గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, మార్చి 2013, గురువారం

తే.31-3-2013 న సాయంత్రం6గం.నుండి9గం.వరకు శ్రీ శాకంబరి అంతర్జాల అవధానం కార్యక్రమం జరుగబోతోంది.

0 comments

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా!
శ్రీ శాకంబరి అంతర్జాల అవధానం
భారతీయ కాలమానం ప్రకారం 31st  March 2013    సాయంత్రం ఆరుగంటలనుండి రాత్రి తొమ్మిదివరకు
పూర్తి వివరాలు ఎల్లుండి విడుదల చేయబడతాయి...
అవధాని:-  డా . మాడుగుల అనిల్ కుమార్ గారు, ఎం .ఎ ; బి.ఎడ్ ;  పీహెచ్ .డి.
( సంస్కృతోపన్యాసకులు శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల తిరుపతి )
ఈ కార్యక్రమమును చేపట్టినవారు మాలిక (అంతర్జాల) పత్రిక యాజమాన్యం.( జ్యోతి గారు)
అధ్యక్షులు - సంచాలకులు  నేనే నిర్వహిస్తున్నాను.
పృచ్ఛకులు.
1. నిషేధాక్షరి :-          : నేనే నిర్వహిస్తున్నాను. 
2. నిషిద్ధాక్షరి        : శ్రీ ముక్కు రాఘవ కిరణ్ 
3. దత్తపది 1         శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి      
4. దత్తపది 2        :  శ్రీ కొరిడె విశ్వనాథ శర్మ 
5. సమస్య 1         శ్రీ యం.నాగగురునాథశర్మ
6. సమస్య 2         శ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ 
7. వర్ణన             శ్రీమతి వలబోజు జ్యోతి
8.అప్రస్తుత ప్రసంగం   :శ్రీ నల్లాన్ చక్రవర్తుల కిరణ్ 
ఈ కార్యక్రమమును అంతర్ జాలము ద్వారా ప్రత్యక్షముగా తిలకించనెంచినవారు.
మరో ముఖ్యమైన విషయం: ఈ అవధాన కార్యక్రమాన్ని ఆస్వాదించి, ఆనందించాలనుకునే వారికోసం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అది మాలిక  పత్రికలో రేపు సాయంత్రం ఆరునుండి మొదలవుతుంది. తప్పుకుండా చూడండి మరి..  ప్రతీ ఐదు నిమిషాలకోసారి ఈ పేజిన్ Refresh / Reload చేస్తుండాలి. ఈ ప్రత్యక్షప్రసార బాధ్యతలు నిర్వహిస్తున్నది భరద్వాజ్ వెలమకన్ని..
మాలిక పత్రిక : http://magazine.maalika.org .
ఇంకా ఏమైనా సందేహాలుంటే జ్యోతిగారికి jyothivalaboju@gmail.com కు మెయిల్ చేసి వివరములు తెలుసుకొన వచ్చును.
నమస్తే.
జైహింద్.

27, మార్చి 2013, బుధవారం

నేడు హోలీ మరియు ప్రపంచ రంగస్థల దినోత్సవము .

1 comments

జైశ్రీరామ్.
నేడు హోలీ సందర్భముగా యావజ్జనానీకానికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.
నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవము.  సందర్భముగా రంగస్థలకళాకారులెల్లరికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. అనేక విధాలగా నవరసాలతో అలరింప చేసే మన రంగస్థల ప్రదర్శనలు కొన్ని మచ్చు తునకకు ఇక్కడ పొందుపరిచాను తిలకించండి.
రంగస్థలం అన్నది మానవుని నిజ జీవితానికి అద్దంపట్టే ప్రత్యక్ష ప్రదర్శనా స్థలము. రంగస్థల కళాకారులు నిజ జీవితములోని తమ అనుభవములను జోడించి, తమ నటనా కౌశలమును చూపుతూ, చక్కని ఆహార్యముతో, రసాత్మకమైన వాక్యములతో, తాదాత్మ్యత పొందుచు, నవరస భరితంగా ప్రదర్శించి ప్రేక్షకుల మదులను తమవైపునకే మళ్ళించుకొని,  రసానుభూతితో వారు ఆర్ద్రమనస్కులయేలాగ చేసే మాంత్రికులుగా మనకు తోచుదురు.అట్టి మహోన్నత కళాస్వరూపులకు, రచయితలకు, సాంకేతిక నిపుణులకు, ఆ రంగంలో శ్రమించే అందరికీ, ముఖ్యంగా ఆ రంగస్థల కార్య కలాపములకు ప్రోత్సాహమిస్తూ వెన్నుదన్నుగా నిలిచే ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భముగా నా హృదయ పూర్వక అభినందనలు తెలియ జేస్తున్నాను.
శుభమస్తు.
జైహింద్.

26, మార్చి 2013, మంగళవారం

శ్రీ పండిత నేమాని వారి ఉపన్యాసము 31-03-2013 న అమలాపురంలో.

0 comments

జైశ్రీరామ్.
సన్మిత్రులారా౧ మన అభిమాన కవి మిత్రులు శ్రీ నేమాని రామ జోగి సన్యాసి రావు మనోహరమైన ఉపన్యాసకార్యక్రమము తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఈ మాసమున 31వ తేదీన జరుగ నుంది. అవకాశము కలవారెల్లరు తప్పక ఈ సదవకాశమును ఉపయోగించుకొని, అసాధారణ ప్రతిభాపాటవములను కనపరచే ఈ మహనీయుని యొక్క ఉపన్యాసమును సాంతము విన గలరని ఆశించు చున్నాను.
శ్రీ పండిత నేఏమాని వారికి నా హృదయ పూర్వక అభినందనలు.
జైహింద్.

23, మార్చి 2013, శనివారం

తెలుగు రక్షణ వేదిక అధ్యక్షులు శ్రీ పొట్లూరి హరి కృష్ణ, ఎన్టీయార్ ట్రష్ట్ భవన్ లో శత కవుల సన్మానం

5 comments

జైశ్రీరామ్.
అర్యులారా! మొన్నను అనగా 21-03-2013 న అంతర్ జాతీయ కవితా దినోత్సవము జరుప బడింది. ఆ రోజున తెలుగు రక్షణ వేదిక  అధ్యక్షులు శ్రీ పొట్లూరి హరి కృష్ణ,  ఎన్టీయార్ ట్రష్ట్ భవన్ లో శత కవుల సన్మానం చేశారు. శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారు ప్రముఖ రంగస్థల, సినీ పద్య రాగాలాపకులు శ్రీ  గోపాల్, మాజీ మంత్రి వర్యులు ఒకరు ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ సభలో ఉండి అలరింప జేశారు.
మహానుభావులు పెక్కురు ఈ సభలో సత్కరింప బడ్డారు. అట్టి సత్కారం అందుకొనే భాగ్యం నాకూ ఆ పరమాత్మ ప్రసాదించాడు.
సాహితీ స్పొహూర్తి ప్రదాతలు చక్కని వ్యాఖ్యలతో మేలుకొలిపే మీ వంటి పాఠకులే  యీ సత్కారమునకు నన్ను అర్హునిగా చేసినది అని సగర్వముగా చెప్పుకొన గలను.
నిరంతరము పరిశీలనా దృష్టితో సాహితీ సన్మార్గ సుగామిగా నన్ను మీ వ్యాఖ్యలే తీర్చి దిద్దు చున్నందుకు సర్వదా మీకు నేను కృతజ్ఞుడను.
ఇటువంటి సాహితీ ప్రియ సత్ సంస్థలే సత్ కవులకు ఊపిరి నిచ్చుచున్నదనుటలో ఏమాత్రమూ సందియము లేదు. ఈ కార్యక్రమమును అత్యంత శ్రద్ధా భక్తులతో నిర్వహించిన తెలుగు రక్షణ వేదిక అధ్యక్షులు శ్రీ పొట్లూరి హరి కృష్ణకు  అభినందన పూర్వక ధన్యవాదములు తెలియజేసుకొను చున్నాను.
నమస్తే.
జైహింద్.

20, మార్చి 2013, బుధవారం

శ్రీ వల్లభవఝల కృతమయూర బంధిత దృత విలంబిత మణిభూషణశ్రీ గర్భౌత్పలమాల.

1 comments

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా! మన వల్లభవఝలకవి కృత మయూరబంధ ద్రుతవిలంబిత, మణి భూషణశ్రీ గర్భ ఉత్పలమాలను తిలకించండి.
శ్రీ వల్లభ వఝల వారి కృషిని మనసారా అభినందిస్తున్నాను.
జైహింద్.

19, మార్చి 2013, మంగళవారం

శ్రీ వల్లభవఝలవారి ఆకాశ మండల చక్ర బంధ షడ్లఘు సీసము.

1 comments

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా! శ్రీ వల్లభవఝల కృత చక్ర బంధ సీసమును తిలకించండి.
శ్రీ వల్లభ వఝల వారి కృషిని మనసారా అభినందిస్తున్నాను.
జైహింద

16, మార్చి 2013, శనివారం

కూప బంధ జలద గర్భ ఉత్పలమాల.శ్రీ వల్లభవఝల కృతము.

1 comments

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా! శ్రీ వల్లభ వఝల వారి కూప బంధ జలద గర్భ ఉత్పలమాల తిలకించండి.
జైహింద్.

15, మార్చి 2013, శుక్రవారం

శివ రాత్రి నాడు శివమయం అయిన విశాఖపట్టణం జిల్లాలోని జుత్తాడ గ్రామం

1 comments

జైశ్రీరామ్.



జైహింద్.





శివలింగ బంధ ద్రుతవిలంబిత జలద గర్భ ఉత్పలమాల.శ్రీ వల్లభ వఝల కవి కృతము.

3 comments

జైశ్రీరామ్.
గర్భ చిత్ర కవితానురక్తులగు వల్లభ వఝల వారికి అభినందనలు.
జైహింద్.

12, మార్చి 2013, మంగళవారం

శ్రీ వల్లభవఝల వారి సర్వతోముఖ బంధము.

1 comments

జైశ్రీరామ్.
సహృదయ పాఠకులారా! శ్రీ వల్లభ వఝలవారి కలమునుండి జాలువారిన మరిక బంధ కవితను తిలకించండి.
బంధకవితాభిలాషులైన శ్రీ వల్లభవఝలవారిని మనసారా అభినందిస్తున్నాను.
జైహింద్.

11, మార్చి 2013, సోమవారం

శివుడూ కరుణించీనాడోయమ్మా! కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా!.

