గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, మార్చి 2017, శుక్రవారం

శ్రీ రాయపెద్ది అప్పా శేష శాస్ర్రి గారి వైజ్ఞానిక పరిశీలనా వ్యాసమునకు మిత్రుల స్పందన కోరుచున్నారు.

0 comments

జైశ్రీరామ్.
"శ్రీ రాయపెద్ది అప్పా శేష శాస్ర్రి గారి విశేష పరిశీలన .వారు చరవాణిలో ముచ్చటించారు. ఈ వైజ్ఞానిక పరిశీలనా వ్యాస విశేషాలకు మిత్రుల స్పందన కోరుచున్నారు.
అద్వైత సిద్ధాంతము-ఒక వైఙ్ఞానిక పరిశీలన రచన: రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, (ఆదోని కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు, ) (హ్యుమానిటీస్ విభాగాధిపతి, సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ కాలేజి, ఎమ్మిగనూర్) My Email ID rassastry@gmail.com my phone number 9440244283
అద్వైత తత్వాన్ని వేదాంతపరమైన పారిభాషిక పదజాలాన్ని ఉపయోగించి గానీ, కేవలం తాత్త్విక దృష్టితోగానీ కాకుండా వైఙ్ఞానికపరమైన దృష్టితో పరిశీలించి, విశదీకరించే ప్రయత్నమే ఈ చిన్ని వ్యాసం .

భౌతిక, రసాయనిక, ఖగోళ, జీవశాస్త్రాల విషయాలను సవివరంగా, కూలంకషంగా చర్చించడానికి గానీ విపులమైన వేదాంత చర్చ చేయడానికిగానీ ఈ వ్యాసపరిధి చాలదు. సరళమైన భాషలో, అద్వైత సిద్ధాంతానికీ, ఆధునిక వైఙ్ఞానిక శాస్త్రానికీ మధ్య ఉన్న సమన్వయాన్ని నిరూపించే ప్రయత్నానికి రూపకల్పనే ఈ ప్రయోగం. కమండలంలో సముద్రాన్ని ఇమిడ్చే ప్రయత్నంలో ఈ రచయిత ఎంతవరకూ సఫలీకృతుడయ్యాడో విఙ్ఞులైన పాఠకులే నిర్ణయించాలి)

