గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జులై 2023, ఆదివారం

దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి మేనకోడళ్ళు ఆలపించినఅడవి బాపిరాజు వ్రాసిన జానపద గీతం... (ప్రహేళిక)

 జైశ్రీరామ్.

వింజమూరి సోదరీమణులు సీత మరియు అనసూయ.
ఈ వీడియోలో ఉన్న వీరిరువురు దేవులపల్లి కృష్ణశాస్త్రి   మేనకోడళ్ళు , అడవి బాపిరాజు వ్రాసిన జానపద గీతాన్ని 1970 దశకంలో, అమెరికాలో ఆలపించారు... అప్పట్లో రికార్డ్ చేయబడిన అరుదైన జానపదం . ... ఉత్తరాంధ్ర జానపద శైలి ఉట్టిపడే ఈ గీతం యిది.

ఈ ప్రహేళికకు సమాధానం వ్యాఖ్యద్వారా

కొండొండోరి సెరువుల కిందా ...
ఇదో తత్త్వగీతిక 
గేయ రచయిత అడవి బాపిరాజు గారు.      
ప్రాపంచికమనేది భౌతిక వైభవం, విషయబంధితం,                                               
ఆధ్యాత్మికత అంటే -
ఉన్నవన్నీ త్యజించేసి కొండల్లో కోనల్లో తపస్సు చేయడం కాదు.
నిన్ను నీవు తెలుసుకోవడం.
నిన్ను నీవు సంస్కరించుకోవడం.  
నీలోనికి నీ పయనం.
ఇది తత్త్వచింతన.
ఇది స్వస్వరూప జ్ఞానంము కొఱకై అంతరాన్వేషణ.                                                                               
ప్రతిఒక్కరిలో ఎప్పుడో ఒకప్పుడైన ఈ జీవితం ఏమిటి అనే ప్రశ్న 
తలెత్తుతుంది.. కొందరిలో మాత్రమే ఇది తెలుసుకోవాలనే 
తహతహ జనిస్తుంది. ఈ తపన కల్గినవారే సాధనకు ఉపక్రమిస్తారు. 
ఆధ్యాత్మిక సాధకుల సాధన, అంచెంచెలుగా సాగుతుంది. 
తమ గమనంలో ఎన్నెన్నో అవరోధాలు. అన్నింటినీ అధిగమిస్తూ 
గమ్యంకు చేరుతారు. బహుశా ఈ గేయంలో భావార్ధం ఇదే అయుండొచ్చు
రచయిత ముగ్గురు, మూడు అంటూ 11 చరణాలలో వ్రాసారు కాబట్టి 'త్రయాలు' ల తోనే సమన్వయపరుస్తూ, సాధకుని పదకొండు సోపానాలను విశ్లేషణ చేస్తున్నాను. 

మొదటి సోపానం -
కొండొండోరి సెరువుల కింద
సేసిరి ముగ్గురు ఎగసాయం
యొకడికి కాడీ లేదూ రెండు దూడ లేదూ.

ముగ్గురు అంటే త్రికరణాలు (మనోవాక్కాయములు). 
ఇక్కడ సాధకుడు త్రికరణ శుద్ధిగా ఆధ్యాత్మిక వ్యవసాయం (సాధన) మొదలెట్టాడు. మొదట్లో కోరిక, మమత, నేను అనెడి అహం... మొదలగు కర్మబంధాలతో కూడి యుంటాడు. క్రమేణా కాడీ (మనస్సు), దూడ (వాక్కాయములు) అశ్వాశతములని, ఇవేవి లేవని గ్రహించి ముందుకు వెళ్తాడు. 

రెండవ సోపానం -
కాడీ దూడా లేనగసాయం
పండెను మూడు పంటలు
ఒకటి వడ్లు లేవూ రెండు గడ్డీలేదూ 

మూడు పంటలు అంటే త్రిగుణాలు (సత్వ రజోతమోగుణాలు)
గుణములు త్రికరణాలను అనుసరించి ఆగంతకంగా వచ్చి చేరినవి. దేహం కలుగుటకు కారణభూతమైనవి. కాడీ దూడ (మనోవాక్కాయములు) లేని సాధన కొనసాగుతున్నప్పటికినీ, గతంలో చేసినవాటికి ఫలితంగా ఇవి రాకతప్పవు. ఈ గుణాలను కూడా అధిగమించి మూడవ మెట్టు చేరుతాడు. 