3 comments

ఓం నమశ్శివాయ.
విజయోస్తు మహా భక్తా.
    శివుడూ కరుణించీనాడోయమ్మా!
    కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా!
1.  శివశివ యని నే భక్తిగ పిలువగ శివశివ యని నే భక్తిగ పిలువగ 
    శివశివ యని నే భక్తిగ పిలువగ శివశివ యని నే భక్తిగ పిలువగ 
    శీఘ్రమ్ముగ నామదిలోవెలుగుచు శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
2.  శివరాత్రికి నే జాగరముండగ శివరాత్రికి నే జాగరముండగ
    శివరాత్రికి నే జాగరముండగ శివరాత్రికి నే జాగరముండగ 
    ఆత్మలింగముగ అమరుచు మదిలో శివుడూ ll 
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
3.  ఉపవసించి నే తపసును చేయగ ఉపవసించి నే తపమును చేయగ 
    ఉపవసించి నే తపసును చేయగ ఉపవసించి నే తపమును చేయగ
    సపరివారముగ మదిలో వెలుగుచు శివుడూ ll 
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
4.  భక్తులతో శివ భజనలు చేయగ భక్తులతో శివ భజనలు చేయగ 
    భక్తులతో శివ భజనలు చేయగ భక్తులతో శివ భజనలు చేయగ
    ముక్తినొసంగగ ముందుకు వచ్చుచు శివుడూ ll 
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
5.  శివ లింగము దరి జ్యోతి నుంచగా శివలింగము దరి జ్యోతి నుంచగా 
    శివ లింగము దరి జ్యోతి నుంచగా శివలింగము దరి జ్యోతి నుంచగా
    జ్యోతిర్లింగము మదిలో గొలుపుచు శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
6.  కనులు తెరచి నే శివునే చూడగ కనులు తెరచి నే శివునే చూడగ 
    కనులు తెరచి నే శివునే చూడగ కనులు తెరచి నే శివునే చూడగ
    కనులు మూసినను కనిపించుచు శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
7.  ఓంకారమున శివాకృతి గాంచగ ఓంకారమున శివాకృతి గాంచగ 
    ఓంకారమున శివాకృతి గాంచగ ఓంకారమున శివాకృతి గాంచగ
    ఓంకారంబయి మదిలో నిలుచుచు శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
8.  పుడిసెడు జలమున నభిషేకించగ పుడిసెడు జలమున నభిషేకించగ 
    పుడిసెడు జలమున నభిషేకించగ పుడిసెడు జలమున నభిషేకించగ
    వడి వడి నామది వరలగ  నిలుచుచు శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
9.  కేశవ యని నే నాచమించగా కేశవ యని నే నాచమించగా 
    కేశవ యని నే నాచమించగా కేశవ యని నే నాచమించగా
    యీ శివుడే యా కేశవుడనుచును శివుడూ ll
     కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
10. ప్రాణాయామము భక్తిగ చేయగ ప్రాణాయామము భక్తిగ చేయగ 
    ప్రాణాయామము భక్తిగ చేయగ ప్రాణాయామము భక్తిగ చేయగ
    ప్రాణము నీలో ప్రాణము నేనే యనుచును శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
11. సంకల్పమ్మును చేయుచు నుండగ సంకల్పమ్మును చేయుచు నుండగ 
    సంకల్పమ్మును చేయుచు నుండగ సంకల్పమ్మును చేయుచు నుండగ
    నీ సంకల్పము నే గొలిపినదని శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
12. లింగాకృతి నే పొంగుచు చేయగ లింగాకృతి నే పొంగుచు చేయగ 
    లింగాకృతి నే పొంగుచు చేయగ లింగాకృతి నే పొంగుచు చేయగ 
    లింగంబయితిని రంగుగ నీకని శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
13. హరహర రమ్మని ఆవాహింపగ హరహర రమ్మన నావాహింపగ 
    హరహర రమ్మని ఆవాహింపగ హరహర రమ్మన నావాహింపగ
    నాలో నేనెటు లావహింతునని శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
14. సింహాసనమున కూర్చోమనగా సింహాసనమున కూర్చోమనగా 
    సింహాసనమున కూర్చోమనగా సింహాసనమున కూర్చోమనగా
    నే సృష్టించని ఆసనమిమ్మని శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
15. కాళ్ళు చేతులూ కడుగగ నీరిడ కాళ్ళు చేతులూ కడుగగ నీరిడ 
    కాళ్ళు చేతులూ కడుగగ నీరిడ కాళ్ళు చేతులూ కడుగగ నీరిడ
    తన గంగనె తన కొసగు టేమిటని శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
16. దాహము బాపగ నీళ్ళు త్రాగమన దాహము బాపగ నీళ్ళు త్రాగమన 
    దాహము బాపగ నీళ్ళు త్రాగమన దాహము బాపగ నీళ్ళు త్రాగమన
    దాహము నేనో సృష్టించితినని శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
17. స్నానము చేయుమటంచు వేడగా స్నానము చేయుమటంచు వేడగా 
    స్నానము చేయుమటంచు వేడగా స్నానము చేయుమటంచు వేడగా 
    స్మశాన వాసికి స్నానమేమిటని శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
18. జంధ్యము దాల్చుమటంచు వేడగా జంధ్యము దాల్చుమటంచు వేడగా 
    జంధ్యము దాల్చుమటంచు వేడగా జంధ్యము దాల్చుమటంచు వేడగా
    మంత్రాధిపుడను జధ్యమెందుకని శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
19. మేన ధరింపగ వస్త్రము నీయగ మేన ధరింపగ వస్త్రము నీయగ 
    మేన ధరింపగ వస్త్రము నీయగ మేన ధరింపగ వస్త్రము నీయగ 
    దిగంబరుండను వస్త్ర మేల యని శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
20. శ్రీగంధంబును మేన దాల్పమన శ్రీ గంధంబును మేన దాల్పమన 
    శ్రీగంధంబును మేన దాల్పమన శ్రీ గంధంబును మేన దాల్పమన 
    చిన్మయుడను నాకేల గంధమని శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
21. అక్షతలను నిను పూజించెదనన అక్షతలను నిను పూజించెదనన 
    అక్షతలను నిను పూజించెదనన అక్షతలను నిను పూజించెదనన
    అక్షయ శుభదుఁడ నందుదు నని గొని శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
22. పూవులతో నిను పూజించెదనన పూవులతో నిను పూజించెదనన
    పూవులతో నిను పూజించెదనన పూవులతో నిను పూజించెదనన 
    పూవులలో తన పార్వతిఁ గని గొని శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
23. బిల్వ పత్రములు ప్రీతిగ గొనుమన బిల్వ పత్రములు ప్రీతిగ గొనుమన 
    బిల్వ పత్రములు ప్రీతిగ గొనుమన బిల్వ పత్రములు ప్రీతిగ గొనుమన 
    జగతి మూలమది బిల్వ మనుచు గొని శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
24. ఆవు పాల నభిషేకము చేయగ ఆవు పాల నభిషేకము చేయగ  
     ఆవు పాల నభిషేకము చేయగ ఆవు పాల నభిషేకము చేయగ 
     గోవులు దేవుల రూపమంచు గొని శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
25. పండ్లరసంబుల నభిషేకించగ పండ్ల రసంబుల నభిషేకించగ 
    పండ్లరసంబుల నభిషేకించగ పండ్ల రసంబుల నభిషేకించగ 
    పార్వతి ప్రకృతిని ఫలరస మని గొని శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
26. పంచామృతముల నభిషేకించగ పంచామృతముల నభిషేకించగ 
    పంచామృతముల నభిషేకించగ పంచామృతముల నభిషేకించగ 
    పంచవ్వక్త్రునకు పంచా మృతమనె. శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
27. నమక చమకముల నభిషేకించగ నమక చమకముల నభిషేకించగ 
    నమక చమకముల నభిషేకించగ నమక చమకముల నభిషేకించగ 
    అన్నిట నాకే వందనమని గొని శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
28. భస్మముతో నభిషేకము చేయగ భస్మముతో నభిషేకము చేయగ 
    భస్మముతో నభిషేకము చేయగ భస్మముతో నభిషేకము చేయగ 
    భస్మ మహత్య మెఱింగితి వని గొని శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
29. నారికేళ జలమభిషేకించగ నారికేళ జలమభిషేకించగ 
    నారికేళ జలమభిషేకించగ నారికేళ జలమభిషేకించగ 
    నారికేళమది నారూపంబని శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
30. పరమాన్నంబు సమర్పణ చేయగ పరమాన్నంబు సమర్పణ చేయగ 
    పరమాన్నంబు సమర్పణ చేయగ పరమాన్నంబు సమర్పణ చేయగ 
    పరమాన్నంబున భక్తిని గని గొని శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
31. తాంబూలమ్ము సమర్పణ చేయగ తాంబూలమ్ము సమర్పణ చేయగ 
    తాంబూలమ్ము సమర్పణ చేయగ తాంబూలమ్ము సమర్పణ చేయగ 
    త్రిగుణసమాహిత మహో యనుచు గొని శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
32. కర్పూరంబున హారతి నొసగగ కర్పూరంబున హారతి నొసగగ 
    కర్పూరంబున హారతి నొసగగ కర్పూరంబున హారతి నొసగగ 
    హారుడననుచునె హారతి మది గొని శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
33. మంత్ర పుష్పమును మదితో నీయగ మంత్ర పుష్పమును మదితో నీయగ 
    మంత్ర పుష్పమును మదితో నీయగ మంత్ర పుష్పమును మదితో నీయగ 
    మహిమాన్వితమని మది కని తా గొని శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
34. అత్యుత్కృష్ట ప్రదక్షిణ చేయగ అత్యుత్కృష్ట ప్రదక్షిణ చేయగ 
     అత్యుత్కృష్ట ప్రదక్షిణ చేయగ అత్యుత్కృష్ట ప్రదక్షిణ చేయగ 
     హారుడ నే నీ పాప హరుడనని శివుడూ ll
     కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
35. సాష్టాంగంబుగ నమస్కరింపగ సాష్టాంగంబుగ నమస్కరింపగ 
     సాష్టాంగంబుగ నమస్కరింపగ సాష్టాంగంబుగ నమస్కరింపగ 
     అష్ట మూర్తి నే హాయి నొసగుదని శివుడూ ll
     కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
36. శివ మహిమాదుల పాడుచు పొగడగ శివ మహిమాదులు పాడుచు పొగడగ 
    శివ మహిమాదుల పాడుచు పొగడగ శివ మహిమాదులు పాడుచు పొగడగ 
    ధర్మ మార్గమున నడువగ తెలుపుచు శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
37. శివ శివ శివ శివ శివ యని పలుకగ శివ శివ శివ శివ శివ యని పలుకగ 
    శివ శివ శివ శివ శివ యని పలుకగ శివ శివ శివ శివ శివ యని పలుకగ 
    శివతత్వమ్మును నా మది నిలుపుచు శివుడూ ll
    కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
    కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
    కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
    కరుణించీనాడోయమ్మా.
    కరుణించీనాడోయమ్మా.
    కరుణించీనాడోయమ్మా.
    కరుణించీనాడోయమ్మా.
    స్వస్తి
ఓం నమశ్శివాయ.
జైహింద్.

