతరం భక్తుల హృదయాలనే ఆలయంగా చేసుకొని కొలువుండే దైవాలలో నేడు శ్రీ ‘షిరిడీ సాయి’ ప్రముఖుఁడనుటలో ఏమాత్రం సందేహము లేదు. మన  నిర్మలమైన మసస్సే షిరిడీశ్వరునికి మంత్ర తంత్రములు, పూజా పుష్పములు, నైవేద్యములు. మనసారా  ఆ షిరిడీ సాయిని తలచుకొని, మన మనసులో గల కోరికను తీర్చమంటే చాలు. ఆ సాయి అది ఎంతటి క్లిష్టతరమైన కోరిక ఐనప్పటికీ ఇట్టే తీరుస్తూ కలి యుగంలో అత్యంత ప్రతిభతో వెలుగొందుతున్నాఁడు. 
నేను అనేకమైన సంఘటనలను చూచి మిక్కిలి ఆశ్చర్యమునకు లోనయ్యేవాడిని. అట్టి షిరిడీశ్వరుని ప్రతిభలు నా అనుభవంలో ఉన్నవి లోకులకు చెప్పాలనే తపన నాలో ఏ నాటి నుంచో ఉంది. ఇంత వరకు చెప్పలేకపోయాను. దేనికైనను సమయం ఆ భగవంతుఁడు కల్పించాలి కదా! అంత వరకు ఏ పనీ జరగదు.
విశాఖపట్టణం జిల్లా, చోడవరం పట్టణ నివాసి స్వర్గీయ ముత్యం రామ మూర్తి గారు ప్రముఖ సాహితీ వేత్తయే కాక ప్రముఖ విలేఖరి కూడాను. వారికి నేనన్నా, నా కవిత్వమన్నా అవ్యాజమైన ప్రేమ. 
వారికి అవసాన దశ సమీపించినది. అనారోగ్యంతో  బాధపడుతూ ఉన్న వారికి  వైద్యం చేయించారు అతని అల్లుఁడైన ప్రాత రాజశేఖర్ మరియు కుమార్తె మ.ల.స. మీనాక్షి. ఇక ప్రయోజనం లేదని వైద్యులు చెప్పడంతో తన స్వగృహానికి వారిని తీసుకు వచ్చేసారు. జీవితంలో చివరి దశలో ఉన్న రామ మూర్తి గారు నన్ను చూడాలని ఉందని రమ్మని నాకు కబురంపారు. నేను వారి వద్దకు వెళ్ళాను. అనారోగ్యంతో ఉన్నప్పటికీ తనకెటువంటి అనారోగ్యం లేదని, తగ్గిపోగానే లేచి సాహితీ కార్యక్రమాలలో పాల్గొంటానని నాకు తెలియ జేసారు. తనకు ఒక కోరిక ఉన్నదనీ, అది నేనే తీర్చవలెనని వారు కోరారు. ఆ కోరిక ఏమిటో చెప్పవలసినదిగా నేను కోరాను. “ మీరు ఏదైనా ఒక పద్య కృతి చేస్తే అది చదవాలనుందండి. వ్రాస్తారు కదూ?" అంటూ తన కోరికను తెలియ జేసారు. ఓసి అదెంత పని? తప్పక వ్రాస్తానని చెప్పి సోమవారం సాయంత్రం వారితో మాటాడి వారి నుండి సెలవు తీసుకొని, ఇంటికి వెళ్ళిపోయాను.
రామ మూర్తిగారు అవసాన దశలో ఉన్నారు. కోరినది ఒక కృతి. అదీ పద్య కృతి. ఆ పరమాత్మదే భారము అనుకొన్నాను. ఎన్నాళ్ళగానో శ్రీ షిరిడీశ్వర దేవునిపై ఏదైనా వ్రాయాలని ఆశిస్తున్న నాకు రామ మూర్తిగారి కోరిక మంచి ప్రేరణ నిచ్చింది. అంతే, శ్రీషిరిడీశ దేవరా! అని సంబోధిస్తూ నమస్కరించి వారిపై శతకము వ్రాయుట ప్రారంభించితిని.
శనివారము నాటికి శతక రచన పూర్తైపోయింది. ఆదివారం  రామమూర్తిగారి దగ్గరకు వెళ్ళి అయ్యా! మీ కోరిక నాచేత శతకం వ్రాయించిందని చెప్పాను. ఒక్కొక్క పద్యం జాగ్రత్తగా చదవమన్నారు. నేను ఒక్క పద్యము  తప్ప ఆ మిగిలిన నూట యేడు పద్యాలు చదివి వారికి వినిపించాను. వారు కూడా శ్రద్ధతో అన్నీ విన్నారు. అన్నీ వినిన  తరువాత వారు  " ఏమిటి మీరు నూట ఏడు పద్యాలే చదివారు. నూట ఎనిమిదవ పద్యం కూడా వ్రాసే ఉంటారు. చదవలేదేమండి? అందులో ఏముంటుందో నాకు తెలుసు. మీరు చదవండి పరవాలేదు" అన్నారు.  "ముత్యము రామ మూర్తి......" అనే ప్రారంభంతో ఉండే 102 వ పద్యమును కూడా నేను చదివి వారికి వినిపిం చాను. వారు ఎంత సంతోషించిరో  వారి కళ్ళ నుండి ఆనంద భాష్పాలు రాలడం చూచిన నాకే తెలుసును. ఈ శతక ఆవిష్కరణ సభకు మీరు తప్పక రావాలి అన్నాను. అయ్యో ఎంత మాట. తప్పక వస్తానన్నారు. ఆ మహనీయుఁడు ఆదివారం ఆనందంతో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొన్నారు. ఆ మరు నాడు నేను ఉద్యోగరీత్యా కళాశాలకు వెళ్ళియుంటిని. మరి కాస్త సమయమునకు ముత్యం రామ్మూర్తి గారు పరమపదించారన్న వార్త తెలిసింది. వెంటనే నేను వారింటికి వెళ్ళి వారి భౌతిక శరీరాన్ని కడసారి దర్శించి, నివాళులర్పించాను.
