ఆర్యులారా! “శాండీ'”పెను తుపాను కారణంగా ఏనాడూ కనీ వినీ యెఱుగని ప్రకృతి భీభత్సానికి అమెరికా లోనవడం విచారకరం. అక్కడ మన ఆంధ్రులు, మన భారతీయులు ఎంతోమంది నివాసముంటున్నారు. వారంతా ఎక్కడున్నా మన మాత్రు భారతిఎడలా, మన ఆంధ్ర రాష్ట్రం ఎడల సౌవేధేయులై, నిష్కళంకమైన ప్రేమని ఎల్లప్పుడూ చూపిస్తూ, అమెరికాపై గౌరవభావంతో మెలగుతూ ఉభయ దేశాలకు వారధిలాగ ఉంటున్న విషయం మనకు తెలియనిది కాదు. తమ బంధువర్గానికి దూరంగా ఉంటూ కూడా అది మరచి, అమెరికనులతో మైత్రీభావంతో కలిసిపోయి ఎంతో ఆనందంగా జీవిస్తూ అక్కడున్నారు మనవారు.
ఇప్పుడు తుపాను రూపంలో వచ్చిన పెద్ద ఉపద్రవాన్నిఅమెరికా ఎదుర్కుంటోంది.
అమెరికా దేశము ఈ ఉపద్రవంనుండి సునాయాసంగా గట్టెక్కాలనీ, అక్కడున్న స్వదేశీయులు,అతిథులైన పరదేశీయులుక్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను.
మన భారతీయులిఉ, మన ఆంధ్రులు యావన్మందీ కూడా ధన మాన ప్రాణాలతో సురక్శ్కితంగా ఉండాలని ఆంధ్రామృతం కోరుకుంటోంది.
సర్వే జనాః సిఖినో భవంతు.
జైహింద్.
పాండిత్యము, రాచరికము ఒకదానితో మరొకటి పోల్చుటకు వీలు లేదు. రాజు స్వదేశమునందు మాత్రమే పూజింపఁబడును. పండితుఁడు మాత్రము లోకములో ఎక్కడికి వెళ్ళినా పూజింపఁ బడును.
కాబట్టి సాహిత్యపు విలువలు కలిగిన వాటిని పఠిస్తూ ఉండాలి. శోధించి తెలుసుకొంటూ ఉండాలి. అప్పుడు పాడిత్యము అలవడకుండా ఎలా ఉంటుంది. గ్రథాలు చదువుతూ ఉండండి.
ప్రియ పాఠక మిత్రులారా! చిత్ర కవితా వైచిత్రి తెలుసుకొనే కొద్దీ తెలుసుకోవాలనే ఉంటుంది. ఆధునిక కవి బ్రహ్మశ్రీ వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి కవి కృత శోఢశదళ చక్ర బంధమును, చక్ర బంధమును తిలకించండి
జైశ్రీరామ్.
సహృదయ సామాజికులారా!
జగదంబధ్యానంలో తాదాత్మ్యత పొందుతూ భక్తి పారవశ్యంలో ఉఱ్ఱూతలూగిపోతూ ఆ జగన్మాతను కొలిచి, ఆతల్లి కృపను పొందిన మీఅందరి పాదములకు నా అభివందనములు. యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్తితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
అంటూ కనిపించే ప్రతీ స్వరూపంలోను జగదంబనే కంటూ, భక్తి పారవశ్యంతో పూజించాము. నవరాత్రులు నిన్నటితో పూర్తి కావటంతో దీక్షను ముగించుకోవటం కూడా జరిగి పోయింది. ఇక ఇప్పుడు చేయదగిన పని ఏమిటై ఉంటుంది?
