గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఏప్రిల్ 2022, ఆదివారం

ఈ రోజు సాయంత్రము చందా నగర్ లో శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణమున జరిగిన ఉగాది కవిసమ్మేలన కార్యక్రమ ఛాయాచిత్రములు.

 

నా కవితా గానం.

శ్రీమన్మంగళ జానకీ సహితుఁడౌ శ్రీరామచంద్రుండు సత్
ప్రేమోద్భాసిత మిత్రమండలి ప్రజన్ విఖ్యాతిగా నేలుతన్.
మామీదన్ దయజూపుదైవమగు రామస్వామి ప్రేరేపణన్
ధీమంతుల్ వెలుగొందుతన్ శుభకృతున్, ధీశక్తినే జూపుచున్.

శుభకృద్వత్సరభాగ్యరాశి ప్రజలన్ శోభిల్లఁ జేయంగ తా
నభయంబిచ్చుచు వచ్చె నేడు, ప్రజ మోహాతీత సద్భాగ్యులై
ప్రభలన్ లోకమునందు గొల్పుచు, సదా ప్రఖ్యాతితో వెల్గుతన్,
సభలోనున్న జనాళిమంగళములన్ సంస్తుత్యులై పొందుతన్.

వచ్చె వసంత లక్ష్మి, వరభావ స్మృద్ధిని గొల్పి చూపగాన్,
మెచ్చగ సత్కవీశ్వరులు మేలగు జీవన మార్హమీయగా, 
సచ్చరితాత్ములన్ గనుచు చక్కగ కావగ నెల్ల వేళలన్,
సచ్చరితంబుతో జనులు చక్కగ మెల్గుచు శోభగాంచెడిన్.  

జ్ఞానాబ్ధియౌ శుభకృ తానంద వత్సరము దీనాళి కల్పతరువై
జ్ఞానంబు, సద్ధనము, రాణింపు గొల్పుచు నిధానంబుగా నిలుచుతన్,
ప్రాణంబుగా కనుచు తా నీడగా నిలిచి, మానాభిమాన ధనముల్
క్షోణిన్ కృపన్ గొలిపి, ప్రణంబులన్ నిలుపు, నీనాటి నుండియు నిఁకన్ 

వర మంగళ భావన భాగ్యముతో
నిరతంబు పరాత్పరి నిల్పు ప్రజన్,
కరు ణాకరమౌ శుభ కాల గతిన్
మురిపించుచు మంగళముల్గొలుపున్.
స్వస్తి.


జైహింద్.



Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.