గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 49 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

శాఅమ్మా! నీ కను చూపులా విరివియై యత్యంత తేజంబులై,

నెమ్మిన్ మంగళ హేతువై, విజిత సన్నీలోత్పలోత్తేజమై,

యిమ్మున్ సత్కరుణాప్రవాహ ఝరియై, చిద్భా! యనిర్వాచ్యజీ

వమ్మై,మాధురినొప్పి, కాచునదియై, భాసిల్లు పల్ పట్టణా

ర్థమ్మౌచున్, వర నామరూపమగుచున్, ధాత్రిన్ బ్రకాశించునే. 49

భావము.
దేవీ ! నీచూపు విశాలమై "విశాల" అనే నగరము యొక్క పేరుతో వ్యవహరించుటకు యోగ్యమై యున్నది . కళ్యాణప్రదమై "కళ్యాణి" అనే పేరుతో వ్యవహరించుటకు యోగ్యమై ఉన్నది . చక్కని కాంతి కల్గి నల్ల కలువల చేత ఎదుర్కొన బడుటకు వీలు కానిదై(నల్ల కలువలను మించిన నేత్ర సౌందర్యంకలదై "అయోధ్యా" నగరము పేరుతో వ్యవహరించుటకు యోగ్యమై యున్నది. కృపామృతధారలకు ఆధారమై "ధారా" నగరము పేరుతో వ్యవహరింౘ డానికి తగినదై ఉన్నది. అవ్యక్త మధురమై "మధురా" నగరము అను పేరుతో పిలువబడుటకు తగినదై ఉన్నది . లోపల వైశాల్య ముగలదై " భోగవతి" అనే నగర నామముతో వ్యవహరించుటకు తగిన దైయున్నది. ఆశ్రితులను రక్షించు నదై "అవంతీ" నగరము అనే పేరుతో వ్యవహరించుటకు యోగ్యమై యున్నది.ఆయానగరముల యొక్క విజయముకలదై " విజయ నగరము" అనే పేరుతో వ్యవహరింప యోగ్యమై _ నిశ్చయముగా ప్రకాశిస్తున్నది.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.