ప్రతీ స్త్రీ మూర్తినీ జగన్మాతగా ఈ పది రోజులూ కన్న మన కళ్ళు మన భావన, మన మనో నేత్రము ఇటుపైన కూడా అదే సాధన చేస్తూ ప్రతీ అణువునందూ, ప్రతీ క్షణమునందూ సంచరిస్తూ ఉండే ఆ జగన్మాతను నిరంతరమూకొలుస్తూ ఉండాలి కదా! ఆ విధంగా చూచుట కొఱకే గడిచిన పది రోజులు చేసిన సాధన అని మనం గ్రహించాలి కదా? మరి అలా గ్రహించి అలా నడచుకోవాలి కదా? మనమల్లాగే నడచుకోలేకపోతామా?
ప్రతీ అణువునందూ, ప్రతీ స్త్రీ మూర్తులలో ఆబాల గోపాలమునందూ ఆజగన్మాతనే ప్రత్యక్షం చేసుకొంటూ, కదలాడే జగదంబ దర్శనంతో పులకరించిపోతూ నిజమైన జ్ఞాన పరిణతి పొందిన సిద్ధులమై ప్రవర్తించేలాగ చేయమని ఆజగన్మాతనే వేడుకొంటూ, ప్రతీ స్త్రీ మూర్తియెడల ఆ జగన్మాత యొక్క తేజో మూర్తినే కనుగొందుము గాక.
ఆ జగన్మాత శుభాశీస్సులనందుదుము గాక.
జై జగన్మాతా.
జైజై జగన్మాతా.
జైహింద్.
సహృదయ శిరోమణులారా! ఈ నాడు పరమ పవిత్రమైన విజయ దశమి. ఆ జగత్కారణ, సర్వ జగత్తుకు మూల విరాణ్మూర్తియైన జగదంబ పరిపూర్ణ కరుణా కటాక్ష వీక్షణా గవాక్షాలు తెరచుకొని తనపై భక్తి పారవశ్యంతో పులకరించుకుపోయే భక్తులపై ఆమె చల్లని చూపుల వెన్నెలలు పీయూష వర్షమై ప్రసరించే శుభ ఘడియలు నిండి ఉన్నాయి. ఆ చల్లని తల్లి కరుణకు పాత్రులమై భవబంధాలకు అతీతముగా పరమానందాన్ని పొందుచూ పరవశించిపోదాము.
ఆజగదంబ శుభాశీస్సులు మీ అందరికీ లభించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
సాహితీ ప్రియులారా! బ్రహ్మశ్రీ వల్లభవఝల అప్పల నరసింహ కవి గారు రచించిన శకట చక్ర, అష్టదళ పద్మ బంధములను తిలకించండి.
మీ అభిప్రాయాలను తెలియ జేయ మనవి.
జైహింద్.
ఏల్చూరి మురళీధరరావు
ఇలా వ్యాఖ్యానించారు.
పుంభావసరస్వతి పూజ్యశ్రీ పండిత నేమాని గురుదేవులకు,
మధురకవి శ్రీ చింతా రామకృష్ణారావు గారికి, విద్వన్మిత్రమండలికి, విజయదశమీ పర్వదినాన సర్వ శుభాకాంక్షలు! భవదీయుడు, ఏల్చూరి మురళీధరరావు. మాన్యశ్రీ రామకృష్ణారావు గారు! శ్రీ వల్లభవఝల వారి చిత్రకవితాప్రణయనం మనోహరంగా ఉన్నది. వారికి నా హృదయపూర్వకాభినందనలను తెలియజేయండి. మీవి, వారివి ముద్రితరచనలు ఏమేమున్నాయో తెలుపగలరని ప్రార్థన. కాగా; మీరు కాని, మీ మిత్రమండలి సదస్యులు కాని, శ్రీ వల్లభవఝల వారు కాని "నాగబంధము"లో ఏవైనా ప్రయోగాలను చేసినా, అటువంటి ప్రయుక్తాలను మీరెక్కడైనా చూసినా - దయచేసి తెలియజేయగోరుతున్నాను.
భవదీయుడు,
ఏల్చూరి మురళీధరరావు .
వీరి కోరిక మేరకు కుమార సంభవమునందలి నాగబంధమును ఈ క్రింద చూపిస్తున్నాను.
