గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, జూన్ 2016, మంగళవారం

షోడశ కర్మలు . . . వివరణ.

జైశ్రీరామ్.
షోడశ కర్మలు హిందూ సాంప్రదాయములో ఆగమ సంబంధమయిన క్రియలు. ఇవి ప్రతి హిందువు యొక్క జీవిత పర్యంతమూ వివిధ దశలలో జరుపబడతాయి. స్త్రీ, పురుష సమాగమము మొదలుకొని, జననము, మరణము మరియు తదనంతరము ఆత్మ పరలోక శాంతి నొందుట వరకు సంస్కారములు జరపబడును.
కర్మలు మొత్తము పదహారు. వీనినే షోడశ సంస్కారములు అని కూడా వ్యవహరించెదరు.
వ్యక్తి జీవితంలోని వివిధ దశల్లో జరిపే సంస్కారాలు:
ఈ పదహారు సంస్కారములను తిరిగి రెండు విభాగముల క్రింద విభజించారు.
జనన పూర్వ సంస్కారములు (పుట్టుకకు ముందు),
1 గర్భాదానం
2 పుంసవనం
3 సీమంతం
జననానంతర సంస్కారములు (పుట్టిన తరువాత).
4 జాతకర్మ
5 నామకరణం
6 నిష్క్రమణ
7 అన్నప్రాశన
8 చూడాకరణ
9 కర్ణవేధ
10 అక్షరాభ్యాసం
11 ఉపనయనం
12 వేదారంభం
13 కేశాంత
14 సమావర్తన
15 వివాహం
16 అంత్యేష్టి
వివరణ
౧. గర్భాదానం.
ఇది సత్సంతానమును ఆశించి జరిపే దంపతులైన స్త్రీ పురుష తొలి సమాగమ కార్యక్రమము . ఈ సందర్భములో చదివే మంత్రములు ఆ దేవుని సత్సంతానాన్ని (పురుష) కోరుకుంటున్నట్లుగా తెలియజేస్తాయి.
౨. పుంసవనం.
స్త్రీ గర్భం ధరించినట్లు రూఢి అయిన తర్వాత ఆమెకు కొడుకు పుట్టాలని,
చంద్రుడు పురుషరాశిలో ఉన్నప్పుడు జరిపే సంస్కారం.
గర్భిణీ స్త్రీ ఆ రోజంతా ఉపవాసముండును.
ఆ రాత్రికి మొలకెత్తిన మర్రి విత్తనాలను నూరి ఆ రసాన్ని "హిరణ్యగర్భ:..." అని మంత్రాలు చదువుతూ ఆమె కుడి ముక్కులో వేయుదురు.
చంద్రుడు పురుష రాశిలో ఉన్నప్పుడు ఈ విధముగ చేయుట ద్వారా దృఢకాయుడు, ఆరోగ్యవంతుడైన కుమారుఁడు పుట్టునని నమ్మకము.
ఇది మరియు సీమంతోన్నయనం గర్భాన్ని రక్షించుకొనుటకు చేసే సంస్కారములు.
కావున ఈ రెండు గర్భము ధరించియున్న కాలమునందే చేయవలెను.
పుంసవనము గర్భము ధరించిన మూడవ మాసములో మొదటి పదిరోజులలో చేయుదురు.
ఈ కార్యక్రమములో మఱ్ఱిపండ్లను మినుములతో, యవలతో కలిపి గర్భిణికి వాసన చూపించెడి వ్యవస్థ యున్నది. దీనివలన జననేంద్రియ దోషములు తొలగి గర్భరక్షణ శక్తి కలుగునని సుశ్రుతము మొదలగు ఆయుర్వేద శాస్త్రములందు చెప్పబడియున్నది.
మోక్షమునకు ఉపయోగపడు ఉత్తమ స్థూల శరీరమును పొందు లక్ష్యముతో ఈ పుంసవన సంస్కారము నిర్ణయించబడినది.
౩. సీమంతం.
తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేయునది. కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదుగుటకు తల్లి శారీరక, మానసిక ఉల్లాసము ఎంతో అవసరము.
అందుకొఱకు ఆమె, ఆమె భర్త పాటించవలసిన నియమములు ఈ సంస్కారములో భాగముగా ఉన్నవి.
వాటిలో ఒకటి దోహదము అనగా గర్భిణీ స్త్రీ  కోరిక ఏమిటో తెలుసుకుని ఆమె భర్త తీర్చుట.. సీమంతం అంటే పాపిడి తీయడమని అర్థం. అంటే ఆ సమయంలో భర్త ఆమెను అంత అపురూపముగా చూచుకొనవలెనని అర్థము.
