గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జూన్ 2009, మంగళవారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 25

శ్రీ విశ్వనాధుని భావుకత వ్యక్తమయే మరో పద్యాన్ని గూర్చి శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి వివరణ చూద్దాం.

చ:-
తునుకలు కొట్టుచున్ చెఱకు తోటల వింటికి విత్తనాలు పా
తిన తఱి కర్షకుండయిన తియ్యని విల్దు ముదారి సీత గై
కొని చనుదెంచి మైథిలుల కోటకు పంపమ యింతదాక బం
పునదియికేమి యున్న యది పోవుట నేనును లే దయోధ్యకున్. {వి.ర.క.కి.నూ. ౨౫}

రామునకు తన పెళ్ళి నాటి ముగ్ధ యైన తన సీత రూపము తలపునకు వచ్చినది. " చిన్న పిల్లగా అమాయకమైన చూపులతో ముగ్ధ మనోహర రూపముతో తన యింట అడుగు పెట్టిన సీత మరల పుట్టినింటికి పోయినదే లేదు. { వాల్మికమున అట్టి ఆధారము లేదు.} యింక అమె పుట్టింటికి వెళ్ళెడు ఘట్టమూ లేదు. నేను అయోధ్యకు పోవుటయూ లేదు. " ఇది శ్రీరాముని ఆవేదన.

సీత ఏమైనదని అడిగినచో రాముడు జనక మహారాజాదులకు ఏమని చెప్పగలడు? అయోధ్య లోని ముగ్గురు తల్లులకు ఏమని చెప్ప గలడు? ఈ ప్రశ్నలు రాముని హృదయమును కాల్చివేయు చున్నవి. ఇది శ్రీరాముని ఆవేదన.

విశ్వనాధ యిక్కడ ఒక అందమైన కల్పనతో వివాహము నాటి సీత అందమైన మౌగ్ధ్యమును బాల్య యౌవన దశా సంధి గతమైన అచ్చమైన హృదయమును నిరూపించినాడు. సీతా రాముల పెండ్లి సమయానికి మన్మధుడు చెఱకు విల్లు పట్టుకొని హడావిడి పడ లేదుట. వారిపై పూల బాణములు వేయుటకు యింకను చాల సమయ మున్నదని అప్పటికి కొత్త చెఱకు విల్లులు తయారు చేసుకో వచ్చునని, భావించి, ఆ మన్మధుడు ఒక చెఱకు రైతుగా అవతార మెత్తినాడట. చెఱకు తోట పెంచుటకు విత్తనాలుగా చెఱకు ముక్కలను కొడుతూ తియ్యని వెల్దుముదారు అనగా ఇక్షు ధన్వుడైన మన్మధుడు కర్షకుడుగా మారిన సమయములో సీతను అయోధ్యకు తీసుకు వచ్చాముఅంటాడు రాముడు. ఎంత అందమైన కల్పన! చిన్న వయసున పెండ్లి కూతురై అత్తవారింట అడుగు పెట్టిన సీతయే ఒక చెఱకు తునకగా స్ఫురించు చున్నది కదా! మన్మధ భావ బీజారోపములు అయినను లేని సీత యొక్క ముగ్ధాకృతి పాఠకుల మనస్సుకు సాక్షాత్కరించు చున్నది కదా!

ఉత్తర రామ చరితమున భవభూతి పెండ్లి నాటిసీతమ్మ ముగ్ధాకృతిని రామునిచే వర్ణింపజేసినాడు. పాల పండ్లు ఊడి ఆ స్థానమున మల్లె మొగ్గల వంటి దంతములు కొంచెము కొంచెము వచ్చుచున్నంత బాల్యమున సీత ఉన్నదని భవభూతి వర్ణించినాడు. " పతన విరళ ప్రాంతోన్మూలన్మనోహర కుట్మలైః " ఇత్యాది శ్లోకము.

విశ్వనాధ సీత ముగ్ధాకృతిని వర్ణించుట తెలుగు నేలయందలి వ్యవసాయిక భూమికను స్వీకరించి వర్ణనను రమ్యతరము చేసినాడు.

ఇంతవరకూ శ్రీ బులుసు వేంకటేశ్వర్లుగారు వెశదీకరించిన ఆహ్లాద భరిత మైన విశ్వ నాధ రచనలోని భావుకతను చూచాంకదండి. మరొక పర్యాయం మరొక పద్యంలోని భావుకతను మీ ముందుంచే ప్రయత్నం చేయ గలను.
జైహింద్. Print this post

1 comments:

పుల్లాయన చెప్పారు...

ధన్యవాదాలు ఇలాంటి గొప్ప గొప్ప తెలుగు పద్యాలు మాకు పరిచయం చేస్తున్నందుకు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.