గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

బుధవారం 25 జనవరి 2012

మేలిమి బంగారం మన సంస్కృతి117.

0 comments

జై శ్రీరాం.
శ్లోll
అజరామరవత్ ప్రాజ్ఞో విద్యామర్థం చ సాధయేత్,
గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్.
గీః-
ముదిమి మరణము లేనట్లు ప్రోగు చేయు
ధనము, విద్యయు ప్రాజ్ఞులు ధరణిపైన.
కేశమును పట్టె మృత్యువన్ ధ్యాస గలిగి
ధర్మ మాచరింపగ తగు ధన్యత గన.
భావముః-
ప్రాజ్ఞుడైనవాడు ముసలిదనమూ చావూ లేనివాడిలాగ విద్యనూ అర్థాన్నీ సాధించాలి.
అలాగే, మృత్యువు జుట్టు పట్టుకుందా అన్నట్టుగా, ధర్మాన్ని ఆచరించాలి.
జైహింద్.

మంగళవారం 24 జనవరి 2012

చెత్తకుప్పలపై దేవుళ్ళపటాలు చూసి చాలా బాధనిపిస్తోంది.

10 comments

జైశ్రీరాం.
సహృదయులారా!
నిన్నను నామనసును బాధ పెట్టిన ఒక సంఘటనను మీతో చెప్పి మిమ్మల్ని కూడా బాధపెట్టడం సరి కాదు. ఐనా పరిష్కారం సూచించడానికి మీకంటే ఎవరుంటారు చెప్పండి. అందుకే మీకా విషయ తెలియ జేయ లేకుండా ఉండలేకపోతున్నాను. తప్పైతే మన్నించండి.
నిన్నను సాయంత్రం  నడుచుకొంటూ గుడికి వెళ్ళుతున్న సమయంలో ఒక చెరువు ఒడ్డున చక్కటి దేవుళ్ళ పటాలు అద్భుతమైనవి అద్దాలతో చక్కని పటాలుగా ఉన్నవాటిని పెంట కుప్పలమీద పడేసారు. ఎవరో తెలియదు. నాకైతే చాలా బాధనిపించింది.
కడుపులో చేయిపెట్టి కెలికేసినట్టనిపించింది. మనం ఎంతో భక్తిభావంతో ఆరాధించే దేవతల ప్రతిరూపాలుగా భావించే పటాలు, ఎంతో పవిత్రంగా మనం చూసుకొనే చిత్రపటాలు దుర్గంధ భరితమైన ఒక అపవిత్ర ప్రదేశంలో అలా విసిరివేయబడ్డాయి.
ఒకటి కాదు రెండు కాదు కనీసం పదిహేనో ఇరవయ్యో అక్కడ అలా విసిరి పారవేయబడి ఉన్నాయి. అందులో రాతి బొమ్మలు కూడా ఉన్నాయి.
నాకు ఏమి చెయ్యాలో తోచలేదు. వాటిని చూస్తూ అలా వదిలేసి వెళ్ళిపోవడానికి కాళ్ళు రాలేదు. నా అర్థాంగి కూడా కన్నీళ్ళపర్యంతమయింది ఆపరిస్థితి చూసి.
తప్పో ఒప్పో నాకు తోచిన పని నేను చేయకుండా ఉండలేకపోయాను.
ఆ పటాలను ఆ ఒడ్డున ఉన్న కుళ్ళు పెంట కుప్పల మీదనుండి తీసి ఆ చెరువులోనికి పడవేసాను. పాపమో, తప్పో, ఒప్పో అనే విచారణ నేనప్పుడు చేయ దలచుకో లేదు.
ఆ పని నేను నా అర్థాంగి చేస్తూ ఉంటే బాటసారులు మమ్మల్ని వింత పసువుల్ని చూసినట్టు చూడడం కొసమెఱుపు.
విన్నారు కదా? చెప్పండి. మేమప్పుడేం చెయ్యాలి? మేము చేసినది తప్పా?
ఈ సంఘటన ద్వారా నేను సమాజానికి నామనోభావాలని వివరించి నా అభిప్రాయాన్ని సూచించ దలిచాను.