ఏ శాస్త్రీయ అన్వేషణకైనా శాస్త్రీయ చిత్త ప్రవృత్తి అవసరం. ఏ విషయాన్నైనా, మనకు లభ్యమౌతున్న సమాచారాన్ని ఆధారంగా చేసుకొని, అంగీకారయోగ్యమైన గీటురాళ్ళతో పరిశిలించి, సత్యాన్ని అంగీకరించడమూ, అసత్యాన్ని తిరస్కరించడమే శాస్త్రీయ దృక్పథం. జగన్మిథ్యాత్త్వాన్నీ, జీవ బ్రహ్మత్వాన్నీ ప్రతిపాదించిన మొదటి చారిత్రక వ్యక్తి శ్రీఆదిశంకరులు. వారు ప్రతిపాదించిన ఈ సిద్ధాంతాన్ని నోబెల్ బహుమతి గ్రహీత, ప్రఖ్యాత భౌతికశాస్త్రాచార్యులు ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతపు నేపథ్యంలో పరిశిలించి నిగ్గుతేల్చే ప్రయత్నం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే, శ్రీఆదిశంకరులు ప్రతిపాదించిన "మాయ" ఐన్ స్టీన్ ప్రతిపాదించిన సాపేక్షత, సాపేక్షసత్యం అన్న భావానికి అతి చేరువలో ఉంటుంది కనక. "శ్లోకార్థేన ప్రవక్ష్యామి,యదుక్తం గ్రంధకోటిభిః, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవోబ్రహ్మైవ నాపరః" అంటారు శ్రీఆదిశంకరులు. అనేక గ్రంథాలలో చెప్పబడిన దానిని అర్ధ శ్లోకములోనే చేబుతానంటారు. అదేమిటంటే"బ్రహ్మ మాత్రమే సత్యము జగత్తు మిథ్య (అంటే అసత్యము), అలాగే బ్రహ్మ మాత్రమే సత్యము జీవుడు బ్రహ్మమేగానీ ఇతరము కాదు" అని. శంకరులే అద్వైత సిద్ధాంతము నకు సారభూతమైన తమ రచన శ్రీ దక్షిణామూర్తి స్తోత్రములో "మాయాకల్పిత దేశ, కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం" అంటారు. మాయ చేత దేశము, కాలము, కలనము విచిత్రముగా చిత్రీకరింప బడ్డాయి అని దీని భావము. ఆధునిక విఙ్ఞాన శాస్త్రం అంగీకరించిన సత్యాల ఆధారగానే, హేతువాద దృష్టి తోనే పరిశీలించి దేశము, కాలము, స్థూల దృష్టికి గోచరిస్తున్న విధం గా పదార్థము, దిక్కులూ చివరికి మన ఉనికి కూడా ఎలా సాపేక్ష సత్యాలు మాత్రమే గానీ కేవల సత్యాలు కావో పరిశీలిద్దాము. ఈవిశ్వము ఎలా భ్రాంతి కాగలదన్న విషయాన్ని మొదట పరిశీలిద్దాము. కోట్లాది 1గెలాక్సీల (తారా బ్రహ్మాండాల)తో అనంతకోటి 2కాంతి సంవత్సరాల పర్యంతం విస్తరించి, అసంఖ్యాకమైన నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలూ, గ్రహ శకలాలూ తారా ధూళి తో కూడి ఉన్న యీ బ్రహ్మాండము మిథ్య అంటే సులభంగానమ్మశక్యంగాదు.ఈ దృశ్యమానవిశ్వం ఊహాతీతమై కోటానుకోట్ల మైళ్ళ పర్యంతం విస్తరించిఉన్నది. ఈ విశ్వమంతా 110మూలకాల (elements)తో నిర్మించబడిఉన్నది. (వీనిలో82మూలకాలు స్థిరమైనవి, మిగతావి అస్థిరమైన, పరివర్తనాశీలమైనవి. వీనిని రేడియో ధార్మిక మూలకాలు అంటారు. వాని అర్ధజీవితకాలాన్ని(half life period) బట్టి ఇవి కొన్ని లక్షల లేక కోట్ల సంవత్సరాల అనంతరం ఇవి సీసముగా పరివర్తన చెందుతాయి.) ఈమూలకాలన్నీ అణువులు (molecules) మరియూ పరమాణువుల(Atom)తో నిర్మించబడ్డాయి. ఈ పరమాణువుల కేంద్రకము(nucleus) లో ధన విద్యుదావేశము కలిగిన ప్రోటానులు, మరియూ ఎలాంటి విద్యుదావేశములేని న్యూట్రానులూ ఉంటాయి. కేంద్రకము చుట్టూ నిర్ణీతకక్ష్యల్లో ఋణవిద్యుదావేశాన్నికలిగిన ఎలెక్ట్రానులు ఉంటాయి. కేంద్రకముపదార్థముతో దట్టముగా నిండిలేదు.కేంద్రకములోని ప్రోటానులు న్యూట్రానుల మధ్య శూన్యప్రదేశమే అధికముగా ఉంటుంది. అలాగే కేంద్రకము చుట్టూ పరిభ్రమించే ఎలెక్ట్రానుల మధ్య కూడా శూన్యమే అధికంగా ఉంటుంది. 3ప్రోటాన్లు,న్యూట్రానులు, ఎలెక్ట్రానులు అతి అల్పముగా మాత్రమే ద్రవ్యరాశి లేక పదార్థాన్ని కలిగినవి. 4కేంద్రకములోనూ, కేంద్రకాల మధ్యా, పరిభ్రమిస్తున్న ఎలెక్ట్రానుల మధ్యా, అలాగే అణువుల మధ్యా, పరమాణువుల మధ్యా అధిక భాగము శూన్యమే. ఈ శూన్య స్థలాన్ని తొలగించి అత్యల్పంగా ఉన్న ప్రోటాన్ల, న్యూట్రాన్ల ద్రవ్య రాశిని మాత్రమే లెక్కలోనికి తీసుకొంటే అనంతంగా విస్తరించి ఉన్నట్లు కనిపించే ఈ విశ్వంలో ద్రవ్య రాశి అతి కొద్ది గా మాత్రమే ఉన్నది. ఈ పదార్థాన్ని (ద్రవ్య రాశిని) ఇక ఇంతకంటే దగ్గర గా చేర్చటానికి వీలుకానంత సాంద్రం గా (దట్టంగా) నొక్కి వేయగలిగితే (కేవలం ఊహ మత్రమేఅనుకోండి) ఎంత ద్రవ్య రాశి మిగులుతుంది? అల్పాల్పంగా మాత్రమే! ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త సర్ జేమ్స్ జీన్స్ఒక రమణీయమైన కల్పన చెపుతాడు. వాటర్లూ రైల్వే స్టేషన్ అంతా ఖాళీ చేసి నాలుగు ఇసుక రేణువులు మాత్రమే చల్లితే అది ఎంత దట్టం గా ద్రవ్యరాశితో క్రిక్కిరిసి వుంటుందో ఈ బ్రహ్మాండం కూడా అంతే ద్రవ్య రాశి తో క్రిక్కిరిసి వుందని అంటాడు.మరి అంత అత్యల్ప పరిణామంలో ఉన్న ద్రవ్యరాశి అనంతకోటిమైళ్ళ దూరం విస్తరించినట్లుగా ఉంటూ, ఊహాతీతమైన శక్తిపుంజాలను విశ్వమంతావిరజిమ్ముతూ ఉండటం కంటే మాయకు ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది? అత్యల్పమైన, అతి పలుచనైన ద్రవ్యరాశి, కేవలం ధన ఋణ విద్యుదావేశాలు ఇంద్రియాలతో అనుభవింపదగిన విశ్వంగా దర్శనమివడం పెద్ద మాయ కాదా? దీన్నే మనం ఊహించుకోగలిగిన ఒక ఉదాహరణరూపంలో తీసుకొంటే విషయాన్ని ఇంకా తేలికగా అర్థం చేసుకోగలము. ఆరున్నర అడుగుల పొడవు, 90కిలోల బరువు, రెండు అడుగుల చుట్టుకొలత కలిగిన మనిషిని చూస్తే ఇతను ఏమీ కాదు, ఇతనిలో ద్రవ్యరాశి ఏమీ లేదు, కేవలం శూన్యం మాత్రమే ఇలా భాసిస్తూ ఉంది అని అనగలమా? కానీ నిజానికి అదే వాస్తవం. ఎందుకంటే ఆమనిషిలో ద్రవ్యరాశిని మాత్రమే లెక్కలోనికి తీసుకొంటే అది దాదాపు శూన్యం అనే చెప్పుకోవచ్చు. కానీ కళ్ళ ముందు కనిపిస్తూ, చేతికి తగులుతూ, చెవులకు వినిపిస్తూ, వాసన చూడటానికి వీలయ్యే ఈ 90కిలోల మనిషి శూన్యం మాత్రమే, ఇతనిలో పదార్థం ఏమీ లేదు ఎంతో విడ్డూరంగానూ, నమ్మ శక్యం కాకుండానూ ఉంటుంది. దీన్నే భ్రాంతి లేక మాయ అని చెప్పుకోవచ్చు. ఇదే మనo చూస్తున్న సకల చరా చర జీవ రాశి విషయంలోనూ వర్తిస్తుంది. అద్వైతసిద్ధాంతానికి సారభూతమైన దక్షిణమూర్తి స్తోత్రంలో చెప్పినట్లు దేశం, కాలం మాయా నిర్మితాలు మాత్రమేనని చెప్పటం ఎలా సాధ్యమౌతుందో పరిశీలిద్దాము. మొదట కాలం ఎలా "మాయా కల్పన" లేక "మిథ్య" అన్న విషయాన్నిపరిశీలిద్దాము. సత్యమన్నది అఖండశిలాసదృశం(monolithic structure) గానే కాకుండా, విభిన్న స్థాయిల్లో, వివిధ రకాలుగా భాసించే సాపేక్ష సత్యంగాకూడా దర్శనమిస్తుంది. ఈ వ్యవహారిక సత్యాలు లేక సాపేక్ష సత్యాలు ఇంద్రియాలతో అనుభవించదగినవి. కేవల సత్యం లేక పరమ సత్యం (Absolute Reality) ఇంద్రియాతీతమైనది. మనం అత్యంత సత్యం అని భావించే "కాలం" కేవలం సత్యాభాస అని చెప్పుకోదగ్గ సాపేక్ష సత్యం (Relative Reality) మాత్రమే. వెలగపండు ఆకారంలో ఉన్న భూగోళం తన చుట్టూ తాను తిరుగుతూ అండాకార కక్ష్యలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నందువల్ల కలుగుతున్న భ్రమే "కాలం". సూర్యోదయం నుంచీ సూర్యోదయం వరకూ గల కాలాన్ని ఒక రోజుగా భావిస్తున్నాము. దీనిని 24 గంటలుగానూ,గంటకు 60నిముషాలుగానూ, నిముషానికి60సెకండ్లుగానూ చేసుకొన్నది కేవలం మానవకల్పితమైన కాల విభజన మాత్రమే. అలాగే భూమి సూర్యుని చుట్టూ ఒక సారి తిరగడానికి పట్టే సమయాన్ని ఒక సంవత్సరంగా లెక్కిస్తున్నాము. అసలు సూర్యోదయ, సూర్యాస్తమాయాలే భు భ్రమణం వల్ల ఏర్పడుతున్న దృశ్యభ్రాంతులయినప్పుడు "ఈ రోజు" అన్న మాటకు అర్థం ఏముంది? మనము భూమికి బద్ధులుగా ఉన్నంత వరకే ఈ సంవత్సరాలు, నెలలు, వారాలు, రోజులు గంటల లెక్క చెల్లుతుంది.