మూడవ సోపానం - 
వడ్లు గడ్డీ లేని పంట 
విశాఖపట్నం సంతలో పెడితే
ఒట్టి సంతే గానీ,సంతలో జనమే లేరు

వడ్లు (సత్వ) గడ్డి (తమోరజో గుణములు) లేని సాధనతో అంతరయానం చేయగా, లోపలంతా సంత సంతా. గత జన్మల నుండి వెన్నంటి వస్తున్న సమస్త స్వ, పర విషయ వాసనలు, రాగద్వేషాలు, కోరికలు, మానసిక శారీరక అనుభూతుల అనుభవాల ముద్రలన్నీ అంతరంగ సంతలోనే. అక్కడ ఆసరా అయ్యే జనులు ఉండరు. ఇది అర్ధం చేసుకొని, విశ్లేషణ చేసుకుంటూ గుణదోషాల్ని అధిగమిస్తాడు.   
నాల్గవ సోపానం -
జనం లేని సంతలోకి 
వచ్చిరి ముగ్గురు షరాబులు 
ఒకరికి కాళ్ళూ లేవూ రెండు చేతుల్లేవు

ముగ్గురు షరాబులు అంటే త్రిగణాలు (ధర్మార్ధ కామములు). 
త్రికరణాలు, త్రిగుణాలు అధిగమించినప్పటికీ, తన తనవారి జీవనంకై సకామంతో ధర్మం తప్పక అర్థమును ఆర్జించక తప్పదు. అయినను వివేకంతో కర్తృత్వభావన లేకుండా నిష్కామంతో, నిస్వార్ధంతో అంతా ఈశ్వరానుగ్రహం అను భావనతో, సత్య దృష్టితో అలవడిన వైరాగ్యంతో  నడుచుకుంటాడు. కర్తగా భోక్తగా అంతా దైవంగా దైవీభావంతో త్యాగభావనతో ప్రశాంతంగా జీవనగమనం సాగిస్తాడు. ఇక త్రిగణాలకి కాళ్ళూ చేతులు లేనట్లే. అంతా ఈశ్వరేచ్ఛ అన్న విశ్వాసం. 
                                                                   
ఐదవ సోపానం -
కాళ్ళుచేతులు లేని షరాబులు 
తెచ్చిరి మూడు కాసులు 
ఒకటి వొల్లావొల్లదు రెండు సెల్లాసెల్లాదు

మూడుకాసులు అంటే కర్మత్రయం (సంచిత, అగామి, ప్రారబ్ధములు). 
కాళ్ళు చేతులు (ధర్మార్ధ కామములు) లేవు అంటే త్రిగణాలు అంటని స్థితికి సాధనలో ఎదగడం. ఆపై  గత జన్మల ప్రారబ్ధం, ఈ జన్మలో చేస్తున్న సంచితం, మరుజన్మకై ప్రోది చేసుకున్న అగామి కర్మల ఫలితం అనుభవించక తప్పదని గ్రహించి, ఇప్పుడు చేస్తున్న కర్మలు విషయంలో కర్తృత్వాభిమానమును ఆసక్తిని వదిలి, పావనమొనర్చు యజ్ఞదాన తపః కర్మలు చిత్తశుద్ధికై చేస్తూ, అగామి లోనికి కర్మఫలాలు చేరకుండా నిలకడగా ప్రారబ్దాన్ని అనుభవిస్తూ స్థితప్రజ్ఞకు చేరుకుంటాడు. 

ఆరవ సోపానం -  
చెల్లాసెల్లని కాసులు తీసుకుని
విజయనగరం ఊరికిబోతే
ఒట్టి ఊరేగానీ ఊర్లో జనం లేరు

చెల్లాచెల్లని కాసులు (కర్మత్రయం) తీసుకొని  ఊరికి పొతే అనగా -  
బాహ్య జగత్తు అనే ఊరిలోనికి వఛ్చిన - 
ఒట్టి ఊరే గానీ, ఊర్లో జనం లేరంటే నిస్సంగత్వం స్థితిలో ఉన్నట్లు. 
అహంకారాన్ని వివేకంతో దాటి, గుణదోషాల్ని విశ్లేషణతో మార్చుకొని, సత్య దృష్టితో అలవడిన వైరాగ్యంతో, స్థితప్రజ్ఞతో ఈ మెట్టు పైకి వచ్చిన సాధకుడు ఎంతమందిలో యున్నను నిస్సంగుడే.  
                                                        
ఏడవ సోపానం -
జనం లేని ఊర్లో
ఉండిరి ముగ్గురు కుమ్మర్లు
ఒకడికి తలాలేదు, రెండు మొలాలేదు

ముగ్గురు కుమ్మర్లు అంటే త్రిషట్కాలు (కర్మ, భక్తి, జ్ఞానములు). 
సాధకుడు నిస్సంగత్వంతో ఉన్నా, తనలో పై మూడు యోగములు ఉంటాయి. 
నిస్కామకర్మ ఫలితం  అంతఃకరణ శుద్ధి. 
భక్తి... మొదట ఈశ్వరోపాసన... ఫలితం చిత్తైగ్రత, తర్వాత ధ్యానం... ఫలితం ఆత్మ యొక్క ఆవరణ నివృత్తి. 
జ్ఞానం... సర్వాత్మభావన. 
ఈ యోగములకు తలా, మొల ఉండవు.  