౪. జాతకర్మ.
బొడ్డుతాడు కోసే ముందు చేసే సంస్కారాలు. దీనిలో భాగముగా జరిపెడి తంతులు చాలా ఉన్నవి:
మేథాజనన: బలానికి, తెలివితేటలకు ప్రతీకలైన నెయ్యి, తేనెలను ఒక సన్నని బంగారు దారంతో శిశువు నోటికందింతురు. దీనిని పిల్లల పట్ల తాము నెరవేర్చవలసిన మొట్టమొదటి బాధ్యతగా వారు భావింతురు. హిందువులు పిల్లల తెలివితేటలకు ఎంత ప్రాధాన్యతనిచ్చెదరో దీని ద్వారా మనకు తెలియుచున్నది.
దీర్ఘాయుష్షును కలిగించే ఋషులు, పితృదేవతలు, అగ్ని, సోములను ఆవాహన చేసెడి మంత్రములను శిశువుముందు చదువుదురు.
శక్తి: . తండ్రి బిడ్డ చెవిలో "త్వం...శతమానం భవతి:" అని ఆ శిశువుకు చెప్పును. అప్పుడు బొడ్డుత్రాడు కోసి, శిశువును శుభ్రము చేసి, చనుబాలు పట్టింతురు.
౫. నామకరణం.
నామకరణం అనగా పేరు పెట్టుట. ఆడ, మగ పిల్లలకు పెట్టవలసిన పేర్లకు సంబంధించిన నియమములను గృహ్య సూత్రములు పేర్కొన్నవి. పరాశర గృహ్యసూత్రముల ప్రకారము పేరు రెండు లేక నాలుగు అక్షరాల పొడవుండి హ్రస్వ అచ్చుతో కూడిన హల్లుతో మొదలై చివర దీర్ఘము కాని విసర్గము కాని ఉండవలెను. వేర్వేరు గృహ్యసూత్రములలో ఈ నియములు వేర్వేరుగా ఉన్నవి.
ఆడపిల్ల పేరు బేసి అక్షరాలుండి పేరు చివర అ ఉండవలెను.
పేరు పెట్టుటకు నాలుగు పద్ధతులున్నవి:
మొదటిది జన్మనక్షత్రమును బట్టి;
రెండవది పుట్టిన మాస/రాశ్యధిపతిని బట్టి;
మూడవది ఇలవేలుపును బట్టి;
నాలుగవది అందరూ పిలిచే పేరును బట్టి.
చివరి పద్ధతి కుటుంబ సంప్రదాయమును బట్టి, విద్యాస్థాయిని బట్టి ఉండును. ఐతే లేకలేక కలిగిన సంతానమునకు, కుటుంబములో చాలామంది పిల్లలు చనిపోయాక పుట్టినవారికి దుష్టశక్తుల్ని దూరంగా ఉంచుట కొఱకు విడ్డూరముగా ఉండు పేర్లను పెట్టుదురు.
౬. నిష్క్రమణ.
బిడ్డను మొదటిసారిగా ఇంటినుంచి బయటికి తీసుకువచ్చుట. అప్పటి వరకూ ఇంటనే పెరిగిన బిడ్డ మొదటిసారిగా బయటి ప్రపంచములో అడుగుపెట్టుచున్నప్పుడు ఆ బిడ్డను బలమైన ప్రకృతిశక్తులనుంచి, అతీత శక్తుల బారి నుంచి కాపాడడుటకు చాలా జాగ్రత్తలు (అధిభౌతికమైనవి, ఆధ్యాత్మికమైనవి) తీసుకొనవలెను. అందుకే ఈ సంస్కారం చాలా ముఖ్యమైనదిగా భావింతురు.
౭. అన్నప్రాశన.
మొదటిసారిగా ఘనాహారం తినిపించుట (సాధారణంగా ఆరో నెలలో) అన్నప్రాసన.
పెరుగుతున్న బిడ్డ భౌతికావసరములను తీర్చుటకు అవసరమైన అతి ముఖ్యమైన ప్రక్రియ.
సుశ్రుతుడు కూడా ఆరవనెలలో బిడ్డ చేత తల్లిపాలు మానిపించి ఘనాహారం ఇవ్వ వలెనని పేర్కొనెను. ఇందుల కవసరమైన ఆహారమును కూడా వేదమంత్రోచ్చాటనల మధ్య పరిశుభ్రమైన పాత్రల్లో వండుదురు. ఒక్కొక రకమైన గుణమును పెంపొందించుటకు ఒక్కొక  రకమైన ఆహారమును అందించుట జరుగును. ఈ సంస్కారము జరుపుట వలన వయసుకు తగిన ఆహారము అందుటయే గాక ఆహారము పట్ల పవిత్రభావన ఏర్పడును.
