గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జనవరి 2024, సోమవారం

జైశ్రీరామ్. శ్రీ బాలరాములయోధ్యలో స్వస్థానాధిష్ఠులగుచున్న సందర్భముగా ఆనంద పారవశ్యముతో వారిముందు చేసుకొనిన నా హృదయావిష్కరణ. పద్య దశకము.

జైశ్రీరామ్.

 శ్రీ బాలరాములయోధ్యలో స్వస్థానాధిష్ఠులగుచున్న సందర్భముగా 

ఆనంద పారవశ్యముతో వారిముందు చేసుకొనిన నా హృదయావిష్కరణ.  

పద్య దశకము.


జై శ్రీరామ్.    జై శ్రీరామ్.    జై శ్రీరామ్.


ఉ.  శ్రీ రఘురామ! వందనము చేసెద నీ వర భక్తపాళిదౌ

స్మేర ముఖారవిందములఁ జిందెడి శ్రీరఘురామ సత్ సుధన్

గోరి గ్రహించువారి పదకుట్మల బద్ధ ప్రశస్త ధూళికిన్,

వారలయోధ్య నుండు పరివారము, శ్రీకర బాలరామయా! ౧.


ఉ.  నీ వర నామ దర్శనము నేర్పుగఁ గల్గు విధంబునన్ మహ

ద్భావన చేసి యాలయము వాస్తుప్రకారమయోధ్యలోన నా

దేవగణంబు గాంచునటు తీరుగ నిర్మితి చేసినార లా

దేవగణంబె భూమిపయి, దివ్యుఁడ!  శ్రీకర బాలరామయా!. ౨.


చం.  కలిని యడంచి, శ్రీ కృతయుగంబును ధాత్రిని గొల్పి, నిత్యమున్

మలినము లేని జీవితము మానవపాళికిఁ గూర్చనెంచుచున్

వెలసితివా? పరాత్పరుఁడ!  పేశల దివ్యమనోజ్ఞ రూప! స్వ

స్థలమున సుస్థిరంబుగను, సారస నేత్రుఁడ! బాలరామయా! ౩.


చం.  నెనరున, భక్తిభావమున, నిత్యము నీ మహనీయ నామమున్

ఘనముగ నన్నియున్ శుభముగా జరుగన్ విలిఖించి ముందుగా

పనిపడి యేది వ్రాసినను వ్రాయుట మాకలవాటు నీ కృపన్,

ప్రణతులు నీకు, మా పనులు భాసిలఁ జేయుము, బాలరామయా! ౪.


ఉ.  జానకి తోడు కాగ మనసార ఘనంబగు కార్యముల్ ప్రభూ!

ధీనిధివై యొనర్చితివి, ధీయన సీతయె లోఁ దలంపఁగా,

నేనును జానకీ సతిని, నిన్నును నామదిలోన నిల్పి, య

క్షీణ దయాంబురాశివని చేరుదు నిన్ వర బాలరామయా! ౫.


చం.  నినుఁ గనినంతలోననె మనీషులుగా మనసాధ్యమౌనయా

మనుజులకెన్న, నీమహిమ మానవతన్ గలిగించుచుండుటన్,

ఘనతను గొల్పిభక్తుల ప్రకాశము పెంచెడి దైవమీవెయై

మనుజులఁ గావవచ్చితివి, మాన్య దయామయ! బాలరామయా! ౬.


చం.  కరివరదుండ వీవనుచు గౌరవమొప్పగ విష్ణుమూర్తిగా

నిరుపమ భక్తిఁ గొల్చెదను, నేనె కరిన్, మకరిన్, దలంప, న

న్నరయుచు నేమి చేసెదవొ? యార్తిని బాపుచు నెట్లు కాతువో?

పరమ దయాపరుండ! వరభావనఁ గొల్పుచు, బాలరామయా! ౭.


ఉ.  పాపపు భావనల్, మరియు పాపపు కార్యములన్ మనంబున

శ్రీపతి! నీకె సాధ్యమగు చేరగనీయక మమ్ము నిల్పగన్,

శ్రీ పరమేశ్వరీ సహిత శ్రీనిధి వీ విది చేయఁ జాలవో?

కోపమె లేని నిన్ గొలుతుఁ గోమల దేహుఁడ! బాలరామయా! ౮.


ఉ.  నీవొనరించి సృష్టి, మహనీయులనీ ధర నిల్పి,  నీ ప్రభన్

జీవనశైలి,  నిర్మల ప్రసిద్ధగుణోద్ధతి వ్రాయఁ జేసి, స

ద్భావసమృద్ధిఁ గొల్పునటు వాసిగ చేసిన నీకు నీవె యో

ధీవర! సాటి యౌదువు, మదిన్ నిను నిల్పెద, బాలరామయా! ౯.


ఉ.  మంగళ రూప జానకికి, మాన్యమహోదయ! నీకు నెల్లెడన్,

మంగళమౌత నిన్ గొలుచు మాన్య కవీశ్వర పండితాళికిన్, 

మంగళమౌత యంచిచట మాన్య సుపూజ్యులు పార్వతీశివుల్

మంగళ వాక్సుధాస్రవము మన్ననఁ గొల్పిరి, బాలరామయా! ౧౦.

🙏🏼

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

Print this post

1 comments:

Lokanadham చెప్పారు...

రామో విగ్రహవాన్ ధర్మః - ధర్మమకారముగాగొని యవతరించిన మర్యాదాపురుషోత్తముడు శ్రీ బాల రామచంద్రుడయోధ్యలో తాను జన్మించిన స్వస్థలంలో ప్రతిష్ఠాపన సందర్భముగా చిత్రకవితా సామ్రాట్ శ్రీమాన్ చింతా రామకృష్ణగురువర్యులు వ్రాసిన హృద్య పద్య దశకము
పరమానందభరితముగా భక్తుల హృదయాంతరంగములను స్పృశించి ఉత్తేజ పరచినవి. బాలరామయా మకుటం సముచిత సందర్భోచితమై పద్యములు అలరాలుచున్నవి. ఆలయ నిర్మాణ శైలి, కృతయుగ స్థాపనార్థమై అరుదెంచినారా శ్రీ రాముడని వేనోళ్ళ కొనియాడుచున్న మాటలు ప్రతిబింబించి మనోజ్ఞమై భక్తి భావమును రేకెత్తించు చున్నవి . బాలరామ పద్యదశకము రచించి ధన్యులగుటయే కాక చదివినవారు కూడా ధన్యులగుదురని ప్రగాఢ విశ్వాసమును వెలిబుచ్చుతూ గురువర్యులకు పాదాభివందనము చేయుచున్నాను . - మామిళ్ళ లోకనాథం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.