ఎనిమిదవ సోపానం -
తలా మొలా లేని కుమ్మర్లు
చేసిరి మూడు భాండాలు
ఒకటికి అంచు లేదు, రెంటికి అడుగూ లేదు

మూడు బాండాలు అంటే త్రి దండాలు (వాగ్దండం, మనోదండం, కాయదండం). 
వాగ్దండం - మౌనం. స్వదీనమునకు , పరాదీనమునకు అతీతమైనది " మౌనం " 
మనోదండం - మనో నిగ్రహం. మనస్సు  స్వవశీయం.  
కాయదండం - స్వధర్మాచరణ. 
ఈ భాండాలకు అంచు (ఆది) లేదు, అడుగు (అంతము)లేదు.   
                                                       
తొమ్మిదవ సోపానం - 
అంచు అడుగులేని భాండాల్లో
ఉంచిరి మూడు గింజలు 
ఒకటి ఉడక ఉడకదు రెండు మిడక మిడకదు

మూడు గింజలు అంటే త్రిపుటి (జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం). 
తెలుసుకున్నవాడు, తెలియబడేది, తెలివి. జ్ఞాతకి స్వానుభవమౌతుంది జ్ఞానం. (జ్ఞానం అంటే 'జీవోబ్రహ్మైవనాపరాః' జీవుడు బ్రహ్మమే కాని,యితరం కాదు) ఇందు ఒకటి పోయిన మిగతా రెండు మిగలవు. జ్ఞేయబ్రహ్మం కు జ్ఞానమే స్వరూప లక్షణం. జ్ఞానం పొతే జ్ఞానావరణమైన జ్ఞేయం నిలవదు. ఇవేవి ఉడకా ఉడకవు, మిడకా మిడకవు. 

పదో సోపానం - 
ఉడకని మిడకని మెతుకులు తినుటకు 
వచ్చిరి ముగ్గురు చుట్టాలు 
ఒకరికి అంగుళ్లేదు రెండు మింగుల్లేదు

ముగ్గురు చుట్టాలు అంటే త్రిపుండ్రములు (ఆత్మ యొక్క త్రిపుండ్రములంటే ఆత్మ, పరమాత్మ, బ్రహ్మాత్మ). 
ఆత్మ - అష్టతనువుల్లో స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ అన్న నాలుగు జీవ సంబంధ తనువులు కల  జీవాత్మ. పరమాత్మ - విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, మూలప్రకృతి/పరమాత్మ అన్న నాలుగు ఈశ్వర సంబంధిత తనువులు కలది. 
బ్రహ్మాత్మ - పరబ్రహ్మం. ఆత్మ యొక్క ఈ త్రిపుండ్రములకు అంగుడు మింగుడు ఉండదు. సాధన ద్వారా జీవాత్మ, పరమాత్మ నెఱిగి, స్వానుభవంతో ఐక్యమై పరబ్రహ్మత్వంను పొందడం జరుగుతుంది.   

పదకొండవ సోపానం - పరమపద సోపానం -
అంగుడు మింగుడు లేని సుట్టాలు 
తెచ్చిరి మూడు సెల్లాలు 
ఒకటి సుట్టూ లేదు రెండు మద్దెలేదు

మూడు సెల్లాలు అంటే సత్ చిత్ ఆనందం. 
శివమ్, ఆనందం, అమృతం. 
దివ్యత్వం, అమరత్వం, అమృతత్వం.
ఇక సాధకునికి ఏ యత్నమూ ఉండదు, ఏమీ ఉండదు. ఉన్నది చుట్టూ లేని, సడి లేని  -  శుద్ధమైన మహాచైతన్యం. ఆ మహా చైతన్యంలో  దేహత్యాగం చేసేంతవరకు నీటి భారంతో నిండిన మేఘం ఎంత నెమ్మదిగా కదులుతుందో, సాధక మహాత్ముని నడవడిక లోకంలో అంత విధేయతతో సాగుతుంది. ఈ స్థితి కలిగిన తరువాత ద్వంద్వాలు లేవు. గుణగణాలు లేవు. త్రయాలు లేవు. అనేకమైనవి ఏవి లేవు. ఉన్నదంతా పరబ్రహ్మమే అన్న భావన స్థిరమౌతుంది. నిత్యానందం స్వభావమౌతుంది. చైతన్యంలో నిత్యుడై సిద్ధుడై నిలుస్తాడు.

శ్రీ అడవి బాపిరాజుగారు ఒకటి నుండి పదకొండు చరణాల్లో సాధకుడు ఎలా ముక్తుడు కాగలడో సూచించారని ఒక వూహ.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.