గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, మే 2012, శనివారం

వసు స్వారోచిషోపాఖ్యానము (ద్వ్యర్థి కావ్యము) మను చరిత్ర పరముగ అర్థ వివరణము. 10 / 14

జైశ్రీరామ్

వరూధినీ ప్రవరులు.
గీ:-
క్షితి విభునిఁ గను కోర్కెను జెలియ! తీర్తుఁ  -  గన్నుఁ గవ మూయ నగునంతఁ గలియ వచ్చు
ననిన నయ్యెడ నతని వచనము వినుచుఁ  -  గువరుఁడంతట రాఁ దన భవనమునకు. ౪౬.

ఓ చెలియా(వరూధినీ)క్షితిని విభునిగ నీ కోర్కెను తీర్తును. నీ తోడ నేను కలియుటకై వచ్చినంతనే కన్నుఁగవను మూయవలయును. అని అతఁడు అనగానే అయ్యెడ అతని వచనము వినుచు (సమ్మతించగా)తన భవనమునకు కుత్సితుడైన మాయా ప్ర వరుఁడు అంతట రాగా......
గీ:-
అతని రాకకు మెచ్చి మహాముదంబు -  గదుర రతి నుండఁగా స్వల్ప కాలముననె
యతఁడు చెలి జతనంబున హర్షమంది  -  చనగ, సఖి గాంచె సుకుమారు సార్వభౌము. ౪౭.

అతని రాకకు మెచ్చి, మహా ముదంబు గదురగా రతిక్రియనుండగా స్వల్ప కాలముననె అతఁడు చెలి జతనమున హర్షమంది, చనగ, సఖి సుకుమారుని, సార్వభౌఁడగువానినికాంచెను.
వ. అతఁడు స్వరోచియై వెలుగు చుండఁగా, ౪౮.

ఆ బాలుడు స్వరోచి నామంబున వెలుగు చుండగా....
క:-
కని ముదమందఁగఁ బెంచిన  -  ఘన మతి సర్వంబెరిం(శకట రేఫ)గి, కడు పెంపడ రం
గను, నవల రే(శకట రేఫ)ని తోడం  -  గని యెరు(శకటరేఫ)క పడంగఁ గాంక్ష గారమున ననెన్. ౪౯.

వరూధిని ఆ బాలుని కని ముదంబున పెంచగా ఘనమతినిస్వరోచి సర్వంబెఱింగి, కడు పెంపు(వృద్ధి)అడరంగా(పొమ్ది యుండగా) ఆవల ఒక ఎఱుక  కని ఆఱేని(స్వరోచి)తోకాంక్ష(కోరిక)పండంగ, గారముతీ ఇట్లనెను.
సీ:-
క్ష్మా తలాధిప! నేఁడుగా మా మనోభీష్ఠ  - ములు దీరఁ గల్గెనోములు ఫలించె.
గహ్వరీపతి! నేఁడుగా మా నయన పంక్తి  -  నిర్మలమయ్యెఁ బున్నెంబు సేసె.
భూమి పాలక! నేఁడుగా మా తమః పట  - లంబు విరిసెను చిత్తంబు మెర(శకట రేఫ)సెఁ
గాశ్యపీ వర! నేఁడుగా మా వనస్థలుల్  -  ధన్యంబులయ్యె, శస్తతఁ జెలంగ్గె.
గీ:-
నీ హిత క్రియ నిల నేఁడ నెగడఁ గల్గెఁ  -  గాన నేమని చెప్పుదు మానవేంద్ర!
జంతు జాలంబు లెల్ల నీ శరణమంది  -  యుండెఁ గాకున్న జీవించి యుండఁ గలవె? ౫౦.
ఓ క్ష్మా తలాధిపా! నేడుగా మా మనోభీష్ఠములు తీర~ గలిగెను! మా నోములు ఫలించెను.
ఓ గహ్వరీ(భూ)పతీ! నిన్ను చూచినందున మా నయన పంక్తి నిర్మలమయ్యెను. మా కన్నులు పున్నెము సేసెను కదా!
ఓ భూమి పాలకా! నేడుగా మా తమః పటలము౯అజ్ఞానము సమూహము) విరిసె(విడిపోయె)ను. చిత్తంబు మెర(శకటరేఫ)సెను
ఓ కాశ్యపీవర! నేడుగా మా వనస్థలులు ధన్యములయ్యెను. శస్తత(ఖ్యాతి)తో చెలంగెను.
ఇలా స్థలము నీ హిత క్రియ చేత నేఁడ నెగడఁ గల్గెను. కావున మానవేంద్రా! ఇంక ఏమని చెప్పుదును. జంతు జాలంబు లెల నీ శరణమంది ఉండెను కదా. కాకున్నచో జీవించి యుండ గలవె?
(సశేషం)
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.