భూమిని వదలి మనం రోదసి లోనికి ప్రవేశించితే, సూర్యోదయ, సూర్యోస్తమయాలు లేని చోట కాలం అన్న మాటకు అర్థం ఏమి ఉంటుంది? భూత, భవిష్య, వర్తమానాలుగా మనం విభజించుకొన్న కాలము ఒక అర్థ రహితమైన భావనగా మాత్రమే మిగులుతుంది. రోదసిలో ఉన్నది కాలాతీతమైన, కాల రహితమైన శాశ్వత స్థితి మాత్రమే. కానీ మనము భూమికి బద్ధులమై ఉన్నంత వరకూ, ఈ కాలము అన్నది అంగీకరించక తప్పని ఒక సాపేక్ష సత్యము. (ఈ భూమి మీద కూడా కాలము అన్నది అన్ని దగ్గరలా ఒకే రకం(uniform) గా లేదు. భూమి స్వరూపం గోళాకారంగా ఉండటంవల్ల మన "ఇవ్వాళ" అమెరికాలో “రేపు”అవుతోంది. జపాన్ లో "నేడు" మనకు "రేపు" అవుతోంది). ఇక ఇదే విషయాన్ని రెండవ స్థాయిలో పరిశీలిద్దాము 6ఒక వస్తువు కాంతి వేగం అందుకొన్నప్పుడు కాలం స్తంభించి పోతుంది. ఉదాహరణ చూద్దాము. ఒక వ్యక్తి ఒక రైల్వే ప్లాట్ ఫారం మీద నిలబడి ఉన్నాడనుకొందాం. ఎదురుగా ఉన్న రైల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడనుకొందాం. ఆ రైలు సెకండుకు 2,40,000 మైళ్ళవేగంతో ప్రయాణించినప్పుడు ప్లాట్ ఫారం మీద ఉన్న వ్యక్తికి 10సెకండ్ల కాలం గడిస్తే, రైలులోనివ్యక్తికి ఆరు సెకండ్ల కాలం మాత్రమే గడుస్తుంది. అదే రైలు కాంతి వేగంతో ప్రయాణించినప్పుడు కాలం పూర్తిగా స్తంభించిపోతుంది. ఇంకో ఉదాహరణ చూద్దాము. అపుడే జన్మించిన ఇద్దరు కవలల్లో ఒకరిని భూమిమీదనేఉంచి, ఇంకొకరిని కాంతివేగంతో ప్రయాణం చేసే అంతరిక్షనౌకలో విహారానికి పంపామనుకొందాం. 20 సంవత్సరాల తరువాత భూమి మీద ఉన్న బిడ్డకు 20ఏళ్ళు వస్తాయి. అప్పుడు అంతరిక్ష నౌక భూమికి తిరిగి వస్తే అందులోని బిడ్డ వయసు మాత్రం ఏమీ పెరిగి ఉండదు. అలాంటపుడు ఎలా చూసినా ఈ "కాలము" కేవలము మాయాకల్పితమే, భ్రాంతిజనితము, సాపేక్షసత్యమేగానీ పరమ సత్యము, లేక కేవల సత్యము కాదన్నది స్వయం విదితంగా (Self-Evident) ఉన్నది గదా. సర్వదా, సర్వథా మనము సత్యమని సంభావించే విషయాల్లో దిక్కులు కూడా ప్రధానమైనవి. ఇవికూదా ఎలా మిథ్యా జనితాలో చూద్దాము. తూర్పు, పడమర, ఉత్తరం దక్షిణం అనే ఈ నాలుగు దిక్కులూ వాటికి అనుబంధంగా ఉన్న ఉప దిక్కులూ ఎలా భ్రాంతి జనితాలో ఛూద్దాము. ఇంతకు ముందు ప్రస్తావించుకున్నట్లు సూర్యోదయ, సూర్యాస్తమయాలు దృగ్భ్రాంతులే కదా? సూర్యుడూ ఉదయించేదిక్కు తూర్పు, అస్తమించే దిక్కు పడమర, అన్నవి సూర్యోదయ సూర్యాస్తమయాల పైన ఆధార పడినవి.భూమి తనచుట్టూ తాను తిరిగేదిశమారితే, సూర్యుడు ఇప్పుడు మనం పడమర గా భావించే దిక్కున ఉదయించి ఇప్పుడు మనం తూర్పుగా భావించె దిక్కున అస్తమించి ఉండే వాడు కాడా? అసలు దృగ్భ్రాంతిపై ఆధారపడిన ఈ దిక్కులు మిథ్య కావా? అలాగే భూమికి ఉన్న అయస్కాంత తత్వంపై ఆధారపడినవే ఉత్తర, దక్షిణ దిశలు. కనుక మనము భూమికి పరిమితమై ఉన్నంతవరకే వాస్తవాలుగా ఉండి ఆ తరువాత అవాస్తవాలుగా మారేవి ఈదిక్కులు. రోదసీలోకి ప్రవేశించినపుడు ఈ దిక్కులకేదీ దిక్కు? అలాగని సంపూర్ణం గా వీనిని నిరాకరించడమూ సాధ్యం కాదు. ఎందుకంటే మన దైనందిన జీవితం ఈ కాలంపైనా, దిక్కులపైనా ఆధారపది నడుస్తున్నది. వీటిని నిరాకరించినట్లయితే అస్తవ్యస్తమౌతుంది; కనుక సత్యాభాస మాత్రమే ఐన ఈదిక్కుల నిర్ణయం కూడా మిథ్యా జనితమైన సాపేక్ష సత్యమే ఐనప్పటికీ ఒక స్థాయివరకూ గ్రహించవలసినదే అవుతున్నది. ఇక "దేశము" (space) అన్నది ఎలా సాపేక్షమౌతుందో పరిశీలించే ప్రయత్నం చేద్దాము. భూమినుంచి ఆకాశాన్ని చూసినపుడు కొన్ని చదరపు మీటర్లు మాత్రమే విస్తీర్ణం కలిగినట్లు కనిపించే "దేశం (స్థలం) నిజానికి కొన్ని లక్షల కాంతి సంవత్సరాల విస్తీర్ణం కలిగినది కావచ్చు. తమమధ్య కొన్ని లక్షల, కోట్ల మైళ్ళ దూరం కలిగిన కొన్ని నక్షత్రాలు ఒక రాశిగా మనకు కనిపిస్తూ (నిజానికి అది గూడా ఒక దృగ్భ్రమే) కొన్ని చదరపు మీటర్ల స్థలంలో సర్దుకొని కనిపిస్తున్నాయి. ఇది మనకూ ఆరాశుల్లోన్ని నక్షత్రాలకూ మధ్య ఉన్న దూరంవల్ల కలుగుతున్న దృశ్యభ్రాంతి. కనుక దేశం యొక్క విస్తీర్ణం ఎంత విశాలమైనది లేక ఎంత సంకుచితమైనది అన్నది కూడా సాపేక్ష సత్యమే గానీ కేవల సత్యము కాజాలదు గదా? ఇంకొక ఉదాహరణ చూద్దామా? పది అడుగుల పొడుగు, పది అడుగుల వెడల్పు కలిగిన ఒక రాతి గోడ ఉందని అనుకోండి. ద్రష్ట, దృశ్యముల (చూసేవాడు, చూడబడేది) మధ్యపరిమాణాల్లోఒక నిర్దిష్ట నిష్పత్తి (specific ratio) ఏర్పడినపుడు మాత్రమేఅది యథార్థమైన పరిణామములో గోచరిస్తుంది. చూసేవాడు ఒక ఎలెక్ట్రాన్ సైజులో ఉంటే ఈ గోడే ఒక అనంతవిశ్వంగా అగుపిస్తుంది. చూసేవాడు ఒక గెలాక్సీ పరిమాణం కలిగినవాడైతే అదే గోడ వాడి దృష్టికి ఆనదు, దాదాపు అదృశ్యమయ్యేటంత అత్యల్ప పరిమాణం కలిగినదిగా అవుతున్నది. కనుక దేశము లేక స్థలము వాస్తవ రూపము ఏమిటి?ద్రష్ట,దృశ్యవస్తువుల మధ్య పరిమాణాల నిష్పత్తి మరియూ ద్రష్ట,దృశ్యవస్తువుల మధ్య దూరము వస్తువుయొక్క పరిమాణాన్ని నిర్దేశిస్తున్నప్పుడు "దేశం" (space) మాత్రం సాపేక్ష సత్యం మాత్రమే, మిథ్యా జనితమే అనిచెప్పడంలో సందేహం లేదుగదా? కాంతివేగం అనుల్లంఘనీయం. కాంతి వేగాన్ని మించి ప్రయాణం చేయడం సాధ్యం కాదు. ఐన్ స్టీన్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ననుసరించి కాంతివేగంతో ప్రయాణం చేస్తే ద్రవ్య రాశి అనంతము అవుతుంది*.5కనుక అది అసాధ్యం. 5 శూన్యంలోనైనా, ఏదైనా యానకంగుండానైనా కాంతి వేగంలో ఎలాంటి మార్పూ ఉండదు. కనుకనే కాంతి వేగాన్ని constant factor అనీ దాని సంకేతాన్ని "C" అనీ వ్యవహరిస్తారు. ఎంత అనంత దూరం ప్రయాణించినా అది స్థిరంగానేఉంటుంది. (ఈ చివరి విషయం మాత్రం ఇటీవలనే ఫ్రెడరిక్ హోయల్ మరియూ విష్ణు జయంత్ నర్లీకర్లు ప్రతిపాదించిన సిద్ధాంతాల ప్రకారం కొంచెం అనంగీకార్యం అవుతుంది.