ప్రకృతిలో సృష్టింప బడిన ప్రతీ వస్తువుకీ అంతం ఉంటుంది.
మనం ప్రతీ సంవత్సరం అనేకమైన క్రొత్తక్రొత్త దేవుళ్ళ చిత్ర పటాలు, విగ్రహాలు సేకరిస్తూ ఉంటాము. వద్దన్నా మనకి అవి ప్రాప్తిస్తుంటాయి.
కొంత కాలం గడిచే సరికి అవి మాసిపోతుంటాయి, ఛిద్రమైపోతుంటాయి. అలాంటి వాటిని మనం కసవుగా భావించి నిర్లక్ష్యంగా అలా విసిరివేయడం అనేది మన నమ్మకాన్ని మనమే చెరిపేసుకున్నట్టౌతుంది.
ఈ బొమ్మలని కాబట్టి మనం అంత నిర్లక్శ్యంగా పారవేయ గలుగుతున్నాము.  అదే మన తల్లిదో, తండ్రిదో, బంధులదో ఆఖరికి మనకత్యంత ప్రీతిపాత్రమైన కుక్కదో పటమై ఉంటే అలా పారవేయగలమా చెప్పండి? దేవుళ్ళ పటాలకి ఆమాత్రం విలువ కూడా యివ్వని మనకోసం దేవుడెందుకు మన బరువు తన నెత్తిని వేసుకోవాలి?
మనం క్లిష్ట పరిస్థుల్లో ఉంటే పాపం ఆ దేవుళ్ళే మనకు సహాయపడాలి. మనకే సమస్యా లేకపోతే మాత్రం ఆ దేవుళ్ళెక్కడున్నా మనకి పట్టదు. ఇదేం న్యాయం?
అర్ధ రహితమైన పనులు చేసి అనర్ధాలను కొనితెచ్చుకోవడం ఎంతవరకూ న్యాయమంటారు?
నా హృదయం ఎంత ఆవేదనకు గురికాకపోతే నేను మీతో ఇలా విన్నవించుకుంటానో మీరూ ఆలోచించండి.
ఈ విషయంలో నేను సూచించే పరిష్కారం ఆమోదయోగ్యమో కాదో మీరు చెప్పండి.
౧) కళ తప్పిన దేవుని చిత్రపాటాలు మనకు అక్కర లేదనుకొంటే వాటిని ఆ అగ్నిహోత్రునకు సమర్పించడం ఒకపద్ధతి.
౨) ఆ పటాలను గంగా మాత ఒడిలో ఉంచడం మరొక పద్ధతి.
అంతేకాని అక్కరలేదని చెప్పి పెంట కుప్పలమీద, అపవిత్ర ప్రదేశాలలోను, పడవేయరాదు.
మనం చేసే పని మన మనస్సుకెలాగున్నా ఇతరుల మనసుకు నొప్పి కలిగించ కూడదు. ఇతరుల నమ్మకం పాడు చేయరాదు.
ఇక చెప్పండి. మీరేమంటారు?
జైహింద్.

ఆదివారం 22 జనవరి 2012

నవ విధ భక్తులు.

4 comments

శ్లోll
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం, పాద సేవనం,
అర్చనం వందనం ధ్యానం, సఖ్య మాత్మ నివేదనం.
ఆ.వెః-
విష్ణు కథలు వినుట, విష్ణుఁ గీర్తించుట,
స్మరణ, సేవ, యర్చన, రహిఁ గొల్పు
వందనంబు, ధ్యాన, సుందర స్నేహంబు
నాత్మనొసగుట, హరి నరయు గతులు.
భావముః- 
విష్ణు కథా శ్రవణము,  విష్ణు కీర్తనము,  విష్ణు స్మరణము, విష్ణు పాద సేవనము, విష్ణు అర్చనము, విష్ణువుకు వందనము, విష్ణు ధ్యానము, విష్ణ్వుతో స్నేహము, విష్ణువుకు ఆత్మ నివేదనము అను తొమ్మిదిన్నీ నవ విధ భక్తులనబడును. ఇందేది అనుసరించియైనను విష్ణు సాన్నిధ్యము పొంద సాధ్యము.