ఏల్చూరి వారి ఈమెయిల్ ఐడీ ఇవ్వనందున ఆంధ్రామృతం ద్వారా వారికి తెలియ జేస్తున్నాను.
సాహితీ ప్రియ బంధువులారా! యత్నే కృతే యది నసిధ్యతి కోz త్ర దోషః అన్న నానుడి ననుసరించి మన సాహితీ మిత్రులు, ప్రముఖ జ్యోతిశ్శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ వల్లభవఝల నరసింహ మూర్తి కవి ఒక ఖడ్గ బంధాన్ని కవితలో బంధించి మనము కూడా ఆ ప్రక్రియ చూచే భాగ్యం కలిగిస్తూ మనముందుంచారు. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్లు డా.దేవగుప్తాపు గణపతిరావుగారి బంధ కవితలను ఆంధ్రామృతంలో చూచి, స్పందించిన హృదయంతో తానూ బంధించారు తన కవితను ఖడ్గ బంధంగా. మరి మీరూ పరిశీలించండి. అవకాశం కల్పించుకొని మీరూ వ్రాసే ప్రయత్నం చెయ్యండి.
"దృష్టం కిమపి లోకేzస్మిన్ ననిర్దోషో న నిర్గుణః." కాబట్టి
విజయనగరము మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల విశ్రాంత అధ్యక్షులు శ్రీ మానాప్రగడశేషశాయి గారి అపురూపమైన ఉపన్యాసము.
ప్రియ సహృదయ మిత్రులారా!
తే.07-10-2012న విజయ నగరంలోఁ గల సుమారు 150 సంవత్సరాల అతి ప్రాచీన మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థులమైన మా అందరి అపూర్వ అపురూప సమ్మేళనము అత్యంత వైభవముగా జరిగిందని తెలియ జేయుటకు చాలా ఆనందంగా ఉంది.
అతి తక్కువ వ్యవధిలో నిర్వహించిన యీ కార్యక్రమానికి పాతికమందో ఏభైమందో వస్తారని ఊహించాము. ఐతే సుమారు మూడువందలమంది హాజరు కావడంతో అత్యంత ఉత్సాహ భరితంగా అనూహ్యమైన రీతిలో ఆనంద సంభరితమయింది.
అలనాటి నుండి నేటి వరకు అచ్చట బోధకులైన ఉపన్యాసకులు అనేక మంది మా ఆహ్వానాన్ని మన్నించి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మేము చేసిన సన్మానాన్ని సహృదయంతో గ్రహించి, తమకు మాపై గల అపారమైన ప్రేమామృతం మాపై కురిపిస్తూ వారి అమృత వాక్కులతో మమ్ములనాశీర్వదించారంటే అది మాకు శారదాంబ అనుగ్రహం వలన లభించిన అపూర్వమైన అవకాశంగా మేము భావిస్తున్నాము.
శ్రీ మానాప్రగడ శేషశాయి గురువుగారు, డా. ఏ. గోపాలరావు గురువుగారు, శ్రీ రామరాజు గురువు గారు శ్రీ గోవిందాచార్యులు గురువు గారు, ఆ సంస్కృత కళాశాల ప్రస్తుత అధ్యక్షులు శ్రీమతి డా.పెన్నేటి స్వప్నహైందవి గారు, వేద పండితులు, ఇంకా కొందరు గురువులు తమ అమూల్యమైన ఆశీస్సులందజేసారు మాకు.
ఈ సంస్కృత కళాశాల ప్రస్తుత అధ్యక్షులు శ్రీమతి డా.పెన్నేటి స్వప్నహైందవి గారు మాకు చక్కని జ్ఞాపికగా ఫైళ్ళను అందజేసారు. ఆమెకు మా ధన్యవాదములు.
శ్రీ మానాప్రగడశేషశాయిగారి అమృత వాక్కులను మనము పైనగల వీడియో ద్వారా చూస్తూ వినవచ్చును.
ఈ అసాధారణమైన అపురూపమైన ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనము మాహా కవిసమ్మేళనంగా పరిఢవిల్లింది.