ఐనా కాంతివేగం అనుల్లంఘనీయం అన్నవిషయంలో భేదాభిప్ర్రాయానికి తావులేదు. ఫోటాన్లు కాంతివేగం కంటే అధికవేగం కలిగి ఉన్నా అవి పదార్థాలు కావు. కేవలం శక్తి పుంజాలు మాత్రమే. అలాగే ట్రాకియాన్లు కూడా కాంతి వేగంకన్నా అధిక వేగం కలిగిన కణాలే. కానీ వాటి జీవిత కాలం సెకన్లో పది లక్షవవంతు కన్నా తక్కువ కనుక దానిని కూడా గణన లోనికి తీసుకోనవసరం లేదు.)కాంతి వేగాన్ని గూర్చి ఇంత సుదీర్ఘం గా ఎందుకు చర్చించ వలసి వస్తున్నదంటే ఇప్పుడు చెప్పబోయే విషయాలను అర్తం చేసుకోవడానికి అది అత్యవసరం కనుక. మనమందరమూ సహజంగానే మన అస్తిత్వాన్నీ, మన భూగోళం అస్తిత్వాన్నీ శంకించడానికివీల్లేని పరమవాస్తవాలుగా పరిగణిస్తాము. కానీ మన అస్తిత్వము, మన భూగోళం అస్తిత్వం కూడా కేవల సత్యములుగా అంగీకరించడం సాధ్యం ఎలా కాదో ఇప్పుదు పరిశీలిద్దాము. ఒకవస్తువు, పొడవు, వెడల్పు వంటి పరిమాణాలు అది భూమి మీద స్థిరం గా ఉన్నప్పుడు మాత్రమే మార్పు లేకుండా ఉండగలవు. ఉదాహరణకు ఒక అడుగు పొడవు కలిగిన ఒక స్కేలు ఎల్ల వేళలా ఒక అడుగు పొడవు కలిగిన స్కేలుగా మాత్రమేఉంటుందని మనము సహజంగానే అనుకొంటాం. కానీ వేగంపెరిగిన కొద్దీ అది కుంచించుకొని పోయి చివరికి కాంతివేగంచేరే సరికి అది ’0’ కొలత కలిగినదిగా అవుతున్నది అంటే అది "అదృశ్యమౌతుంది"7 మరి పొడవు,వెడల్పులూ ఒక ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే స్థిరమైనవిగా ఉంటాయి అని అన్నప్పుడు అవికూడా సాపేక్ష సత్యాలె అవుతున్నాయి. అలాగే బరువు కూడా. గురుత్వాకర్షణలో మార్పు వచ్చినప్పుడు అది కూడా మారుతుంది. భూమి మీద 60కిలోలు తూగే మనిషి చంద్రుని మీద 10కిలోలు మాత్రమే తూగుతాడు. అలాగే ఇంతకు ముందుఅనుకున్నట్లు కాంతివేగం అందుకొంటే బరువుకూడా అనంతం అవుతోంది.మరి బరువు కూడా స్థిరమైనదిగా పరిగణించలేము. ఇలా మనము సత్యము, మార్పు లేనివి అనుకొన్నవన్నీ అస్థిరములు, మరియూ వేగాన్ననుసరించి, పరిస్థితులననుసరించి మారేవిగా నిరూపణ అవుతున్నాయి. మనమందరమూ సహజంగానే మన అస్తిత్వాన్నీ, మన భూగోళం అస్తిత్వాన్నీ శంకించడానికివీల్లేని పరమవాస్తవాలుగా పరిగణిస్తాము. కానీ మన అస్తిత్వము, మన భూగోళం అస్తిత్వం కూడా కేవల సత్యములుగా అంగీకరించడం సాధ్యం ఎలా కాదో ఇప్పుదు పరిశీలిద్దాము. సూర్యుని నుంచీ కాంతి భూమిని చేరడానికి దాదాపు తొమ్మిది నిముషాలు పడుతుంది. ఈ క్షణంలో సూర్యుడు పేలిపొయినా ( అది సాధ్యమయ్యే విషయం కాదనుకోండి) ఆవిషయము మనకు తెలియడానికి తొమ్మిది నిముషాలు పడుతుంది. సూర్యుని తరువాత మనకు అత్యంతచేరువలోని నక్షత్రం ఆల్ఫా సెంటారీ (దీన్నే ప్రాక్సిమా సెంటారీ అని కూడా అంటారు.). ఇది భూమినుంచి నాలుగున్నర కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ నక్షత్రానికి గ్రహాలు ఉన్నాయనీ ఆ గ్రహాలమీద బుద్ద్ధికుశలత కలిగిన మానవులు ఉన్నారనీ, వాళ్ళ వద్ద ఊహాతీతమైన శక్తివంతమైన టెలిస్కోపులు కూడా ఉన్నాయనీ ఊహించుకొందాము. ఆ గ్రహము మీది మానవులు మన భూమిని చూస్తే నాలుగున్నర సంవత్సరాల వెనుకటి భూమిని మాత్రమే వాళ్ళు చూడ గలరు. ఇదే ఊహను తర్కబద్ధంగా ఎంతవరకు తీసుకు పోగలమో(to the logical extreme) అంతవరకు తీసుకు వెళ్ళి చూద్దాం. భూమినుంచి వెయ్యి మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రం తాలూకు ఉపగ్రహం మీద నుంచీ భూమిని చూసే వారికి మన సౌర కుటుంబం ఉండవలిసిన చోట ఒక పెద్ద శూన్యం మాత్రమే గోచరిస్తుంది. అంటే మన సూర్యుడు, సౌరకుటుంబం తాలూకు గ్రహాలూ, ఉపగ్రహాలు ఇత్యాదులేవీ ఇంకా జన్మించనేలేదన్నమాట. మరి మన ఉనికి సత్యమా, అసత్యమా? మనకు సత్యం. వేయి మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నవారికి అసత్యం.అంతే మన ఉనికి కూడా సాపేక్ష సత్యం మాత్రమేనని అంగీకరించక తప్పదు. విశ్వంలో ఏకకాలీనత (simultaneity) అన్నది లేక పోవడంవల్ల ఏర్పడిన విచిత్ర పరిస్థితి ఇది. మాయ అన్నది ఇలాంటి ఊహాతీతమైన పరిస్థితులను సృస్ఠిస్తుంది. ఈ విధంగా దేశం , కాలం, దిక్కులు, చివరకు మన అస్తిత్వం తోసహా మనం పరమ సత్యాలుగా సంభావిస్తూ వస్తున్నవన్నీ సాపేక్ష సత్యాలు మాత్రమేగానీ కేవలసత్యాలు కాదని అర్థం చేసుకొన్న తరువాత, శక్తి, పదార్థాల మధ్య గల అనుబంధాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. శక్తి సత్యమైనది, నిత్యమైనది అంటే నాశనం లేనిది అలాగే పదార్థము లేక ద్రవ్యము కూడా నిత్యమైనది, సత్యమైనది, నాశనము లేనిది.ఇవి వేదాంతులు పరబ్రహ్మ తత్వాన్ని గూర్చి వల్లించే వేదాంత వాక్యాలు కావు. భౌతిక శాస్త్రం ప్రవచించే శక్తి నిత్యత్వ, పదార్థ నిత్యత్వ ప్రాథమిక వచనాలు. వేదాంతమూ, విఙ్ఞానశాస్త్రమూ ఒకేనాణానికి బొమ్మా బొరుసులుగా అనిపిస్తున్నాయు గదా? శక్తి పదార్థం గా పరివర్తన చెందుతుంది. అలాగే పదార్థం శక్తి గానూ పరివర్తన చెందుతుంది. ఈ శక్తి, పదార్థ రూపాంతరీకరణ నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. పదార్థం, శక్తి పరస్పర భిన్నములు కావని ఎప్పుడైతే మనం అంగీకరించామో అప్పుడే విశ్వమంతా నిండియున్న శక్తియే మనలో శరీరంగానూ మరియూ జీవశక్తిగానూ కూడా ఉన్నదని అర్థం అవుతుంది. ఇంతకు మునుపు మనం ప్రస్తావించుకొన్న110మూలకాలుగానూ, వాని మిశ్రణ మూలంగా ఏర్పడిన మిశ్రమాలు (compounds and mixtures) గానూ, ద్రవ, వాయు రూపాలలో లేక ప్రోటానులు, ఎలెక్ట్రానులు, న్యూట్రానులు అస్తవ్యస్తమైన స్థితిలో ఉండే ప్లాస్మా గానూ పదార్థం విశ్వమంతా వ్యాపించి ఉన్నది. కాంతి, శబ్ద,విద్యుత్, అయస్కాంత ఉష్ణ రూపాలలో విశ్వమంతా వ్యాపించి ఉన్నది శక్తి. ఈ శక్తే జీవ, నిర్జీవ పదార్థాలన్నింటిలోనూ పదార్థ రూపంగా పరిణామం చెంది గోచరిస్తున్నది. సమస్త ప్రాణికోటి ధరించి ఉన్న శరీరంగానూ, కణజాలం, రక్తము, కండరాలు, మాంసము, ఎముకలు, కణాంతస్థ పదార్థాలైన జీన్స్, క్రోమొజోములు, డీ ఎన్ ఏ, ఆర్ ఎన్ ఏ , ప్రొటీన్లు, అమినో ఆసిడ్లు ఇత్యాది సకల జీవ వస్తుజాలమంతా పదార్థముగా రూపాంతరము చెందిన శక్తి ధరించిన రూపాలే. సూర్యుని నుంచి కోట్లాది మైళ్ళ దూరాలకు విరజిమ్మబడినదిగానీ లేక బృహత్ విస్ఫోటన (big bang) సమయంలో ఊహాతీతమైన దూరాలకు విరజిమ్మబడినదిగానీ ఐనదీ, ఊహాతీతమైన ఉష్ణోగ్రతవద్ద ఉన్నదీ ఐన పదార్థం క్రమంగా "ఘనీభవించి" గ్రహగోళాలుగానూ, ఉపగ్రహాలుగానూ, తోకచుక్కలు, గ్రహశకలాలుగానూ మరియూ ఇతర నభోమూర్తులుగానూ ఏర్పడింది. ఆ తరువాత క్రమంగా సంభవించిన పరిణామాలననుసరించి చివరికి జీవరాశిగా (అంటే వృక్ష, జంతు జాతులుగా) ఆవిర్భవించింది. ఈ పరిణామాలను సవిస్తరంగా చర్చిండానికి ఇది వేదికా కాదు, సందర్బమూ కాదు కనుక పుస్తక విస్తరణ భీతితో కేవలం తలస్పర్శి (superficial) పరిచయంతో సరిపెట్టుకోవాలసి వస్తున్నది. అభివృద్ధి చెందిన మెదడు కల జీవరాశిని పరిశీలించినపుదు వేదాంతంలో చెప్పబడిన "జీవుడు" నుగూర్చిన సులభమౌతుందన్న ఉద్దేశ్యంతోనే, అల్ప శ్రేణికి చెందిన జీవరాసుల విషయం గాక ఉన్నత శ్రేణికి చెందిన (సకశేరుక జాతికి చెందిన) మానవుదు మొదలైన జీవరాశి విషయమే పరిశీలనకు తీసుకొందాము. జీవరాసులన్నీ ఈ విశ్వాన్ని, బాహ్యప్రేరణలకు స్పందించే తమ ఙ్ఞానేంద్రియాలద్వారానే గ్రహించి అనుభవిస్తున్నాయి.