౮. చూడాకరణ.
పుట్టువెండ్రుకలు తీయించడం. దీర్ఘాయుష్షును, అందాన్ని కోరుతూ చేసే సంస్కారం. సుశ్రుతుడు, చరకుడు కూడా గుండు వల్ల దీర్ఘాయుష్షు, అందం చేకూరుతాయని పేర్కొన్నారు. తలనీలాలు దేవునికి లేదా దేవతకు అర్పించడం గురించి గృహ్యసూత్రాల్లో గానీ, స్మృతుల్లో గానీ లేనేలేదు! పూర్వకాలంలో కూడా కొన్ని సార్లు దేవాలయాల్లో తలనీలాలు అర్పించడం ఉన్నప్పటికీ అది కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే జరిగేది (లేకలేక కలిగిన పిల్లలు లేదా ఒకరిద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత పుట్టిన పిల్లలకు). గృహ్యసూత్రాల ప్రకారం ఈ సంస్కారం మొదటి సంవత్సరం చివర్లో గానీ, మూడొ ఏటగానీ చెయ్యాలి. తర్వాతి కాలాలోని సూత్రకర్తలు ఈ వయసును ఏడేళ్ళవరకు పొడిగించారు
౯. కర్ణవేధ.
చెవులు కుట్టించడం. ఐదేళ్ళలోపు చేయవలసిన సంస్కారం. కర్ణాభరణాలు ధరించడం మొదట్లో అందం కోసమే మొదలైనా తర్వాత ఆరోగ్యదృష్ట్యా దానికున్న ప్రాధాన్యతను బట్టి దానిని సంస్కారాల్లో చేర్చి ఉండవచ్చు. చెవులు కుట్టడానికి వాడే సూది:
క్షత్రియులకు బంగారంతో,
బ్రాహ్మణ, వైశ్యులకు వెండితో,
దేవలుడనే స్మృతికర్త "చెవిరంధ్రాలగుండా సూర్యకిరణాలు ప్రసరించని బ్రాహ్మణుడిని చూడడం వల్ల అప్పటివరకు చేసుకున్న పుణ్యమంతా పోతుంది." అని పేర్కొన్నాడు.
౧౦. అక్షరాభ్యాసం.
బిడ్డ మనసు తగినంతగా పరిపక్వత చెంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మొదటగా చేయవలసినది అక్షరాలు నేర్చుకోవడం. ఈ సంస్కారాన్నే అక్షరారంభమనీ, అక్షరలేఖనమనీ, విద్యారంభమనీ అంటారు. సాధారణంగా ఈ సంస్కారాన్ని ఐదో ఏట చేస్తారు. విశ్వామిత్రుడు దీన్ని ఏడొ ఏటివరకు పొడిగించాడు. కానీ కొందరు స్మృతికర్తలు చూడాకరణ ఐన వెంటనే చేయాలని నిర్దేశించారు.్
౧౧. ఉపనయనం.
అక్షరాభ్యాసం లాంఛనంగా అక్షరాలు దిద్దించడమైతే వాస్తవంగా పిల్లలను విద్యార్జన కోసం గురువు దగ్గరకు పంపే ముందు జరిపే సంస్కారం ఉపనయనం. సాంస్కృతికంగా ఇది అతి ముఖ్యమైన సంస్కారం. అక్షరాభ్యాసంతో ప్రాథమిక విద్య మొదలైతే ఉన్నతవిద్య ఉపనయనంతోనే మొదలవుతుందనుకోవచ్చు. ఉపనయనం జరగడాన్ని సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా రెండవ పుట్టుకగా భావిస్తారు. భౌతిక జననం రోత కలిగించేది. ఉదాత్తమైనది కాదు. క్రమశిక్షణ, విద్యార్జనల ద్వారా పొందే రెందవజన్మ పవిత్రమైనది, ఉదాత్తమైనది.
