గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, ఆగస్టు 2018, సోమవారం

పంచాయుధ స్తోత్రము.

జైశ్రీరామ్.
శుభోదయమ్.
పంచాయుధ స్తోత్రమ్.
ఓం శ్రీమాత్రే నమః 
అద్వైత చైతన్య జాగృతి.

మహా శక్తివంతమైన పంచాయుధ స్తోత్రమ్.

శ్రీ మహా విష్ణువు ధరించే అయిదు ఆయుధాల  ఈ స్తోత్రం నిత్యం పారాయణం చేయడం వలన ఆర్థిక బాధలు, శత్రు బాధలు , అనారోగ్య బాధలు, గొప్ప ఆపదలు తొలగిపోతాయని   చాలా విశ్వాసం.

సుదర్శన చక్రం  స్తోత్రం

స్ఫురత్‌ సహస్రార శిఖా తీవ్రం
సుదర్శనం భాస్కర కోటి తుల్యమ్‌|
సురద్విషాం ప్రాణవినాశి విష్ణో:
చక్రం సదాహం శరణం ప్రపద్యే||

తాత్పర్యము : రంపమునకు చివర సూదిగ ముళ్ళవలె నుండు పదునైన భాగమును ‘ఆకు’ లేక ‘అర’ అంటారు. వేలాది అరలతో ఘోరమైన అగ్ని శిఖలను క్రక్కుచూ మిరుమిట్లు గొలుపు కాంతులీను ఓ ”సుదర్శన చక్రమా !” ఎంత చూచినా తృప్తి తీరని సుందర మంగళ విగ్రహము కల్గి, దివ్య సౌందర్య రాశియగు స్వామిని దర్శింపజేయుచున్నావు, కోట్ల సూర్యులుదయించినపుడు ఉండెడి కాంతితో సాటియగు ప్రకాశము నీకున్నది. భగవదాజ్ఞానువర్తులగు దేవతలను హింసించు పాపుల ప్రాణములను సమూలంగ పెకలించి నశింపజేయుచున్నావు. సర్వవ్యాపియగు శ్రీమహావిష్ణువు యొక్క దక్షిణ హస్తతలము నలంకరించిన నిన్ను నేనెల్లప్పుడూ శరణువేడుచున్నాను.

( శంఖం ) పాంచజన్య స్తోత్రం

శ్లో|| విష్ణోర్ముఖోత్థానిల పూరితస్య
యస్య ధ్వనిర్దానవ దర్ప హంతా |
తం పాంచజన్యం శశికోటి శుభ్రం
శంఖం సదాహం శరణం ప్రపద్యే ||

తాత్పర్యము : శ్రీమహావిష్ణువు యొక్క అధరామృతమే ఆహారముగ గైకొనుచు, ఆయన పూరించు వాయువతో నిండి, ఆనందాతిశయముచే నీవు చేయు ధ్వని చెవి సోకినంతనే రాక్షస మూకలందరియొక్క గర్వములను అణగిపోవును. అట్టి భీకర ధ్వని నీది. కోటి సంఖ్యాకమైన పూర్ణిమనాటి చంద్రుల కాంతి ఒక్కచోట చేరినదా యనునట్లుండు తెల్లని చల్లని స్వచ్ఛమైన కాంతులు నీవి . శ్రీవిష్ణువు యొక్క వామహస్తమున ప్రకాశించు శ్రీ పాంచజన్య శంఖమా ! నిన్ను నేను ఎల్లప్పుడూ శరణు వేడుచున్నాను.

( గదా ) కౌమోదకీ స్తోత్రం

శ్లో|| హిరణ్మయీం మేరు సమానసారాం
కౌమోదకీం దైత్యకులైన హంత్రీమ్‌ |
వైకుంఠ వామాగ్ర కరాభి మృష్టాం
గదాం సదాహం శరణం ప్రపద్యే||

తాత్పర్యము : బంగారమువలె రమణీయమైన,  మేరు పర్వతముతో సమానమైన బలము కల్గినట్టి రాక్షస కులములను నిర్మూలించుటలో ఇతర సహాయమును అపేక్షించని శ్రీ వైకుంఠనాథుని యొక్క క్రింద వామహస్తము యొక్క కనుసన్నలలో సంచరించు ”కౌమోదకీ” యను ఓ గదాయుధమా ! నిన్ను నే సదా శరణవేడు చున్నాను.

నందకం ( ఖడ్గము ) స్తోత్రం

శ్లో|| రక్షో సురాణాం కఠినోగ్ర కంఠ-
చ్ఛేదక్షర చ్ఛోణిత దిగ్ధధారమ్‌ |
తం నందకం నామ హరే: ప్రదీప్తం
ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే||

తాత్పర్యము : జన్మత: రాక్షసులై పుట్టి దుష్టబుద్ధి నిండి అసురులైన వారి యొక్కయు, ఏ జాతిలో పుట్టినా విష్ణుద్వేషముతో బుద్ధిచెడి దుష్ట ప్రవృత్తితో భగవద్దూషణ – భాగవత తిరస్కారములను చేయుచు అసురులుగ పిలువబడు వారి యొక్కయు, క్రూరమై మదమెక్కి బలసిన కంఠములను తెగ నరకుట నీ పని, తద్వారా నిరంతర ధారా ప్రవాహముగ కారుచున్న రక్తముతో మరింత వాడిగా జ్వాలలను క్రక్కుచు శ్రీ మహావిష్ణువు  దివ్య హస్తమందు ప్రకాశించుచున్నావు. ”నందక” మను ఓ ఖడ్గరాజమా ! నిన్ను నే నెల్లప్పుడు శరణువేడు చున్నాను.

