గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, మే 2025, బుధవారం

"వ్యాసగ్రంథము తెల్గుజేసిరిగదాపాండిత్యహీనుల్ కవుల్ “ ఈ సమస్యకు డా. నరాల రామారెడ్డి సహృదయులయొక్క, నాయొక్క పూరణలు.

 జైశ్రీరామ్.

మొన్న 9 వ తేదీ అవధాన విద్యా వికాస పరిషత్ నిర్వహించే అవధాన 

శిక్షణా తరగతుల్లో పద్మశ్రీ గరికపాటి నరసింహారావు మహోదయులు 

ప్రసంగంలో ఉటంకించిన మరో సమస్య.

“ వ్యాసగ్రంథము తెల్గు జేసిరి గదా పాండిత్యహీనుల్ కవుల్ “

దీనికి వారి పూరణ సమయాభావముచే అందించలేదు.

ఈ సమస్యకు

డా.  నరాల రామా రెడ్డి సహృదయుల పూరణ 

“ధీసంపన్నత తెల్గుజాతి వెలుగన్ దేదీప్యమానంబుగా

వాసింగాంచిన శిల్పవైభవము విభ్రాజిల్ల , సాహిత్యవి

న్యాసంబొప్పగ ధర్మసూత్రరచనానైపుణ్యమున్ చూపుచున్

వ్యాసగ్రంథము తెల్గుజేసిరిగదాపాండిత్యహీనుల్ కవుల్  “

( పాండితీ + అహీనుల్  > అహి+ఇనుల్  - పాండిత్యంలో  ఆదిశేషులైన నన్నయ 

తిక్కన ఎఱ్ఱన - కవులు వ్యాసభారతాన్ని తెనిగించారు అని అర్థం )అని 

వారే వివరణ ఇచ్చారు.

ఈ సమస్యకు నా పూరణము.

ధీ సంస్కార మహత్వతేజ సుకవుల్ దివ్యంపు సద్గ్రంథముల్

వాసింగాంచిరి తెన్గుఁ జేసి, ఘనుఁడై భాసించువాఁడైన యా

“ వ్యాస గ్రంథము తెల్గు జేసిరి గదా,  పాండిత్యహీనుల్ "కవుల్ 

ధీసంపత్తివిహీను"లంచనుటచే తేజంబు లోపించునా? 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.