గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జూన్ 2016, బుధవారం

శ్రీశైల ఇష్ట కామేశ్వరి మహిమలు . . . శ్రీ వేణు.

 జైశ్రీరామ్.

ఆగమశాస్త్ర ప్రకారం కొన్ని దేవతామూర్తులకు పూజలు చేయరు.
అలా ఆగమంలో లేని అమ్మవారు ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైల క్షేత్రం.
పార్వతీ దేవి-అమ్మవారికి కామేశ్వరి అని పేరు ఉంది.
పరమశివుడు ఎలా ఉంటాడో అమ్మవారు అలాగే ఉంటుంది రూపంలో.
అలా ఉండే పార్వతీ పరమేశ్వరులలో ఉన్నటువంటి అమ్మవారి తత్త్వానికి కామేశ్వరి అని పేరు.
కానీ భారతదేశం మొత్తం మీద ఇష్ట కామేశ్వరి అన్న మాట లేదు. ఆ మాటతో మూర్తి లేదు. ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది.
ఆవిడను దర్శనం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఏ కారు వెళ్ళదు. శ్రీశైల క్షేత్రంలో వున్న కొన్ని జీపులు మాత్రం వెళ్తాయి. అది కూడా గుండె దిటవు వున్నవాళ్ళు అయితేనే వెళ్ళగలరు. ఎందుకంటే రోడ్డు చాలా అధ్వాన్నంగా ఉంటుంది.. అంతా డొంకరోడ్డు(అసలు దానిని రోడ్డు అనేదానికి వీలులేదు) ఆలయం దట్టమైన అడవి మధ్యలో ఉంటుంది.. ఆ ఆలయం ఈరోజు శిథిలమై పోయి చిన్న గుహ ఉన్నట్లుగా ఉంటుంది.
అందులోకి వెళ్ళి అమ్మవారిని చూస్తే చతుర్భుజి.
అమ్మ నాలుగు చేతులతో ఉంటుంది.
రెండు చేతులతో లక్ష్మీ దేవి ఎలా తామరమొగ్గలు పట్టుకుంటుందో అలా తామర మొగ్గలు పట్టుకొని ఉంటుంది.
ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకొని యోగినీ స్వరూపంలో ఉంటుంది.
సాధారణంగా కామేశ్వరీ తంత్రంలో అమ్మవారి స్వరూపం ఎలా చెప్తామో అలా లేదు కదా ఇక్కడ!
కామేశ్వరి ఎనిమిది చేతులతో ఉంటుంది.
ఈవిడ అలా లేదు కదా! మరెందుకు వచ్చిందీవిడ....?
అంటే ఒకానొకప్పుడు శ్రీశైలంలో ఒక రహస్యం ఉండేది.
ఎంత గొప్ప కోర్కె తీరాలన్న వాళ్ళైనా సరే తపస్సు భంగం అయిపోతోంది అనుకున్న వాళ్ళు కూడా ఎందుకంటే శ్రీశైలం ఒక్కదానికే ఒక లక్షణం ఉంది. ఉత్తరభారతదేశంలో ఉజ్జయినికి ఉంది. కాశీ పట్టణానికి ఉంది. దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒక్కటే. ఎందుకంటేఅక్కడ లేనటువంటి ఆరాధనా విధానం లేదు. అక్కడ కాపాలికుల దగ్గరనుంచి. ఇప్పటికీ శ్రీశైలం లోపల ఉన్న గుహలలోకి ధైర్యంగా వెళ్ళి దర్శనాలు చేయగలిగితే కాపాలికులు ఇక్కడ పూజలు చేసేవారనడానికి ప్రబల సాక్ష్యాలు దొరుకుతాయి. కాపాలికులు నరబలి కూడా ఇస్తారు. అటువంటి కాపాలిక స్పర్శ కూడా క్షేత్రనికి ఉంది. అంతే కాదు. అక్కడ స్పర్శవేది చేత ఒకప్పుడు సిద్ధ నాగార్జునుడు శ్రీశైలం కొండనంతటినీ కూడా బంగారం కొండగా మార్చే ప్రయత్నం చేశాడు. ఆయనే మూలికల మూట తెచ్చి త్రిఫల వృక్షం క్రింద పెట్టాడు. అటువంటి గొప్పగొప్ప ఓషధులన్నీ శ్రీశైల పర్వతం మీద ఉన్నాయి. అటువంటి శ్రీశైలంలో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ఆ తల్లి తీర్చని కోర్కె అన్నది లేదు. నీకు ఏది ఇష్టమో అది ఇస్తుంది. అందుకు ఇష్ట కామేశ్వరి. భారతదేశం మొత్తం మీద ఇక ఆ రూపం లేదు. ఒక్కశ్రీశైలంలోనే ఉంది.
ఇంకొక పెద్ద రహస్యం ఏమిటంటే పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు వెళ్ళి అమ్మవారికి బొట్టు పెడితే మెత్తగా మనిషి నుదురు ఎలా తగులుతుందో అలా తగులుతుంది ఆవిడ నుదురు. విగ్రహమా? మానవకాంతా? అనిపిస్తుంది. ప్రక్కనే శివాలయం ఉండేది. కానీ గుప్తనిధుల ఆశలో ధూర్తులు శివలింగాన్ని కూడా పెళ్ళగించేశారు. ఆ ప్రదేశంలో ఇప్పటికీ పెద్ద గొయ్యి ఉంటుంది. అక్కడ ఉండేదంతా చెంచులే. అక్కడికి వెళ్ళి కాసేపు కళ్ళుమూసుకొని కూర్చుంటే సెలయేళ్ళ ప్రవాహం చేత ధ్యానమునకు అత్యంత యోగ్యమైనదిగా ఉంటుంది. కాపాలికుల దగ్గరినుంచి సాక్షాత్తు శ్రీ శంకరుల వరకు ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో శైవంలో అన్ని సంప్రదాయాలు శ్రీశైలానికి చేరి శ్రీశైల మల్లికార్జునుడిని పూజించినవే...
వెళ్ళాలనుకునే వారు సూర్యోదయమయిన తర్వాత జీపులు మాట్లాడుకుని వెళ్తే మంచిది.. స్వంత వాహనాలున్నా సరే .. స్వంత వాహనాలలో వెళ్ళే ధైర్యం అస్సలు చేయకండి..
అందరికీ ఇష్టకామేశ్వరీ మాత దర్శన ప్రాప్తిరస్తుః.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఇష్ట కామేశ్వరీ మాతను గురించి చాలా ఆశక్తికరంగా వివరించారు కానీ ధైర్యంగా వెళ్ళగలిగిన వారికే దర్శనభాగ్యం లభిస్తుందంటే,కొందరే అదృష్ట వంతులు .బాగుంది మంచి విషయాన్ని తెలిపినందులకు కృతజ్ఞతలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.