ఉదాహరణకు ఒక వస్తువుపై పడిన కాంతి కొంతదూరం ప్రయాణించ్న తర్వాత కంటిలోని కటకం (lens) ద్వారానూ, కంటిలోని ఇతర ద్రవ పదార్థాల ద్వారానూ రయాణించి అనంతరమ్ నేత్ర పటలం (retina)పైన తలకిందులుగా బొమ్మరూపంలో పడుతున్నది. తరువాత విద్యుదయస్కంతస్పందనల రూపంలో దృష్టి నాడి (optic nerve) ద్వారా మెదడులోని దృష్టి కేంద్రం(optic centre) చేరుతున్నాయి. అక్కడ జరిగే సంక్లిష్త విద్యుత్, రసాయన చర్యలవల్ల మెదడు ఆ వస్తువును గుర్తించగలుగుతున్నది. ఇలాగే శబ్ద, స్పర్శ, రస, గంధాలను ఇతర ఙ్ఞానేంద్రియాలద్వారా అంతిమంగా మేధస్సు విశ్వదర్శనం చేస్తున్నది. కానీ ఇక్కడే వస్తుంది అసలు ప్రశ్న. అసలు ఈ విశ్వాన్ని దర్శిస్తున్నది ఎవరు? మెదడు అని అందామనుకొంటే, అదే మెదడే మృత కళేబరంలోనూ ఉన్నది కదా? మరి ఆ మృత కళెబరం విశ్వాన్ని గుర్తించడంలో గానీ, ఇతర జీవ వ్యాపారాలను నిర్వహించడంలోగానీ ఎందుకు విఫలమౌతున్నది? ఎలెక్ట్రాన్లన బంధిస్తున్న, కేంద్రకంలోని ప్రోటానులనూ న్యూట్రాన్లను కలిపి ఉంచుతున్న బంధన శక్తి (cohesive force) రూపంలో శక్తి ఆ మృత కళేబరంలోని రసాయన పదార్థాలన్నింటిలోనూ కూడా ఉన్నది కదా? మరి ఎక్కడున్నది లోపం? మెదడు ద్రష్ట కాదు అని అంగీకరించవలసి వస్తుంది. కనుక వేదాంతులుగానీ, విఙ్ఞాన శాస్త్రవేత్తలుగానీ, శరీరానికి అతీతంగా, శరీరానికి అన్యమైన "జీవుడు" ఒకడున్నాడని అంగీకరించవలసి వస్తుంది. అనేక రూపాలు ధరించి లీలా కేళి జరుపుతున్నశక్తిరూపియైన పరబ్రహ్మమే, జడమైన పర్వతాలుగానూ,ఎత్తైన వృక్షాలుగానూ,లోతైన సముద్రాలుగా, చలనశీలమైన నదీ నదాలుగా, విస్ఫోటనశీలమైనఅగ్ని పర్వతాలుగా, ఆహ్లాదకరమైన అడవులూ, పచ్చిక మైదానాలుగా, అనంతమైన వైవిధ్యంతో అలరారుతున్న చరాచర జీవ రాశిగానూ భాసిస్తున్నది. ఈ సందర్భంలో శంకరుల దక్షిణామూర్తి స్తోత్రంలోని "మాయావీవ విజృంభయత్యపి మహా యోగీవ యస్స్వేచ్ఛయా" అన్న వాక్యం ఙ్ఞప్తికి వస్తుంది. అలాగే చిల్లులకుండలోని దీపకాంతులు బయటకు విరజిమ్మబడుతున్నట్లు, శరీరంలోని ఙ్ఞాన రూపమైన జీవుడే కన్ను, చెవి మొదలగు అవయవాల ద్వారా బయటకు ప్రసరిస్తున్నాడన్న శంకరుల వాక్యం "నానా చిద్ర ఘటోదర స్థిత మహా దీప ప్రభా భాస్వరం, ఙ్ఞానం యస్యతు చక్షురాదికరణద్వారా బహిః స్పందతే" అన్న వాక్యం స్ఫురణకు వస్తుంది. మరణ పర్యంతం సచేతనంగా ఉంటూ, మరణానంతరం అచేతనమయ్యే ఈ శరీరం గానీ, శరీరాంతస్థుడైన జీవుడు గానీ, ఆ శక్తి యొక్క రూపాంతరాలే. విశ్వమంతటా, లోపలా, వెలుపలా పరివేష్టించి ఉన్నది "ఏకామేవాద్వితీయం బ్రహ్మా’ అనీ మరియూ "అంతర్బహిశ్చ యత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః" అనియూ చెప్పదగిన శక్తియే అయిఉన్నప్పుడు దానికంటే అన్యమైనది ఏది ఉండగలదు కనుక? ఈశావాస్యమిదం సర్వం అని ఉపనిషత్తులలో చెప్పబడిన ఈ పలుకు ఇదేభావాన్నిస్ఫురింపజేయడం లేదూ? కనుక దీన్ని పరబ్రహ్మమని వేదాంతులు, శక్తి అనీ పదార్థమనీ వైఙ్ఞానికులూ భావిస్తున్నారు. ఈ దృష్టితో జీవో బ్రహ్మైవ నాపరః అని చెప్పడం సంపూర్ణంగా అంగీకారయోగ్యమైన పరమ సత్యమే అవుతుంది. ఈ వ్యాసం ముగించే ముందు ఒక చిన్న మాట.దేశ, కాలాది సకల విషయాలూ సాపేక్ష సత్యాలు మాత్రమే అన్నంత అవేవో చాలా తేలికగా కొట్టి పారవెయదగిన విషయాలని మాత్రము భ్రమించరాదు.అనేక సంవత్సరాల నిరంతర సాధన తరువాత అదృష్టం బాగుండి, అపరోక్షానుభూతిని అనుభవించ గలిగిన మహా యోగీశ్వరులు మాత్రమే ఇవేవీ పరమసత్యాలు కావని గ్రహించ గలుగుతారు గానీ అంతవరకూ వానిని వ్యావహారిక సత్యాలుగా అంగీకరించటం తప్పనిసరి.భౌతిక శాస్త్రంలో ప్రాథమిక పాఠాలు మొదలు పెట్టగానే స్టీఫెన్ హాకింగ్, ఐన్ స్టీన్ అంతటి వారలము కాలేము కదా. అలాగే మనము వేదాంతపరంగా ప్రాథమిక స్థాయిలో ఉన్నంతకాలం జపతపానుష్ఠానాదులను, నిత్య పూజాదికాలను వదలి వేసి మిట్ట వేదాంతంవల్లె వేస్తే మనకు లభించేది కర్మపరిత్యాగదోషమేగానీ అపరోక్షానుభూతి కాదు. అవాఙ్ఞ్మానసగోచరమైన ఆపరబ్రహ్మమే నేను అన్న అపరోక్షానుభూతిని సిద్ధింప జేసుకొన్న తరువాత కూడా ఆదిశంకరులు భక్తి తత్వ్వనికి అంత ప్రాధాన్యత నిస్తూ లక్ష్మీ నృసింహ కరావలంబస్తోత్రము వంటి భక్తి స్తోత్రాలను పుంఖానుపుంఖాలుగా రచించారంతే మనము ఇట్టి భ్రమకు లోను కాకూడదన్న ఉద్దేశ్యంతోనే. కనుక ’అహం బ్రహ్మాస్మి’ అన్న మాట చిలుక పలుకుల వలె వల్లె వేయదగిన మాటగా కాక జన్మ జన్మల సంస్కారం పక్వానికి వచ్చి సాధనలో సిద్ధిపొంది అపరోక్షానుభూతిని సొంతం చేసుకున్న మహనీయుల అంతిమ స్థాయి అనుభూతి గా గ్రహించవలసి ఉన్నది. ఇతి శం అధో - దీపిక (Foot Notes) 1 కోటానుకోట్ల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటారు 2 కాంతి సెకనుకు 1, 86,000 మైళ్ళవేగంతో ప్రయాణిస్తుంది. అంత వేగంతో కాంతి ఒక్క సంవత్సరకాలంలో ప్రయాణించే దూరాన్ని అంటే 1,86,000X60X60X24X365 మైళ్ళ దూరాన్ని ఒక కాంతి సంవత్సరం అంటారు. 3 ప్రోటానులోని ద్రవ్యరాశి 1.6726 x 10-27 కిలోగ్రాములు, న్యూట్రానులోని ద్రవ్య రాశి 1.67492 x 10-27కిలోగ్రాములు, ఎలెక్ట్రానులోని ద్రవ్యరాశి 9.108 X 10-31కిలోగ్రాములు 4 పరమాణువు సైజు 1 X 10-10 మీటర్లు, కేంద్రకము (nucleus) సైజు 1x10-15 మీటర్లు 5(M=m0 x అనే సూత్రీకరణం ఆధారంగా where m0= mass at rest, v=velocity of the particle and c= velocity of light) 6 t=t0 x అనే సూత్రీకరణం ఆధారంగా where t0= time at rest, v=velocity of the particle and c= velocity of light 7(L=L0 x where L0= length at rest, v=velocity of the object and c= velocity of light అనే సూత్రీకరణం ఆధారంగా)"
జైహింద్.

