గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, డిసెంబర్ 2025, సోమవారం

అంబాలం పార్థసాధి గారి అక్షర తూణీరము సమీక్ష.

జైశ్రీరామ్.

అంబాలం పార్థసాధి గారి అక్షర తూణీరము.

శ్రీమన్మంగళభావనాకలితులు శ్రీమాన్ అంబాళం పార్థసారథి ఇతఃపూర్వము శివ సహస్రనామ భాష్యకారులుగా కీర్తిగడించిన మహనీయులు. చలనచిత్రనటులుగా పేరుగడించినవారు.

అట్టి యీ మహనీయుని రచనలలో అసాధారణ రచన అక్షరతూణీరము గ్రంథము. ఈగ్రంథమున రమారమి నూట ఏబదికి పైన(157) అంశములు సోపపత్తికముగా స్పష్టముగా వివరింపఁబడి యున్నవి.

ప్రారంభంలోనే  "చెట్టుపుడమితల్లి బొట్టని చెప్పిరి, చెట్ల పెంపకమును చేయమనిరి. ఈప్రయత్నములోభాగముగా ప్రాచీనకాలమునుండి మనపెద్దల నానుడులుగా చెప్పుకోదగిన అపురూపమైన శ్లోకములు మధ్యమధ్యలో చేర్చి చెప్పుటమూలమున మన ప్రాచీనులసంస్కృతీసంప్రదాయములను మనకు స్పురింపఁజేయుట చేసిరి మరియు  ప్రారంభముననే ప్రబోధనాత్మకమగు చక్కని రచనతో పాఠకులకు పఠనాసక్తిని పెంచగలిగిన వీరి ప్రయత్నము అభినందనీయము.

వీరు రచించిన బంద్శమే అందం నాకు బాగా నచ్చింది. అద్భుతమైనప్రబోధ మనకు చేస్తుంది ఈ వ్యాసం.

వీరి వ్యాసములు పరికిస్తే వీరికి గల సామాజిక స్పృహ ప్రతీ విషయంలోనూ కనిపిస్తుంది. 

"ఏకేనైవతు చక్రేణ న రథస్య గతిర్భవేత్" అనునదే ఒకచక్రంతో రథం నడవదు అనే శీర్షికతో మానవ సంబాధాలు ఎంత అవసరమో వివరించారు.

అన్యాయార్జితం వ్యాసంలో 

అన్యాయార్జితం విత్తం దశవర్షాణి తిష్ఠతి అనేశ్లోకం ఉదహరించారు. అన్యాయార్జిత ధనము పదేండ్లు మాత్రమే ఉండి ఆ తరువాత ఉన్న ధనం మొత్తం ఊడ్చుకుపోతుందని భావం ఇది చదివిన పాఠకులలో కొందరికైనా కనువిప్పు కలిగి అన్యాయార్జితానికి పాలుపడకపోవచ్చును.

ఈ విధముగా శ్రీ పార్థసారధిగారు ఈ వ్యాస సంపుటములో స్పృశించని అంశము లేదన్నను అతిశయోక్తి కానేరదు. 

నాకు నేను వీరి వ్యాసములనుండి శ్లోకములను గ్రహించి మేలిమిబంగారం మన సంస్కృతి అనే నా గ్రంథంలో పద్యాలుగా అనువదించవలెననెడి భావనతో ఉన్నాను.

ఇటువంటివారు ఆటవిడుపుగా తమ జీవితానుభవాలను వ్యాసాల రూపంలో వ్రాయుటతో సరిపెట్టుకొనక సంకలనంగా గ్రంధస్థం చేయుట సమాజమునకు ఎంతయో ప్రయోజనకరమనుటలో సందేహము లేదు.

బ్రహ్మశ్రీ అంబాళం పార్థసారధిగారికి నా అభినందనలు తెలియఁజేయుచు, వీరి కలం నుండి మరెన్నో రచనలు వెలువడి సమాజపరం కావలని కోరుకొంటున్నాను.

మ.  వరభావాన్విత పార్థసారధిల నంబాలాన్వయోద్భాసు ల

క్షరతూణీరమునన్ బ్రశస్త విషయాస్త్రజ్యోతులన్ నింపి, సు

స్థిర సత్ప్రేరణ గొల్పుటబ్బురమహో! జిజ్ఞాసతో పాఠకుల్

పరమార్థంబునిహంబుఁ గాంచుటకునై,  వర్ధిల్లుఁడీ! సారధీ!

జైహింద్.

చింతా రామకృష్ణారావు.

తే. 01 12 - 2025..

జైహింద్.




Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.