మా గురుదేవులు శ్రీ ఏ. గోపాలరావుగారు కూడా ఒక పూర్వ విద్యర్థే అయిన కారణముగాను, మాతో మమైకమయే సహృదయులైన కారణంగాను ఆద్యంతము మాకు మార్గదర్శకులై ఈ కార్యక్రమం నిర్వహింప జేసారు.
మా ఆనందానికి అవధులే లేవంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు.
తొలినాటి రాత్రికే మేమంతా ఒకచోట చేరటంతో ఆరాత్రంతా మాకు మహాశివరాత్రే అయిందంటేనమ్మండి. ఎన్ని మాటలాడుకున్నా తరగవు మా మాటలు. అలనాటి తీపిగురుతులను నెమఱు వేసుకొంటూ ఒకరి యోగక్షేమాలను మరొకరు తెలుసుకొంటూ, మధ్య మధ్య ఆశుకవితా లతలనల్లజేస్తూ, చెణుకులు విసురుకొంటూ, వయసులు మరచి అన్ని బాధలను ఏమరచి అనంద రస వాహినిలో ఓలలాడామంటే ఇది అపురూపమైన దివ్యావకాశం, మాటలతో చెప్ప నలవి కాని దివ్య మధురానుభూతి.
విజయ నగరంలో ప్రాంతీయంగా ఉన్న పూర్వ విద్యార్థుల శ్రమ ఫలితంగానే సుదూరంలో ఉన్న వారికి, హైదరాబాదులో నివసిస్తున్న నాకు యీ సదవకాశం లభించింది.
శ్రీ యుతులు పంతుల జోగారావు, P.V.B.శ్రీరామ మూర్తి, మంగిపూడి వేంకటరమణమూర్తి భాగవతార్, రాళ్ళపల్లి రామ సుబ్బారావు, సోమేశ్వర రావు, రాయప్రోలు సత్యప్రసాద్, KSR మూర్తి, Sista రామకృష్ణ, ప్రాత రాజేశ్వర రావు, అయ్యగారు సుబ్రహ్మణ్యమ్, R.M.S.శాస్త్రి, మున్నగువారు ప్రణాళికా బద్ధంగా యీ కార్యక్రమానికి రూప కల్పన చేసి నడిపించి కృతకృత్యులయారు. కొందరి పేర్లు నాకు సరిగా తెలియక చెప్ప లేకపోతున్నాను కాని ఇంకా అనేకమంది యీ కార్యక్రమంలో భాగస్వాములై వారి జన్మలు చరితార్థం చేసుకున్నారు.
వారందరికీ నా హృదయ పూర్వక అభినందనలు.
ఆద్యంతమూ కార్య నిర్వహణలో లొపమన్నదే లేకుండా యీ యజ్ఞాన్ని నిర్వహించ గలుగుట యీ నిర్వాహకుల శక్తియుక్తులకు తార్కాణము.
మరొక ముఖ్యమైన విషయం వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. అదేమిటంటే
ఆంధ్రామృతం ద్వారా మా అపురూపమైన సమ్మేళన వార్తను చదివి స్పందిస్తూ, మన సాహితీ బంధువు పండిత నేమాని రామ జోగి సన్యాసిరావు గారు నాకు ఫోన్ చేసి, చూడడానికి నేను రావచ్చా అని అడిగారు. లబ్ధప్రతిష్టులైన వారి రాక మాకు అవాంఛనీయమెలాగౌతుంది.
అయ్యో ఎంత మాట? తప్పక రండి. అవకాశముంటే మీరు విరచించిన అధ్యాత్మ రామాయణ ప్రతులు మా పూర్వ విద్యార్తులకు అందచేయడం ద్వారా అది చదివే భాగ్యాన్ని కలిగించండి అని కోరాను. అంతే వారు విశాఖపట్టణం నుండి కారు కట్టించుకొని మా సమావేశానికి రావటంతో మాలో ఆనందించనివారంటూ లేరు.