నూతన ఛందములలో గర్భ కవిత 24. . . . రచన . . . శ్రీ వల్లభ

0 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

30, మార్చి 2017, గురువారం

శ్రీ వేంకటేశ్వర భక్తి వాహిక నిర్వహించిన ఉగాది కవిసమ్మేలనము. 29-03-17

2 comments

జైశ్రీరామ్.
జైహింద్.

నూతన ఛందములలో గర్భ కవిత 23. . . . రచన . . . శ్రీ వల్లభ

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

29, మార్చి 2017, బుధవారం

నూతన ఛందములలో గర్భ కవిత 22. . . . రచన . . . శ్రీ వల్లభ

0 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

28, మార్చి 2017, మంగళవారం

29-3-2017. హేమలంబి ఉగాది పంచాంగ శ్రవణము.

2 comments

 జైశ్రీరామ్.
ఆంధ్రామృత పాఠకమహాశయులారా! మీ అందరికీ హేమలంబి ఉగాది శుభాకాంక్షలు.
(హేమలంబి, విలంబీచ, వికారీ, శార్వరీ తథా) హేమలంబి నామ సంవత్సర నవనాయకుల పలితాలు.
హేమలంబి నామ సంవత్సర నవ నాయకులలో నలుగురు శుభులు, ఐదుగురు పాపులు. అశుభాదిపత్యం వలన లాభ నష్టాలు రెండు తీవ్ర స్ధాయిలో ఉన్నప్పటికి మంత్రిత్వం శుక్రునికి రావటం, అర్ఘ, మేఘాధిపత్యం గురువునికి రావటం వలన దేశం సుభిక్షంగా ఉండును. పంటలు బాగా పండుతాయి. రాజకీయాలలో స్త్రీల ప్రాబల్యం అధికం. శుభగ్రహ ఆదిపత్యం వచ్చిన బావాలు రక్షణ కలిగి ఉంటాయి. పాపగ్రహ ఆదిపత్యం ఉన్న బావాలు ఇబ్బందికరంగా ఉంటాయి.
వర్షలగ్నం, జగల్లగ్న కుండలి ద్వారా దేశ భవిష్యత్, ప్రజల భవిష్యత్, వ్యవసాయ, రాజకీయ, వ్యాపార రంగాల భవిష్యత్, ప్రకృతి వైపరీత్యాలు, వర్షయోగాలు, ధరల హెచ్చుతగ్గులు పరిశీలించవచ్చును.
వర్ష లగ్నం:- ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి ప్రవేశించే సమయంలో ఉండే లగ్నం, ఇతర గ్రహాల స్ధితి గతులను బట్టి వర్ష లగ్న కుండలిని సాధిస్తారు. దృక్ సిద్దాంత రీత్యా వర్ష లగ్నం మేష లగ్నం అయినది. లగ్నం నందు తృతీయ, షష్ఠాధిపతి అయిన బుధుడు, లగ్న, అష్టమాధిపతి అయిన కుజుడు; పంచమం నందు రాహువు, షష్ఠం నందు గురువు, నవమ స్ధానం నందు శని, లాభ స్ధానం నందు కేతువు, వ్యయ స్ధానం నందు చంద్రుడు, రవి, శుక్రుడు ఉండటం జరిగింది.
జగల్లగ్న కుండలి:- ప్రతి సంవత్సరం సూర్యుడు అశ్వనీ నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించిన సమయంలో ఉండే లగ్నం, ఇతర గ్రహాల స్ధితి గతులను బట్టి జగల్లగ్న కుండలిని సాధిస్తారు. దృక్ సిద్దాంత రీత్యా జగల్లగ్నం మకర లగ్నం అయినది. ద్వితీయం నందు కేతువు, తృతీయం నందు శుక్రుడు, చతుర్ధం నందు రవి, బుధులు, పంచమం నందు కుజుడు, అష్టమం నందు రాహువు, నవమం నందు గురువు, దశమం నందు చంద్రుడు, వ్యయం నందు శని ఉండటం జరిగింది.
చైత్ర శుక్ల సంవత్సరానికి అధిపతులుగా రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి అంటూ 9 మంది నాయకులను నిర్ణయిస్తారు.
1. రాజు – కుజుడు
శ్లో :- అగ్ని తస్కర రోగాస్యుర్నృ పవిగ్రహ తాభృశం Ι
హతసస్యో బహువ్యాళో భౌమే వర్షాధిపే సతి ΙΙ
చైత్ర శుక్ల పాడ్యమి ఏ వారమో ఆ వారాధిపతిని ఆ సంవత్సరానికి రాజుగా నిర్ణయించాలి. చైత్ర శుక్ల పాడ్యమి మంగళవారం అయినది. హేమలంబ నామ సంవత్సరానికి రాజు కుజుడు అయినాడు కావున పరిపాలకులకు శతృత్వం, ప్రజలకు అగ్ని భయం, చోర భయం, సర్ప భయం ఉంటుంది. పంటలు సరిగా పండకపోవటం జరుగుతుంది.
2. మంత్రి – శుక్రుడు
శ్లో:- స్త్రీ సంయోగే సదా ప్రీతిర్పలితా ధాన్యజాతయః Ι
భవంతి వస్సు దూఘా స్సువృష్టి స్శాచివే భృగే ΙΙ
సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించిన వారాధిపతి మంత్రి అవుతాడు. మేష సంక్రమణం శుక్రవారం జరుగుటచే శుక్రుడు మంత్రి అయినాడు కావున వర్షాలు విశేషంగా కురుస్తాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి. గోవులు పుష్కలంగా పాలిస్తాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది. ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్నత కలిగి ఉంటారు.
3. సేనాధిపతి – బుధుడు
శ్లో:- వాతాహతా వారిధారాః కదాచిత్ వర్షంతి సస్యాని ఫలన్వితాని Ι
నరాస్త్రియః కామరాటా భవేయు స్సేనాపత్యే ఖలు సోమసూనోః ΙΙ
సూర్యుడు సింహారాశిలోకి ప్రవేశించిన వారాధిపతి ఆ సంవత్సరపు సేనాధిపతి అవుతాడు. సింహా సంక్రమణం బుధవారం జరుగుటచే బుధుడు సేనాధిపతి అయినాడు. మేఘాలు గాలికి ఎగరగొట్టబడి అరుదుగా వర్షిస్తాయి. పంటలు బాగా పండుతాయి. భార్యా భర్తలు సౌఖ్యంగా ఉంటారు. స్త్రీలపైన అఘాయిత్యాలు జరుగును. శత్రువులను రక్షణ శాఖ సమర్ధవంతంగా ఎదుర్కోనగలదు.
4. సస్యాధిపతి – రవి
శ్లో:- గోధుమ యవ ముఖ్యాని కుళుత్ధ చణకానిచ Ι
సమృద్ధాని భవిష్యంతి రవౌ సస్యాధి నాయకే ΙΙ
సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన వారాధిపతి ఆ సంవత్సరపు సస్యాధిపతి అవుతాడు. కర్కాటక సంక్రమణం ఆదివారం జరుగుటచే రవి సస్యాధిపతి అవుతాడు. దీనివల్ల ఉలవలు, గోధుమలు, శెనగలు, యవలు మొదలైనవి సమృద్ధిగా పండుతాయి. ఎర్రనేల పంటలు ఎక్కువగా ఉంటాయి.
5. ధాన్యాధిపతి - శని
శ్లో:- కృష్ణ ధాన్యాని సర్వాణి సూక్షధాన్యాని యానిచ Ι
కృష్ణ భూమిస్తు ఫలితా మందే ధాన్యాధిపే సతి ΙΙ
సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన వారాధిపతి ఆ సంవత్సరపు ధాన్యాధిపతి అవుతాడు. ధనస్సు సంక్రమణం శనివారం జరుగుటచే శని ధాన్యాధిపతి అవుతాడు. శని ధాన్యాధిపతి కావటం వలన నల్ల ధాన్యాలు, చిరుధాన్యాలు సమృద్ధిగా పండుతాయి. నల్ల నేల పంటలు సమృద్ధిగా పండుతాయి.
6. అర్ఘాధిపతి – గురువు (అర్ఘాధిపతి అంటే ధరలకు అధిపతి)
శ్లో:- సువృష్టి భిర్ధాన్య ధనైర్విరాజితా భూమిర్మహయజ్ఞ వరా మహీసురాః Ι
నిత్యోత్సవా మంగళ తూర్య నిస్వనై ర్భవంతి చార్ఘపతౌ గురౌ సతి ΙΙ
సూర్యుడు మిధునరాశిలోకి ప్రవేశించిన వారాధిపతి ఆ సంవత్సరపు అర్ఘాధిపతి అవుతాడు. మిధున సంక్రమణం గురువారం జరుగుటచే గురువు అర్ఘాధిపతి అవుతాడు. దీనివల్ల మంచి వర్షాలతో, సమస్త ధాన్యరాశులతో, ధనంతో భూమి తలతూగుతుంది. బ్రాహ్మణులు యజ్ఞ కర్మలపై ఆసక్తి చూపుతారు. ఉత్సవాలతోనూ, జాతర, మంగళ వాయుద్యాలతో దేశం చూడముచ్చటగా ఉంటుంది. ధరలు అదుపులో ఉంటాయి.
7. మేఘాధిపతి – గురువు
శ్లో:- సస్యార్ఘ వృష్టిభిస్తుష్టాభవేద్భూమిర్నిరంతరం Ι
రోగభయాస్సర్వే గురౌ మేఘాధిపేసతి ΙΙ
సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశించిన వారాధిపతి ఆ సంవత్సరపు మేఘాధిపతి అవుతాడు. సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి గురువారం ప్రవేశించుట చేత గురువు మేఘాధిపతి అవుతాడు. దీని వలన దేశం సస్య శ్యామలంగా ఉంటుంది. వర్షాలు సమృద్ధిగా లభిస్తాయి. ధరలు అందుబాటులో ఉంటాయి. ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారు.
8. రసాధిపతి – కుజుడు
శ్లో:- రజితం లవణం సర్పి తిల తైల గుడాడయః
శూన్యార్ఘం యాంతి తే సర్వే భౌమే యధి రసాధిపే
సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించిన వారాధిపతి ఆ సంవత్సరపు రసాధిపతి అవుతాడు. తులా సంక్రమణం మంగళవారం జరుగుటచే కుజుడు రసాధిపతి అవుతాడు. కుజుడు రసాధిపతి కావటం వలన వెండి, ఉప్పు, జీలకర్ర, నువ్వులు, నూనె, నెయ్యి, బెల్లం మొదలైన రస వస్తువుల ధరలు తగ్గు ముఖం పడతాయి.
9. నీరసాధిపతి – రవి
శ్లో:- నీరశాధిపతౌ సూర్యే తామ్ర చందన యోరపి Ι
రత్న మాణిక్య ముక్తానాం జాయతే వృద్ధి రుత్తమా ΙΙ
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన వారాధిపతి ఆ సంవత్సరపు నీరసాధిపతి అవుతాడు. మకర సంక్రమణం ఆదివారం జరుగుటచే రవి నీరశాధిపతి అవుతాడు. రవి నీరశాధిపతి కావటం వలన రాగి, మంచి గంధం, మాణిక్యాలు, ముత్యాలు వృద్ధి చెందుతాయి. ప్రజలకు క్షోభ కలుగుతుంది. వినాశాలు కలుగుతాయి.

