గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, డిసెంబర్ 2009, గురువారం

చెప్పుకోండి చూద్దాం 25

పాఠకా! సులభంగా కనిపించే ప్రశ్నలు కూడా ప్రశ్నలే. తప్పించుకొనే యత్నం చెయ్యక సమాధానం చెప్పండి.

క:-
ఎద్దీశున కశ్వంబగు?
గ్రద్దన నేదడవితిరుగు ఖర కంటకియై?
హద్దుగ నేవాడు ఘనుడు?
పద్దుగ నుత్తరములిందె పడయంగానౌన్.

ప్రశ్న1: ఏ+అది=ఎద్ది = ఏది, ఈశునకు = ఈశ్వరునకు, అశ్వంబు + అగు = వాహనమై ఉంది ?
------- ఈశ్వరుని వాహన మేది?

ప్రశ్న2: గ్రద్దన = శీఘ్రముగా, ఏది + అడవి లో = అడవిలో ఏది, ఖర కంటకియై = ముండ్లతో, తిరుగు = తిరుగుతుంది ?
---------అడవిలో ముండ్లతోతిరిగే జంతువేది ?

ప్రశ్న3: హద్దుగ = నిర్దిష్టముగా, ఏ + వాడు = ఏవాడు = ఎటువంటివాడు , ఘనుడు = గొప్పవాడు ?
---------నిర్దిష్టముగా ఎటువంటి వాడు గొప్పవాడు ?


సమాధానం టపాలో ఉంచుతారు కదూ?
ఆఁ. ఒక్క విషయం మరువకండీ--- సమాధానాలు పై పద్యంలోనుండే గ్రహించి వ్రాయాలండోయ్.
ఇక పంపండి.

జైహింద్.
Print this post

4 comments:

కంది శంకరయ్య చెప్పారు...

జవాబులు -
1) "ఎద్దు" ఈశునకు అశ్వంబగు
2) గ్రద్దనన్ "ఏదు" అడవి తిరుగు ఖరకంటకియై
3) "హద్దు + కనేవాడు" ఘనుడు (?)
పద్దుగ నుత్తరము లిందె పడసితినయ్యా!

జ్యోతి చెప్పారు...

1. ఎద్దు
2. ముళ్లపంది
3. తెలీడంలేదు???

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

మీరుంచిన ఈ పద్యం తో ప్రేరణ చెంది అటువంటి ప్రశ్నాత్మక పద్యాన్ని వ్రాయ యత్నించాను. తప్పులున్న మన్నించగలరు.

ఎవ్వడు తిమిరపు మొరవిన
డెవ్వడు పలుమారు తిరిగె నేర్వను వానిన్
ఎవ్వడు హృదయారాముం
డవ్వానికి తెలుపుడయ్య అరయుండిటనే !

సమాధానాలు:
రవి, మారుతి, రాముడు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రవి, మారుతి, రాముండను
సువిశదముగ పదము లొసగి,చూచి, జవాబున్
సవివరముగ తెలుపమనుచు
చవిచూపితివిగ. కవి ప్రసన్న కుమారా!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.