గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 65 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

చం.  రణమున నోడి వీడిన శిరస్త్రులు, చట్టలు నైన్ రాక్షసుల్

ఘనముగఁ గల్గి, యాత్రిపురుఁ గాటికిఁ బంపిన శంభునిర్మలం

బును గొననట్టి యా స్థిరుఁడు, ముక్తినొసంగెడి విష్ణువింద్రుఁడున్,

తినుదురు మాత! నీ వదన దివ్యపు వీడ్యము జ్ఞానదీప్తికై. 65

భావము.

తల్లీ ! సంగ్రామంలో రాక్షసులను జయించడం చేత కలిగినఆనందం వల్ల , కిరీటాన్ని (కాస్సేపు అలసట తీర్చుకోవడానికా అన్నట్టు ) వదులు చేసి , చండునికి శివ నిర్మాల్యాన్నిచ్చేసి , నీ నివాసానికొచ్చే నీ పుత్రాది దేవతలు, నీ నోటి తాంబూలాన్ని కోరుతారు. వాళ్ళేమన్నా తక్కువ వాళ్ళా? ఎటువంటి యుద్ధంలోనైనా సరే గెలవడమే తప్ప ఓడడం అనేది యెరగని వాళ్ళూ, రాక్షసులను రాచి రంపాన పెట్టడంలో వాళ్ళకు వాళ్ళే సాటియైన వాళ్ళు కదా !అయినా , నీ ప్రసాదమైన తాంబూలాన్ని ఆశిస్తున్నారంటే అందుకు కారణం అది తెల్లగా _ స్వచ్చంగా _ పరిమళ భరితంగా ఉండి, అందు లోని పచ్చ కర్పూరం మొదలగునవి నీవు బాగా నమిలి ఉండడం వల్ల పరిపూర్ణ జీర్ణకారి కావడమే !

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.