10, మార్చి 2013, ఆదివారం

మహాశివ రాత్రి వృత్తాంతం - రాజశేఖరుని విజయ్ శర్మ

2 comments

ఓం నమశ్శివాయ.
సోదరీ సోదరులారా! శ్రీ రాజశేఖరుని విజయ శర్మ శ్రీ శివ రాత్రి వృత్తాంతమును ఇలా తెలియ జేస్తున్నారు. తిలకించండి.
మన పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది.
ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలొనర్చి, ఉపవాసం ఉండి రాత్రి అంతయు జాగరణము చేసి మరునాడు భోజనం చేయుదురు. రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుదురు. అన్ని శివక్షేత్రము లందు ఈ ఉత్సవము గొప్పగా జరుగును. పూర్వం శ్రీశైలం క్షేత్రమందు జరుగు ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రము లో విపులముగా వర్ణించాడు. శైవులు ధరించు భస్మము/విభూతి తయారుచేయుటకు ఈనాడు పవిత్రముగా భావిస్తారు.
మహాశివ రాత్రి వృత్తాంతం
మహాశివ రాత్రి మహాత్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.
గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణమహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పుమనగా అతను తనకు గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాధను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాధను తెలుపుమంటాడు.
అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా , నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.
బ్రహ్మ, విష్ణువుల యుద్ధం
ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగ మహాత్ములగు బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగిరి. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించెను. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేష శయ్యపై నిద్రించుచున్న విష్ణువును చూసి, "నీవెవరవు నన్ను చూసి గర్వముతో శయ్యపై పరుండినావు లెమ్ము. నీ ప్రభువను వచ్చి ఉన్నాను నన్ను చూడుము. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడును" అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీచూపులు ప్రసన్నంగా లేవేమి?" అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగముతో వచ్చినాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించువాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు" అంటాడు.
ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేయుచుండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగిరి. ఇలా సమరం జరుగుచుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. ప్రమథగణాల కు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసం లో మణులు పొదగబడిన సభా మధ్యం లో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శద్ధతో వింజామరలు వీచుచుంటారు. ఈ విధంగా నున్న ఈశ్వరునికి దేవతలు ఆనందభాష్పాలతో సాష్టాంగంగా ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. బ్రహ్మ, విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవి తో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు.మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు.విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుసుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయం లో మార్గమధ్యం లో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు(బ్రహ్మ, విష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటి తో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి,అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మ కి షోడశోపచారా లతో పూజ చేస్తాడు.కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆది ని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.మోసము చేసిన బ్రహ్మ ను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువు కి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు.
బ్రహ్మకు శిక్ష మరియు వరము
శివ పురాణం, విద్వేశ్వర సంహితలోని ఏడవ ఎనిమిదవ అధ్యాయములలో ఉన్నదీ విషయం.
ఈశ్వర ఉవాచ: అరాజ భయమేతద్వైజగత్సర్వం నశిష్యతి! తతస్త్వం జహి దండార్హం వహ లోకధురం శిశో!! వరందదామి తే తత్ర గృహాణ దుర్లభం పరమ్! వైతానికేషు గృహ్యేషు యజ్ఙేషు చ భవాన్గురుః!! నిష్ఫలస్త్వదృతే యజ్ఙః సాంగశ్చ సహ దక్షిణః! ........
శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తి తో ఈ బ్రహ్మ ను శిక్షించుము అని చెబుతాడు. ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాల లో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తి తో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లి, పూర్వము ఈశ్వర చిహ్నం గా బ్రహ్మ కు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి. ఈ మొదటి దైవము అగు బ్రహ్మ ను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు శరణు జొచ్చిన బ్రహ్మను (పిల్లవానిని తప్పుడు చేతకై దండించి తప్పు తెలుసుకొన్న తరవాత కారుణ్యమును ప్రకటించిన తండ్రిలా) ఉద్దేశించి గొప్ప వరమును ప్రసాదించెను. బ్రహ్మని క్షమించి, "ఓ బ్రహ్మా నీకు గొప్పనైన దుర్లభమైన వరమును ఇస్తున్నాను, అగ్నిష్టోమము, దర్శ మొదలగు యజ్ఙములలో నీది గురుస్థానము. ఎవరేని చేసిన యజ్ఙములలో అన్ని అంగములు ఉన్నా అన్నింటినీ సరిగా నిర్వర్తించినా, యజ్ఙనిర్వహణముచేసిన బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చినా, నీవు లేని యజ్ఙము వ్యర్థము అగును" అని వరమిచ్చెను.
మొగలి పువ్వుకు శాపము
ఆతరువాత కేతకీపుష్పము వైపు చూసి , అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపము లో నాపై ఉంటుంది అని చెబుతాడు.
కామధేనువుకు శాపము
అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పాను కనుక క్షమించుమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. భోలాశంకరుడు కనుక, కోపమును దిగమ్రింగి, " మొగము తో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు; కాని సత్యమాడిన నీ పృష్ఠ భాగము పునీతమై, పూజలనందుకొనును" అని శివుడు వాక్రుచ్చెను. అప్పటి నుండి గోముఖము పూజార్హము కాని దైనది; గోమూత్రము, గోమయము, గోక్షీరము లు పునీతములైనవై, పూజా, పురస్కారములలో వాడబడుచున్నవి.
మహాశివరాత్రి వ్రత కథ
ఒకనాడు కైలాసపర్వత శిఖరముపై పార్వతీపరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోను ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమనుదాని విశేషాలను తెలియజేస్తాడు. దీనిని మాఘబహుళచతుర్దశి నాడు ఆచరించవలెనని, తెలిసికాని, తెలియకగాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పుంచుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఈ క్రింది కథను వినిపించెను.
ఒకప్పుడు ఒక పర్వతప్రాంతమున హింసావృత్తిగల వ్యాధుడొకడు వుండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేవి అడవియంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటిపడుతున్నా ఉత్తచేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికొక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులను, కాయలను విరిచి క్రింద పడవేయసాగెను. చలికి "శివ శివ" యని వణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను.
మొదటిజామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడువబోగా లేడి భయపడక "వ్యాధుడా! నన్ను చంపకుము" అని మనుష్యవాక్కులతో ప్రార్ధించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యులవలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను. దానికి జింక "నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను. హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని. దానికి రుద్రుడు కోపించి కామాతురయైన నీవు, నీ ప్రియుడును జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాపవిముక్తులౌదురని సెలవిచ్చెను. నేను గర్భిణిని, అవధ్యను కనుక నన్ను వదలుము. మరొక పెంటిజింక ఇచటికి వచ్చును. అది బాగుగా బలిసినది, కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువుల కప్పగించి తిరిగివస్తాను" అని అతన్ని వొప్పించి వెళ్ళెను.
రెండవజాము గడిచెను. మరొక పెంటిజింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణము విడువబోగా అదిచూచిన జింక భయపడి మానవవాక్కులతో "ఓ వ్యాధుడా, నేను విరహముతో కృశించియున్నాను. నాలో మేదోమాంసములు లేవు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక యొకటి రాగలదు. దానిని చంపుము, కానిచో నేనే తిరిగివత్తును" అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను.
మూడవజాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటిజింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞచేసి వెళ్ళినవి, నిన్ను నాకు ఆహరముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని "నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెదను నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞపొంది మరలివత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళెను.
ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను. కొంతసేపటికి ఆ నాలుగు జింకలును వచ్చి నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనసు ఒప్పలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను. "ఓ మృగములారా ! మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను. ధర్మములకు దయ మూలము. దమయు సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మము నాశ్రయించి అస్త్రములను వదలిపెట్టుదును." అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ మాచరించి నమస్కరించెను.
అంతలో ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను. పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి యిట్లనిరి : ఓ మహానుభావా. శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది. ఉపవాసము, జాగరమును జరిపితివి, తెలియకయే యామ, యామమునను పూజించితివి, నీవెక్కినది బిల్వవృక్షము. దానిక్రింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగుపడి యున్నది. నీవు తెలియకయే బిల్వపత్రముల త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా! నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము."
ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిట్లనెను: దేవీ! ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. మూడు నక్షత్రములలో ముందున్న రెండూ జింకపిల్లలు, వెనుకనున్న మూడవది మృగి. ఈ మూడింటిని మృగశీర్ష మందురు. వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్జ్వలమైనది లుబ్ధక నక్షత్రము.
శివరాత్రి పూజా విధానాలు
ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.
ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపము గా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.
జాగరణము
జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును. ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము. జాగరణ దినమున వుపవాసము ఊడ్లెను.
రుద్రాభిషేకం
వేదాలలోనుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తం గా పండితులచే పఠించబడుతుంది. దీనిని శివలింగానికి ప్రాతఃకాలంలో పవిత్రస్నానం చేయిస్తారు. దీనినే రుద్రాభిషేకం (Rudrabhisheka) అంటారు. శివలింగంతో బాటు గండకీ నదిలో మాత్రమే లభించే సాలిగ్రామం కూడా పూజలందుకుంటుంది. దీనిద్వారా మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్ధం.
పంచాక్షరి మంత్రం
పంచాక్షరి మంత్రం శివస్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అనగా అయిదు అక్షరాలు "న" "మ" "శి" "వా" "య" (ఓం నమశ్శివాయ) నిరంతరం భక్తితో ఈనాడు పఠిస్తే శివసాయుజ్యం ప్రాప్తిస్తుంది.
ఇట్లు
భగవత్సేవకుడు
రాజశేఖరుని విజయ్ శర్మ
తిలకించారు కదా? చాలా సంతోషం.
జైహింద్.

ఓం శ్రీ మహేశా! వినం నీవు నే వ్రాసి తీ దండకంబున్.