( ధనుస్సు ) శారన్గం స్తోత్రం

శ్లో|| యజ్జ్యానినాద శ్రవణాత్సురాణాం
చేతాంసి నిర్ముక్త భయాని సద్య:|
భవంతి దైత్యాశని బాణవర్షి
శార్ఞం సదాహం శరణం ప్రపద్యే||

తాత్పర్యము : దేవ దానవ భీకర సంగ్రామములలో నీ నారిని సారించుటచే బయల్వెడలిన ధ్వని( జ్యా ఘోషము ) చెవి సోకినంతనే దేవతల మనస్సులలో ఉత్సాహము పెరిగి భయము పూర్తిగా పోవును. జయము కల్గును. రాక్షసులపై పిడుగులు కురియునట్లు శరముల పరంపరను వర్షించు శ్రీ స్వామి దక్షిణ దివ్యహస్తమున ప్రకాశించు శార్ఞమనెడి ఓ ధనస్సా! నిన్ను నే నెల్లప్పుడూ శరణు వేడుచున్నాను.

శ్లోకం : ఇమం హరే: పంచ మహాయుధానాం
స్తవం పఠేత్‌ యోనుదినం ప్రభాతే |
సమస్త దు:ఖాని భయాని సద్య:
పాపాని నశ్యంతి సుఖాని సంతి ||

తాత్పర్యము : శ్రీహరి ధరించు ఈ ఐదు దివ్యాయుధములను గూర్చిన స్తోత్రమును ప్రభాత సమయమున ప్రతిదినమూ అనుసంధించు వారి యొక్క పాపములన్నియు నశించును. భయములన్నియు వెంటనే తొలగును. దు:ఖములు అట్టివారి దరిచేరవు. సమస్త సుఖములను అనుభవింతురు.

శ్లో|| వనే ర‌ణే శత్రు జలాగ్ని మధ్యే
యదృచ్ఛయాపత్సు మహాభయేషు|
ఇదం పఠన్‌ స్తోత్ర మనాకులాత్మా
సుఖీ భవేత్‌ తత్కృత సర్వ రక్ష:||

తాత్పర్యము : అడవులలో దారితప్పి, జంతువుల బారినపడి, యుద్ధములో చిక్కుకొని, నీటి ప్రమాదమేర్పడి, అగ్ని ప్రమాదమేర్పడిగాని భయగ్రస్తులయినా, లేక తలవని తలంపుగా ఏర్పడిన ఏ యితర ఉపద్రవమందైనా ఒక్కసారి ఈ అయిదు ఆయుధములను మనసార స్మరిస్తూ ఈ స్తోత్రమును పఠించినచో ఆ ఆయుధములే ఆయా ఆపదల నుండి దూరము చేసి భయములు తొలగించి సుఖములను పొందించును.

శ్లో || స శంఖ చక్రం సగదాసి శార్గఙం
పీతాంబరం కౌస్తుభ వత్స చిహ్నమ్‌ |
శ్రియా సమేతోజ్జ్వల శోభితాంగం
విష్ణుం సదాహం శరణం ప్రపద్యే||

తాత్పర్యము : భక్తులకు ఆభరణములై, భక్తుని ప్రేమను పెంచుచు దుష్టులకు ఆయుధములై భయమును రేకెత్తించు శంఖ, చక్ర గదా, ఖడ్గ, శార్గఙంములను పంచాయుధములను ధరించి, పీతాంబరముతో వెలుగొందుచు, కౌస్తుభమణిని ధరించి శ్రీవత్సమనెడి పుట్టుమచ్చతో విరాజిల్లుచు, శ్రీదేవి సదా సన్నిధిచేరి యుండుటచే మెరుపు తీగచే చుట్టబడిన నీలిమబ్బువలె దేదీప్యమానమగు దివ్య సుందరి మంగళ విగ్రహ విశిష్ణుడును అగు శ్రీమహావిష్ణువును నేనెల్లప్పుడూ సేవించుచున్నాను.

శ్లో|| జలే రక్షతు వారాహ: స్థలే రక్షతు వామన: |
అటవ్యాం నారసింహశ్చ సర్వత: పాతు కేశవ: ||

తాత్పర్యము : జలమునందెల్లపుడూ ఏ ఆపదలు దరి చేరకుండునట్లు శ్రీ వరాహస్వామి కాపాడుగాక !
భూమిపై ఏ ప్రమాదములు సంభవించకుండునట్లు శ్రీ వామన మూర్తి మనలను బ్రోచుగాక  !
అడవులలో ఘోర ప్రమాదములలో చిక్కుకొనకుండ శ్రీ నరసింహస్వామి కాపాడుగాక !
 బ్రహ్మకు శివునికి తన దేహమందే స్థానము నిచ్చిన సర్వజగత్కారణుడగు కేశవుడు సదా రక్షించుగాక !
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.