నా యోగం బాగుంది కాబట్టి ఆ షిరిడీశ్వరుడు కటాక్షించి శతక రచన నాచేత చేయించి, రామ మూర్తి గారికి అతను బ్రతికి ఉండగా వినిపింప జేసాడు. ఆవిధముగ జరగకపోయినచో రామ మూర్తిగారి కడసారి కోరికను తీర్చలేకపోతిని అని నేను అను నిత్యం జీవితాంతం కుమిలిపోయి ఉండే వాడిని. అట్టి పరిస్థితి లోనికి నన్ను నెట్టకుండా కాపాడిన ఆ షిరిడీ సాయి ఎంతటి దయామయుఁడో కదా!
నా జీవితానుభవాలను దృష్తిలో పెట్టుకొని, సద్వృద్ధికై ఆ షిరిడీశ్వరునికి నేను చేసుకొనిన వేడికోలే ఈ  శ్రీషిరిడీశ దేవ శతకము. నా మనసును కలచివేసేటువంటి సమాజంలో జరుగుచున్న దౌష్ట్యాలను మాన్పాలని, తన ప్రతిభ చూపాలని, మంచివారిని, మంచిని, మన భూ మాతను, ప్రకృతిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలని నేను సాయినాథునికి చేసుకొనిన విన్నపమే యీ శతకము.
ఇది భావావేశముతో వ్రాసిన శతకమే కాని వేరు కాదు. ఇందు గుణములుండవచ్చును,  లేకపో వచ్చును. దోషములు లెక్కకు మిక్కిలిగా ఉండిననుండవచ్చును. పాఠకులు సహృదయతతో భక్తి భావముతో చదువుతూ, గుణములున్న గ్రహింప వలసినదిగా, దోషములున్న మన్నించ వలసినదిగా కోరుకొంటున్నాను.

నా ప్రియ మిత్రులు శ్రీ కొట్టే కోటారావు గారు ఈ శతకమును చదివి చిన్నచిన్న సవరణలు సూచించడం ద్వారా మెఱుగులు దిద్దినందుకు వారికి నా ధన్యవాదములు.
ఆ పరమేశ్వరుఁడు నాచేత వ్రాయించిన యీ శతకమును చదివి "కవివతంస" బిరుదాంకితులైన 
శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారు "కవితాభినందనం" పేరుతో తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియ జేసారు. వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు.
మా పినతల్లి గారి కుమారుఁడైన డా.లింగాల సత్య యాజ్ఞవల్క్యశర్మ కూడా యీ శతకమును చదివి తన అమూల్యమైన అభిప్రాయాలను తెలియ జేసినందుకు తమ్మునకు నా సంతోషాన్ని తెలియజేసుకొంటున్నాను.
శ్రీ ముత్యం రామ మూర్తిగారి కోరికపై వ్రాసిన యీ శతకమును అచ్చు వేయిస్తామని రామ మూర్తిగారి కుమ్మార్తె మ.ల.స. మీనాక్షి, అల్లుఁడు శ్రీ రాజ శేఖర్ నన్ను కోరి, ముద్రణ బాధ్యత స్వీకరించినందులకు వారికి నా ధన్యవాదములు తెలియ జేసుకొంటున్నాను.
ఈ శతక రచన సమయమున తన మనసులో గూడుకట్టుకొనిన బాబా అనుభవాలను తెలియ జేస్తూ రచనకు సహకరించిన నా అర్థాంగి ‘ చి.ల.సౌ విజయ లక్ష్మి’ కి నా సంతోషమును 
తెలియ జేసుకొంటున్నాను.
ఈ శతకమును సాధ్యమైనంత వరకు దోష రహితముగా ముద్రించుటకు కృషి చేసి, అందముగా ముద్రించిన శ్రీమతి సింహంభట్ల రమాదేవి గారికి, ఆమెకు సహకరించిన శ్రీ సుదర్శన్ శాస్త్రి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను.
ఇట్లు
రచయిత.
చింతా రామ కృష్ణా రావు.
జైహింద్. 
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
ఇప్పుడు దేశవిదేశాలలొ సాయి దేవాలయములు ఎక్కువగా ఉన్నాయి.
" సాయినాధుని సన్నిధీ
కారుణ్యపు పెన్నిధి.
దత్తాత్రేయుని అవతారమిదీ
భజించి తరించగ భాగ్యమది.
ఆంధ్రామృతపు అంబుధిలొ
శత{క]కోటి కవన లహరులివీ
భక్త జన చిత్తములందున
విశ్వ వ్యాప్త కౌముదీ కాంతులివి."

ఇది చంద్ధోబద్ధ మైనది కాదని మనవి " సోదరుని శతకము చదివిన సంతసములొ " ఉడతా భక్తి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.