3 comments

ఓం నమశ్శివాయ. 
భగవద్భక్తులారా! జన్మానికో శివరాత్రి అనే సామెత మీకు తెలియనిది కాదు.ఈ శివరాత్రి. ఎంతటి ఘనతరమైనదో  ఈ నానుడియే తెలియ జేయుచున్నది. అంతటి అపురూపమైన మహ శివరాత్రి మహా పర్వ దినము ఈనాడు మనకు ప్రాప్తించుట అపురూపమైన సదవకాశముగా భగవ్ద్భక్తులు భావింతురు.
ఈ మహా శివరాత్రి సందర్భముగా ఆంధ్రామృత పాఠకులు యావన్మందికి, యావద్భారతీయులకు, యావద్భగవద్భక్తులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దయామయుడైన పార్వతీ వల్లభుఁడు అనంత కరుణాంతరంగుడై నాచేత ఒక దండకమును ఈ రోజు వ్రాయించుకొనుట నా పురాకృత సుకృత విశేషఫలమే కాని వేరు కాదని నేను మనసారా భావించుచున్నాను. 
ఈ దండకమును భక్తిప్రపత్తులతో పఠించు భగవద్భక్తులకు మనస్పూర్తిగా అందజేయుచున్నాను. చూడండి. భక్తితో పఠించండి. సత్ ఫలితం కలిగితే అది పూర్తిగా మీరే పొందాలని మనసారా కోరుకొంటున్నాను. జై సాంబశివా.
ఓం నమశ్శివాయ.
ఓం శ్రీ మహేశా! లసత్ జ్ఞాన భాసా! హృదీశా! సుపోషా! శివా హృన్నివేశా! ఉమా హృత్ ప్రకాశా! మహా పాప నాశా! మహద్ జ్ఞాన పోషా! దురావేశ నాశా! శుభాధిక్య ఓంకార శ్రీ కార సంపూర్ణ సమ్యక్ ప్రభాధిక్య సందీప్త  ధీశా!  త్రిమూర్త్యైక సంపూర్ణ సౌందర్య భాసా! మహావేశ దుర్ దర్శ కోపాగ్నినేత్రస్థ శాంత ప్రపూర్ణాక్ష! సౌందర్య రాశీ!  ప్రభో! పార్వతీశా! దయన్ గాంచుమా! సత్ ప్రభావంబునే గొల్పి, సచ్ఛీలతన్ నిల్పి, సద్భావనన్ గొల్పి, సద్భాషణా భూషణంబున్ గృపన్ గొల్పి, సత్ పోషణా భవ్య భాగ్యంబునే కొల్పి, సంతోష సామ్రాజ్య సంవర్తిగా నిల్పి, సత్కార్య సంకల్ప దీక్షా ప్రభన్ గొల్పి, నీ భక్త పాళిన్ ప్రమోదంబు తోడన్ సదా సేవలన్ దేల్చు శక్తిన్ గృపన్ గొల్పి, నీ భవ్య తేజంబు నా మానసంబందు నిత్యంబు వెల్గొందగా నెప్పుడున్ జేసి, రక్షించుమా భక్త సంరక్షణోద్భాస!మా పార్వతీశా! నమో పాప నాశా! నమో దుష్ట శోషా! మొరాలించి నన్నేలుమీశా! మహేశా!
మదోన్మాద   గర్వాంధ దుర్వర్తులీ లోక  మందున్ విజృభించి, దౌర్జన్యముల్ సేయు చుండంగ, తాళంగ దుస్సాధ్యమౌటన్ మదిన్ గ్రుంకు  నీ భక్త పాళిన్ కనుం గాన రావో? మొరాలింపలేవో? దురుద్దేశ్య దౌర్భాగ్య దుష్టాత్ములన్ బట్టి, శిక్షించి, భక్తాళి నీ ధాత్రి రక్షింప లేవో? 
మృకండాత్మజుండేమి పూజల్ పొనర్చెన్? యమోద్గాఢ పాశంబు వెంటాడుచున్, వాని జంపంగ నుండన్, నినున్ దల్చి యాతండు రక్షింపు మంచున్ గుడిన్ జొచ్చి, నీ దివ్య రూపంబు నాలింగమున్ గాంచి తా కౌగిలిం బట్టి ప్రార్థించు చుండంగ, నీ శూలమున్ బట్టి యా పాశమున్ నిల్పి,  రక్షించినావే! మహా దేవదేవా! యనంత ప్రభావా! కృపాదృష్టి సారించి నన్ జూడ లేవా?
సునాయాస ముక్తిన్ ప్రసాదించు నిన్నున్ విశేషించి పూజించు భక్తాళి నోరార  దేవా! మహేశా! నమో పార్వతీశా! నమో పాప నాశా! మహా సుప్రకాశా! భవా! యన్న నాలించి, యుల్లంబునన్ బొంగి, నీ భక్తులన్ గాచు చుండన్ విపత్తుల్ నినుం జుట్టు చుండంగ, కానంగ లేవేల? కష్టంబులన్ గ్రోలు టిష్టంబొకో నీకు?
నా ధర్మ మార్గంబునన్ నే ప్రవర్తించునట్లే, ననున్ జేయ న్యాయంబు కాదో ? ప్రమాదంబులన్ బాప ధర్మంబు కాదో?
విఘాతంబులన్ పారద్రోలంగరాదో? ప్రబోధంబునే జేసి, జ్ఞాన ప్రదీప్తిన్, సుబోధంబు లోఁ గొల్పి, సుజ్ఞానమున్ నిల్పి, సమ్మోదమున్ గొల్ప సాధ్యంబు కాదో?
ప్రభో! నిన్ను మెప్పింప నేనేమి జేతున్? నివేదింపగా నీకు నా చెంత నేముండె ? నాదన్నదేముండె? నా జన్మమే నాది కాదే! మహాదేవ! నాలోన నీ రూపు లేకున్న నాకున్నయీలోకులే నన్ను నేకాకిగా చేసి, నీ కాటికే చేర్చి, శోకాంధులై యగ్ని సంస్కారమున్ జేసి, యా భస్మమున్ గంగలోకల్పి పోరే? శివా దీని మర్మంబు నేనెట్లు గాంతున్? మహా దేవ! నా లోన నీవుండుటన్ జేసి నే వెల్గుచుండన్, గనం జాలకే నిన్ను, నేనంచు నేనంచు  భాషించుతుమే? మా ప్రభావంబుగా నెంచి, లౌక్యంబునే పెంచి, నీవన్నవాడెన్నగా లేవటంచున్ నినున్ దోషిగా నిల్పయత్నించు చుండన్. మహాదేవి మాతల్లి మామూర్ఖతన్ గాంచి మన్నింప యత్నించి బుద్ధిన్ ప్రసాదించి, నీ తేజమెన్నంగ నిర్ధారణన్ గొల్పి, మన్నింపగా వేడ చేయున్ మహాత్ముండ! నీ సత్కృపా వృష్టి మాపై ప్రసారించి మమ్మేలుదీవే! మహేశా! మహేశా! మహా పాప నాశా! మహా సుప్రకాశా!  మహాదేవ విశ్వేశ! శ్రీ పార్వతీశా! నమస్తే. నమస్తే.నమస్తే.నమః.
జైహింద్.

9, మార్చి 2013, శనివారం

ద్రుతవిలంబిత-గీత గర్భ శ్రీబంధోత్పల సుశ్రీలు.

0 comments

జైశ్రీరామ్.
సత్కవితాభిలాషులారా! నమస్సులు. శ్రీ వల్లభవఝల కవి రచించిన శ్రీ బంధ చిత్రకవితను తిలకించండి.
మన వల్లభవఝల కవి చిత్ర్-బంధ కవితలలో  ఎంత అభినివేశము సంపాదించారో చూచారా ! 
వారిని మనసారా అభినందిద్దాము.
జైహింద్.


8, మార్చి 2013, శుక్రవారం

ప్రపంచ మహిళా దినోత్సవము సందర్భముగా మహిళా లోకానికి శుభాకాంక్షలు.

0 comments

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా!
ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవముగా గుర్తించి మహిళలకు ప్రపంచ స్థాయిలో సమున్నత స్థానమును గుర్తించడం సహృదయులైన మానవులకందరికీ ఆనందదాయకం అనడంలో సందేహం లేదు.
ఈ సందర్భముగా మహిళా లోకానికి నా శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను.
ఈ సృష్టికి మూలము మహిళ.
జన్మ కారణము మహిళ.
విద్యా బుద్ధులకు మూల హేతువు మహిళ.
అభివృద్ధికి మూలము మహిళ.
సృజనాత్మకత ప్రేరేపణకు మూలము మహిళ.
అదే విధముగా సర్వార్థసంపత్కరి మహిళ.
మూలశక్తిగా ఆరాధింపబడే దైవము మహిళ.
త్రిమూర్తుల సృష్టికి మూలము మహిళ.
అంతటి మహోన్నత స్థానమును సృష్టిలో పొంద గలిగిన మహిళలను గౌరవించడమన్నది స్రీ కారణముగా జన్మనొందిన ప్రతీ మనిషికీ కనీస బాధ్యతగా ఒకరు గుర్తు చేయవలసిన పని లేదు.
తన జన్మ కారణమైన తల్లిని,
తన ఆత్మీయతకు కారణమైన సోదరీమణులను,
తన సంతోష జీవన హేతువైన మిత్రురాలిని,
తన జీవనమైన అర్థాంగిని,
తన ప్రాణంలో ప్రాణమైన కూతుళ్ళను,
తనను తన కుమారుని కళ్ళల్లో పెట్టుకొని నిరంతరం కాపాడుతుండే కోడండ్రను,
వృద్ధాప్యంలో కూడా ఆనందాన్ని వెల్లివిరియ జేసే మనుమరాడ్రను,
సమాజంలో తమ చిఱునవ్వులతో అత్మీయతానురాగాలతో గౌరవించే మహిళామణులను,
ఇలా ఎందరెందరు మహిళలనో మనం కనీసం మంచి మాటలతోనైనా ఆనందపరచవలసిన ధర్మాన్ని మనం మరచిపోతే ఆ పరమాత్మ కాని, ఆ ఆది పరా శక్తి కాని క్షమిస్తారా?
ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఇది నగ్న సత్యంగా తోచక మానదు.
అందుకే మనం
యాదేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః. అని మనసులో ప్రతీ ప్రాణిలోనూ ఆ జగదంబను తలచుకొని ప్రార్థన చేయాలి. స్త్రీలు కంట పడితే మంచి మనసుతో మనసారా వారిని ముమ్మూర్తులా జగన్మాతగా భావించి, ఆలోకమాత తనకు తానుగా ప్రత్యక్షమైతే ఎక్కడ జడుచుకొని ప్రాణం వదిలెస్తామోనని భావించి, ఇలా ఎదురుపడే మహిళల రూపంలో మనను కటాక్షిస్తోందని భావించి ఆ మహిళా రూపంలో ఉన్న ఆ జగదంబను మనం గౌరవించాలి.
ఇక మహిళలు
ఈ విషయంలో తమకు స్త్రీ జన్మ పరమాత్మ ప్రసాదించిన వరంగా భావించాలి.
ఆ జగన్మాతలకు మారు రూపగా ఈ సమాజం అభివృద్ధి మార్గంలో నడచుటకు, తనచుట్టూ ఉండే వారిని నడుపుటకు మనసారా సంసిద్ధం కావాలి.
తనకు గల గురుతరమైన బాధ్యతను స్త్రీ మరువ కూడదు.
స్త్రీ జాతిపై లోకులకుండే అపారమైన గౌరవాన్ని తన ప్రవర్తనద్వారా నిలప గలగాలి.
సమాజాన్ని పురుషులను చిన్నగా చూడ కూడదు.
గౌరవస్థానంలో తాను నిలుచుటకు తగినంత కృషి తాను చేయడానికి వెనుకాడకూడదు.
లౌకికమైన అపోహలకు లోను కాకూడదు.
లౌకికమైన అసంబద్ధమైన దుష్ట వాంఛలకు లోను కాకూడదు.
సమాజంలో కొందరు స్త్రీలను చూసేసరికి పాదాభివందనం చేయాలనిపిస్తుంది. అటువంటి స్త్రీలలో ఉండే ఏ గుణములు వారికి గౌరవాన్ని కలిగిస్తున్నాయో గ్రహించి, అటువంటి గౌరవప్రదమైన సత్ప్రవర్తనను మహిళలు అలవరచుకోవాలి.
ఎక్కడో పుట్టి పెరిగి, ముక్కూ మొహమూ తెలియకపోయినా వివాహబంధంతో అత్తవారింటికి చేరిన స్త్రీ ఆయింటికే దీపం ఔతోంది. ఆ కుటుంబ గౌరవం, ఆ కుటుంబ వృద్ధి కేవలం ఆ కోడలిపైనే ఆధారపడి ఉంది.
ఇంతటి అత్యద్భుతమైన పాత్రపోషించ వలసియున్న మహిళ తన బాధ్యతను గుర్తించి, తనను తాను తీర్చి దిద్దుకోవాలి. అందరి మన్ననలకు పాత్రత పొందగలగాలి.
అలాంటి పాత్రత పొందాలంటే ముఖ్యంగా
౧)స్మిత పూర్వ భాషణము.(చిఱునవ్వుతో మాటాడుట)
౨)సౌశీల్యము,
౩)నిష్కళంక హృదయము కలిగి యుండుట,
౪)మాటలలో తొణికిసలాడే మంచితనము కలిగి యుండుట,
౫)ఎంతటి శ్రమనైనా ఓర్పుతో చేయగలుగుట.
౬)అత్యద్భుతమైన నిండైన శారీరక, మానసిక సుస్వరూప ప్రదర్శనము.
అంటే చక్కని నిష్కపటమైనమనసు కలిగి ఉండుట,
నిండైన వస్త్రధారణము, అలంకరణలతో చూడ ముచ్చటగా సమాజములో ఒప్పుట.
౭)అన్నిటికీ మించి ఆత్మ నిగ్రహము.
ఇవి కలిగి ఉంటే ఏ స్త్రీ మూర్తీ కూడా ఎటువంటి దురాగతములపాలు అయే అవకాశము ఉండదు.
కావున
లక్ష్మీ-సరస్వతి-పార్వతీ స్వరూపులైన మహిళాలోకాన్ని మనసార వేడుకొంటున్నాను. ఈ సమాజాన్ని కాపాడమని, తమ సత్ప్రవర్తనతో లోకానికే ఆదర్శమూర్తి కావాలని కోరుకొంటున్నాను.
ఈ నా మాటలో దోషములుగా మీ మనసునకనిపిస్తే మనసారా మన్నించే సంస్కారం మీకు ఉంటుందని ఆశిస్తున్నాను.
మీ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను మీరు నిర్భయంగా అనుభవించాలని మనసారా ఆశిస్తున్నాను.
అమ్మా!శాంభవి-లక్ష్మి-వాణిజననీ! హాయిన్ ప్రసాదింపుడీ
సమ్మోదమ్మున లోకమందు వెలిగే సత్శీలతల్ గొల్పుడీ!
మిమ్మే మానసమందు గాంచగలిగే మీ తత్వ సత్ శోభలన్
నెమ్మిన్ గొల్పగ వేడెదన్ మహిళకున్ నిత్యత్వమున్ గొల్పుచున్.
మహిళామణులకు మరొక్కమారు నా శుభాకాంక్షలు తెలియజేసుకొంటూ
సుజన విధేయుఁడు
రామకృష్ణ.
జైహింద్.

