జైశ్రీరామ్.
మొన్న 9 వ తేదీ అవధాన విద్యా వికాస పరిషత్ నిర్వహించే అవధాన శిక్షణా తరగతుల్లో
పద్మశ్రీ గరికపాటి నరసింహారావు మహోదయులు ప్రసంగంలో ఒక సమస్యను
ఉదాహరించారు .
“ పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ శ్వానంబు చిత్రంబుగన్ ”
దీనికి వారి పూరణ
ప్రాంచత్కావ్య మధూళికావితతిగీర్వాణీపదంబంటగా
పంచెన్ గట్టిన భారతీసతియునై భార్యాసహాయుండునై
సంచీ చేకొని కూరగాయలకు బాజారేగుచో సాహితీ
పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ శ్వానంబు చిత్రంబుగన్.
ఈ సమస్యకు డా.నరాల రామారెడ్డి మహితాత్ముని పూరణము.
కించిద్రూపము వంగ ( బాంగ్ల )దేశము క్రికెట్ క్రీడారణక్షోణిలో
మించెన్ విశ్వవిజేత భారతమునే మేలైన బ్యాటింగుతో
కంచుంఢక్కను వ్రక్కలించెనవురా !క్రాంతిన్ విజృంభించుచున్.
పంచాస్యంబును వెంటనంటి తరిమెన్శ్వానంబు చిత్రంబుగన్ .
ఇదే సమస్యకు నా పూరణము.
పంచాస్యంబది కూనలన్ దినుటకై వంచించి, యేతెంచగా
నెంచెన్ దానికి చిక్కకుండునటులన్ హృద్యంపు ధైర్యంబుతో
వంచించెన్ వెనువెంటనుండి కరచెన్ పర్వెత్తె నాసింహమే ,
పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ శ్వానంబు చిత్రంబుగన్.
జైహింద్.
Print this post
వ్రాసినది
Labels:












1 comments:
అన్ని పూరణలు అద్భుతం ఆర్యా 🙏🙏🌺🌷💐
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.