సుమారు 100 ప్రతులను ఆసక్తులైనవారిలో కొందరికి మాత్రమే అందజేయగలిగారు. పాపం ఎన్ని ప్రతులను తేగలరు. సరే ఈ ప్రతులు అందనివారు తన సెల్ కు ఫోన్ చేస్తే వారి చిఱునామా తెలుసుకొనిరామాయణ ప్రతిని తప్పక పంపగలనని చెప్పారు. అత్యద్భుతమైన ఈ రామాయణం ఒక ఉద్గ్రంథము.భక్తిని మాత్రమే మూల్యంగా చెల్లించ గలిగిన వారీ ప్రతులు గ్రహింపనర్హులు అంటూ వారన్న మాటలకు సంతోషించనివారంటూ లేరు.
ఇంతటి నిర్మలాంతఃకరణులైన శ్రీ నేమాని రామ జోగి సన్యాసి రావు గురువులకు పాదభివందనములు తెలియ జేయమన్నారు వారి సహృదయతనుగ్రహించిన నా మిత్రులంతా.
వారికి మాపై గల అవ్యాజానురాగానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఛాయా చిత్రములను ఈ క్రింది సంకేతంపై క్లిక్ చెయ్యటం ద్వారా చూడ వచ్చును.
నేను సన్మిత్రులతో కలిసి, సద్గురుదేవుల సుశిక్షణతో ప్రభుత్వ మహారాజా సంస్కృత కళాశాలలో 1968 - 69 నుండి 1971-72 వరకు భాషా ప్రవీణ అభ్యసించి యుంటిని. ఆ విద్యాభ్యసన సత్ ఫలముగా ఉపాధ్యాయ ఆచార్య పదవులు చేఁబట్టి సుమారు35 సంవత్సరములు బోధనా వృత్తిలో మమైకమై జీవనము విద్యార్థులమధ్య సాగించితిని.2008 జూన్ మాసాంతమున పదవీ విరమణ చేసి యున్న నాకు హృదయంలో చదువుకొనిన నాటి గుర్తులు లీలగా ఊగులాడుతున్నాయి.
ఐతే విజయ నగర వాసులైయున్న మా సతీర్థులు, మిత్రులు కొందరు పూర్వ విద్యార్థుల సమ్మేళనము గురు పూజ అనే మహాద్భుతమైన కార్యక్రమమును తే.07 - 10 - 2012 న చేయ తలపెట్టి నాకు ఆహ్వానము పంపినారు. ఈ కార్యక్రమము చేయుచున్నారన్నంతనే నామనసు ఎంతగానో పొంగిపోయింది. మాకు జ్ఞాన భిక్షను పెట్టిన అలనాటి గురుదేవులను సేవించుకొనే సద్భాగ్యం నాకూ కలిగినందుకు, హృదయంలో హృదయంగా మెలిగిన అలనాటి మిత్రులందరినీ ఒకేచోట ఒక్క సారి కలుసుకొనే భాగ్యం కలిగినందులకూ నాకెంతో ఆనందంగా ఉంది.ఈ మహదానందాన్ని నాలో దాచుకోలేక మీకూ పంచుతున్నందుకు నన్ను అన్యధా భావించకండి.
సరే ఇంత వయసొచ్చినా నా ఆరాటంమాత్రం అంతా యింతా కాకపోవటం నాకు వింతగా ఉన్నా ఇది మాత్రం యదార్థం. సరే ఎల్లుండి జరుగబోయే మాపూర్వ విద్యార్థుల సత్సమ్మేళనము గురుదర్శనానుభూతి మున్నగు విషయములను నేను ఈ కార్యక్రమానంతరం పంచగలను. విజయనగరం వెళ్ళి వస్తానండి మరి. నమస్తే.
జైశ్రీరామ్.