7, మార్చి 2013, గురువారం

గజబంధ నర్కుట - కోకిలక గర్భ చంపకమాల. శ్రీ వల్లభవఝల కృతము.

0 comments

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా!
శ్రీ వల్లభ వఝల నరసింహ మూర్తి కవి కృత గజబంధ నర్కుట-కోకిలక గర్భ చంపక మాలను చూడండి.
ఆంధ్ర భాషాభిమానంతో ఇటువంటి అపురూపమైన వినూతన ప్రయోగములతో తెలుగు భాషామతల్లి ఋణం తీర్చుకొంటున్న శ్రీ నరసింహ మూర్తి కవికి హృదయ పూర్వక అభినందన పూర్వక ధన్యవాదములు.
జైహింద్.

6, మార్చి 2013, బుధవారం

శ్రీ శివాష్టోత్తర శత పంచ చామరావళి (శివ శతకము)

4 comments

జైశ్రీరామ్.
శ్రీశివాష్టోత్తరశత పంచచామరావళి.
(శివ శతకము)
రచన - చింతా రామ కృష్ణా రావు
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.
-:  అంకితము :-
శ్రీకరంబైనట్టి చింతాన్వయంబున జనియించినాడ సుజనుల నడుమ.
వేంకటరత్నము వేంకట సన్యాసి రామరావుల పుత్రు. రామ కృష్ణ
రావుగా వర్థిల్లి, రాఘవాచార్యుల  ప్రథమ శిష్యుండనై వ్రాసినాఁడ
నుత శివాష్టోత్తర శత పంచచామరావళి పేరఁ బరగు శివ శతకమును
శివుని కృపఁ జేసి. దీనిని సవినయముగ
ఆది దంపతులై మనకమరియున్న
యా భవానికి భవునకు నంకితముగ
నందఁ జేసితి, నే, ముక్తి నంద గోరి.

1శివాభవానమోస్తుతేవిశేష భక్త వత్సలా  
భవాని వామ భాగమందు భవ్యయై వసింపగా
నవీన దివ్య తేజసంబు నాట్యమాడు నీ దరిన్.  
నివాసముండుమా మదిన్వినీల కంధరాశివా!

2. నమోస్తు తేసదా శివాసనాతనానమోస్తు తే  
నిమేషమందె నీల కంఠనీ కృపా కటాక్షముల్
ప్రమోదమందఁ జేయుఁగా, ప్రభావపూర్ణ తేజమై,  
నమస్కరింతునయ్య నీకునన్నుఁ గాంచుమాశివా!

3శశాంక శేఖరాహరావిశాల నేత్రసుందరా!  
ప్రశాంత చిద్విరాజమాన భవ్య  భక్త వత్సలా!
నిశీధిలో విశేష కాంతి నింపి లింగమూర్తిగా  
నశేష భవ్య భక్త కోటి యార్తిఁ బాపితేశివా!

4ఉపాసనా ప్రభావ మెన్న నో హరాపొసంగునే? 
కృపా నిధీఉపాసకుల్ నిరీక్షణన్ నినున్ గనన్
ప్రపూజ్యమాన దివ్య తేజ భద్ర లింగ దర్శనం 
బపూర్వమైయమేయమైన హాయి గొల్పుఁగాశివా!

5సమస్త దోష హారి వంచు జాగరంబుఁ  జేసి, నిన్ 
ప్రమోద మందఁ జేయఁ బూను భక్త కోటిఁ గాంచితే?
క్షమింపుమా దురాత్ములన్విశాల నేత్ర! శంకరా!  
నమామి భక్త వత్సలాప్రణామమందుమాశివా!

6సరోరుహాననానినున్ ప్రసన్నతం గనుంగొనన్ 
ధరాతలంబునన్ బుధుల్ ప్రతాపమొందు చుందురే!
దురాత్ములైన గాని నిన్నుఁ దోయిలించి మ్రొక్కినన్ 
కరావలంబమిచ్చి దీక్ష కాచు చుందువేశివా!

7ప్రదీప్త దీప మొక్కటైన భక్తి నీదు సన్నిధిన్  
ముదంబుతో వెలుంగఁ జేసి పూజ చేయు వారికిన్
సదా సుయోగ భాగ్యమిచ్చి, సత్ కృపన్ గ్రహింతువే!  
మదీయ చిత్త సంస్థితాసుమంగళాకరాశివా!

8దురంత దుష్కృతంబులేను దుర్మదాంధ వర్తినై 
నిరంతరంబు చేసితోవినీతునై చెలంగితో.
కరంబు నిచ్చి గాచితీవు గౌరవంబు దక్కెరా!  
వరంబు నాకు నీ యుదార భావ మీశ్వరాశివా!

9ప్రదోష కాలమందు నిన్ను భక్తి తోడఁ గాంచితిన్.  
ముదావహంబుగా భవాని పూజ లందుచున్ భవా!
సుధా సుదృక్పరంపరన్ సుశోభఁ గూర్చి, యంబకున్ 
విధేయతా స్వభావ మీవు వెల్వరించితేశివా!

10స్వధర్మ రక్షణంబు లోన సాధుపుంగవాళి నీ  
విధేయులై మనోజ్ఞ భావ వీక్షణాళి నొందగా
మదిన్ దలంచి చూచుచుంద్రుమాంద్యభావ శూన్యతన్, 
ప్రదీప్త దివ్య తేజమిచ్చి రక్ష సేయుమో శివా!

11ప్రపూజ్య దివ్య భక్తి భావ పారవశ్యమందు నే  
ప్రపూజ్యుఁడాముదంబు తోడ పాప భావ నాశమున్,
తపో విధాన భాగ్యమున్,  ప్రధాన భక్తి తత్వమున్, 
నెపంబు నెంచకిమ్మటంచు నిన్నుఁ గోరనాశివా!

12వరంబయెన్ నమశ్శివాయ పంచ వర్ణ మంత్ర మీ 
ధరన్దురంత దుఃఖ దూరతన్కృతార్థతన్భవత్
కరావలంబమున్పరంబు కల్గఁ జేయుభక్తులన్ 
నిరంతరంబు కాచు చుండునిర్వికారుఁడాశివా!

13. మనోజ్ఞుఁడా! నమో೭స్తుతే. ఉమాపతీ! నమో೭స్తుతే. 
యనాధుఁడా! నమో೭స్తుతే.మహాత్ముఁడా!నమో೭స్తుతే.
వినీతుఁడా! నమో೭స్తుతే. సువేద్యుఁడా! నమో೭స్తుతే.  
పునీతుఁడా! నమో೭స్తుతే. సుపూజ్యుఁడా! మహా శివా!

14నిరామయుండనిర్గుణుండనిర్వికారఈశ్వరా!    
ధరాతలంబు నేలు చుండె దౌష్ట్యముల్గ్రహించితే?
కరావలంబ మీవె యిచ్చి కావకున్న మాకికన్  
చరింప సాధ్యమామహేశసత్ స్వరూపుఁడాశివా!

15నరాధముల్, నరాంతకుల్, వినాశకారకుల్ భువిన్  
పరాపకార మూర్ఖులున్, స్వభావ సిద్ధ దుష్టులున్,
చరించు చుండ్రి స్వేచ్ఛగావిచార మగ్న చిత్తులై  
నరోత్తముల్ కృశించు చుండ్రిన్యాయమేదిరా? శివా!

16స్వభావ సిద్ధ భక్తి భావ సాధు మానవాళికిన్  
శుభాకరాప్రపూజ్యనీదు సూక్ష్మ దివ్య బోధనల్
ప్రభాసమానస్పష్టమయ్యభాగ్యమీవ వారికిన్.  
విభుండ వీవ కాతువంచు విశ్వసింతురో శివా!

17గణాధిపుండు మీ విశిష్టగౌరవంబునెన్నుచున్,  
ప్రణామముల్ ప్రదక్షిణల్ ప్రభావమున్ గ్రహించి తా
ననేక మాచరించెగాగణాధిపత్యమందెగా!  
సనాతనానినున్ గనన్ బ్రశాంతి కల్గునో శివా!

18హిమాద్రి పుత్రి నీ విచిత్ర హృద్య సుస్వరూపమున్ 
ప్రమోదమందెఁ గాంచియేమి భాగ్య మబ్బె నామెకున్?
ప్రమాణ మీవ సృష్టికంచు భవ్య భావనన్ వివా  
 మాడె నిన్నుఁ బ్రేమతోమహాత్ముఁడామహాశివా!