యావజగత్తు  ఆనందంతో విరాజిల్లాలని మనసారా కోరుకొంటున్నాను.
జైహింద్.

శ్రీ హేమలంబి సంవత్సరం ఆద్యంతం మీకు ఆనందప్రదం కావాలని మనసారా ఆ పరమాత్మను కోరుకొంటున్నాను.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ హేమలంబి సంవత్సరం ఆద్యంతం మీకు ఆనందప్రదం కావాలని మనసారా ఆ పరమాత్మను కోరుకొంటున్నాను.
 జైహింద్.

27, మార్చి 2017, సోమవారం

ఇంతకీ హేమలంబి ఉగాది ఎప్పుడు? రాజపూజ్యం అవమానాల నిర్ణయం

0 comments

జైశ్రీరామ్.
శ్రీ హేమలంబి ఉగాది ఎప్పుడు జరుపుకోవాలనే అంశంలో జరుగుచున్న తర్జన భర్జనలు మనలను సందేహంలో పడేస్తున్నాయి.
నేనైతే మధ్యేమార్గంగా ఒక మార్గాన్ని ఎంచుకున్నాను. అది ఎలాగ అంటారా? చూడండి.
28-3-2017 సూర్యోదయానికి ఫాల్గుణబహుళ అమావాశ్య ఉన్నది. హేమలంబి చైత్రశుద్ధ పాడ్యము 28-3-2017 రాత్రి అనగా 29-3-2017 సూర్యోదయానికి ముందే గతిస్తున్నది.
ఉదయాత్ ఉదయం వారం అన్నారు కదా! 29-3-2017 సూర్యోదయాత్ పూర్వం విదియ రాక మునుపే, పాడ్యమి పోకముందే ప్రాత: కాలీన కృత్యాలు ముగించుకొని ఉగాదు జరుపుకొంటే శాస్త్ర విరుద్ధమూ అవదు. అమావాశ్యతో కూడిన పాడ్యమీ అవదు. కాబట్టి నేను నన్ననుసరించు మిత్రబాంధవులతో ఇదే పద్ధతికి కట్టుబడి జరుపుకొంటున్నము. ఇక మీ విషయంలో మీ ఇష్టం. ఆత్మ బుద్ధిః సుఖంచైవ అన్నారుకదా!. శుభమస్తు.

పంచాంగాలలో ఇచ్చే రాజపూజ్యం అవమానాల నిర్ణయం
సంవత్సరంలో ప్రతి రాశి వారికి రాజపూజ్యం అవమానాలు ఈ క్రింది విధంగా నిర్ణయించాలి.
శ్లో:- రాశి సంఖ్యా నృపశ్చైక్యం త్రినిఘ్నం బాణ సంయుతం 
మునిభిర్భాజితం శేషం రాజా పూజ్యామిహేచ్యతే
తల్లబ్ధం పుర నిఘ్నంచ పంచ సంఖ్యాయుతం పదం
మునిభిర్భాజితం శేషం అవమానమితిస్మృతమ్ ΙΙ
రవ్యాది వారాధిపతులకు మనపూర్వులు ధ్రువాంకాలను నిర్ణయించారు.
రవి-6, చంద్రుడు-15, కుజుడు-8, బుధుడు- 17, గురువు-19, శుక్రుడు-21, శని-10.
ఈ ధ్రువాంకాలు మారవు. స్ధిరంగా ఉంటాయి. రాశి సంఖ్యను మేషాదిగా నిర్ణయించాలి.
సంవత్సర రాజపూజ్య, అవమానాలను గుణించే విధానం:-
రాశి సంఖ్యకు సంవత్సర రాజు యొక్క ధృవాంకాలను కలపాలి. వచ్చిన సంఖ్యను 3 చేత గుణించాలి. గుణించగా వచ్చిన సంఖ్యకు 5 కలపాలి. కలపగా వచ్చిన సంఖ్యను 7 చేత భాగించాలి. భాగించగా వచ్చిన శేషం రాజా పూజ్యమవుతుంది. భాగించగా వచ్చిన లబ్ధాన్ని 3 చేత గుణించాలి. గుణించగా వచ్చిన సంఖ్యకు 5 కలపాలి. కలపగా వచ్చిన సంఖ్యను 7 చేత భాగించగా వచ్చిన శేషం అవమానం అవుతుంది.
ఉదాహరణకు:- వృశ్చిక రాశి వారికి హేమలంబ నామ సంవత్సర రాజపూజ్య అవమానాలను నిర్ణయిద్దాం. హేమలంబ నామసంవత్సరం శుక్ల పాడ్యమి మంగళవారం కావున కుజుడి యొక్క ధృవాంకాలను -8, రాశి సంఖ్య మేషాదిగా 8 వది.
రాజపూజ్యం గుణించు విధానం
సంవత్సరాధిపతి రాజు అయిన కుజ ధృవాంకం -8, రాశి ధృవాంకం -8 కలపగా వచ్చిన సంఖ్య 16. కలపగా వచ్చిన 16 ను 3 చేత గుణించగా 48 వచ్చును. గుణించగా వచ్చిన సంఖ్యకు 5 కలపగా 53 వచ్చును. కలపగా వచ్చిన సంఖ్యను 7 చేత భాగించగా లబ్ధం 7 వచ్చును. శేషం 4 వచ్చును. శేషం 4 కాబట్టి హేమలంబ నామ సంవత్సరంలో వృశ్చికరాశి వారికి రాజపూజ్యం 4 అవుతుంది.
అవమానం గుణించు విధానం
రాజపూజ్యం గుణించినప్పుడు వచ్చిన లబ్ధం 7 ని 3 చేత గుణించగా వచ్చిన సంఖ్య 21. గుణించగా వచ్చిన సంఖ్యకు 5 కలపగా 26 వచ్చును. కలపగా వచ్చిన 26 సంఖ్యను 7 చేత భాగించాలి. భాగించగా వచ్చిన లబ్ధం 3. శేషం 5 అవుతుంది. కావున హేమలంబ నామ సంవత్సర వృశ్చికరాశి వారికి అవమానం 5 అవుతుంది.
హేమలంబ నామ సంవత్సర వృశ్చికరాశి వారికి రాజపూజ్యం 4 అవుతుంది. అవమానం 5 అవుతుంది.
జైహింద్.

శ్రీ వల్లభ వారి నూతన ఛందములో కవయిత్రి సుప్రభగారి గర్భ కవిత. నెరుకలి,గతిమా,తానన, కమనీయ గర్భ నటకలిమెలికల వృత్తము

0 comments

 జైశ్రీరామ్.
నెరుకలి,గతిమా,తానన, కమనీయ గర్భ నటకలిమెలికల వృత్తము 
పలుకు తలికిఁ బ్రణతులు! పదమిత్తువ పట్టికింక! పడదనక యిడన్‌!( /పనిన్‌!)
పలుకిడుదులె, వగవకు! పదమీననఁ బాడరావు ! బవరములె మదిన్‌!
ఎలమి దెలియ నిలకును, నెదనూపుచు నిత్తు శక్తి, నెరిగినటులనే
బలుకువెడలుఁ బరుగునఁ , బదమాలగ వ్రాసి పంచఁ బ్రముదముగఁ దెరన్‌
గర్భితమైనవి ....
నెరుకలి వృత్తము
--------------------
పలుకు తలికిఁ బ్రణతులు!
పలుకిడుదులె, వగవకు!
ఎలమి దెలియ నిలకును,
బలుకు వెడలుఁ బరుగున
గతిమా వృత్తము
--------------------
పదమిత్తువ పట్టికింక!
పదమీననఁ బాడరావు !
ఎదనూపుచు నిత్తు శక్తిఁ
బదమాలగ వ్రాసి పంచ
తానన వృత్తము
-------------------
పదమిత్తువ పట్టికింక! పడదనక
పదమీననఁ బాడరావు ! బవరములె !
యెదనుండియె యిత్తు శక్తి, నెరిగినటు
పదమాలగ వ్రాసి పంచఁ బ్రముదముగ
కమనీయ వృత్తము
-----------------------
పలుకు తలికిఁ బ్రణతులు! పదమిత్తువ పట్టికింక!
పలుకిడుదులె, వగవకు! పదమీననఁ బాడరావు !
ఎలమి దెలియ నిలకును, నెదనూపుచు నిత్తు శక్తిఁ
బలుకు వెడలుఁ బరుగునఁ , బదమాలగ వ్రాసి పంచ
సుప్రభ
23-03-2017
వృత్తము ----గణములు----- యతి/యతులు ------ఛందము
----------------------------------------------------------------------
నెరుకలి ---న,న,నల -------------- 7 -------పంక్తి
గతిమా --- స,స,జ -----యతిలేదు --------బృహతీ
తానన -----స,స,జ,న,లల ------10 -------శక్వరీ
కమనీయ--న,న,న,న,భ,ర,ల ---10 -------అతిధృతి
నటకలిమెలికల ---న,న,న,న,భ,ర,న,న,లగ ------(7),11,16,20 ----ఉత్కృతి
చింతా రామకృష్ణారావు గారు ప్రచురించినది, వల్లభ వఝల వారు రచించినది, "నెరుకలి,గతిమా,తానన, కమనీయ గర్భ నటకలిమెలికల వృత్తము" స్ఫూర్తితో వ్రాయబడినది.
క్రొత్త వృత్తములను పరిచయము చేసిన చింతావారికి, వల్లభవఝల వారికి ధన్యవాదములు. ఏదో ఒక విధముగా శక్తినిచ్చి వ్రాయించినవారికి వందనాలు.
జైహింద్.