ఐతే ఉపనయన ఉద్దేశాలు, అర్థాలు కాలంతోబాటే మారుతూ వచ్చాయి. అథర్వణ వేదంలో ఉపనయనాన్ని గురువు విద్యార్థి యొక్క బాధ్యతలు తీసుకోవడం అనే అర్థంలో వాడితే తర్వాతికాలంలో గురువు పవిత్ర మంత్రోపదేశం చేయడమే ఉపనయనంగా భావించడం జరిగింది. హిందూ మతంలో అతిపవిత్రము, శక్తివంతమైన మంత్రంగా భావించబడే గాయత్రి మంత్రాన్ని ఉపనయనమప్పుడు ఉపదేశిస్తారు. అంతేగాక ఉపనయనం ఉన్నతవిద్యకు ఆరంభంగా గాక మతపరమైన తంతు ద్వారా పొందే రెండవ పుట్టుకగానే గుర్తింపు పొందింది. తగిన వయస్సు:
బ్రాహ్మణుడికి ఎనిమిది సంవత్సరాలు;
క్షత్రియుడికి పదకొండు సంవత్సరాలు;
వైశ్యుడికి పన్నెండు సంవత్సరాలు;
గరిష్ఠ వయోపరిమితి:
బ్రాహ్మణుడికి పదహారు సంవత్సరాలు;
క్షత్రియుడికి ఇరవైరెండు సంవత్సరాలు;
వైశ్యుడికి ఇరవైనాలుగు సంవత్సరాలు;
కాలం గడిచే కొద్దీ యజ్ఞోపవీతం ధరించడమే ఈ సంస్కారంలో అతిప్రధానభాగంగా మారింది. ఉపనయనం చేయించుకునేవారు సూర్యునివైపు చూస్తూ ఉండగా వారికి దీర్ఘాయుష్షు, పవిత్రత, బలం, తేజస్సు కలగాలని కోరుతూ గురువు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. ద్విజులు ఎల్లవేళలా ధరించే యజ్ఞోపవీతం వారికి తమ సామాజిక-ఆధ్యాత్మిక బాధ్యతలను సదా గుర్తుచేస్తూ వారి జీవితం నిరంతరం యజ్ఞజ్వాలలంత పవిత్రంగా సాగడానికి తోడ్పడుతుంది. ఒక యోగి వలె క్రమశిక్షణతో జీవితం గడపడానికి విద్యార్థికి అజినం(జింక చర్మం), దండం కూడా ఉపనయనమప్పుడు ఇస్తారు
౧౨. వేదారంభం.
అతిపురాతన ధర్మశాస్త్రాల్లో వేదారంభం గానీ, దీని తర్వాతిదైన కేశాంతం గానీ కనిపించవు. మొదట్లో ఉపనయనంతోనే వేదవిద్యారంభం చేసేవారు. కానీ తర్వాతికాలంలో వేదవిద్యతో బాటే ఇతర సామాజిక, వైజ్ఞానిక శాస్త్రాలు అభివృద్ధి చెందాక వేదవిద్యారంభానికి విడిగా మరో సంస్కారం అవసరమైంది. ప్రతి విద్యార్థి తన వంశం వారు నైపుణ్యం సాధించిన వేదాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. అందుకే ఈ సంస్కారం ఒక్కో వర్గానికి చెందిన విద్యార్థులకు ఒక్కో రకంగా ఉంటుంది:
రెండు వేదాలను అధ్యయనం చేసినవారు ద్వివేది,
మూడు వేదాలను అధ్యయనం చేసినవారు త్రివేది,
నాలుగు వేదాలను అధ్యయనం చేసినవారు చతుర్వేది.
౧౩. కేశాంత.
పదహారేళ్ళ వయసొచ్చాక మొట్టమొదటిసారి గడ్డం గీసుకోవడానికి(గీయించుకోవడానికి) సంబంధించినది ఈ సంస్కారం. యౌవనారంభదశలోని చాపల్యాలకు లొంగకుండా మరింత జాగరూకులై మెలగవలసిన అవసరాన్ని, బ్రహ్మచర్యం యొక్క ప్రాధాన్యతను ఈ సంస్కారం గుర్తుచేస్తుంది. ఈ సంస్కారానికి సంబంధించిన తంతు దాదాపు చూడాకరణ ను పోలి ఉంటుంది. ఈ సంస్కారం జరిపేటప్పుడు చివర్లో విద్యార్థి తన గురువుకు ఒక ఆవును దానంగా ఇస్తాడు. అందుకే కేశాంతాన్ని గోదానమని కూడా అంటారు.
౧౪. సమావర్తన.
చదువు ముగించుకుని విద్యార్థి గురుకులాన్ని వదిలి వచ్చేటప్పుడు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. దీన్నే స్నాతకమని కూడా అంటారు. విద్యార్థి తాను అప్పటివరకు పాటించిన బ్రహ్మచర్యాశ్రమం యొక్క గొప్పదనాన్ని గుర్తిస్తూ, యజ్ఞయాగాదులను ముగించేటప్పుడు చేసే అవభృతస్నానం చేస్తాడు. క్రమశిక్షణతో మెలగి విద్యార్జనలో ఉత్తీర్ణుడైన విద్యార్థిని విద్యాసాగరాన్ని ఈదిన స్నాతకుడు లేక నిష్ణాతుడుగా గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా విశ్వవిద్యాలయాలు ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టా ప్రదానం చేయడాన్ని స్నాతకోత్సవమనే అంటారు.