19హిమాచలాద్రి పుత్రి యుత్సహించి నీపయిన్ మహా  
ప్రమోద మానసంబుతోడ భక్తి భావ యుక్తయై
యమేయ దీక్షఁ బూన, నీవు నామెనంది యుండగా  
యమోఘమంచు దివ్యులెల్ల హర్షమందిరో శివా!

20నమామి తేమనోహరాఅనాధనాధసుందరా!  
నమామి తేప్రభాన్వితాఅనంత రూపతే నమ:!
నమామి తేవినీల కంఠనాగ భూషణానమ:!  
నమామి తేజగత్పితాప్రణామమందుమాశివా!

21ఉమాపతీకృపాంబుధీసమున్నతత్వమంది నిన్ 
బ్రమోద మానసుండనై సభక్తిఁ గొల్చి, భ్రాంతులన్,
సమస్త లంపటంబులన్విషాద పూర్ణ జన్మమున్,  
బ్రమాదమున్ బరిత్యజింతుప్రాపుఁ గొల్పుమాశివా!

22ఉమాహరుల్ స్వరూపమందు నొక్కటై రహించగా  
రమేశుఁడున్ విరించియున్ సరస్వతీ రమా సతుల్
ప్రమోద మంది గాంచిరే వరంబుగా! మనంబునన్  
నిమేషమైన నిన్ను నిల్పు నేర్పు నీయుమా !  శివా!

23.  సముజ్జ్వలత్ప్రశస్త లింగ సత్కృపా కటాక్షముల్  
నమస్కరించు నట్టి వారునవ్య దివ్య భావులున్
ప్రమోద దివ్య చిత్తులున్, ప్రభాత సేవ భక్తులున్,  
నిమేష కాలమందు పొందునిత్యుఁడామహా శివా!

24మృకండు పుత్ర రక్షకావరేణ్యులన్నఁ బ్రీతితో  
ప్రకాశమాన గౌరవంబు, ప్రాభవంబుఁ గొల్పుదే?
దుకూల, సర్వ భోగ భాగ్య దుండ వౌదువయ్యత్ర్యం 
బకామహాత్మనన్ను కావుమామహేశ్వరాశివా!

25జలాభిషేకమొప్పఁ జేయ, చాల సంతసింతువే!  
కులాలుడైనఁ గాని వానిఁ కూర్మితో గ్రహింతువే!
విలాసవంతులైన గాని, పేదలైన గాని నీ  
తలంపునందునొక్కటేనితాంత భాగ్యదాశివా!

26ప్రపంచ భూత సాక్ష్య దివ్య పంచ వక్త్ర శోభివే,  
విపంచి నాదమాధురిన్ సువేద్యమౌదువే హరా!
కృపాకటాక్ష వీక్షణల్ ధరిత్రిపైన నింపితే!  
ప్రపూజ్య ఓం నమశ్శివాయ భవ్య మంత్రమైశివా!

27.  వినాశమన్నదెన్న లేని విశ్వ సాక్షివే హరా   
మనోజ్ఞ సృష్టి చేసి, దాని మట్టిఁ జేయ న్యాయమా ?
ప్రణామముల్ ప్రపంచ దివ్య భవ్య భాగ్య రక్షకా!  
ననున్ గనంగదోయి సాంబనా మనోజ్ఞుఁడాశివా!

28.  నిరంతరాయ దృష్టి నీదినిర్వికల్పుఁడాభవా!  
భరింపరాని దుష్ట భావ పాపు లేల పుట్టిరో!
విరించి చేయు సృష్టిఁ గాంచి వేగమే గ్రహించి, యీ  
భరంబుఁ బాపి కావుమయ్య భారతాంబ నో శివా!

29కవీశ్వరుల్ గ్రహించునట్లు కానిపించుమా హరా!  
నివేదనంబు లందుమావినీతులన్ గ్రహింపుమా!
సువేద్యమైమనోజ్ఞమైన సుందరాకృతిన్ కృపన్  
కవిత్వ తత్వ రూప మొంది కాంచఁ జేయుమాశివా!

30గుణత్రయంబు నీవయై, ప్రకోప దుష్ట సంహతిన్  
వినాశమొందఁ జేయవేమివిశ్వ రూపుఁడాహరా!
వినీతులెల్ల బాధలొంద ప్రీతి తోడఁ గాంతువా? 
అనాది దుష్ట తత్వమెన్ని యార్పుమామహా శివా!

31సుమంగళాకరానినున్ బ్రశోధనంబు చేయుచో 
యమంగళంబులన్ని బాయు నాత్మ తేజ దర్శనం
బమోఘమై లభించునయ్యహర్షణీయమైసదా  
సమాధి సుస్థితిన్ వెలుంగ సాధ్యమౌనుగాశివా!

32ప్రభాత వేళ స్నాన సంధ్య ప్రార్థనల్ చరించుచున్,  
విభోత్వదీయ లింగ మూర్తి వేల్పుగా గణించి, మా
యభీప్సితంబు లెల్లఁ ద్రోచి, యద్భుతాభిషేకముల్  
శుభాకరాగ్రహింపుమన్నశోభఁ గూర్తువే!  శివా!

33నిదానమే ప్రధానమంచు నిన్ను నమ్మి యున్నచో,  
విధాత వ్రాయు వ్రాత నైన విశ్వసింపనేలరా!
సుధా ప్రపూర్ణ జీవితంబు శోభిలన్ యమర్తువే !  
మదిన్ విశాల భావమున్న మమ్ముఁ గాతువే శివా !

34విరించి సృష్టి లోనఁ గల్గు వింతలెల్ల కంటివా?  
ధరాతలంబునందునుండు ధర్మమే నశించదా!
నరాధముల్ పొనర్చు దౌష్ట్య నర్తనంబు కానరా!  
కరావలంబమిచ్చి మమ్ము కావుమా! మహా శివా!

35త్రినాధ పూర్ణ దివ్య రూపదేవ దేవశంకరా!  
త్రినేత్రుఁడామనోజ్ఞ భావ దీప్తిఁ గొల్పి కావరా!
అనాధనాధుఁడాకనన్ మహా విశిష్ట దైవ మీ 
వనంగ నుండుమా యెదన్శుభాస్పదంబుగాశివా!

36రమా వినోది యైన విష్ణు రక్షణంబు చూచితిన్! 
యమోఘ వాణినేలు బ్రహ్మ యాత్మ శక్తి చూచితిన్!
ప్రమోద మానసుండవై వరంబు లిచ్చుటందు నీ  
సమానులన్ గనంగ లేనుశంకరామహాశివా!

37స్వభావ సిద్ధ సత్స్వభావ భాగ్య మీవ కొల్పినన్  
విభోదురంత దౌష్ట్యముల్ నవీనులందు కల్గునా?
శుభప్రదంబు నీకు, మాకు, చూచి మంచి కొల్పుమా!  
ప్రభోశుభంకరామహేశభక్త బాంధవాశివా!

38నిశాచరుల్ నరాధముల్ వినీతి దూరులీ భువిన్ 
నశింపఁ జేయుచుండ్రివారి నాశనంబు చేయుమా.
నిశీధిలోన నంగనల్ పునీత మార్గమందునన్  
వశింపగల్గఁ జేయుమాభవాగ్రహింపుమాశివా!

39నవీన మార్గ మంచు నేడు నాట్య శాలలందునన్  
వివస్త్రలై కృశాంగులే సవిస్తరంబుఁగా తమన్
ప్రవేశపెట్టుకొందు రేల? పాప చింత లేదొకో? 
భవాత్వదీయ దివ్య దృష్టిఁ బాపుమిట్టి వో శివా! ?

40ఉమా ధవాప్రమోదమాసమున్నతిన్ దురాత్మకుల్, 
ప్రమాదమందు సజ్జనుల్ ప్రభావమేది యుండెరా!
సమస్త మీవ చూచు చుండి సజ్జనాళిఁ బ్రోవుమా!  
ప్రమోద మంద సజ్జనాళి భక్తిఁ గొల్తురో శివా!

41ప్రశాంత చిత్తమందు నిన్ను భక్తిఁ గొల్వఁ గోరగా 
నశాంతి చుట్టి ముట్టు నన్ను నాత్మ తేజ మీవయై
విశేష దివ్య దర్శనంబు ప్రీతి తోడఁ గొల్పుమా!  
అశేష భవ్య భక్తకోటి యాశ తీర్చుమా శివా!

42మనోజ్ఞుఁడాఅశేష సృష్టి మానసంబు నందునే  
వినోద మంద తల్చ నీవు విశ్వమే జనించెనా!
అనాధ నాధనీదు లీల హాయిఁ గొల్పు నీకునీ  
వినోదమెల్ల శిక్ష మాకు విశ్వనాథుఁడాశివా!

43నమోనమశ్శివాయ యంచు నాల్కపల్కినంతనే  
ప్రమోదమంది రక్ష సేయ వచ్చితీరుదీవునీ
సమాను లెవ్వరయ్య కావసర్వ భూత సంస్థితా 
నమో నమో నమోస్తు తే ! ప్రణామ మందుమాశివా!

44ప్రమాద సూచి నీవు గాంచి భక్త కోటి కెల్లెడన్ 
ప్రమేయముండు, లేక పోవు, రక్షఁ గొల్ప చూతువే!
ప్రమాణమౌచు నిల్తువేశుభంబుఁ గల్గఁ జేతువే! 
సమాను లెవ్వరయ్య నీకుసన్నుతాత్ముఁడాశివా!

45పవిత్ర భక్తి భారతీయ భావ జాలమందునన్  
ప్రవర్ధిలున్ శివాంశఁ జూచి, భక్తి తోడ నెల్లెడన్
శివాహరాయటంచు బిల్చు క్షేమమందఁ జేయగన్! 
భవానితోడఁ గావుమయ్యభారతీయులన్ శివా!

46చరాచరంబు లందుఁ జిక్కి సంచలించు నామదిన్  
నిరాశఁ జిక్కకుండ కావ నీకె సాధ్యమౌనుగా.
దురాశ కల్గ నీక కాచు ధూర్జటీఉపేక్షయా?  
పరాచికంబు లేల కావ? భక్త బాంధవాశివా!

47మదేభ సర్ప శ్రీ లవేమి మంత్రముల్ పఠించెరా?  
ముదావహంబయెన్ మనోజ్ఞ పూజలీవు పొందుటన్.
సదా విశాల భావ పూర్ణ సత్ ప్రశస్త భక్తులన్  
మదిన్ గ్రహించి కాతు వీవుమా మహేశుఁడాశివా!

48ధరాతలంబునందు నీ ప్రధాన భక్త బృందముల్ 
చరించు ధర్మ బద్ధులై ప్రశస్తి నీకుఁ గొల్పుచున్.
పరాత్పరాగ్రహించరాస్వభావ సిద్ధ సద్గుణుల్  
దురాగతంబు లోర్తురేగతుల్ మరల్చరాశివా!

