గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, డిసెంబర్ 2009, శుక్రవారం

మీరూ చెప్పండి, నిజమో కాదో?

మిత్రులారా!
మనం చూస్తున్నాం నేటి కుహనా రాజకీయ వేత్తల రాజకీయాలు.
ఎందరో వారి మాటల మాయా జాలంలో పడి ధన మాన ప్రాణాలనే కాక, విలువైన విద్యను, భవిష్యత్ ను కూడా నష్టపోయిన వారినీ, నష్టపోతున్న వారినీ మనం చూస్తున్నాం కదా!

అందుకే పూర్వీకులు మన సాహిత్యంలో నిక్షిప్తం చేసిన అపార లోకానుభవ అద్భుత సారాన్ని పాఠాలతో పాటు మనం చదువుకోవడం ద్వారా తెలుసు కొని, విచక్షణతో మసలుకో గలిగిన సత్తా సంపాదించుకోవాలి.

తద్విరుద్ధంగా ఈ నాటి పాఠ్య ప్రణాళికలుండడంతో ఆ అవకాశమే లేనినేటి తరం ఎన్నోఅనర్థాలకు లోనౌతోందనిపిస్తోంది.
చూడండి ఒక చక్కని శ్లోకంలోఎంత అద్భుతమైన నగ్న సత్యాన్ని తెలియఁ జేసారో మన పూర్వీకులు.

శ్లో:-
నగణస్యాగ్రతో గచ్ఛేత్. సిద్ధే కార్యే సమం ఫలం.
యది కార్య విపత్తిశ్యాత్ ముఖరస్తత్ర హన్యతే.

క:-
గణమునకు మొదట నడువకు.
కనఁగ ఫలము సమము మనము గణమున నిలువన్.
అనుకొనని చెడులు కలిగిన
మును గల జనములకు కలుగు మును చెడు ఫలముల్.

భావము:-
గుంపునకు ముందు ఎప్పుడూ పోవద్దు.పని సానుకూలమైతే ఫలితం అందరకు సమమే. కాని ఎదురు తిరిగినట్లైతే ముందున్నవాళ్ళు తత్ ఫలితంగా బాధను అనుభవించ వలసి ఉంటుంది.

స్వార్థంతో ఆలోచిస్తే మాత్రం నిజమే అనిపిస్తోంది కదండీ!

జైహింద్.
Print this post

5 comments:

సురేష్ బాబు చెప్పారు...

శ్రీ రామకృష్ణ పరమహంస గారు కూడా చెప్పారు కదండీ. పడవ ఎక్కేముందు అందరి కంటే ముందు ఎక్కమని,తద్వారా మన సామాన్లని అంతా సరిగా చేర్చవచ్చని, అలాగే పడవ దిగేటప్పుడు అందరికన్నా చివర దిగాలని తద్వారా సామాన్లని అంతా సరిగా ఒడ్డుకు చేర్చవచ్చని.

కథా మంజరి చెప్పారు...

ఎవరో ఒకరు ... ఎపుడో అపుడు .... ముందు నడవాలి కదా?
పెద్దలు చెప్పిన శ్లోకంలో గుంపునకు ముందు నడవకూడదు ...కానీ, ఓ గుంపంటూ బయలు దేరాక అందులో ఎవరో ఒకరు ముందుంటారు కదా ? ... అందు చేత ఇందులో లాజిక్కు పూర్వ కాలపు విలువలనూ. పరిస్థితులనూ బట్టి బాగుండొచ్చు కానీ, నేటి కాలానికి స్వార్ధ పూరితంగా కనిపిస్తూ ఎంత మాత్రం ఆమోదయోగ్యంగా లేదని నా అభిప్రాయం. అయినా పెద్దల మాట చద్ది మూట కదా?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సురేష్ బాబూ గారూ!
జోగారావుగారూ!
మీరు చెప్పిన మాటలతో ఏకీభవిస్తున్నాను.

చివరిదాకా చదివితే చివరలో నేనుచెప్పిన"స్వార్థంతో ఆలోచిస్తే మాత్రం" నిజమే అనిపిస్తోంది. అనే దానిలో "స్వార్థంతో ఆలోచిస్తే మాత్రం" అనే పదాన్ని వాడాను చూడండి.

మరొక్క మాట.
కుహనా రాజకీయ వేత్తల మాటలలో చిక్కి ఉద్రేకంతో ముందు ముందుకు దూసుకుపోతూ, త్యాగాలకు సిద్ధ పడుతున్న వారినుద్దేశించి వ్రాసినట్లు నేను వ్రాసిన ముందు మాటల ద్వారా తెలుస్తోందనుకుంటాను.
అభిప్రాయ వ్యక్తీకరణలో మీ మనసుకెక్కేలాగా నేను వ్రాయలేకపోయి ఉండొచ్చు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

PANTULA JOGARAO కి నాకు
వివరాలను చూపించు 10:56 AM
మీరు చెప్పినది వాస్తవం. అనవసరోద్రేకాలతో ఎవరో రెచ్చ గొడితే రెచ్చి పోయి, చెడ్డ పనికి పూనుకునే గుంపునకు ముందు పోరాదనేది నిశ్చయం. శ్లోకం మాత్రం ఆ మినహాయింపుని సూచించడం లేదు. శ్లోకార్ధం స్వార్ధ ప్రయోజనాలకి అనుగుణంగానే ఉంది. పెద్దల అనుభవాలను మరింత విస్తారమైన అవగాహనతో అర్ధం చేసుకోవాలనుకుంటాను ... మంచి చర్చనే పెట్టారు.అభినందనలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు రామ క్రిష్ణా రావుగారు. మీ వర్గములన్నీ చదువుతుంటే . ఒకటిని మించి మరొకటి మనోరంజక ము గా ఉన్నాయి.ఐతె మీ రచనల పై గల మక్కువతొ ఒక చిన్న కవిత్ రాయాలన్న కోరికె గాని రాయలేని అశక్తత . పొరబాట్లను మన్నించి సవరణ చేయగలరు.[చందొ బద్ధముగా రాయడం రాదు.]
అమృతము... గ్రోలి... ఆంధ్రుని... వనిలోన
వెలయు... చున్నవి...మరకత .."పుష్ప " రాగమణులు
ఉల్లముప్పొంగ ...నందించె ....కవన ...సౌరభము.
కుసుమ ...పేశలమది ...ఎంతటపురూపమయ్యె ?

చింత లేదిక మనకింక సాహితీ కృష్ణు చెంత.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.