సమావర్తనతో చదువు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగిరావడం విద్యార్థి జీవితంలో అతి కీలకమైన ఘట్టం. స్నాతకుడు పెళ్ళి చేసుకుని గృహస్థ జీవితం గడపడానికైనా, తాను గడించిన వైదిక విజ్ఞానంతో భౌతిక మానసిక బంధాలకు దూరంగా జీవితం గడపడానికైనా సిద్ధంగా ఉంటాడు. మొదటిమార్గం పాటించేవాళ్ళను ఉపకుర్వనులని, రెండవ వర్గం వారిని నైష్ఠికులని అంటారు. ఏ మార్గం పాటించడానికైనా గురువు అనుమతి తప్పనిసరి. అప్పటివరకు విద్యార్థి దశలో గురువుతోనే ఉన్నా ఆయనకు రుసుమేమీ చెల్లించకుండానే ఆయన్ని సేవించుకుంటూ విద్యను పొందిన విద్యార్థి ఇంటికి తిరిగొచ్చేటప్పుడు మాత్రం తన స్థోమతుకు తగినట్లు గురుదక్షిణ సమర్పించుకుంటాడు. గురుదక్షిణగా ఏమీ ఇవ్వలేకపోయినా గురువు అనుమతి మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి
౧౫. వివాహం.
హిందూ సంస్కారాల్లో కేంద్రస్థానం వివాహానిది. వధువుకు తగిన వరుణ్ణి, వరుడికి తగిన వధువును ఎంపిక చేయడం వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టం. హిందూ సమాజంలో వధూవరులుగా ఒకే వర్ణానికి (సవర్ణ), భిన్న గోత్రాలకు, భిన్నపిండాలకు చెందినవారిని ఎంచుకోవడమనే ఆనవాయితీ కొనసాగుతోంది. సపిండకుల(రక్తసంబంధీకుల) మధ్య వివాహాలను అన్నికాలాల్లో నైతికంగానూ, శాస్త్రపరంగానూ పూర్తిగా నిషేధించడం జరిగింది.
వివాహంలో ముఖ్యమైన ఘట్టాలు:
వాగ్ధానం: పెళ్ళి ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం)
వర-వరణం: వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం
కన్యాదానం: కన్య తండ్రి లేక తండ్రి స్థానంలో ఉండి ఆమె బాగోగులు చూసేవారు కన్యను వరుడికి అప్పజెప్పడం
వివాహ-హోమం: పెళ్ళిలో చేసే హోమం
పాణిగ్రహణం: వధూవరులు ఒకరి చేతినొకరు పట్టుకోవడం
హృదయస్పర్శ:హృదయాన్ని తాకడం
సప్తపది: సౌభాగ్యానికి, దాంపత్య సాఫల్యానికి గుర్తుగా కలిసి నడిచే ఏడడుగులు
అశ్మారోహణ: సన్నికల్లు తొక్కడం
సూర్యావలోకనం: జరుగుతున్న పెళ్ళికి సాక్ష్యంగా నిలిచిన సూర్యుణ్ణి చూడడం
ధృవదర్శనం: స్థిరత్వానికి సూచిక ఐన ధృవనక్షత్రాన్ని చూడడం
త్రిరాత్ర-వ్రతం: మూడురాత్రులు విడిగా ఉండడం
చతుర్ధి-కర్మ: లాంఛనంగా వధూవరులు కలిసే నాలుగోనాటిరాత్రి జరిపే సంబరం
హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధానకర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది.
౧౬ అంత్యేష్టి.
హిందువుల జీవితంలోని చివరి సంస్కారం అంత్యేష్టి. ఒక హిందువు తన జీవితాన్ని వివిధ దశల్లో వివిధ సంస్కారాల ద్వార పవిత్రం చేసుకున్న తర్వాత మరణానంతరం అతడి వారసులు అతడి ఆత్మకు శాంతి, సద్గతులు కలగాలని కోరుతూ చేసేవి అంతిమ సంస్కారాలు లేక అంత్యేష్టి.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
షోడశ సంస్కారములను గురించి చక్కగా వివరించారు
ధన్య వాదములు

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.