49అమోఘ భవ్య పాద పద్మమాశ్రయించు వారికిన్  
నమస్కరించు వారికిన్, వినమ్రులైన వారికిన్,
శమ క్షమాది సద్గుణ ప్రశస్తి కొల్పు శంకరా!  
నమస్కరింతునయ్య నీకునన్నుఁ గాంచుమాశివా!

50అయోమయాంధకార మీవు హాయిగా సృజించియే 
ప్రయోజనంబు కోరినావుబ్రహ్మ సాక్షిగా హరా!
ప్రయాస కాక యేమి దక్కెప్రస్ఫుటంబుగా భవ  
ద్దయాప్రభావ కాంతి, మార్గ దర్శకంబురాశివా

51విశిష్ట సృష్టి బ్రహ్మచేయ, విష్ణు సంస్థితంబయెన్. 
విశాల విశ్వ సంలయంబు వేల్పు వీవ చేయగా?
ప్రశాంతమైన ధ్యానివై  ప్రభావ మొందినావుగా!  
నశింపఁ జేయు వృత్తి యెట్లు నచ్చెరా? మహా శివా!

52. మహాశివామహాశివాప్రమాణ మీవ మాకునీ 
మహోదయంబు సృష్టికే సమస్త సత్ఫలంబయా!
మహాత్ములెన్నినిన్నుఁ గాంచు,మమ్ముఁ గాతువీవనున్.
మహాద్భుతంబుచూపుదీవుమమ్ముఁగావుచున్ శివా!

53శనీశ్వరుండు లోక మందు సంచరింప వీలుగా  
మనుష్యులందు భక్తిఁ గొల్పి మాన్యుడా శనీశ్వరుం
డనంగ దాగినావు కాని, యడ్డగింప నేర్వవే 
యనాధ వోలె తొఱ్ఱలోన నంబుజాక్షుఁడాశివా!

54సుధర్మ మాచరింపగా నశుద్ధులన్ వధింపనా?  
స్వధర్మ మాచరించుచున్ ప్రభావమేది యుండనా?
సుధర్మమాస్వధర్మమాత్రిశూల పాణి తెల్పుమా!  
ప్రధాన ధర్మమాచరింతుభవ్యమేదిరాశివా!

55పరాత్పరుండ వీవటంచు భక్తితో భజింపగా  
నిరాశఁ గొల్పుదేల నీవునీవు గల్గి యుండగా
ధరాతలంబునందు దుష్ట దంభులన్ గణింపనా? 
నరాధమాళి యేచుచుండెనన్నుగావరాశివా!

56పరాక్రమాదులెల్ల నీవు పన్ను నట్టి యుక్తులే. 
దురంత దుర్దశల్ వరింపత్రోవ కాన రాదుగా?
పరాక్రమంబదేమి చేయుభక్తి నిన్ స్మరించినన్  
దురంత దుర్దశల్ తొలంచి త్రోవ చూపుదేశివా!

57కవిత్వ తత్వ దర్శనంబు కావ్య కర్తఁ జేయునా?  
భవాని సత్కృపాబ్ధి మున్గు భక్తుడన్న ప్రీతితో
కవిత్వ శక్తి నిచ్చి, వాణి కావ్య రూప మొందునే! 
భవుండభాగ్యశాలివే భవాని కల్గుటన్ శివా!

58సుధార్ణవంబు నందు ముంచు సోమశేఖరానినున్.  
మదాంధకార మగ్నులైన మానవాళి కాంతురే,
మదోన్మదుల్ మదంబడంచి, మంచి నుంచి గాంచుమా!  
వ్యధార్తపాళి బాధ తీర్చి భక్తిఁ గొల్పుమాశివా!

59నమస్కరించి నంతలోన నమ్ము చుందువే మమున్! 
సమస్త సృష్టిఁ జేయునట్టి  శంకరాయెఱుంగవే?
ప్రమాద మెంచవేలనయ్యభక్తులన్న మాటలే  
ప్రమోద మీకుఁ గొల్పగా స్వభావమెంచవాశివా!

60జయంబు నిచ్చు వానిగాయసాధ్య సాధ్యుగా తమన్  
భయంబు వీడి పల్కుచుంద్రుభక్త వత్సలా సదా
జయంబు నీవు కల్గఁ జేయఁ సత్యమౌనుకానిచో  
భయంబు కల్గు నిశ్చయంబు పాపికిన్సదాశివా!

61విశాల విశ్వ సృష్టి బ్రహ్మ పేరఁ జేతువా హరా!  
ప్రశాంత పోషణంబు విష్ణు భావ మొప్పఁ జేతువా !
నశింపఁ జేయు వాఁడవావినాశనంబు నీ పనా? 
ప్రశాంత భావభక్త పోష భావ్యమామహా శివా!

62అపర్ణగా ప్రశస్తి పొంది యాది శక్తి నిన్నుతా  
నపేక్షతోడ పొందెనయ్యహాయి యేమి కొల్పితో!
ప్రపూజలన్ మనోజ్ఞ భావ ప్రాప్తి నీకు గొల్పె నా  
యపర్ణ కోరు మాదు రక్షహాయికూర్చుమాశివా!

63గణాధిదేవతాదులున్ ప్రగాఢ భక్తి యుక్తులై  
ప్రణామ మాచరించుచున్ సపర్య చేయ వత్తురే!
మునీశ్వరుల్ ముదంబు తోడ పూజ చేయ వత్తురే 
మనంబు నీకు లేదొకోసమాధి నుంటివాశివా!

64సమీప్సితార్థ మొందఁ జేయ చాలు దీవె యందురే! 
సమీపమందె యుండి నీవు చక్కఁ జూతు వందురే!
ప్రమోదమీకు కల్గఁ జేయ బాధలం గణింపరే!  
ప్రమాదమెంచి కావుమయ్యభక్తి మూఢులన్శివా!

65అపూర్వ దైవ మీవెగామహత్ప్రసిద్ధి నీదెగా!  
సపర్య లందఁ జేయుచున్న సాధ్వి యా యపర్ణగా?
అపూర్వమైన భక్తి బంధ మందియున్న మిమ్ములన్  
తపించి పొందు భక్తులెల్ల తాపసాళియేశివా!

66వ్యధార్త జీవ కోటికిన్ సహాయ కారివౌచు నీ 
ప్రధాన దైవ ధర్మమున్ స్వభక్తపాళిఁ గాంచగా
విధేయతన్ వహించి చేతువేముదావహంబుగా. 
స్వధర్మ మాచరింప సత్ స్వభావ మిమ్మురాశివా!

67నరేంద్రులున్ సురేంద్రులున్ మనంగ నీవె కారణం 
బురామహేశ్వరానితాంత పుణ్య సత్ఫలంబుగా
స్మరింపఁ గల్గు మాకు నిన్నుశంకరాశుభంకరా!  
ధరాతలంబునందు మాకు దైవ మీవెరాశివా!

68అనంత విశ్వమంతటన్ శివాజ్ఞ లేక ఏదియున్  
మనంగ లేదుకుట్ట లేదు మంట పుట్ట చీమయున్.
వినాశమున్ వివేకమున్ నవీన సద్విభావమున్ 
మనోజ్ఞుఁడాత్వదీయ శక్తిమమ్ముఁ గాచుమాశివా!

69ప్రభావ మీవ కొల్పగా నభంబు తాకనౌనుగా! 
నభంబు తాక గల్గినన్ వినాశ మొందు మానవుల్
ప్రభావమేదినీ కృపా ప్రవాహ మేది యున్నచో? 
విభో! త్వదీయ శక్తి, యుక్తివిజ్ఞు లెన్నురాశివా!

70మరంద మెంత పుష్పమందుమాన్యనీదు సృష్టిలో 
మరంద మక్షికం బదెంతమాధురీ విమోహతన్
మరంద మెంత సేకరించుమందుకైనఁ దక్కునా?  
మరంద మందు మానవాళిమాయ నీదిరాశివా!

71వృథా ప్రయాస నీదిరాభవిష్య వాణి తెల్పెరా!  
సుధీర నీ ప్రయత్నతన్ వసుంధర ప్రణాశమున్
బుధాళి తోడనున్న గాని పొందకుండ చేయలే  
వుధర్మ హీనతన్ గదా భవుండ యిట్లగున్శివా!

72ప్రకాశ మార్గ మీవు చూప భాగ్య శాలు రందుగా! 
ప్రకోప శత్రు షట్క శక్తి భక్తులన్ మరల్చుగా!
వికారమంది నిన్ను వీడవేల్పు వయ్యు కావ సా  
వకాశ మేది చూతువయ్య భక్త పాళి నో శివా!

73ప్రపంచమందు నిండి యుండె పంచబాణు శక్తి 
సు పూజ్యుఁడాగ్రహించివానిఁ జూచు బూది చేసినన్,
నెపంబె దక్కె నీకుఁ గానినేర్పునన్ మనంబులన్ 
తపింపఁ జేయుచుండెమారు తాప మార్పరాశివా!

74సభాసదుల్ మనంబు పొంగ సన్మనోజ్ఞ బోధనల్  
ప్రభావ మంత చూపి పల్కు పండితాళిఁ గంటి నే.
ప్రభావ మెల్ల వారికున్న భక్తి యొక్కటే కదా!  
ప్రబోధ శక్తి మాయమౌను భక్తి లేనిచోశివా!

75నిరామయానిరంజనావినీల కంఠుఁడాశివా!  
ధరా తలంబునందు నా స్వధర్మ బద్ధతన్ భవా!
నిరంతరంబు కల్గి యుండ నీక చేయ సాధ్యమౌన్.  
పరీక్ష చేయుటాపుమయ్యభక్తుఁ గావుమాశివా!

76ప్రభాత దివ్య భాసమాన భాగ్య మీవె కల్పితే!  
నభంబునందు చుక్కలన్ యనంతనీవె కొల్పితే!
నభోంతరాళ మధ్య శోభ నమ్మి చూడఁ గొల్పితే!  
స్వభావ సిద్ధ సృష్టి కర్తవాపరాత్పరాశివా!

77నభంబునందు చుక్కలున్ వినమ్రతన్ నినున్ గనున్ 
ప్రభోనమశ్శివాయ యంచు భక్తితో వచించుచున్.
ప్రభాత సూర్య కాంతి నీ ప్రభావమెన్ని వెల్గెడున్.  
విభుండ వంచుఁ గాంచు నెల్ల విశ్వమున్ నినున్ శివా!

78భగీరథుండు స్వర్నదిన్ భవాశివాగ్రహింపవా!  
ప్రగాఢ భక్తిఁ గొల్తునంచు భక్తితోడ వేడగా
మృగాంక శేఖరావహించి మేలుగా శిరంబునన్  
బిగించి యుంచి దించితీవుభీతిఁ బాపుచున్ శివా!

79జరా రుజల్ ధరా స్థలిన్ ప్రజాత మైన వారికిన్  
వరంబుగా కలుంగ, నీదు పావనాంఘ్రి యుగ్మమున్
స్థిరంబుగా భజించినన్ సుచేతనంబుఁ గొల్పుచున్ 
కరంబు నందఁ జేసి నీవు కాతువే! మహా శివా!