26, మార్చి 2017, ఆదివారం

శ్రీ వల్లభ వారి నూతన ఛందములో కవయిత్రి సుప్రభగారి గర్భ కవిత.బుధాపహ, భద్రలేమిల గర్భ కలిచారవశ వృత్తము

0 comments

 జైశ్రీరామ్.
బుధాపహ, భద్రలేమిల గర్భ కలిచారవశ వృత్తము
కలిచారవశ వృత్తము
పలుకులనాడు తల్లి, భయాపహ, పద్మవిలోచన భావమే గదా
కలమునఁ బారుచుండుఁ గడుంగడు వింతను గూర్చుచుఁ బద్యమై సదా
తలఁపులఁ బొంగఁజేయు తనే! దయఁజూపుచు నాపయి, కోరకే యెదన్‌ !
భళి భళి! పంపెనేమొ ప్రజాపతియే! యనుకంపను జూపఁగా నిటుల్‌!

గర్భితమైనవి ----
బుధాపహ
పలుకులనాడు తల్లి, భయాపహ, పద్మవిలోచన
కలమునఁ బారుచుండుఁ గడుంగడు వింతను గూర్చుచు
తలఁపులఁ బొంగఁజేయు తనే! దయఁజూపుచు నాపయి
భళి భళి! పంపెనేమొ ప్రజాపతియే యనుకంపను!

భద్రలేమిల
పలుకులనాడు తల్లి, భయాపహ, పద్మవిలోచన భావమే
కలమునఁ బారుచుండుఁ గడుంగడు వింతను గూర్చుచుఁ బద్యమై
తలఁపులఁ బొంగఁజేయు తనే! దయఁజూపుచు నాపయి, కోరకే
భళి భళి! పంపెనేమొ ప్రజాపతియే! యనుకంపను జూపఁగా !

సుప్రభ
24-3-2017

వృత్తము -----గణములు ---- యతి/యతులు ---- ఛందము
----------------------------------------------------------
కలిచారవశ ---న,జ,భ,భ,భ,భ,ర,లగ ---- యతి 9,11 ---- వికృతి ఛందము
బుధాపహ -----న,జ,భ,భ,భ,భ --------------యతి 11 ----- ధృతి ||
భద్రలేమిల -- న,జ,భ,భ,భ,భ,ర ----------- యతి 11 ----- ప్రకృతి ||

క్రొత్త వృత్తాలను పరిచయము చేసిన చింతావారికి, వల్లభవఝల వారికి ధన్యవాదములు.
నాలుగు వాక్యాలనిచ్చిన పై వారికి కృతజ్ఞతాపూర్వక వందనములు.
జైహింద్.

25, మార్చి 2017, శనివారం

నూతన ఛందములలో గర్భ కవిత 21. . . . రచన . . . శ్రీ వల్లభ

0 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

24, మార్చి 2017, శుక్రవారం

ప్రజాపత్రిక సంస్కారం.

0 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

త్యాగశీలి శ్రీ రావణ శర్మ. . . . ప్రజాపత్రిక ప్రశంస.

1 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

కన్నుల పండువగా జరిగిన ప్రజాపత్రిక 90వ వార్షికోత్సవము.

0 comments

జైశ్రీరామ్
జైహింద్

నూతన ఛందములలో గర్భ కవిత 20. . . . రచన . . . శ్రీ వల్లభ

0 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

23, మార్చి 2017, గురువారం

నూతన ఛందములలో గర్భ కవిత 19. . . . రచన . . . శ్రీ వల్లభ

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

22, మార్చి 2017, బుధవారం

కన్నులపండువగా జరిగిన ప్రజాపత్రిక 90వ వార్షికోత్సవము.

0 comments

జైశ్రీరామ్
ఇంత అద్భుతంగా నిర్వహించిన దేవీ సుదర్శన్ లకు, బహుమతి గ్రహీతలకు ప్రజాపత్రిక కుటుంబానికి నా అభినందనలు తెలియఁ జేయుచున్నాను.
జైహింద్.

నూతన ఛందములలో గర్భ కవిత 18. . . . రచన . . . శ్రీ వల్లభ

0 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

21, మార్చి 2017, మంగళవారం

నూతన ఛందములలో గర్భ కవిత 17. . . . రచన . . . శ్రీ వల్లభ,

0 comments

 జైశ్రీరామ్. 
జైహింద్.

20, మార్చి 2017, సోమవారం

రాజమహేంద్రి ప్రియ పుత్రిక అయిన ప్రజాపత్రిక 90వ వార్షికోత్సవము విశేషాలు.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! రాజమహేంద్రి ప్రియ పుత్రిక అయిన ప్రజాపత్రిక 90వ వార్షికోత్సవము మొన్న, నిన్న  చాలా వైభవంగా జరిగింది. మహామహులు గుర్తింపబడి గౌరవింపబడటమే అత్యంత వాంఛనీయము. ఇక్కడ అది జరిగినందుననే ఈ కార్యక్రమం ప్రశంసార్హమైంది.నిరాఘాటంగా ఇటువంటి కార్యక్రమాల్ని కులమత ప్రాంతముల కతీతంగా నిర్వహిస్తున్న ప్రజాపత్రిక కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఈ బాద్ధ్యతలను తమ భుజములపై వేసుకొని కఠోర దీక్షతో అత్యంత శ్లాఘ్యంగా నిర్వహిస్తున్న . 
సుదర్శన్, దేవీ సుదర్శన్ దంపతులు 
అభినందనీయులు. 
 మహనీయునకు ఘన సత్కారమ్.
 సత్కరింపబడుచున్న పద్మశ్రీ హల్డర్ నాగ్.
సత్కరిస్తున్న డాుధాకర్. సత్కరింపబడుచున్న డోలేంద్రప్రసాద్.
సత్క్రుతులైన మహనీయులందరికీ హార్దిక శుభాకాంక్షలు.
ఇటువంటి నిస్వార్థ సేవా దృక్పథం కలిగిన ఆది దంపతులను పోలిన దేవి సుదర్శన్ దంపతులను, 
ప్రజాపత్రిక కుటుంబాన్ని మనసారా అభినందిస్తున్నాను.
జైహింద్.

19, మార్చి 2017, ఆదివారం

శ్రీ హేవిళంబి నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనానికి ఆహ్వానము

3 comments

జైశ్రీరామ్.
శ్రీ హేవిళంబి నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనానికి
ఆహ్వానము
నిర్వహణ
గోల్కొండ సాహితి కళా సమితి    
మఱియు
ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్
(స్వచ్చంద సేవా సంస్థ)
గౌ. అధ్యక్షులు - శ్రీ మూగల ప్రతాప్ రెడ్డి గారు
సభాధ్యక్షులు - శ్రీ చంద్ర ప్రకాష్ రెడ్డి గారు
ముఖ్య అతిథి - ఆచార్య విజయలక్ష్మి గారు 
(హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ తెలుగు విభాగం) 
విశిష్ట అతిథి - శ్రీ చేకోలు సుందరయ్య గారు
ఆత్మీయ అతిథి - శ్రీ యన్. అశోక్ కుమార్ గారు.
సంయోజకులు - శ్రీ తాడిబోయిన రామస్వామి యాదవ్ గారు
                     సమయం: తేది 27.03.2017, సోమవారం,  సాయంకాలం 5 గం.                      
వేదిక: శ్రీవేంకటేశ్వర  దేవాలయము - చందానగర్.
కార్యక్రమ వివరాల
  జ్యోతి ప్రజ్వలన :
         ప్రార్ధనా గీతం - శ్రీ కడియాల ప్రభాకర్ గారు
     అతిథుల సందేశాలు:      
1. శ్రీ మూగల ప్రతాప్ రెడ్డి గారు
2. ఆచార్య విజయలక్ష్మి గారు
3. శ్రీ చేకోలు సుందరయ్యగారు
4. శ్రీ తాడిబోయినరామస్వామి యాదవ్ గారు
కవి సమ్మేళనం.
కవితా పురస్కారాలు
వందన సమర్పణ - శ్రీ యన్. అశోక్ కుమార్ గారు.
జైహింద్.

చిత్రకవి శ్రీ వల్లభకు ప్రజాపత్రిక చేసిన ఘన సత్కారం.

3 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! ప్రజాపత్రిక 90 వ వార్షికోత్సవం రాజమహేంద్రవరంలో అత్యద్భుతంగా జరిగింది.
ప్రజాపత్రిక 90 వ వార్షికోత్సవ సభలో ఘనమైన సత్కారాన్ని అందుకొంటున్న 
మన చిత్రకవి బ్రహ్మశ్రీ వల్లభవఝల అప్పలనరసింహమూర్తిగారు.
జైహింద్.

నూతన ఛందములలో గర్భ కవిత 16. . . . రచన . . . శ్రీ వల్లభ

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.