గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 24 || రత్నాదేవి. .. పద్యానువాదం చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

నీ కను సన్నలన్ విధి గణించి సృజించును సృష్టి, విష్ణు వా

శ్రీకర సృష్టిఁ బెంచు, లయ చేయు శివుండది, కల్పమంతమం

దా ఘనుఁడౌ సదాశివుఁడె యంతయు లోనికి చేర్చుకొంచు, తా

నీ కను సన్నలన్ మరల నేర్పునఁ జేయఁగ జేయు వారిచే. 24

భావము.

మాతా! తల్లీ! భగవతీ! అమ్మా! సృష్టికి కర్త అయిన బ్రహ్మ విశ్వాన్ని సృష్టిస్తున్నాడు. మహావిష్ణువు ఏమో రక్షిస్తున్నాడు. రుద్రుడు ఏమో విశ్వాన్ని లయింప చేస్తున్నాడు. కల్పాంతం లో మహేశ్వరుడు బ్రహ్మ, విష్ణువు, రుద్రులను తనలో లీనం చేసుకొని సదాశివతత్త్వంలో అంతర్భూతం చేస్తున్నాడు. ప్రకారంగా బ్రహ్మాండం అంతా లయమయిపోతుంది. మళ్ళీ   సదాశివుడు కల్పాదిలో నీవు నీ కనుబొమ్మలను ఒక్క క్షణం కదిలించగానే, అదే ఆజ్ఞగా  గ్రహించి నాలుగు తత్త్వాలతో మళ్ళీ యథావిధిగా సృష్ట్యాది కార్యాలు జరిపిస్తున్నాడు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.