ఆర్యులారా! వేదమును గూర్చి సప్రమాణికముగా నిర్వచించి పలికిన భారాంబ యొక్క ముద్దుబిడ్డయైన ఒక పండితమ్మన్యుల వివరణ వారి మాటలలోనే వినండి. వారు నిర్వహించుచున్న వేద పాఠశాలను గూర్చిన వివరము కూడా తెలుసుకోండి
.http://www.youtube.com/watch?v=5wfCf8-h7hA&feature=relmfu
అత్యద్భుతమైన విషయాలను వేదాలను గూర్చినవి విన్నారు కదా? కర్తవ్యనిర్వహణానురక్తులై మెలకువతో ముందడుగు వెయ్యండి.
సోదర భారతీయులారా! ఈ రోజు అక్టోబరు 2వతేదీ. మోహన్దాస్ కరంచంద్ గాంధీ జయంతి.
తే.02 - 10 - 1869.ని గుజరాత్ రాష్ట్రం పోర్బందర్ లో పుతలీబాయి కరంచంద్ గాంధీలకు జన్మంచి, తల్లి చెప్పే కథలకు ఉత్తేజితుఁడై పరిపూర్ణమైన వ్యక్తిత్వమును సంతరించుకొని, పాశ్చాత్యులచేతిలో బందీయైన మాతృభారతిని శృంఖలా విముక్తురాలిని చేయుటకొఱకు అకుంఠిత దీక్షా తత్పరుడై తన ఆలోచనకు పదును పెట్టి అహింసాయుత కార్య సాధనకు నడుంబిగించి, సత్యాగ్రహము అనే ఆయుధమును కనుగొని, తద్వారా కృతకృత్యుఁడయ్యాఁడు.
తే.30 - 01 - 1948. ని సైద్ధాంతిక విభేదాల కారణంగా నారాయణ ఆప్టే సహకారంతో నాథూరాం గాడ్సే తుపాకీతో కాల్చాఁడంతో గాధీ స్వర్గస్తుఁడయ్యాడు.
భారత జాతిపిత గా, మహత్మగా, బాపూజీగా కీర్తింపఁబడిన గాంధీ సిద్ధాంతాలను వల్లెవేస్తూ మేం గాంధీవాదులం గాంధేయులం అంటూసమాజంలో మనకు అనేకమంది కనిపిస్తూ ఉంటారు.
పైన నిరాడంబరుఁడైన గాంధీజీని ఫొటోలో చూడండి. ఎంత నిరాడంబరుఁడో!
తన భజముపై ఒక కండువాతో ఉండే గాంధీకి ఒకచోట ఆచ్ఛాదనకు వస్త్రం లేక సిగ్గుతో కుంచించుకుపోతున్న ఒక మహిళ కనిపించింది. గాంధీ ఆమె దుస్థితికి చలించిపోయి తన భుజముపై ఉన్న కండువాను ఆమెపైకి విసిరేసాఁడు. భారత దేశములో గల ప్రజలందరూ సమానంగా వస్త్రాలు వేసుకుంటే ఒక్కొక్కరికి వేసుకోవడానికి అంగ వస్త్రం మాత్రమే లభిస్తుంది అని గాంధీ భావించి, ఆనాటి నుండి అంగవస్త్రం మాత్రమే ధరించేవాఁడు.అంతటి నిరాడంబరునియొక్క, అంతటి ఆదర్శజీవి యొక్క జీవితం నుండి గ్రహించవలసిన సల్లక్షణాలకు అంతేది? వాటిని గ్రహించి ఆచరించగలిగే సాహసమేది మనలో? ఈ గాంధేయులలో.
ఆ మహాత్ముని సిద్ధాంతాలలో మంచి ఉన్నది అనుకుంటే గ్రహించి ఆచరించే ప్రయత్నం చేయటం మన కర్తవ్యం. అతనికి ఒక పూలమాలవేయటంతోనో, ఘన నివాళులర్పించటంతోనో మన బాధ్యత తీరిపోయింది అనుకుంటే ఆపని మాత్రం ఎందుకు చేయాలి? వద్దు. లోకాన్ని మభ్యపెట్ట వద్దు. చేస్తే మనస్ఫూర్తిగా గాంధీ ఆదర్శాలను ఆదరించి, అనుసరించి ఆచరించ గలగాలి. అదే సరైన నివాళి గాంధీజీకి.