80సమాజ సేవ చేయు వారు స్వార్థమున్ త్యజింపరే!  
నమస్కరింప బూనినన్ మనంబు నిష్కళంకమై
ప్రమోదమందఁ జేయరేస్వభావ సిద్ధ సద్గుణుల్  
సమస్త మీశ్వరార్పణంబు సల్పునెప్పుడున్ శివా!

81ప్రమాదమైన మంచు కొండ పై తపంబదేమిటో!  
ప్రమోదమంది భక్త కోటి భక్తిఁ గొల్చుటేమిటో!
నమోస్తుతే మహాశివాఅనాధ నాధుఁడా! హరా!  
సమీప మందు నుండ రాదొసమ్మతిన్ సదా శివా!

82జనాను కూలమైన చోట చక్కనుండుమా హరా!  
నినుం భువిన్  స్వభక్త పాళి నిండుగా కనంగనౌన్.
ప్రణామ మాచరించనౌన్కరంబు సేవ చేయనౌన్! 
మనో వికారముల్ త్యజించి మంచిఁ గాంచనౌన్. శివా!

83శ్రమైక జీవనుల్, నినున్ ప్రశాంత చిత్తులై కనున్.  
మమేకమై భజించు నెట్టి మర్మమే యెఱుంగరే!
అమోఘమైన భక్తితత్వ మబ్బె వారి కెట్లుఓం 
నమశ్శివాయ మంత్రమే పునాది భక్తికిన్శివా!

84స్మశాన భూములందు నీవు సంచరింతు వందురే!  
విశిష్టమా స్మశాన భూతిప్రీతిఁ దాల్తువందురే!
నశింప చేయువృత్తి నీవు నచ్చి, చేతువందురే!  
ప్రశస్తమేదికాని దేదిభాగ్యమేదిరాశివా!

85త్రిశూలముల్ శరీరమందుఁ బ్రీతిఁ గ్రుచ్చు కొందురే! 
విశేష పూజ లంద నిన్నుఁ బ్రీతిఁ వేడు కొందురే!
ఆశేష భక్త కోటి నీకు హారతిచ్చి, కాంతురే.  
విశేష మేమి కల్గియున్న వేల్పు వీవురాశివా!

86పురాణ గాధలందు నిన్ను పూర్తిగా పఠించితిన్.
వరాల వర్ష మందఁ జేయు భక్త బాంధవా హరా!
నరాధముండె యైన గాని నమ్మి నిన్ను కొల్చినన్ 
భరింతు వీవు వాని తప్పు భక్త పెన్నిధీశివా!

87నిరంతరంబు నీప్రశస్తి, నీ మహత్యమున్ భవా!  
చరాచరంబులందు నీ ప్రచారమున్, స్థితిత్వమున్,
సురాసురాళి కెల్ల నీదు శోభఁ జూపి గాచుటీ  
ధరాతలాన కీర్తిఁ గాంచెదర్శనీయుఁడాశివా!

88భరింపరాని బాధ కల్గ భవ్యనిన్ను తిట్టుదే. 
నిరంతరాయ సౌఖ్యమబ్బ  నిన్ను నే స్మరింపనే!
వరంబుగా స్థిరంబుగా నివాసముండి నా యెదన్  
భరించు నీకు రక్ష సేయ భావ్యమే కదా! శివా!

89జగజ్జయంబు చేసినట్టి జాణ లేరిరాహరా! 
ప్రగాఢ ప్రేమ జీవు లేరిభాగ్య శాలు రేరిరా!
జగంబులో సజీవ సత్య సాక్షి లేదు చూడరా!  
దిగంత వ్యాప్తనీవె సత్య తేజ మెన్నగాశివా!

90సముద్ధరింతుమంచు దేశ, సంఘ సేవ చేసినన్,  
సమున్నతత్వమొందినన్, ప్రశాంతతన్ వహించినన్
నమామి తే మహేశ్వరా! యనంగ లేని జీవులీ  
సమాజమందు వ్యర్థ జీవ సన్నిభుల్మహా శివా!

91హిమాద్రిపై సమాధి లోన హృన్మనోజ్ఞ మూర్తివై,  
ప్రమాణమై రహించుచున్, కృపా కటాక్ష వీక్షణల్
ప్రమోదమంద భక్త పాళిపైనఁ జూపుదే హరా!  
నమామి తే మహేశ్వరాప్రణామ మందుమా ! శివా!

92అహంబు చావ లేదురామహానుభావ! నా హరా !  
ఇహంబునందు దుష్కృతుల్ మహేశ్వరాగణించినన్
సహాయ మీవు చేయ లేవుసౌమ్యభావ పూర్ణమౌ  
మహామతిన్ ననున్ మరల్చి మాన్యుఁ జేసితేశివా!

93నితాంత శాంతిమంతుఁడావినీల కంఠశంభుఁడా!  
కృతాపరాధినైన నన్నుఁ గేలి చేయ బోకురా!
శతాంశమైన నీ ప్రసక్తి సల్పి యుండి యుండనా? 
మతిన్ గణించి కావుమయ్యమాననీయుఁడాశివా!

94సభా సదుల్ ప్రశంస చేయ చాల పొంగి పొవుచున్ 
స్వభావ సిద్ధ దుష్ట షట్క సంగతిన్ జరించితిన్.
విభుండ వీవ గౌరవంబు వెల్లి గొల్పు సంగతిన్  
ప్రభోస్మరింపఁ జాలనైతిరక్ష సేయరాశివా!

95నయాను కూల వర్తినై యనంతమైన బాధలన్ 
జయించి వచ్చి యుంటినయ్యసర్వ దు: హారుఁడా!
ప్రియంబునన్, నినున్ స్మరించి, తృప్తినొందఁ జేయుమా!
జయింతు నా యమున్ భవద్వశంబు నుండి, నేశివా!

96ప్రమాణ మంతరాత్మరాస్వబంధు వెన్న నీవెరా!  
నమస్కరించి గొల్తురాగుణంబు మంచిదీయరా!
ప్రమాద మొందనీకురా!  శివానశింపనీకురా!  
ప్రమోద మొందఁ జేయ రార భక్తుఁ గావరాశివా!

97భవాని నాకు తల్లిరాప్రభావ మొందఁ జేసెరా!  
నివాసముండి నాయెదన్ బునీతుఁ జేసెరా హరా!
సవిస్తరంబుగా త్వదీయ సద్గుణాళి చూపెరా!  
భవాని పంచ చామరాళి వ్రాయఁ జేసెరాశివా!

98గుణంబులుండునుండకుండుఘోరమైన దోషముల్ 
గణింప నున్న నుండ వచ్చుకాంక్ష తోడనిన్నునే
గణించి పంచ చామరాళి కమ్మగా రచించితిన్.  
గణించి నన్ను, సత్వమిచ్చికాచుమాసదా శివా!

99ప్రశస్తి గాంచి పాఠకాళి భక్తితో పఠించినన్, 
స్వశక్తి వృద్ధిఁ జేయునంచు వ్రాసి, వాసి గొల్పినన్,
దిశాంతమంద దీని కీర్తి దీక్షతో వచించినన్,  
ప్రశాంతి పంచచామరస్థపాదుకొల్పరాశివా!

100వయస్సు మళ్ళిపోవుచుండ భక్తి సన్నగిల్లురా!  
భయంబు బాధ పెట్టుచుండ భ్రాంతు లెట్లు పోవురా!
నయానుకూల వర్తనంబు నాఁ డదెట్లు కల్గురా!  
ప్రియంబుతోడఁ గానిపించి ప్రీతి గొల్పరాశివా!

101దయార్ద్ర చిత్తుడీశ్వరుండు, తప్పులన్ క్షమించుచున్ 
నయానుకూల వర్తనంబు నాకుఁ గొల్పు నిత్యమున్.
భయంబు పార ద్రోలిభక్తి భావ మిచ్చు నంచు నా 
శ్రయించి యున్న నన్నుఁ గాంచి, రక్ష సేయరాశివా!

102భవాని మాత నీ ప్రశస్త భాగ్య రేఖరాహరా! 
నవీన తేజ మిచ్చు నా వినాయకుండు తోడురా!
భవుండషణ్ముఖుండు సత్ ప్రభావ మొందఁ జేసెరా!  
నివేశమై హిమాద్రి నీకు నిష్ఠ కొల్పెరాశివా!

103మహామునుల్ నిరంతరంబు మౌనదీక్షఁ బూని, నీ  
మహోన్నత ప్రబోధఁ గాంచి మాయనే త్యజించిరే.
మహేశ్వరాదయార్ద్రచిత్తమమ్ముఁ బ్రోవ నీకృపా  
మహత్వ దృష్టిఁ జూడుమాప్రమాద మాపుమాశివా!

104సుపూజ్యులైన పండితుల్ విశుద్ధ రమ్య చిత్తులై  
ప్ర పూజ్యమైన పంచ చామరమ్ములన్ పఠించ, నీ
వపూర్వమైన భక్తిఁ గొల్పి, హాయి నొందఁ జేయుమా  
విపర్యయంబు లేక గాచిప్రీతి గొల్పుమా శివా!

105వినీతులైన కల్వపూడి వీర రాఘవార్యులీ   
యనాధనైన నన్ గ్రహించి యాంధ్ర భాష నేర్పి
జ్జనానుకూల భక్తి భావజాల మందఁ జేసి రా 
మనీషుఁ భక్తి గొల్చెదన్నమస్కరించుచున్ శివా!

106కళా విలాస మెన్న లేనుకావ్య దృష్టి లేదుగా!  
స్వలాభ కాంక్ష లేదునీదు భక్త కోటి మెచ్చగా,
ప్రలోభ దూరులై నినున్ ప్రభావ మొప్పఁ గొల్వగా 
తలంచి వ్రాసితిన్ త్వదీయ ధర్మ తేజమున్శివా!

107మహన్నకారరూప ఓం నమశ్శివాయ ఓం హరా !
మహన్మకార రూప ఓం నమశ్శివాయశంకరా !
మహత్శికార రూప ఓం నమశ్శివాయఈశ్వరా !
మహద్వకార రూప ఓం నమశ్శివాయసుందరా!
మహద్యకార రూప ఓం నమశ్శివాయమా శివా !

108సుమంగళీ ప్రపూజ్య పాద శోభితాయ మంగళం.  
సమస్త జీవ శక్తి రూప శాశ్వతాయ మంగళం.
అమంగళాంతకాయ సద్గుణాశ్రయాయ మంగళం.  
సమస్త మంగళం భవాయసర్వ మంగళం శివా !

పూజ్య కాణ్వ శాఖోద్భవ శ్రీ చింతా వంశ సంభవ జానకీ రామ మూర్తి దంపతుల పౌత్రుఁడను, వేంకట రత్నం సన్యాసిరామారావు పుణ్య దంపతుల పుత్రుఁడను అగు రామ కృష్ణా రావు నామధేయుండనైన నాచేత విరచింపఁబడి పురాణ దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు అంకితము గావింపఁబడిన
 శ్రీశివాష్టోత్తరశత పంచచామరావళి పేరంబరగు శివ శతకము
సమాప్తము.
స్వస్తి.
జైశ్రీరాం.
జైహింద్.